తీపి విషం


విరిగిపడ్డ స్వర్గ శకలం నుండి
నవ్వుతూ రమ్మని పిలిచింది
చేయందించింది, లాగింది
నాది కాని ఏదో లోకంలోకి.
మునివేళ్ళతో పెదవులను ముద్దాడి
మధువు నాపై చిమ్మినట్లుంది
మ్మ్మ్...మత్తు ! తెలుసా,
మరెవ్వరి పిలుపూ వినిపించనంత
మరింకెవ్వరి చూపూ సోకనంత
బద్దలవుతోందే హృదయం,
ఆ గొడవేమిటో వినపడనంత!
మదిరపాత్ర ఎప్పుడు చిట్లిందో
ముత్యాలెలా తివాచీపై దొర్లాయో
బ్రతుకు స్పర్శ చూపిన రాతిరిని
మళ్ళీ ఏ చీకటి మింగేసిందో
ఇంకా గుచ్చుకుంటోన్న
కలల  గాజు పెంకులూ
ఇంకా నెత్తురోడుతోన్న
జ్ఞాపకపు తునకలూ
చెప్పవెందుకని?
సాకీ,
నువ్వైనా?

నందకిశోర్ కవిత్వం - "నీలాగే ఒకడుండేవాడు"

*తొలి ప్రచురణ - సారంగ వారపత్రికలో.

" కాలే  గచ్చుపై కుంకుండు  గింజలు గీకి
నాకు  తెలీకుండా నువ్వు  చురుగ్గా అంటించినప్పుడు 

పరిక  పొదల్లో గుచ్చిన  ముళ్ళని
నొప్పి  తెలీకుండా నేను  సుతారంగా తీసినప్పుడు

ఎర్రటి  మధ్యాహ్నం మనం  భూతద్దపు చేతులతో  
రెండు  పచ్చి అగ్గిపుల్లలని  వెలిగించ చూసినప్పుడు"

ఈ  గుప్పెడు పదాలూ  చదివేసరికి, మనం ఎక్కడి వాళ్ళమక్కడి నుండి తప్పుకుని, పసితనపు వీథుల్లోకి  పరుగూ తీస్తాం. జ్ఞాపకాన్ని వెన్నెలకిరణమంత సున్నితంగా స్పృశిస్తూ, మనకే  తప్ప మరొకరికి  తెలీదనుకున్న బాల్యాన్ని అక్షరాల్లో గుప్పిస్తూ "నీలాగే  ఒకడుండేవాడు" అంటూ పేరుతోనే మనసులకు ఎర వేసి లాగిన వాణ్ణి - 'ఆ మాట నీకెలా తెలిసిందసలు' అంటూ ప్రశ్నించేందుకు సిద్ధమవుతాం. నిండా పాతికేళ్ళు నిండని పసివాడు కదా, బహుశా కవిత్వమంటే బాల్యమేనన్న భ్రమలో ఉన్నవాడేమో కదా, లోకాన్ని చూడని  అమాయకత్వం పదాల్లో  వెల్లువలా పొంగుతోంటే, కవిత్వమంటూ మనకిచ్చాడు కానీ...అని ఊహిస్తూ ఊరికే పేజీలు తిరగేస్తోంటే..

"వెన్నెల స్నేహితా! నిన్నేమీ అనను. నువ్వు చేస్తున్న  దేన్నీ ప్రశ్నించను. నీకు దేహం  కావాలి. సత్తువతో  నిండిన దేహం. శుభ్రత నిండిన  మనసు, స్వచ్ఛత  నిండిన ఆత్మ  కావాలి. మనం  మనమై జీవించడం  కావాలి. అనుభూతి సంపదను సృష్టించడం  కావాలి. ఏం  చేద్దాం?! అవేమీ  నా దగ్గర  లేవు. ఉన్నదల్లా  ఒక అనారోగ్యమైన  దేహం, గాయాలు  నిండిన మనసూ, వెలుతురు లేని  ఆత్మ. నీ  అద్భుత హృదయం  లాంటిదే నాకూ  ఉంటే బాగుండు. ఈ విషాదాలు, నిషాదాలూ అన్నీ  ఒకేసారి అంతమైతే  బాగుండు. చిందరవందరగా  పడి ఉన్న  ఊహలకి నిశాంతమేదైనా  ఆవహిస్తే బాగుండు. కానీ- 
కానీ, ఏదీ జరగదు. ఒక పిచ్చి  ఊహలో తప్ప  ఏవీ ఎక్కడా  అంతమవవు.

దుఃఖిత  సహచరీ! 

