"నెమరేసిన మెమరీస్" - ముళ్ళపూడి శ్రీదేవి


సాధారణంగా గొప్ప వారి ఆత్మకథలు స్ఫూర్తి నిస్తాయనీ, తెలియని కబుర్లేవో చెబుతాయని ఆ పుస్తకాలు కొంటూంటాం. కొన్నిసార్లు వాళ్ళ కథలు చదివాకే గొప్పతనాన్ని అర్థం చేసుకుంటాం, లేదా మునుపటి కంటే ఎక్కువగా ఇష్టపడతాం. ఉదాహరణకు ఆచంట జానకీరాం గారి "స్మృతి పథం" పుస్తకం తీసుకుంటే, ఆయనెవరో ఏమిటో నాకు మునుపు తెలియదు. అయితేనేం, ఆ పుస్తకమంతా ఆవరించి ఉన్న ఒకానొక సౌందర్య స్పృహ, ఆయన్ను పుస్తకం ముగించే వేళకి ఆప్తుణ్ణి చేసింది. తన కవిత్వంలో ఆయన పలికించిన ఉద్వేగాలూ, జీవితమంతా కవులతోనూ, కళాకారులతోనూ గడుపుతూ ఆ క్షణాలను గురించి పారవశ్యంతో చెప్పుకుపోయిన తీరు, నన్నూ ఆ కాలానికి తీసుకువెళ్ళాయి. అలాగే, దువ్వూరి వారు. ఆయన కథ చదువుతున్నా అలాగే విస్మయం. మనది కాని ఓ కాలంలోకి వీరంతా వేలు పట్టుకు భద్రంగా నడిపించుకు వెళతారు. మనవి కాని అనుభవాలు కొన్నింటిని మనసులో ముద్ర వేసి పోతారు. ఇటువంటివి కాక, సత్యసోధనో, ఓ విజేత ఆత్మకథో చదివినప్పుడు మనం పొందే స్ఫూర్తి వేరు. మన మనసు ఆలోచించే పద్ధతి వేరు. 

ఈ పుస్తకాలు సాధారణంగా బాగా పేరొందిన వారివే అయి ఉండటం చూస్తూంటాం. అలా కాకుండా, ఎవరో ఓ ఆరుగొలనులో పుట్టి పెరిగిన అమ్మాయి, జీవితం మూడొంతులు అనుభవించేశాక, "నేనొక కథ చెబుతానూ, నా కథ. నా వాళ్ళ కథ" అంటే వింటామా? అనుమానమే. అయితే, ఆవిడ ముళ్ళపూడి సతీమణి అని తెలిస్తే, కాస్త ఆసక్తి కలుగుతుందేమో. కృష్ణశాస్త్రి గారబ్బాయి "నాన్నా-నేనూ" అంటే, ఆ భావకవి జీవితాన్ని ఇంత దగ్గరగా చూసిన మనిషి ఏం చెప్పబోతున్నాడోనన్న కుతూహలంతో సర్దుక్కూర్చున్నాము కదా! అలా అనమాట.

ముళ్ళపూడి పేరూ, కవరు మీద బాపు బొమ్మా, నేనీ పుస్తకం కొనడానికి కారణం కాదని చెప్పను కానీ, నిజంగా - ఈ పుస్తకం చదివాక నేను శ్రీదేవి గారిని గుర్తు చేసుకుంటోంది మాత్రం ఆ రెండు పేర్ల ఊతంతో కాదు.

అలా తీరికగా కూర్చుని రాద్దామంటే, నిజానికి ఈ పుస్తకంలో ప్రత్యేకంగా చర్చకు పెట్టాల్సినవి లేవు, మళ్ళీ మళ్ళీ చెప్పుకొనవలసిన ముఖ్యమైన విషయాలూ లేవు. చేయి తిరిగిన రచయిత వ్రాసినవి కాదు కనుక, కోట్ చేసి దాచుకోవలసినవో, పది మందితో పంచుకోవలసినవో అయిన వాక్యాలూ లేవు. అయినా ఈ పుస్తకం ప్రత్యేకమైనదే. 

ఎందుకూ అంటే...

