సచిన్ టెండూల్కర్

"50 .."
లోలోపల ఎగసిపడుతున్న సంతోషపు తరంగాలని ఆపుతున్న ఒక సందేహం..
"70 "
చేతిలో ఉన్నవన్నీ ఒక్కొక్కటిగా పక్కన పెడుతూ..
"80 "
ఒక్కొక్కరుగా లేచి హాల్లోకీ, వంటింట్లోకి కాలుగాలిన పిల్లుల్లా తిరుగుతూ..
"95.."

హాల్లో టి.వి ముందు ఎవ్వరూ ఉండరు. ఇల్లు ఖాళీ..మనుషులెక్కడో బాల్కనీల్లో చీకట్లో నిలబడి కనపడని చుక్కలు లెక్కపెట్టుకుంటూ..సెకను సెకనుకీ మరింత స్పష్టంగా వినపడుతున్న గుండెను బుజ్జగిస్తూ...

ఆ నిశ్శబ్దంలో నుండి..కింద ఇళ్ళల్లో అకస్మాత్తుగా ఒక కోలాహలం, అరుపులు, కేకలు వినపడేవి. అంతే! అందాకా సంశయంతో ఆగిపోయిన చేతులు కలిసి చప్పట్లతో ఇంటిని హోరెత్తించేవి ! క్షణాల్లో మళ్ళీ హాలు నిండిపోయేది. ఆ కాసేపూ మనుష్యులు లోకాలు మర్చిపోయేవారు. కోపాలు మర్చిపోయేవారు. జీవితాల్లోని అసంతృప్తులు మర్చిపోయేవారు.

హెల్మెట్ తీసి, బరువైన బ్యాట్‌ను ఆకాశం కేసి చూపిస్తూ వినమ్రంగా తల వచి, కుడి భుజంతో నుదురు తుడుచుకుని మళ్ళీ అతడు క్రీజ్‌లోకి వెళ్ళడం...

ఆ క్షణాలు ఎంత అనిర్వచనీయమైనవో చెప్పడానికి నాకు భాష సరిపోదు.

****************
పరీక్షలకు తీసుకెళ్ళే అట్టలను బాట్‌లగానూ, పచ్చి జాంపళ్ళను బాల్స్‌గానూ, కనపడిన ప్రతి గోడ మీదా బొగ్గు ముక్కతో నిలువు నామాలు దిద్ది, వాటిని వికెట్లుగా నమ్మి క్రికెట్ ఆడుకున్న పసితనం నాలోనూ కొంత ఉంది. కాలంతో పాటే అదీ చేజారిపోయింది.

మళ్ళీ ఎప్పుడు ?

పుస్తకాలను పెనవేసుకున్న కబుర్లు


విజయవాడ వెళ్ళడమంటే నాకూ మా అక్కకీ మహా సరదా! అల్లుళ్ళిద్దరూ వస్తున్నారంటే అమ్మ చేతి అమృతపు రుచి పదింతలు కావడం ఒక కారణమైతే, నాన్నగారితో కలిసి ప్రతి సాయంకాలమూ అక్క-నేనూ పుస్తకాల ప్రదర్శనకు కాళ్ళ నొప్పులొచ్చే దాకా తిరగడమన్నది రెండో కారణం. పి.డబల్యూ.డి గ్రౌండ్స్‌లో అక్క పిల్లల చేతులు పట్టుకు పరుగెడుతూ, వాళ్ళ మూడ్ మారిపోక మునుపే వీలైనన్ని పుస్తకాలు కొనాలని ఉబలాటపడుతూ, సిమ్లా బజ్జీల వాసనకు ఒకసారి, గాలిలో తేలి వస్తున్న మసాలా ఛాట్‌ ఘుమఘుమలకు మరో సారి, ముంత జున్ను కోసం ముచ్చటగా మూడోసారి, పుస్తకాల నుండి కాస్త పక్కకు జరిగి, ఇంట్లో సరిగా తినకపోతే అమ్మ చంపేస్తుందన్న మాటను ఒకటికి వందసార్లు విధిగా గుర్తు తెచ్చుకుంటూనే ఇవన్నీ తినేస్తూ తిరగడం, జీవితంలోని అత్యంత మధురమైన అనుభవాల్లో ఒకటి. అబ్బా, సొంత ఊరిలో ఏం మహత్యం ఉందో కానీ, తల్చుకుంటే చాలు ఎన్ని వేల కబుర్లు ఉప్పొంగుతాయో!

