సెక్షన్ 4(1)(బి) మీద సంజీవని యుద్ధభేరి!!

(లోక్‌సత్తా టైమ్స్ పక్ష పత్రికలో ప్రచురితమైన మా వ్యాసం )
లోక్ సత్తా సంజీవని..!


అవినీతికీ అన్యాయానికి తావు లేని ఒక కొత్త లోకాన్ని సృష్టించేందుకు నడుం బిగించి ముందుకు వచ్చిన చైతన్య స్రవంతి సంజీవని! అవినీతి రక్కసి కోరల్లో చిక్కుకుని ఊపిరాడక ఆఖరి దశకు చేరుకోనున్న స్వతంత్ర భారతావనికి , ముప్పు తప్పించేందుకు ముందుకు వచ్చిన ఈ ' సంజీవని ' - లోక్ సత్తా అనుబంధ సంస్థ. ప్రజలే పెంచి పోషించిన బద్ధకానికీ, నిర్లక్ష్యానికీ అలవాటు పడి, పని చెయ్యడానికి పూర్తిగా నీళ్ళు వదిలిన కొన్ని ప్రభుత్వ కార్యాలయాల దుమ్ము దులిపేందుకు ముందడుగు వేసారీ సంజీవని సూత్రధారులు.
 
సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి ఐదు వసంతాలు పూర్తి అయిన శుభ తరుణంలో, ఆ హక్కు మనకు అందించ దలచిన ఫలాలను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఏదైనా వినూత్నంగా చెయ్యాలన్న లోక్ సత్తా సంజీవని సూత్రధారుల తలపుల్లో నుండి,తపనలో నుండి పుట్టినదే ఈ 'సెక్షన్ 4(1)(బి) పై యుద్ధభేరి ' ఘట్టం. అందులో భాగంగా, ఒకటో రెండో కాదు..పదులూ ఇరవైలూ కాదు..ఏకంగా 500 ఆర్.టి.ఐ దరఖాస్తులు, ఒకే సెక్షన్ [ 4(1)(బి)] మీద పెట్టి, ఒక చరిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు సంజీవని సభ్యులు. ఈ దరఖాస్తులలో అధిక భాగం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శాఖలు మరియు సచివాలయంలోని వివిధ విభాగాల ప్రథాన కార్యదర్శులకు, మిగిలినవి రంగారెడ్డి, నల్గొండ మరియు హైదరాబాదు జిల్లాల కార్యాలయాలకు ఉద్దేశింపబడినవి. దరఖాస్తులకు వచ్చిన సమాధానాలు స్వల్పంగాను, అసంతృప్తికరంగాను ఉండటంతో సంజీవని బృంద సభ్యులు 350 ఫిర్యాదులు దాఖలు చేసారు.

అన్ని నీవనుచు..

ఆకాశపు కాన్వాస్ మీద అదృశ్య హస్తంతో
అంతరార్ధం వెతకమంటూ అలవోకగా రంగులద్దినా

ఉవ్వెత్తున ఎగసి పడే సాగర వీణియపై
అలల నురగల సంగీతం వినిపించినా

కలయికలూ కన్నీటి వీడ్కోల నడుమ
కాలాన్ని కమనీయ కావ్యంగా మలచినా

ఇసుక తెన్నెల్లో పున్నమి వెన్నెల పరిచి
సౌందర్యానికి సజీవ సాక్ష్యం చూపినా

వొళ్ళు విరుచుకుంటూ వచ్చే మట్టి వాసనను
జడి వానగా మారిన చినుకు స్పర్శకు కానుకిచ్చినా

మనసుల మధ్య యుద్ధాలైనా..సయోధ్యలైనా..
మనుషులు కొందరు మానవత్వం మరచి మృగాలైనా..

"ఎందుకన్నది" రహస్యంగానే మిగిలిపోనీ,
ఈ అసంతృప్తి ఏ కొందరినైనా దహించివేయనీ, పునీతులను చేయనీ!

ఎత్తులకు ఎదిగిపోతున్నానని తుళ్ళిపడే మానవుడు
తానెంత  అసమర్ధుడో ఏనాటికయినా తెలుసుకోనీ..!

ఆకసాన్ని అందుకున్న  గర్వం ఎంత  గొప్పదైనా..
మానసికంగా మరుగుజ్జవడం తప్పని తెలిసిరానీ..!!


By night, an atheist half believes in God. ~Edward Young, Night Thoughts

మానస సంగమం


తొలిసారి కట్టుకున్న కంచి పట్టు చీర అంచుల కిందుగా
దోబూచులాడే  తడి ఆరని పారాణి పాదాల అడుగుల్లో..
కాటుక  కన్నుల  కదలికల్లో దాగనన్న మెరుపుల మధ్య
క్రొంగొత్తగా కాంతులీనుతోన్న కళ్యాణపు  తిలకంలో
ప్రవాహంలా  సాగుతున్న  వేద మంత్రాల  నడుమ
సుముహూర్తాన తలపై వెచ్చగా తగిలిన నీ చేతిస్పర్శలో
రాలిపడే  ముత్యాల  తలంబ్రాల జల్లుల్లో నుండి
రహస్యంగా రెప్పలార్పుకుంటూ చూసే చూపుల్లో
బరువెక్కిన  మరుమల్లెల  పూల జడ  క్రిందుగా
మూడు ముళ్ళతో మెడలో పడ్డ పసుపు తాడులో
ఒళ్ళంతా కళ్ళు చేసుకు వీక్షించిన అగ్నిదేవుడి సాక్షిగా
ఒకరి వెనుక ఒకరం తడబడుతూ నడచిన ఏడడుగుల్లో ..
నా చుట్టూ చుట్టుకున్న నీ చేతుల మధ్య ఒదిగి
ఆకాశంలోని అరుంధతిని చూసిన ఆ అర్థ రాత్రిలో
..అప్పుడే ఎప్పుడో.. ..అక్కడే ఎక్కడో...
మనం సరికొత్తగా జన్మించిన సమ్మోహన క్షణాలేవో దొరలిపోయాయి.
అందాకా అపరిచితుడవైన నిన్ను ప్రియసఖుణ్ణి చేసిన బంధమూ
ఇన్నేళ్ల దూరాన్ని దూరం చేసిన రహస్యమూ
అందులోనే నిశ్శబ్దంగా ఒదిగిపోయాయి.

నీవు లేక...


ఆశల ఆకులు చిగురించే వసంతమో
వడగాలులతో  విసిగించే  గ్రీష్మమో
జడివానల జలపాతాల్లో తడిపే శ్రావణమో
వెన్నెల పరుపులు పరిచే  కార్తీకమో
మంచు పూల పల్లకిలో సాగే హేమంతమో
చలి గాలుల వణుకుల్లో కరిగే శిశిరమో ..

ఏదైతేనేం...నా ప్రపంచం లో రంగులు మారేది
వచ్చే పోయే ఈ వసంత హేమంతాల వల్ల కాదు...
                                                నీ వల్ల..!!

 Loving thoughts of you fill these endless days..Sweet dreams of you, fill my starless nights.. !

*మలి ప్రచురణ : నమస్తే ఆంధ్రా పత్రిక ఫిబ్రవరి 2012 సంచికలో*

ప్రేమే నేరమౌనా..

-
నా పట్ల అతనికున్న నిర్లక్ష్యాన్ని భరించే నిబ్బరాన్ని కోల్పోయాను.

నాకు నేను ఎన్ని సార్లు సర్ది చెప్పుకున్నా, ఈ గుర్తించబడని ప్రేమ ఎంత నిరర్ధకం! మనం ఎవరిని ఆరాధిస్తున్నామో వారికే ఈ ప్రేమ తాలూకు గాఢత తెలీకపోవడం ఎంత బాధాకరం.నా ప్రేమ అతడి గుండెలను తాకిందనీ , నా మనసు అతనికి అర్థమైనదనీ ఒక్క మాటా...కాదంటే నాకొక్క సందేశమో, అదీ  కుదరదంటే చూపులతో ఒక్క చిరునవ్వో  విసిరేస్తే, ఆజన్మాంతం అతడి తలపుల్లో బతకగల బలమేదో ఎలాగోలా కూడగట్టుకుంటాను కదా..!

"నను వినా గతి ఎవ్వరనుచు..నగువో లేక బిగువో..." - ఎవరైనా విన్నారా ఈ త్యాగరాజ కీర్తన..?

ఆ శ్రీ రామ చంద్రుడేమో కాని, ఇతనికి మాత్రం ఖచ్చితంగా నేనంటే ఏదో చిన్న చూపు ఉంది. నేను ఎదురు చూసినంత సేపు కూడా నా కళ్ళ ముందు ఉండడు. నీ లానే నా కోసం ఎదురు చూసే వాళ్ళు కోటినొక్క మంది ఉన్నారు లేవోయ్ అన్నట్టు గర్వంగా చూస్తూ ఎప్పుడూ ఏదో పని ఉన్నట్టు అటూ ఇటూ పరుగులు తీస్తూనే ఉంటాడు. ఎవ్వరూ చూడకుండా అప్పుడప్పుడు నేను చేసే సైగలనీ, అతడికి మాత్రమే వినపడేలా నేను చెప్పిన రహస్యాలనీ అతడు గమనించాడో లేదో, అర్థం చేసుకున్నాడో లేదో, నాకు తెలిసే అవకాశమేదీ కనపడలేదు.అంతు చిక్కని ఆవేదనంతా ఆవిర్లుగా మారి అద్దం లాంటి నా మనసును మసక బారేలా చేస్తోంది.మళ్లీ ఎప్పటికో అతని తలపే తొలి ప్రభాత కిరణమై మసకనంతా ఒక్క పెట్టున తుడిచేసి అక్కడ అతని రూపాన్ని ప్రతిఫలింపజేస్తుంది .

 ఎంత ఆశ్చర్యం కదా...! - వశీకరణ మంత్రమేదో వేసి ఉండకపోతే, నాకు తెలీకుండానే నా మనసు అతని కోసమెందుకు పరితపిస్తుంది?!

పెదవి దాటిన ప్రేమకి నా దృష్టిలో పెద్ద విలువ లేదు. గుండెల్లో భద్రం గా దాచిపెట్టబడి మన ప్రతి చర్యలోనూ తానున్నంటూ పొంగి వచ్చే ప్రేమకున్న గొప్పతనం పొడి పొడి మాటల్లో ఏముంటుంది ?అయినా అన్నేసి గంటలు ఆత్రం గా ఎదురు చూసాక, చిట్ట చివరికి ఎప్పుడో చిలిపి నవ్వులతో ఎదురొచ్చాక, మెరిసే నా కన్నుల్లో అతను చదవలేని భావాలను, పదాల్లో పొందుపరచి వివరించి గెలవగలనంటారా?
ఏదేమైనా, ఇక  నాకు వేరే దారి లేదు..అతనికి నా ఇష్టం అంతా తెలియజెప్పాలన్న తపన నన్ను నిలువనీయడం లేదు.తొలి సారి ఎక్కడ నా మనసు అతన్ని చూసి తుళ్ళి పడిందో, అక్కడికే మళ్లీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాను.నెలలో ఒకటీ అరా రోజులు  తప్పిస్తే అతనక్కడికి క్రమం తప్పకుండా వస్తాడు. ఆ వేణు గోపాల స్వామి గుడి వెనుక కోనేటి దగ్గర ఎవరి కోసమో తచ్చట్లాడుతూ ఉంటాడు.