నా చిన్నప్పుడు బెజవాడలో, మా పక్కవీథిలోనే కొన్నాళ్ళు మా నాన్నగారి అక్కయ్య ఉండేది. లీలత్తయ్య. సాత్విక గుణానికి నిలువెత్తు రూపంలా ఉండేది. ఏ కాస్త పరుషమైన మాట విన్నా, ఎవ్వరి కే కష్టమొచ్చిందని తెలిసినా, "..చ్చొచ్చొచ్చొ.." అంటూ నిజాయితీగా దిగులుపడిపోయేది.అమ్మ స్పాట్‌వేల్యుఏషన్‌కి వెళ్ళి బందరు నుండి ఆలస్యంగా వస్తుందంటేనో, ఏ ఆదివారం మధ్యాహ్నమో ఏమైనా తెమ్మనో- ఇమ్మనో, నన్ను వాళ్ళింటికి పంపుతూ ఉండేవారు. నేను వెళ్ళగానే ఆవిడ ఓ పీట వేసి నన్ను వంటింట్లో పక్కగా కూర్చోబెట్టుకుని, కమ్మటి రుచి వచ్చేదాకా వేరుశనగ పప్పులు వేయించి, చిన్న బెల్లం ముక్క కూడా ఇచ్చి, కబుర్లాడుతూ ఉండేది. ఏవో కబుర్లు...మిగిలినవాళ్ళెవ్వరూ చెప్పనివి. వేసవిలో అవనిగడ్డ వెళితే, రాజ్యమత్తయ్య ఏం చేస్తుందో, దాన్ని ఆనుకుని ఉన్న మా తాతగారి ఇల్లు ఇప్పుడెలా ఉందో కళ్ళకు కట్టినట్టు చెప్పేది. కిష్టలో ఆటల్లో వాళ్ళు మింగేసిన నీళ్ళ రుచీ, వాళ్ళ తోటలో కొబ్బరి నీళ్ళ రుచీ, ఆవిడ చెప్తే రెట్టింపయిపోయేవి. వాళ్ళ వానాకాలం చదువులూ, కందితోటల్లో ఆటలూ, నా ఊహలకు రెక్కలిచ్చి నన్నూ ఓ అందమైన లోకానికి తీసుకుపోయేవి. మా నాన్నగారి చిన్నప్పటి ముచ్చట్లూ, ఏడుగురు సంతానంలో ఆఖరువాడిగా పుట్టినందుకు ఆయనకు దక్కిన గారం, నలుగురు అక్కల అరచేతుల్లో సాగిన ఆయన అల్లరీ అన్నీ కథలు కథలుగా చెబుతూండేది. నా చేత పాటలు పాడించుకునేది. తన పిల్లలు ఆడి దాచుకున్న వంటింటి బొమ్మ సామాను మొత్తం తాటాకు బుట్టలో ఈ మేనకోడలి ఆటల కోసం అభిమానంగా అట్టేపెట్టింది.  

ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ నాకు మా అత్తయ్యే గుర్తొచ్చింది. మనందరికీ జీవితంలో అటువంటి వ్యక్తులు తారసపడుతూనే ఉంటారు - వాళ్ళతో జరిగిన సంభాషణల్లోని మాటమాటా మనకు విడిగా, ప్రత్యేకంగా గుర్తుండకపోయినా, ఆ అనుభూతి మాత్రం మనసుపొరల్లో ఎక్కడో భద్రంగా నిలిచిపోతుంది.

అందుకే అలాంటి వాళ్ళు ప్రత్యేకం. ఇలాంటి పుస్తకాలూ ప్రత్యేకం.

నెమరేసిన మెమరీస్ అన్నారే కానీ, ఇదీ కోతికొమ్మచ్చే. జీవితం లెక్కల ప్రకారం సాగదు. మనసూ పద్ధతిగా ఆలోచించదు. కాబట్టి, ఒక డైరీ్‌లా రోజు తరువాతి రోజు గురించి యాంత్రికంగా చెప్పుకుపోయిన కబుర్లు కావివి. ఒక జ్ఞాపకం మరో జ్ఞాపకాన్ని గుర్తు చేస్తోంటే, ఆ కొసలను పట్టుకుని అనాయాసంగా కథ పొడిగించుకుంటూ వెళ్ళిపోతారీవిడ.

ఈ పుస్తకంలో కొన్ని అందమైన పొట్టి కథలున్నాయి. వాటిలో కొన్ని మనం చిన్నప్పుడే పెద్ద వాళ్ళ దగ్గర వినేసినవి. జానపద గేయాల్లా, ఎవరు వ్రాశారో తెలీకపోయినా, మనమంతా చిన్నప్పటి నుండే వింటూ ఉన్నవి. వాళ్ళ నాన్నగారు చెప్పిన నల్లపిల్ల-నల్ల పెదవులు, గయ్యాళి భార్య- కంది పచ్చడి, ధర్మరాజు దుర్యోధనుల మంచీ-చెడు, కర్ణుడు-అర్జునుల దాన గుణం, అనన్యాశ్చింతయంతోమాం అంటే ఏమిటో ఓ పసివాణ్ణి అడ్డుపెట్టుకుని సులువుగా విప్పి చెప్పిన కథ, వినాయకుడిని చకారకుక్షి అని వేళాకోళం చేసిన కాళిదాసు - ఎలా తిరిగి ఆయనను ప్రసన్నం చేసుకున్నాడు? ఒక్క చకారం లేకుండా ద్రౌపదికి పాండవులేమవుతారో చెప్పడం వీలయిందా?, హేవిళంబి నాటకం, పోలి స్వర్గం ఇలా ఎన్నో. ఇవి కాక, భజనలు, నండూరి అన్నయ్యలు వరస కట్టి పాడిన గీతాలు, 'బాల కృష్ణ ' సంస్థ ద్వారా వీళ్ళు వేసిన నాటకాలు - ఒకటా రెండా! అపురూపమైన బాల్యాన్ని సొంతం చేసుకున్నారని అసూయ పొందేటన్ని కబుర్లు చెప్పారీవిడ.