ఒకానొక మల్లాది నవలలో, హీరో ప్రతి ఏడాదిలానే పుస్తక ప్రదర్శనకు వెళ్ళి, ఎప్పటిలానే ఎంతగానో వెదికి వెదికి, చిట్టచివరకు ఒకేఒక పుస్తకంతో ఇంటికి చేరతాడుట. నిద్రపోయే ముందు పుస్తకం మూసి, తన లైబ్రరీలో పెట్టబోతూ, ఎందుకో గత సంవత్సరం ఏం కొన్నానోనని చూడబోతే, అది - "జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడం ఎలా" అన్న పుస్తకం. ఆశ్చర్యపోతూ ఆ రోజు కొన్న పుస్తకం పేరు చూస్తే, అదే ఇది. వెంటనే రెండేళ్ళ క్రితం కొన్నది, మూడేళ్ళ క్రితం కొన్నదీ, అసలంతకు ముందు కొన్నవన్నీ లాగి చూడబోతే...ప్రతి పుస్తకం మీదా ఇదే పేరు వెక్కిరిస్తూ కనపడుతుందట. హీరోగారికి అన్నేళ్ళలోనూ పెరిగిన జ్ఞాపకశక్తి అదీ!

అచ్చుగుద్దినట్టు ఇదే కథ కాకపోయినా, ఈ స్థాయిలో కాకపోయినా, మిత్రులకు బహుమతులుగా ఇచ్చేసి కొన్ని, మరీ దగ్గరవాళ్ళు వేడుకోళ్ళు సైతం వినకుండా విదిల్చికొట్టి లాక్కుపోయినవి కొన్ని, పోగొట్టుకున్నవి కొన్ని -ఏతావాతా కొన్నవే కొంటూండటం నాకూ మా అక్కకూ రివాజు. ఈ సారి సఖ్యంగా ఒక ఒప్పందానికి వచ్చాము. "నాదనేదీ నీదేనోయ్--నీదనేదీ నాదే.." అంటూ ప్రేమలు ఒలకబోసుకుని, మార్మిక కవిత్వాలూ(నా కోటా..) - పిల్లల పుస్తకాలూ(మా అక్క వాటా) మినహాయించుకుని, మిగిలినవన్నీ ఇద్దరం కలిసి కొనుక్కోవాలని రాజీకి వచ్చి, సంచీల నిండుగా కొనుక్కుని విప్పారిన మొహాలతో ఇంటికెళ్ళాము. వాటిలో కొన్ని ఎంపిక చేసిన పుస్తకాల గురించి - ఏవో నాలుగు మాటలు - అవి నాకు మిగిల్చిన అనుభవాలూనూ!

ఇష్టమాను నిన్నే...మనసిలాయో...



పోటెత్తిన అలలతో పుడమి కడలైపోవటాన్ని కనులారా వీక్షించి, అటుపై పాల వెన్నెల విరిగి తెలి వెలుగులుగా మారబోయే క్షణాల దాకా సైకత తీరాల్లో అనిమేషివై నిరీక్షించి...కాలం కౌగిట్లో నుండి ఏవేమి కొల్లగొట్టి కొంగు ముడిలో దాచుకున్నావో పదాలలో పెట్టవూ..? ఒక్క అనుభవమూ అవ్యక్తమై నీలో నిక్షిప్తమవకూడదు, దొరలిన నవ్వుల సిరులన్నీ లోలో దాగిపోకూడదు...పందెమే కడుతున్నాను మనసా! - అక్షరాల అమ్ములపొది నిన్నేమైనా గెలిపిస్తుందేమో ప్రయత్నించవూ?
                                                                 ****************
అనంత కాలప్రవాహంలో రెండు రోజులంటే పరిగణనలోనికి రాని పరిచ్ఛేదమే కావచ్చు; కాలానిదేముంది, కళ్ళెమేసే వారు లేరనుకుని తల నెగురవేస్తుంది. సృష్టిలో సౌందర్యమనేది ఒకటుందనీ, ఆ సౌందర్యం అనుభవంలోకి వచ్చిన క్షణాలు కాలాలనూ లోకాలనూ కూడా విస్మరించగల శక్తినిస్తాయనీ - లెక్కలు కట్టుకు గళ్ళను దాటుకుంటూ తమ ప్రతిభకు తామే చప్పట్లు కొట్టుకునే గోడ మీది ముళ్ళకెప్పటికి తెలిసేను, ఎవ్వరు చెప్పేను? మునుపెరుగని మనోజ్ఞ సీమలలో తిరుగాడిన రోజులే కాదు, స్మృతి పథంలో ముద్దరలేసిన ఆ అనుభవాలన్నీ అక్షరబద్ధం చేసుకునే ఏకాంత క్షణాల్లోనూ, మామూలు వేళల్లో మనను పరుగులెత్తించే ఆ మాయావికి, గర్వభంగం అయి తీరుతుంది కదూ!