చివరికి నేను ఆశించిన ఘడియ రానే వచ్చింది. గుడి దగ్గర ఏ కారణం చేతో జనం పలుచగా ఉన్నారా వేళ..నేను ఒంటరిగా ఉన్నాను. అతడు కనిపించాడు..ఎదురుగా వచ్చాడు .ఇంత కన్నా మంచి తరుణం మళ్లీ దొరుకుతుందో లేదో అనుమానమే.కానీ నాకే...ఒక్క మాటా పెగలడం లేదు. అంత ఆవేదనా అక్కడే ఎక్కడో గొంతుకలో చిక్కుకు పోయింది.నా పరిస్థితి చూస్తే నాకే జాలేస్తోంది. రెప్పల కాపలాతో కన్నీటి  నాపుకుంటూ కోనేటి మెట్ల మీద మౌనంగా కూలబడ్డాను.

ఆశ్చర్యం.!

నేను ఊహించినట్టు అతడు నా మానానికి నన్ను వదిలి వెళ్ళిపోలేదు.నెమ్మదిగా నిశ్శబ్దం గా నా దగ్గరికి వచ్చి నన్ను చూసాడు. అతని కళ్ళలోకి చూసాను...
ప్రపంచమంతా మౌనం పరుచుకున్న అనుభూతి . అతడు నన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళకూడదన్న కోరిక  ,ఆ క్షణం శాశ్వతం కావాలన్న అత్యాశ..అన్నీ ఒక్కసారే నన్ను చుట్టుముట్టాయి.నా కళ్ళల్లో కదలాడుతున్న భావాలను చదివినట్టుగా,ఇన్నాళ్ళూ నన్నింత బాధ పెట్టినందుకు నా క్షమాపణ వేడుతున్నట్టుగా నా పాదాల చెంతకు చేరుకున్నాడు.

అప్పుడే నేను ఒక పొరపాటు చేసాను.

నేను మామూలు స్థితిలో ఉన్నట్టలైతే అతన్నిముఖారవిందాన్ని నా చేతుల్లోకి తీసుకోవాలని కోరుకునేదాన్నేమో.కాటుక కళ్ళల్లో నా ప్రేమను కూర్చి , వణికే పెదవుల్లో వలపును చేర్చి తొలి ముద్దిచ్చేదాన్నేమో...కాని నా మనసులో ఏ మూలనో ఉన్నా బాధ నన్ను లోకాన్ని మర్చిపోయేలా చేసింది. అణువణువునా నిండిన వేదన అహంకారంలా మారి కాలు విదిలించేలా చేసింది....

అంతే..!!

నిశ్చలంగా ఉన్న నీరంతా ఒక్కసారిగా చెల్లా చెదురయిపోయింది .తెప్పరిల్లి చూసేసరికి , పాదాల దగ్గరకు వచ్చి నా అలక తీరుస్తాడనుకున్న నా వాడు ఎప్పటి లాగే మళ్లీ అందనంత దూరం లో ఆకాశంలో కనపడ్డాడు.

నా లాంటి అమ్మాయిలను ఎందరినో చూసిన గర్వంతోనో ఏమో..ఏమీ జరగనట్టే, ఏదీ ఎరగనట్టే  నీలాకాశంలో వెలుగులు కుమ్మరిస్తున్నాడు.

ఈ రోజీ శరచ్చంద్రికను  చూసి ఏ అమ్మాయి మనసు పారేసుకోనుందో...!!
*** 
                                                                          

" తెరతీయగరాదా" - కథా విశ్లేషణ - Thanks to Kathajagat :)

Updated :
వంద కథల్లో ఏ కథను ఎంచుకోవాలో అని చాలా బెంగ పడ్డాను మొదట. చివరికి వరుసలో అమ్మ ఇంటి పేరు కనపడగానే ఆగిపోయి కథా అంతా చదివాను. నా ఆలోచనలన్నీ  వరుస క్రమం లో పెడితే, ఇదిగో...ఇలా ముస్తాబయ్యింది.
దీనికి కథా జగత్ విశ్లేషణా  పోటీల్లో రెండవ బహుమతి రావడం ఒక బోనస్ లా ఉంది. దానికి వాళ్ళు నగదు బహుమతి కూడా ప్రకటించడం తో ఆశ్చర్యం రెండితలైంది.Details here -
http://turupumukka.blogspot.com/2010/07/blog-post_28.html
Many thanks to the organizers for giving me a reason to celebrate today! :)
-------------------------------------------------------------------------------------------------------------------------
గుండె తలుపు తట్టిన తలపులన్నీ మైమరపించే కథలు కాలేవు. మంచి కథలో మంచి భాష ఉండాలి.భావోద్వేగం పండాలి.అంతర్లీనంగా మనసును స్పందింపజేసే కథాంశం , చివరి వరకూ చదివించగలిగిన పట్టూ ఉండాలి.మనకి తెలీకుండానే కథలో ఇమిడిపోయేటంత అద్భుతంగా రచన సాగాలి.ఈ లక్షణాలతో, దాదాపు నలభై ఏళ్ళ క్రితం రాయబడ్డ ఒక కథకు విశ్లేషణే నా ఈ రచన.

కొన్ని కథలు సమకాలీన సమస్యలను అతి గొప్పగా చిత్రిస్తాయి. చదివిన రోజున, 'ఆహా..' అనిపించినా , రెండో సారి చదివేటప్పటికే చప్పబడిపోతాయి. మరికొన్ని కథలుంటాయి. అవి ఎల్ల వేళలా ఆలోచనలను రేకెత్తిస్తూనే ఉంటాయి.ఎందుకంటే, అవి మనలో నుండి పుట్టినవి. మనిషిని మనిషిగా చిత్రించేవి. అద్దంలా మారి అక్కడ మనని మనకే చూపిస్తాయవి. మహామహుల ఆలోచనల ఆల్చిప్పల్లో పడి, ఆణిముత్యాలల్లే మారి బయటకు వస్తాయి. కోడూరి శ్రీ రామమూర్తి గారి "తెరతీయగరాదా.." నాకలాంటి ఆణిముత్యమంటి కథలానే తోచింది.

వారి రచన ఒక ప్రవాహంలా సాగుతుంటే, ఆ ఒరవడిలో పడి కొట్టుకుపోవడంలో ఎంత సంతోషం..! పాత్రల తాలూకు ఉద్వేగపు కెరటాలు ఉవ్వెత్తున ఎగసి మానస తీరాలను తాకుతున్నప్పుడు చెమ్మగిల్లిన కన్నులతో ఆఖరి వాక్యాన్ని ముగించి నిట్టూర్చడంలోనూ ఎంతటి పారవశ్యం..!

స్థూలంగా చెప్పాలంటే, ఇది నాలుగు మనసుల కథ. రచయిత ప్రతి పాత్రలోనూ  పరకాయ ప్రవేశం చేసి, వాళ్ళ మనసులోని భావాలని అక్షరాలుగా మార్చి కథ రాసారేమో అన్నంత సహజంగా సాగుతుందీ రచన. బహుశా ఆ శైలే ఈ కథకి నిజమయిన బలమేమో..

ప్రాణమిత్రుడు శేఖర్ ప్రేమ కోసం జీవితాన్ని నాశనం చేసుకున్నాడని బెంగపడి, అతని ఆ స్థితికి కారణమైన అమ్మాయిని నిలదీయాలని ఆరాటపడే రామనాథ్,పైకి మొండిగా, తల బిరుసు గల అమ్మాయిగా కనిపించినా, తన మనసులో ఏముందో ఎవ్వరికీ తెలియబరచక, తెలియబరచలేక,ఆఖరి వరకూ మనం అర్థం చేసుకోలేని ఆవేదనతో తల్లడిల్లిపోయిన ఇందిర,1970 కాలంలో అప్పుడప్పుడే తొలగిపోతున్న జమీందార్ భోగాలను, వారి సహజ లక్షణాలను, ఆలోచనా విధానాలను జ్ఞప్తికి తెచ్చే శ్రీనివాసుగారి పాత్ర ఈ కథకు మూల స్థంబాల్లాంటివి.

కథ విషయానికి వస్తే, ఇందిర పాత్ర మన మనసుల్ని కుదిపేస్తుంది. రామనాథ్ పాత్ర ద్వారా మనం ఉహించుకున్న ఇందిర, కథ ముగిసే వేళకి, ఆయనకి రాసిన ఉత్తరంతో ఆవిష్కృతమయిన అంతరగంతో కొత్తగా కనపడి, ఆలోచనలను మెలి తిప్పుతుంది.

ఆ కాలం జమీందార్లకు స్వతహాగా ఉండే కళాపోషణను, వారి సాహిత్యాభిలాషను శ్రీనివాసరావుగారి పాత్ర ద్వారా కథలో స్పష్టపరచిన తీరు అమోఘం.ముఖ్యంగా త్యాగరాజ  కీర్తనలను ప్రస్తావిస్తూ .."'ఖగరాజు నీయానతి విని వేగ చనలేదో - గగనంబు కిలకూ బహుదూరం బనినాడో -' అన్న పాదాన్ని ఉదహరించడం, దానికొక వినూత్నమైన విశ్లేషణను జోడించడం ఎందరో  సంగీత ప్రియులకు ఆనందాన్ని పంచడంలో అబ్బురమేముంది..? రచయితలోని కవి హృదయానికి ఇదొక మచ్చు తునక మాత్రమే సుమా..!

ఆధునిక భావాలున్న మనిషిని కనుక ఇందిర శ్రీనివాసరావు గారి దగ్గర కొరడా దెబ్బలు తినడం వంటి వాక్యాలను సహించలేకపోయిన మాట వాస్తవం. సమస్యలను ఎదుర్కొనగలిగిన సమర్ధత లేని వ్యక్తులు, తమలోని బలహీనతలను జయించే ప్రయత్నం చేయక, అనుసరణీయం కాని ఒక మార్గాన్ని ఎంచుకుని తప్పించుకోవాలనుకోవడం ఎంత వరకు సబబు అన్న సందేహం, నన్ను ఆఖర్లో కాస్త కలవర పెట్టింది.ఆమె చదువుకున్న అమ్మాయి కనుక, శిధిలమయిపోతున్న గోడలను దాటి బయటకు వచ్చి కుటుంబాన్ని తీర్చిదిద్దుకోగల సమర్ధతను ఆ పాత్ర నుండి ఆశించినా, ఎదురు తిరగక అణిగి ఉండటాన్ని అంగీకరించలేకపోయినా, నా ఈ ఆలోచనలనన్నింటినీ సమాధాన పరచగల రసవత్తరమయిన కథనమేదో నా నోరు నొక్కేసింది. నిజానికి రెండోసారి చదివినప్పుడు, ఇందిర పాత్రలోని ఆ నిస్సహాయతా, నిజాయితీలే కథకి అందమేమో అనిపించిన విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నాను.

