శ్రీకాంత శర్మ సాహితీప్రస్థానం

నా లోపల విశ్వమంత ఆమ్రవృక్షం/ ఎడతెగని పరాగపవనాన్ని శ్రుతి చేస్తుంటే/ గానంగా కరిగిపోయే కోకిలాన్ని/ ఏకాంత ఢోలాఖేలనం ఎప్పటికీ ఇష్టం నాకు!‘ అంటూ తన ప్రవృత్తిని కవిత్వంలో ప్రకటించుకున్న సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంతశర్మ. ‘పండిత పుత్ర…’ అన్న లోకోక్తిని తిప్పికొడుతూ, కవులు, పండితులు అయిన తండ్రి శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారి సాహిత్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు.
కవిత్వమంతా రాజకీయమయమై, నిరసననూ, పోరాటాన్ని ప్రతిపాదించనిదంతా అకవిత్వంగా చూపించబడుతోన్న రోజుల్లో, వి.ర.సం. సాహిత్య ఆధిపత్య ధోరణులపై ఎక్కుపెట్టిన విమర్శగా, శర్మగారి తొలి కవితా సంపుటి అనుభూతి గీతాలును పరిగణించవచ్చు. ఒక సాహిత్య ప్రక్రియను ఈ తీరున అడ్డుగోడల మధ్య బిగించడం నచ్చని, మెచ్చని ఇంద్రగంటి దానిని బాహాటంగానే విమర్శించారు. సొంత అనుభూతి మాత్రమే కవిత్వ ప్రకటనకు బాణీ కావాలన్న శర్మగారి మాటలు, అరువు గొంతులతో గుంపుల్లో దూరిపోతున్న ఈ కాలపు కవులకూ అశనిపాతాలే. వచన కవిత్వం ఒక సాహిత్య ప్రక్రియ మాత్రమేననీ, ఒక ధోరణిని ఉద్యమంగా నడపడం అనవసరమైన పని అనీ, తెలుగు కవిత్వానికి అది మేలు కంటే కీడే చేస్తుందనీ అనడం, ఆ ఉద్యమకర్త కుందుర్తిని విమర్శించడం, సాహిత్యానికి సంబంధించి శర్మగారి ముక్కుసూటితనాన్ని పట్టిస్తాయి. బాహ్య ప్రపంచపు పోకడల ప్రేరణలతో ఉత్పన్నమవుతోన్న తనకాలపు కవిత్వ ఋతువులను గమనిస్తూ, ఆ గొంతుల్లోని ‘ఆధునికత’ను జాగ్రత్తగా జల్లెడ పట్టిన సునిశిత దృష్టి ఇంద్రగంటిది. వస్తువూ, వాదమూ ఏదైనా, మనోధర్మమే ఏ కళకైనా శోభనిస్తుందనీ, అది ఎంత గొప్పదైతే కళ అంతలా రాణిస్తుందనీ నమ్మిన కవి ఇంద్రగంటి. కవిత్వానికి సంబంధించి ఆయన ఈ భావాలను ఎంతలా నమ్మారో, అంతలా పునరుద్ఘాటిస్తూ వచ్చారు. అంతగానూ అనుసరించారు కూడా. ‘గతాల శ్రుతులు సరిచేస్తూ/నా నరాల ప్రకంపనల్లోంచీ/అనుభూతి గీతాలు ఆలపిస్తాను‘ అన్నదందుకే. అలాగే మరొక కవితలో,
బ్రతుకంతా ఏదో సడి, తడి, అలజడి –
నువ్వు గుర్తించలేనంత సున్నితంగా
ఒకప్పుడు
ఒళ్ళు జలదరిస్తుంది-
ఒకానొక అనుభవం
నీలో ఘనీభవించే
మౌక్తిక క్షణమది-
అప్పుడు నువ్వు
కాళిదాసువి
తాన్సేన్‌వి
మైకేలేంజిలోవి-
అంటారు. కవిత్వం, అట్లాంటి మౌక్తిక క్షణాలను ఒడిసిపట్టుకోగల మెలకువతోనే సాధ్యమన్నది శర్మ గారి భావనగా అర్థమవుతుంది. వ్యక్తే శక్తికి ఆధారం కనుక, అదే ఇతివృత్తంగా యువ నామ సంవత్సరం నుండి, యువ నామ సంవత్సరం దాకా వచ్చిన కవిత్వం నుండి ఎంపిక చేసిన ఆధునిక కవితలతో ఆయన వెలువరించిన యువ నుండి యువ దాకా సంకలనం, దానికి వారు వ్రాసిన ముందుమాట, ఈ భావనలను బలపరుస్తాయి.
