"నాది దుఃఖం లేని దేశం" - వాడ్రేవు చినవీరభద్రుడు.

నాది దుఃఖం లేని దేశం - అన్న మాట పుస్తకం మీద ఎప్పుడు కనపడ్డా తెలియని దిగులేదో ఆవహించేది. వరదలు, భూకంపాలు, కల్లోలపరిచే రాజకీయాలు, బాధ్యతల ఊసెత్తని బంధాల్లో స్వేచ్ఛను బలవంతంగా పొందాలనుకునే జనాలు, ఏ క్షణానికా క్షణం పెచ్చుపెరుగుతోన్న నేరాలు - మనదా దుఃఖం లేని దేశం? ఏడెనిమిది నెలల క్రితం ఈ పుస్తకం కోరి తెప్పించుకున్ననాటి నుండీ, ఈనాటికి, వార్తల్లో మనుష్యులు మారుతున్నారేమో గానీ, వాటి తీవ్రత ఏమీ మారలేదు. బహుశా అందుకేనేమో, ఈ పుస్తకాన్ని ఎప్పుడు ఎంత ఆర్తిగా నా చేతుల్లోకి తీసుకున్నా, నా ఆలోచనలు 'ఎవరికి లేదిక్కడ దుఃఖం? ' అన్న ప్రశ్న దగ్గరే ఆగిపోయేవి. చాలాకాలం పాటు నేనా ప్రశ్నని దాటలేకపోయాను. నిజానికి అట్లాంటి అనిశ్చిత మనసుతోనే ఒకరోజు నేనీ పుస్తకాన్ని అందుకున్నాను.
*
కబీరు సాహిత్యానికి అనువాదం అని వినగానే ఇదొక అసాధ్యమైన పని అనిపిస్తుంది. అంతూదరీ లేని సముద్రంలా కబీరు రాతల పేరిట చలామణీ అవుతున్న సాహిత్యం దానికి మొదటి కారణమైతే, వాటిల్లోంచి కబీరు గొంతుని, లేదా కబీరు స్పూర్తిని గుర్తుపట్టి అనువదించేందుకు కవితలను ఎంచుకోవడం రెండవది. కబీరు మనలో చాలామందికి సరిగా తెలీకపోవచ్చు కానీ, కబీరు దోహాలు మాత్రం ఒక్కటైనా, బడిలో పాఠాలుగానైనా వినే ఉంటాం. జనాల నాల్కలపైన భాషలకతీతంగా నానిన పదాలు కబీరువి. ఆ పాదాల్లోని సరళత, సూటిదనం, మరీ ముఖ్యంగా వాటిలోని కవిత్వం - వీటిని ఒక ప్రవచనంలా కాకుండా, తీర్పుల్లా కాకుండా, మరొక భాషలోకి తేగలిగిన సామర్థ్యం మూడవది.
మంచి పరిశోధకులు, చేస్తున్న పని మీద శ్రద్ధ ఉన్నవారు మొదటిని రెండు ఇబ్బందులనీ అవలీలగా దాటేస్తారు. అలాగే, స్వతహాగా గొప్ప కవులైన వారు, ఎదుటనున్న అపారమైన సాహిత్యంలో గొప్ప కవిత్వాన్ని తేలిగ్గా గుర్తుపట్టనూగలరూ, అంతే సమర్థవంతంగా ఆ కవిత్వాన్ని తన భాషలోకీ తేగలరు. కనుక, ఈ పుస్తకంలో ఇవన్నీ దొరుకుతాయన్న విషయంలో భద్రుడి రచనలతో ఏ కాస్త పరిచయం ఉన్నవారికైనా ఎలాంటి సందేహమూ ఉండకూడదు. కానీ, భద్రుడి రచనలెప్పుడూ ఆశించినవి ఇవ్వడం దగ్గర ఆగిపోవు. అది ఇష్టమైన గాయని గీతాలతో తన ప్రయాణం కావచ్చు, అసలు మన కవిత్వం ప్రపంచమంతా పాకాలంటే ఏం చెయ్యాలన్న దాని మీద ఆయన సలహా కావచ్చు (నౌడూరి మూర్తి గారి Wakes on the horizon సభలో), నిన్న గాక మొన్న కాకినాడలో జరిగిన యాత్రాకథనాల మీద చర్చలో ఆయన మాటలు కావచ్చు - ప్రతిసారీ, ప్రతిచోటా, తనదైన ఓ ముద్రని వదలకుండా, తన మాటల మీదుగా పాఠకులు తమతమ ఆలోచనలను పొడిగించుకునే వీలుని ఇవ్వకుండా ఆయన రచనలు ముగియవు.
