గోపిని కరుణాకర్ కవిత్వం : "పొద్దున్నే వచ్చిన వాన"

ఆకాశం దాహంతో ఏటిలోకి వంగితే, ఒలికిన చుక్కలన్నింటిని చేపలు పొడుచుకు తింటాయన్న ఊహ కొందరు కవులకే వరమై దోసిట్లో పడుతుంది. గులకరాళ్ళ గూటిలోని గువ్వ పాటని ఎద పదే పదే పాడుకునేలా వ్రాయడమూ కొందరికే సాధ్యపడుతుంది. గోపిని కరుణాకర్ ఆ కోవకు చెందిన కవి. సార్వజనీనత, సర్వకాలీనత సదా వాంఛనీయమైన కవిత్వ రంగంలో ఓ కూడలిలో నిలబడి, ఓ సంధి కాలానికి చెందిన సంఘటనాక్రమాన్ని మాత్రమే తన కవిత్వంగా నమోదు చేయడానికి మొగ్గు చూపిన రైతు బిడ్డ ఇతడు. గుండె పట్టేలా వ్రాయడమే పరిణత కవిత్వ లక్షణమన్న నమ్మకాన్ని స్థిరపరచిన సమర్థుడైన కవి కూడానూ. సౌందర్యము, సత్యము, సాలోచన కలగలసిన త్రివేణీ సంగమమైన కవిత్వాన్ని అందించే కరుణాకర్ కవితల సంకలనం పొద్దున్నే వచ్చిన వాన.

పాలపిట్ట ప్రచురణలు
మార్చ్ 2011. వెల: 50/-
కాల్పనికవాదం, అస్తిత్వవాదం కాలాలకతీతంగా తెలుగు సాహిత్యాన్ని కుదుపుతూనే ఉన్నాయి. కలలు సాకారమయ్యేందుకు పల్లెని విడవక తప్పదని ఒప్పుకున్న మనిషే ఆ పల్లె లోని తన మూలాలను పదే పదే మానసనేత్రంతో చూసుకోవడం తెలియనిది, కొత్తది కాదు. పల్లెల దాకా పాకని ఈ దేశ అభివృద్ధి, అక్కడ స్థిరపడలేని వ్యాపారాలు, ఉపాధిగా మారని కళలు, పల్లె జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో పరోక్షంగా ఈ సంపుటి మనకు చూపెడుతుంది. ఈ కవితల వెనుక అనివార్యమైన ఉత్పత్తిశక్తుల, సంబంధాల సంఘర్షణను రాజకీయ పోరాటంగా కాకుండా, ఊహాత్మక స్థాయిలో జీవితానుభవాలకు దగ్గరగా తెచ్చి కవిత్వంగా మలచిన సృజనకారుడి చాతుర్యం ఉంది. కరువు రక్కసి కోరల్లో చిక్కి, పట్నానికి వలసపోయిన రైతుబిడ్డ హృదయం ఉంది.
ఇతని కవిత్వంలో ప్రధానంగా కనపడే లక్షణాలు ఈ రెండే – పల్లె హృదయం తాలూకు వాస్తవ్యత; వలస జీవుల అస్తిత్వ వేదన. ఈ వేదన స్పష్టంగా కనిపించే కవిత: ఇదంతా మడకసాల్లో పుట్టినవాడి మనేద! (పు. 40).
ఏ కొమ్మపై వాలానో తెలియని మట్టికాకిని
మీ మామిడిచెట్టుపై వాలాను
మీ పిల్లల్లా కాన్వెంటు స్కూల్లో
ఇంగిలీసు అక్షరాలను ఏరుకు తినలేదు
కపిలి తోలుతూ
గొర్రెల తాత పాడిన జనపదానికి పల్లవినైనాను.
