Showing posts with label ఆత్మకథలు. Show all posts
Showing posts with label ఆత్మకథలు. Show all posts

ఆచంట జానకీరాం: నా స్మృతిపథంలో..సాగుతున్న యాత్ర

ఒక వ్యక్తి స్వతహాగా కవీ, రచయితా అయి, సున్నిత మనస్కుడై, భావుకుడై తన ఆత్మకథను వ్రాయాలని అనుకుంటే, అందుకు తోడుగా అతనికి తన కాలంలోని దాదాపు ప్రతీ సాహితీవేత్తతోనూ దగ్గరి పరిచయం ఉండి, ఆ అనుభవాలన్నీ గుర్తుంచుకోగల జ్ఞాపకశక్తీ, ఆ అపురూపమైన సంగతులన్నీ శ్రద్ధగా గుది గుచ్చి చెప్పగల నేర్పూ ఉంటే, అది నిజానికి పాఠకుల పాలిట వరం. ఈ పుస్తకం అలాంటిది. 

"ఇవిగో! ఇంకా నిద్ర లేవని
మంచు తడి ఆరని, పారిజాతాలు!!
ఈ ధవళిమ నా భావాల స్వచ్ఛత;
ఈ ఎరుపు నా అనురాగపు రక్తిమ
ఈ పరిమళము మన స్నేహసౌరభము!
అందుకోవూ.."

అంటూ మొదలయ్యే పుస్తకమిది. ఈ పుస్తకంలోని పదాలెంత సుకుమారమైనవో, ఇందులోని భావాలెంత సున్నితమైనవో, అభివ్యక్తి ఎంతలా మనను కట్టి పడేయగలదో, ఈ మొదటి పేజీలోనే మనకు చూచాయగా తెలుస్తుంది. ఇక అది మొదలు, సంగీత సాహిత్యాలను ఇరు ఒడ్డులుగా చేసుకుని ప్రవహించే నిండైన నది లాంటి ఆచంట వారి జీవితం మన కళ్ళ ముందుకొస్తుంది. మహావృక్షాల్లాంటి మహనీయుల జ్ఞాపకాల నీడల్లో ఆగి కొంత విశ్రాంతిని పొందడం, ఆ నదిలోని చల్లని నీరు దోసిళ్ళ నిండా తీసుకుని ఎప్పటికప్పుడు దప్పిక తీర్చుకుని ఆ తీరం వెంబడి నింపాదిగా నడవడం - పాఠకులుగా ఇక మన పని.

భౌతికమైన వస్తువుల ఆత్మను దర్శించి, వాస్తవానికీ కల్పనకూ మధ్య అపురూపమైన సంధినొకదాన్ని నిర్మించి, మరొకరిని ఆ దోవలో నడిపించి ఊయలూగించడానికి మాంసనేత్రం సరిపోదు. రసదృష్టి లాంటిదేదో కావాలి. తనలో లేని సౌందర్యమేదీ ఈ ప్రపంచంలో కనపడదన్న ఓ పాశ్చ్యాత్యుని మాటలు నమ్మి చెప్పాలంటే, ఆచంట వారి మనసంతా సౌందర్యమయం.

ఆచంట స్వతహాగా కవి. లోకం పట్ల ప్రేమ, దయ ఆయన కవితల్లోనూ, నాటకాల్లోనూ కనపడుతూంటాయి. మునిమాపువేళ మిణుకుమిణుకుమనే ఒంటరి నక్షత్రమొకటి, ఆయనలో ఒకేసారి ఆశనూ, దిగులునూ కలిగిస్తుంది కాబోలు. ఆ తార ప్రస్తావన కనపడ్డ కవితలు రెండు: 

" నేను నిదురించు శయ్యాగృహంపు టాకాశ
గవాక్షమందుండి యొక్క తారకామణి
మిణుకు మిణుకంచు తన సందేశాల బరపజూచు.."

"నీ నిరంతర స్మరణ నా యెద వ్రేగునపుడు
మమతతో కూయుచు మునిమాపువేళ
గువ్వతల్లియు తన గూడు చేరునపుడు
సొమ్మసిల్లిన సృష్టియు సుషుప్తి పొందినపుడు
నిలువ నీడేలేని నిరుపేద భిక్షుకుడ నేను
బాధతో రాల్చిన మౌనభాష్పకణమ్మునందు
దూరమున దీపించు నా దివ్యతార
ప్రేమకాంతుల బరుపుచు ప్రజ్వరిల్లు"

" I, a homeless beggar. drop a silent, painful tear in which gleams the distant star of love.."  - ఎంత అపురూపమైన భావన!

కవిత్వం ఎలా ఉండాలి అన్నది, ఏనాటికీ చిక్కు ముడి వీడని ప్రశ్నే! రూపప్రథానమా, భావప్రథానమా? దేని పాళ్ళు ఎంతైతే మంచి కవిత్వమవుతుందంటే, ఎవ్వరు చెప్పగలరు? జిహ్వకో రుచి. అంతే. ఆచంట వారొకసారి రైలు ప్రయాణంలో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారిని కలిసినప్పుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి మాట వచ్చి, "మీరంతా ఆయన్ను భావకవి అంటారు కదా, భావకవిత్వం అంటే ఏమిటి? భావము లేని కవిత్వమంటూ ఉంటుందా?" అని అడిగారట శర్మ గారు. 


"అది నిజమే; భావం లేనిది కవిత్వం కాదు. పూర్వపు ధోరణిలో ఉన్న కవిత్వం రూప ప్రథానమైనదనుకుంటా. కృష్ణశాస్త్రి వంటివారి రచన భావప్రథానమైనది." అన్నారు ఆచంట.

"అల్లాగా ? ఈ పద్యం విన్నారా?" అంటూ భావయుక్తంగా, ఆయనీ పద్యం చదివారట అప్పుడు:

"కలుగవు కమలంబులు, హంసలు కదులవు, చూడవమ్మ చక్కగ నెవరో, తలక్రిందుగ నాకాశము నిలిపిన వార్త, చెరువు నీళులలోన్"

ఇది భావప్రథానమైనదేనని ఆచంట ఒప్పుకున్నాక, ఇది శకకర్త, శాలివాహనునికి ముందు, అంటే రెండువేల ఏళ్ళకు పూర్వం వ్రాసినవనీ, ప్రాకృతములో వందలకొద్దీ ఇటువంటివి ఉన్నాయనీ చెప్పారట.

