Showing posts with label * పయనించెనెచటికో..మనసు పరవశించెనెందుకో. Show all posts
Showing posts with label * పయనించెనెచటికో..మనసు పరవశించెనెందుకో. Show all posts

సంగమ

 

బెంగళూరు నుండీ ఓ 90 కిలోమీటర్లు. పేరు తెలియని గుబురు చెట్ల నడుమ, అర్కావతి, కావేరి నది కలిసిన సంగమ స్థలి. అక్కడికి వెళ్దామని నా స్నేహితురాలు ఎప్పటినుండో పోరు పెడుతోంది. వర్షం కురిసి తీరుతుందని ఆకాశం హామీ ఇచ్చిన ఓ ఆదివారం గానీ మా రెండు కుటుంబాలకూ తీరిక చిక్కలేదు.
**
అర్కావతీ కావేరి అక్కడి అడవి గుండెల్లోని నదులు. అడవి గుండె చప్పుడు లాంటి నదులు. అడవి చెట్ల అందాన్ని, మారే ఆకాశపు రంగులనీ నీటి మిలమిలల్లో చూపించే నదులు. అడవీ, ఆకాశం, కొండలు, నదులు. నీటి మధ్యలో బండరాళ్ళు. నీటి నిండా పరుగులు తీసే చేపలు. చూపులకే తప్ప దోసిలికి చిక్కని ఆ చిరుమీల మెరుపులు. నదిలోకి జారిగిలబడినా, నా ఎత్తుకి నడుం కూడా దాటని నీళ్ళు. లేజీ రివర్ అని వాటర్ వర్ల్డ్ లో చెప్తారే, ఆ నకలుకి అసలు ఆనాటి మా అనుభవం. చేతులు చేతులు పట్టుకుని ఆ ప్రవాహంలో కుదురుగా కూర్చోవడం దానికదే ఓ ఆట. మెలమెల్లగా సాగే ప్రవాహం ఉండీ ఉండీ ఉధృతమైతే ఎవరో మెత్తంగా తోసినట్టే కొన్ని అంగుళాలు కదులుతాం. అంతే. మళ్ళీ అడవి గాలి. నింపాది నదీప్రవాహం. నది మధ్యన ఇసుక పాయల్లో తడుస్తూ మెరుస్తూ గవ్వలు. రమ్మని పిలిచే గులకరాళ్ళు. మేఘాల నీడ ఆవరించుకుంటే ఆశ్చర్యంగా తలెత్తి చూడటం, ఆకాశమే గొడుగు విసిరేసినట్టు వానపడితే ముద్దైపోవడం...చిట్టిదోసిళ్ళు అల్లరి నింపుకుని నా మీదకొస్తే, ఇష్టంగా ఒంగి లొంగిపోవడం, తడిసిపోవడం, ఆటగా వెనక్కి వాలిపోవడం...
**
తినడానికి వెనక్కి వచ్చేస్తుంటే విశాలమైన మైదానం, ఖాళీగా ఉండి పిలుస్తోంది. ఆ మైదానం అంచుల దాకా డ్రైవ్ చేసుకెళ్ళిపోయాడు అనిల్. దిగి చూస్తే, కనుచూపు మేరంతా నిర్మానుష్యం, ఆవలి వైపున కొండలు. ఆ కొండలను కవ్వింపుగా తాకిపోతున్న మేఘాలు. తెంపరి గాలి.
ఆకలో ఇంకా ఉపశమించని ఉత్సాహమో, పిల్లలు రెట్టించకుండా తిని తిరిగి ఆటలకు వెళ్ళిపోయారు. మేం పరుచుకున్న దుప్పట్లు మాత్రం ఉంచి, మిగతావన్నీ కార్‌లో సర్దేసింది దీప్తి.
ఆ మైదానంలో వెల్లకిలా పడుకుని కళ్ళు మూసుకుంటే, నా రెప్పల వెనుక ఒక మేఘపు బరువు. కళ్ళు తెరిస్తే, రెప్పల మీద వాలనుందా అన్నంత దగ్గరగా ఆకాశం. ఉండీ ఉండీ కొండ దారిని మెలిపెడుతూన్నట్టు ఓ గొర్రెల మందను తోలుకుపోతున్న కాపరి గరుకు గొంతు. దూరంగా ఎక్కడో స్నేహితులతో అనిల్. తూనీగలను పట్టుకోవాలని పరుగెడుతున్న పిల్లల కేరింతలు. చేయి కదిపితే అందే దూరంలో, గడ్డి పరక మీద వాలి ఉన్న ఓ తూనీగ. దాని రెక్కల మీద ఎగిరిపోయిన నా కాలం.
**
తిరుగుప్రయాణం. దారంతా అటూ ఇటూ వేపచెట్లు. కేవలం మా కోసమే ఆగినట్టు ఆగి, మళ్లీ మొదలైన జడివాన. రాలిపడ్డ పండుటాకును తోయలేని ప్రయాసతో, ఊగుతూనే ఉంది వైపర్. ఎదురొచ్చే వాహనాల మీదుగా ఒక్కో వెలుగు కిరణం ఆ వానలో వెయ్యి రంగులుగా చీలిపోతోంది. నీళ్ళల్లో చేపలా, మైదానంలో తూనీగలా అటూ ఇటూ పరుగులు తీసిన పసి ప్రాణం నిద్రకు నా ఒళ్ళో చోటు చూసుకుంటోంది. అలవాటుగా సర్దుకుని జోకొడుతున్నాను. వాడి జేబుల్లో నది చల్లదనాన్ని దాచుకున్న గులకరాళ్ళు. వాటి నున్నదనానికో చల్లదనానికో ఒళ్ళు ఝల్లుమన్నట్టైంది. ఎ.సి గాలి పాదాల్లోకి వణుకు తెస్తోంది. ముందు సీట్‌లో నుండి ఊ కొడుతూ వినగల ఓ తేలికపాటి సంభాషణ. వెన్నంటి వస్తోన్న మెరుపులు. బెంగళూరు పొలిమేరలు చేరినట్టు గుర్తుగా దీపాల కాంతులు. ఇష్టమైన ప్లే లిస్ట్‌లోని పాట వినపడుతోంది... "చెలువము ఉన్నది నిన్నలరించగ...".

శివం సుందరం - గోకర్ణం

శ్రావణమాసం!

గోకర్ణం అని బస్ వాడు పిలిచిన పిలుపుకు ఉలిక్కిపడి లేచి క్రిందకు  దిగగానే పన్నీటి చిలకరింపుల ఆహ్వానంలా కురిశాయి తొలకరి జల్లులు. ‘చంద్రుణ్ణి చూపించే వేలు’లా, మట్టి రోడ్డు ఊరిలోకి దారిని చూపిస్తోంది. మనసును పట్టిలాగే మట్టి పరిమళం వెంటే వస్తోంది. పచ్చటి పల్లెటూరు గోకర్ణం. భుజాల మీదకు బ్యాగులు లాక్కుంటూ మేం వెళ్ళవలసిన హోటల్‌కు నడక మొదలెట్టాము. ఆదిలోనే హంసపాదు. ముందురోజు గోకర్ణం వచ్చాకే రూం తీసుకోవచ్చునన్న హోటల్ వాళ్ళు, తీరా వెళ్ళాక, రూములేవీ ఖాళీల్లేవన్నారు. చేసేదేమీ లేక, ఒక హోం స్టేలో  అద్దెకు దిగాం. 