మా నాయనతో పాటు మేడి పట్టుకుని
పొక్కు కట్టిన చేనును
నేను పకృతిని
ఋతువును బట్టి రూపాన్ని మార్చుకోవడం నా తత్వం
తాను దేనికి దూరమయ్యాడో దానినే తన కవిత్వంలో వెతుక్కున్నాడు కాబట్టి, ఇతని కవిత్వ భాష కూడా అందుకు అనుగుణంగానే పల్లె యాసలో, పల్లె పదాలతో ఒప్పారుతుంది. జానపద గేయాల శైలిలోనే కొన్ని చోట్ల పాటలల్లినా, పాటలా పదాలల్లినా, అది కవిత్వం కావడమూ (ఎర్రమట్టి గోడ, పు. 35) కనపడుతుంది.
తూరుపోనలో
ఎర్రమట్టి గోడ వొంటిగా తడస్తా వుండాది
చూర్లో నుంచి రాలిపడిన కలలు
నీటిమింద పగిలిపోతా వుండాయి
వొక్కటిగూడ చేతికందడం లేదు
మోడం తునిగి పడింది
దొడ్లోని గొర్రెలు బెదిరి
వొకదాని యెనక వొకటిగా దడిమింద నుంచి ఎగిరిదూకినాయి
బాయిలోకి దొరువిల్లి పూడిసింది
చేనంతా గొర్రెల తాత మట్టిపాదాలు
వాన ఇంగా పెవలమైంది!
ఎద పొంగి ఏరైంది!!
ఇతని కవితలు కూడా కథ చెబుతున్నట్టే ఉంటాయి. పాదాల మధ్య అకారణమైన విరుపులు తక్కువ. సన్నివేశం వెనుక సన్నివేశం పాఠకుల కళ్ళ ముందుకు వడివడిగా తీసుకు వచ్చి, అనుభూతినంతా దృశ్యమానం చేస్తాడితడు. ఈ శైలికి, బహుశా కరుణాకర్ లోని కథకుడు సాయపడి ఉండవచ్చు. కరుణాకర్ చక్కటి కథకుడు కూడా! తన బారతం కథలుకి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నాడు. కరుణాకర్ ఈ కథలను, పొద్దున్నే వచ్చిన వాన సంపుటిలోని కవితలనూ దాదాపు ఒకే సమయంలో వ్రాశాడు. కథకుడిగా అతనికున్న సౌలభ్యాల దృష్ట్యా తన ఆలోచనలను స్వేచ్ఛగా విస్తరించుకు పోయినా, కవితల్లోనూ కథల్లోనూ నేపథ్యాలు అవే, మనకు తారసపడే మనుష్యులూ వాళ్ళే. గుడ్డెవ్వ, గొర్రెల తాత, పాలకొండ మీది మబ్బు, జీనిబాయి గూళ్ళు, ఉత్తీతపాటలు – ఇలా ఎన్నో, మనకు అక్కడా ఇక్కడా దాదాపు ఒకటే ప్రవృత్తితో తారసపడుతూంటాయి. మరోలా చెప్పాలంటే, కథల్లోని కవితాత్మను కరుణాకర్ కుదించి రాసుకున్న నోట్స్‌గా ఈ కవితలు కనిపిస్తాయి.
ఉదాహరణకు, చిల్లుల ముంత (పు. 46) అన్న కవిత, కథాకథన పద్ధతిలో మాంత్రికవాస్తవికతకు చక్కటి నమూనాగా కరుణాకర్‌కు పేరు తెచ్చి పెట్టిన అతని కథ ‘దుత్తలో చెందమామ’కు పరిమిత వ్యాఖ్యలా, ప్రేరణలా అనిపిస్తుంది. ఈ గమనింపు కేవలం శీర్షికలోని సామ్యానికే పరిమితం కాదు. (దుత్త అంటే ముంత.)