కృష్ణశాస్త్రి, ఆరుద్ర, శ్రీశ్రీ వంటి ఆ కాలంలోని మంచి కవులు, చలనచిత్ర రంగాన్ని చేరడం కద్దు. కవులకు ఛందస్సు కూడా తెలిసి ఉండటం గీతరచనలో ఒక అదనపు ప్రయోజనం. నిజానికి శర్మగారి వచన కవిత్వంలో కూడా శబ్ద సౌందర్యం చాలా చోట్ల స్పష్టంగా కనపడుతుంది. కళ్ళను ‘క్రూర కాంక్షా ఫణుల మణులవి/ ధీర వాంఛా మదన సృణులవి‘ అన్నప్పుడూ, తనకిష్టమైన గౌతమీ తీరాన్ని, ‘కలల తళుకు టలల వణుకు గోదావరి గళం తొణికి/ కథలు కథలుగా గీతులు గగనంలో మెదులుతాయి‘ అని వర్ణించినప్పుడూ, ఆ శబ్ద, లయజ్ఞానం మనకూ అర్థమవుతుంది.
తనపై ఎంతో ప్రభావం చూపిన కృష్ణశాస్త్రిగారి పంథాలోనే, ఇంద్రగంటి కూడా చలనచిత్ర రంగాన్ని చేరి, చెవుల్లో తేనె సోనలు నింపే గీతాలను వ్రాశారు. పద్య సాహిత్యంలోనూ కృషి చేసి ఉండటం వల్ల, స్వతహాగా లయజ్ఞానం ఉండటం వల్ల, మీటర్‌కు వ్రాయడం శర్మగారికి కష్టమైన విషయమేమీ కాలేదు. కవి కావడం వల్ల చేయగలిగిన గారడీ ఒకటి కలిసి, ఆయన వ్రాసిన చలన చిత్ర గీతాలను గుర్తుండిపోయేలా చేసింది. విపరీతమైన అధ్యయనం వల్ల ప్రోది చేసుకున్న పదసంపద, పద లాలిత్యం, వెలకట్టలేని ఆస్తుల్లా ఆయన కాలూనిన ప్రతి రంగంలోనూ వెన్నంటి నిలిచాయి. విరివిగా ఒక పోలిక జనాల్లో నాటుకుపోయాక, దానిని అటుదిటు చేసి చెప్పడం కూడా ఒక్కోసారి అపూర్వమైన వెలుగునిస్తుంది. ‘తిరునాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా/ మెరుపులతో మెరిసింది వానకారు’ పాటలోని ఐంద్రజాలికత అదే. ‘కనుబొమ్మల పల్లకిలోన కన్నెసిగ్గు వధువయ్యింది’ అన్నా, ‘సాంబ్రాణి పొగమాటు ఓ సందమామ/ నీ అగులుచుక్కా సొగసు అద్దానికీసు’ అన్నా, ఈమధ్యనే వచ్చిన సమ్మోహనం సినిమాలోని పాటలో, ‘తనివాఱ నాలో వెలుగాయె/ చిరుయెండ చాటు వానాయె‘ అని వ్రాసినా, ఆయనలోని కవికి సాగిలపడటమే రసహృదయాలు చెయ్యగలిగినది. తొలినాళ్ళలోనే జంధ్యాల వంటి దర్శకుల దగ్గర సింగిల్ కార్డ్ గేయ రచయితగా నిలబడ్డా, తరువాత కాలంలో సినిమాలకు దూరంగా