"మత్సరమే కాదు మనిషి గుండెల్లో గూడుకట్టుకున్న తెరలు మరెన్నో ఉన్నాయి. మనిషి ఆ తెరని తీయనూ లేడు. వాటి సంగతి మరచి ప్రశాంతంగా వుండనూ లేడు " అన్న నిష్టుర సత్యాన్ని నిండైన కథగా మలచి, "..ధర్మాది మోక్షముల పారద్రోలుచున్న నాలోని మత్సరమను తెరతీయగరాదా..." అన్న త్యాగరాజ కీర్తనను ఆధారంగా చేసుకుని శీర్షికను ఎంచుకోవడం , దాని ప్రస్తావనతోనే కథను ముగించడం సముచితం.

ప్రతి కథకీ ముగింపే కీలకమైనదన్న విషయం మనందరికీ తెలిసిందే.ఆఖరికి మంచి గెలిస్తే మంచి కథనేస్తాం చప్పున. అదే చెడు గెలిస్తే, నమ్మలేనిదేదో జరిగినందుకు నిర్లిప్తంగా పుస్తకాన్ని మూసేస్తాం. ఆంగ్లంలో ఒక చక్కటి వాక్యం ఉంటుంది.." Man will believe only what he wants to believe.." అని. అది అక్షర సత్యం.అయితే, కథల్లో, ఇలా మంచీ చెడూ అని నిర్ణయించ వీలు కాకుండా ముగిసేవి కొన్ని ఉంటాయి. మరపు రాని కథల్లో వాటికంటూ ఒక చోటు వెదుక్కునే ముందు, పాఠకుల మస్తిష్కాల్లో తిష్ఠ వేసుకుంటాయి.

"తెరతీయగరాదా.." ఈ మూడో కోవకే చెందుతుందో లేదో తెలియాలంటే,ఇందిర జీవితాన్ని చదివి ఆమె నిర్ణయం తప్పో-ఒప్పో నిర్దారించాలంటే, కథాజగత్ లోకి అడుగిడి ఈ కింద ఇవ్వబడిన 1969 నాటి అరుదైన కథను చదవడమొక్కటే మార్గం.
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/teratiyaga-rada---koduri-శ్రీరామమూర్తి

ఏకాంతమో...ఒంటరితనమో..


వంద మంది నడుమ ఉన్నా  
ఒంటరితనమేదో బాధిస్తుంది
ఏకాంతాన్ని వెదుక్కుంటూ వెళ్తున్నా
అస్పష్టమైన ఊహేదో వెన్నాడుతుంది.

నేను తప్ప లోకమంతా విశ్రమిస్తుంది
సెలయేరు తన గలగలలాపి నిద్రపోతుంది
ఆకుల్లో ఇందాకటి అలజడి కనపడదు
ఈ గాలిలో పగలున్న వేడి జాడ తోచదు

శరన్మేఘం తన నలుపు చీరను
ఆకాశం మీద ఆరేసుకుంటుంది
వెన్నెల వలువల్లో తాను వెలిగిపోతూ
నల్లబడ్డ నన్ను చూసి నవ్వుకుంటుంది

నిశీధి నిశ్శబ్దంగా నా ముందే కరిగిపోతుంది
నక్షత్రాలింకో లోకానికి వెళ్ళిపోతున్నాయి
లోలోని సంఘర్షణకు సాక్షిగా . . . . .
అక్షరాలిక్కడిలా పరుగులిడుతున్నాయి.                                                                                  
                                                                                                                        
                    

"నిను వినా.."

                                  
ఎవ్వరూ లేని సాగర తీరంలో పరుచుకున్న వెన్నెల్లాగా 
ఏకాంతంలో నీ జ్ఞాపకాలు చుట్టుముడతాయి..
వర్తమానం ఒంటరిదై ముడుచుకుంటుంటే.
ఆలోచనలు పసిపిల్లలల్లే బాల్యంలోకి పరుగులెడతాయి..
పందిరి పై దాకా పాకిన సన్నజాజి తీగల్లాగే..
నా జీవితంలోని ప్రతి ఘడియా నీ ప్రేమతో ముడిపడి ఉంది
కాలం కౌగిట్లో కరిగిన ఒక్కొక్క క్షణం ..అమ్మా!! .
నీ అనురాగ ధారలలోనే తడిసి ముద్దయిపోయింది..!

ఆటల్లో పడి సమయం తెలీకుండా నేనాడి   అలసిపోతుంటే
వందల సార్లు నువ్వు విసుగు లేకుండా నన్ను పిలుస్తుంటే..
అయిష్టంగానే ఇంటికొస్తాను, నీరసంతో నీ ఒడిలో సోలిపోతాను
నువ్వు లేపి ముద్దలు పెట్టే దాకా, మూతి తుడిచి మళ్లీ నిద్ర పుచ్చే దాకా!

అనుకోకుండా ఏ అర్ధ రాత్రో  చదవాలని నేను లేచి కూర్చుంటే
అలసటతో  గాఢనిద్రలోకి జారుకున్న నీకెలా మెలకువొస్తుందో
అంత మగతలోనూ నన్నుత్సాహ పరిచేందుకు ఓపికెలా వస్తుందో
ఆనాడిచ్చిన తేనీటి వెచ్చదనం ఈనాటికీ హృదయాన్ని తాకుతోందిదిగో..

 క్షేమానికై  ఆరాటపడడాన్ని ఆంక్షల చట్రంలో బంధించే యత్నమని భ్రమించి
రెక్కలొచ్చాయన్న ధైర్యంతో రివ్వున ఎగిరిపోవాలని ప్రయత్నించిన ప్రతిసారి
నన్ను వెనక్కి లాగి పొదివి పట్టుకున్నది నీకున్న ప్రేమే తప్ప పంతం కాదని
ఇన్నేళ్ళ తర్వాత అర్థమయ్యాక నా అమాయకత్వానికి నాకే నవ్వొస్తుందెందుకో!

నా జీవితం పూరించలేని సమస్యలా మారి
ప్రతీ ఉదయం భయంతో మొదలైనప్పుడు
వరుస ఓటములతో  ప్రపంచం మసకబారి
ఒంటరితనంతో  దహించుకుపోతునప్పుడు...

ముడుచుకున్న పెదవుల మీద నవ్వులు పూయించిందీ
నా ఉహల చిత్రాన్ని మళ్లీ ఆశల వర్ణాలతో నింపింది నువ్వే!
అపజయాలను దాటుకుని గెలవగల సత్తా ఉందని  నమ్మిందీ
నేను విజేతలా అందరి ముందు వస్తానని విశ్వసించింది నువ్వే !

ఉద్యోగమంటూ  ఒంటరిగా ఊళ్లు వెళ్లేందుకు సిద్ధపడినప్పుడు
వెన్ను తడుతూ నువ్వు వీడ్కోలు చెప్పడానికి వచ్చినప్పుడు
నీ చెంపలను ముద్దాడిన నా పెదవుల నంటిన ఉప్పదనం ......
నీ కన్నీళ్లను దాచిందేమో   కాని  గుండెల్లోని ప్రేమను కాదు !!

నీ అంత ప్రేమను జీవితాంతం పంచే మనిషి కోసం
రేయింబవళ్ళు పరితపించి నాకో సరిజోడు వెదికినా 
నీకు మాత్రం తెలీదా అమ్మా....
నిన్ను మించగల్గిన వాళ్ళు సృష్టిలో ఇంకెవ్వరూ లేరని...ఉండరని....!

*****************         **************************          ****************
published in Koumudi: http://koumudi.net/Monthly/2010/july/index.html       

నిశ్శబ్దపు నిశీధిలోకి...

.
సంగీతంలా లయబద్దం గా సాగిపోయే నదీ ప్రవాహం..ఉండుండి నెమ్మదిగా, కవ్విస్తునట్టుగా..ఏదో రహస్యం చెప్పాలనట్టుగా  గుస గుసగా  నా పాదాల దాకా వచ్చి, మువ్వల పట్టీలను మాత్రమే  ముద్దాడి  పారిపోయే తుంటరి నీళ్ళు.కాలం గుప్పిట్లో నుండి జర్రున జారి గతంలోకి చేరిపోయే క్షణాలల్లె , నా చేతిలోకి చేరాక ఉండలేనంటూ తిరిగి తీరం లోని అనంత రేణువుల్లోకి కలిసిపోతోంది, అప్పటి దాకా సూరీడి  సాక్షిగా మిలా మిలా మెరిసిన ఇసుకంతా..!    


రేయికి రారాజులా చంద్రుడు ఆకాశంలోకి అడుగు పెట్టే వేళయింది. చెలికాడి రాక గురించి వెన్నెలమ్మ తెచ్చిన  వర్తమానం అందగానే, అప్పటిదాకా ఏ అంతఃపురాల్లోనో తమ అందాలకు మెరుగులు దిద్దుకుంటున్న చుక్కలన్నీ, ఒక్కసారిగా వినీలాకశపు వీధుల్లోకి చమక్కుమనే రాజసం ఉట్టిపడుతుండగా , ఠీవిగా అడుగు పెట్టాయి.


మసక వెన్నెల్లో ఇసుక తిన్నెలు అమర్చుకుంటున్న అందాలను, నదినీ నన్నూ ఆవహిస్తున్న చిక్కటి నల్లటి నలుపును  చూస్తుంటే, అప్పటి దాకా నన్ను నిలువరించిన స్తబ్దతను విదుల్చుకోవాలనిపించింది .రాతిరిలో ఏం మాయ ఉందో ఎన్నో ఏళ్ళ నుండీ ప్రయత్నిస్తున్నా , ఈ క్షణానికీ నేను కనిపెట్టలేకపోయాను.


ప్రపంచాన్ని రంగుల్లో ముంచెత్తే పగటి కంటే, అన్నీ రంగులని చెరిపేసి లోకాన్ని ఒక్కటి చేసే నిశీధి నలుపులోనే , నేనర్థం చేసుకోలేని రహస్యమేదో ఉంది.శతకోటి వర్ణాల నొక్క చోట కలిపి ఆ విశ్వేశ్వరుడు చిత్రించిన అత్యద్భుత కళా ఖండంలో అదృశ్యంగా కదలాడుతూ నన్ను అల్లరి పెట్టే అందమేదో ఉంది.  వర్ణాలన్నీ విడిచి చీకటి చీర కట్టుకున్నప్పుడు, మౌన ముద్రలోకి జారిన స్త్రీ లా ప్రకృతి మారినప్పుడు, అచ్చెరువొందించే  ఆ సౌందర్యం ముందు మోకరిల్లి, మౌనంగా ఆ దృశ్యాన్ని కను రెప్పల వెనుక చిత్రించుకోవడం  మినహా ఇంకేం చెయ్యగలను నేను!