ఇక్కడ ఇళ్ళన్నింటికీ చిత్రంగా రెండేసి తలుపులు. ఒకటి గుమ్మం బయట మోకాళ్ళ వరకూ. రెండవది మామూలుగా- గుమ్మానికి లోపలివైపు. దాదాపు పగలంతా, ఎవరూ లోపలి తలుపు వేసుకున్నట్టే కనపడలేదు. బహుశా, దొంగల భయం ఉండి ఉండదు. రూం ఏమంత సంతృప్తికరంగా లేకపోయినా త్వరత్వరగా స్నానాలవీ ముగించి మహాబలేశ్వరుడి గుడికి బయలుదేరాం. చిన్న ఊరే కావడంతో అన్నీ నడచి వెళ్ళగల్గిన దూరాలే. గుడికి నాలుగడుగుల ముందు, రవికల్లేకుండా, కుడిపవిటతో, నడినెత్తిన కొప్పులతో ఉన్న కొందరు యువతులు మమ్మల్ని అటకాయించి, అధికారంగా చేతుల్లో తామరాకు పొట్లమొకటి ఉంచి, "ముందు ఇటు" అంటూ దారి మళ్ళించారు. గుప్పెడు గరిక, దోసెడు పూలు. తామరాకు పొట్లాన్ని భద్రంగా పట్టుకుని, వాళ్ళు చెప్పినట్టే గణపతి దర్శనానికి వెళ్ళాము.  గోకర్ణ ప్రాముఖ్యత అంతా అక్కడి ప్రాణలింగంలోనే ఉందని అంటూంటారు. ఈ ప్రాణలింగం సామాన్యమైనది కాదు. సృష్టిలోని చరాచర జీవుల సత్వశక్తితో మహాశివుడు మూడు కళ్ళు, మూడు కొమ్ములు ఉన్న ఒక విశిష్ట మృగాన్ని తయారుచేస్తాడొకానొకప్పుడు. రెండు కొమ్ములు బ్రహ్మ, విష్ణు శక్తులుగా మారగా, మూడవది ఈ ప్రాణలింగం. సాక్షాత్తూ రుద్రాంశ. దీని శక్తిని గుర్తెరిగిన రావణాసురుడు ఘోరమైన తపస్సు చేసి, శివానుగ్రహంతో దీనిని సాధించి తీసుకు వెళ్ళిపోజూస్తాడట. భక్తుల యోగ్యత చూసి, భోళాశంకరుడి వరాలను అవసరమైతే పట్టి వెనక్కు లాగే శ్రీహరి, ఈసారీ రంగంలోకి దిగి, రావణాసురుడి నుండి ప్రాణలింగాన్ని దూరం చేయదలచి, తన చక్రాన్ని అడ్డు పెట్టి, సూర్యాస్తమయమైన భ్రమ కలిగిస్తాడట లోకాలకు. విజయగర్వంతో ప్రాణలింగాన్ని తీసుకుని ప్రయాణిస్తోన్న రావణాసురుడు, కమ్ముకుంటోన్న అరుణవర్ణాన్ని చూసి, సాయంసంధ్య వేళయిందని నమ్మి, సంధ్యావందనం చేయగోరి, భూస్పర్శ సోకితే లింగం అక్కడే ప్రతిష్టితమైపోతుందన్న శివుని వాక్కు గుర్తొచ్చి, ఇహ ఎక్కడ పెట్టాలో తెలీక, చుట్టూ చూస్తాడట. ఈ లోపు, బొజ్జ గణపయ్య అక్కడికి గోవులకాపరి వేషంలో వచ్చి, గోవులను చూస్తునట్టు నటనమాడుతాడట. రావణాసురుడు ఉన్న కథంతా చెప్పి, తానొచ్చేవరకూ లింగాన్ని భూస్పర్శ సోకకుండా కాపాడమని అర్థిస్తే, లంబోదరుడు తాను చిన్నవాణ్ణి కనుకా, లింగం బాగా బరువుగా ఉంది కనుకా, మోయలేననిపిస్తే ముమ్మార్లు పిలిచి క్రింద పెట్టేస్తానని హెచ్చరించి, ఆ భారాన్ని అందుకుంటాడట. రావణుడు సంధ్య వార్చడమిలా మొదలెట్టీ మొదలెట్టగానే చకచకా మూడుసార్లూ పిలిచేసి, లింగాన్ని నేల మీదకు దించేస్తాడట గౌరీసుతుడు. ఆ ప్రాంతమే ఈ గోకర్ణం. రావణాసురుడు రాక్షసుడు, గర్వి, కోపిష్టి. ఊరుకుంటాడా మరి? పట్టరాని ఆవేశంతో గణపతి శిరసుపై పిడికిలితో మోదుతాడట. మహాబలేశ్వరుడి దర్శనానికి ముందు, ఆ కొండయువతులు మమ్మల్ని చూడమన్నది, ఈ గణపతినే. శిరసు మీద పిడికిలి గుర్తులు సుస్పష్టంగా కనపడుతోన్న ఇక్కడి "చింతామణి గణపతి"కి మనసారా మొక్కి, మహాబలేశ్వరుడి గుడివైపు నడక సాగించాం. 
మహాబలేశ్వరుడి గుడిలో ఉదయం 6-12 వరకూ, సాయంకాలం 6-8 వరకూ భక్తులందరికీ గర్భగుడిలోకి ప్రవేశం ఉంటుంది. ఆత్మలింగాన్ని స్వహస్తాలతో స్పృశించి అభిషేకం చేయగల మహదవకాశమూ లభిస్తుంది. సువర్ణనాగాభరణవిశేష పూజ చేయించదలచిన మా జంటని, పూజారులొకరు వచ్చి వారి తరఫున అంతరాలయంలోకి తీసుకువెళ్ళారు. పంచామృతాలతో పరమశివుడికి అభిషేకం చేయడం కాసేపటికి పూర్తయింది. "త్రిజన్మ పాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్" అనుకుంటూ మారేడు దళాలను సమర్పించుకోవడమూ అయింది. అప్పుడు,  
"లింగరూప తుంగ, జగమాఘనాశన
భంజితాసురేంద్ర రావణలేపన
వరగోకర్ణఖ్యా క్షేత్ర భూషణ క్షేత్ర భూషణ
                            శ్రీమహాబలేశదేవ సార్వభౌమతే"                           
అని మహాబలేశ్వరుణ్ణి అందరూ కీర్తిస్తూండగా, దాదాపు మూణ్ణాలుగు బిందెల నీళ్ళను, మన ముంజేయి లోతులో ఉన్న బిలంలో ధారగా వదిలారు అర్చకులు. వచ్చినంత నీరు బయటకు రాగా, లోపల మిగిలిన నీరు నిశ్చలమైపోగా, మమ్మల్ని అందులోకి తొంగి చూడమన్నారు. తాకి మొక్కుకోమన్నారు. ఆత్మలింగం!! రుద్రాంశ! దేవతలందరూ కొలిచిన కొమ్ము. సమస్త లోకాలకూ రక్షణైన కొమ్ము. రాముడు నమ్మిన క్షేత్రం. రావణుడోడిన క్షేత్రం. అక్కడ..ఆ క్షణంలో, దానిని తాకి పరవశించగల సౌభాగ్యంతో మేము. 'ఆత్మనొక దివ్వెగా' ఈ పరమేశ్వరుని పాదాల చెంత వెలిగించాలనుందన్న ఓ కవిమిత్రుని మాటలు అప్రయత్నంగా  గుర్తొచ్చాయి. ఆ శ్రావణమేఘాల తడిజాడలేవో నా కన్నుల్లోనూ మెరిశాయి.
     