పైరు మీద వాలిన జీనిబాయి గువ్వలకు పాలకంకి ఊయల ఉంది
కోటిదీపాల కాంతిని వెదజల్లే చిల్లులముంత ఆకాశమూ ఉంది
జీనిబాయి గువ్వలంటే, బంగారు పిచ్చుకలు (గిజిగాళ్ళు). వాటి చీకటి గూళ్ళని వెలిగించడానికి, చిల్లులముంత లాంటి ఆకాశం నుండి, వెన్నెలో, నక్షత్రాల కాంతో సాయపడుతుందన్నది ఇక్కడ తోచే అర్థం. అయితే, కథ చదివిన వారికి, ఇక్కడ గుడ్డెవ్వ చెప్పిన పిట్టకథ అనాయాసంగా గుర్తు వస్తుంది. (ఈ ఒక్క పిట్టకథను,”గిజిగాడూస్ అండ్ ద ఫైర్‌ఫ్లయ్స్” అన్న పేరుతో కథ.ఆర్గ్ వాళ్ళు ప్రచురించారు.)
రాత్తిరిపూట చెందమామ ఆకాశానికి రాసుకుని రాసుకుని సుంకు రాలితింది. ఆ సుంకే ఈ మినగరబూసులు. ఆ సుంకును తెచ్చి మీ గూళ్ళకు కరిపించుకోండి. అవే మీకు దీపాలు.
ఇది, దేవలోకానికి వెళ్ళి, ‘దీపమెలా పెట్టుకోవాలి మా చీకటి గూటిలో?’ అని అడిగిన జీనిబాయిలకు దేవుడు చెప్పిన ఉపాయమని, కథలో గుడ్డెవ్వ చెప్తుంది. సుంకు అంటే, పాలకంకి గింజ పట్టినప్పుడు రాలిపోయే పొట్టు. గిజిగాళ్ళు గూట్లో బంకమన్ను పెట్టుకుని, ఈ మిణుగురులను అంటించుకుని వెలుగు నింపుకుంటాయని కూడా, కథలో గుడ్డెవ్వ వివరంగా చెబుతుంది. ఆ భావాన్నే ఈ కవితలో వాడుకున్నాడు కవి.
అతని కథల్లోనూ, కవితల్లోనూ వర్ణనల్లోని సారూప్యతకు, మరో ఉదాహరణగా, ఒంటరి నది (పు. 44) కవితనూ, చెరువు కోళ్ళు కథనూ గమనించవచ్చు.
కవిత ఇలా సాగుతుంది:
దాహంతో ఏటిలోకి వంగిన ఆకాశం
ఒలికిన చుక్కలు
పొడుచుకు తింటూ చేపలు
వంతెన ఊయల
ఊగుతూ నది
దాదాపు ఇవే భావాలని ప్రతిఫలిస్తూ కథలో వర్ణన, ఇలా:
నీలాకాసాన్ని మేసి మేసి దప్పిగొన్న తెల్లమోడాలు చెరువులోకి వంగి నీళ్ళు తాగతా ఉండాయి. పగడాల దండను ఆకాసెంలో ఇసిరేసినట్టు, బెల్లాయిల గుంపు. నీటిపైకి తేలి మిలమిలా మెరిసే పొద్దును పొడుసుకోని తింటా ఉండాయి ఎల్లికొరదలూ, బుడ్డపక్కెలూ.
దీపం కతలు సంపుటిలో కూడా, ఉత్తీతపాట, పొద్దున్నే వచ్చిన వాన, వంటి కవితల శీర్షికలతోనే కథలూ కనపడతాయి. ఈ నేపథ్యంలో చూస్తే, కరుణాకర్ కథలనూ, కవితలనూ వేరు చేసి విమర్శ చేయడం కష్టసాధ్యమైన పని. ఒకవేళ ఆ ప్రయత్నం చేసినా, అది అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. కాబట్టి, ఈ రెండింటినీ కలిపి శ్రద్ధగా గమనిస్తే మనకు కొన్ని విషయాలు స్పష్టమవుతాయి. కథకుడిగా కరుణాకర్ నేర్పు అపురూపమైనది. కథకు ఉన్న జాగా అతని ఊహలకూ ఆలోచనలకూ స్పష్టమైన రూపాన్నిచ్చుకోగల వెసులుబాటు నిచ్చింది. వాస్తవికవాదం, విమోచనాత్మక వాస్తవికవాదం, మాంత్రిక వాస్తవికత – పేరేదైనా సరే, అందుకు అనువైన శైలి, శిల్పాలను అతడు సృష్టించుకున్నాడు. ఆ మేరకు ఈ వాదాల మీద చర్చలు చెలరేగే వీలూ కల్పించాడు. ప్రతీ కథలోనూ తన ముద్రను వేసి, కథకుడిగా తాను వాటికి ఎడమయ్యాడు.