మసకలోనే అడుగులేస్తాను. మసకలోనే తప్పిపోతాను. మసకలోకానికే జీవితం  రాసిచ్చి ప్రయోజనం  లేకుండా పరుగు  తీస్తాను."  అంటూ  ఊపిరి వేగం  పెరిగేంత ఉద్వేగం కలిగిస్తాడు. ఎవరితను? చలాన్ని గుర్తు చేసేంత తీవ్రతతో జ్వలించిపోతున్న పిల్లవాడు - ఎవరితను?

నేల రాలిన నక్షత్రం


ఆమె
ఆకుపచ్చ గీతమై
అడవి గుండెల్లో ఒదుగుదామనుకుంది.
వాన చినుకులా
సముద్రమంత ప్రేమలో కరుగుదామనుకుంది
ఆకాశమై అతను కవ్విస్తే
చుక్కలా చెక్కిలిని ముద్దాడుదామనుకుంది. 
అతడు
అడవి కాడు
వసంతం.
సముద్రమూ కాదు 
ప్రవాహం.
ఆకాశమైనా అయి ఉంటే,
నక్షత్రం నేల రాలేది కాదు
  
--------------------------------------------
తొలి ప్రచురణ, వాకిలిలో.

ఒక్కో రోజు


అరవిరిసిన పూవులేవో మంచు మత్తులో తూలుతూండగానే
మసక వెన్నెల వానలో లోకమింకా తడుస్తూండగానే
విశాల శాద్వలాల్లో స్వప్నసంచారాన్ని అకస్మాత్తుగా ముగించి
దేని కోసమో దిగులుపడుతూంటుంది హృదయం
జీవన పయనాన్ని లయగా నడిపించే
నిర్వికల్ప సంగీతమేదో ఆగిపోయినట్లై
సంకల్ప వికల్పాలన్నీ ముళ్ళుపడుతుంటే…
కాలపు కుండకు చిల్లులు పెట్టి
అట్టడుగున పేరుకున్న అనుభవాలేమిటని
దోసిలితో పైకెత్తి చూస్తాను
మానస సరోవరాన స్వేచ్ఛగా మసలే
రాజహంసల సమూహాలను దాటుకుని
లోతులను తాకే ప్రయత్నమొకటి చేస్తాను
ఏదో రహస్యం.. అర్థమయ్యీ కానట్టు
ఏదో వెలుగు లోలో మిణుకు మిణుకుమంటూ
ఇన్నాళ్ళెందుకు సాగిందీ ప్రతీక్ష!
జీవితం పునరావృతమవుతున్న పురాగీతమేనన్న స్పృహ కలిగాక
చరణాల మధ్య నిశ్శబ్దమెందుకో తేలిగ్గానే తెలిసొస్తుంది
ముందు వెనుకలకు కాని మలి ప్రయాణం మొదలయ్యాక
లోలోపలి లోకాల్లో సంగీతం తిరిగి నిండుగా పరుచుకుంటుంది.
________________________
**తొలి ప్రచురణ.. ఈమాటలో.

మరో తోటలోకి...


మెలకువొచ్చేసరికి ఈ తోటలో..

నాలుగు దారులు, నాలుగు కూడళ్ళు.
 
ఏ దారిలో ఏ పూవులెదురొస్తాయో
ముందే తెలిసిన వాళ్ళెవరుంటారనీ?
ఏమీ వెంటతేని చేతులకూ ఆశలెందుకో
ఏనాడెవరాలోచించారనీ?
 
దారులు,మలుపులు..
దాహాలూ మోహాలూ
దోసిట్లో అయాచితంగా..
రాసుల్లా రాలిపడే బహుమానాలు.
 
పరుచుకునే చీకట్లలో మసకబారే మార్గాల్లో
వెంపర్లాట దోచుకున్నది సమయమొకటేనా?
బరువెత్తే భుజాల్తో సాగిపోయే ప్రయాణాల్లో
గాడిద కూలిపోయేదా గడ్డిపోచ బరువుకేనా?
 
మూసిన గుప్పెళ్ళని వదిలేయడమో
మూతలు తెరవని సంచీలిక విసిరేయడమో
తప్పనిసరి నడక కదా,
ఇప్పుడే ఇక్కడే తేలాలి, తేలికపడాలి.
 
ఆఖరు అడుగు పడే వేళకి
అమృతపు చుక్కొక్కటి దొరికినా...
మళ్ళీ రానీ తోటలోకి.