బ్యాక్ వాటర్స్, సాగర తీరాలూ, జలపాతాలూ, పర్వత శిఖరాలూ, కొబ్బరి చెట్లూ - అన్నీ కాస్త అటునిటుగా అక్కడక్కడే పక్కపక్కనే ఉంటే - అదే కేరళ. కలహంస పంక్తులనూ, కల్హార సౌరభాలనూ ఇంకా మిగుల్చుకున్న భూలోక స్వర్గమది. రెండు రోజుల వ్యవథి ఆ అందాలను చూడటానికి నాబోటి వాళ్ళకి అస్సలేమాత్రమూ సరిపోదు. తమి తీరనే తీరదు. తనువేమో కదులదు.

సాగర తీరాలను స్పృశించి వచ్చే మంద సమీరం చెవిలో ఇంకా రహస్యాలు చెబుతునట్టే ఉంది; అలలు కమ్ముకున్నప్పుడల్లా తడిసిన పాదాలు అవి వెనక్కు మళ్ళగానే మెత్తటి ఇసుకలోకి లాగబడ్డ స్పర్శ ఇంకా సజీవంగానే ఉంది; పడియలు కట్టిన కావి రంగు నీరు ఒక్కోసారీ ఒక్కో తీరుగా కనపడి నవ్వించడమూ గుర్తుంది. రేయి రేయంతా చంద్రికలతో వన్నెలద్దుకుంటుంటే ఏ తీగ చాటునో రహస్యంగా రెప్పలు విప్పుతున్న మొగ్గల పక్కన ఓపిగ్గా కూర్చుని కబుర్లాడుకోవడం జ్ఞాపకాలలో పదిలంగా ఉంది. ఎన్ని కబుర్లని పంచుకోను...అన్నింటి గురించీ సవివరంగా రాయలేకపోయినా, చూసిన రెండు ముఖ్యమైన ప్రదేశాల గురించి -- కాసిన్ని సంగతులు.


మొదటి రోజు - బెంగళూరు నుండి పన్నెండు గంటల ప్రయాణించి -కాసర్‌గోడ్‌లో విడిది - బెకల్ ఫోర్ట్ సందర్శనం

సాగర తీరాన నలభై ఎకరాల్లో నిర్మించబడిన కోట ఇది. భారతదేశపు పది అద్భుతాలలో(2012) ఒక్కటిగా ప్రతిపాదించబడిన పర్యాటక ప్రదేశం కూడానూ. నల్లరాతి కోట గోడలు చూస్తుంటే, తడుముతూ ముందు సాగుతుంటే, ఎన్నెన్ని ఆలోచనలో..! ఒకప్పుడు ఇది దుర్భేద్యమైన కోట. ఒక చక్రవర్తి బలానికి, బలగానికీ, ఆతని పరాక్రమానికి తిరుగులేని సాక్ష్యం. ఇప్పుడో - పల్లీలు చేతబట్టుకు ఒక సాయంకాలం గడిపేందుకు వీలుగా మార్చబడ్డ విహార స్థలం.  ఎందుకో హఠాత్తుగా "రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే" అని శుక్రాచార్యునికి బదులిచ్చిన బలి చక్రవర్తి ఎంత వివేకవంతుడో కదా అనిపించింది.

"ఉరికే చిలకా" పాట గుర్తుందా? బొంబాయి సినిమా! కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని మనీషా కోసం ఎదురుచూస్తూ అరవింద స్వామి పాట పాడింది ఇక్కడే. ఆ పాట తల్చుకోగానే ముందు నేపథ్యంలో వినిపించే మురళీ గానం గుర్తొస్తుంది. మతి చెడగొట్టిన సంగీతం కదూ..! అలా కోట బురుజుల మీద కూర్చుని, సముద్రం మీద పడుతున్న వర్షపు చినుకుల సంగీతం వింటూ కోట లోపలి వైపు దట్టంగా పెరిగిన పచ్చికలో పరుగులిడుతున్న పసి వాళ్ళను చూడడం ఎంచక్కటి కాలక్షేపమో.