కవితల దగ్గరకొచ్చేసరికి, కరుణాకర్‌లో ఇన్ని భిన్న దృక్పథాలు కనిపించవు. తానక్కడ కేవలం రెండే పాయలుగా చీలిపోయాడు. మొదటి పాయలో, అతడికి బాగా తెలిసిన పల్లె ప్రపంచం, అందుకు భిన్నంగా రెండో పాయలో, తానప్పటికి పూర్తిగా ఆహ్వానించలేకపోయిన ఆధునిక జీవితం కనపడతాయి. అతనికి చిరపరిచితమైన ప్రపంచాన్ని చిత్రించేటప్పుడు ఇతనిలో ఏ తొట్రుపాటు, అసంబద్ధత, అస్పష్టత, మార్మికత కనపడవు. ఆ ప్రపంచానికి తగ్గ శైలిలోనే సరళంగా పల్లె ప్రతీకలతో, కొత్త భావాలను పలికించగలిగాడు. ఈ ఒరవడి రెండో పాయలో కనపడదు. ఇది కవికే ఇంకా కొరుకుడు పడని జీవితం. ఇక్కడ కవి గొంతు వేరు. ఇది ‘కృష్ణానగర్ గాలి పీల్చకపోతే ఊపిరి ఆడదని’ చెప్పుకున్న పట్నపు వాసి గొంతు. ఇతడిలో కొంత అస్థిరత ఉంది, కొండొకచో అభద్రతాభావం కూడా ఉంది.ఇతడింకా పూర్తిగా ఆధునికుడు కాలేదు, కావాలనీ కోరుకోవడం లేదు. బాహ్యపరిస్థితుల ప్రభావం పతాక స్థాయిలో జీవితాన్ని శాసిస్తున్న సంధికాలంలో నిలబడి ఉన్నాడు. ఈ దూరం, ఈ సంక్లిష్టత, దానికి తోడుగా మొదలయ్యే అస్పష్టత, దేహం మొండిగోడల మీంచికవితలో (పు. 51) కనపడతాయి.
ఈ కవితలో –

భూమి ఒక సుడిగాలి
ఆకాశమంతా ఒకే కన్ను
సముద్రం ఒకే ఒక్క కన్నీటి చుక్క
తడికె కన్నాల నుంచి చూస్తున్నాను
మూడో కాలొకటి నడచి వస్తోంది
నల్లమబ్బు ఒకటి దేహం మీద వాలింది
అంటాడు. ఇక్కడ కవి తన మనోధర్మానికి లోబడి ఒక సంకేతభాషను రూపొందించుకున్నాడు. దానికి అనువుగా కవితనల్లుకున్నాడు. కవిని ఆ జాడల ద్వారా అందుకోగల సాన్నిహిత్యం పఠితకు లేకపోతే, కవిత అస్పష్టమై అసహనాన్ని కలిగిస్తుంది. దానిని దాటి కవి సమస్యను సహృదయంతో అర్థం చేసుకుంటూ ఈ కవితను విశ్లేషించే ప్రయత్నం చేసినప్పుడు, మనకు బోధపడే విషయాలు ఇవీ:
ఈ కవిత మొత్తంలో కవి స్తబ్దత నిండిన వాతావరణాన్ని సూచిస్తున్నాడు. విశ్వవ్యాప్తమైన ఆకాశాన్ని కుదించి ఒక కన్నుగాను, సువ్యాప్తమైన సముద్రాన్ని కన్నీటి చుక్కగాను చూపిస్తున్నాడు. అంటే, అతడు తన ప్రపంచాన్ని కుదించుకున్నాడు. ఇక్కడ అతడు ఒంటరి. అతడు చూస్తున్నది తడిక కన్నాల నుండి. ఆ చూపుకి విశాలత్వం లేదు. అలా ఉండే అవకాశం ఇవ్వని బాహ్యపరిస్థితుల ప్రభావమది. ఎగిరే కాకి వాలదు, రెప్ప కదిలిన అలికిడి లేదు, కల కలవరింతా లేదు, ఏదీ చేతికందదు, ఏదీ చెంతకు రాదు — అన్న పాదాలన్నీ, ఇదే స్తబ్దతనూ, నిర్లిప్తతనూ చూపెడుతున్నాయి. అతడి దేహం మొండిగోడ. దానిలో కదలిక తేగలిగినదేదో కావాలతనికి. కానీ తనపై తనకు నియంత్రణ లేదు. అందుకే, తానున్న స్థితిని ‘రంపపు కోత’ అన్నాడు. అస్థిరవైఖరి, డోలాయమాన స్థితి, ఈ స్తబ్దతకు తోడయ్యాయి. ‘సగం వంగిన జామకొమ్మకు, పండూ నేనూ వేలాడుతున్నాం’ అనీ, ‘తెగిన గాలిపటం గిరికీలు కొడుతూ పారిపోయింది,’ అనీ అందుకే వాపోతున్నాడు.