" ఆకాశ మా వొరస
ఆవులించిన రేయి
మిసమిసలతో ఏటి
పసలతో ననుసుట్టి
ఈ రేయి నన్నొల్ల నేరవా రాజ
                  యెన్నెలల సొగసంత ఏటి పాలేనటర ..."

అంటూ విరహంతో, విషాదంతో, "కలవరపు నా బతుకు కలత నిదురయ్యింది  "  అని ఎంకి లా బాధ పడే క్షణాలని కాదు రాత్రి నాకిచ్చేది!
రాత్రి, నన్ను నాకు గుర్తు చేస్తుంది. పని ఒత్తిడిలో, పందేలు పడి తీస్తున్న పరుగుల్లో, ఒక రోజంతా ఎలా గడిచిందో కళ్ళ ముందుకు తెస్తుంది.  శక్తికి  మించి పోరాడి ఓడిపోయినప్పుడు నాకు తోడుగా నిద్రా దేవిని పంపించి ఓదారుస్తుంది. ముసుగులను పక్కన పెట్టి, నేను నేను గా మారేందుకు, నిజాయితీగా నిశ్చింతగా నిద్ర పోయి, రేపటిని మరో సారి కొత్త ఆశలతో స్వాగతించేందుకు సంధిగా మారుతుంది.న న్ను నేను మర్చిపోయేందుకు, నేనేంటో నాకు జ్ఞప్తికి తెచ్చేందుకు, నేను సాధించాల్సిన లక్ష్యాలను వెన్నాడే  కలలుగా మార్చేందుకు, కలలను నిజం చేసుకునేందుకు ఒక నిశ్శబ్దాన్ని సృష్టించేందుకు  రాతిరిని మించిన సాయమేముంది ?.


"ప్రపంచంతా నిద్రలోకి జారుకున్న రాత్రుల్లో, తన గమ్యాలను చేరుకునేందుకు విశ్రమించక పోరాడే వాడే విజేత అవుతాడు"  అని చిన్నప్పుడు చాలా చోట్ల చదువుకునే దాన్ని . ఎందుకో ఆ వాక్యం నన్ను విపరీతం గా ఆకర్షించేది. ఎంతలా అంటే , ప్రతి రోజూ గడియారం పది  చూపించగానే తరువాతి రోజు బ్రహ్మాండం బద్దలైపోతుందన్నా  పట్టించుకోకుండా పడుకునే నేను, ఆ వాక్యం చదివిన రోజు మాత్రం నిద్రని పది నిమిషాలు వాయిదా వేసుకుని , బాధగా పడుకునే దాన్ని. కొన్ని రోజులు విజేత అవ్వాలంటే రాత్రే మెలకువగా  ఉండాలనుకుని, "ప్రిపరేషన్"లో భాగం గా పగలంతా బలవంతంగా పడుకుని, మళ్ళీ రాత్రికి కూడా నిద్రని ఆపుకోలేక యధావిధిగా పడుకుని అమ్మ దగ్గర అనేకానేక  తిట్లు తిన్న రోజులు కూడా ఉన్నాయనుకోండి...అది వేరే విషయం.. :)


ఏది ఏమైనా నిశీధి - నిశ్శబ్దం నా స్వప్న లోకాలకు సందిగ్ధపు తెరలను తొలగిస్తూ దారి చూపిస్తూనే ఉంటాయి.ఏడు గుర్రాల రధమెక్కి వచ్చి నా ఏకాంతానికి   ఎవరైనా భంగం కలిగించినా , నా కల చెదిరిపోయినా.. ఒక రాత్రి కరిగిపోయినా...మరో రాత్రి కోసం సాగే నిరీక్షణలోనే  నా జీవితం గడిచిపోతోంది..
కృష్ణశాస్త్రి  గారన్నట్లు ,


మింట నెచటనో  మెరయు చుక్కల
కంట చూచితి కాంక్ష లూరగ
కాంక్ష లూరిన కొలది చుక్కలె 
కాంచి బ్రదుకే గడపితిన్...


"I am like the road in the night listening to the footfalls of it's memories in silence.." - Tagore

ఇంకా తెలవారదేమి....

'ప్రతి రోజూ మా ఉదయం పేపర్ చదవడం తోనే మొదలవుతుంది' అని గర్వం గా చెప్పుకునే వాళ్ళు ఈ దేశంలో లక్షల మంది ఉంటారు. అదే నిజమైతే..వాళ్ళ ఉదయం ఎలా మొదలవుతోంది ?

ఏనాడూ కలిసి లేని మనం , మళ్లీ మళ్లీ విడిపోవాలని ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటుంటే, ఆ వైకుంఠ పాణి ఆడలేని అమాయక ప్రాణాలు ఎలా వైకుంఠానికి పోతున్నాయో బొమ్మలలో చూడడంతోనా?
నిజాలు జనాలను చేరకుండా ఆపేందుకు ఒకరిని మించి ఒకరు ఎలా పోటీలు పడుతున్నారో చూసి నవ్వుకోవడంతోనా?
మంచిని మరిచిన కొందరు మానవ మృగాలు ఆటవిక యుగపు దాఖలాలు మన చుట్టూరా ఇంకా మిగిలే ఉన్నాయని సాక్ష్యం ఇస్తుంటే , అరాచకాన్ని ఖండించలేని పిరికితనంతో వార్తలను చదివి బాధ్యత తీరిపోయింది అనిపించుకోవడంతోనా?
పదేళ్ళ పసి పిల్లాడు అప్పుడప్పుడూ అమ్మా నాన్నలిచ్చే రూపాయి రూపాయి కూడబెట్టుకుని , బళ్ళో వరద బాధితులకి విరాళాలు అడగగానే , ఆ డబ్బంతా ఆనందంగా అప్పజెపితే, అలాంటి డబ్బులను కూడా నిస్సిగ్గుగా సొంత ఖాతాలోకి చేర్చుకున్న మహా మహుల చరిత్రలు చదవడంతోనా?

ఈ దేశం అవినీతికి చిరునామా అని అడగకపోయినా అందరికీ పేరు పేరునా చెప్పి, అన్యాయం వేళ్ళూనుకు పోయిన ఈ సమాజాన్ని ఎన్ని తరాలు మారినా మార్చలేమని మనని మనం ఎమార్చుకోవడం తప్ప ఎప్పుడైనా ఏమైనా చెయ్యాలని ప్రయత్నించామా?

మన ఇంటి ముందు మాన్ హోల్ లో పసి మొగ్గ పడిపోతే, రేపొద్దున వార్తల్లో ఏం రాస్తాడో అని ఎదురు చూస్తాం. ఇండియన్ క్రికెట్ టీం వైఫల్యానికి అర్ధ రాత్రి పార్టీలే కారణమని టీవీ లు అరగంట హోరెత్తిస్తే, తెల్లవారగానే ముందు ఈ విషయం మొత్తం చదవాలని నిర్ణయించుకుని పడుకుంటాం.

ప్రతి చోటా , ప్రతి పనికీ లంచాలు ఇవ్వందే పని జరగడం లేదని వాపోతాం. ఇంకో పది మందికి చెబుతాం. ఎప్పుడైనా ఎవరో ఒక నిజాయితీ కలిగిన రిపోర్టర్ వీళ్ళందరి మీదా ఏమైనా రాసినప్పుడు, నిబద్దత కలిగిన పోలీసులు వెను వెంటనే తగిన చర్యలు తీసుకున్నప్పుడు, మనం చెయ్యలేని పని వేరెవరో చేసినందుకు చప్పట్లు కొడతాం. సంబరాలు చేసుకుంటాం.

ఇక ఇంతేనా? మన జీవితం ఎన్నాళ్ళయినా ఇంతేనా? రావణుడిని చంపడానికి రాముడి రాక కై ఎదురు చూసాం. నరకాసురుడిని అంతమొందించేందుకు మరో అవతారం కావలన్నాం. బ్రిటిష్ వాళ్ళ ఉక్కు పాదం కింద నలిగిపోతూ మహాత్ముడెవడో వస్తాడని నిరీక్షించాం .
ఇక చాలు. మహాత్ముడు తన సైన్యం తో మనకి స్వాతంత్ర్యం సాధించి పెడితే, అది మనకి మరో అస్త్రం ప్రసాదించింది.

రాముడి కోసం, కృష్ణుడి కోసం ఈ సారి ఎన్ని యుగాలు ఆగాలో మనకీ తెలీదు.ఒక వేళ మనం అంతా ఓపిగ్గా ఆగినా, సాక్షాత్తూ ఏడు కొండల మీదే మోసాల ముసుగు కప్పిన ఘనుల మీద అలిగి ఇటు వైపు చూడబోనని స్వామి వారు ఈ పాటికే శ్రీదేవి కి మాటిచ్చి ఉండరూ ? పోనీ , మహా లక్ష్మి దయ కలిగినదై ఒక్కసారి వాళ్ళని కరుణించండని నచ్చజెప్పి పంపిందే అనుకుందాం, ...'నకిలీల' హవా నడుస్తున్న భూలోకం లో, తనని నమ్మరన్న సంశయంతో భగవంతుడు మధ్యలోనే వెను దిరిగి వెళ్ళిపోతేనో.. ?

కనుక ఈ లోపు మనమే యుద్ధం ప్రారంభిద్దాం. కనపడ్డ ప్రతి అవినీతి పరుని మీద మన అస్త్రాలని ప్రయోగిద్దాం.అన్యాయం జరిగిందని చదివి వదిలెయ్యకుండా, దాని చరిత్ర తెలుసుకుందాం. ౧౦ రూపాయల స్టంప్ ఖర్చుతో, సంబంధిత వివరాలను ఇంటికి తెప్పించుకుని పోరాటం సాగిద్దాం. పెద్ద పెద్ద విషయాల్లో తల దూర్చడం ఇష్టం లేదనుకుటే, మీ కోసమే వాడుకోండి. గ్యాస్ కనక్షన్స్ అనుకున్నట్టు  రాకపోయినా, పాస్పోర్ట్ పనులకు, విద్యుత్ శాఖని నిలదీయుటకు ...ఇలా ప్రతి ప్రభుత్వ శాఖని ప్రశ్నించే అధికారం పొందండి.ఇది మన హక్కు..!!
ఇంతకీ దాని పేరేమిటో చెప్పలేదు కదూ..  "సమాచార హక్కు చట్టం".
మనకి దీనిని మించిన బలం లేదు .తలదన్నే ఆయుధం మరొకటి లేదు.  ప్రతి పనికీ, ప్రతి కష్టానికి ఇది ఒక ఉపాయం చెప్తుంది, మనం కలలు కనే భారతాన్ని కళ్ళ ముందుకు తెస్తుంది.