కాలానికొక రకం కవిత్వం అని గిరి గీయడమెవ్వరి తరం?

ప్రబంధ సాహిత్యం గురించి మాట్లడుతూ, విజయ విలాసములో ఉలూచి  తనని అమితంగా ఆకర్షించింది అంటారీయన. ఉలూచి ఆయనకు సత్యాదేవంత ప్రియమైన ప్రబంధ నాయికట. అందులోనూ నాగ కన్యక కూడానాయో!

"హేమంత ఋతువు కాబట్టి నా ఎదుట యమున అతి సన్నగా ప్రవహిస్తోంది. ఎప్పుడో ఒకనాడు ఇటువంటి నీటనే జలకమాడుతున్నాడు అర్జునుడు. అప్పుడే ఉలూచి అతన్ని తన కౌగిలిలో హత్తుకుని ఎత్తుకుపోయింది. ఆమె వచనాచమత్కృతికీ, ఆమె అసమానరూప లావణ్యానికీ, అన్నింటికంటే ఎక్కువగా ఆమె ప్రకటించే అనురాగానికీ లొంగిపోయి అర్జునుడు, మొదట కాదన్నా, చివరకు ఆమె ప్రేమను అంగీకరిస్తాడు." అని గుర్తు చేసుకుంటారు ఆచంట. 

"చక్కెర బొమ్మ నా వ్రతముచందము దెల్పితి నంతెగాక..." అంటూ మొదలయ్యే మరో పద్యంలో, "ఎక్కడ నుండి వచ్చె తరళేక్షణకున్ నును సిగ్గు దొంతరల్" అంటాడు కవి. ఇందులో మొదట 'చక్కెర బొమ్మ' అన్న పదం వినగానే, మగధీర చిత్రంలో, "పంచదారా బొమ్మా బొమ్మా" అంటూ మొదలైన పాట వింటూ, ఈ పాట ఎత్తుగడ ఎంత బాగుందో అని పదే పదే అనుకోవడం గుర్తొచ్చింది. విజయవిలాసం చదువుతోన్న ఆచంట వారూ, ఆ చక్కెర బొమ్మ దగ్గరే ఆగిపోయారట. ముగ్ధకు అతి స్వాభావికమైన సిగ్గు, ఆ ఉలూచి కన్నుల్లో కనపడి పరవశింపజేసిన తీరూ, ఆయన అక్షరాల్లో అందంగా కనపడుతుంది.

అలాగే, తెలుగునాట తొలి చైతన్య స్రవంతి నవల వ్రాసిన వారుగా వినుతికెక్కిన బుచ్చిబాబు ప్రస్తావన కూడా, ఈ పుస్తకంలో కనపడుతుంది. అదీ, చాలా ఆశ్చర్యాన్నిచ్చే ఘటనగా: 

"ఒకనాడు బుచిబాబు తాను రచిస్తోన్న ఒక క్రొత్త నవలను గురించి నాతో చెబుతూ కథావిషయము చెప్పి, ఈ రచనకు ఏకాంతము అనే పెడదామనుకుంటున్నాను, మీరేమంటారు? అన్నాడు.

నేనన్నాను : " మీరు మీ రచనలో జీవితపు విలువలను కొన్నిటిని వివరంగా పరిశీలిస్తున్నారు. ఈ కాలపు ఒకానొక యువకుని జీవితంలో కలిగే సమస్యలను వర్ణిస్తూ, కేవలమూ ఆదర్శజీవి అయిన అతని ఆశలూ, యత్నాలూ ఒక్కటీ ఫలింపపోవడం చూపిస్తున్నారు. ఇప్పుడు నాలాంటి వానిలో వచ్చే ప్రశ్న ఏమిటంటే : ఇట్టి విపరీతపు అన్వేషణలో, ఈ మహాయత్నములో చివరకు మిగిలేది అనే పేరు పెడితే బాగుంటుందేమో."

ఆ సూచనను వెంటనే అంగీకరించారట బుచ్చిబాబు. ఎంత ఆశ్చర్యం! తెలుగు నాట విశేషంగా పాఠకుల ఆదరణ పొందిన ఈ నవల పేరు, ఇంతకీ ఆచంట వారి ఆలోచనా!, అన్న ఆశ్చర్యం ముంచెత్తక మానదు ఈ సంఘటన చదివినప్పుడు. 

ఆచంట వారి అదృష్టం సాహిత్య రంగానికి చెందిన విశ్వనాథ, చలం, దేవులపల్లి, బుచ్చిబాబు, రవీంద్రులు..ఇలా వీరికే పరిమితం కాలేదు. సంగీత రంగంలోని ఎందరో ప్రముఖులతోనూ ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆకాలంలోని వారందరి సంగీత విభావరులూ ప్రత్యక్షంగా అనుభవించగల సదవకాశమూ దక్కింది. బెంగళూరు నాగరత్నమ్మ మొదలు, వెంకటనాయుడు గారి వయొలిన్ వరకూ, ఆయన చెవుల్లో అమృతం నింపిపోయిన వారే అందరూ. నాయుడుగారు సావేరి రాగంలో వినిపించిన ఆర్ద్ర సంగీతం వినే, ఆచంట వారు రిల్కే మాటలనిలా గుర్తు చేసుకుంటారు :

"రెండు రాగచ్ఛాయల మధ్య ఉండే విశ్రాంతిని నేను. ఆ క్షణిక విరామంలో  వణికిపోతూ, కలియవచ్చిన ఆ రెండు రాగచ్ఛాయలూ మేళవించి, ద్విగుణితమైన మాధుర్యంతో గానం సాగిపోతుంది" అని.

చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా, అవతలి వారి పేరు ప్రఖ్యాతులతో సంబంధమే లేకుండా, ప్రజ్ఞను బట్టి వారిని పొదువుకున్న అపురూపమైన వ్యక్తిత్వం ఆచంట వారిది. మనస్ఫూర్తిగా వారిలోని కళకు కైమోడ్చిన సాహిత్యాభిమానులు వీరు. అంత నిర్మల హృదయులు కనుకనే, ఎందరెందరో సాహితీవేత్తల ఆంతరంగిక క్షణాల్లోకి ఆయన అలవోకగా ప్రవేశించగలిగారు. సృజనశీలుల్లో కవితాగంగ ఉప్పొంగుతోన్న వేళ, దగ్గరగా కూర్చుని దోసిళ్ళతో తాగి తన తృష్ణను తీర్చుకున్నారు. 