అట్లాంటి అంచనాలతో ఈ పుస్తకం పట్టుకునేవారి కోసం, భద్రుడు ఒక సృజనకారుడిగా తానెంత ప్రత్యేకమో మరొక్కసారి నిరూపిస్తూ, ఈ పుస్తకంలో కబీరు జీవన ప్రయాణాన్ని తానెంచుకున్న దోహాలతో దశలుదశలుగా విభజించి చూపించారు. అంటే, ఈ పుస్తకం ఒకేసారి కబీరు రచనల ద్వారానే కబీరు కవిత్వాన్ని, కబీరు జీవితాన్ని కూడా మనముందుంచుతోందన్నమాట.
*

నా గురువు గొప్ప భ్రమరం 


నా గురువు గొప్ప భ్రమరం. నాలాంటి కీటకానికి తను రంగులద్దుతాడు. తనలాగే భ్రమరంగా మారుస్తాడు. కొత్తకాళ్ళు, కొత్తరెక్కలు, కొత్త రంగులు సమకూరుస్తాడు.
నీ జాతి ఏమిటి, కులమేమిటని అడగడు. అతడి సమక్షంలో భంగీ కూడా భక్తుడిగా మారిపోగలడు.
నదులూ, కాలవలూ గంగలో కలవగానే గంగగా మారిపోతాయి.
సముద్రంలో చేరగానే నది కూడా సముద్రమై అపారమైపోతుంది.
చంచలమనస్సు ఆయన సన్నిధిలో నిశ్చలమై ఊరికెనే గెంతడం మానేస్తుంది.
తత్వాలన్నిటిలోనూ తత్వాతీతాన్ని చూపించాడు. నన్ను తన అంతేవాసిగా మార్చుకున్నాడు. నా బంధాల నుంచి నన్ను బయటపడేశాడు.
నా దుఃఖం సమస్తం తెంచిపారేశాడు.
అతీతమైనదాన్ని అందించాడు, నన్ను రామరాగరంజితుణ్ణి చేశాడంటున్నాడు కబీరు.

మొన్నా మధ్య మా అక్కతో మాట్లాడుతున్నప్పుడు, అది చిన్నప్పుడు చదువుకున్న బడిపిల్లలందరూ అనుకోకుండా ఒక్కొక్కరుగా ఒక గ్రూప్‌లో కలిశారనీ, అందరూ కలిసి వాళ్ళ బడి కోసం ఏదైనా చేయడానికి పూర్వవిద్యార్థులసమ్మేళనమొకటి ఏర్పాటు చెయ్యాలనుకుంటున్నారనీ చెప్పింది. ఆ పనుల్లో భాగంగానే ఆ ఊరెళుతూ, ఆ ఊళ్ళోనే ఉంటోన్న వాళ్ళ గురువులకి-ఓ పండుముసలిదంపతులకి బట్టలు కొని తీసుకెళ్తున్నానని చెప్పింది. నేను అన్యమస్కంగా వింటూ, "కానీ నువ్వెళ్తున్నది మీ బడికీ, మీ పార్టీ ఏర్పాట్లు స్నేహితులతో కలిసి నిర్ణయించుకోవడానికీ కదా.." అన్నాను. నా ఉద్దేశ్యమల్లా మరొక్క నెలలో వీళ్ళెలాగూ తమ గురువులను సభాముఖంగా ఘనంగా సత్కరించుకోనున్నారు కదా అని మాత్రమే. కొన్ని సెకన్ల నిశబ్దం తరువాత అది ఆ ఊరితోనూ, ఆ బడితోనూ, ఆ మేష్టార్లతోనూ ముడిపడి ఉన్న తన జ్ఞాపకాలను నా బదులుతో నిమిత్తం లేకుండా చెప్పుకుపోయింది. అవేమీ నాకు తెలియనివి కాదు.