మధ్యాహ్నమనగా వెళితే, కాస్త ఎండగా ఉన్నంతసేపూ బీచ్ పార్క్‌లోనూ, ఇక నాలుగు మొదలుకుని బెకల్ ఫోర్ట్‌లోనూ కాళ్ళరిగేలా తిరగడంతోనే సరిపోయింది. కోట బయటా లోపలా కూడా ఊరబెట్టిన ఉసిరికాయల మీద పల్చగా కారం జల్లి అమ్ముతూంటారు. అన్ని గంటల సేపూ నేను ఒకదాని తరువాత ఒకటి తింటూనే ఉన్నాను. హ్మ్మ్..రాస్తుంటే మళ్ళీ పులపుల్లగా తియతియ్యగా ఆఖర్లో కాస్త వగరు రుచి లాంటిదేదో వదిలిన ఆ ఉసిరికాయ ఇంకొక్కటి బుగ్గన పెట్టుకు చప్పరించాలనిపిస్తోంది. సూర్యాస్తమయమయ్యే వేళకు కోట తలుపులు మూసేస్తారు. అరికాళ్ళ మీద ఇసుకంతా ఓపిగ్గా దులుపుకుని, ఇసుక గుళ్ళు కట్టి గవ్వలేరుకునే అలవాట్లు ఉంటే సముద్ర జలాలతో మళ్ళీ చేతులు తడుపుకుని, కోట బయటకు వచ్చేయాలి. పక్కనే హనుమంతుడి గుడి ఉంటుంది. హారతి సమయం. ఎంచక్కా దణ్ణం పెట్టేసుకుని బెల్లం-అటుకులు-కొబ్బరి తురుము కలిపి చేసిన ప్రసాదం దోసిలి నిండా నింపుకు బయటకు వచ్చి నిలబడితే, దూరంగా ఆకుపచ్చ జెండాతో, నెలవంకతో అస్పష్టంగా కనపడే మసీదు కూడా మసకమసకగా చూపులకానుతుంది. బాగుంటుంది, రెంటినీ అలా చూడడం.

రెండవ రోజు....కాసర్‌గోడ్ నుండి అనంతపురానికి ప్రయాణం..

నిశ్చలమైన సరస్సు...మధ్యలో కేరళీయుల దేవాలయ నిర్మాణాలలోని వైవిధ్యతను కళ్ళకు కట్టినట్టు చూపించే అనంత పద్మనాభస్వామి ఆలయం. హరినామ స్మరణతో ముఖరితమవుతున్న దేవాలయ ప్రాంగణంలో జంటగా అడుగులేస్తూ మేమిద్దరం. పక్కకు చూస్తే, తలలు నిక్కించి ఎగిరిపడుతున్న చిరుమీలు కనపడతాయి. ఉన్నట్టుండి నీటి పైపైకొస్తున్న కొంగల తడిసిన రెక్కల తపతప ధ్వనులు, ఎన్నడనగా అక్కడొచ్చి చేరాయో - తెలతెల్లని పావురాయిపిట్టల కురరీ ధ్వనులు...ఇవేమీ అక్కడి నిశ్శబ్దాన్ని భగ్నం చేయకుండా, లయగా ఇమిడిపోయినట్లనిపించడంలోనే ఉంది అసలు మహత్తంతా..!

మెట్లు దిగి, ఆలయంలోకి వెళ్ళి, పంచలోహాలతోనో, రాతితోనో కాక అమూల్యమైన ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడ్డ భూదేవీ శ్రీదేవీ సహిత అనంత పద్మనాభ స్వామికి మనసారా మ్రొక్కాము. దర్శనమైన ఉత్తరక్షణంలో  "పదండి...పదండీ" అంటూ తరిమేయకుండా ఇంకాసేపు అటు పక్క కూర్చుని శ్రీ మహా విష్ణువును ప్రార్ధించండి అంటూ చోటు చూపించిన పూజారులంటే అమాంతం గౌరవం పెరిగిపోయింది. కాసేపాగి, ఆ గుడికి కాపలాగా పిలువబడడమే కాక, దైవాంశ కలిగినదిగా పొగడబడే మకర శ్రేష్టాన్ని చూడటానికి వెళ్ళాము. మేమూ, మాతో పాటు ఇంకో పది మందీ - ఆశ చావక ఎంత సేపు చూశామో- తీరా అది బయటకే రాలేదు. చూసే భాగ్యం కలుగలేదు. అన్నట్టూ - త్రివేండ్రంలో ఉన్న అనంత పద్మనాభ స్వామికి ఇదే మూలస్థానం అని ఇక్కడి వారి నమ్మిక. స్వామి ఈ సరస్సులో నుండి కనపడే గుహలోపలి నుండే అక్కడికి వెళ్ళారని ఒక విశ్వాసం.

                                                                            *****
వెళ్ళే ముందు రెండు గంటలు మళ్ళీ, పాలక్కడ్ బీచ్‌కు వెళ్ళి, తీరానికి కాస్త దూరంగానే కూర్చుని... ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాల కౌగిలిలో నను బంధించేందుకు, నురగల నవ్వులతో ముందుకొస్తున్న సంద్రాన్ని చూస్తుంటే...మనసంతా ఎంత పరవశమో!!