ఇన్ని కథలు చెప్పినా, ఎక్కడా పాఠకులకు విసుగనిపించదు. నిజానికి, 'మా నాన్నగారు చెప్పిన కథ', 'మా మోహనం అన్నయ్య వరస కట్టి పాడిన పాట' - అంటూ లీలగా తొణికిసలాడే అతిశయంతో ఆ కథలూ, పాటలు కూడా పూర్తిపాఠాలు వ్రాసుకుంటూ వెళ్ళిన కారణానికేమో, శ్రీదేవి గారు ఆయా చోట్ల మనకి చెంపన చేయి పెట్టుకు వినే పసి పిల్లలా కనిపిస్తారు. అటుపైన అరటి ఊచ వేలికి చుట్టుకు అత్తగారిని కంగారు పెట్టిన కొంటె కోడలిగానూ, తన పిల్లలనూ, మరిదిగారి పిల్లలనూ, బాపుగారి పిల్లలనూ కలుపుకు నాకు ఆరుగురు పిల్లలని సగర్వంగా చెప్పుకునే అమ్మగానూ, ఒక పాత్ర నుండి మరొక పాత్రలోకి జీవితం ఎంత సహజంగా తనను తీసుకువెళ్ళిందో, అంత సహజంగానూ ఆ పరిణామ క్రమాన్నంతా అక్షరాల్లోకి అనువదించుకున్నారు. సరిగ్గా ఆ కారణానికే, ఇది ఒకసారి మొదలుపెడితే చివరిదాకా చదివించే పుస్తకం అయింది. రకరకాల వయస్సుల్లో రచయితను బాపు బొమ్మల్లో ఊహించుకుంటూనే ఈ పుస్తకం తిరగేస్తామనడం అతిశయోక్తి కాదు. (నిజంగానే అంతటి లావణ్యమూ ఆవిడ సొత్తని, పుస్తకంలో జతపరచిన ఫొటోలన్నీ తీర్మానించాయి) 

శ్రీదేవి గారి రచనలో ఇంకో చమక్కు ఉంది. హాస్య సంఘటనలు చెప్పేప్పుడు, లేకి హాస్యం వ్రాసేవాళ్ళంతా రచయిత స్థానంలో ఉంటూనే వాళ్ళే పగలబడి నవ్వేస్తారు. మనమిక్కడ నవ్వాలని వాళ్ళే చెబుతారు. శ్రీదేవిగారలా కాదు. అతి మామూలుగా అన్ని సంగతులతోటే ఇదీనూ అన్నట్టు చెప్పేసినా, మనం ఫక్కున నవ్వేస్తాం. నవ్వకుండా చెబుతారంటే మళ్ళీ అదేమీ "నోటితో చెబుతూ నొసటితో వెక్కిరించే" తీరూ కాదు. అది ఒక ప్రత్యేకమైన శైలి, అంతే. "అత్తగారి కథ"ల శైలి గుర్తొస్తుంది అక్కడక్కడా. కానీ ఆ పాటి ఆరోగ్యకరమైన వ్యంగ్యం కూడా ఉండదు.  

గీత-రాత అన్న జంటపదాలకి తెలుగునాట బాపురమణలు పర్యాయపదాలుగా మారడం ఈనాటి సంగతి కాదు. ఈ కలికాలంలో ఇలాంటి స్నేహమెలా సాధ్యమని ఆశ్చర్యపోయేలా బ్రతికారిద్దరూ. వాళ్ళ సినిమాల్లో అణువణువునా కనపడే అభిరుచిని గమనించినా, అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి మారిపోతూండే మనిషి మనస్తత్వాన్ని బేరీజు వేసిన తీరును చూసినా, తెలీకుండానే వాళ్ళ మీద ఆసక్తి, అభిమానమూ కలుగుతాయి. ఈ అభిరుచి గురించీ, ఆ అందమైన మనసులకు అద్దం పట్టే సంఘటనల గురించీ, ఈ పుస్తకంలో ఎన్నో ఋజువులున్నా, నాకు మరీ మరీ నచ్చిన రెండు విషయాలు ఇవీ :

"ఆళ్వార్పేట ఇంట్లో ముందు గేటు పక్కన పెద్ద జామ చెట్టు ఉండేది. అక్కడ పెద్ద ఖాళీ స్థలం ఉండేది. అక్కడ మెత్తటి ఇసుక పోయించి, ఉయ్యాల, జారేబల్ల, సీ.సా అన్నీ ఏర్పాటు చేశారు రమణగారు. సాయంత్రం చల్లబడ్డాక అక్కడ పిల్లలు ఆడుకునేవారు. చుట్టుపక్కల పిల్లలు కూడా వచ్చేవారు.