 అటుపైన 'కడల్ బీచ్‌'కు వెళ్ళి, కడలి ఒడిలో కాసేపు ఆటలాడి, అక్కడి భోజనం వెగటు పుట్టిస్తోన్నా శక్తినంతా సముద్రానికి ధారపోసిన పాపానికి తినకుండా ఉండలేక, ఎలాగో అయిందనిపించి, మురుడేశ్వర్ వెళ్దామని బయలుదేరాం. 2000/-కు మారుమాట లేని బేరమైతే తీసుకువెళ్తామని టాక్సీల వాళ్ళు ముందుకొచ్చారు. బస్‌స్టాండ్ అట్టే దూరం కాకపోవడంతో, బస్సులేమైనా ఉన్నాయేమోనని కనుక్కోవడానికి వెళితే, నేరుగా ఏం లేవనీ, కుంటాలో దిగి మారవలసి ఉంటుందనీ చెప్పారు. ఇక టాక్సీ తప్పదనుకుంటూండగా మా వద్దకొక ఆటోవాలా వచ్చి వివరమడిగాడు. ఇవన్నీ వద్దనీ, మూడున్నరకు మురుడేశ్వర్‌లో దింపే రైలొకటుందనీ, అది ఎక్కితే గంటలో వెళ్ళిపోతామనీ చెప్పాడు. మాకొక్క గంటే సమయముంది. అతని ఆటోలోనే ఎక్కి స్టేషన్‌కు బయలుదేరాం. దారంతా అతను అక్కడి గుడుల గురించీ, అక్కడి మనుష్యుల మంచితనాన్ని గురించీ కథలుకథలుగా చెబుతూనే ఉన్నాడు. పచ్చిక బయళ్ళ దగ్గరా, ఉప్పు నీటి మడుల దగ్గరా మెల్లిగా పోనిస్తూ వాటి విశేషాలన్నీ విప్పి చెప్పాడు. అనుకున్న వేళకి పది నిముషాల ముందే మమ్మల్ని స్టేషన్‌లో దించేశాడు. రైలు నిజంగా ఉందో లేదో నన్న అనుమానం నన్ను వదల్లేదు. ఐదువందల రూపాయల నోటు చేతిలో రెపరెపలాడుతోంటే, అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడిగానతన్ని. అతడేమనుకున్నాడో, ఏమనిపించిందో నాకు తెలీదు కానీ, "నమ్మకం ఉండాలి మేడం! అది లేకుండా ఏ ప్రయాణమూ పూర్తి కాదు" అన్నాడు, చిల్లర లెక్కపెడుతూ. అతడు మామూలుగానే అన్నా, "ప్రయాణం" అన్న పదం, అతను పలికినంత తేలిక అర్థంలో అయితే నాకు స్ఫురించలేదు. చాలా సేపు ఆమాట నా ఆలోచనలను అంటిపెట్టుకునే ఉంది. ఆ ఒక్కమాటా కలిగించిన వేల ఆలోచనలు, గుర్తు చేసిన వేనవేల సందర్భాలూ, మనుష్యులూ, అన్నీ, మురుడేశ్వర్ ఆలయాన్ని చూసీ చూడటంతోనే, అక్కడి గోపురాల్లో నుండి చివాలున రెక్కలు విదుల్చుకుంటూ ఎగిరిపోయి శాంతిని వదిలే పావురాలల్లే చెల్లాచెదురైపోయి, నన్నొక నిశ్శబ్దంలోకి నెట్టేశాయి. దాదాపు ఇరవై అంతస్తుల మహాఆలయం. నిగర్వులమై తలపూర్తిగా వెనక్కు వాల్చితే తప్ప కనపడని గోపురం. అది దాటి వెనక్కు వెళితే, సముద్ర తీరాన అంతెత్తులో, ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద శివుడి విగ్రహం.  ఆ శివుడి విగ్రహం దగ్గర నిలబడి చూస్తే అనంత జలరాశితో ఎగసెగసిపడుతూ అరేబియన్ సముద్రం. అస్తంగత సూర్యుడు తన బంగారు కాంతులన్నింటినీ ఆప్తుడని కాబోలు, సముద్రుడికే ధారపోశాడు. వాతావరణం ఉన్నట్టుండి చల్లబడిపోయింది. తలెత్తి చూస్తే పరమేశ్వరుడి శిరసుపై ఠీవిగా కనపడుతోన్న చంద్రవంక. " చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమాం!" 

గుంపులు గుంపులుగా మనుష్యులు. చిన్నా-పెద్దా, పొట్టీ-పొడుగూ, నలుపూ-తెలుపూ..ఏవో భేదాలు. ఏవేవో పోలికలు. ఆ గుడిమెట్ల దగ్గరే కొన్ని జంతువులు మూగగా నిలబడి చూస్తున్నాయి. అశుచిగా ఉన్న చోట్ల ఈగలూ దోమలు ముసురుకుని చెదరిపోతున్నాయి. పక్షులు కొన్ని అక్కడే ఉన్న పొడుగాటి చెట్ల గుబుర్లలో చేరి కిచకిచమంటున్నాయి. కలకలం రేపుతున్నాయి. గట్టిగా ఆరేడు నెలలైనా నిండి వుండని పసివాడొకడు అమ్మ చేతుల్లో నుండే చిన్ముద్రలో ఉన్న మహాదేవుడి విగ్రహాన్ని తదేకంగా చూస్తున్నాడు. 

ఏం కోరుకోవాలీ పరమేశ్వరుణ్ణి?
ఏమని మొక్కాలి? 

"నరత్వం దేవత్వం నగవనమృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్ |
సదా త్వత్పాదాబ్జస్మరణపరమానందలహరీ-
విహారాసక్తం చేద్ధృదయమిహ కిం తేన వపుషా ||"

                                                                                    *************************

ఆరున్నరకు తిరిగి గోకర్ణం చేర్చే రైలు పట్టుకుని వెనక్కు వచ్చేశాం. వచ్చీ రావడంతోనే   మర్నాడు ఉదయమే ఐదు గంటలకు దూద్‌సాగర్ జలపాతాలకు వెళ్ళేలా కార్ మాట్లాడుకున్నాం.    అటుపైన ఆ రాత్రి మేం పట్టుమని నాలుగు వీథులైనా కనపడని గోకర్ణమంతా చెట్టాపట్టాలేసుకుని తీరిగ్గా తిరిగాము. కోటి తీర్థం, భద్రకాళి గుడి, శ్రీకృష్ణ మందిరం - - అడుగుకో గుడి, అరుగుకో బ్రాహ్మడు అన్నట్టుందా ఊరు. ఎవరి ముఖంలోనూ ఖంగారు లేదు. ఎత్తరుగుల ఇళ్ళ వాకిళ్ళలో పిల్లలు గుంపులు గుంపులుగా చేరి ఆడుకుంటున్నారు. ఊరు ఊరంతా తొమ్మిది గంటల వేళకే నిద్రించండానికి సమాయత్తమైపోయింది. ఒకానొక కూడలిలో మాకు వేంకటరమణుడి ఆలయమొకటి కనపడింది. మేం ఎక్కడ నడుస్తూన్నా, ఆ శ్రావణ మాసపు రాత్రి, నిర్జన వీధుల్లో నుండి శ్రీకృష్ణ సంకీర్తనలు తేలివచ్చి మమ్మల్ని తాకిపోతున్నాయి. వాటిని పరిపూర్ణంగా లోలోపలికి ఒంపుకుంటూనే, కనపడ్డ ప్రతి షాపులోకీ తొంగి చూస్తూన్నాన్నేను. స్త్రీసహజమైన బేరాలాడే బుద్ధి ఏనాడూ కలిసొచ్చిన జ్ఞాపకం లేకపోయినా, ఆకుపచ్చని ఆశని గుండెలో దాచుకుని, అప్పుడెప్పుడో చిన్నప్పుడు అమ్మ దగ్గర నేర్చుకున్న సూత్రం - సగానికి సగం ధర తగ్గించి అడగడమే బేరం - అని గుర్తు చేసుకుని, నచ్చిన ప్రతి కుర్తాకోసమూ ఓ మాట వదిలి చూశాను. కొట్టు కట్టేసే హడావిడిలో ఉన్న ఓ ఆసామీ నా మాట మన్నించాడు. ఆ విజయగర్వంతో , ఆ మిగిలిన డబ్బులతో - స్వీట్ కోసం ఓ చిన్న షాపు ముందు ఆగాం. అది నిజానికి హోటల్. అక్కడున్న రెండు నిముషాల్లోనూ నన్ను ఆకర్షించింది - అక్కడ పనిచేస్తోన్న అమ్మాయిలు. లంగాఓణీల్లో పద్ధతిగా, ధైర్యంగా, చిత్రంగా మెరుస్తోన్న కన్నులతో హోటల్ తమదే అన్నట్టు కలియదిరుగుతున్నారు వాళ్ళందరూ.  మామూలుగా అమ్మాయిలు ఎక్కడో లోపల నక్కి గిన్నెలు తోమడమో, వంటింట్లో కూరలు తరగడమో చూశాను కానీ, ఇలా ఇదీ-అదీ అన్న భేదం లేకుండా  వంట నుండీ-కేష్ కౌంటర్ దాకా, తయారుగా ఉన్న పదార్థాల గురించి ఉత్సాహంగా చెప్పడం మొదలు- వాటిని శ్రద్దగా మననం చేసుకుని అంతే శ్రద్ధగా అందించేదాకా, అన్ని పనులూ గట్టిగా ఇరవయ్యేళ్ళు కూడా నిండి ఉండని అరడజను మంది అమ్మాయిలు నేర్పుగా చేసుకుపోవడం ఇక్కడే చూశాను. మాటల్లో మన్నన, చేతల్లో చురుకుదనం - అక్కడున్న కాసేపూ నా కళ్ళు వాళ్ళ చేష్టలని వెంటాడుతూనే ఉన్నాయి. నాతో పాటుగా అక్కడి అరడజను బల్లల మీది అంతమందినీ, అన్నిరకాల చూపుల్నీ గడుసుగా తప్పించుకుంటూ తమ పని తాము చేసుకుపోతున్నారు వాళ్ళు. టేబుల్ క్లీన్ చేస్తున్న అమ్మాయిలో కూడా ప్రస్ఫుటంగా కనపడ్డ సంతోషాన్నీ, శ్రద్ధనీ చూస్తే, మార్టిన్ లూథర్కింగ్‌ను మాటలను కానీ వీళ్ళు చదివారా అనిపించింది.  మనుష్యుల్లోని ఏ లక్షణాలు వాళ్ళని ప్రత్యేకంగా నిలబెడతాయో, అభిమానాన్ని, గౌరవాన్ని కలిగించి గుర్తుండిపోయేలా చేస్తాయో, మరొక్కసారి నేర్చుకున్నట్టైంది. మేమడిగిన స్వీట్‌తో పాటు చిల్లరనూ, చలాకీ నవ్వులతో చుట్టబెట్టి ఇస్తూన్నప్పుడు, తళుక్కుమన్న ఆ అమ్మాయి ముక్కెర మెరుపును ఆ రాత్రి ఆఖరి జ్ఞాపకంగా మార్చుకుని, రూంకొచ్చేశాం.   