 ****************************

"రంజాన్ చంద్రుడు"

విజయవాడలో మొదటి నుండీ సందడికొచ్చిన లోటేమీ ఉండేది కాదు. అటు తుమ్మలపల్లి కళాక్షేత్రంలోనో, ఘంటసాల సంగీత కళాశాలలోనో, బందరు రోడ్డులోని టాగోర్ లైబ్రరీలోనో..ఎప్పుడూ ఏవో సంగీత సాహిత్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరుగుతూనే ఉండేవి. ఇంజనీరింగ్ రెండో ఏడో..మూడో ఏడో...,వయసు "మరోప్రస్థానాని"కీ, మనసు "అమృతం కురిసిన రాత్రి"కీ ఓటేస్తున్న సంధికాలం. జావాలూ, "సి" నోట్సులూ గీతాంజలి కవితలతో నిండిపోయి లోకమంతటినీ కొత్తగా చూపెట్టిన కాలం. రోజూ వీచే గాలీ, ప్రతి రోజూ కనపడే సూర్యాస్తమయాలూ,  పొద్దున నవ్వి రాత్రికే వాడి నేల ఒడి చేరే పూవులూ...అన్నింటిలోనూ అందాకా తెలియని సౌందర్యాన్ని దర్శించిన రోజులవి. సహజంగానే కవిసమ్మేళనాలంటే కలిగిన ఆసక్తితో, ఒకరోజు స్నేహితురాలిని వెంటేసుకుని, ఒక సభకు వెళ్ళాను. వెళ్ళే దాకా బానే ఉన్నాను కానీ, వెళ్ళాక ఆ వాతావరణం అదీ చూస్తే గుబులుగా అనిపించింది. నిర్వాహకులు "రంజాన్ చంద్రుడు" అనే శీర్షిక మీద కవితలు వ్రాయమన్నారుట. చాలా మంది కవులు కవితలు వ్రాసుకు తీసుకు వచ్చారు. నేనేమీ వ్రాయనే లేదూ...పోనీ వెళ్ళిపోదామా అనుకుంటూనే తటపటాయిస్తూ ఉండిపోయాను. ఒక్కొక్కరూ వెళ్ళి, తమ కవితలు చదివి వినిపిస్తూండగా...ఒక మధ్య వయసు వ్యక్తి హడావుడిగా వచ్చి నా పక్కన కూర్చున్నారు. "చాలా సేపయిందా మొదలయ్యీ?" వినపడీ వినపడకుండా అడిగారు. "లేదండీ, ఇప్పుడే, ఓ పది నిముషాలైందేమో.." తలతిప్పకుండా బదులిచ్చి మళ్ళీ కవితలు వినడంలో మునిగిపోయాను. మరో ఐదారుగురు చదివాక, నా పక్కన కూర్చున్న వ్యక్తి స్టేజీ మీదకు వెళ్ళి తన కవిత చదవడం మొదలెట్టారు.  ఆయన గొంతు..ఆ పలుకుల్లో మెత్తదనం....ఆ కవిత, ఆ ఎత్తుగడ, వాడిన పదాలు..ముగింపూ....ఆయనలా చదువుతుంటే నేనొక కొత్త లోకానికి వెళ్ళిపోయాను. మనసంతా పట్టరాని ఆనందం.

శ్రావణ రాత్రులు

శ్రావణ రాత్రులు నిద్రపోనివ్వవు

అకస్మాత్తుగా అవనిని ముద్దాడే వాన చినుకులూ
పుష్పాభిషేకాలతో పుడమి క్రొంగొత్త పులకింతలూ
గూటిలో ఒదిగిన గువ్వల వలపు కువకువలూ..
శ్రావణ రాత్రుల్లో కన్నులు మూతపడవు!

కొద్దికొద్దిగా గిల్లుతూ చలి ముల్లు
కాస్త కాస్తగా తడిపే తుంటరి జల్లూ
రేయంతా రెక్కలు తెరుచుకునే ఉండాలిక
అద్దాల మేడ మొత్తం మసకబారిపోయేదాకా

దీపాలారే వేళల్లో లయగా ఈ నేపథ్య సంగీతం
ఏనాటిదో ఓ పురాస్మృతిగీతాన్ని జ్ఞప్తికి తెస్తూ
మన్ను పరిమళంలా మెల్లగా లోలో సుళ్ళు తిరుగుతూ
ఆషాఢ రాత్రుల విరహానికి వీడ్కోలవుతోంటే

లేలేత నడుమును చుడుతూ పెనవేసుకునే బంధాలు
అనాచ్ఛాదిత గుండెలను చుంబించే నెన్నుదిటి ముంగురులూ
కొనగోటి స్పర్శల్లో ఏ స్వప్న లిపి ఆవిష్కృతమవుతుందో గానీ..
మెరుపులేమో నీలి కన్నుల్లో..వెలుగులన్నీ దహరాకాశంలో

శ్రావణ రాతురులు...లోకాలను నిదుర పోనివ్వవు...!!