ఇప్పటి దాకా ఏమేం సాధించామో ( ఒక చిన్న గ్రూప్ ద్వారా) తెలుసుకోవాలంటే, "లోక్ సత్తా సంజీవని" ని అడగండి.
http://www.loksattasanjeevani.blogspot.com/
ఇవి కేవలం సంకల్ప బలమే తప్ప మంది బలం లేని ఒక చిన్న గ్రూప్. కేవలం ఎలక్షన్స్ ముందు మనని ఊదర గొట్టి పారిపోయే రాజకీయ పార్టీల్లా  కాక, ఒక లక్ష్యం తో ముందుకి వెళ్తున్న వారికి, ఒక్కసారి అభినందనలు తెలియజేద్దాం. కుదిరితే మన వంతు సాయం చేద్దాం.

అబ్బే, లేదండి ..మాది ఆమ్యామ్యా బండి, "ఇవ్వడం- తీసుకోవడం" మా ఆచారం ..ఆ గుంత లో నుండి బయటకు రాలేం అంటారా....ఎప్పుడు  తెల్లారుతుందా..ఈ రోజు ఏ వార్తని ఖండిద్దామా...ఎవరిని నిందించి పక్కకి తప్పుకున్దామా ,అని ఆలోచిస్తూ..ఆనందంగా ఈ  జన్మ కిలా కానీయండి.. :)

- మానస చామర్తి

ప్రతి పేరుకీ వెనుక...

...ప్రయోగాలకి జడవని ఒక జంట ఉంటుంది.

అలాగే ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ విపరీతంగా అలవాటైన శబ్దం/మాట ఒకటి ఉంటుందట. నూటికి తొంభై కేసుల్లో , అది వాళ్ళ సొంత పేరే అయి ఉంటుందిట.ఈ మధ్యనే ఎక్కడో చదివాను. ( సాక్ష్యాలు చూపించబడవు ).

అయినా సాక్ష్యాలు గట్రా దాకా ఎందుకు , ఇది మనలో చాలా మందికి అనుదినం అనుభవంలోకి వచ్చేదే కదా..! బాగా రద్దీగా ఉండే ఒక బజారుకి మన వాళ్ళతోటి వెళ్లి, ఏవేవో కొనే హడావుడి లో తప్పిపోయాం అనుకోండి. అమ్మో..అక్కో..గట్టిగా ఒకసారి మన పేరు పిలవగానే అంత హడావుడిలోనూ అది మనకి ఖచ్చితంగా వినిపిస్తుంది.

నిశ్శబ్దం గా ఉన్న క్లాసు రూం లో, ఆఖరు బెంచీలో కూర్చుని పక్క వాళ్లతో చాలా సీరియస్ గా చుక్కలాట ఆడుతున్నప్పుడు , ప్రపంచంలో జరిగేవన్నీ పై వాడికి ప్రతి క్షణం తెలిసిపోయినట్టే ...మనకీ మన పేరు ఎక్కడ ఎవరు తలుచుకున్నా వినపడి, వాళ్ళు దూరంగా మొదటి  బెంచీలో ఉంటే ఎగిరి దూకైనా సరే సమాధానం చెప్పెయ్యాలన్న ఆసక్తి కలుగుతుంది.ఆ తరువాత మన ఆవేశం చూసి టీచర్ పేరు పెట్టి పిలుస్తూ "గెట్ అవుట్" అని అరిచినప్పుడు వేరే అనుభూతి కలుగుతున్దనుకోండి...అది ఇప్పటికి నేను వివరించలేను .

ఒకటో తారీఖు రాగానే..డబ్బుల లెక్కలు కట్టుకుంటున్న అమ్మ-నానగారు.." మానస ఈ నెల అస్సలు చదువు వెలగబెట్టలేదు కాబట్టి ఎప్పుడూ ఇచ్చే వందలో యాభై తీసేసి మిగిలింది ఇద్దాం" అనుకుంటున్నారనుకోండి..పక్క గదిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏకాగ్రతతో చదువుకుంటున్న నాకు ఎలా వినపడేదో ఏమో వినపడిపోయేది.మరు క్షణం లో నేను ఆదరా బాదరాగా వంటింట్లోకి వెళ్లి, యాలకులూ అవీ వేసి బ్రహ్మాండమైన టీ పెట్టి , చదువుకుంటున్న పుస్తకాన్ని బోర్లించి , దాని మీద ఈ కప్పులు పెట్టుకుని వాళ్ళ ముందుకు వెళ్లి నిల్చునేదాన్ని.
                          టీ కాఫీ లంటే సాక్షాత్తూ ఆ సాగర మధనం లో ఉద్భవించిన అమృతానికి మోడరన్ రూపాలని మనసా వాచా కర్మణా నమ్మే మా నాన్నగారు, ఆ కప్ అందుకోగానే అన్ని మర్చిపోయి అమ్మ వైపు తిరిగి.." అయినా చదువెందుకు చట్టుబండలవనూ, పిల్లల దగ్గరా మన పొదుపు....పసి దానికి వందేమిటి వెయ్యిచ్చినా తప్పులేదు...' అంటూ నా వాటా నాకిచ్చేసే వారు . ఆ వంద నాకిచ్చినందుకు నెలంతా నేనెలా ఉండాలో, ఏమేం చదవాలో ఆశువుగా చెప్పేసి ..అలాగే ఉండకపోతే వీల్లేదంటూ అమ్మ బలవంతంగా వేయించుకునే ఒట్లను తప్పించుకోవడానికి నేను కిక్కురు మనకుండా అక్కడి నుండి జారుకునేదాన్ని .

ప్రాణానికి ప్రాణం గా ప్రేమించుకునే ఇద్దరు సాయం కాలం సాగర తీరానికి వెళితే, తడి ఆరని ఇసుక తిన్నెల మీద కాలి వేళ్ళతో ఇద్దరి పేర్లూ కలిపి రాసుకోవడమే వాళ్ళు చేసే మొట్ట మొదటి పని. పరుగెత్తుకొచ్చే ప్రతి అల్లరి అలా, అక్షరాలతో అలా ఒకటైన జంటని ఎక్కడ వేరు పరుస్తుందో అని, అర చేతులు అడ్డు పెట్టుకుని ఆపుతూ, "రాళ్ళలో..ఇసుకల్లో రాసాను ఇద్దరి పేర్లు .." అని పాడుకోవడం ఎంత మధురమైన అనుభూతి!

ఒక ఈడు వాళ్ళంతా గుంపుగా చేరి "దాగుడు మూతా..' అని అరుస్తూ ఆడుకుంటుంటే, మన పేరెక్కడ చెప్పేస్తారో అని భయ పడడాలూ, దాక్కోవడాలు ఎంత అల్లరి జ్ఞాపకాలో కదా...!  బడిలో జరిగే పోటీల్లో విజేతల పేర్లు ప్రకటించేప్పుడు, 'మొదటి బహుమతి గెలుపొందిన విద్యార్ధి ...' అని టీచర్ సస్పెన్స్ కోసం క్షణం  ఆగినట్టే ఆగి , మనకే వినపడేలా కొట్టుకుంటున్న గుండె లయలను రెట్టింపు చేస్తూ , రెండో క్షణం లో మైక్ లో మన  పేరే పిలిస్తే ,ఒక విధమైన ఉద్విగ్నతతో..అంతు తెలియని ఆనందం తో తూనీగలా స్టేజి మీదకి పరుగెత్తి వెళ్లి హోరెత్తించే చప్పట్ల మధ్య ప్రైజ్ తీసుకోవడం ఎంత గమ్మతైన గర్వానిచ్చే అనుభవం!

ఇలా చెప్పుకుంటూ పోతే...పేరు పేరుకో మరపురాని జ్ఞాపకం. ప్రతి పేరుకీ గుర్తొచ్చే ఒక  అందమయిన అనుభవం.

ఇంత గొప్పదైన పేరుని, మనిషి జీవితం లో అతి ముఖ్యమైనా పాత్ర పోషించే ఈ పేరుని చాలా మంది తల్లి దండ్రులు చిన్నచూపు చూడడం నాకు బోలెడంత బాధని కలుగజేస్తుంది. అలాంటి వాళ్ళందరినీ ఖండించడానికే నేను ఈ టపా రాయడం మొదలు పెట్టానసలు . పిల్లలు పెద్దయ్యాక ఏమంటారో అన్న కనీస భయం లేకుండా వాళ్లకి తోచిన పేర్లన్నీ పెట్టడం , ల్యాబ్ లో ప్రయోగాలు చేసినట్టు చెయ్యడం ఏమన్నా బాగుందా?

నాకు తెలిసిన శిష్ రాధిక అనే ప్రేమ జంట పెద్దలకి అంగీకారం కాకపోయినా పెళ్లి చేసుకుని, ఈ మధ్య వాళ్లకి పుట్టిన పాపకి "ఆరా" అనే పేరు పెట్టుకున్నారంటే నమ్ముతారా ? నాలో సగం, తనలో సగం కలిపితే "ఆరా" అని సగర్వం గా చెప్పుకు తిరుగుతుంటే ఆ గోల భరించలేక, ఒకసారి ఒళ్ళు మండి 'అర అర కలిపితే ఒకటి అవుతుంది రాధి..పేరేమైనా మార్చగలవేమో ప్రయత్నించరాదూ ' అని చెప్పి చూసాను. అక్షింతలు మనకి కొత్తవి కావు కదా !

ఇలాగే ఇంకో కధ. ఈ సారి నా మనసుకు కొంచం దగ్గరైన క(వ్య) ధ.

