"సత్యం వద్దు, స్వప్నమే కావాలి" - శివలెంక రాజేశ్వరీదేవి

*తొలిప్రచురణ : ఈమాట, జనవరి-2017 సంచికలో

మనం చూడాలనుకున్న, చూడబోతున్న సినిమా కథను వేరెవరైనా చెప్పబోతుంటే, చేతులడ్డు పెట్టి వారించేస్తాం. ఆ అనుభవమేదో మనమే పొందాలని, ఆ ఉద్వేగం కొత్తగా మనకే చేరాలని, వేరొకరి కళ్ళతో చూడటాన్ని వీలైనంతా దాటుకుంటూ వచ్చేస్తాం. అయితే, శివలెంక రాజేశ్వరీదేవి (16/1/1954 – 25/4/2015) కవిత్వం నాకంత వెసులుబాటునివ్వలేదు.

శివలెంక రాజేశ్వరీ దేవి
(1954 – 2015)
ఆమె గురించి మొదట విన్నదే, ‘ఈ రోజు ఉదయం, హాస్పిటల్‌లో రాజేశ్వరీదేవి మరణించింది,’ అన్న మాట ద్వారా. మానవ సహజమైన సానుభూతితో అటుపైన కనబడ్డ నల్ల అక్షరాల వెంట వెళితే, ఆ శోకఛాయల మీదుగానే నాకొక కొత్త ప్రపంచం కనపడింది. సత్యం వద్దు, స్వప్నమే కావాలి అనుకున్న స్వాప్నికురాలు, ఆ కలలకు కూడా దూరంగా ఉన్న రాత్రుల్లో రాసుకున్న కవితలు కనపడ్డాయి.
తెలుగు కవిత్వంలో దిగులు అన్న పదం వినగానే తట్టే మొదటి కవయిత్రి రేవతీదేవి. అకారణంగా కాదు, కొన్ని విషయాల్లో సుస్పష్టంగా కనపడే భావసారూప్యత వల్ల, మొదటి పేజీల్లోనే రేవతీదేవి గుర్తొస్తుంది.
దిగులు
దిగులుదిగులుగా దిగులు
ఎందుకా
ఎందుకో చెప్పేవీలుంటే
దిగులెందుకు
అన్న రేవతీదేవి మాటలొక వంక, రాజేశ్వరీదేవి కవిత శైవలిని (పు:61) ఒక వంక ఉంచితే, వీళ్ళిద్దరి కవిత్వంలో సారూప్యమేమిటో, ఎందుకు ఎలా వీరిద్దరూ ఒకరికొకరు భిన్నమో తెలిసిపోతుంది.
ఈ కవిత ఎత్తుగడలోనే రాజేశ్వరీదేవి ఇలా అంటుంది.
స్నేహితుడా!
అడగడానికైతే అడిగావు
రెండే రెండు చిన్న ప్రశ్నలు
హౌ ఆర్ యూ? హౌ ఈజ్ లైఫ్
చెప్పటానికేం లేదు
చెప్పుకోటానికి చాలా ఉంది