నాకు ఎనిమిదితొమ్మిదేళ్ళొచ్చేవరకు మేము బెజవాడను ఆనుకుని ఉన్న పల్లెటూరిలో ఉండేవాళ్ళం. అమ్మ అదే ఊళ్ళోని జిల్లాపరిషద్ స్కూల్‌లో తెలుగు టీచరుగా పనిచేసేది. మా ఇంటికీ, బడి వెనుక ఉన్న విశాలమైన గ్రౌండ్‌కీ మధ్య ఒక్క బల్లకట్టు దూరం, అంతే. సాయంకాలాలు ఆ బల్లకట్టు మీద గంతులేస్తూ ఆడుకునే మాకు, దూరంగా రేకుల షెడ్‌లలోనూ, చెట్ల నీడల్లోనూ బడి అయిపోయాక కూడా పిల్లల్ని కూర్చోబెట్టి చదివించే మేష్టర్లు కనపడుతూ ఉండేవారు. గంటల తరగడి కరెంటు పోయే ఆ చిన్నఊళ్ళో, పరీక్షలకు రెండు మూడు నెలలు ముందుగానే కాస్త బాగా చదివే పిల్లలందరినీ అక్కడి టీచర్లు వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి ప్రత్యేకంగా చదివించేవాళ్ళు. మా అక్క అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ నాతో అంది -"ఎందుకు చెప్పాలి చెప్పు, మాకట్లా ఆ పాఠాలన్నీ? అలా వాళ్ళ పిల్లలతో పాటుగా మమ్మల్నీ కూర్చోబెట్టీ, వాళ్ళకంటూ సమయం మిగుల్చుకోకుండా, ఆలస్యమైతే, మాకు ఆకళ్ళైతే గమనించుకుని అన్నాలు పెట్టి మరీ, కొవ్వొత్తులో కిరోసిన్ దీపాలో మా ముందు పెట్టి మరీ, మేం చీకట్లలో వెళ్ళలేక భయపడతామని మేష్టార్లు తోడొచ్చి వీధి చివర్లలో దించుతారని ధైర్యం చెప్పి మరీ, -వానాకాలం, చలికాలం అసలు కాలాలతో సంబంధం లేకుండా ఎట్లా చదువుచెప్పేవారు! బదులుగా మేమిచ్చాం? ఎన్ని సార్లు గుర్తొస్తుందో, చలిలో పొద్దున్నే వాళ్ళింటి తలుపులు కొట్టేసరికే ఊడ్చి చాపలేసి సిద్ధంగా ఉన్న ఆ వరండా."
ఒక్క వీకెండ్ ఫీచర్ రిలీజ్ చేస్తే, దానికి బదులుగా సెలవెప్పుడిస్తారో చెప్పమని మేనేజర్లని సతాయించే ఉద్యోగులను అన్ని దిక్కుల్లోనూ చూస్తున్న ఈ కాలంలో ఏమీ కాని పిల్లలకోసం, బదులేమీ రాదని తెలిసీ తాపత్రయపడటం - ఆ వయసుకీ, ఈ వయసుకీ కూడా మా ఊహకందదు. మా అక్క, 'మా టీచర్లు లేని బడెక్కడ? ఊరెక్కడ? నా బాల్యమెక్కడ?' అని వాపోయినపుడు, ఇదుగో, నాకీ కబీర్ దోహానే చెవుల్లో మోగిపోయింది. "నువ్వెవరు?" అని అడక్కుండా విద్యార్థులందరినీ అక్కున చేర్చుకున్న ఆ గురువులు నేర్పిన సంస్కారమే మా అక్క మాటల్లోనూ వినబడి నన్ను చకితురాలిని చేసింది.