మా అనుమానం నిజం చేస్తూ, 11 దాటాక,  ట్రావెల్స్ వాళ్ళు ఫోన్ చేశారు. వాన చాలా ఎక్కువగా పడుతోందనీ, ఈ వాతావరణంలో ప్రయాణం మంచింది కాదనీ, దూద్‌సాగర్‌లో కూడా వర్షపాతం ఎక్కువగా ఉంటే జలపాతాల దగ్గరికి ఎవ్వరికీ అనుమతి ఉండదనీన్నూ. ప్రయాణం రద్దయింది. నిరాశతోనే తెల్లవారింది.
  
                                                                                         ************************
శ్రావణ బహుళ అష్టమి. 

చీకటి ముసుగులా పల్లెనింకా వీడనే లేదు. సన్నగా జల్లు కురుస్తూనే ఉంది. జంధ్యప్పోగులు సరిచేసుకుంటూ బ్రాహ్మలు వడివడిగా మమ్మల్ని దాటుకుపోతున్నారు. మహాబలేశ్వరుడి గుడి ఎదుటి దుకాణాల్లో నుండీ లింగాష్టకం లీలగా వినపడుతోంది. మట్టి రోడ్లే అన్నీనూ. అయినా రాత్రంతా కురిసిన వర్షానికి ఏ  వీథిలోనూ నీరు నిల్చిపోయిన దాఖలాల్లేవు. అక్కడి మనుష్యుల శుభ్రతనూ, ఉన్నంతలోనే జాగ్రత్తగా మసలుకోవాలన్న మెలకువనూ అభినందించుకుంటూ నడుస్తూండగానే..అల్లంత దూరాన తరగల నురగలతో నవ్వుతూ పిలుస్తూ సముద్రం. ఆ సాగరఘోషలో అంతులేని ఆకర్షణ ఉంది. అర్థమయీ అవని విషాదమూ దాగుంది. "సముద్రం సంగతి" అంటూ, దేవిప్రియ ఓ కవితలో ఇలా అంటారు -

"వేయి తలల నాగులా
అలల నాలుకలు చాచుకుని
పైపైకి వస్తోంది సముద్రం
నా పాదాల మంత్రదండాలు తగిలితే
పడగల్ని రాతి గట్టుకేసి కొట్టుకుని
మళ్ళీ నీటిపుట్టలోకి నిష్క్రమించడానికి"

దేవిప్రియ ఏ సముద్రం ముందు నిల్చుకుని ఇంత చమత్కారంగా ఆలోచించారో అనుకుంటూ, చర్చించుకుంటూ, ఆ సాగరతీరంలో మేమిద్దరం నడక మొదలెట్టాం. నిర్మానుష్యంగా, నిర్మలంగా, తడిగా, ఒకింత గట్టిగా ఉన్న ఆ ఒడ్డు వెంట..ఎన్ని మైళ్ళు నడిచినా అలసట రానివ్వని మహత్తేదో ఉంది. ఏ అలల చప్పుళ్ళు విన్నా, ఏవో కథలు వినపడుతూనే ఉంటాయి. వాన పెరుగుతూ తగ్గుతూ ఉంది. అలలు మెదిపిన తీరాల మీద చినుకులేవో అర్థమవని చిత్రాలు గీయడం మొదలెట్టాయి. సుడులుసుడులుగా లోతుగా, స్పష్టంగా - క్షణికాలే కానీ, చూసి తీరాల్సిన బొమ్మలవి. సముద్రంలో వాన చినుకుల చప్పుళ్ళు సంగీతమైతే, తడితడి తీరాల పెదవుల మీద చినుకుల ముద్దు ముద్దరలన్నీ చిత్రలేఖలే. 

మరికాసేపటికి ఎటు నుండి వచ్చిందో - ఓ కాకి ఆ తీరానికి వచ్చింది. కాకిని, అందులోనూ ఒంటరి కాకిని చూస్తే, నాకు బషో గుర్తొస్తాడు. లోకం చలికాలపు దిగులు సాయంకాలమవుతుంది. కానీ, ఆనాటి కాకి కథ వేరు. అల వచ్చేవరకు నిశ్చలంగా నిలబడి సముద్రం వైపే చూడటం; అల మీదకు రాగానే గంతులతో అడుగులు వెనక్కు వేయడం. ఇసుక మీద పడటం వల్లో, అలల తుంపరల వల్లో - ఆగీ ఆగీ రెక్కలు విదుల్చుకోవడం. మళ్ళీ సముద్రం వైపు నాలుగడుగులు..మళ్ళీ వెనక్కు, మళ్ళీ తపతపా రెక్కల చప్పుడు..మళ్ళీ ముందుకు..! దాని ఈ చేష్టితాలన్నీ చూస్తూ చూస్తూ ఫొటోలు తీస్తూ ఉన్నప్పుడు, అకస్మాత్తుగా ఈ మధ్యే చదివిన రోబర్ట్ ఫ్రోస్ట్ కవిత "డస్ట్ ఆఫ్ స్నో" కూడా గుర్తొచ్చింది. అందులోనూ ఇంతే, గన్నేరు చెట్టు మీద తీరి కూర్చున్న కాకి, తుషార ధూళిని విదుల్చుకున్న తీరే కవి హృదయానికి కొత్త గతినిచ్చిందట. విషాదంలో మగ్గాల్సిన ఓ రోజు నుండి అతనిక్కొంత ఉపశాంతినిచ్చిందట. ఇది అతిశయోక్తి అని ఏ పాఠకులకైనా అనిపించిందీ అంటే, అట్లాంటి ఓ అనుభవం వారికి జీవితంలో ఎదురుపడలేదని అర్థమన్నమాట. చాలా తేలిగ్గా కనిపించే ఇలాంటి కవితల వెనుక ఎంత సున్నితమైన రసస్పందనలు ఉంటాయో, ఎలాంటి అనిర్వచనీయమైన భావోద్వేగాలు ఉంటాయో తెలుసుకోగల్గడమే, ఆనాడు గోకర్ణం సముద్రతీరంలో నే నేర్చుకున్న పాఠం. నా ఉనికిని నిర్లక్ష్యం చేస్తూ తీరమంతా కలియదిరిగిన ఆ కాకి, బహుశా నాకు చెప్పాలనుకున్నదీ అదే కావచ్చును.   