సత్యం వద్దు స్వప్నమే కావాలి
రాజేశ్వరీదేవికి ఈ దిగులు ఒక దిగుడుబావి అని, దిగి ఎవరి పూడిక వారే తీసుకోవాలనీ తెలుసు. ఉన్నవన్నీ పాకుడు మెట్లని, అడుగున ఎక్కడో నీళ్ళమీద తేలుతోన్న నాచుతెట్టు వల్ల తన ప్రతిబింబం (తన అసలు ముఖం, తన సంతోషం) ఏవీ కనపడటం లేదనీ తెలుసు. అయినా, ఆ పాకుడుమెట్ల దారి మీదుగా వెళ్ళి, పూడిక ఇక ఎన్నటికీ తీసుకునే వీల్లేదన్న బెంగ మాత్రం లేదు. నిరాశ లేదు. నమ్మకమే ఉంది. వర్షం వస్తుందని, అప్పుడిక బావిలో నీరు పొంగి పొర్లి, ఏ పూడికతీతా అక్కర్లేకుండానే కల్మషాలన్నీ కొట్టుకుపోతాయనీ ఆమె విశ్వాసం. అపారమైన నమ్మకంతో, ‘అప్పుడిక ఆకాశ ప్రతిబింబమే కనిపిస్తుంది’ అని ముగిస్తుంది కవితని. అదీ రాజేశ్వరీదేవి. ఒంటరితనం, ఒక్క మాట కోసం పరితపించిపోయే ప్రాణం, ఏ క్షణంలోనూ కారణం తెలీనివ్వని దిగులు, ‘దేవతలు అలా వెళ్ళారో లేదో, దెయ్యమై చుట్టుకునే నిజం’ లాంటి పగటి పట్ల వెరపూ ఉన్నా, అంతటిలో నుండీ ఆశను వెతుక్కోవడం ఈమె కవిత్వపు జీవలక్షణం. రేవతీదేవికి వినడం కావాలి, రాజేశ్వరీదేవికి పక్కవాళ్ళు మాట్లాడటమే ముఖ్యం. మూగవోయిన గొంతు అన్న కవితలో ‘నాకూ చెప్పాల్సిందేదో ఉండి ఏదో చెప్పబోతే, ఎవ్వరూ వినిపించుకోరు. అందుకో మరెందుకో…’ అని రేవతీదేవి మాట్లాడటమే మానుకుంటే, ‘ఎవ్వరూ హృదయం ఒంపి మాట్లాడరెందుకని?’ అన్నది రాజేశ్వరి ఆరోపణ.
ఇవాళ నువ్వేది మాట్లాడినా వింటాను
సిగ్గును రెండు ముక్కలు చేసి
మనసును రెండు చెక్కలుగా కోసి-
ఎందుకంటావా?
అవ్యక్తాల్నిలా ప్రేమించినందుకే
 (అట్లా చేశానా, పు:41)
రాజేశ్వరీదేవి తాకగానే చిట్లిపోయే గాజుబొమ్మంత సున్నితమైన మనిషిలా ఉందని వెనుకమాటల్లో మిత్రులొకరు అంటారు. అదే భావన ఆమె కవితలూ కలిగిస్తాయి. ఆమెలో ఎదుటి వ్యక్తిలో ఉన్నది ఉన్నట్లుగా తీసుకోగల హృదయం ఉంది. మార్పు అనివార్యమన్న ఎరుక, ఒక స్థిరత్వాన్ని, స్థిరచిత్తాన్ని అన్నివేళలా ఆశించడం అవివేకమన్న మెలకువ ఉన్నాయి.
అప్పుడలా ఉన్నావు వెన్నెలలా
ఇప్పుడిలా ఉన్నావు చీకటిలా
ఏం చెబుతాను చెప్పు
ఎప్పుడూ ఒకేలా ఎలా సాధ్యం
 (ఏదో అలా అలవోకగా ఆలాపనై, పు:53)
అని వాపోయింది అందుకే.
ఆమె కోర్కె చాలా చిన్నది. ఆమె మాటలు కోరుకుంది. మర్యాద కోసం ఓ మాట, మొహమాటానికి వెలిగిన నవ్వు, ఆమెకు తృప్తినివ్వలేదు. బ్రతుకంతా ‘హృదయం ఒంపి మాట్లాడే స్నేహాని’కై ఎదురుచూసింది.
ఆకలేసి అన్నం అడగలేదు నిన్ను
దాహమయి మంచినీళ్ళు అడగలేదు
బట్టల్లేక దుస్తులూ అడగలేదు
ఒక్క చిరునవ్వు అడిగాను
బజారులో సిగ్గులేక
అని ఒక్క చిరునవ్వు కోసం, బాహాటంగానే దోసిలి పట్టి నిల్చుంది. అటువంటి సందర్భాల్లో ప్రస్తుత సమాజం తనకి ఏ రకంగా బదులిస్తుందో కూడా నిష్ఠూరంగా ఇలా రాసుకుంది.
లోతుగా గాయపడిన వేళ
మనసు సాచి ఇంటింటికీ తిరిగినా