ఆ జామచెట్టు కొమ్మల మధ్య అమ్మలు ఒక దిండో, లేకపోతే రజాయో వేసి చక్కగా పక్క అమర్చుకునేది. తినడానికి ఒక డబ్బాలో కారప్పూసో, చిప్సో తెచ్చుకునేది. ఒక మంచినీళ్ళ సీసా పట్టుకుని జామచెట్టెక్కి సుఖంగా కూర్చుని ఏ పుస్తకమో చదువుకుంటూ కూర్చునేది. దానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పైన బాపుగారి దగ్గర్నుండి పాత హింది పాటలు వినిపిస్తూ ఉండేవి."

ఇక రెండవది, వాళ్ళ ఇంట్లో బావి తవ్వుతున్నప్పుడు :

"మండు వేసవిలో పనివాళ్ళు చెమటలు కక్కుతూ తవ్వకం పని చేస్తుంటే చూడటానికే కష్టంగా ఉండేది. ఇంట్లో పల్చటి మజ్జిగ చేసి, ఉప్పు వేసి, నిమ్మకాయ రసం పిండి స్టీలు బిందెలలాంటి దాంట్లో పోసి ఇస్తే, కొత్త ఇంటికి తీసుకు వెళ్ళి పనివాళ్ళకు ఇచ్చేవారు. వాళ్ళంతా పరమ సంతోషంతో మజ్జిగ తాగి, సేద తీరి, మళ్ళీ ఉత్సాహంగా పని చేసేవారు. బావిలో నీళ్ళు పై దాకా వచ్చాయి. పైగా తియ్యటి నీళ్ళు. అంతే కాకుండా తెల్లవారేటప్పటికి సంపు నిండిపోయి, కార్పొరేషన్ నీళ్ళు పైకి వచ్చేసి కాలవ లాగా ఇల్లు దాటి రోడ్డు మీదకి వెళ్ళిపోయేవి. రమణ గారికి చాలా సంతోషంగా అనిపించింది. పని వాళ్ళ దాహం కనిపెట్టి చూడటం వల్ల అంత జలసంపంద వచ్చింది అనేవారు. అప్పటి నుండి అదొక సెంటిమెంట్‌గా మారిపోయింది."

ఇందులో ఉన్నదంతా సున్నితమైన హాస్యం, సరసమైన సంభాషణలూ. వెకిలితనం మచ్చుకైనా కనపడని వ్యక్తిత్వాల పరిచయమూనూ. స్నేహితులైనా సన్నిహితులైనా, భార్యాభర్తల గురించి చెబుతున్నా, అత్తాకోడళ్ళ గురించి చెబుతున్నా, అదే తీరు.

ముచ్చటగొలిపే ఓ సంఘటన గురించి ఆవిడ మాటల్లోనే -

"ఒకరోజు రమణగారు ఇంటికి వస్తూ - 'పన్నెండు దాటుతోంది. మా ఆవిడ ఎదురుచూస్తూ ఉంటుంది' అనుకున్నారట. కారులో ఉన్న ఇంకొకాయన 'ఎన్నాళ్ళయిందేమిటి మీ పెళ్ళయి?' అని అడిగారు.

'ఎనిమిది నెలలైంది' అని చెప్పారు రమణ గారు. 'పెళ్ళయి ఎనిమిది నెలలైనా ఇంకా మీ ఆవిడ నీ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారా? అబ్బే ఉత్తిదే- శుభ్రంగా తినేసి రెండో జాము నిద్రలో ఉంటారు. అనవసరమైన భ్రమ పెట్టుకోకండి' అన్నారుట ఆయన. 'కాదులెండి- మా ఆవిడ మేలుకునే ఉంటుంది. నేను బెల్ కొట్టకుండానే తలుపు తీస్తుంది చూద్దురుగాని' అన్నారుట రమణ గారు. ఇంటికి వచ్చి- గేటు తీసి లోపలికి వచ్చి గేటు మూస్తుంటే వరండాలో లైటు వెలిగింది. కారులో ఆయన చేతులెత్తి దణ్ణం పెట్టి, 'మీరే గెలిచారండీ రమణ గారూ' అన్నారుట."

రమణ గారెప్పుడూ ఈ కథ చెప్పుకు మురుసుకుంటారని శ్రీదేవిగారు చెబుతోంటే, ఎంత బాగుంటుందో చదవడానికి.  ప్రేమంటే ఎదురుచూపులని కాకపోవచ్చు కానీ, ప్రేమంటే అపారమైన నమ్మకమంటే కాదనేవాళ్ళెవ్వరు?!