వచ్చి, ఆకాశవాణి ఉద్యోగంలోనే స్థిరపడిపోయారు. తన సాహితీ స్వేచ్చని హరించని వాతావరణంలో ఆయన సృజనాత్మకత రెక్కలు విప్పుకుంది. ఆయన రచించిన లలితగీతాల్లో, ‘బాల చంద్ర రేఖ వంటి ఫాలమందు అలకలటే/ నీలి మొయిలు తునక జారి లీలగా తూగాడెనటే’ ‘ఆనాటి నీపాట ఎదను తాకి గుబులు రేపు…’, ‘ఒక గాలి తేలీ ఉయ్యాలలూగీ నడిచేవా ఓ గోదావరీ’, ‘పూరింటిలో గడప పొదిగిటను నిలచి/ పొంగు ఆకటికంటి నీరు తుడిచాడు (సూర్యుడొచ్చాడమ్మా)’ లాంటి గీతాలూ, వాక్యాలూ ఒక ఎత్తయితే, ఒకే ఒక దేశభక్తి గీతం వ్రాసినా, ఆ తేనెల తేటల బాణీ ఈనాటికీ తెలుగు బాలబాలికలందరి నాల్కల పైనా ఆడుతుండటం, వారికి మాత్రమే దక్కిన గొప్ప గౌరవం.
76’లో విజయవాడ ఆకాశవాణిలో చేరినది మొదలూ ఆయనలోని కళాకారుడి బహుముఖీయమైన ప్రజ్ఞ వెలుగులీనుతూ వచ్చింది. సంగీత సృజనాత్మక రూపకాల్లో శర్మగారూ, వారి బృందమూ జాతీయ స్థాయిలో బహుమతులు గెల్చుకోవడమొక ఆనవాయితీగా మారింది. నాటక పక్రియ పట్ల తొలినాళ్ళ నుండీ అపరిమితమైన ప్రేమా, ఆసక్తి ఉన్నాయని ప్రకటించుకున్న ఇంద్రగంటి, తెలుగు నాటక రంగానికి సంబంధించి చేసిన కృషి, విమర్శ వారి సాహిత్య సృష్టి మొత్తానికీ మణికిరీటంగా నిలబడదగ్గవి. తెలుగునాట నాటకరచన తన ప్రాభవాన్ని కోల్పోవడంలో, నాటక రచన, చదువుకునేందుకు వీలుగా కాక, ప్రదర్శనకు వీలుగా ఉండాలన్న ధోరణి ప్రబలబడమొక ముఖ్యకారణమన్నది శర్మగారి ప్రధానమైన విమర్శ. పరిషత్తు నాటకాలు తెలుగు నాటక రంగానికి చేటు చేశాయనీ, నేడు ప్రతి నాటకానికీ మూల రచనా, ప్రదర్శనా ప్రతి భిన్నంగా ఉన్నాయనే ఇంద్రగంటి గమనింపు చాలా ముఖ్యమైనది.షుమారు నలభై అద్భుతమైన నాటకాలతో, అలనాటి నాటకాలు పేరిట ఆయన వెలువరించిన పుస్తకం, ఆ నాటకాలన్నింటి మూల కథలనూ, మార్పులనూ, ఆ నాటకాల గొప్పతనాన్ని వీలైనంతగా వివరిస్తూ నడుస్తుంది. మహాకవి కాళిదాస మాళవికాగ్నిమిత్రమ్ నాటకాన్ని, మాళవిక నవలగా తిప్పి వ్రాయడంలోనూ నాటకాల మీది శర్మగారి ప్రేమ విస్మరించరానిది.