ఏ తలుపూ తెరుచుకోదు
మాతృభావన ఎరగని మార్కెట్ సమాజం
ముఖం తిప్పేసుకుంటుంది
ఆమె స్త్రీవాద రచయిత్రులతో స్నేహంగా మసలినా ఆమె నిజానికి ఒకే వాదంలో చిక్కుపడ్డ మనిషి కాదు. స్త్రీవాదులు కోరుకునే స్వేచ్ఛను ఆమె బలపరిచి ఉండవచ్చు కాని, అంతకు మించి మనుషులందరి మధ్యా మానవీయ సంబంధాలు ఉన్నతంగా, ఉదాత్తంగా ఉండాలని కలలు కన్న కవిత్వం ఆమెది.
స్వేచ్ఛ కావాలి ప్రేమ కావాలి
రెండూ కళాత్మక స్వప్నాలు
వాటివెంట పడమంటే
ఎండమావుల వెంట పడటమే
పెనుగాలికి బయటా ఊపిరాడదు
ఉక్కపోతకి లోపలా ఊపిరాడదు
రక్షణ మాత్రమే
 (అసలు సంగతి పు:75)
ఆమె కవిత్వ ధోరణిని గురించి ఈ కవిత క్లుప్తంగా చెబుతుంది. ఆమె కవిత్వంలో అర్థం కాని ప్రతీకలు కానీ అర్థం కాని పదాలు కానీ కనపడవు. ఈ కవితనే తీసుకుంటే, ముందు వాక్యాల్లో తలుపులన్నీ వేసి ఉంచినా – అన్నది చదివాక, బయటా లోపలా ఊపిరాడదు అన్నది సామాన్యమైన అర్థంలో ఏమంత గొప్ప భావన కాదు. కానీ, రాజేశ్వరి ఇక్కడ, అడుగు బయట పెట్టాక దొరికే అతి స్వేచ్ఛని పెనుగాలితోనూ, మూసిన తలుపుల వెనుక మాత్రమే దొరికే ప్రేమని ఉక్కపోతతోనూ పోల్చింది. ‘పెనుగాలిలా మారని స్వేచ్ఛ,’ ‘ఉక్కపోతనివ్వని ప్రేమ’ – ఈ రెండూ సాకారమయ్యే లోకం ఆమె కల. ఎంత అస్థిమితమైన మనసునైనా ఆమె ఇలా స్థిమితంగా కాగితం మీద పెట్టగలదు. ఎంతటి అయోమయాన్నయినా అమాయకపు పసిపిల్ల ప్రశ్నలానే మనముందుంచగలదు. కానీ, ఆ ప్రశ్నలు అంత సూటిగానూ ఉంటాయి. తరాలుగా ప్రశ్నించకుండా పనిచేసుకుపోతున్న పెద్దవాళ్ళకి, అకస్మాత్తుగా పిల్లలు ప్రశ్నించినప్పుడు కలిగే కలవరమే పాఠకుల్లోనూ కలుగుతుంది. ఆ రకంగా, ఈ కవిత్వం పైకి కనపడేంత సరళమైనదని చెప్పలేం. ఎంచుకున్న విషయం మానవసంబంధాల గురించైనప్పుడు, హృదయ సంబంధి అయినప్పుడు, ఇలాంటి సరళత నిజానికి మరింతగా భయపెడుతుంది. పిల్లల ప్రశ్నలకి మన దగ్గర జవాబులు లేవని కాదు, అవి అన్నివేళలా మనమే ఒప్పుకోలేక కలిగే కలవరము; మారే ఉద్దేశ్యం ఉన్నా మారనివ్వని పరిస్థితుల వల్ల మనలో కలిగిన జడత్వాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలీక ఎదురయ్యే ఇబ్బంది, సరిగ్గా ఇవే, రాజేశ్వరీదేవి కవిత్వం మనకు కలిగించే భావాలు.
పైన పంక్తుల్లో పేర్కొన్న కవి వాక్యాలు, సినిమా పాటల్లో మాటలు, పుస్తకాల పేర్లు, ఇవన్నీ రాజేశ్వరీదేవి తన కవితలకు తానే స్వయంగా అద్దిన మణిపూసలు. ఈ కొసరు సొగసుల్లో విస్తృతి, వైవిధ్యము, అప్పటి ఉద్వేగానికి సరీగ్గా సరిపోయే పదాల ఎంపికలోని చాతుర్యం, ముచ్చట కలిగిస్తాయి. ‘ఏకాంతమూ సాయంత్రమూ ఎద నీకై వేచినదీ,’ మొదలుకుని ‘లాలి లాలి అను రాగం సాగుతుంటే,’ దాకా, ‘జిగిరీ’ నుండి ‘ఆకుపచ్చ లోయ’ దాకా, రాగాల మీదుగా, రంగుల లోకాల మీదుగా ఆమె సారించిన చూపు గమనించదగ్గది.