ఈవిడేమీ చేయి తిరిగిన రచయిత్రి కాదని నేను అన్న మాట నిజమే, అయితే, అది కేవలం వీరు మునుపు మరో రచన చేసిన దాఖలాల్లేకపోవడం చేతనే. అది మినహాయిస్తే, ఏ భావాన్నైనా నేర్పుగా పాఠకులకు చేరవేయడంలో ఆవిడ ఎవరికీ తీసిపోరనే అనిపించింది, పుస్తకం పూర్తి చేసేసరికి. రమణ గారి వియోగం గురించి చెప్పినప్పుడు బహు పొదుపుగా మాట్లాడిన ఈవిడ, మరి కొద్ది రోజులు గడిచాక సంగతుల గురించి వ్రాస్తూ "ఏడుపొస్తుంది." అంటూ మొదలెట్టినప్పుడు మాత్రం, గుండెల్ని కరిగించేశారు. నిజమే, ఆ వెలితి అనుభవంలోకి రావడానికి కూడా సమయం పడుతుందిగా. అదే కనపడుతుంది మనకి ఇక్కడానూ. అందుకే మనకీ అంత బాధ, ఆ పేజీల వద్దకొచ్చేసరికి. తెలియనిదెవరికి, "మిథునం" మన ఇంటింటి కథ! 

ఇద్దరు ప్రముఖ వ్యక్తుల జీవితాలతో ముడిపడి ఉన్న కథ కాబట్టి, మనకు పుస్తకం నిండా ఆసక్తిగొలిపే సంగతులెన్నో కనపడతాయి. అలనాటి వెండితెర రేరాణుల ప్రస్తావనా ఉంటుంది. ఆ తెర మీద వెలుగులెంత సంబరమో, ఆ తెర వెనుక నీడలెంత దుర్భరమో అన్నీ చెప్పకనే చెబుతుంది ఈ పుస్తకం. రమణ గారి కొండంత అప్పుని చూసి పిడికెడు హృదయంతో స్పందించి, ఊరటనిచ్చిన బాపుగారబ్బాయి వేణు గారి వ్యక్తిత్వం గురించి చదువుతుంటే, గుండె గొంతుకలో కొట్టాడుతుంది. "శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం, శ్రియా దేయం, హ్రియా దేయం, భియా దేయం, సంవిదా దేయం". అంతే! చదివిన ప్రతి మనసూ చలించిపోయేలా చెప్పుకొచ్చారు శ్రీదేవి గారు.

లెక్కకు మించిన మనుష్యుల పరిచయాల వల్ల, అక్కడక్కడా కాస్త ఇబ్బందిపడే మాట వాస్తవమే. కొన్ని సార్లు పేర్లను చూసి కాస్త అయోమయానికీ గురవుతాము. ఒకటికి రెండు సార్లు చదివితే తప్ప కొన్ని వరసలు అర్థం కావు. ఆఖర్లో కొత్త ప్రాంతాలు చూసినప్పుడు కలిగిన ఆలోచనలు, ఆ వర్ణనలు కూడా కలిపారు. అవి, ముందంతా పుస్తకం నడచిన తీరుకి కాస్త భిన్నంగా ఉండటంతో(మనుష్యుల ప్రస్తావన లేకుండానో, లేదా తక్కువగానో..), కించిత్ అసంతృప్తి కలుగుతుంది. అయినా, ఈ పుస్తకం మిగిల్చే అనుభవం ముందు వీటిని నలుసులుగానే జమకట్టాలి.

జీవితాన్ని గొప్పగా గడపడం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు మనమిచ్చుకునే జవాబు మీద ఈ పుస్తకం నచ్చడమూ నచ్చకపోవడమూ ఆధారపడి ఉంటాయి.

వెనుతిరిగి చూసుకుంటే, మన చిననాటి అలకలూ-అల్లర్లు, ఇప్పుడు తగ్గించుకున్న మొండితనమూ, ఇప్పటికీ మనలో తొంగి చూసే అమాయకత్వమూ, మనం దాటలేమనుకున్న కష్టాలను కాలం పొత్తిళ్ళల్లో భద్రంగా దాటి వచ్చిన తీరూ, ఇక ఆపై నవ్వుకోవడమూ, మనం కోల్పోయిన వారి జ్ఞాపకాలు కూడా బాధించకుండా ఓదార్పునివ్వడమూ, మన చుట్టూ మనం గీసుకున్న పరిథి ఎంత చిన్నది కానివ్వండీ, అక్కడ కొందరికి చోటివ్వడమూ, సాయానికి చేయందివ్వడమూ, తప్పులొప్పుకుని కలిసి బ్రతకడమూ, నవ్వడమూ- నవ్వించడమూ - నా దృష్టిలో నేను గొప్పగా బతికాను అని చెప్పుకోవడానికి ఇవి చాలు. కాబట్టి నాకిది నచ్చింది.

ముందే చెప్పినట్టు, ఇది ఒక మామూలు అమ్మాయి కథ. మనని మనకు చూపించే కథ. మన వాళ్ళని గుర్తు తెచ్చే కథ. మనం మరచిపోయిన సంగతులు గిల్లి గుర్తు తెచ్చి నవ్వించే, ఏడిపించే కథ. మనను ఎత్తుకు ఆడించిన పిన్నులు, పెద్దమ్మలు, మేనత్తలు, మేనమావలు, మన తర్వాత పుట్టిన మన వాళ్ళందరూ - మనకు తెలీకుండానే జీవితాన్ని అమృతభాండంగా మార్చిన రోజులను ఏ అతిశయోక్తులూ ఏ అలంకారాలూ వాడుకోకుండా ఏ నీతి సూత్రాలతోనూ మనకు చిరాకు తెప్పించకుండా, అలవోకగా గుర్తు చేసిన అందమైన కథ. 