వాతావరణ కల్పన జరిపిన ప్రతీకల ప్రయోగం, ఉపయోగం మనకు మొదటి పాదంలో కనపడుతున్నాయి. అటుపైన, పైన ప్రస్తావించిన పదబంధాల ఆధారంగా కవి మనఃస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కవికి ఈ స్థితి ఎలా అయినా చెదిరితే బాగుండన్న ఆశ ఉంది. అందుకు కొనసాగింపుగా, ‘మూడో కాలొకటి నడచి వస్తోంది’ అని, వెంటనే, ‘నల్లమబ్బు ఒకటి వాలింది’ అని చెప్పుకున్నాడు. ఈ నల్లమబ్బు ఏమిటి? ఆ మూడో కాలు దేనికి ప్రతీక? ఏ దేహమూ లేని ఒక కాలు నడిచి రావడాన్ని అధివాస్తవికంగా ఊహించుకోగలమేమో కానీ అర్థం చేసుకోలేం. దాని అంతరార్థం మానసికావస్థ సంబంధియా, లేక అది ఒక లైంగికభావనయా? ఈ ప్రతీకలు తనకు తెలిసిన భాష, సంస్కృతులనుండి తెచ్చుకున్నవా? లేదూ కవి తనకంటూ తయారు చేసుకున్న కొత్త ప్రతీకలా?
పదాల మధ్య ఖాళీలు పఠితలను ఆకర్షిస్తాయి కానీ కవిత్వం అర్థం కాలేని భావాలతో ఉన్నప్పుడు అది అస్పష్టమవుతుంది. ఈ సమస్య నిజానికి కవిది కాదు, ఈ ప్రయాస పాఠకుడిదే అని అనుకోవాల్సిన స్థితి కూడా కాదిది. సరిత్తులాంటి సాహిత్యంలో, ఇదంతా కొత్తగా వచ్చి చేరిన నీరు. కథల నుండి అనుభవాల వైపు కవిత్వం మళ్ళినప్పుడు కూడా కొంత నవ్యతను మనం చూశాం. ఆ అనుభూతి/భావ కవిత్వాన్ని దాటి వచ్చి ఇప్పుడు మనం చర్చిస్తున్న ఈ కవిత్వం — ఆమాట కొస్తే ఈ కాలపు కవిత్వం — వస్తువును కూడా నిరాకరిస్తోంది. అమూర్తభావాల చిత్రణకు కూడా అస్పష్టమైన ప్రతీకలనే వాడేందుకు మొగ్గు చూపుతున్నారు ఈ కాలపు కవులు. ఈ ప్రతీకలు పాఠకులకు కొత్తవి. తమ తమ అనుభూతి, ఉద్వేగాల ఒరవడిలో కవులు వాడిన ప్రతీకల అంతరార్థం ఏమిటో తెలియడం అంత తేలిక కాదు. కనుకే, ప్రతీకలను అర్థం చేసుకుంటూ కవితారసాస్వాదన చేయదలచిన పాఠకులు ఆ ఆధారం దొరక్క అసహనానికి లోనవుతారు.