సం: నామాడి శ్రీధర్.
ప్రేమలేఖ ప్రచురణలు, 2016.
అత్యుత్సాహం ఒక్కోసారి వరదలా మాటలు పొంగిస్తుంది. అది కవిత్వానికి సుగుణం కాదని మనకు తెలుసు. నిరుత్సాహమూ పదాల్లో కొన్ని సార్లు సరిగా బయటకు రాలేక తడబడుతుంది. కొన్ని సందర్భాల్లో అది కవితాభివ్యక్తికి, అది అందజేయదలచిన ఉద్వేగానికి న్యాయం చేసినట్లు అనిపించినా, ఒక సంపుటిలో కనపడ్డప్పుడు, అది ఎందుకు ఆకర్షించలేకపోతుందో, ఎందుకు మనకి ఎడంగా నిలబడుతోందో తేలిగ్గానే తెలుస్తుంది. రాజేశ్వరీదేవి మరణానికి కొన్ని రోజుల ముందు ఆంధ్రజ్యోతికి పంపిన కవితలో కూడా ఏదో మహోద్వేగం ఉంది, పైకి స్పష్టంగా కనపడని విషాదం ఉంది, కానీ అది కూడా మనని తనలో కలుపుకునే ప్రవాహధోరణిలో సాగింది కాదు. అది బహుశా ఆంతరంగికులకే అర్థమయ్యే భావం, వెరసి కవిత్వానికి కొంచం దూరం.
మనమున్న జీవితానికి, మనం గీసుకున్న పరిథి దాటి రావడమంటే యుద్ధంతో సమానమైపోయింది. గీతకి అవతలివైపు నుండి చేయి కనపడ్డప్పుడు, అది యుద్ధం నుండి బయటపడేసే సాయమేనేమో అనుకునే మనస్తత్వం దాదాపుగా మాయమై, అది సాయం కోసం చాచిన చేయేనని తీర్మానించుకుని, చూసీ చూడనట్టు వెనుతిరగడం పరిపాటైపోయింది. మనకి మన యుద్ధం మనం చెయ్యడం మటుకే అలవాటయ్యింది. ఇలాంటి ఒక కాలంలో, ఒకరి మాట కోసం దిగులు పడ్డామని, మరో మనిషి కోసం కన్నీరొలుకుతోందని ఎవరైనా అంటే, అది వారి వ్యక్తిగత సమస్యగానే పరిగణించడం నేరమేమీ కాదు. ఇలాంటి సందర్భంలోనే కవిగా రాజేశ్వరి పలికిన రెండు గొంతులు గమనించదగ్గవి. అది తన దుఖఃమైతే, ‘ఎవరి దిగులు బావి పూడిక వారే తీసుకోవాలని’ సరిపెట్టుకున్న మనిషి, పరుల బాధ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చూపిన సహానుభూతి అపురూపమైనది. నీకోసం (పు:86), జాగరణ (పు:95), పద బాధల మధువుల్ని తాగుదాం (పు:101), అన్న మూడు కవితల్లోనూ కవి హృదయం స్పష్టంగా తెలుస్తుంది. ‘నీకోసం మళ్ళీ పుట్టాలనుంది’ అంటూ, ‘నీకు అమ్మనవడానికి నా మాలిన్యాన్నంతటినీ కడిగేసుకోవాలనుంది,’ అనడంలో స్త్రీ సహజమైన ప్రేమ ఒక్కటే ఉంది అనుకున్నా –
ఎవరినో ప్రేమిస్తాం
ఎవరినో ద్వేషిస్తాం
ఎవరినో పూజిస్తాం
ఇంకా ప్రేమిస్తూ ద్వేషిస్తూ పూజిస్తూ కూర్చునే వేళా ఇది
ఇక్కడ నేను శూన్యాన్ని మోస్తున్నాను
నా ఒక్కరి ఖాళీనే మోస్తున్నానా ఏమిటి
ఎందరెందరిదో (జాగరణ, పు:95)