ఆత్మకథల్లో అరుదుగా కనిపించే నిజాయితీ ఒక్కటీ చాలు, ఈ పుస్తకాన్ని దాచుకు దిగులనిపించినప్పుడల్లా చదువుకుందుకు.

విశ్వనాథ విద్వద్వైభవము

కొన్నాళ్ళ క్రితం మిత్రులు ఫణీంద్ర ఒక ఆంగ్ల వ్యాసాన్ని తెలుగులోకి తర్జమా చేయడంలో కొంత సాయం కావాలని అడిగారు. అందులో విశ్వనాథ కవిత్వ ప్రస్తావన ఉంది కనుక ఆ వ్యాసం నాకు కూడా కొంత ఆసక్తి కలిగించవచ్చునని చెప్పారు. ఆ పేరు వినగానే, సహజంగానే నేను ఆకర్షితురాలినయ్యాను. నాకు తప్పకుండా ఆ వ్యాసం పంపించవలసిందనీ, అనువాదం నేను చేయలేకపోయినా ఊరికే చూసేందుకు, చదివేందుకు అనుమతినీయవలసిందనీ కోరాను. అలా ఇద్దరం కలిసి, ఆ వ్యాసంలో ప్రస్తావించిన కవిత్వ ధోరణుల గురించి, విశ్వనాథ గురించి చెప్పిన విషయాల్లో సత్యాసత్యాల గురించి చర్చించుకుంటూ, అనుకున్న దాని కంటే వేగంగానే, ఇష్టంగానే ఈ వ్యాసాన్ని తెలుగులోకి అనువదించాము. 

ఇంతకు మించిన ఆసక్తికరమైన విషయం మరొకటుంది - ఈ వ్యాసం మొదట తెలుగులో వ్రాసినది మరెవరో కాదు, వేటూరి వారు. ఆయన వ్రాసిన అసలు ప్రతి పోయి, దానికి వేటూరి గారి మిత్రులు శ్రీ ఎస్.రాధాకృష్ణమూర్తి గారు చేసిన ఆంగ్ల అనువాదం మాత్రమే మిగిలి ఉండటంతో, వేటూరి సైట్ నిర్వహకుల కోరిక మేరకు మేము ఈ సాహసం చేయవలసి వచ్చింది. 
*

విశ్వనాథ వారికి 1970-71 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా వేటూరి వారు వ్రాసిన వ్యాసం :


విశ్వనాథ వారికి 1970-71 సంవత్సరానికి గాను  జ్ఞానపీఠ పురస్కారాన్ని కొద్ది రోజుల క్రితం ప్రకటించినప్పుడు ఆయన “నిజానికి నాకీ పురస్కారం ఆరేళ్ళ క్రితమే దక్కి ఉండాలి” అన్నారుట! నిజమే, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తన ప్రతిభనెన్నడూ తక్కువ చేసుకు మాట్లాడిన దాఖలాల్లేవు. స్వయంకృషితో, సాధనతో ఒక్కొక్క మెట్టూ దాటుకుంటూ తెలుగు సాహిత్య శిఖరాలను అధిరోహించిన ఘనత వారి సొంతం. సాహితీ ప్రస్థానపు తొలినాళ్ళలో సహచరులు కొందరు ఆయనకున్న సంస్కృతాంగ్ల పరిజ్ఞానాన్ని చులకన చేసి మాట్లాడిన కారణానికేనేమో, ఆయనకి తీవ్రమైన ఆత్మాభిమానం మాత్రం ఏర్పడిపోయింది.