 " నువ్వూ నేనూ కలిసి/వెన్నెల వెలుగులా/వెలుగులో వాంఛలా
నువ్వూ నేనూ కలిసి గగన నీలానిలా/ నీలాన శాంతిలా" అన్న బాపిరాజు కవిత్వాన్నైనా, "మురళి పాటకు రగిలి/మరుగు నీ వెన్నెలలు/సొగయు నా యెదకేల తగని సౌఖ్యజ్వాల" అన్న దేవులపల్లి గీతాలనైనా, "కంటికంతా జలమయంబై, మింటివరకు నేకరాశై జంట దొరుకని మహాప్రళయపుటింటిలో వటపత్ర డోలిక నొంటిగా నుయ్యాల లూగితివా నా ముద్దు కృష్ణా జంటగా నను బిల్వదగదోయీ?" అన్న బసవరాజు గేయాన్నైనా,  "వలపు నిండార విరిసిన పారిజాత కుసుమములు నేలరాలు వేకువలయందు ప్రసవ శయ్యాపదముల నీపాదయుగళి కదలెనో, నాదు హృదయమే కలతపడెను" అన్న అబ్బూరి రామకృష్ణారావుగారినీ, " గడ్డి పూవుని! రేకుల రెప్పల కలలు కంటూ కలవరిస్తూ కలతనిద్దురలోనె ఎప్పుడొ కళ్ళు మూస్తాను!" అన్న ఆచంట మేనత్త కొడుకు మల్లవరపు విశ్వేశ్వరరావైనా,విశ్వనాథ కిన్నెరసానినైనా, నూతిచుట్టూ ఉన్న పాలగచ్చు పళ్ళెం మీద ముక్కాలి పీట మీద కూర్చుని, గుమ్మడివడియాల వాసన పీలుస్తూ విన్న "చేతులార శృంగారము చేసి చూతు" నన్న సన్నిహితుల గానాన్నైనా, ఆఖరకు విజయనగరంలో జట్కా వాడి పాటలనైనా, అదే తన్మయత్వంతో, ఆ కవిత్వంలో, సంగీతంలో, గానంలో లీనమైపోతూ అనుభవించారు.  

అప్పటి తనలోని ఆవేశాన్ని, ఉత్సాహాన్ని, ఆయన మిత్రులు కొండేపూడి సుబ్బారావు కవితాఖండికలో ఇలా చెప్పవచ్చునేమో!

"ఉదయకాంతుల పసిడితీగొకటి మెరిసినది
మృదుపుష్ప గర్భమున రేకొకటి విరిసినది
లలితసుందర దివ్య లావణ్య నవజీవ
మధుమాస సుధలలో  హృదయమే పొంగినది"

సామాజిక జీవన చిత్రణ ఈ పుస్తకంలో ఉందని అనలేను కానీ, ప్రముఖ రాజకీయ నాయకుల ప్రస్తావన మాత్రం కనపడుతుంది. ఈ సరికే మన ఆలోచనల్లో ఒకింత ఎత్తులో సుఖాసీనులైన వాళ్ళందరి గురించీ, ఆచంట వారి మాటల్లో చదవడం బాగుంది. వాళ్ళెందుకంత గొప్పవాళ్ళయారో, మరొక్కసారి తెలుసుకున్నట్టైంది. పుదుచ్చేరిలో అరవిందులతో జరిగిన సంభాషణా, గాంధీ మదనపల్లె ఆశ్రమానికి వస్తూనే ఇచ్చిన ఉపన్యాసం, ఓ బహిరంగ సభలో సుభాష్ చంద్రబోస్ వందల మందిని రెండే మాటలతో నిలువరించి నిలబెట్టిన తీరూ, చకితులను చేస్తుంది. ఆచంట వారు వారందరికీ విధేయులుగా ఉండడమూ, అవసరమైనప్పుడల్లా, ఈ ఉద్యమాల వల్ల జైళ్ళకు వెళ్ళిన వారికి తన పరిథిని దాటుకుంటూ వెళ్ళి సాయపడడమూ కనపడుతుంది కానీ, అదంతా స్వభావసిద్ధమైన సున్నితత్వం వల్లే తప్ప, ప్రత్యేకించి రాజకీయాలంటే బలమైన ఆసక్తి ఉన్నట్టు అనిపించదు. బహుశా ఇది కూడా, రాజకీయాల్లో సహజంగా ఉండవలసిన మొండి పట్టుదల వంటిదేదో వారికి స్వాభావికముగా లేకపోవడం వల్ల అయి ఉండవచ్చు. జీవితం మొత్తం మీద ఒకేసారి ఒక వ్యక్తిపై చేయి చేసుకొనవలసి వచ్చిన సందర్భాన్ని గురించి ఎంతో మధనపడుతూ, పశ్చాత్తాపపడుతూ, తన తప్పు పూర్తిగా లేకున్నా కన్నీళ్ళ ప్రాయమైన వైనాన్ని చెప్పడం చదివితే, ఆయన మనసు  మరింత స్పష్టంగా కనపడుతుంది. ఐతే, సాహిత్యవిమర్శలో మాత్రం, ఎక్కడా వెనుదీయలేదీయన. విశ్వనాథ ఏకవీర మొదలు, "ఎముకలు కుళ్ళిన" అన్న శ్రీశ్రీ కవిత్వం వరకూ, విభేదించవలసిన ప్రతీ సందర్భంలోనూ గట్టిగా నిలబడి సుదీర్ఘమైన వ్యాసాలు వ్రాసారు. కొన్ని సందర్భాల్లో కాలం తన అభిప్రాయాలను తప్పని తేల్చినా, తానా భిన్నమైన అభిప్రాయంతోనే ఈనాటికీ నిలబడి ఉన్నానని చెప్పుకోవడానికి మొహమాటపడలేదు. అది, ఆయనలోని నిబద్ధతకు నిరూపణం.


ఇలా ఈ పుస్తకాన్ని గురించి చెప్పుకుంటూ పోతే, ఎక్కడ అపాలన్నది ఎప్పటికీ తేలదు. కనుక, రవీంద్రుల కవితొక్కదానితో, ఈ పుస్తకాన్నీ, ఆయన జీవితాన్ని కూడా-  పొదుపుగా మరొక్కసారి మననం చేసుకుంటూ, ముగిస్తాను.