ఇంకా ఎన్ని గంటలలా గడిచిపోయేవోకానీ, అందాకా ఆహ్లాదంగా కురిసిన వర్షం జడివానగా మారి చలి మొదలవ్వడంతో, వెంట తెచ్చుకున్న గొడుగులో ఒదిగి వెనక్కు మళ్ళాం.  ముందు రాత్రీ, ఆ వేళా, వేంకటరమణుడి గుడి నుండి ఆగకుండా భజనలెందుకు వినపడ్డాయో, చిన్నపెద్దా గొంతులు అన్నేసి భాషల్లో కృష్ణగీతాలెందుకు ఆలపించారో, "కృష్ణా నీ బేగనే బారో" అంటూ ఎందుకంతలా తపించారో గుడిలోకి అడుగుపెట్టేదాకా తట్టనేలేదు మాకు. ఆ వేళ కృష్ణాష్టమి. మేం వెళ్ళిన కాసేపటికే అక్కడికొక విశాలమైన వెండి ఉయ్యాలనూ, దాని తోడిదే సందళ్ళనూ మోసుకుంటూ యువకులు కొందరు దూసుకొచ్చారు. మండపం మధ్యలో అందరూ నిలబడి చూసేందుకనువుగా క్షణాల్లో ఊయలను వేలాడదీశారు. చామంతి, మల్లె, మరువం, కనకాంబరాలతో ఒద్దికగా అల్లిన మాలలను ఉయ్యాలకు బయటివైపు అన్ని దిక్కుల్లోనూ వేలాడదీసి దానిని వర్ణరంజితం చేశారు. పట్టుపరుపులు, తలగడలు తరలి వచ్చాయి. మరి చిన్ని కృష్ణుడెక్కడున్నట్టూ? నాలో అంతకంతకూ పెరుగుతోన్న ఉత్సుకతకు తగ్గట్టే, భజన వేగమూ పెరిగింది. తాళం అంతకంతకూ మారిపోతోంది. శ్రీకృష్ణ స్మరణతో సభామండపం మారుమ్రోగిపోతోంది. నేనిక కుతూహలాన్ని అణచుకోలేక, పాడుతున్న పాటనలా గాలికి వదిలి, ఊయల వద్దకెళ్ళి తొంగి చూశాను. ఆశ్చర్యం! బాలకృష్ణుడక్కడే పడుకుని హాయిగా నిద్దరోతున్నాడు. వేనవేల గోపికలను "బిగియార కౌగిట మనంబలరారగ జేర్చి"న కొంటెకృష్ణుడేమీ కాదు సుమా, యదుకుల క్షీరవారాశి పూర్ణచంద్రుడితడు. యదుసింహ కిశోరుడు. అంగుష్ఠమాత్రమైనా లేని పసిడి విగ్రహమై, పసివాడై వామహస్తాన్ని నెన్నుదిటిపై వాల్చుకుని పట్టుపరుపుల మధ్య పవ్వళిస్తున్నాడు. "లోకములు నిదురవోవగ జోకొట్టూచు నిదురవోని సుభగుడు" మళ్ళీ ఇలా మనబోటి మామూలు మనుష్యుల ఉత్సవసంబరాన్ని చిన్నబుచ్చకుండా ఉండేందుకు నవ్వుతూ నిదుర నటిస్తున్నాడు. "జోజో కమలదళేక్షణ! జోజో మృగరాజమధ్య! జోజోకృష్ణా!!  జోజో పల్లవ కరపద జోజో పూర్ణేందువదన! జోజో" అంటూ, అలనాడు యశోద, గోపికలు ఏ విశ్వాసంతో, ఏ అనురాగంతో ఆ బాలకృష్ణుని నిదురపుచ్చారో, అదే భావనతో, అదే నమ్మికతో మేమూ వెండి ఉయ్యాల నూపుతూ జోలపాడాము. భజన అలా నిర్విరామంగా సాగుతూనే ఉంది. మేమా గుడి నుండీ, గోకర్ణం నుండీ వెనక్కు రావలసిన వేళ దగ్గరపడుతోంది. తులసిమాలల మధ్య ఒత్తిగిలిన నందనందనుణ్ణి వీడుకోలువేళ మెల్లగా తాకి చూశాను. గోకర్ణం రేపల్లెగా మారింది. హృదయం బృందావనియై నవ్వింది. తృప్తి.  
***************************

గోకర్ణం నుండీ ఇటు మూకాంబిక, ఉడిపి, అటు వెళ్తే గోవా ఇవన్నీ దగ్గర దగ్గరే. ఏవి చూడాలీ, ఏవి వదలాలన్నది పూర్తిగా మన ఆసక్తులకు సంబంధించిన విషయం. గోకర్ణం నావరకూ ఓ ఆధ్యాత్మిక ప్రదేశం, నాగరిక ఛాయలు పడని స్వచ్ఛ సౌందర్యం.  ఓం బీచ్‌లోనూ, కడల్ బీచ్‌లోనూ కూడా విచ్చలవిడితనం లేదు. గుడినీ, సముద్రాన్నీ మినహాయిస్తే, ఇక్కడ చూడటానికీ, చేయడానికీ ఏమీ లేదు. అది కొందరికి నిస్తేజాన్ని, కొందరికి ఉత్తేజాన్ని కలిగించవచ్చు. బెంగళూరుకు తిరిగి ఒకే ఒక్క రైలు ఉంది. అదీ నాలుగ్గంటలకే. తిరుగు ప్రయాణంలో "Value Vision consultancy " స్థాపించిన పూర్ణిమ నా ముందు కూర్చున్నారు. ఇరవైరెండేళ్ళ తన సుదీర్ఘమైన కెరీర్‌లో ఆటుపోట్లనీ, ఆవిడ వాటిని దాటుకొచ్చిన తీరునీ ఆసక్తిగా చెబుతోంటే, నాకసలు సమయం తెలీలేదు. బహుశా, చాలా చోట్ల నన్ను నేను చూసుకోవడం వల్ల అయి ఉండవచ్చు. మర్నాడు తెల్లవారు ఐదుగంటలకే లేచి, అందరం ఫ్రెష్ అయిపోయి, రగ్గుల్లో ముడుచుక్కూర్చుని కాఫీలు తాగుతూ "ఆల్టర్నేటివ్ కెరీర్ ప్లాన్స్ ఫర్ విమెన్" చర్చించుకున్నాం. మద్దూర్ రాగానే రైల్లోకి వడలమ్ముకునేందుకు వచ్చిన వాళ్ళని ఆపి, మమ్మల్నీ కొనుక్కోమని సూచించారావిడ. మద్దూర్ వడకంత పేరు ఊరికే రాలేదని మొదటి ముక్కకే అర్థమయిపోయింది.

బెంగళూరు చేరిపోయాం. కొత్త అనుభవాలూ, పాతబడని జ్ఞాపకాలూ, కొందరు మంచి మనుష్యులు, మనసులో ఉవ్వెత్తున ఎగసిపడే ఉద్వేగపు కెరటాలు - అన్నింటి తాకిడినీ పరిపూర్ణంగా అనుభవిస్తూ, "మండే మార్నింగ్"ని కూడా ప్రేమిస్తూ...’నమ్మ బెంగళూరు’లో – ‘మస్త్ మజా మాడి’ అనుకుంటూ. 

"ఏకాంత జీవితంలో లోతు ఎక్కువవుతుంది, సమాజజీవితంలో వెడల్పు ఎక్కువవుతుంది" అన్న సంజీవ్‌దేవ్ మాటలెంత సత్యం!
* తొలి ప్రచురణ -సారంగలో


మురుడేశ్వర్
  
Anil At Gokarna 

అత్తిరపల్లి జలపాతాలు , త్రిస్సూర్, కాలడి

ఇదొక అనుకోని ప్రయాణం. అనుకోని అంటే పూర్తిగా అనుకోనిదేం కాదూ, ఇంతకు మునుపు ఒకట్రెండు సార్లు వెళ్దామని అనుకున్నాం కానీ, వరుసగా వెళ్ళడం కుదరకపోవడంతో, అవి మర్చిపోయి వేరే దిక్కుల్లోకి పిట్టల్లా ఎగిరిపోయాం. మళ్ళీ ఈమధ్యెప్పుడో ఓ మధ్యాహ్నం వేళ నింపాదిగా కూర్చుని మేమిద్దరం టి.వి చూస్తోంటే, మణిరత్నం "విలన్" సినిమా వస్తోంది. అంతెంత్తు కొండపై నుండి తటాలున క్రిందకు దూకేసి, ఎండిన చెట్టు మీది పల్చటి కొమ్మల మీద స్పృహ తప్పి నాయిక వాలిపోతుందే...సరీగ్గా అప్పుడే చూడటం మొదలెట్టాం. ఆ ముహూర్తబలమేమిటో కానీ ఆ వెనుక కనపడ్డ జలపాతాల గురించి ముచ్చటపడ్డ మూడు వారాల్లోనే వెళ్ళే అవకాశం వచ్చేసింది.

అయితే వెళ్ళే ముందు తెలిసిందేమింటంటే త్రిస్సూర్ అక్కడికి చాలా దగ్గరని. ఎలాగూ శనాదివారాల్లోనే వెళ్తాం కనుక, ముందు త్రిస్సూర్ వెళ్ళి, అక్కడి నుండి జలపాతాల దగ్గరికి వెళితే బాగుంటుందనిపించింది. పైగా, త్రిస్సూర్‌లో గొప్ప శివాలయమొకటి ఉంది. అది కేరళలోని అతి ప్రాచీన శివాలయాల్లో ఒకటిట. ఆదిశంకరాచార్యుల తల్లిదండ్రులు సత్సంతానం కోసం మొక్కిన శివయ్య గుడి కూడానూ. శనివారం ఉదయాన్నే అక్కడికి చేరుకుని, గుడికి ఐదు నిముషాల నడకలో ఉండేట్టుగా ఏర్పాట్లు చేసుకుని, ఓ గంటలో తయారై వెళ్ళిపోయాం. చాలా పెద్ద గుడి. మహాశివలింగమది. అలంకారం చేశాక చూశాము కనుక, ఆ పూట నాకసలు ఏమీ అర్థం కాలేదు. కేరళ దేవాలయాల నిర్మాణం కూడా చిత్రంగా ఉంటుంది. గర్భగుడి ఓ వేదిక మీద ఉంటుంది. మెట్లు ఎక్కి పూజారులు మాత్రమే వెళ్తారు. మిగిలిన అందరికీ దర్శనం క్రింద నుండే. ఈ ఆలయంలో ప్రతిరోజూ లింగాకారంలో ఉన్న పరమేశ్వరుడికి ఘృతంతో అభిషేకం చేస్తారు. కొన్ని వందల ఏళ్ళ నుండీ ఆ నెయ్యి లింగం మీద అలాగే ఉండిపోయింది. అది కరగదు. చెదరదు. అరటి దొన్నెల్లో అర్చకులు కాసింత నేతినే ప్రసాదంగా భక్తులందరికీ ఇస్తూంటారు. ఆ విశాలమైన ఆలయ ప్రాంగణమంతా ఓ రెండు మూడు గంటల పాటు తిరిగి, రూంకి వచ్చేశాం. 