అరుణ కాంతుల పగడపు తునకలు నీవే, నీలిమేఘఛాయలు వాలిన వేళ నీలాలగనివీ నీవే, పకృతి కాంత చిరుచీకట్ల కాటుక దిద్దుకుంటూంటే మరకతమణులన్నీ నీవే, తెలి లేవెన్నెల చాలులో తళతళె దీపించు వేళ ముత్తెపు గుత్తులు నీవే, వర్ణాలన్నీ దోచిన అర్ణవమా, రతనాకరమా...నీ అసమాన సౌందర్యాన్ని వర్ణించదలచిన ప్రతీ ప్రయత్నంలోనూ నిర్దాక్షిణ్యంగా నను ఓడిస్తావెందుకు ?

బి.వి.వి.ప్రసాద్ - "ఆకాశం" అందిన క్షణాలు


"పంచమహాభూతాలను తోచినట్లు కలిపి, తోచినట్లు విడదీసే ఆటలలో
నిన్ను నువ్వూ నన్ను నేనూ మరిచిపోవడం కవిత్వం "

- అని కవిత్వాన్ని నిర్వచించిన వ్యక్తి, అక్షరాలలో మహత్తును నింపి మునుపెరుగని మనోజ్ఞ ప్రపంచాన్ని మనకు పరిచయం చేయని మామూలు కవి ఎందుకవుతాడు? సున్నితమైన భావ పరంపరతో, ఆర్ద్రతతో, ఆశావహ దృక్పథంతో సృజింపబడి, "అపారమైన జీవితానుభవం లేనిదే, జీవించే కవిత్వం వ్రాయలేరు" అన్న ఒక సాహితీవేత్త సత్య ప్రవచనాన్ని పదే పదే గుర్తు చేసిన కవిత్వం, బి.వి.వి ప్రసాద్ గారి "ఆకాశం".

"ఆకాశం" చదివాక, అలతి పదాలతో, లోతైన భావాలను పలికించడం ఇంత తేలికా అని అనిపిస్తే, ఆ తప్పు మీది కాదు. కానీ, జీవితపు లోతులు తెలియకుండా, ఈ కవిలా ప్రగాఢమైన తాత్వికతను నరనరాల్లో నింపుకునే ఆలోచనేదీ లేకుండా, అవే పదాలను ఇటుకలు పేర్చినట్లు పక్కపక్కన పేరిస్తే అదీ కవిత్వమే అవుతుందనుకోవడం మాత్రం అపరాథమే అవుతుంది. అందుకే, ఈ సంపుటిని చదివే ముందు, ప్రసాద్ గారి సాహితీ నేపథ్యం కొంత తెలిసి ఉండటం లాభించే విషయమవుతుంది.

(జనవరి - మార్చి 2012 జయంతి త్రైమాసిక సాహిత్య పత్రికలో బి.వి.వి గారి నుండి సాహిథ్య నేపథ్యాన్ని, "ఆకాశం" రచన వెనుకనున్న ఆలోచనలను రాబట్టిన చర్చలో భాగం - )

ఊహలకందని బహుమతులొస్తే...


"నాకు ప్రైజులన్నా, సర్ప్రైజులన్నా చిరాకు" అని మొహమంతా ముడుచుకుని చెప్పే బ్రహ్మానందం మున్ముందుగా గుర్తొచ్చేస్తాడేమో మీ అందరికీ! :). నాకు మాత్రం ఆ రెండూ భలే ఇష్టం. "వేళ కాని వేళా.." ఎవరో మన ముందుకొచ్చి ఊహించని రీతుల్లో సంబరపెట్టి ఉబ్బితబ్బిబ్బవుతున్న మనను చూసి మనసారా నవ్వేస్తోంటే, ఆ నవ్వుల వెన్నెల్లో తడవాలనుకోని వారెందరుంటారు ? తడి తడి చూపుల మరకలు తుడుచుకుని, విస్మయమంతా మెల్లగా లోలోపల దాచుకుని, విప్పారే పూబాలలమై కళ్ళెత్తి చూస్తుంటే లోకం ఎంత స్వచ్ఛంగా కనపడుతుందో కదూ!

ఒక వయసొచ్చే దాకా, ఇంట్లో చిన్నపిల్లలుగా పుట్టిన నాబోటి వారికి, తీసుకోవడమే తప్ప ఇవ్వడమంటే ఏమిటో తెలిసే అవకాశమే ఉండదు. ఏదైనా ఇవ్వకపోతే అరిచి గోలెట్టడం, ఆ పంతాన్నెవ్వరూ పట్టించుకోకపోతే కాసేపు బెంగపడ్డట్టు నటించి నిద్దరోవడమూ తప్పిస్తే, ఇవ్వడం గురించి అన్నన్ని ఆలోచనలూ ఏమీ ఉండేవు కావు.