అన్నప్పుడు, మరెవరి బాధలకో స్పందిస్తూ ‘పద, బాధల మధువుల్ని తాగుదాం’ అన్న మఖ్దూమ్ వాక్యం గుర్తు చేసుకున్నప్పుడు – అప్పుడు, మనకు నిజంగా తెలుస్తుంది, ఇలాంటి ఒక స్పందనకు మామూలు స్త్రీ హృదయం సరిపోదని. తనకంటూ నలుగురు మనుషుల్ని కుటుంబంలా సమకూర్చుకుని, వాళ్ళను తనకు బందీలుగానో, తాను వాళ్ళకి బందీగానో ఉండే స్త్రీ ఎన్నటికీ ఈ తరహా కవిత్వం రాయలేదు. ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా?’ అని పదే పదే పాడుకున్న దయాళువైన స్త్రీ ఒక్కతే ఈ కవిత్వం రాయగలదు. అలాంటి స్త్రీ ఒక్కతే, తానెంత బాధలో, నిస్పృహలో ఉన్నా, మరొకరికి ఆసరా కాగలదు. అమ్మ కాగలదు. ఆ మాతృత్వ భావన ఆమెకు అనాయాసంగా అందిన వరం. మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదైనా నొక్కిచెప్పాల్సి వచ్చినప్పుడు ముద్దుపేరుతో పిలిచే తల్లిలా, మహాకోపంగా మాటలాడుతూ కూడా నచ్చజెప్పే గొంతులోకి తనకు తెలీకుండానే తిరిగిపోయే తల్లిలా, రాజేశ్వరి ఉండుండీ ‘చిన్నా’ అని పిలవడం సంపుటిలో కనపడుతుంది. అదీ రాజేశ్వరీదేవి స్వభావం.
కొందరి కవిత్వాల గురించి మాట్లాడేటప్పుడు, కవి ఇలా అన్నాడు, కవిత చెబుతున్నదిదీ అని వ్యక్తి నుండి కవిని వేరు చేసి చెప్పడం రివాజు. కొందరి విషయాల్లో ఆ పద్ధతిని అనుసరించడం అసాధ్యం. ఎందుకంటే, వీళ్ళ వ్యక్తిత్వమే వీళ్ళు రాసిన కవిత్వం. తన నుండి తాను వేరుపడి రాసి వొదిలిన దొంగ ఉద్యమగీతాలో, తను ఎన్నడూ అనుభవించని ఉద్వేగాలకి రంగులద్దగా ఒలికిన స్వప్నగీతాలో కావు వీళ్ళ కవితలు. వీళ్ళు చూపించిన (లేదా చూపించదలుచుకున్న) జీవితమే వాళ్ళ అక్షరాల్లోనూ ఉంటుంది. సంపుటి మొత్తం ఒకే ధోరణిలో, ఒకే భావజాలంతో వెలిగిపోతుంది. పాఠకులుగా మనం ఆగి చూడక్కర్లేదు, ఒక అనుభూతి చట్రం నుండి విడివడి మరొకదానిలోకి ప్రవేశించవలసిన కష్టం లేదు. బ్రతుకంతా ఒక్క మాట కోసమే పరితపించే మనిషి, ఏ ఏటికాయేడు తనను తానెట్లా నిలబెట్టుకుంటూ వచ్చిందో పుట వెనుక పుట తిప్పుతూ తెలుసుకుంటామంతే.
మోసపోయాననిపించినపుడు, ‘ఆకాశానికి కూడా బట్టలు తొడిగే నాగరికత’కి ఆశ్చర్యపడినప్పుడు, నిస్తంత్రీవీణెలు ఉన్నట్టుండి తెగిపోయినప్పుడు, ఒక్క పాటతో, ఒక్క నక్షత్రపు మెరుపుతో, ఒక్క కలతో, ఒక్కటంటే ఒక్కటే ఆశతో, అన్నేళ్ళ జీవితాన్ని ఒంటరిగా దాటడమెలానో చెప్తుంది రాజేశ్వరీదేవి కవిత్వం. ఈ సంపుటి మూర్తీభవించిన ఆమె అమాయకత్వం. ఏదో ఒక రాత్రి అకస్మాత్తుగా తలుపు మీద మునివేళ్ళ చప్పుడు వినపడుతుందని, కేవలం మన గొంతు వినడానికే ఒకరు పలకరిస్తారని, అమానవీయమైన లోకం మీద రాజేశ్వరి పెంచుకున్న పిచ్చి నమ్మకానికి మిగిలిన ఆఖరి గుర్తు, సత్యం వద్దు, స్వప్నమే కావాలి. ఇప్పుడిక, ‘రాత్రి కవితై పెనవేసున్న అక్షరాలు, పగలు వచనమై విడివడతాయని’ బెంగటిల్లిన రాజేశ్వరీదేవికి, తన కవితలు రేపవళ్ళు వెలిగే నక్షత్రాలై కాంతులీనుతున్నాయని ఎవరు చెప్తారు?

సంక్రాంతి

గొబ్బెమ్మలు లేవు,
భోగిమంటలూ ఈ చేతులతో వెయ్యలేదెప్పుడూ
అపార్ట్మెంటు జీవితం అందివ్వని భోగాల్లో
ఇవీ ఉన్నాయన్న బెంగ కూడా లేదు
పండగంటే, కొత్తబట్టలు, పిండివంటలూ
బొమ్మల కొలువులూ, నా నలుగురు స్నేహితులు-
ఇంతే,
మాటల్లో చెప్పుకోవటానికి ఇంతకన్నా ఏం లేదు కానీ

అక్షతలతో కలిసిన భోగిపళ్ళు, బంతిపూరేకులు
తలమీద నుండి ఇలా జారుతాయో లేదో
కుర్చీల్లో నుండి చప్పున కిందకు దూకి
చప్పుడు చేసిన రాగిబిళ్ళల కోసం వెదికే పిల్లల్లా
ఒకదానివెనుక ఒకటి దీవెనల్లా సాగిపోతున్న రోజుల్లో కూడా,
సంక్రాంతి పేరు వినపడగానే,
కోల్పోయిన జ్ఞాపకాల కోసం
గతంలోకి వంగి వంగి చూస్తాయి ఆలోచనలు

ఎక్కడ చిక్కుకుంటే ఏం,
దారపు కండెను వదిలి వెళ్ళిన గాలిపటాలను
ఇప్పుడు కాసేపైనా గమనించాలని ఉంది

"బియాండ్ కాఫీ" - ఖదీర్‌బాబు

మంచి కథ అంటే, మనని తనలో కలుపుకునేది. రచయిత సృష్టించిన లోకంలోకి మనని తీసుకు వెళ్ళి, అక్కడి వాళ్ళని, వాళ్ళ చేష్టల్నీ, ఒక్కోసారి వాళ్ళ మనసుల్ని కూడా, చూపించి, మళ్ళీ మన దోవన మనని వదిలిపోయే రెక్కల గుర్రం లాంటిది కథ.  మనని ఎంత నమ్మిస్తే అంత మంచి కథ. మన దోవ మనకు గుర్తు రాకుండా, మన సమయం గురించి మనకిక ఆలోచన లేకుండా, కథే నిజమన్న నమ్మకం కుదిరిస్తే, అది మంచి కథ. కానీ, కొన్ని కథలుంటాయి. ఖదీర్‌బాబు "బియాండ్ కాఫీ" లాంటి కథలు. సత్యానికీ, సత్యం అని మనం నమ్మే దానికీ మధ్య నున్న పల్చటి తెరని, అక్షరాలతో మెల్లగా పక్కకు జరుపుతూ పోయేవి. అన్నిలోకాలనూ ఒక్కటి చేసేవి. ఉన్నచోటే నిలబెట్టి, మన చుట్టూ ఉన్నవే, మనం చూసీ చూడనట్టున్నవే, బలవంతంగా మన కళ్ళకు చూపించేవి. చేదుగా ఉండేవి. భయాన్ని, బాధను కలిగించేవి. ఆలోచన ఒక్కటే ఆఖరి బహుమతిగా మిగిల్చేవి.

మనకి మన చుట్టూ ఏదో జరుగుతోందని తెలుసు. తప్పకుండా తెలుసు. పేపర్లలో చూస్తున్నాం, టి.వి. లలో వింటున్నాం. అలా విన్న వాటి గురించీ, చూసిన వాటి గురించీ తప్పొప్పులు ఎవరికి చేతనైనంత వాళ్ళు చెప్పుకుంటున్నాం. 'ఇలా ఏలా చేశాడు'? అనో, 'ఇలా మనమెప్పటికీ చెయ్యకూడదు' అనో అనుకుంటూనే ఉన్నాం. అలా మనం తీర్పులిచ్చిన మనుషులను పోలిన మనుషుల కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. "బియాండ్ కాఫీ" తో కలిపి మొత్తం పది కథలు. పన్నెండు కథల్లోనూ ప్రథాన పాత్రల్లో ఉన్నవాళ్ళ సమస్య- లేమి. ప్రేమ కోసమో, మాట కోసమో, శారీరక సుఖం కోసమో- లేమితో కొట్టుమిట్టాడిపోయే ప్రాణాలివన్నీ. ఏ కోరికైనా కానివ్వండి, మనకసలు ఆ పదమంటేనే ఏదో చిన్నచూపు ఉంది. వెరపు లాంటిదేదో ఉంది. మితిమీరిన ప్రతి కోరికా, వ్యసనం, - అదొక మానసిక వ్యథ అనీ, దాని వెనుక అర్థం చేసుకోవాల్సిన కారణాలుంటాయనీ ఈ సంపుటిలో కొన్ని కథలు చెప్తాయి. ఆ కారణాలు తెలుసుకుని, వాటిని అతి తెలివితో వాడుకోదలచిన ప్రబుద్ధుల కథలూ ఉన్నాయి.