మా అక్కకి కవల పిల్లలు. ఆడపిల్లలా..మగ పిల్లలా అని అడిగితే నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి :).
పిల్లలు పుట్టాక, హాస్పిటల్ నుండి డిస్ఛార్జ్ అయ్యి ఇంటికి వచేస్తుంటే, దారిలో నేను తన చెయ్యి పట్టుకుని  ఆత్రం గా 'అయ్యో అక్కా!! మనం ఒక విషయం పూర్తిగా మర్చిపోయాం " అని ఖంగారు గా చెప్పాను.
అసలే కవల పిల్లలు పుట్టగానే ఉండే బోలెడన్ని టెస్టుల్లో ఏదైనా మర్చిపోతున్నామేమో అని చాలా టెన్షన్స్ లో ఉన్న అక్క, ఇంకా ఖంగారు పడిపోతూ.."ఎక్కడ, ఎప్పుడు, ఆసుపత్రిలోనా ? ' అని అడిగింది.
"అది కాదక్కా..! మనం పిల్లలకి అసలు పేర్లయితే నీకు పెళ్ళైనప్పటి నుండి ఆలోచిస్తూనే ఉన్నాంలే కాని, ముద్దు పేర్లు వెదకి ఉంచుకోవడం మర్చిపోయాం, రేపటి నుండి ఏమని పిలుస్తాం ? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పిచ్చి పిచ్చి పేర్లతో పిలిస్తే, ఎంతైనా బాగోదు కదా ! "....చాలా బెంగపడుతూ చెప్పాను నేను.
"ఓస్ ఇదా..నువ్వేం ఖంగారు పడకు. నేనూ బావా కలిసి వాళ్లకి ముద్దు పేర్లు కూడా ఆల్రెడీ సిద్ధం చేసేసాం" అండి గర్వంగా నవ్వుతూ .
"హమ్మయ్య! చాలా మంచి పని చేసావు , నాకసలే పిచ్చి పిచ్చి ముద్దు పేర్లంటే మహా చిరాకు. నువ్వు - బావ సెలెక్ట్ చేసారు కాబట్టి ఖచితంగా బానే ఉండి ఉంటాయి. ఇంతకీ ఏం పేర్లు.." ఇహ ఆగలేనట్టు అడిగాను.
"పప్పీ అండ్ బుడ్డి " అక్క మొహం మీద మళ్లీ అదే గర్వం తో కూడిన నవ్వు.
బాగా హుషారుగా ఊదుకుంటున్న బూర నా మొహం మీదే 'ట్టాప్ప్" మని పేలినంత నొప్పి కలిగింది నా మనసుకి.
"ఈ పప్పీ ఏంటి చంటి కుక్క పిల్లకి పెట్టినట్టు..ఈ బుడ్డి ఏంటి.. బడ్డి కొట్లో సోడా బుడ్డి అన్నట్టు...ప్లీజ్ అక్కా !...వీళ్ళకి ఊహ వచ్చాక ఈ పేర్లా మాకు పెట్టేది అని నిన్ను అనరాని మాటలు అంటారు.నీకింత కన్నా మంచి పేర్లు తోచకపోతే , అమ్మ మనని పిలిచినట్టు అసలు పేర్లతోనే పిలిచెయ్, అంతే కాని ..మరీ ఇలా..."
"షటప్! నువ్వు ఎవరి పేర్ల గురించి ఇలా కుక్క పిల్ల - సబ్బు బిళ్ళ అంటున్నావో తెలుస్తోందా..! " నేను పూర్తి చెయ్యక ముందే గయ్యిమంది అక్క.
నేనేమైనా వేంకటేశ్వర స్వామి నామాలని తప్పుగా ఉచ్చరించి పాపం మూటగట్టేసుకుంటున్నానా అని నిజంగానే ఖంగారు పడిపోయాను.
"ఈ పేర్లతోనే వాళ్ళని పొట్టలో పడ్డప్పటి నుండీ పిలుస్తున్నాం, ఏ రోజూ ఎదురు తిరిగి ఒక్క మాట కూడా అనలేదు, తెల్సా.." - మళ్లీ గయ్యి గయ్యి..అక్కే..!
"అంటే అక్కా..! దేవుడు పిల్లలకి మాటలు ఇవ్వడానికి కొంచం టైం తీసుకుంటాడు కదా పాపం.."
"మాటలు ఇవ్వలేదు. నాలుగు కాళ్ళు..నాలుగు చేతులు ఇచ్చాడు,నచ్చకపోతే తన్ని చెప్పడానికి . అవన్నీ ఆనందంగా ఆమోదించిన పేర్లు ఇవి. ఇక నువ్వు దయ చేయవచ్చు ." అని దయ లేకుండా నన్ను నానా మాటలూ అని నా మనసును తీవ్రం గా గాయపరిచింది.
తీవ్రమైనా గాయం కాబట్టి నాలుగు  నెలలైనా అది మానలేదు.ప్రతి రోజూ నేను దగ్గరికి వెళ్ళగానే.."పప్పీ! పిన్ని వచ్చింది రామ్మా..బుడ్డీ ఎక్కడున్నావ్  ఇలా రామ్మా.." అని పిలుస్తుంటే విని భరించలేక , ఒక రోజు నేను అమ్మ దగ్గర కూర్చుని, వాళ్ళ ముద్దు పేర్ల గురించి నా మనసులో ఉన్న బాధనంతా వెళ్ళగక్కాను.

ఎప్పటి నుండో మనసులో ఉన్న బాధని పంచుకునేందుకు ఒక తోడు దొరికితే కలిగే ఆనందంతో..అమ్మ ఒక్క ఉదుటున లేచి కూర్చుని.."నీకూ అలాగే అనిపిస్తోందీ..?! చూసావా...ఆ మొద్దుకి చెపితే మన మాట తీసిపారేసింది. ఏమోలే ఎంతైనా నేను పాత కాలం దాన్ని కదా నేను కాదూ-కూడదని బెట్టు చేస్తే ఏం బాగుంటుందని , వీళ్ళు పొట్టలో పడ్డప్పటి నుండీ ఆలోచించి రెడీ చేసి పెట్టుకున్న ముద్దు పేర్లు ఇహ నా మనసులోనే దాచేసుకున్నాను " అంది కొంచం బాధగా.

నా హృదయం ద్రవించిపోయింది. ఒక్క క్షణం అమ్మమ్మ ప్రేమంటే ఏమిటో పూర్తిగా అర్థమైపోయినట్టు అనిపించింది.
"పోనీలేమ్మా దీని గురించి నువ్వింతలా బాధ పడాలా ! నీ మనసులో ఉన్న పేర్లేమిటో చెప్పు ..అక్కకి చెబ్దాం. ఏదో ఒక రోజు బింకానికి పోయినా..రెండో రోజు నుండి మనం ఎలా పిలిస్తే అలాగే తనూ పిలుస్తుందిలే..." అని ధైర్యం చెప్పాను, "పప్పీ-బుడ్డి" కన్నా ప్రపంచం లోని అన్ని పేర్లు బానే ఉంటాయి అనే గుడ్డి ఆశావాదంతో.
"అంతేనంటావా..ఏమిటో నువ్వు చెప్తుంటే నాక్కూడా మళ్లీ ఏదో ధైర్యం వస్తోందేవ్..ఆ కుక్క పిల్ల పేరుతో చంటి దాన్ని పిలవాలంటే నాకు నోరే రావడం లేదంటే నమ్ము.అయినా అనుకోవాలే గాని బంగారం లాంటి పేర్లు ఎన్ని లేవనీ..." అమ్మ ఎక్కడికెక్కడికో వెళ్లిపోతుంటే బలవంతంగా ఆపి .."అబ్బ..పేర్లేమిటో చెప్పమ్మా ముందు..!" అని గుర్తు చేసాను.
"ఆ..అదే అదే..అక్కడికే వస్తున్నా.అమ్మయికేమో చిట్టాయి..అబ్బాయికేమో బుజ్జాయి..ఖాయం చేసేద్దాం..ఏమంటావ్! అయినా ఇందులో అనేందుకేముందనీ నా మొహం. నిక్షేపంగా ఉన్నాయి. వింటుంటే తెలీడం లేదూ.." అమ్మ చిరునవ్వుల మధ్య చిద్విలాసం గా చెప్పింది.
నాకు "పెనం మీద నుండి పొయ్యిలో పడడం..", "ముందు నుయ్యి వెనుక గొయ్యి.." "దొందూ దొందే..." లాంటి సామెతలెన్నో అంతరంగం లో సుళ్ళు తిరిగాయి. కాగితమూ కలమూ తెచ్చుకుని అవన్నీ లైనుగా రాసుకోవడం తప్ప వేరేమీ చెయ్యలేని అశక్తురాలిని కాబట్టి మౌనం గా ఆ సన్నివేశం నుండి నిష్క్రమించాను.
                                                                  ***********

సావిరహే ...

ఉన్నట్టుండి నువ్వీ రోజు నా పక్కన లేవన్న నిజం గుర్తొస్తుంది. చేస్తున్న పని ఇహ ముందుకు కదలలేనంటూ మొరాయిస్తుంది. ప్రతి సాయంత్రం వదిలి వెళ్ళే సూరీడు ...తెల్లారగానే తన ఒంటిపై వెలుతురు మెరుపులు అతికించేందుకు వచ్చేస్తాడని ఆశపడే సంద్రంలా, రోజూ లాగే నీ కోసం వేచి చూసే హృదయం, ఇంకో రోజు నీ తలపులతోనే సరిపెట్టుకోవాలని అర్థమయ్యీ అవ్వగానే , మబ్బు పట్టిన ఆకాశంలా దిగాలు పడిపోతుంది.జీవితాన్నిమధురానుభూతుల దొంతరలా మార్చిన అందమైన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటి లాగే నా ఊహల అంబరం పైన ఎవ్వరూ చెరపలేని హరివిల్లులా అమరి కూర్చుంటాయి.

గుర్తుందా నీకు ?

వాకిట్లో పరుపల్లే పరుచుకున్న వెన్నెల్లో నీ ఒళ్ళో పడుకుని తలారబెట్టుకుంటూ చుక్కలు పెట్టిన ముగ్గుల్ని చూసుకుంటూ నేను..నా కళ్ళల్లో మెరిసే నక్షత్రాలని దర్శించుకుంటూ నీవు..మాటలు 'మాకిక్కడ చోటు దొరకడం లేదం' టూ అలిగి వెళ్ళిపోతుంటే..నిశ్శబ్దంగా నవ్వుకుని మన హృదయాలను ఊసులాడుకోనిచ్చిన రాత్రి గుర్తుందా నీకు ?నీ సాంగత్యంలో క్షణాల్లా గడిచిన ఆ శరద్రాత్రులని తల్చుకుని కదూ...కాలాన్ని నేనింత చిన్న చూపు చూసింది?ఇప్పుడు చూడు..నువ్వు పక్కన లేవన్న ధైర్యంతో, నిముషాల విల్లులను ఎక్కు పెట్టి, వాటిని జయించలేని అశక్తతతో నేను వాలిపోతుంటే..ఓడిపోతుంటే..పగలబడి నవ్వుతోంది పగబట్టిన కాలం.

కార్తీక మాసంలో...
కోనేటి మెట్ల దగ్గర కూర్చుని త్యాగరాజకీర్తన పాడుతూ..నీ అల్లరిచూపుల్లో చిక్కుకుపోయిన అలజడిలో..పదాలు తడబడుతున్న ఖంగారుని చూసి ఆపలేనంతగా నువ్వు నవ్వినప్పుడు...కోనేట్లోకి కోటి చందమామలెలా వచ్చాయని ఆకాశం ఆశ్చర్యపోయి ఉండదూ..?

 నువ్వొచ్చాక పున్నమినీ, వెన్నెలనీ ఆరాధించడం మానేసానని గుర్తొచ్చి కాబోలు ...వెండి మంట లాంటి వెన్నెలని ఒంటరిగా ఉన్న నా చుట్టూ ప్రసరింపజేసి..తన ప్రతాపమంతా ప్రదర్శించాలని తొందరపడుతున్నాడా చందమామ.అతనికేం తెలుసు.. రెప్పలు మూసుకున్న మరు క్షణం మగతలా కమ్ముకునే నీ ఆలోచనలను చేధించ రానివనీ .. కన్నులు తెరిచిన తొలి నిముషంలోనే నీ తలపుల వెల్లువలో తిరిగి తలమునకలవుతాననీ...మీటర్లలో మనుషులు కొలుచుకునే ఈ దూరం మనని వేరు చెయ్యలేక ఓడిపోతుందనీ .. అతనికెప్పుడూ ఒంటరిగా దొరకననీ..!