ఆ రోజుల్లోని వర్థమాన కవులందరిలానే ఆయనా దేశభక్తి గీతాలతోనే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. దేశభక్తిని, ప్రాంతీయాభిమానాన్ని కవితాత్మకంగా వ్యక్తీకరించేందుకు ఆనాటి కవులందరూ పోటీ పడుతున్న రోజుల్లో ఆయన రచించిన “ఆంధ్ర ప్రశస్తి” ఆయనకు ప్రశస్తిని తీసుకు వచ్చినా, ఈ కీర్తిని తుమ్మల సీతారామమూర్తి, రాయప్రోలు సుబ్బారావు వంటి వారితో పంచుకోవలసి వచ్చింది. ఆ తరువాత భావకవిత్వపు పూలపరిమళం తెలుగుసాహిత్యమంతా పరచుకున్నప్పుడు, మత్తెక్కని తెలుగు కవి లేడు. కొందరు షెల్లీ కవిత్వపు ఛాయల్లో తలదాచుకుంటే, ఇంకొందరు కీట్స్ వెంటపడ్డారు. మరికొందరు వర్డ్స్ వర్త్‌ని అనుకరించారు. ఇలా మనకు తెలుగు షెల్లీలు, కీట్సులు, వర్డ్స్ వర్తులు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చారు. ఒక వర్గం కవులు ఒక అడుగు ముందుకేసి కొంత అక్కడా, కొంత ఇక్కడా అన్నట్టు ఇరుభాషా ప్రాజ్ఞులనీ అనుసరిస్తూ వీలైనంత గొప్పగా వ్రాయాలని ఉబలాటపడ్డారు. మరి కొందరు ఘనులు ఈ ఆంగ్ల భావకవిత్వమంతటనీ మధించి, ఆ భావాలను తోచిన రీతిలో తెలుగులో వెళ్ళగక్కారు. మొదటి పంక్తిలో వర్డ్స్‌వర్త్‌నీ, రెండో పంక్తిలో షెల్లీని నిస్సిగ్గుగా అనువదించుకుని కవితలు వ్రాసుకున్న వారెందరో. విశ్వనాథ సైతం తమ సమకాలికుల దారిలోనే నడచి భావకవిత్వాన్నే ఆశ్రయించినా, తన శైలిని మరే ఇతర ఆంగ్ల కవి శైలికీ నకలుగా చెప్పలేని స్థితి కల్పించడంలోనే, ఆయన కవిత్వ విలక్షణత దాగి ఉంది. వారి “గిరికుమారుని ప్రేమగీతాలు”, “శృంగార వీధి” వంటి పద్యకావ్యాలు పాశ్చాత్య భావకవిత్వపు వాసనలు అంటని ఆత్మానుభవ నవసుమాలు. గమనిస్తే, వారి భావకవిత్వమంతటా కూడా సాంప్రదాయ కవిత్వ ధోరణి ప్రబలంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఈయన తొలినాళ్ళ రచన, అత్యంత లయాత్మకంగా సాగిన “కిన్నెరసాని” లో విశేషంగా ఈ సాంప్రదాయ ప్రతీకలూ, శైలి కనపడుతూ ఉంటాయి. లీలామాత్రమే అయినప్పటికీ, ఈ ప్రాచ్య (టాగోర్), పాశ్చాత్య ప్రభావాలన్నింటిని, అతి వేగంగా దాటుకు వచ్చేశారు విశ్వనాథ. సామాన్యంగా తోచిన తన విశ్వాసాల పట్ల అనురక్తినీ, ప్రయోగాత్మకతనూ, విభిన్నతనూ కూడా ఆయన క్రమేణా కాదనుకున్నారు. అంతకు మించి, ఒక స్థిరమైన, సాంద్రమైన పునాదుల ఆధారంగా రచనా ప్రక్రియను కొనసాగించారు.

విశ్వనాథ నవలలు కూడా వ్రాశారు. అయితే అవి కవిత్వం వ్రాయలేని రోజుల్లో, విరామం ప్రకటించుకుని చేసిన కాలక్షేపం రచనలు కావు. నిజానికి, కవిత్వం చెప్పినంత సహజంగానూ నవలలు వ్రాసి మెప్పించడమూ, కొన్ని వచన రచనల్లో తన కవిత్వ సంపుటాలలో కూడా దొరకనంత కవిత్వ ధోరణినీ జొప్పించడమూ ఆయనకే చెల్లింది. విశ్వనాథ వారి నవలలలో తొలుతగా ప్రచురించబడినదీ, ప్రముఖమైనదీ అయిన ఏకవీర నిజమైన, నిఖార్సైన కవిత్వంతో నిండి ఉన్నది.  విశ్వనాథ సర్వోత్కృష్ట వచన రచన అయిన “వేయిపడగలు” నవల తెలుగు సాహిత్య అభిమానులందరినీ వారికి ఋణపడిపోయేలా చేసింది. టాగోర్ తాను పాడలేని వేళల్లో నవలలు వ్రాస్తానని ఓ సందర్భంలో అంటాడు (ముద్దాడలేని పెదవులే పాడతాయని మరో పాశ్చాత్య కవి అన్న రీతిలోనే). టాగోర్ నవలలు కొన్ని ఈ మాటలను నిర్ధారించేవిగానూ ఉంటాయి. తెలుగు సాహిత్య విమర్శకులు కొందరు విశ్వనాథ రచనలను టాగోర్ రచనలతో పోల్చి చూశారు. ఇటువంటి పోలిక టాగోర్ పట్ల అనుచితమైనదిగానూ, విశ్వనాథను అవమానించేదిగానూ భావించవలసి ఉంటుంది. నవలాకారుడిగా విశ్వనాథ శైలి సర్వస్వతంత్రంగా ఉంటూనే అత్యంత మనోరంజకంగా ఉండడంలో తనదైన ముద్రను వేసుకుని ఉన్నది. విస్తృతంగా అనుకరించబడినా, అనుసరణకు లొంగని శైలిగానే మిగిలిపోయిందది. అయితే, విశ్వనాథ నవలా రచనలను పరిపూర్ణతకు ఒకింత దూరంలో నిలబెట్టే నెరసొకటి ఉంది. అది, విమర్శకుల పరిభాషలో చెప్పాలంటే, ఆ రచనలు ప్రతిస్పందనాత్మకం (రేచ్తిఒనర్య్) కావడం. ప్రతిస్పందనాత్మక భావజాలం కన్నా, ప్రతిస్పందనా, సమర్థనా, వాదవివాదాలతో నిండిన వారి కథనశైలి కళారచనలోని రసజ్ఞతకు ఎక్కువ భంగం కలిగించింది. విశ్వనాథ నవలలో కొన్నింటిని ప్రగతిశీలమైన, విప్లవాత్మక ధోరణి కలిగిన చలం నవలలకు బదులుగా భావించే వారున్నారు. అయినప్పటికీ, విశ్వనాథ తన వైదుష్యవైభవంలో సింహభాగం నవలా రచన ద్వారానే సాధించారనడం అతిశయోక్తి కాదు. వైదిక ధర్మం యొక్క సప్రమాణికత పట్ల స్థిరమైన నమ్మకాన్ని కలిగి ఉంటూనే, మన గతం వైపు సునిశితమైన చూపుని విసిరి, ఆ స్వకాల ప్రాంతాల పట్ల ప్రీతిని కలిగించే రచనలు వారివి.