కబీరు మాటల్లోనే చెప్పాలంటే, "చిత్తం లోపల దీపం వెలిగే గురుముఖులెక్కడో అరుదు కదా!". నాకీ సందర్భంలో, ఇస్మాయిల్ మాటలు కూడా గుర్తొస్తున్నాయి. ఆయన, కవిత్వం చేసే పని కూడా చిత్తం లోపల దీపం వెలిగించడమే అంటారొక ఇంటర్వ్యూలో.
*
నేను నీ బానిసను, గోసాయీ, నన్నమ్మేసుకో
నా తనువు, నా మనసు, నా ధనం ఆయన కోసమే. కబీరుని తీసుకొచ్చి ఆయన అంగడిలో నిలబెట్టాడు. అమ్ముకునేదీ అతడే, కొనుక్కునేదీ అతడే. అతడే నన్ను అమ్ముతానంటే రక్షించేదెవ్వడు? నన్నతడు రక్షింపదల్చుకుంటే, అమ్మగలిగేదెవడు?
తనువూ, మనసూ దహించేస్తున్నాయి, ఇక క్షణం కూడా నిన్ను మరిచి బతకలేనంటున్నాడు కబీరు.
ఈ కవితలో మొదటి వాక్యమే, " నన్నమ్మేసుకో " అంటుంది. జీవచ్ఛవమా, పశువా, అమ్మకమేమిటి ఇక్కడ - అన్నది మామూలు జనాల ప్రశ్న. కానీ, ఇది కబీరు కాంక్షించిన ప్రేమ. ఇద్దరినే ఒకటి చేసి నడిపించే ఆ ప్రేమ మార్గం బహు ఇరుకు. కాబట్టి అక్కడ మూడో మనిషి ఉనికి అసాధ్యం. 'ఎవరికి అమ్మాలి?' అన్న ప్రశ్న అసంబద్ధం. పోతే, "కొనుక్కునేదీ అతడే" అన్న మాట గమనించదగినది. ఎలా కొనుక్కోగలడో కూడా ముందు పుటల్లో తనే సూచనగా చెబుతాడు -"మనసు చెల్లించి మరీ". ఇట్లాంటి కవిత్వం, ప్రేమ అనుభవంలోకి రాకపోయినా, కనీసం అర్థమైనా అవ్వాలి మనకు. అలా అర్థమైతే, ఇలాంటి హృదయసంవేదనే ప్రేమికులలో, జంటల్లో ఉంటే, సర్వోన్నత న్యాయస్థానం మన ముందుకొచ్చి భాగస్వామి ఒకరి సొత్తు కాదు అని తీర్పులివ్వవలసిన అగత్యం పట్టదు. నిజానికి న్యాయస్థానాలెప్పుడూ నిర్వచించగలవే కానీ నియంత్రించలేవు. హృదయం అమూల్యమైన ఆస్తి అనీ, హక్కుదారెప్పుడూ ప్రేమతో దాన్ని సాధించుకున్నవాడేననీ చెబుతున్న ఈ కబీరు కవిత్వం కాలానుగుణమూ, కాలాతీతమూ కూడా.
ఈ ప్రాపంచిక విషయాలను పక్కన పెట్టినా, ఆ ఒక్క పదంలో ఎంత కవిత్వం! ప్రేమని, నమ్మకాన్ని, సమర్పణని ఒకే ఒక్క పదంలో ఎంత బలంగా చెప్పాడు కవి. ఇట్లాంటి కుదుపులే కదా, కవిత్వప్రయాణాలు ఏమరపాటుగా సాగకుండా కాపాడేవి! ఒక నవలలోనో కథలోనో, పాత్రల స్వభావాన్ని లేదా కథ నడతని పొరలుపొరలుగా రచయితలు విప్పుతూ పోవడం మనకు తెలుసు, కానీ ఈ పుస్తకంలో చినవీర కవిత్వంలో అట్లాంటి అద్భుతం చేశారు. పై ఉదాహరణనే తీసుకుంటే, దాని రసస్పూర్తి మనకు అవగతం కావాలంటే మనం ఈ ఒక్క కవితా ఖండికా చదివితే సరిపోదు. ముందువెనుకలుగా ఎన్నో పుటల్లో విస్తరించుకుపోయిన భావాలను మిగతా భాగాలతో కలిపి కుట్టుకోవలసిన బాధ్యత పాఠకుల మీద ఉంది. అనువాదకులకు భాషా సంబంధిత పరిజ్ఞానంతో పాటు, కవితల ఎంపికలోనూ, వరుస నిర్థారించుకోవడంలోనూ కూడా ఎలాంటి పట్టు, మెలకువ ఉండాలో, ఉన్నప్పుడు పాఠకుల అనుభవం ఎంత సంపూర్ణంగా, సమ్మోహనకరంగా ఉంటుందో నిరూపించి చూపించిన పుస్తకమిది.