ఆలోచన పేరిట శర్మ గారు వ్రాసిన సాహిత్య వ్యాసాలెంత విలువైనవో, ‘తెలుగు కవుల అపరాధాలు’ పేరిట ప్రచురించిన సాహిత్య విమర్శ కూడా అంతే విలువైనది. ప్రత్యేకించి ‘అపర కవులు -అంతరార్థశోధకులు’ వ్యాసంలో రచనను దాటి వెళ్ళి, విమర్శా స్థలాన్ని తమ ప్రతిభా ప్రదర్శనకు వాడుకునే విమర్శకులను, రచన ఎక్కడా ఉద్దేశించని అర్థాలను తమకు తాముగా వెల్లడి చేయాలని చూసే విమర్శకుల అత్యుత్సాహాన్ని ప్రశ్నించడం, ఈ బాపతుకు చెందిన విమర్శకులకు కాస్త చురుగ్గానే తగిలిన దెబ్బ.
శర్మ గారు శిలామురళి కావ్యం వ్రాశారు, మూడు కవితా సంపుటులు ప్రచురించారు, కథలు వ్రాశారు, ఎన్నో యక్షగానాలు కూర్చారు, పత్రికల్లో శీర్షికలు నిర్వహించారు, సీరియల్ వ్రాశారు. ఉపనిషత్తులకు తేట తెలుగులో, సరళమైన వ్యాఖ్యానాలు చేశారు. విశ్వగుణాదర్శము లాంటి ప్రబంధాలకు శర్మగారి తెలుగు వ్యాఖ్య చాలా అవసరమైనదీ, అరుదైనదీ, గొప్పదీ కూడా. సంస్కృత సాహిత్యానికీ, తెలుగు పాఠకులకూ వారధి నిర్మించగల వారిని ఒక్కొక్కరిగా మనం కోల్పోతూ వస్తున్నాం. పాఠకాదరణ వినా, ఇట్లాంటి శ్రమకు ఐచ్చికంగా పూనుకునేలా అటు రచయితను గానీ, ఇటు పబ్లిషర్స్‌ను గానీ ప్రేరేపించే సాధనాలు మరేవీ ఉండవు. ఇంద్రగంటి సాహిత్య ప్రస్థాన సింహావలోకనం మనకీ సందర్భంలో అందిస్తోన్న బలమైన హెచ్చరిక ఇదే. ఇన్ని సాహిత్య పక్రియల్లో ఆయన ప్రయోగాల్లా ఏవో చేయడం కాదు, ఈ పక్రియల వైవిధ్యాన్ని గుర్తించి, తన రచనలకు ఏది నప్పుతుందో విశ్లేషించుకుని, ఆ ప్రక్రియను ఎంచుకోవడం వల్ల,ఇన్ని విభాగాల్లోనూ తనదైన ముద్రను వెయ్యగలిగారు. కవిత్వంలో ఆధునికత ఎట్లా చూపగలమో చెబుతూ ప్రస్తావించిన, పురాణమిత్యేవ నసాధు సర్వం, నచాపి కావ్యం నవమిత్య వధ్యమ్‌, సంతః పరీక్ష్యాంతరత్‌ భజంతే, మూఢః పరప్రత్యయనేయ బుద్ధిః–శ్లోకంలో మాదిరిగానే, ఆయన ప్రాచీనమైనదంతా స్వీకరించలేదు, కొత్తది కదా అని ఉదాశీనంగా చూసి దేనినీ తిరస్కరించలేదు. వివేకవంతుల్లా, అన్నింటిని గమనించి, విశ్లేషించి, ఏది ఉత్తమమైనదో దాని పట్ల అభిమానాన్ని ప్రకటిస్తూ వచ్చారు. తన రచనలన్నింతినీ ఇదే తటస్థ బుద్ధితో చూస్తూ, పునః ప్రచురణలప్పుడు కవిత్వాన్ని ఎడిట్ చేసుకున్నారు. సాహిత్యంలో అవలంబించిన ఇదే విమర్శనా దృష్టినీ, నిష్పాక్షపాత ధోరణినీ జీవితంలోనూ అనుసరించారని, ఆయన ఆత్మకథ ఇంటిపేరు ఇంద్రగంటి చెబుతుంది. ‘నేను ఎవ్వరికీ క్షమాపణలు చెప్పలేదు, కానీ నాకు నేను సవరణలు చెప్పుకున్నాను’ అనడం, పుస్తకంలో పంచుకున్న విషయాలు, విజయాలు, అన్నీ కలిసి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మను దాపరికాలెరుగని, దాచాల్సిన అగత్యమెరుగని నిండు వ్యక్తిత్వంతో మన ముందు నిలబెడతాయి. తనవారైనా, వేరెవరైనా–అన్ని బంధాలనూ నిర్మోహంగా గమనించుకోవడమూ, నిస్సంకోచంగా విమర్శించుకోవడమూ, తనకు కావలసిన ఏ విషయంలోనైనా తులనాత్మకంగా ఆలోచించుకుని, రాజీపడని ధోరణితో నిర్ణయాలు తీసుకోవడమూ–అది ఉద్యోగం కావచ్చు, చదువూ, పెళ్ళీ కావచ్చు; కుటుంబ సభ్యులతో బంధాలు కొనసాగించుకోవడమో, తెంచుకోవడమో కావచ్చు; సాహిత్య ప్రభావాలు కావచ్చు; జీవితం, ఉద్యోగం తనకు అందించిన అవకాశాలన్నీ అందిపుచ్చుకుంటూ తన ప్రతిభను ఇష్టానుసారంగా మలుచుకోవడం లాంటి విశేషాలు ఇంద్రగంటి ఆత్మకథ పట్ల ఆకర్షణను కలిగిస్తాయి.
మర్రి చెట్టు నీడలో మరే వృక్షమూ ఎదగదంటారు, ఆ ఛాయలను దాటుకుని తనదైన విద్వత్తుతో శాఖోపశాఖలుగా విస్తరించిన ఇంద్రగంటి ప్రతిభ తెలుగు సాహిత్యానికి కొత్త సొబగులద్దిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. తన తొట్ట తొలి కావ్యమైన శిలామురళిని తండ్రికి అంకితమీయడంతో మొదలై, అటుపైన తన జీవితంలో సింహ భాగంగా స్థిరపడ్డ ఇంద్రగంటిసాహితీ ప్రస్థానం, చిట్టచివరి కవితను తన తండ్రి పేరిటే ‘ఏరు దాటిన కెరటం’గా ప్రచురించడంతో ఒక ఆవృతాన్ని పూర్తి చేసుకుని నిండుతనాన్ని సంతరించుకుంది.
కొండరాళ్ళ మీద నుండి
వర్షధారలు జారిపోయినట్టు
ఎన్నేళ్ళు గడిచాయో కదా!
అయినా కొండగొప్పు మట్టి చుట్టూ
మొలిచిన పచ్చగడ్డి పువ్వులంటి
మీ జ్ఞాపకాలు!
జీవితంలో మీరు వదిలేసిన ఖాళీలను పూరించడానికో
మీ ప్రేమ వైఫల్యాలు, భగ్న స్వప్నాలూ,
తనివితీరని లోకాలోకనాలు
సమీక్షించడానికో
బహుశా నా ఈ కొడుకుతనం!
అంటారా కవితలో.
హద్దుల మధ్య జీవితం
జబ్బులా వార్ధక్యంలా,
బెంగ పుట్టిస్తుంది కాబోలు!
అందుకే, మనస్సు ఇంకా ఇంకా
వెన్నెల రెక్కలు తొడుక్కుని,
ఆకుపచ్చని యౌవన వనాల వైపు
పరుగులు తీస్తుంది!
అంటారింకొక కవితలో.

అట్లాంటి యవ్వనోత్సాహంతోనే జీవన పర్యంతమూ తనను తాను మెరుగుపరుచుకుంటూ సాహిత్య సృజనలో కొత్త పుంతలు తొక్కుతూ వచ్చారు. ఇప్పుడిక హంస ఎగిరిపోయింది. ఇది విశ్రాంతి సమయం.

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....