అయినా అమావాస్య వస్తే అదృశ్యమయిపోవడమే తప్ప అనుక్షణం నీలా హృదయాకాశంలో వలపుల వెన్నెలలు కురిపించగలిగిన నేర్పు అతగాడికేదీ ?

"ముందు తెలిసెనా ప్రభూ.." అని పాడుకునే అవకాశం ఇవ్వవు అని ఎలాగో తెలుసు....అయినా తరగని తపన . అకస్మాత్తుగా నువ్వొస్తావేమో అని....అనంతంగా సాగుతున్నట్టు తోస్తున్న ఈ క్షణాన్ని సంహరించేందుకు ఒక్క చిరునవ్వు వరమిచ్చేందుకు ఎదురవుతావేమోనని ఏదో ఆశ. ఎదను కోసేస్తున్న ఎడబాటును భరించలేక ..ఎడమైపోయినా ఎదురుగానే ఉన్నట్టు అనిపిస్తుంటే యదార్ధమేదో తేల్చుకోలేక....ఏకాంతపు వనానికి వెళ్లి విశ్రాంతి తీసుకుందామనుకుంటే... ముప్పిరిగొనే తేనెటీగలల్లే..అవిగో మళ్లీ....అక్కడా నీ జ్ఞాపకాలే..!!

ఎర్రబడ్డ ఈ కళ్ళ కింద నలుపు చారలు దిద్దుతున్న కాటుక సరిదిద్ది ..తడారని రెప్పల మీద ఒక వెచ్చని గుర్తేదో వేసేందుకు నువ్వొస్తావని నిరీక్షిస్తున్న నన్ను నిరాశ పరచవు కదూ..!స్వాతి వాన కోసం ఎదురు చూసే ముత్యపు చిప్పనై నీ కోసం పరితపిస్తూన్న నన్ను చేరుకునేందుకు మెరుపులు దాచుకున్న మేఘమాలలో తేలి తక్షణమే వచ్చేస్తావు కదూ.. ?!

                                                                            ప్రేమతో,
                                                                            నీ..

చేరువైనా..దూరమైనా..

                                                    శ్రావణ మేఘాలను చీల్చుకుంటూ
                                                    చినుకుల వాన మొదలైనపుడు
                                                    గుండె గుడిలో జ్ఞాపకాల దీపాలు
                                                    ఆరిపోకుండా వెలుగుతున్నప్పుడు ..

                                                     నిశ్శబ్దంగా నన్నిలా  చేరుకుంటావు..
                                                      వర్తమానపు ఒంపుల మీదుగా
                                                      ఏ గతపు లోయల్లోకో  జారిపోకుండా
                                           మళ్లీ  మళ్లీ నీ మాయలోనే మునకలు వేయించేందుకు..

ఏ తీరుగ నను దయచూచెదవో!

                 
నా నీలి కనుల రెప్పలపై నే నిర్మించుకున్న కలల హర్మ్యం  కూలిపోతున్న దృశ్యం
కని పెంచిన వాడికే కాని వాడనైనానన్న నిజం నిలువునా కాల్చివేస్తోందీ క్షణం..!
వాడిని వెన్నముద్దల తోటీ ..తీపి ముద్దుల తోటీ మాత్రమే పెంచిన జ్ఞాపకం
మానవత్వమే మహోన్నత మతమని మేం నూరిపోసిన మాట ముమ్మాటికీ నిజం!

తామర పూరేకులంత పదిలంగా పెంచినందుకూ మమతానురాగాల కౌగిలిని పంచినందుకూ
రక్త స్వేదాలను రూపాయిలుగా మార్చి రెక్కలొచ్చేంత వరకూ రక్షించినందుకూ ...
వలస పక్షిలా విదేశాలకి ఎగిరిపోతూ  వెదికాడు మా కోసం ఒక వృద్ధాశ్రమం
ఆ కృతజ్ఞతని భరించలేకే బద్దలైంది వాడి కోసమే కొట్టుకుంటున్న నా హృదయం..!

ఒడినే ఉయ్యాల చేసి ఊపినందుకూ వెన్నెలంత చల్లదనంతో సాకినందుకూ
కష్ట నష్టాల నీడైనా తాకకుండా కడుపులో దాచుకు కాపాడినందుకూ
మేం కతికిన మెతుకులకు లెక్కలు కడుతున్న ఆ కటిక బీదవాణ్ని
ఎన్ని మమతల మూటలిచ్చినా మామూలు వాణ్ని చెయ్యగలనా !

గొప్ప వాడివవ్వాలంటూ ప్రతి పుట్టిన రోజుకీ ఆశీర్వదించినందుకూ
గోరుముద్దలు తినిపిస్తూ వాడి భవిష్యత్తు గురించి కలలు కన్నందుకూ
ఎత్తులకు ఎదిగిపోవడమే లక్ష్యంగా పెట్టుకు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నా..
జీవితపు ఆఖరి మలుపులో ఆసరాకై ఆరాటపడుతున్నామని ఆపగలనా...

పెద్దరికంతో నేను చెప్పే మాటలన్నీ పైత్యమంటూ కొట్టి పారేసే బుద్ధి కుశలతనీ
ఏ అర్ధ రాత్రో ఆపుకోలేని నా దగ్గుతో పాటే వినవచ్చే వాళ్ళ విసుగు స్వరాలనీ
తలుచుకున్నప్పుడల్లా ఉవ్వెత్తున ఎగసిపడే నా వెచ్చని కన్నీళ్ళని
ఎప్పుడూ ఎవరి కంటా పడకుండా దాచడం ఎంత కష్టమైన పని!

ఈ ముసలి వాసనలు ఇంకెనాళ్ళు అంటూ మా మనసులు ముక్కలు చేసినా
నా భార్య పనితనమంతా 'అమ్మా..' అన్న పిలుపుతో కొనాలని తలపోసినా
మనుష్యుల నుండి వాణ్ని వేరు చేస్తున్న మృగత్వానికి దూరం చెయ్యాలనే మా తపన
ఈ క్షణం కాస్త వాత్సల్యం ఒలకపోసినా తిరిగి హత్తుకోగల కడుపు తీపి మిగిలుందింకా..!

ఉచిత విద్య

చచ్చిపోతున్న ఆశలను  చిగురింపజేస్తానంటూ ఒక  చట్టం వస్తోంది సంజీవనిలా
ఉచిత  విద్య  ఇకపై బాలలందరి హక్కని వాదిస్తూ ఇస్తోందేదో భరోసా !
విజ్ఞాన జ్యోతులతో వెలుగులు విరజిమ్మే విద్యాభారతికి అవ్వాలిదే పునాది. .
పైసా ఖర్చు లేని చదువులే కావాలి  పేదింటి పసి వాళ్ళ పాలిటి  పెన్నిధి!

ఈ చట్టం కూడా అమలు కాని మరో  చెత్త కాగితం కాక ముందే,
భారత దేశపు బంగారు భవిష్యత్తు కోసం కేటాయించిన నిధులు
మరో సారి అవినీతిపరుల వలలో పడి విలువ కోల్పోక మునుపే..
ఛేధిద్దాం ఈ నిద్రాణ జాతిని బంధిస్తున్న నిస్తేజపు శృంఖలాలు

కలల్లోని నవ భారతాన్ని కళ్ళారా చూసేందుకు, గర్వించేందుకు...
మన స్వప్నం నిజమవుతుందని విశ్వసించేందుకు , నిరూపించేందుకు
ప్రభుత్వాలు-చట్టాలూ, నాయకులు, వాళ్ళ వెర్రి వాగ్దానాలూ  కాదు
నిస్వార్ధమైన ఆవేశంతో  పోటెత్తే ప్రజా ప్రభంజనమే కావాలి.. ఈ జాతిని గెలిపించాలి!!

జై హింద్..!!

శరత్ రాత్రి ..

శరత్ రాత్రి ..

నల నల్లని మేఘాల కొంగుల్లో దాక్కుని చందమామ తొంగి చూస్తుంటే..
ఆ వెన్నెల సోయగాల మధ్య ఆశల పాన్పు  పరిచి నీవలా నన్ను ఆహ్వానిస్తుంటే..
నీ వాడి చూపుల సంకెళ్ళలో  చిక్కుకు బందీ అవుతానని బెంగ పడుతోంది నా హృదయం..
మాటకు చోటు లేని  మౌనసంద్రంలో అలనై ఎగసి అలసిపోతానని కలవరపెడుతోందో  భయం!
తేల్చి చెప్పవా ప్రణయమా..

వలపు విరి తోటలో ఉదయించి వాడిపోను కదా
తలపులను అల్లుకుపోతున్న నీ మాయలో పడి తల్లడిల్లిపోను కదా..!!
   

పాటల పల్లకిలో...

ఒక్కో సారి ఉదయాన్నే లేవగానే ఎక్కడి నుండో ఒక అందమైన పాట వచ్చి, నా  తలపులని అల్లుకుపోతుంది. ఇక ఆ రోజంతా నేను ఏం పని చేస్తున్నా , నా మనసులో నుండి ఆ పాట మాత్రం వెళ్ళిపోదు. కొన్ని వందల సార్లు "పాడిందే పాట..."లా పాడుకున్నాక, నాకు బుర్ర వెలుగుతుంది.. ఛ..ఛ...విసుగు విరామం లేకుండా ఇదే పాట ఇన్నేసి  సార్లు ఏం  పాడుకుంటాం లే  అనిపించాక, బలవంతం గా ఆ పాటని మార్చేస్కుంటాను. నా తోటి వాళ్ళు అప్పుడు 'హమ్మయ్య..బతికిపోయాం బాబోయ్' అనుకుని సంబరపడతారు.

అందరికీ ఎలా అనిపిస్తుందో  తెలీదు కాని, నాకు మాత్రం ప్రతీ  పాట ఒక జ్ఞాపకాల పందిరే. ఒక్కో పాట వింటుంటే, ఆలోచనలు మొదటి సారి ఆ పాట విన్న రోజుల్లోకి అనుకోకుండానే వెళ్ళిపోతాయి. ఉన్నట్టుండి కాలం సినిమాల్లో చూపించినట్టు గిర్రున వెనక్కి తిరిగి గతంలోకి జారుకున్న అనుభూతి కలుగుతుంది.