ఆధునిక కవిత్వంలో సింహభాగం ఇప్పటి మనిషి జీవితంలోని సంక్లిష్టతకూ, సంఘర్షణకూ సరైన రూపాన్నిచ్చే ప్రయత్నంతో ముడిపడి ఉంది. ఆ ప్రయత్నాలు మరిన్ని జరగాలి. ఆ నవ్యతకు ఆహ్వానం పలికితీరాలి. సమర్థుడైన కవి కవిత్వాన్ని కేవలం జీవితంలోని సంక్లిష్టతకు పర్యాయపదంగా మార్చకుండా, తన భావ వ్యక్తీకరణకు సరికొత్త వ్యాకరణం తయారు చేసుకుంటాడు; కొత్త ప్రతీకలు, పదబంధాలు ఏర్పరచుకుంటాడు. పఠితలకు వాటిని అర్థం చేసుకునే దిశగా కొంతైనా వెసులుబాటు కల్పిస్తాడు. ఆ సామర్థ్యమే కవితలోని అస్పష్టతను, క్లిష్టతను నిర్మూలించడానికి సాయపడుతుంది. ఈ ఎరుకతో రాసిన కవిత్వంలో ప్రతీకలకూ అవి సూచించే అంతరార్థానికీ మధ్య ఒక భౌతిక, ప్రాపంచిక సంబంధం ఉంటుంది. ఇందుకు భిన్నంగా, ఇంద్రియగోచరం కాని శైలి, అంతఃసూత్రాన్ని విస్మరించిన పదచిత్రాలు, స్థలకాలాదుల ప్రమాణాలను తిరస్కరించి అసంబద్ధంగా నడిచే కవిత్వము, సమగ్రమైన అనుభవాన్ని పాఠకులకు ఇవ్వలేక నిరుత్సాహపరుస్తాయి.
ఈ సంపుటి మొత్తంలో కరుణాకర్‌ లోని ఒక కొత్త కోణాన్ని చూపిన కవిత ఇది ఒక్కటే కావడం వల్లనే కాక, ఈ సమస్య ఎందరో ఆధునిక కవులది కూడా కావడం వల్ల కూడా ఇంత దీర్ఘంగా చర్చించవలసి వచ్చింది. ఇక్కడ కవి మార్పుకు లోనైన తన సాంఘిక, సామాజిక వాతావరణాన్ని, తద్భవమైన ఆలోచనారీతులను, పాత పద్ధతిలో చెప్పకూడదనో, చెప్పి గెలవలేననో అనుకున్నట్టుంది.
గాలివిసురుల తావిలా తప్పించుకుని
శిరీషసుమ మార్దవపు నవనవలా జారిపోతూ
నులు మూసి, కిలకిల నవ్వి,
కనపడక మాయమయ్యే మనోజ్ఞతను
ఈ త్రెగిన త్రాళ్ళు బెట్టి, వాక్యాల
మొండిగోడల మధ్య ఎలా బంధించడం?
నిండుమదిలో తొణకిన భావావిష్ట మహాఝరులు
నిరర్థక శబ్దాల సహారాసైకతాల్లో ఇంకనీక
జనసాగర సంగమానికి ఎలా అందించడం?
అని ఆనాడే (1955లో) కలతపడ్డాడు బైరాగి (నూతిలో గొంతుకలు, పు. 39, మి. ప్ర. ప్రచురణ, 2006).