"అపురూపమైన ఈ లోకపు మహోత్సవములో
పాల్గొనమని నన్ను ఆహ్వానించావు
నా జన్మ తరించింది. ఉత్సవాన్ని కళ్ళారా చూశాను!
ఆనంద గీతము చెవులారా విన్నాను.
ఈ మహోత్సవములో నా వాద్యమును
నా చేతనైనంత అందంగా వినిపించాను.."

* తొలి ప్రచురణ, సారంగలో.

"నెమరేసిన మెమరీస్" - ముళ్ళపూడి శ్రీదేవి


సాధారణంగా గొప్ప వారి ఆత్మకథలు స్ఫూర్తి నిస్తాయనీ, తెలియని కబుర్లేవో చెబుతాయని ఆ పుస్తకాలు కొంటూంటాం. కొన్నిసార్లు వాళ్ళ కథలు చదివాకే గొప్పతనాన్ని అర్థం చేసుకుంటాం, లేదా మునుపటి కంటే ఎక్కువగా ఇష్టపడతాం. ఉదాహరణకు ఆచంట జానకీరాం గారి "స్మృతి పథం" పుస్తకం తీసుకుంటే, ఆయనెవరో ఏమిటో నాకు మునుపు తెలియదు. అయితేనేం, ఆ పుస్తకమంతా ఆవరించి ఉన్న ఒకానొక సౌందర్య స్పృహ, ఆయన్ను పుస్తకం ముగించే వేళకి ఆప్తుణ్ణి చేసింది. తన కవిత్వంలో ఆయన పలికించిన ఉద్వేగాలూ, జీవితమంతా కవులతోనూ, కళాకారులతోనూ గడుపుతూ ఆ క్షణాలను గురించి పారవశ్యంతో చెప్పుకుపోయిన తీరు, నన్నూ ఆ కాలానికి తీసుకువెళ్ళాయి. అలాగే, దువ్వూరి వారు. ఆయన కథ చదువుతున్నా అలాగే విస్మయం. మనది కాని ఓ కాలంలోకి వీరంతా వేలు పట్టుకు భద్రంగా నడిపించుకు వెళతారు. మనవి కాని అనుభవాలు కొన్నింటిని మనసులో ముద్ర వేసి పోతారు. ఇటువంటివి కాక, సత్యసోధనో, ఓ విజేత ఆత్మకథో చదివినప్పుడు మనం పొందే స్ఫూర్తి వేరు. మన మనసు ఆలోచించే పద్ధతి వేరు. 

ఈ పుస్తకాలు సాధారణంగా బాగా పేరొందిన వారివే అయి ఉండటం చూస్తూంటాం. అలా కాకుండా, ఎవరో ఓ ఆరుగొలనులో పుట్టి పెరిగిన అమ్మాయి, జీవితం మూడొంతులు అనుభవించేశాక, "నేనొక కథ చెబుతానూ, నా కథ. నా వాళ్ళ కథ" అంటే వింటామా? అనుమానమే. అయితే, ఆవిడ ముళ్ళపూడి సతీమణి అని తెలిస్తే, కాస్త ఆసక్తి కలుగుతుందేమో. కృష్ణశాస్త్రి గారబ్బాయి "నాన్నా-నేనూ" అంటే, ఆ భావకవి జీవితాన్ని ఇంత దగ్గరగా చూసిన మనిషి ఏం చెప్పబోతున్నాడోనన్న కుతూహలంతో సర్దుక్కూర్చున్నాము కదా! అలా అనమాట.

ముళ్ళపూడి పేరూ, కవరు మీద బాపు బొమ్మా, నేనీ పుస్తకం కొనడానికి కారణం కాదని చెప్పను కానీ, నిజంగా - ఈ పుస్తకం చదివాక నేను శ్రీదేవి గారిని గుర్తు చేసుకుంటోంది మాత్రం ఆ రెండు పేర్ల ఊతంతో కాదు.

అలా తీరికగా కూర్చుని రాద్దామంటే, నిజానికి ఈ పుస్తకంలో ప్రత్యేకంగా చర్చకు పెట్టాల్సినవి లేవు, మళ్ళీ మళ్ళీ చెప్పుకొనవలసిన ముఖ్యమైన విషయాలూ లేవు. చేయి తిరిగిన రచయిత వ్రాసినవి కాదు కనుక, కోట్ చేసి దాచుకోవలసినవో, పది మందితో పంచుకోవలసినవో అయిన వాక్యాలూ లేవు. అయినా ఈ పుస్తకం ప్రత్యేకమైనదే. 

ఎందుకూ అంటే...

నా చిన్నప్పుడు బెజవాడలో, మా పక్కవీథిలోనే కొన్నాళ్ళు మా నాన్నగారి అక్కయ్య ఉండేది. లీలత్తయ్య. సాత్విక గుణానికి నిలువెత్తు రూపంలా ఉండేది. ఏ కాస్త పరుషమైన మాట విన్నా, ఎవ్వరి కే కష్టమొచ్చిందని తెలిసినా, "..చ్చొచ్చొచ్చొ.." అంటూ నిజాయితీగా దిగులుపడిపోయేది.అమ్మ స్పాట్‌వేల్యుఏషన్‌కి వెళ్ళి బందరు నుండి ఆలస్యంగా వస్తుందంటేనో, ఏ ఆదివారం మధ్యాహ్నమో ఏమైనా తెమ్మనో- ఇమ్మనో, నన్ను వాళ్ళింటికి పంపుతూ ఉండేవారు. నేను వెళ్ళగానే ఆవిడ ఓ పీట వేసి నన్ను వంటింట్లో పక్కగా కూర్చోబెట్టుకుని, కమ్మటి రుచి వచ్చేదాకా వేరుశనగ పప్పులు వేయించి, చిన్న బెల్లం ముక్క కూడా ఇచ్చి, కబుర్లాడుతూ ఉండేది. ఏవో కబుర్లు...మిగిలినవాళ్ళెవ్వరూ చెప్పనివి. వేసవిలో అవనిగడ్డ వెళితే, రాజ్యమత్తయ్య ఏం చేస్తుందో, దాన్ని ఆనుకుని ఉన్న మా తాతగారి ఇల్లు ఇప్పుడెలా ఉందో కళ్ళకు కట్టినట్టు చెప్పేది. కిష్టలో ఆటల్లో వాళ్ళు మింగేసిన నీళ్ళ రుచీ, వాళ్ళ తోటలో కొబ్బరి నీళ్ళ రుచీ, ఆవిడ చెప్తే రెట్టింపయిపోయేవి. వాళ్ళ వానాకాలం చదువులూ, కందితోటల్లో ఆటలూ, నా ఊహలకు రెక్కలిచ్చి నన్నూ ఓ అందమైన లోకానికి తీసుకుపోయేవి. మా నాన్నగారి చిన్నప్పటి ముచ్చట్లూ, ఏడుగురు సంతానంలో ఆఖరువాడిగా పుట్టినందుకు ఆయనకు దక్కిన గారం, నలుగురు అక్కల అరచేతుల్లో సాగిన ఆయన అల్లరీ అన్నీ కథలు కథలుగా చెబుతూండేది. నా చేత పాటలు పాడించుకునేది. తన పిల్లలు ఆడి దాచుకున్న వంటింటి బొమ్మ సామాను మొత్తం తాటాకు బుట్టలో ఈ మేనకోడలి ఆటల కోసం అభిమానంగా అట్టేపెట్టింది.  

ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ నాకు మా అత్తయ్యే గుర్తొచ్చింది. మనందరికీ జీవితంలో అటువంటి వ్యక్తులు తారసపడుతూనే ఉంటారు - వాళ్ళతో జరిగిన సంభాషణల్లోని మాటమాటా మనకు విడిగా, ప్రత్యేకంగా గుర్తుండకపోయినా, ఆ అనుభూతి మాత్రం మనసుపొరల్లో ఎక్కడో భద్రంగా నిలిచిపోతుంది.

అందుకే అలాంటి వాళ్ళు ప్రత్యేకం. ఇలాంటి పుస్తకాలూ ప్రత్యేకం.

నెమరేసిన మెమరీస్ అన్నారే కానీ, ఇదీ కోతికొమ్మచ్చే. జీవితం లెక్కల ప్రకారం సాగదు. మనసూ పద్ధతిగా ఆలోచించదు. కాబట్టి, ఒక డైరీ్‌లా రోజు తరువాతి రోజు గురించి యాంత్రికంగా చెప్పుకుపోయిన కబుర్లు కావివి. ఒక జ్ఞాపకం మరో జ్ఞాపకాన్ని గుర్తు చేస్తోంటే, ఆ కొసలను పట్టుకుని అనాయాసంగా కథ పొడిగించుకుంటూ వెళ్ళిపోతారీవిడ.

ఈ పుస్తకంలో కొన్ని అందమైన పొట్టి కథలున్నాయి. వాటిలో కొన్ని మనం చిన్నప్పుడే పెద్ద వాళ్ళ దగ్గర వినేసినవి. జానపద గేయాల్లా, ఎవరు వ్రాశారో తెలీకపోయినా, మనమంతా చిన్నప్పటి నుండే వింటూ ఉన్నవి. వాళ్ళ నాన్నగారు చెప్పిన నల్లపిల్ల-నల్ల పెదవులు, గయ్యాళి భార్య- కంది పచ్చడి, ధర్మరాజు దుర్యోధనుల మంచీ-చెడు, కర్ణుడు-అర్జునుల దాన గుణం, అనన్యాశ్చింతయంతోమాం అంటే ఏమిటో ఓ పసివాణ్ణి అడ్డుపెట్టుకుని సులువుగా విప్పి చెప్పిన కథ, వినాయకుడిని చకారకుక్షి అని వేళాకోళం చేసిన కాళిదాసు - ఎలా తిరిగి ఆయనను ప్రసన్నం చేసుకున్నాడు? ఒక్క చకారం లేకుండా ద్రౌపదికి పాండవులేమవుతారో చెప్పడం వీలయిందా?, హేవిళంబి నాటకం, పోలి స్వర్గం ఇలా ఎన్నో. ఇవి కాక, భజనలు, నండూరి అన్నయ్యలు వరస కట్టి పాడిన గీతాలు, 'బాల కృష్ణ ' సంస్థ ద్వారా వీళ్ళు వేసిన నాటకాలు - ఒకటా రెండా! అపురూపమైన బాల్యాన్ని సొంతం చేసుకున్నారని అసూయ పొందేటన్ని కబుర్లు చెప్పారీవిడ.

ఇన్ని కథలు చెప్పినా, ఎక్కడా పాఠకులకు విసుగనిపించదు. నిజానికి, 'మా నాన్నగారు చెప్పిన కథ', 'మా మోహనం అన్నయ్య వరస కట్టి పాడిన పాట' - అంటూ లీలగా తొణికిసలాడే అతిశయంతో ఆ కథలూ, పాటలు కూడా పూర్తిపాఠాలు వ్రాసుకుంటూ వెళ్ళిన కారణానికేమో, శ్రీదేవి గారు ఆయా చోట్ల మనకి చెంపన చేయి పెట్టుకు వినే పసి పిల్లలా కనిపిస్తారు. అటుపైన అరటి ఊచ వేలికి చుట్టుకు అత్తగారిని కంగారు పెట్టిన కొంటె కోడలిగానూ, తన పిల్లలనూ, మరిదిగారి పిల్లలనూ, బాపుగారి పిల్లలనూ కలుపుకు నాకు ఆరుగురు పిల్లలని సగర్వంగా చెప్పుకునే అమ్మగానూ, ఒక పాత్ర నుండి మరొక పాత్రలోకి జీవితం ఎంత సహజంగా తనను తీసుకువెళ్ళిందో, అంత సహజంగానూ ఆ పరిణామ క్రమాన్నంతా అక్షరాల్లోకి అనువదించుకున్నారు. సరిగ్గా ఆ కారణానికే, ఇది ఒకసారి మొదలుపెడితే చివరిదాకా చదివించే పుస్తకం అయింది. రకరకాల వయస్సుల్లో రచయితను బాపు బొమ్మల్లో ఊహించుకుంటూనే ఈ పుస్తకం తిరగేస్తామనడం అతిశయోక్తి కాదు. (నిజంగానే అంతటి లావణ్యమూ ఆవిడ సొత్తని, పుస్తకంలో జతపరచిన ఫొటోలన్నీ తీర్మానించాయి) 