చిన్నప్పుడు త్యాగాలంటే ఏం ఉంటాయి ? అరిటాకు కంచం కోసం ప్రతిరాత్రీ యుద్ధం చేయకుండా అక్కకి ఇచ్చేయడం; అమ్మ దుప్పట్లో అక్క కంటే ముందు దూరిపోయి, తల మాత్రం బయట పెట్టి వెక్కిరించే అలవాటుని అప్పుడప్పుడూ మానుకోవడం; సన్నటి సెగ మీద గులాబీ రంగులోకి వచ్చేదాకా మరగ కాచిన పాలతో, కాఫీ పొడి ధారాళంగా వేశాక వేడి వేడి నీళ్ళు తాకీ తాకగానే బొట్లు బొట్లుగా క్రిందకి జారే అమృతం లాంటి డికాషన్ తో, పొగలు కక్కుతున్న అమ్మ చేతి కాఫీను అర చేతుల మధ్య పెట్టుకుని, ఆదివారం ఈనాడు కథను చదవడం దేనికీ సాటి రాదని తెలిసినా, అమ్మ కోసం త్యాగం చేయడం; ప్రతి నెలా ఒకటో తారీఖు పరిపరి విథాల మెప్పించి సాధించిన "పాకెట్ మనీ"ని మట్టి కుండలో నింపుకుని గలగలలాడించి చూసుకుంటుంటే, నెల చివర్లో నాన్నగారు వచ్చి, వడ్డీతో సహా ఇచ్చేస్తానని నమ్మబలికితే తలాడించి ఉన్న డబ్బులన్నీ ఇచ్చేయడం; బెదురుతూ బెదురుతూనే బిట్‌పేపర్ చూపించమని అడిగిన నేస్తానికి ధైర్యం చేసి జవాబులు చెప్పేయడం.

కాంచీపుర క్షేత్ర వైభవం


చిన్నప్పుడు "కంచి" అని ఎవరైనా అనగానే, "కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు.." అంటూ బిగించిన పిడికిలి నుదుటి మీద పెట్టుకుని, కళ్ళు మూసినట్టు నటిస్తూ "సోది" చెప్పడానికి సిద్ధపడేవాళ్ళం. పాతికేళ్ళ క్రితం మా అక్క, అమ్మ చీర చుట్టుకుని, కొప్పు పెట్టుకుని, ఈ "పసి"డి పలుకులను బడిలో అప్పజెప్పి ఓ బహుమతిని నెగ్గించుకున్నప్పుడు తీసుకున్న ఫొటో, ఈ రోజుకీ తన బాల్యపు స్మృతుల్లో భద్రంగా నిలిచే అనుభవమే. కాలి మీద బల్లి పడిందని చెంగు చెంగున ఎగిరి గందరగోళం సృష్టిస్తున్న చిన్న పిల్లలను నిలువరించి, కాసిన్ని పసుపు నీళ్ళు తలపై జల్లి, కంచి వెళ్ళొచిన వారెవరింటికైనా పంపి, తాకి రమ్మనడం తెలుసు. తాకితే ఏమవుతుందో తెలీదు. శ్రీకాళహస్తిలో ఉండే నా ఆత్మీయ మిత్రులొకరి ఇంటికి వెళ్ళి వచ్చేస్తునప్పుడు, నెమలిపింఛం రంగు పట్టుచీర వాళ్ళమ్మగారు ఆప్యాయంగా కానుకిచ్చి, "ఇదుగో బంగారు తల్లీ, కంచి నుండి ప్రత్యేకంగా తెప్పించిన చీర! కామాక్షి అనుగ్రహంతో త్వరగా పెళ్ళి కుదిరి, ఆ కంచిలోనే పెళ్ళి పట్టుచీర తీసుకునేందుకు తప్పకుండా రావాలి సుమా" అంటూ ఆశీర్వదించి పంపిస్తే, ఆ కలనేత చీర సొబగులన్నీ అబ్బురపడుతూ తడిమి చూసుకున్న మధుర జ్ఞాపకమొకటి రెప్పల వెనుక ఇంకా రెపరెపలాడుతూనే ఉంది.

ఇలా అడపాదడపా వినడమే తప్ప, ప్రయాణానికి పూర్వం కంచి గురించి నాది నిజంగా మిడిమిడిజ్ఞానమే! కాంచీ క్షేత్ర వైభవం ఏ కాస్తా తెలుసుకోకుండానే అక్కడికి వెళ్ళినా, ఆ "కంజ దళాయతాక్షి కామాక్షి -కమలా మనోహరి త్రిపుర సుందరి" దర్శనం అయిపోయాక మాత్రం తెలివొచ్చినట్లైంది. తెల్లవారు ఝామున అభిషేకానికి వెళ్ళామేమో, ధారలుగా పడుతూన్న పసుపు నీళ్ళు అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేస్తుంటే, రెప్ప వాల్చకుండా చూస్తున్న అందరికీ అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. అటుపైన తెరల చాటున క్షణాల్లో చేసిన అలంకారం, మమ్మల్ని ముగ్ధులను చేసి, మనసులో ఇతఃపూర్వం ఉన్న ఆలోచనలన్నీ నిర్ద్వంద్వంగా చెరిపి వేసింది. "చంచలాత్ముడేను యేమి పూర్వ - సంచితముల సలిపితినో.. కంచి కామాక్షి నేను నిన్నుపొడగాంచితిని.." అంటూ మనసులో కీర్తించుకోవడమే కర్తవ్యమైన దివ్య క్షణాలవి.