మొత్తం నాకు తెలిసిన జనాభా అందరిలోకి, ఈ రోజు దాకా, పాటల్లో మా అక్క కి ఉన్నంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళు నాకు ఎదురు పడలేదు. పాట ఇంకా మొదలవ్వకుండానే, మ్యూజిక్ ని బట్టి పాట చెప్పెయ్యగల దిట్ట.
అలా మా అక్క అంత  తెలివితేటలు  నాకు కూడా ఉన్నాయి అనిపించుకోవాలని చిన్నప్పటి నుండి నాకు బోలెడు ఆశగా ఉండేది. చదువులో ఆ తెలివి ఎలాగో లేదని అప్పటికే అందరూ నిర్ణయించేశారు కాబట్టి , సినిమాలు- పాటల విషయం లో అయినా 'అక్క ని  మించిన చెల్లి'  అని పేరు తెచ్చుకోవాలని  మనసులో బలంగా నిర్ణయించుకున్నాను .
నేను ఆ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజులకే అదృష్టం నన్ను వెదుక్కుంటూ వచ్చి నా తలుపు తట్టింది. నా గొప్పతనాన్ని  నిరూపించుకునేందుకు నాకొక గొప్ప అవకాశం లభించింది.
అక్కా నేను  మాములుగా అయితే ఎప్పుడూ బద్ధ శత్రువులలానే మాట్లాడుకుంటాం . అలా కాకుండా మేము ప్రేమగా మాట్లాడుకున్నాం అంటే , అది మహా గొప్ప శుభ దినం అయినా అయ్యి ఉండాలి, లేదంటే అమ్మ మా గొడవలు భరించలేక అక్షింతలో, వీపు మీద అప్పాలో వేసి, ప్రేమగా ఉండాలి అని అప్పుడే తిట్టి వెళ్లి ఉండాలి.
అక్క-నేను అలా  సఖ్యంగా ఉన్న అరుదైన రోజుల్లో ఒకసారి, నేను పట్టుకోక పట్టుకోక పుస్తకం పట్టుకుని చదువుతుంటే,  "ఈ పాట ఏ సినిమా లోదో  చెప్పుకుంటే, నా కొత్త డ్రెస్ నీకో సారికి ఇస్తాను" అని ఆఫర్ ఇచింది.  అక్క డ్రెస్ అంటే ఐషు డ్రెస్ అంత గొప్పదని గుడ్డిగా నమ్మే నేను, జీవితం లో అంతకు ముందెప్పుడూ లేనంత ఏకాగ్రత తో ఆ టేప్ రికార్డర్ మీద పూర్తిగా పడిపోయి మరీ పాట వినదానికి రెడీ అయిపోయాను . కరోడ్పతి ప్రోగ్రాం లో ఆఖరు ప్రశ్నకి సిధమైన వాళ్ళకి ఉన్నంత టెన్షన్ ఉంది నాలో.
అప్పుడు గుర్తొచింది నాకు...ఒకవేళ నేను సమాధానం చెప్పకపోతే?! ....అమ్మో, అక్క అసలే నా కన్నా చాలా తెలివైనది. ఈ విషయం అమ్మ వాళ్ళ దగ్గర ఒప్పుకోకపోతే నష్టమేం లేదు కాని, నాకు నేను ఒప్పేసుకోవాలి కదా. లేదంటే ఏదో ఒక అపాయం వచేస్తుంది.
ఇలా తెలివి గా అలోచించి, "ఒక్క నిముషం" అంటూ అక్క చెయ్యి పట్టి ఆపేసాను.
"ఒకవేళ నేను పాట చెప్పుకోలేకపోతే...?" అనుమానంగా అడిగాను.
"నేను చెప్తాలే..దానికేముంది.." నా తెలివైన ప్రశ్న ని తేలిగ్గా తీసిపారేస్తూ అక్క దేవతలా బదులిచ్చింది.ఇలాంటి మంచి అక్కనా అనుమనిన్చావు అని నా మనసు నన్ను మందలించడం అయిపోయాక, 'సరే, పాట వినిపించు మరి' అంటూ ఉత్సాహంగా ముందుకు వచ్చేసాను.
చక్కటి సంగీతంతో మొదలై, సరిగ్గా పాట వినపాడే సమయానికి, అక్క 'స్టాప్' బటన్ నొక్కేసింది :(
నేను అయోమయం గా చూసాను. 'ఊ చెప్పు...' అంటోంది అక్క.
"పాట ఎక్కడ మొదలైంది అక్కా, మ్యూజిక్ వినిపించావ్ అంతే ఇప్పటి దాకా.." ఈ విషయం దానికి తెలుసని తెలిసినా ఏమిటో మరి అలా అడిగేసాను.
"అదే కదా మరి పందెం...మ్యూజిక్ విని పాట  పట్టేయ్యాలి, చెప్పు చెప్పు.."
అయిపోయింది. అనుకున్నదంతా అయిపోయింది. అయినా  నా పిచ్చి  కాని, అక్క ఏంటి, దాని కొత్త డ్రెస్ ఫస్ట్ టైం  నన్ను వేసుకోమనడం ఏంటి....! ఈ పాట చెప్పుకోవడం నా వాళ్ళ కాదు అని అర్థం అయిపోయింది.
ఎదురుగా ఉన్న అక్క నీలం రంగు డ్రెస్ నాలో ఎక్కడ లేని బాధని కలిగిస్తోంది.అక్క కి ఇళయరాజా అంటే చాలా ఇష్టం అని తెలుసు కాబట్టి, ఆఖరు ప్రయత్నంగా , బాగా సంగీత జ్ఞానం ఉన్న దానిలానే చూస్తూ...'ఏదో ఇళయరాజా పాటలానే అనిపిస్తోంది, జస్ట్ పేరు గుర్తు రావాలి అంతే..'  అని ఒక రాయి వేసి చూసాను. 'ఇళయరాజానా...కనీసం సంగీత దర్శకుడి పేరు కరెక్ట్ గా చెప్పినా నువ్వే గెలిచావు అని ఒప్పుకునేదాన్ని...కాని నీ బాడ్ లక్', అని తేల్చేసింది.
దిగాలు మొహం తో,
'ఈ లెక్కన ఆ పాట కనిపెట్టడం నా వాళ్ళ కాదులే ' అని మర్యాదగా ఒప్పేసుకుని, పాట వినిపించమని అడిగాను. అప్పుడు నేను విన్న సూపర్ సాంగ్, "సఖి" సినిమా లోది. ఒక్కో పాట , ఆ సంగీతం మనసుని తాకుతున్నట్టు అనిపిస్తుంటే, అమ్మ వాళ్ళు పడుకున్నాక,మా ఇద్దరికీ మాత్రమే వినపడేలా ఈ పాటలు పెట్టుకుని వింటూ చదువుకునే వాళ్ళం.
అంతా బానే ఉండేది కాని, పొద్దున్నే చిక్కొచ్చి పడేది. అక్క కి పాటలు పడే అలవాటు లేదు. కాని నాకు ఉంది.
ముందే చెప్పినట్టు ఏ పాట పట్టుకుంటే దానిని విసుగు లేకుండా ఎంత సేపైనా పాడగలను. అప్పుడు కూడా అలాగే  పొద్దున్నే లేచి ,పుస్తకాలూ ముందేసుకుని  'రహస్య స్నేహితుడా...చిన్న చిన్న హద్దు మీర వచునోయి '  అని కూని  రాగాలు తీస్తుంటే మా నాన్నగారు వినేసి, " ఈ పాపిష్టి పాటలు ఇంకోసారి ఇంట్లో విన్నాఅంటే ఊరుకునేది లేదు" అంటూ వార్నింగ్  ఇచ్చారు.
కొత్త సినిమా పాటల గురించి అస్సలే మాత్రం తెలీని  అమ్మ కూడా, నేను 'స్నేహితుడు' అనగానే 'ఆ మగ వెధవల గురించి పాటలు పాడకని చెప్పానా' అని మళ్లీ ఒకసారి గుర్తు చేసి వెళ్ళిపోయింది, అదేదో అక్కడికి ఆ పాట నేనే రాసేసినట్టు.
ఎవరైనా తిట్టినప్పుడు క్షణ కాలం చెవులు మూసుకుని, ఆ తర్వాత అవన్నీ దులిపేసుకోవాలని నేను చాలా చిన్నప్పుడే నిర్ణయం తీసేసుకున్నా కాబట్టి, వాళ్ళ మాటల తూటాలు  నన్ను బాధ పెట్టలేదు.
కాని, సడన్ గా ఒక డౌట్ నా మెదడు తోలిచేస్తుంటే, లేడి పిల్లలా దూకుతూ  వంటింట్లో పని చేసుకుంటున్న అమ్మ దగ్గరికి  వెళ్ళాను.
"అవునమ్మా..మీరెందుకు ఎప్పుడూ ఏమీ పాడుకోరు పాపం?  నీ గొంతు స్వీట్ గా ఉంటుంది కదా, నువ్వు పాడచ్చు కదా అమ్మా..చిన్నప్పుడు కూడా పాడేదానివి కాదా.."  అమ్మ చీర కొంగు మెలిపెడుతూ ఆడుకుంటూ అడిగాను,

"ఎందుకు పాడే దాన్ని కాదు..ఇలాగే ఒకసారి చిన్నప్పుడు, 'ఊహలు గుస గుస లాడే' పాట లేదూ...ఆ పాట పాడుకుంటున్నా ఇంట్లో. అప్పుడే అక్కడికి వచ్చిన అమ్మమ్మ  'వలదన్న వినదీ మనసు...కలనైన నిన్నే తలచు' అని నేను పాడుకోవడం విని నానా రకాలుగా తిట్టింది. అప్పటి నుండి వినడమే మిగిలింది.." నవ్వుకుంటూ చెప్పింది అమ్మ.
"అమ్మమ్మ నీలో ఉన్న సింగెర్ గొంతు నొక్కేసింది అమ్మా. నువ్వా తప్పు మళ్లీ చెయ్యకు,ఎంచక్కా  నన్నుఅన్ని పాటలు పాడుకోనిచ్చావు అనుకో, నీ గురించి అన్ని తరాల వాళ్ళకి గొప్ప గా చెప్తాను .." దొరికిందే ఛాన్స్ అని నేను చెప్పాల్సింది చెప్పేసాను.

"నీ దొంగ నాటకాలు నాకు తెలీనివి కాదులే కాని, వెళ్లి పుస్తకాలూ పట్టుకో పద పద, చేసిన కాలక్షేపం చాలు' అంటూ అమ్మ నన్ను ఇంట్లోకి పంపేసింది.
సఖి పాటలు విన్నప్పుడల్లా ఈ అందమైన జ్ఞాపకాలు నన్ను చుట్టూ ముడుతూనే ఉంటాయి..ఎప్పటికీ..!

మాటే మంత్రమా...

మధుమానసం


పాలనురుగుల నవ్వుల్లా, లతానెలతల నాలింగనం చేసుకున్న ముత్తెపు చినుకుల్లా - స్వచ్ఛంగా మెరిసే అక్షరాల ఆసరాతో కొత్త ప్రపంచంలోకి అడుగుడిడానికో చిరు ప్రయత్నం ...

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....