శ్రీదేవి గారి రచనలో ఇంకో చమక్కు ఉంది. హాస్య సంఘటనలు చెప్పేప్పుడు, లేకి హాస్యం వ్రాసేవాళ్ళంతా రచయిత స్థానంలో ఉంటూనే వాళ్ళే పగలబడి నవ్వేస్తారు. మనమిక్కడ నవ్వాలని వాళ్ళే చెబుతారు. శ్రీదేవిగారలా కాదు. అతి మామూలుగా అన్ని సంగతులతోటే ఇదీనూ అన్నట్టు చెప్పేసినా, మనం ఫక్కున నవ్వేస్తాం. నవ్వకుండా చెబుతారంటే మళ్ళీ అదేమీ "నోటితో చెబుతూ నొసటితో వెక్కిరించే" తీరూ కాదు. అది ఒక ప్రత్యేకమైన శైలి, అంతే. "అత్తగారి కథ"ల శైలి గుర్తొస్తుంది అక్కడక్కడా. కానీ ఆ పాటి ఆరోగ్యకరమైన వ్యంగ్యం కూడా ఉండదు.  

గీత-రాత అన్న జంటపదాలకి తెలుగునాట బాపురమణలు పర్యాయపదాలుగా మారడం ఈనాటి సంగతి కాదు. ఈ కలికాలంలో ఇలాంటి స్నేహమెలా సాధ్యమని ఆశ్చర్యపోయేలా బ్రతికారిద్దరూ. వాళ్ళ సినిమాల్లో అణువణువునా కనపడే అభిరుచిని గమనించినా, అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి మారిపోతూండే మనిషి మనస్తత్వాన్ని బేరీజు వేసిన తీరును చూసినా, తెలీకుండానే వాళ్ళ మీద ఆసక్తి, అభిమానమూ కలుగుతాయి. ఈ అభిరుచి గురించీ, ఆ అందమైన మనసులకు అద్దం పట్టే సంఘటనల గురించీ, ఈ పుస్తకంలో ఎన్నో ఋజువులున్నా, నాకు మరీ మరీ నచ్చిన రెండు విషయాలు ఇవీ :

"ఆళ్వార్పేట ఇంట్లో ముందు గేటు పక్కన పెద్ద జామ చెట్టు ఉండేది. అక్కడ పెద్ద ఖాళీ స్థలం ఉండేది. అక్కడ మెత్తటి ఇసుక పోయించి, ఉయ్యాల, జారేబల్ల, సీ.సా అన్నీ ఏర్పాటు చేశారు రమణగారు. సాయంత్రం చల్లబడ్డాక అక్కడ పిల్లలు ఆడుకునేవారు. చుట్టుపక్కల పిల్లలు కూడా వచ్చేవారు.

ఆ జామచెట్టు కొమ్మల మధ్య అమ్మలు ఒక దిండో, లేకపోతే రజాయో వేసి చక్కగా పక్క అమర్చుకునేది. తినడానికి ఒక డబ్బాలో కారప్పూసో, చిప్సో తెచ్చుకునేది. ఒక మంచినీళ్ళ సీసా పట్టుకుని జామచెట్టెక్కి సుఖంగా కూర్చుని ఏ పుస్తకమో చదువుకుంటూ కూర్చునేది. దానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పైన బాపుగారి దగ్గర్నుండి పాత హింది పాటలు వినిపిస్తూ ఉండేవి."

ఇక రెండవది, వాళ్ళ ఇంట్లో బావి తవ్వుతున్నప్పుడు :

"మండు వేసవిలో పనివాళ్ళు చెమటలు కక్కుతూ తవ్వకం పని చేస్తుంటే చూడటానికే కష్టంగా ఉండేది. ఇంట్లో పల్చటి మజ్జిగ చేసి, ఉప్పు వేసి, నిమ్మకాయ రసం పిండి స్టీలు బిందెలలాంటి దాంట్లో పోసి ఇస్తే, కొత్త ఇంటికి తీసుకు వెళ్ళి పనివాళ్ళకు ఇచ్చేవారు. వాళ్ళంతా పరమ సంతోషంతో మజ్జిగ తాగి, సేద తీరి, మళ్ళీ ఉత్సాహంగా పని చేసేవారు. బావిలో నీళ్ళు పై దాకా వచ్చాయి. పైగా తియ్యటి నీళ్ళు. అంతే కాకుండా తెల్లవారేటప్పటికి సంపు నిండిపోయి, కార్పొరేషన్ నీళ్ళు పైకి వచ్చేసి కాలవ లాగా ఇల్లు దాటి రోడ్డు మీదకి వెళ్ళిపోయేవి. రమణ గారికి చాలా సంతోషంగా అనిపించింది. పని వాళ్ళ దాహం కనిపెట్టి చూడటం వల్ల అంత జలసంపంద వచ్చింది అనేవారు. అప్పటి నుండి అదొక సెంటిమెంట్‌గా మారిపోయింది."

ఇందులో ఉన్నదంతా సున్నితమైన హాస్యం, సరసమైన సంభాషణలూ. వెకిలితనం మచ్చుకైనా కనపడని వ్యక్తిత్వాల పరిచయమూనూ. స్నేహితులైనా సన్నిహితులైనా, భార్యాభర్తల గురించి చెబుతున్నా, అత్తాకోడళ్ళ గురించి చెబుతున్నా, అదే తీరు.

ముచ్చటగొలిపే ఓ సంఘటన గురించి ఆవిడ మాటల్లోనే -

"ఒకరోజు రమణగారు ఇంటికి వస్తూ - 'పన్నెండు దాటుతోంది. మా ఆవిడ ఎదురుచూస్తూ ఉంటుంది' అనుకున్నారట. కారులో ఉన్న ఇంకొకాయన 'ఎన్నాళ్ళయిందేమిటి మీ పెళ్ళయి?' అని అడిగారు.

'ఎనిమిది నెలలైంది' అని చెప్పారు రమణ గారు. 'పెళ్ళయి ఎనిమిది నెలలైనా ఇంకా మీ ఆవిడ నీ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారా? అబ్బే ఉత్తిదే- శుభ్రంగా తినేసి రెండో జాము నిద్రలో ఉంటారు. అనవసరమైన భ్రమ పెట్టుకోకండి' అన్నారుట ఆయన. 'కాదులెండి- మా ఆవిడ మేలుకునే ఉంటుంది. నేను బెల్ కొట్టకుండానే తలుపు తీస్తుంది చూద్దురుగాని' అన్నారుట రమణ గారు. ఇంటికి వచ్చి- గేటు తీసి లోపలికి వచ్చి గేటు మూస్తుంటే వరండాలో లైటు వెలిగింది. కారులో ఆయన చేతులెత్తి దణ్ణం పెట్టి, 'మీరే గెలిచారండీ రమణ గారూ' అన్నారుట."