విరహితమ్

పడమటి కొండల గుండెల్లో
ఒద్దికగా ఒదుగుతున్న సూరీడిని
రైలు కిటికి ఊచలకానిన కళ్ళు
దిగులుగా దాచుకుంటున్నాయి.

కలిసినట్టున్న పట్టాలను క్షణాల్లో విడదీస్తూ
నిశ్శబ్దపు పెదవులను శృతిలయల్లో కదిలిస్తూ
విషాద వియోగ విరహ భారాల స్పృహ లేక
జోరుగానే సాగుతోందీ రైలుబండి పరుగు.

బికారి నోట ముక్కలైపోయిన పదాలుగా
ఉండుండీ తాకుతోన్న ఓ విరహ గీతం
ఆకాశపు ఆవలి ఒంపులో ఒణుకుతూ
మిగిలున్న వెలుగుల్లో ముక్కలవ్వని నక్షత్రం

నాకీ నిశీథిలో
మరింకేం గుర్తుకు తేగలవు?

విడివడిన నీ అరచేతి వేళ్ళనీ
ఆగీ ఆగీ ఆఖరకు ఓడిన కన్నీటి బొట్లనీ
రాతిరిలో తడుస్తోన్న గ్రీష్మపు గాలి
జ్ఞాపకాలేమోననుకుని మోసుకొస్తుంటే..

చుట్టూ చీకట్లు పరుచుకుంటున్నా
కళ్ళల్లో సాయంకాలపు సూరీడి ఎరుపలాగే...
తడిగా!

వెన్నాడే అద్భుతాలు

కొండరాళ్ళ మీద
జారుడు బల్లాటలో
ఒకరినొకరు తోసుకునే
చినుకు కన్యలు

వెన్నెల పరుగులకు
వెనుకెనుక పడుతూ
పట్టు చిక్కాక పకపక నవ్వే
సెలయేటి నురగలు

వెలుగు పూలు జల్లే సూరీడికై
రాతిరంతా రహస్యంగా శ్రమించి
రంగవల్లులతో ఆహ్వానం పలికే
గగనపు లోగిలి

అరుణ వర్ణ ప్రభాతాల్లో
చినుకుల చిలిపితనంతో
సెలయేరల్లే తుళ్ళిపడే నన్ను
బంధించి నిలబెట్టే -నువ్వు - నీ నవ్వు!!

శృంగేరీ..సౌందర్యలహరీ!


చూసే కనుదోయి అభిప్రాయాల అల్పత్వం దగ్గరే ఆగిపోకుండా, మనసును తాకి పరవశింప జేసే సౌందర్యాన్ని అణువణువునా నింపుకున్న ప్రదేశాలు అదృష్టవశాత్తూ మన దేశంలో ఇంకా చాలానే మిగిలి ఉన్నాయి. వెర్రి పోకడల నవనాగరికత నీడలు పడని, కాలుష్యమింకా తెరలను పరువని నిష్కల్మష పుణ్యస్థలమైన శృంగేరి శారదా పీఠం తప్పకుండా అదే కోవకు చెందుతుంది.

జాతి వైరాన్ని మరచి ఒక పాము కప్పకు తన పడగ చాటున నీడనిచ్చిన మహత్తరమైన ప్రదేశంలో ఒక్కసారైనా కాలు మోపాలన్న ఆశా, అద్వైతాన్ని నలుదిశలా ప్రచారం చేసి, సనాతన భారతీయ ధర్మోద్ధరణ గావించిన శ్రీ శంకర భగవత్పాదులు ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించిన శారదా పీఠాన్ని దర్శించుకుని ఒక రెండు రోజులు హడావుడి లోకానికి దూరంగా, ప్రశాంతంగా గడపాలన్న కోరిక - తొలుత ఈ రెండే మా అకస్మాత్తు ప్రయాణానికి ప్రేరణలు. అయితే, అనుకోని వరాల్లా, అక్కడ ఉన్న రెండు రోజుల్లోనే ముందు వినని, చదువని (చదివినా ఇంత మనోహరంగా ఉంటాయని ఊహించని) మరికొన్ని ప్రదేశాలు కూడా చూడగలిగాము. అదృష్టమేనేమో కానీ, బెంగళూరు దాటి సగం దూరం ప్రయాణం చేసినప్పటి నుండీ వాన పడే ముందు ఉండే అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం, శృంగగిరి పీఠం ఇంకా చేరకుండానే మనఃస్థితి మొత్తాన్నీ మార్చేసింది. మలుపుల మయమైన ఘాట్ రోడ్ మీద కిటికి పక్కన కూర్చుని చేసిన ప్రయాణం, ఎంత వెనక్కు తోసినా మొహమంతా పరుచుకునే జుత్తు, చెవుల్లోకి సన్నని హోరుతో దూసుకెళ్ళే గాలి, కళ్ళకు హాయి గొలిపే చిక్కటి పచ్చదనం ప్రయాణంలో తొలి ఘడియల అనుభవాలు.