** Thanks to N.S.Murthy Garu, You can now find the English translation to this poem at : http://teluguanuvaadaalu.wordpress.com/2013/09/25/the-monsoon-nights-manasa-chamarti-telugu-indian/

స్వాతికుమారి కవిత్వం - కోనేటి మెట్లు

ఈ మంత్రలోకపు అలౌకిక సౌందర్యాన్ని తన ఆలోచనాలోచనాలతో దర్శించి, కవిత్వంగా మన ముందుకు తీసుకు వచ్చిన నేటి తరం కవయిత్రి - స్వాతి. తన మానసిక పరిస్థితికి అనుగుణంగా ప్రకృతికి పదాల హారతి పడుతూ ఆ వెలుగుల్లో మనకీ ఓ కొత్త అందాన్నిపరిచయం చేయగల సమర్ధురాలీమె. కవిత్వమెందుకూ వ్రాయడమంటే... "మనదైన ఒక స్వాప్నిక జగత్తు మనకోసం ఎప్పుడూ ఎదురు చూస్తుందనే ధీమాతో వాస్తవ జీవితం తాలూకూ కరకుదనాన్ని, నిర్లిప్తతని ధిక్కరించగలిగే ధైర్యాన్నిస్తుంది కవిత్వం. కవిత్వమంటే అనుభూతుల పెదవులపై నర్మగర్భం గా వెలిసే ఒక చిలిపి నవ్వు, నవ్వులనదులన్నీ ఆవిరైపోయాక చివరికి మిగిలే ఓ కన్నీటి బొట్టు. అన్నీ ఆశలూ అడుగంటాక కూడా బ్రతకడంలో కనిపించే చివరి అర్ధం”   అని బదులిస్తూ , "కోనేటి మెట్లు" అన్న శీర్షికను ఎంచుకోవడంలోనే తన అభిరుచిని మచ్చుగా చూపెడతారు.

సంపుటిలోని ఒక్కో కవితా ఒక్కో కోనేటి మెట్టులా..లోతుగా ఉంటూనే, ఆఖరకు కోనేటి నీరంత స్వచ్ఛమైన ప్రశాంతమైన ప్రదేశానికి మనను తోడ్కొని పోతాయి. ఈ సంపుటికి ముందుమాట వ్రాస్తూ, మిత్రులు మూలా సుబ్రహ్మణ్యం గారు అననే అంటారు - "కోనేటి మెట్లు తీసుకెళ్ళే లోతుల్లోనే కోనేరు ఉంటుంది -  ఎంతటి గోపురమైనా, చివరికి ఆకాశమైనా అందులో ప్రతిఫలించాల్సిందే! కవిత్వానికి ఇంతకు మించిన ప్రతీక ఏముంటుంది" అని.

ప్రశ్నా చిహ్నాలు కనపడని ఆలోచనలు, సందేహాలంటూ మన ముందుంచే లోతైన ప్రశ్నలు ఈ సంపుటిలో కోకొల్లలు. ఎన్ని వేల ఆలోచనల ప్రతిఫలమో ఈ ఒక్క కవితా అనిపించే సందర్భాలూ ఉన్నాయి.

"నీటి మడుగు చుట్టూ రెల్లు గడ్డి పహారా
సుడులు రేపుతూ కలల గులకరాళ్ళు"


నేలకు దూకిన జలపాతం


వర్డ్స్‌వర్త్ ఒక కావ్యంలో "కన్య జలపాతం చూస్తూ గడిపితే, ఆ జలపాతంలో లయ, క్రమము, ధ్వని, నాదము- వీటి సమ్మేళనం వల్ల ఏర్పడే సంగీతం, సౌందర్యం ఇవన్నీ కన్య శరీరంలో జొరబడీ ఆ కన్యని అందంగా చేస్తా"యంటాడు. ఇంకొకరి జీవితానుభవాలను, మరొకరి కవిత్వాలను మనం అర్థం చేసుకోగలమే కానీ, అవే భావోద్వేగాలను అదే స్థాయిలో అనుభవించడం సాధ్యమయ్యే పని కాదనిపిస్తుంది. బహుశా అందుకేనేమో, మొదటిసారి అది చదివి, అతనిది భలే చిత్రమైన ఊహ సుమా అనుకున్నానే కానీ, ఆ రహస్యం నాకర్థమవుతుందని మాత్రం కలగనలేదు. ఆశ్చర్యమేమిటో తెలుసా..."శివ సముద్రం" జలపాతాల దగ్గర నిను చూసినప్పుడు, ఆకాశపు కొస నుండి జారిపడుతోందా అన్నట్లున్న ప్రవాహం క్రిందుగా నిల్చుని నవ్వుతోన్న నీకు దగ్గరగా నడచినప్పుడు...అకస్మాత్తుగా వర్డ్స్‌వర్త్ మాటలకు అర్థం తెలిసింది నాకు. 