మధ్యాహ్నం మూడుగంటలకు బయలుదేరి అక్కడికి ముప్పావుగంట దూరంలో ఉన్న గురువాయుర్ క్షేత్రానికి వెళ్ళాము. దీనిని అందరూ కృష్ణుడి గుడిగా చూస్తారు కానీ, మూల విగ్రహం శ్రీమహావిష్ణువుదే. ఈ విగ్రహం ద్వాపర యుగంలో దేవకీ వసుదేవులు మొక్కిన విగ్రహమట. అంటే కృష్ణుడే కొలిచిన విష్ణు రూపమన్నమాట. యుగాంత వేళలో ఉద్ధవుడికి ఈ విగ్రహాన్ని ఇచ్చి, పరమ పావనమైన ప్రాంతంలో ప్రతిష్టించమని అడిగితే, అతని మాట మీద దేవగురువు బృహస్పతీ, వాయువులు కలిసి ఇక్కడ ప్రతిష్టించారు కనుక, ఆ శ్రీమన్నారాయణుడిక్కడ "గురువాయుర్" అని కొలవబడుతున్నాడని చెప్తారు. గుడి సాయంత్రం నాలుగు గంటల దాకా తెరవరు. రద్దీ మాత్రం మూడు గంటలకే మొదలైపోతుంది. గంటా- రెండు గంటలు క్యూలో ఉండాల్సిందే. గుడి బయట మొత్తం పండుగ వాతావరణమే ఉంటుంది. బంగారు అంచులతో పాలమీగడి రంగులతో మెరిసిపోయే కేరళచీరలు అడుగడుగునా కనిపిస్తూంటాయి. సాయంసంధ్య వేళయ్యేసరికి గుడి చుట్టూ కొన్ని వేల సంఖ్యలో ఆవునేతి దీపాలు వెలిగిస్తారు. కన్నుల పండుగ అనే మాటకు అసలైన అర్థం తెలియాలంటే అది చూసి తీరాలి. కమ్ముకుంటున్న చిరు చీకట్ల మధ్యలో నిష్కంపంగా వెలుగులీనే అన్ని వేల దీపలను ఒక్కసారిగా చూడటమే మహద్భాగ్యం! అది దాటుకు లోపలికెళ్తే ఆ నల్లనివాడు, పద్మనయనమ్ముల వాడు, మౌళిపరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు కృపారసంబు చల్లనే చల్లుతాడందరిపైనా.  అన్నట్టూ, పొద్దున శివాలయానికి వెళ్ళడం, వెంటనే కన్నయ్య దగ్గరికి రావడం, మళ్ళీ అద్వైత ప్రబోధకులైన శంకరాచార్య జన్మస్థాలానికి దగ్గర్లో ఉండటం- వీటన్నింటి వల్లా, ఆ రోజంతా నాకు " తనువున నంటిన ధరణీపరాగంబు పూసిన నెఱిభూతి పూతగాగ.." అంటూ శివకేశవులకు భేదము లేదని చెప్పే భాగవత పద్యం గుర్తొస్తూనే ఉంది; 

దర్శనమైపోయాక "వెన్న" ప్రసాదంగా తీసుకుని వెనక్కి వెళ్దామా ఉందామా అనుకుంటుంటే , చావక్కడ్ బీచ్ అక్కడికి పావుగంట దూరమే అని తెలిసింది. ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయాం. సూర్యాస్తమయమైపోయింది. కెంజాయి రంగు నల్లని నలుపులో కలిసిపోబోతోంది. తీరమంతా అల్లరల్లరిగా ఉంది, అంత పరిశుభ్రంగా కూడా ఏమీ లేదు. కానీ, ఆ సముద్ర తీరమన్న ఆలోచనే నన్ను వివశురాలిని చేస్తుంది. ఆ గాలిపటాలూ, పసిపిల్లల కేరింతలు, కెరటాల నురగల నవ్వులు, అప్పుడే పైకొచ్చి తొంగి చూసే చందమామ, తీరాన్ని వదిలి వెళ్ళే నౌకలు, తీరాలను చేరే జాలరులూ, చేపల వాసనా - అదొక ప్రపంచం. సాగర తీరాలే చూపించగలిగే ప్రపంచం. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడో సముద్రం కూడా ఉంది అంటే నాకు గొప్ప తృప్తి. ప్రయాణమంతా సఫలమైన భావన చుట్టుముడుతుంది. ఈ సారీ అంతే, మినహాయింపేం లేదు.


నేనూ, అనిల్ ఇద్దరం నిద్రకి లోటు జరిగితే తట్టుకోలేం. అందుకని మామూలుగా ఎప్పుడూ తెల్లవారుఝామునే లేవడం, అర్థరాత్రి దాకా తిరగడం లాంటివి పెట్టుకోం. అయితే ఆ రోజు వెనక్కి వచ్చేశాక మాత్రం మర్నాడు బ్రాహ్మీముహూర్తాన జరిగే శివాభిషేకానికి వెళ్ళాలని అనుకున్నాం, చిత్రంగా లేచాం కూడా. మూడున్నరకల్లా గుళ్ళో ఉండాలి. అలాగే వెళ్ళాం. బెంగళూరులో ఆ వేళకి లేచి అడుగు బయటపెడితే చలికి వణికి చచ్చిపోతాం. ఆశ్చర్యంగా అక్కడ అలాంటి వాతావరణం లేదు. ఉండీ లేనట్టుగా ఉన్న పొగమంచు పరదాల మధ్య నుండి మెల్లిగా నడుచుకుంటూ గుడిలోఅడుగుపెట్టాం. త్రిపుండ్రాలు ధరించిన శివభక్తులందరూ ఒక్కొక్కరుగా చేరుతున్నారు. శివనామస్మరణతో ఆ ప్రాంతమంతా దైవత్వాన్ని పొందినట్లుంది. అలాంటి అద్భుతమైన వాతావరణంలో - అప్పుడు మళ్ళీ చూశాను శివలింగాన్ని. అభిషేకానికి అర్చకులు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. నిన్న ఉన్న అలంకరణలేవీ లేవు. నేయి పేరుకుపోయి ఉంది. నిర్మలంగా భాసిస్తోన్న ఆ బ్రహ్మ మురారి సురార్చిత లింగాకారాన్ని చూస్తూనే ముకుళించిన చేతులతో స్తోత్రం చేయాలనిపిస్తుంది.
"నమో నిష్కల రూపాయ - నమో నిష్కల తేజసే
నమస్సకల నాథాయ- నమస్తే సకలాత్మనే
నమః ప్రణవ వాచ్యాయ- నమః ప్రణవ లింగినే
నమః స్సృష్ట్యాది కర్త్రేచ - నమః పంచముఖ్యాతే"

దాదాపు నలభై నిముషాల పాటు సాగిన అభిషేకాన్ని కళ్ళారా చూసి, నిన్నటి దర్శనంలో ఉన్న అసంతృప్తులన్నీ చెరిపేసుకున్నాను. ఈ ఊరంటూ వెళ్ళడం జరిగితే, ఈ బ్రాహ్మీముహూర్తాన అభిషేకాన్ని చూసే అవకాశాన్ని కోల్పోకూడదు. దగ్గర్లోనే ఉన్న భగవతి ( మలయాచలవాసిని ఈ ప్రాంతమంతా భగవతిగానే పిలవబడుతుంది), ఉన్ని కృష్ణన్ ఆలయాలు కూడా దర్శించుకుంటే - తరువాతి ప్రయాణానికి సిద్ధమైపోయినట్లే.

అక్కడి నుండీ అత్తిరపల్లి జలపాతాలకు. మణిరత్నం మనసు దోచిన చోటుకు. 