పల్లె గాలికి దూరమైనా ప్రకృతి ప్రేమికుడిగానే ఉంటూ, ఆధునికుడిగా గొంతు మార్చుకు వ్రాసిన మరొక కవిత, రెయిన్ ఫారెస్ట్. ఏ కవితలోనైనా, పాఠకుడిని మున్ముందుగా ఆకర్షించేది అక్షరరమ్యత. కవితలో కనపడే సౌందర్యము, లయ ఎటువంటివారినైనా ఆకర్షిస్తాయి. అయితే, గొప్ప కవిత అనిపించుకోవడానికి అంతకు మించినదేదో కావాలి. పొరలుపొరలుగా విస్తరించుకుపోయే అనుభవం, అనుభవైకవేద్యమైన మౌనంలోకి నెట్టే అనుభూతి, కవితలను ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ కవితలో అవన్నీ సమపాళ్ళలో ఉన్నాయి. ‘రవీంద్రుని గీతమై ఎదలోయల్లో హోరున కురుస్తున్న వాన’ అనడంలోనే గొప్ప నేపథ్యం ఉంది. ‘తడిపాదాలతో మెలమెల్లగా నడిచొచ్చావు, చేతులతో కళ్ళు మూశావు’ అని చెప్పడంలో, ఎక్కడా ఇది వాన అని ఇదమిత్థంగా చెప్పడం కనపడదు. ‘తడిసిన శరీరం నులివెచ్చని మంట/ కోరికను వెలిగించుకుని ముఖం దీపమై నిల్చుంది’ అనడంలో శృంగార ప్రధానమైన అర్థం ధ్వనిలో కనపడుతున్నా, ఆ మసక చీకటిలో వానను చూసేందుకు కళ్ళను దీపాల్లా చేసుకుని చూస్తూండడమే అంతర్లీనంగా ఉన్న భావం. ‘నువ్వు ఇచ్చిన ఏడు రంగుల గాలిపటాన్ని/ ఆకాశంలోకి ఎగరవేశాను’ అనే వరకూ, కవి అనుభవిస్తున్నది వాననేనని అర్థం కాదు. వర్షం ఆగిపోయి, నువ్వు (వాన) వెళ్ళిపోయాక, ‘తడి కళ్ళల్లో నువ్వు/ ఒంటరి అరణ్యాన్ని నేను’ అని ముగించడంలో, ఒంటరితనమొక్కటే కనపడుతుంది తప్ప, అందులో ముందరి కవితలో ప్రస్పుటంగా కనపడ్డ వేదన కానీ, చంచలమైన ధోరణి కానీ కనపడవు. అనుభూతిని పదిలపరచుకుని తృప్తి చెందే ధోరణే ఇందులో తుదికంటా తోస్తుంది.

పల్లెటూళ్ళ జీవన చిత్రణలో ఒక సౌందర్యం ఉంటుంది. వర్గంగానో, సంఘంగానో కూడి బ్రతకడంలో దొరికే భరోసాని బలంగా చూపెడుతుందది. పట్టణజీవితపు ఒంటరితనంలో బిగ్గరగా చెప్పుకోలేని, ఒప్పుకోలేని, ఎవరితోనూ పంచుకోలేని, తప్పించుకోలేని వేదన ఉంటుంది. ఆశ్చర్యకరమైన ఈ వైరుధ్యాన్ని ఒకేసారి ఒకే కవితలో, లేదా ఒకే సంపుటిలో స్ఫుటంగా చెప్పడం మామూలు కవులకు దాదాపు అసాధ్యం. కరుణాకర్ మామూలు కవి కాదు.
* తొలి ప్రచురణ : ఈమాట-సెప్టెంబరు, 2016సంచికలో

గజేంద్రమోక్షం- ఆర్టిస్ట్ కేశవ్ గారి కన్నుల్తో..


ఈ కళారూపాన్ని ఏ క్షణంలో చూశానో కానీ, ఇది నా మనసును వదిలి పోవడమే లేదు! గజేంద్రమోక్షాన్ని ఇంత అద్భుతంగా తిప్పి చెప్పగల వాళ్ళు, ఎన్ని జన్మల తపస్సు చేసి, ఆ కృష్ణపరమాత్మను మనసులో నింపుకున్నారో ఊహకందడం లేదు.