జలపాతమంటే నువ్వు..తెరలు తెరలుగా విస్తరించే నీ నవ్వు. తడిస్తే ఆ నవ్వుల్లో తడవాలి. జలపాతమంటే నువ్వు..నీ చిలిపి చిందులు...చేతనైతే ఆ అల్లరి ప్రవాహాన్ని అడ్డుకోగలగాలి. జలపాతమంటే...సఖీ..దానికి నిజమైన పర్యాయపదం నీ సౌందర్యం! అందులో మార్గం తెలియని సుమనస్సునై తేలిపోవాలి..లేదూ..నిశి నీలి పెదవిపై నుండి జారిపడే అమృతపు బిందువునై వచ్చి నీలో ఐక్యమవాలి. గమ్యం నీవే అయినప్పుడు, మార్గాలతో నాకేం పని ? 

సమ్మోహన మీ మోహన గీతం..


కవిత్వంలో నిరంతరం నవ్యత కోసమే అన్వేషణ సాగినట్లు కవిత్వచరిత్ర నిరూపిస్తుంది. ఆ రహస్యాన్ని జీర్ణించుకుని, తెలుగునాట సాహిత్యాభిమానులను తన కవిత్వంతో ఉర్రూతలూపిన కవి మో! తన సమ్మోహనకరమైన శైలితో స్వీయముద్రను ప్రతీ రచనలోనూ ప్రస్ఫుటంగా చూపెట్టిన అతి తక్కువ మంది కవుల్లో, 'మో' ముందు వరుసలో ఉంటారు. మో రాసిన ప్రతీ కవితా విలక్షణమైనదే! అది అనుసరణనూ అనుకరణనూ దరి చేరనీయని అనన్యమైన మార్గము.

'మో' గా సుపరిచుతులైన వేగుంట మోహన ప్రసాద్ కవిత్వమంతా వైయక్తిక దృక్పథంతో సాగిపోతుంది. ఆ కవిత్వానికి ముసుగులుండవు, నటనలుండవు. స్వచ్ఛమైన భావాలతో తరగని స్వేచ్ఛాకాంక్షతో స్పష్టాస్పష్టంగా కనపడే తాత్విక చింతనతో మో రాసిన మొట్టమొదటి సంపుటి - "చితి-చింత".  కవితా వస్తువు కవిత్వంలో ప్రాథమికంగా నిలబడని ప్రతిచోటా, కవి గొంతు, కవి భావం బలంగా వినపడతాయని విశ్వసించిన వ్యక్తి మో. ఆ భావమే వస్తువుగా మారి కవిత్వాన్ని నిలబెట్టగలదని నమ్మాడాయన. నిరూపించాడు కూడా! కానీ, మో రచనలు చదివే వారిలో అత్యధికులు ఇక్కడే అయోమయానికి లోనవుతారు. వస్తువును వెదుక్కునే అలవాటు నుండి బయటపడలేక - అతి ప్రాచీనమైన తమ తప్పుడు తూనికరాళ్ళతో, మో కవిత్వాన్ని తూచే విఫల యత్నం చేసి, నిరాశ పొందుతారు.

"నా కోసం మంచు రాల్చిన ఆకాశమా
చివరికి నువ్వే రూక్ష వీక్షణాల్తో నను శిక్షిస్తే
నికోలస్ రోరిక్ వేసిన
"సోర్స్ ఆఫ్ గాంజెస్"
హిమాలయ చిత్రాల మంచు సోనల నీడల్లో దాక్కుంటాను
అక్కడొక్కచోటే మనిషి
జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది.
మాటిమాటికీ
బ్రతుకు దుఃఖాలకి ఆడపిల్లలా కన్నీళ్ళు నింపుకునే నగ్ననేత్రం
చీకిపోయి
నీళ్ళోడి
చివరికి అక్కడొక్కచోటే జ్ఞానదీపం వేడిగా కాలుతుంది" (చితి-చింత : ఆలస్యం కవిత నుండి)

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....