కవితల ఎంపికలో అనువాదకుడి ప్రజ్ఞ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరొక ఉదాహరణ. కబీరు కవిత్వం సరళంగా ఉంటుందన్నది తఱచుగా మనం వినేమాటే. అయితే పాఠకుడి మనసులో లేని సరళత, పదాల్లో వెదికితే దొరకదు. ఉదాహరణకి ఈ కవిత చూడండి :

ఈ దేహంలోనే గూడు కట్టుకుని

ఈ దేహంలోనే గూడుకట్టుకుని పాట పాడుతున్న ఈ పక్షి గురించి నాకు చెప్పేవాళ్ళెవ్వరూ లేరు.
దానికి రంగు లేదు. రూపం లేదు, ఆకృతి లేదు. తలపులనీడలో కూచుంటుందది. అక్కడే ఎగురుతుంది, తుళ్ళింతలాడుతుంది. ఆహారం నొలువుకుంటుంది.
అదెక్కణ్ణుంచి వచ్చిందో తెలియదు, దాన్నేది పాడిస్తున్నదో కూడా తెలియదు. చిక్కగా అల్లుకున్న కొమ్మల గుబుర్లలో ఆ పక్షి మజిలీ చేస్తున్నది. సాయంకాలం కాగానే గూటికి చేరుకుంటుంది, తెల్లవారగానే ఎగిరిపోతుంది. దాని రాకపోకడలెవరికీ తెలియకున్నవి.
పది కాదు, ఇరవై కాదు, కేవలం రెండు పండ్లు రుచి చూడటానికే వస్తుందది. దాని నిజనివాసమేదో గుర్తుపట్టలేం, హద్దు చూపలేం, వ్యవధి చెప్పలేం. దాని రాకపోకలు మనం కాపుకాయలేం.
సాధుసోదరులారా, ఈ కథ అంత తేలిగ్గా అర్థం కాదు. ఆ పక్షి నిజస్థావరమేదో తెలుసుకున్నవాడే నిజమైన పండితుడంటున్నాడు కబీరు.
ఇప్పుడు ఆ పక్షి ఎవరో, అది రుచి చూడాలనుకున్న రెండే రెండు పళ్ళేమిటో ఆలోచించండి. ముడి విప్పడం తెలియకపోతే మరిన్ని చిక్కుముళ్ళు పడతాయని ఎందుకంటారో ఈ కవిత చెబుతుంది. కబీరు మీకు ఆషామాషీగా అందడు సుమా అన్న సున్నితమైన హెచ్చరికా ఇందులో ఉంది.
*
కబీరు ప్రకటించిన నిర్గుణ భక్తి, ఆయన సహచరుడి గురించి తపించిన విధానం, ఆ ప్రేమను ప్రకటించిన విధానం, ఎలాంటివారైనా సొంతం చేసుకోగలిగిన భావాల్లా అనిపిస్తాయి. ఐహికమైన ప్రేమలు వీటికి ఏ విధంగా దూరం అన్న ప్రశ్న కలిగింది నాకైతే. ప్రేమ అన్న పదం దానికదే ఎంత తీవ్రమైనదైనా, విరహంలో ప్రకటితమయ్యే ప్రేమ అగ్నిలా కాల్చేస్తుంది, కనికరం లేనిదది. కవికి ఉన్నది కనుక, గాజుపలకలాంటి కవిత్వం వెనుక నుండి ఆ వెలుగుని చూపించి వదిలేశాడు. ఆ వేడి చురుకు మనకి తెలిసినా నొప్పనిపించదు, అదే చిత్రం. ఆ వేడిలోని సుఖం అనుభవంలోకి రావడమాలశ్యం, మనమా ప్రేమకి దాసానుదాసులం.