మనం ఎంత అవకాశవాదులమైనా, మనని ఇష్టంగా నమ్మి వచ్చిన వాళ్ళ పట్ల మనకి జాలి ఉంటుంది. కొంత బాధ్యత కూడా ఉంటుందేమో. మనని నమ్మి వచ్చినవాళ్ళకి, మనం తలపెట్టదలచిన హాని కంటే పెద్దదేదో వేరొకరి వల్ల జరగబోతోంటే, పెదగీత ముందు చిన్నగీత లా, మనలోని చెడు చిన్నదైపోతుంది. ఆచరణగా మారిపోతున్న మరొకరి దుర్మార్గపు ఆలోచన ముందు, మనకే స్పష్టత కుదరని మన చెడు ఊహ, కుదించుకుపోయి, చెరిగిపోయి, మరో ఆలోచనగా మారి, మంచిదిగా స్థిరపడుతుంది. ఇది చాలా సహజమైన మానవ స్వభావం. చిన్నవో పెద్దవో రోజువారీ సంఘటనల్లోనూ మనకు ఎదురుపడే మనుషుల స్వభావం. కానీ దాన్ని కథగా చెప్పడం చాలా కష్టం. " అపస్మారకం" కథలో ఆ నేర్పు మనకు స్పష్టంగా కనపడుతుంది. అలా అని ఈ కథ కానీ, ఆ మాటకొస్తే ఈ పుస్తకంలోని వేరే కథలు కానీ, నీతి వైపు మొగ్గిన కథలు కావు. నీతికథలో, మంచి కథలో కానే కావు. ఇవన్నీ విపరీతమైన ఉద్వేగాలున్న, మానసికంగా ఎంతో అలిసిపోయిన మనుషుల కథలు. సరిగ్గా చదవకపోతే, పిచ్చివాళ్ళ కథలనిపించే కథలు. మరి ఇలాంటి కథలు చదవడమెందుకూ, కోరి మనని మనం బాధపెట్టుకోవడానికి కాకపోతే అంటే - నాదొక్కటే సమాధానం - ఇవి "కరుణ ముఖ్యం" అన్న ఇస్మాయిల్ మాటల్ని మనకి మళ్ళీ గుర్తు చేసే కథలు. తప్పకుండా చదవమని నేను సిఫార్సు చెయ్యను. కానీ చదివితే, మన మాటా, మనం మన వాళ్ళతో, అసలెవ్వరితోనైనా మసలుకునే తీరు కొంచం ప్రభావితమవ్వచ్చునేమో.

ఇవన్నీ స్త్రీల సమస్యల మీద కథలే. చిత్రంగా, తప్పు మాత్రం వాళ్ళది కాదు. గృహహింస మీద కథలున్నాయి, కానీ ఆ గాయాలన్నీ కళ్ళకు కనపడనివి. వాటిని పైకి కనపడేలా చూపించడం, ఒక్క ఖదీర్‌బాబుకే సాధ్యమైంది. తెగిపడ్డ వేళ్ళనీ, వాటి పైన పురుషుడు కప్పుకున్న గ్లోవ్స్‌నీ, ఖర్చైపోతున్న టాక్ టైంనీ, ఎక్కడో ఎవరిదో సెల్ బద్దలైతే తప్ప నిద్రపట్టని మరొక స్త్రీ ఉన్మాద స్థితినీ, చాలా మామూలుగా, ఉన్మాద ఛాయలేమీ కనపడని పదాలతో, అరుపులూ, కేకలో, రక్తాలో, నఖక్షతాలో, ఏమీ లేని, ఏ గుర్తులూ లేని, చూపలేని అవస్థని అలవోకగా రాసేశాడు ఖదీర్. బహుశా ఆ కారణానికే ఈ కథలు వెంటాడతాయి. మళ్ళీ మళ్ళీ చదివించి, ఆలోచింపజేస్తాయి. "టాక్టైం", "మచ్చ", "ఏకాభిప్రాయం", "బియాండ్ కాఫీ" ఇవన్నీ ఈ కోవలోకి చెందిన కథలే. మనం ఎంత విముఖంగా ఉన్నట్టు నటించినా, ఒక ఆత్మీయమైన పలకరింపు, నిందారోపణ లేని మాటా, మనని ఎంత ఓదారుస్తాయో, ఎంత బలాన్నిస్తాయో "ఘటన" లాంటి కథ చెప్తుంది.  అమాయకపు వయసులో పుట్టిన ప్రేమ పట్ల, ఆ తొలిప్రేమ కలిగించిన మనిషి పట్లా, అప్పుడు మనసులో ఎన్ని ఆలోచనలైనా రావచ్చు గాక, వాటి పట్ల ఎన్నేళ్ళైనా ఎలాంటి పశ్చాత్తాపమూ ఉండదనీ, అదెప్పటికీ మధురమైన జ్ఞాపకమేననీ "వహీద్" కథ చెప్తుంది. అదంతా ఆ వయసుకు పట్టిన అదృష్టం. ఆ పసివయసుకు మాత్రమే చెల్లే భోగం.