రమణ గారెప్పుడూ ఈ కథ చెప్పుకు మురుసుకుంటారని శ్రీదేవిగారు చెబుతోంటే, ఎంత బాగుంటుందో చదవడానికి.  ప్రేమంటే ఎదురుచూపులని కాకపోవచ్చు కానీ, ప్రేమంటే అపారమైన నమ్మకమంటే కాదనేవాళ్ళెవ్వరు?!

ఈవిడేమీ చేయి తిరిగిన రచయిత్రి కాదని నేను అన్న మాట నిజమే, అయితే, అది కేవలం వీరు మునుపు మరో రచన చేసిన దాఖలాల్లేకపోవడం చేతనే. అది మినహాయిస్తే, ఏ భావాన్నైనా నేర్పుగా పాఠకులకు చేరవేయడంలో ఆవిడ ఎవరికీ తీసిపోరనే అనిపించింది, పుస్తకం పూర్తి చేసేసరికి. రమణ గారి వియోగం గురించి చెప్పినప్పుడు బహు పొదుపుగా మాట్లాడిన ఈవిడ, మరి కొద్ది రోజులు గడిచాక సంగతుల గురించి వ్రాస్తూ "ఏడుపొస్తుంది." అంటూ మొదలెట్టినప్పుడు మాత్రం, గుండెల్ని కరిగించేశారు. నిజమే, ఆ వెలితి అనుభవంలోకి రావడానికి కూడా సమయం పడుతుందిగా. అదే కనపడుతుంది మనకి ఇక్కడానూ. అందుకే మనకీ అంత బాధ, ఆ పేజీల వద్దకొచ్చేసరికి. తెలియనిదెవరికి, "మిథునం" మన ఇంటింటి కథ! 

ఇద్దరు ప్రముఖ వ్యక్తుల జీవితాలతో ముడిపడి ఉన్న కథ కాబట్టి, మనకు పుస్తకం నిండా ఆసక్తిగొలిపే సంగతులెన్నో కనపడతాయి. అలనాటి వెండితెర రేరాణుల ప్రస్తావనా ఉంటుంది. ఆ తెర మీద వెలుగులెంత సంబరమో, ఆ తెర వెనుక నీడలెంత దుర్భరమో అన్నీ చెప్పకనే చెబుతుంది ఈ పుస్తకం. రమణ గారి కొండంత అప్పుని చూసి పిడికెడు హృదయంతో స్పందించి, ఊరటనిచ్చిన బాపుగారబ్బాయి వేణు గారి వ్యక్తిత్వం గురించి చదువుతుంటే, గుండె గొంతుకలో కొట్టాడుతుంది. "శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం, శ్రియా దేయం, హ్రియా దేయం, భియా దేయం, సంవిదా దేయం". అంతే! చదివిన ప్రతి మనసూ చలించిపోయేలా చెప్పుకొచ్చారు శ్రీదేవి గారు.

లెక్కకు మించిన మనుష్యుల పరిచయాల వల్ల, అక్కడక్కడా కాస్త ఇబ్బందిపడే మాట వాస్తవమే. కొన్ని సార్లు పేర్లను చూసి కాస్త అయోమయానికీ గురవుతాము. ఒకటికి రెండు సార్లు చదివితే తప్ప కొన్ని వరసలు అర్థం కావు. ఆఖర్లో కొత్త ప్రాంతాలు చూసినప్పుడు కలిగిన ఆలోచనలు, ఆ వర్ణనలు కూడా కలిపారు. అవి, ముందంతా పుస్తకం నడచిన తీరుకి కాస్త భిన్నంగా ఉండటంతో(మనుష్యుల ప్రస్తావన లేకుండానో, లేదా తక్కువగానో..), కించిత్ అసంతృప్తి కలుగుతుంది. అయినా, ఈ పుస్తకం మిగిల్చే అనుభవం ముందు వీటిని నలుసులుగానే జమకట్టాలి.

జీవితాన్ని గొప్పగా గడపడం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు మనమిచ్చుకునే జవాబు మీద ఈ పుస్తకం నచ్చడమూ నచ్చకపోవడమూ ఆధారపడి ఉంటాయి.

వెనుతిరిగి చూసుకుంటే, మన చిననాటి అలకలూ-అల్లర్లు, ఇప్పుడు తగ్గించుకున్న మొండితనమూ, ఇప్పటికీ మనలో తొంగి చూసే అమాయకత్వమూ, మనం దాటలేమనుకున్న కష్టాలను కాలం పొత్తిళ్ళల్లో భద్రంగా దాటి వచ్చిన తీరూ, ఇక ఆపై నవ్వుకోవడమూ, మనం కోల్పోయిన వారి జ్ఞాపకాలు కూడా బాధించకుండా ఓదార్పునివ్వడమూ, మన చుట్టూ మనం గీసుకున్న పరిథి ఎంత చిన్నది కానివ్వండీ, అక్కడ కొందరికి చోటివ్వడమూ, సాయానికి చేయందివ్వడమూ, తప్పులొప్పుకుని కలిసి బ్రతకడమూ, నవ్వడమూ- నవ్వించడమూ - నా దృష్టిలో నేను గొప్పగా బతికాను అని చెప్పుకోవడానికి ఇవి చాలు. కాబట్టి నాకిది నచ్చింది.

ముందే చెప్పినట్టు, ఇది ఒక మామూలు అమ్మాయి కథ. మనని మనకు చూపించే కథ. మన వాళ్ళని గుర్తు తెచ్చే కథ. మనం మరచిపోయిన సంగతులు గిల్లి గుర్తు తెచ్చి నవ్వించే, ఏడిపించే కథ. మనను ఎత్తుకు ఆడించిన పిన్నులు, పెద్దమ్మలు, మేనత్తలు, మేనమావలు, మన తర్వాత పుట్టిన మన వాళ్ళందరూ - మనకు తెలీకుండానే జీవితాన్ని అమృతభాండంగా మార్చిన రోజులను ఏ అతిశయోక్తులూ ఏ అలంకారాలూ వాడుకోకుండా ఏ నీతి సూత్రాలతోనూ మనకు చిరాకు తెప్పించకుండా, అలవోకగా గుర్తు చేసిన అందమైన కథ. 