"నిన్న నువ్వు ఏ శరంతో నన్ను గాయపరిచావో ఆ శరం నాకెంతో ప్రీతిపాత్రమైపోయింది. మళ్ళా ఈ రోజు కూడా ఆ బాణంతో నా గుండె చీల్చు, ఆ శరం తగలకపోతే హృదయానికి సుఖం లేదు" అంటాడు కబీరు.
ప్రేమలో పడ్డవారిని పట్టించే అతి సామాన్యమైన విషయమేమిటంటే, వారు ఇష్టమైన వాళ్ళని పదేపదే తల్చుకునే తీరు. ఆ ప్రియమైన పేరుని, ఆ పేరులోని మొదటి అక్షరాన్ని ఎన్నిసార్లో రాసుకుంటారు, వెదుక్కుంటారు, గుర్తు చేసుకుంటారు. అకారణంగా వాళ్ళ పేరు ప్రస్తావనకి తెస్తారు, మురిసిపోతారు. ఈ కబీరు కవిత చదవండి. తొలిప్రేమని తల్చుకోని వాళ్ళుంటారా ఈ కవిత చదివి?
"ఎవరన్నా నాకు ఆయన గురించి చెప్పండర్రా. చూద్దామన్నా కంటికి కనిపించని ఆ మనిషి గురించి ముచ్చటలాడండర్రా.
ప్రతి ఒక్కళ్ళూ పదే పదే ఆయన పేరు తలుస్తారు. ఆ పేరు స్ఫురింపజేసే రహస్యమేమిటో తెలిసినవాళ్ళొక్కరూ లేరు.
కబీరు చెప్పేదొకటే, అతడు మాటల్లో దొరకడు. అలాగని, ఆ పేరు తలవకుండా ఆ రహస్యం కూడా చేతికందదు."
కబీరు ప్రశ్న ఎంత అమాయకంగా కనపడుతోందో అంత గడుసుది. ఈ కవిత చదువుతుంటే నాకు గిలిగింతలు పెట్టినట్టైంది. "ఆ పేరు స్ఫురింపజేసే రహస్యమేమిటో" నని అడుగుతున్నాడు కబీరు. ఆ మహామహా రహస్యం ఎవ్వరూ బయటకు చెప్పరని తెలిసీ అడిగి కవ్వించడం మరొక్కసారి వాళ్ళని ఆ పేరుని తల్చుకునేలా చెయ్యడం కాక మరేమిటి!
అలాగే మనం పూర్తిగా పదంపదం సొంతం చేసుకోగల మరొక కవిత - 

దినాలు సుఖానివ్వడం లేదు


1
దినాలు సుఖాన్నివ్వడం లేదు, రాత్రులు, చివరికి స్వప్నాలూనూ. అతణ్ణుంచి దూరమయ్యాక కబీరుకి ఎండలోనూ సుఖం లేదు, నీడలోనూ లేదు.
2
ఎడబాటు చేసిన గాయం ఒకటే సలుపుతున్నది. తనువూ, మనసూ అల్లల్లాడుతున్నాయి. ఈ బాధ ఏమిటో గాయం చేసిన వాడికి తెలుసు, లేదా నొప్పి మెలిపెడుతున్నవాడికి తెలుసు.
3
పండితుడా, పుస్తకాలు కట్టిపెట్టు, వాటిని తలగడ చేసుకుని నిద్రపో. ప్రేమ అన్న ఒక్క పదం లేనప్పుడు ఎందుకవి? నవ్వుకుంటూ పారేస్తావో, ఏడుస్తూ వదిలేస్తావో, పక్కన పారెయ్యి.
4
దోహాలు వల్లిస్తావు, అర్థం గ్రహించవు, అడుగు ముందుకు వెయ్యవు. మోహసలిలం నదిగా ప్రవహిస్తున్నది, అందులో నీ పాదాలు ఆననే లేదు.