ఆ సౌందర్యాన్ని మాటల్లో పెట్టగల శక్తి నాకుందనుకోను. వసంతాన్నింకా మిగుల్చుకున్న అడవి దారుల్లో పూతేనెల పరిమళాలేవో అనుమతి అడక్కుండానే గుండె నిండా నిండుకోవడం గుర్తొస్తోంటే, తీయని బాధ. మత్తిల్లిన దారుల్లో నడక సాగినంత మేరా జలపాతపు రవాలెక్కడి నుండో వినపడి కవ్విస్తూనే ఉంటాయి.పురాస్మృతిగీతాలేవో పాదం పలకరించిన అడుగడుగులోనూ ప్రతిధ్వనిస్తూంటాయి. కొండ పైన ప్రశాంతంగా పారిన నీటిలో నిశ్చింతగా ఆటలాడుకుని, కొండ అంచుల్లో జలపాతమై దూకిన లోతుల్లోకి ఓపిగ్గా నడుచుకు వెళ్ళి - తలనెత్తి ఆ ప్రవాహ వేగాన్ని చూసేంత వరకూ పర్లేదు కానీ, తుంపర్లలో తడిసిపోయి హిమాలయోన్నత రసపారవశ్యాన్ని చినుకులతో కొలిచి చూసుకోవాలనుకోవడం మూర్ఖత్వం కాక మరేమిటి? కళ్ళ ముందే నీళ్ళు వేగంగా సుళ్ళు తిరుగుతూంటాయి. పక్కనున్న గడ్డిపరకలు తల ఊచి తాళమేస్తాయి. నురగలు లేచి ఆకాశాన్ని అందుకుంటాయి. సర్వజగత్శరీరాన్ని అరుణారుణకిరణాలతో తడిమే సూరీడు జలపాతంతో జతకట్టి ఇంద్రధనుస్సు సృష్టిస్తాడు. అంత సౌందర్యాన్నీ, జలపాతాన్ని దోసిలిలో పట్టుకోలేం. విప్పార్చుకున్న కళ్ళతో ఆకాశాన్నీ కొలవలేం. ఇలా పదాలలో పెట్టే ప్రయత్నాల్లో గెలుస్తామో ఓడుతామో - ఓ అనుభవాన్నైతే దాచుకోగలం. 

రాత్రికి బెంగళూరుకు బస్. అక్కడ దాకా వెళ్ళాం కదా అని, సమయం కూడా ఉందన్న ధైర్యంతో "కాలడి" వెళ్ళాము. జగద్గురువులు శ్రీఆదిశంకరాచార్యులు జన్మించిన ప్రదేశం. వారి చరణాంబుజముల సంస్పర్శతో ధన్యత పొందిన ప్రాంతమిది. అడుగడుగునా వింతలే అక్కడ. కథలుగా విన్న విశేషాలన్నీ కళ్ళారా చూసి - మేము చూడాలనుకున్న ఓ ప్రదేశానికి వెళ్ళగలిగాము. ఆ ఇల్లు ఇదీ. గుర్తుపట్టగలరా? ఎండు ఉసిరికాయను భిక్షగా ఇచ్చిన కడుబీద బ్రాహ్మణురాలి దైన్యానికి కలత చెంది, శంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రం చేసిన ఇల్లు ఇదే! శ్రీమహాలక్ష్మి ప్రీతినొంది బంగారు ఉసిరికల వర్షం కురిపించిన ఇల్లు.


"సరసిజ నయనే సరోజ హస్తే
ధవళ తరాంశుక గంధమాల్యశోభే ।
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్ ॥"

నంబూద్రి వంశీయులు ఇప్పటికీ అక్కడ ఉంటున్నారు. వాళ్ళ వారసులైన గోపాలం అనే వ్యక్తితో మాట్లాడాం. నాకైతే ఇంకా ఆ ఉసిరికాయలేమైనా ఉన్నాయా అని అడగాలనిపించింది ;). బొమ్మలో ఉన్నట్టే చాలా పాతకాలం ఇల్లు. జగద్గురువులు వచ్చిన నాటి నుండీ అలాగే ఉందా అన్న ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. 

మొత్తానికి చాలా మధుర స్మృతులు పోగేసుకున్నాను ఈ ప్రయాణంలో.  వెన్నెల కిరణాలు సోకి సిగ్గిల్లి నవ్వే నక్షత్రాలు నీలాకాశపు చెక్కిలిని మెరిపించే క్షణాల్లో - తిరుగుప్రయాణం మొదలవక తప్పదు. ఆశ ఏమిటంటే...అత్తిరపల్లి మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు కాదు, శ్రావణమాసాన జడివానలు కురిసే రోజుల్లో, మహారణ్యాలు చినుకు తడికి తలలూపి మహోద్వేగంతో చిందాడే రోజుల్లో ఆ సౌందర్యంలో తడుస్తూ నడుస్తూ ఆలోచనలను వెలేస్తూ ఆ జలపాతాల క్రిందకెళ్ళాలి. తెల్లంచు నల్లచీర కప్పుకున్న ఆకాశకన్య అందాలన్నీ నీటిమడుల్లో నుండి దోసిలికెత్తుకుని నాలో కలిపేసుకోవాలి. అంతే! :)

( క్రితం సారి కేరళ విశేషాలేవో వ్రాసినప్పుడు చదివి - అక్కడికి వెళ్ళి వచ్చి, గుర్తుంచుకుని మళ్ళీ నాకా మాట చెప్పి పరమానందభరితురాలిని చేసిన బ్లాగ్ మిత్రులు కృష్ణ గారి కోసం ప్రత్యేకంగా ఈ కబుర్లు :))

ఇష్టమాను నిన్నే...మనసిలాయో...



పోటెత్తిన అలలతో పుడమి కడలైపోవటాన్ని కనులారా వీక్షించి, అటుపై పాల వెన్నెల విరిగి తెలి వెలుగులుగా మారబోయే క్షణాల దాకా సైకత తీరాల్లో అనిమేషివై నిరీక్షించి...కాలం కౌగిట్లో నుండి ఏవేమి కొల్లగొట్టి కొంగు ముడిలో దాచుకున్నావో పదాలలో పెట్టవూ..? ఒక్క అనుభవమూ అవ్యక్తమై నీలో నిక్షిప్తమవకూడదు, దొరలిన నవ్వుల సిరులన్నీ లోలో దాగిపోకూడదు...పందెమే కడుతున్నాను మనసా! - అక్షరాల అమ్ములపొది నిన్నేమైనా గెలిపిస్తుందేమో ప్రయత్నించవూ?
                                                                 ****************
అనంత కాలప్రవాహంలో రెండు రోజులంటే పరిగణనలోనికి రాని పరిచ్ఛేదమే కావచ్చు; కాలానిదేముంది, కళ్ళెమేసే వారు లేరనుకుని తల నెగురవేస్తుంది. సృష్టిలో సౌందర్యమనేది ఒకటుందనీ, ఆ సౌందర్యం అనుభవంలోకి వచ్చిన క్షణాలు కాలాలనూ లోకాలనూ కూడా విస్మరించగల శక్తినిస్తాయనీ - లెక్కలు కట్టుకు గళ్ళను దాటుకుంటూ తమ ప్రతిభకు తామే చప్పట్లు కొట్టుకునే గోడ మీది ముళ్ళకెప్పటికి తెలిసేను, ఎవ్వరు చెప్పేను? మునుపెరుగని మనోజ్ఞ సీమలలో తిరుగాడిన రోజులే కాదు, స్మృతి పథంలో ముద్దరలేసిన ఆ అనుభవాలన్నీ అక్షరబద్ధం చేసుకునే ఏకాంత క్షణాల్లోనూ, మామూలు వేళల్లో మనను పరుగులెత్తించే ఆ మాయావికి, గర్వభంగం అయి తీరుతుంది కదూ!

బ్యాక్ వాటర్స్, సాగర తీరాలూ, జలపాతాలూ, పర్వత శిఖరాలూ, కొబ్బరి చెట్లూ - అన్నీ కాస్త అటునిటుగా అక్కడక్కడే పక్కపక్కనే ఉంటే - అదే కేరళ. కలహంస పంక్తులనూ, కల్హార సౌరభాలనూ ఇంకా మిగుల్చుకున్న భూలోక స్వర్గమది. రెండు రోజుల వ్యవథి ఆ అందాలను చూడటానికి నాబోటి వాళ్ళకి అస్సలేమాత్రమూ సరిపోదు. తమి తీరనే తీరదు. తనువేమో కదులదు.