శృంగగిరి అడవి మధ్యలో ఉన్నట్టుంటుంది. నాకు సహజంగానే అడవి ప్రాంతాల పట్ల మక్కువ ఎక్కువ. అందునా పచ్చందనాల కౌగిళ్ళల్లో ఒదిగి హొయలొలికించే చిగురాకులలోనూ, చిరుజల్లుల తాకిడికి తడిసి తల విదుల్చుకునే లేలేత కుసుమాల కదలికల్లోనూ మానవ మేధస్సుకు అంతు పట్టని మార్మిక సౌందర్యమేదో మనసులకు ఎర వేసి లాగేస్తుంది. కాలాలను కట్టి పడేసి, బాహ్య స్మృతి విముక్తులను చేయగల అదృశ్య శక్తేదో ఆ అడవి తల్లి ఒడిలో మాత్రమే భద్రంగా ఉంది.

క్షమ వీరస్య భూషణం


దాదాపు నాలుగేళ్ళ క్రితం..నేను సింగపూర్‌లో ఉన్ననాటి సంగతి. ఒక ఆదివారం నాడు, ఏదో రిలీజ్ వర్క్ ఉండడంతో, నేనూ, నా ఒరియా రూమ్మేట్ కలిసి, ఆఫీసుకు వెళ్ళాం.సాయంకాలానికి అవ్వాల్సిన పని, రాతిరైపోతున్నా పూర్తవ్వలేదు. ఆ ఆఫీసు సన్‌టెక్ సిటీలో ఉండేది. దగ్గర్లోనే ఒక థియేటర్ కూడా ఉండేది. ఎలాగైనా రెండో ఆట వేళకైనా పని పూర్తి చేసుకుని, ఆ పూటకి అక్కడే ఏదో ఒకటి తినేసి, మెల్లిగా ఇంటికెళ్ళాలని మా ఆలోచన. సరే, రంగంలో ఉన్నది మా లాంటి మహామహులు కదా, పని పూర్తవ్వనని మొండికేసింది. చేసేదేం లేక, అనుకున్న ప్రకారం తినడం మాత్రం పూర్తి చేసి, ఒంటి గంటకో రెండింటికో టాక్సీ మాట్లాడుకుని ఇంటికి చేరాం.

సింగపూర్‌లో వర్షాలకు ఒక వేళాపాళా ఏమీ ఉండదు. మేఘాలకు నేల మీద బెంగ రాగానే కన్నీళ్ళు కార్చేసి ఆమె గుండెనీ తడి చేస్తాయి. ఆ రోజు కూడా సన్నగా జల్లులు పడుతున్నాయి. వీధి లైట్ల వెలుగులో కొద్ది కొద్దిగా మెరుస్తూ కనపడే జల్లులను చూస్తూ, ఆ అర్థరాత్రి పూట మా కమ్యూనిటీలో కింద కూర్చుని చదరంగం ఆడుకుంటున్న వాళ్ళను చూస్తూ, మా ఇంటి వైపుకు నెమ్మదిగా అడుగులేస్తున్నాం. మా కబుర్లు మెల్లిగా పాత పాటల వైపుకు మళ్ళాయి..వాన పాటలు ఏ భాషలో నైనా పగలబడి నవ్వుకునేందుకు తప్ప ఎందుకూ పనికి రావని నిర్ణయించాం. "చిట పట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే "- అంటూ నేనొక తెలుగు పాట అందుకోవడంతో, ఆ అమ్మాయి కూడా ఏదో హిందీ పాట పాడడం మొదలెట్టింది..

"  రాత్ బైఠీ హైన్..బాహే పసారే ..షిస్కియా లే రహీ హైన్ సితారే
కోయీ టూటా హువా దిల్ పుకారే ..హుం దం తూ కహా హైన్.. "

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....