5
ఏ దేహంలో ప్రేమ సంచారం లేదో, అది స్మశాన సమానం. కమ్మరికొలిమిలో తిత్తులు చూడు, ఊపిరి తీస్తాయి, ప్రాణముండదు.

ఈ ప్రేమ కవిత్వం చదివినా, సామాజికవాదం ఉట్టిపడే గొంతుతో అతను పలికిన మిగతా భావనలు చదివినా, ఆ సున్నితత్వం, సూటిదనం, గ్రహింపులోకి వస్తూనే మనకూ అర్థమవుతుంది, కబీరు టాగోర్‌నీ, మహాత్ముడినీ, శిరిడి సాయినీ - ఇలా ఎందరినో ఆకర్షించడానికి కారణమేమిటో. ప్రహ్లాద చరితం, గజేంద్రమోక్షం, గోపికా గీతల్లోని భావాలను ఏమాత్రం శ్రమపడకుండానే గుర్తుతెచ్చే భావాలు కబీరు కవిత్వంలో తారసపడినా, ఈ ఆధ్యాత్మికత కన్నా, వైరాగ్యం కన్నా, మనల్ని ప్రస్తుత పరిస్థితుల్లో బలంగా తాకేవి కబీరులోని ఒక సంఘజీవి ఆశలే. నిజానికి ఈ పుస్తకం ప్రాసంగికత కూడా ఇక్కడే ఎక్కువగా ఉంది. "కులమేదో తెలియగానే కులం చెదిరిపోయింది" అంటూ అతను పలికించిన మానవత్వాన్ని, సమానత్వాన్ని మనమింకా అర్థం చేసుకోవలసే ఉంది, అందుకోవలసే ఉంది.
"వేదాలూ, కొరానూ వివరించలేని దేశం, చెప్తేనో వింటేనో జాతి వర్ణం, కులం కర్మలవల్లనో, సంధ్య, నియమం, నిష్టవల్లనో పోల్చుకోలేని దేశం, మబ్బులు కమ్ముకోకుండానే నిర్విరామంగా వాన కురిసే దేశం, సూర్యుడు ఉదయించకుండానే ఉజ్జ్వలంగా ఉండే దేశం, .." ఇది కేవలం కబీర్ కవిత్వం మాత్రమే కాదు. మనమంతా కబీర్ రహస్యమేదో పట్టుకోగలిగితే పునర్నిర్మితమయే రాజ్యం గురించి కబీర్ కన్న కల.
*
ఈ పుస్తకం చేతుల్లోకి తీసుకున్న ప్రతిసారీ, దుఃఖం ఎవరికి లేదు? అన్న ప్రశ్న వేయి గొంతులతో నన్ను చుట్టుముట్టేదని మొదట రాశాను. అవును, దుఃఖం మనందరిదీ. చిన్నదో, పెద్దదో, చెప్పగలిగినదో కాదో, అలవాటైనదో, కానిదో. కానీ, ఓ నమ్మకాన్నీ ఆధారంగా చేసుకుని అది కార్యాచరణకు మనని ముందుకు తోసేదిగో ప్రయాణాన్ని మలచుకోవడంలో జీవన సాఫల్యత ఉంది కానీ, జరిగిపోయిన అపరాథాలను ఎత్తి చూపుకు పొడుచుకోవడంలో లేదు.
తన అజ్ఞానాన్నీ, మన అజ్ఞానాన్నీ గమనించుకుని, గురువు కోసం వెదుక్కుని, ఎన్నో సంశయాలనూ, ప్రశ్నలనూ దాటుకుంటూ, సమాధానాలు వెదుక్కుంటూ, ఆఖరకు, తన లోకపు పోకడలు చెప్పి అందులోకి అందరినీ ఆహ్వానించే దాకా సాగిన ప్రయాణాన్ని, భద్రుడెత్తి నిలబెట్టిన దారి దీపాల వెలుగులో చూడటం దానికదే ఓ అనుభవం, ఓ పాఠం.