"నీరాశ నిటేల వచ్చితి?" అని పదే పదే చింతించి, "ఏ రూపంబున దీని గెల్తు?నిట మీఁ దేవేల్పుఁ జింతింతు" అని వాపోయిన గజేంద్రుడు, అన్నదమ్ముల కొట్లాటలో మొండిగా పోరాడి ఓడి, ఆఖరు నిముషాల్లో అమ్మను సాయం పిల్చుకుని, ఆమె కనపడి చేయందివ్వగానే కరుచుకుపోయి గుండెల్లో తలదాచుకునే పిల్లవాడిలా, - ఆ శ్రీమన్నారాయణుడిని బిగియార కౌగిలించుకున్నాడు. "ఒకపరిజగములు వెలి నిడి, యొకపరి లోపలికి గొనే" శ్రీహరి, ప్రసన్నంగా ఆ గజరాజును చేరదీశాడు. "నిడుద యగు కేల గజమును, మడువున వెడలంగఁ దిగిచి మదజల రేఖల్ దుడుచుచు మెల్లన పుడుకుచు, నుడిపెన్ విష్ణుండు దుఃఖ ముర్వీనాథా!" అంటాడు భాగవతంలో పోతన. అది సరే, గజరాజును మడుగులో నుండి బయటకు లాగి, అతని పైని మదజలరేఖలు తుడుస్తూ, వెన్ను నిమురుతూ ఓదార్చడం దాకా పోతన కన్నుల్తో మనమందరమూ చూసిందే! చక్రహస్తుని రూపమంటారా, "సిరికిం జెప్పని వాడు" , అతడిక్కడెట్లా ఉన్నా చెల్లిపోతుంది, ఆ అలంకారాల్లో లోపాల వైపు నా చూపు వెళ్ళలేదసలు. నన్ను, (ఇంకా ఈ చిత్రం చూసిన ఎందరినో), ఆశ్చర్యపరచిందీ, పదే పదే ఈ చిత్రాన్ని వెదికి వెదికి చూసేలా చేసిందీ, కరి కాదు. మకరి. కరుణా సింధుడు శౌరి చక్రాన్ని పంపి హతమార్చడమే?! ఆ ఊహ కూడా రానీయలేదీ చిత్రకారుడు. ముందే చెప్పినట్టు, పిల్లలిద్దరు కొట్టుకుంటుంటే, ఒకింత బలహీనపడ్డ బిడ్డను అక్కున చేర్చుకున్న అమ్మతనాన్నీ, అమ్మ కనపడానే పంతాన్ని మరిచి, కోపాన్ని మరిచి, తాను చేసిన తప్పేమిటో తెలిసీ, ఏమీ ఎరుగని అమాయకుడిలా మళ్ళీ ఆ అమ్మ పాదాలే పట్టుకు వేలాడే పసితనాన్నీ పటం కట్టి చూపించాడు. హరిలో ఆగ్రహం చూపించలేదు, ఆవేశం అసలే లేదు. మొసలి కళ్ళల్లోనూ తుంటరి పని చేసి దొరికిపోయిన పసిదనమే తప్ప, పశ్చాత్తపం లేదు. పైగా, అలా ఒదిగి పట్టుకోవడంలో అమ్మ నన్నూ ఏమీ అనదన్న ధీమా ! ఆ చేయి, "ఇందరికి అభయమ్ములిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి.." మొసలినీ ఎలా దగ్గరకు తీస్తోందో గమనించే కొద్దీ హృదయం అమృతభాండమైపోతోంది.

ఇదీ కళకు సార్ధకత! ఇదీ!, ఇదే ఏ కళారూపమైనా చేయవలసిన పని. దీనికే మనం దాసోహమయ్యేది. మన లోపలా ఈ వెలుగున్నదని గుర్తు చేస్తున్నందుకే, వారికి కైమోడ్చేది.
గజేంద్ర మోక్షాన్ని కరి మకరి వైరంగా కాక, స్థితికర్త లీలగా, ఆయనే ముగించిన హేలగా హృద్యంగా చూపించిన ఈ చిత్రకారుడి ఊహాచమత్కృతికి వేనకోట్ల వందనాలు సమర్పించడం తప్ప, ఇంకేం చెయ్యగలను?

( One of the finest interpretations of Ganjendra Moksha I have ever seen. Painting by Keshav garu )

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....