మనుషులు ఎందుకు మాట్లాడుకోవడం లేదు? మాట్లాడినప్పుడు మనం అసలు ఏం కోరుకుంటున్నాం? మన వృత్తీ, ఉద్యోగాలు, మనమే నిర్వచించుకుంటోన్న మన జీవితాలు మనం ధర్మంగా గడపడానికి ఏ మాత్రం వెసులుబాటునిస్తున్నాయి? ఈ జీవితం, దీని నడక - ఇది పక్క వాళ్ళను బట్టి మారుతోందా? మారాలా? మారవచ్చా? ఒంటరితనం ఈ కాలపు మనుషుల్ని ఎలా శాసిస్తోంది? ఎందుకు అన్ని జబ్బుల్నీ మించి ఇది భయపెడుతోంది? ఒక మాట సాయం కోసం, ఒక మనిషి సాయం కోసం ఆత్ర పడుతూనే, ఒక గీత దాటి ఎవ్వరికీ సాయపడకూడదనీ, దగ్గర కాకూడదనీ, బాధ్యతలకు వీలైనంత దూరం జరగాలనీ మనం ఎందుకు కోరుకుంటున్నాం? ఇందులో వైరుధ్యం లేదా? బాధ్యత ఉన్నచోటే భరోసా ఉంటుందని మనకు తెలియదా? కారణాలక్కర్లేని ప్రేమ గురించి వదిలెయ్యండి, కారణాలున్న ప్రేమను కూడా కాదనుకునేంత స్వార్థం, దానికి భిన్నంగా లోలోపలి నుండి కొరికేస్తున్న ఒంటరితనంతో, ఓటమికి చేరువయ్యే యుద్ధం - ఎందుకు చేస్తున్నాం ఇదంతా? 

నలుగురి మధ్య సాగే ప్రయాణానికీ, నీడ కూడా సోకని దారిలో నడవటానికీ చాలా వ్యత్యాసం ఉంది. ఏదేమైనా మనకొకరున్నారన్న భరోసా మొదటి దారిలో ఉంటే, ఏమీ కాకుండానే కలతపడే అనారోగ్యకరమైన వాతావరణం రెండవ దారిది. తూలిపడితే చెప్పడానికి ఇక్కడ ఎవ్వరూ ఉండరు, తప్పటడుగు వేస్తే దారి మళ్ళించే దిక్కూ ఉండదు. కానీ, ఆ ఒంటరి ప్రయాణంలో మనం ముందెవ్వరూ చూడని గొప్ప మజిలీ చేరుకోవచ్చు, స్థిరచిత్తంతో మనకు కావాల్సిన లక్ష్యానికి అందరికంటే ముందే చేరుకోవచ్చు. వెనక్కి లాగే వాళ్ళు లేక, కోరినంత ఎత్తులకూ ఎగిరి, ఎదిగి - మనం కోరింది సాధించుకోవచ్చు. కానీ అంతకు ముందుగా, అంత ధృడంగా, స్థిరంగా మనమున్నామా, అంతలా సిద్ధపడే ఉన్నామా అలాంటి ప్రయాణాలకి? అదీ ప్రశ్న!

నాకు ఈ పుస్తకం చదివాక కలిగిన ప్రశ్న.

ఈ పుస్తకం చదివారా? అని అడిగినప్పుడు, ఇందులోని ఒక కథ పేరు చెప్పి, తన జీవితంలో ఈ మధ్యే జరిగిన ఒక మార్పు గురించి చెప్పి, అదే లేకపోతే, నేనా కథలో నాయిక లాగే..అలాగే..ఫోన్ రీచార్జ్ చేయించుకుని - అని ఆపేసిందో సన్నిహితురాలు. గుండె జారినట్టైంది. ఈ కథలు మనకెంత దగ్గరో, ఎందుకు వీటిని సమకాలీన కథలు అంటున్నామో, సమకాలీన సమాజమేనని అంటున్నామో, ఇప్పటి కథలు ఇప్పటి సమాజాన్నే ప్రతిఫలించాలనడంలో కొందరి ఆశ ఏమిటో, నాకూ కొంత తెలిసినట్టైంది.

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....