"గురువూ గోవిందుడూ ఇద్దరూ ముందు నిలబడ్డారు, ఎవరి చరణాలకు ప్రణామం చేసేది? గురువుకే నా ఆత్మార్పణ. ఆయనే కదా, గోవిందుణ్ణి నాకు ఎరుక పరిచింది." అన్న కబీర్ మాటలు ఆవహించిన మనిషి కదా, అందుకే ఈ పుస్తకం ముందు మాటలో, భద్రుడంటారు, ఈ పుస్తకం తనకు చిన్ననాట హింది నేర్పిన హీరాలాల్ మేష్టారి చేతుల్లో పెడదామనుకున్నాననీ, వారిప్పుడు లేరనీ, కానీ స్వర్గం నుండి తప్పకుండా స్వీకరిస్తారన్న నమ్మకంతో వారి పిల్లల చేత పెడుతున్నాననీ. నిజానికి ముందుమాటలోని ఈ వాక్యాలు, ఈ పుస్తకం మన మీద నెరపబోయే ప్రభావానికి మచ్చుతునకలు.
మనం చదువుతున్న వార్తలు, చుట్టూ గమనిస్తోన్న సంఘటనలు మౌలికంగా మనముందుంచుతోన్న ప్రశ్నలు వర్గానికీ, కులానికీ, మతానికీ మించి మానవత్వానికి, మానసిక వికాసానికీ సంబంధించినవి, అత్యంత ప్రమాదకరమైనవి. ఇట్లాంటప్పుడు, మౌనంగా ఉండటం అవకాశవాదంగా చూడబడుతోన్న చోట, సంఘటనలైనా పరిస్థితులైనా జీర్ణించుకోవడానికీ, అర్థంచేసుకోవడానికీ స్పందించడానికీ సమయం తీసుకోవడమొక పలాయనవాదంగా పరిగణింపబడుతోన్నచోట, నిజంగా మాట్లాడాల్సి వస్తే, నాకిప్పుడు కబీరులా మాట్లాడాలని ఉంది, కబీరు లాంటి మనసుతో మాట్లాడాలని ఉంది. 

*


ఇట్లాంటి రాత్రుల్లోనే

వానాకాలపు చివరి రోజులు.
భూమిలోకి మేకులు గుచ్చుతున్నట్టే
పడి ఆగింది వర్షం.
చివాలున వీచే గాలికి, చినుకులు
నేల ఝల్లుమనేలా జారిపడుతున్నాయి
పల్చని వెన్నెల రేకలు కొమ్మల దాటుకుని
పొదలను వెలిగిస్తున్నాయి
చీకటి కొసలను కోసుకుంటూ
కీచురాళ్ళ రొద పరుచుకుంటోంది
గిటార్ తీగలను పట్టి తూగుతూ
ఎవరింటి సంగీతమో దిక్కుల్లోకి దూకుతోంది
ఇట్లాంటి రాత్రుల్లోనే ఒకప్పుడు నేను
చినుకుల చప్పుడు వింటూ కూర్చుండిపోయాను,
మా అక్కని కుదిపి కుదిపి
నా తొలియవ్వనగీతాలన్నీ పాడి వినిపించుకున్నాను,
కిటికీ ఊచల మధ్య నుండి ఆకాశాన్ని చూస్తూ
దాని అనంతమైన స్వేచ్ఛని కలగంటూ నిద్రలోకి జారుకున్నాను.
నా తడిచేతులతో శ్రావణభాద్రపదాలను దాటించుకుంటూ,
నేను ఒంటరి ప్రయాణమే చెయ్యాలనుకున్నాను కానీ
కారుమొయిలు మధ్య దూదిపింజెలా మెరిసే ఆకాశపు తునకను
రెప్పలెగరేసి వెదుక్కునే పసిపిల్లను నా నుండి వేరుచేయలేకున్నాను.
నేనెంతో మారాననుకున్నాను,
శరణార్థిలా నా తలుపులు దడదడ తట్టిన వర్షం,
నేనొచ్చేలోపే వెళ్ళిపోయిందని కళ్ళు తడిచేసుకోవడం మాత్రం మానలేకున్నాను.

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....