జీవితకాలపు సాధనా ఫలితంగా రామాయణ కల్పవృక్షాన్ని రచించిన కవి విశ్వనాథ. ఆంధ్ర మహాభారతానికి లభించిన స్థాయి కానీ, ప్రజాదరణ కానీ, ఏ ఒక్కరి రామాయణ తెలుగు సేతకీ లభించలేదన్నది నిర్వివాదాంశం. నిజానికి రామాయణం తెలుగు అనువాదాలన్నీ కాలప్రభావానికి మరుగున పడిపోక తప్పలేదు. ఆంధ్రమహాభారత స్థాయిని పొందలేకపోయినా, ఈ రెండింటినీ పోల్చి చూడటం ఏ విధంగానూ లాభించదనడం నిజమే అయినా,  విశ్వనాథ కల్పవృక్షం తెలుగు సాహిత్యానికి, మరీముఖ్యంగా శ్రీరామ కథకూ నిస్సందేహంగా  అదనపు శోభను చేకూర్చింది. మరో వైపు, మూలంలోని వాల్మీకి కథకు దూరంగా జరగడంలో విశ్వనాథ స్వతంత్రతను తెలుగు సాహిత్యకారులు సాదరంగా స్వీకరించలేకపోయారు. అయితే, మూలానికి నిబద్ధుడు కానందుకు కవిని విమర్శించినందువల్ల ఏ ప్రయోజనమూ లేదు. అక్షరమక్షరమూ మూలానికి లోబడి వ్రాసినా, లెక్కకు మిక్కిలిగా ఉన్న మన రామాయణ తెలుగు అనువాదాలు చాలా మటుకు  మూలంలోని ఆత్మను పట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యాయి. విశ్వనాథలా స్వతంత్రించి మూలానికి అవసరమనుకున్నప్పుడల్లా దూరం జరుగుతూ కావ్య రచన చేసిన వాళ్ళూ లేకపోలేదు. నిజమైన ప్రశ్న, పరీక్ష – వీరందరూ రచనని పరిపూర్ణమైన కళారూపంగా మలచగలిగారా లేదా – అన్నది మాత్రమే. తమ తమ పక్షపాతధోరణితోనూ, నిర్హేతుకమైన ఆలోచనలతోనూ, విగ్రహారాధనతోనూ సంతృప్తి పొందో, సమర్ధించుకుంటూనో తెలియదు కానీ, ఈ ప్రశ్నను మాత్రం ఎవ్వరూ సంధించినట్టు కనపడదు.

విశ్వనాథ కేవలం మహోన్నత సాహిత్యకారుడు మాత్రమే కాదు. తెలుగునాట తనదైన చరిత్ర సృష్టించుకున్న చరితార్థుడు కూడా! బెర్నార్డ్‌షా తన జీవితకాలంలో సాధించినంత స్థాయినీ కీర్తినీ విశ్వనాథ ఈనాడు అనుభవిస్తున్నారు. ఎంత మంది శత్రువులను సంపాదించుకున్నారో అంతకు మించిన భక్త బృందాలనూ సమకూర్చుకున్నారు. ఎంతటి ప్రచండ వాగ్వివాదంలో చొరబడడానికైనా వెనుకాడని ధీర వ్యక్తిత్వం విశ్వనాథ సొంతం. విమర్శలకు వెరవని అభిప్రాయ ప్రకటన, ముక్కుసూటి సమాధానాలూ ఆయన నైజం. అలనాడు మాక్స్ బీర్‌బాం షా గురించి చెప్పిన మాటలే విశ్వనాథ వ్యక్తిత్వానికీ సునాయాసంగా వర్తిస్తాయి – “ఆయన అమరుడు”!

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....