ఆత్మకథల్లో అరుదుగా కనిపించే నిజాయితీ ఒక్కటీ చాలు, ఈ పుస్తకాన్ని దాచుకు దిగులనిపించినప్పుడల్లా చదువుకుందుకు.

సత్యశోధకుడు గాంధి

గాంధి అన్నది ఇప్పుడు మనలో చాలా మందికి అతి సామాన్యమైన పేరు. మనం వినీ వినీ చలించకుండా పోయిన పేరు. మన ఊరిలో ఏ ప్రత్యేకతా లేని ఓ వీధి పేరు. మనం నిర్లక్ష్యంగా పారేసే రూపాయి నోటు మీది బొమ్మ పేరు. ఓ భగత్సింగ్ పేరు వింటే వెన్ను నిటారుగా అయి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నట్టు, గాంధి పేరు చెబితే ఎప్పుడూ నాలో స్పందన కలిగేది కాదు. భగత్‌సింగ్ తనకు ఉరిశిక్ష విధించబడిందని తెలిసిన రోజు “ ‘విప్లవమంటే భగత్‌సింగ్’ అని ప్రజలు నమ్ముతున్నారు. నేను ఇప్పుడు చనిపోకపోయినా జీవితకాలంలో ఏ క్షణమైనా సిద్ధాంతాలకు భిన్నంగా ప్రవర్తిస్తే ప్రజలు దానిని వ్యక్తికి ఆపాదించరు. విప్లవ సిద్ధాంతానికి ఆపాదించి నిరసిస్తారు. కొన్ని వేల గుండెల్లో స్పూర్తిని నింపుతున్నాననుకుంటూ, నవ్వుతూ మరణించగలను” అన్న మాటలను, పసితనంలో అమాయకత్వంతో కురిసిన కన్నీళ్ళతోనూ, యవ్వనంలో ఆవేశంతోనూ, అటుపైన ఆ మాటల్లోని లోతైన భావానికి చలించి కృతజ్ఞతతోనూ కొనియాడినట్టు, గాంధిని మనస్పూర్తిగా అభినందించిన క్షణాలు నా జీవితంలో లేనేలేవు… “సత్యశోధన” పుస్తకం నా చేతుల్లో పడేవరకూ. అది కూడా ఎప్పుడు? మన లోలోపలి పేరుపెట్టలేని వేదనో వెలితో లేదా సందిగ్దతో మనను నలిబిలి చేస్తూన్నప్పుడు, ఓ అనుమానమో అవమానమో మనసును పట్టి కుదిపేస్తున్నప్పుడు, ఈ అనుభవాల నుండి ఏనాటికైనా బయటపడే మార్గముందా అని అడిగేందుకు కూడా మరొకరెవ్వరూ కనపడనప్పుడు, కనపడ్డా అడగాలని అనిపించనప్పుడు, ఇదుగో, ఈ సత్యశోధన లాంటి పుస్తకమొక్కటి మళ్ళీ మనని నిబ్బరంగా నిలబెట్టగలదు అనిపించింది.

పద్ధతిగా బ్రతకడమంటే పర్వర్షన్, ఇంద్రియ నిగ్రహం కోసం ప్రయత్నించడం తమని తాము మోసం చేసుకోవడం; వ్యాయామం చేయడమంటే అనారోగ్యం కలిగి ఉండటం; దేవుణ్ణి నమ్మడమంటే పాపం చేసి ఉండటం; జీవితకాలపు సహచరుడి కోసం అలవాట్లు మార్చుకోవడమంటే పతివ్రతలా నటిస్తూ లోపల ఏడవటం; సంస్కారం మాయముసుగు; సంతోషం నటన; ఉద్యోగం అవసరం; ప్రేమ బలహీనత; మంచితనం మూర్ఖత్వం – ఈ రోజు మన చుట్టూ స్వేచ్ఛగా చలామణీ అవుతున్న ఈ నిర్వచనాలన్నీ చూస్తూ చూస్తూ, సత్యాన్ని శోధిస్తూ ఓ మనిషి తన జీవితంలోని ప్రతి తప్పుని అంగీకరిస్తూ దాన్ని దాటి వచ్చిన వైనాన్ని జీవితాన్ని తెరిచిన పుస్తకం చేస్తూ విప్పి చెప్పాడంటే ఎంత ఆశ్చర్యమో! అసత్యం నుండి సత్యం వైపూ, భోగాల నుండి సరళజీవిత విధానం వైపు, ఆవేశం నుండీ ఉద్వేగం నుండీ సౌమ్యత వైపూ స్థితప్రజ్ఞత వైపూ జీవితపు చివరి క్షణాల వరకూ ప్రయత్నపూర్వకంగా ఒక్కో అడుగూ వేసుకుంటూ వెళ్ళిన ఒక మహాత్ముడు, ఇక్కడే, ఈ నేల మీదే తిరిగాడంటే నమ్మశక్యం కాని కల్పనలానే అనిపించింది. రాజకీయంగా అతనేమిటో ఈ పుస్తకంలో నాకు దొరకలేదు. ఆ మరకలు తుడిపే ఆసక్తీ నాకు లేదు. కానీ, ఒక్క రామ మంత్రాన్ని నమ్ముకుని బ్రతుకుని పండించుకున్న మనిషి అందించగల స్పూర్తి ఇంతింతని మాత్రం చెప్పనలవి కాదు. తనకు తానే నియమాలు విధించుకునీ, తనను తానే కష్టపెట్టుకుని, సత్యంతో ప్రయోగాలంటూ తనకు మాత్రమే తెలిసిన, తెలియాల్సిన కోణాలను చూసే ఆసక్తి ఉన్నంతమందికీ చెప్పుకుని… ఏం సాధించాడయ్యా ఈ బక్కపల్చని మనిషీ అంటే… అందుకూ సమాధానమూ ఆ బ్రతుకు పుస్తకపు చివరి పుటలో దొరికింది నాకు. అజామిళోపాఖ్యానము చదివిన వారెవ్వరికైనా ఆఖరు క్షణాల్లో రామనామ స్మరణ ఎంత గొప్ప వరమో, ఎంత పుణ్యఫలమో అర్థం కాకపోదు.

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...