సాగర తీరాలను స్పృశించి వచ్చే మంద సమీరం చెవిలో ఇంకా రహస్యాలు చెబుతునట్టే ఉంది; అలలు కమ్ముకున్నప్పుడల్లా తడిసిన పాదాలు అవి వెనక్కు మళ్ళగానే మెత్తటి ఇసుకలోకి లాగబడ్డ స్పర్శ ఇంకా సజీవంగానే ఉంది; పడియలు కట్టిన కావి రంగు నీరు ఒక్కోసారీ ఒక్కో తీరుగా కనపడి నవ్వించడమూ గుర్తుంది. రేయి రేయంతా చంద్రికలతో వన్నెలద్దుకుంటుంటే ఏ తీగ చాటునో రహస్యంగా రెప్పలు విప్పుతున్న మొగ్గల పక్కన ఓపిగ్గా కూర్చుని కబుర్లాడుకోవడం జ్ఞాపకాలలో పదిలంగా ఉంది. ఎన్ని కబుర్లని పంచుకోను...అన్నింటి గురించీ సవివరంగా రాయలేకపోయినా, చూసిన రెండు ముఖ్యమైన ప్రదేశాల గురించి -- కాసిన్ని సంగతులు.


మొదటి రోజు - బెంగళూరు నుండి పన్నెండు గంటల ప్రయాణించి -కాసర్‌గోడ్‌లో విడిది - బెకల్ ఫోర్ట్ సందర్శనం

సాగర తీరాన నలభై ఎకరాల్లో నిర్మించబడిన కోట ఇది. భారతదేశపు పది అద్భుతాలలో(2012) ఒక్కటిగా ప్రతిపాదించబడిన పర్యాటక ప్రదేశం కూడానూ. నల్లరాతి కోట గోడలు చూస్తుంటే, తడుముతూ ముందు సాగుతుంటే, ఎన్నెన్ని ఆలోచనలో..! ఒకప్పుడు ఇది దుర్భేద్యమైన కోట. ఒక చక్రవర్తి బలానికి, బలగానికీ, ఆతని పరాక్రమానికి తిరుగులేని సాక్ష్యం. ఇప్పుడో - పల్లీలు చేతబట్టుకు ఒక సాయంకాలం గడిపేందుకు వీలుగా మార్చబడ్డ విహార స్థలం.  ఎందుకో హఠాత్తుగా "రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే" అని శుక్రాచార్యునికి బదులిచ్చిన బలి చక్రవర్తి ఎంత వివేకవంతుడో కదా అనిపించింది.

"ఉరికే చిలకా" పాట గుర్తుందా? బొంబాయి సినిమా! కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని మనీషా కోసం ఎదురుచూస్తూ అరవింద స్వామి పాట పాడింది ఇక్కడే. ఆ పాట తల్చుకోగానే ముందు నేపథ్యంలో వినిపించే మురళీ గానం గుర్తొస్తుంది. మతి చెడగొట్టిన సంగీతం కదూ..! అలా కోట బురుజుల మీద కూర్చుని, సముద్రం మీద పడుతున్న వర్షపు చినుకుల సంగీతం వింటూ కోట లోపలి వైపు దట్టంగా పెరిగిన పచ్చికలో పరుగులిడుతున్న పసి వాళ్ళను చూడడం ఎంచక్కటి కాలక్షేపమో.

మధ్యాహ్నమనగా వెళితే, కాస్త ఎండగా ఉన్నంతసేపూ బీచ్ పార్క్‌లోనూ, ఇక నాలుగు మొదలుకుని బెకల్ ఫోర్ట్‌లోనూ కాళ్ళరిగేలా తిరగడంతోనే సరిపోయింది. కోట బయటా లోపలా కూడా ఊరబెట్టిన ఉసిరికాయల మీద పల్చగా కారం జల్లి అమ్ముతూంటారు. అన్ని గంటల సేపూ నేను ఒకదాని తరువాత ఒకటి తింటూనే ఉన్నాను. హ్మ్మ్..రాస్తుంటే మళ్ళీ పులపుల్లగా తియతియ్యగా ఆఖర్లో కాస్త వగరు రుచి లాంటిదేదో వదిలిన ఆ ఉసిరికాయ ఇంకొక్కటి బుగ్గన పెట్టుకు చప్పరించాలనిపిస్తోంది. సూర్యాస్తమయమయ్యే వేళకు కోట తలుపులు మూసేస్తారు. అరికాళ్ళ మీద ఇసుకంతా ఓపిగ్గా దులుపుకుని, ఇసుక గుళ్ళు కట్టి గవ్వలేరుకునే అలవాట్లు ఉంటే సముద్ర జలాలతో మళ్ళీ చేతులు తడుపుకుని, కోట బయటకు వచ్చేయాలి. పక్కనే హనుమంతుడి గుడి ఉంటుంది. హారతి సమయం. ఎంచక్కా దణ్ణం పెట్టేసుకుని బెల్లం-అటుకులు-కొబ్బరి తురుము కలిపి చేసిన ప్రసాదం దోసిలి నిండా నింపుకు బయటకు వచ్చి నిలబడితే, దూరంగా ఆకుపచ్చ జెండాతో, నెలవంకతో అస్పష్టంగా కనపడే మసీదు కూడా మసకమసకగా చూపులకానుతుంది. బాగుంటుంది, రెంటినీ అలా చూడడం.

రెండవ రోజు....కాసర్‌గోడ్ నుండి అనంతపురానికి ప్రయాణం..

నిశ్చలమైన సరస్సు...మధ్యలో కేరళీయుల దేవాలయ నిర్మాణాలలోని వైవిధ్యతను కళ్ళకు కట్టినట్టు చూపించే అనంత పద్మనాభస్వామి ఆలయం. హరినామ స్మరణతో ముఖరితమవుతున్న దేవాలయ ప్రాంగణంలో జంటగా అడుగులేస్తూ మేమిద్దరం. పక్కకు చూస్తే, తలలు నిక్కించి ఎగిరిపడుతున్న చిరుమీలు కనపడతాయి. ఉన్నట్టుండి నీటి పైపైకొస్తున్న కొంగల తడిసిన రెక్కల తపతప ధ్వనులు, ఎన్నడనగా అక్కడొచ్చి చేరాయో - తెలతెల్లని పావురాయిపిట్టల కురరీ ధ్వనులు...ఇవేమీ అక్కడి నిశ్శబ్దాన్ని భగ్నం చేయకుండా, లయగా ఇమిడిపోయినట్లనిపించడంలోనే ఉంది అసలు మహత్తంతా..!

మెట్లు దిగి, ఆలయంలోకి వెళ్ళి, పంచలోహాలతోనో, రాతితోనో కాక అమూల్యమైన ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడ్డ భూదేవీ శ్రీదేవీ సహిత అనంత పద్మనాభ స్వామికి మనసారా మ్రొక్కాము. దర్శనమైన ఉత్తరక్షణంలో  "పదండి...పదండీ" అంటూ తరిమేయకుండా ఇంకాసేపు అటు పక్క కూర్చుని శ్రీ మహా విష్ణువును ప్రార్ధించండి అంటూ చోటు చూపించిన పూజారులంటే అమాంతం గౌరవం పెరిగిపోయింది. కాసేపాగి, ఆ గుడికి కాపలాగా పిలువబడడమే కాక, దైవాంశ కలిగినదిగా పొగడబడే మకర శ్రేష్టాన్ని చూడటానికి వెళ్ళాము. మేమూ, మాతో పాటు ఇంకో పది మందీ - ఆశ చావక ఎంత సేపు చూశామో- తీరా అది బయటకే రాలేదు. చూసే భాగ్యం కలుగలేదు. అన్నట్టూ - త్రివేండ్రంలో ఉన్న అనంత పద్మనాభ స్వామికి ఇదే మూలస్థానం అని ఇక్కడి వారి నమ్మిక. స్వామి ఈ సరస్సులో నుండి కనపడే గుహలోపలి నుండే అక్కడికి వెళ్ళారని ఒక విశ్వాసం.

                                                                            *****
వెళ్ళే ముందు రెండు గంటలు మళ్ళీ, పాలక్కడ్ బీచ్‌కు వెళ్ళి, తీరానికి కాస్త దూరంగానే కూర్చుని... ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాల కౌగిలిలో నను బంధించేందుకు, నురగల నవ్వులతో ముందుకొస్తున్న సంద్రాన్ని చూస్తుంటే...మనసంతా ఎంత పరవశమో!!

అరుణ కాంతుల పగడపు తునకలు నీవే, నీలిమేఘఛాయలు వాలిన వేళ నీలాలగనివీ నీవే, పకృతి కాంత చిరుచీకట్ల కాటుక దిద్దుకుంటూంటే మరకతమణులన్నీ నీవే, తెలి లేవెన్నెల చాలులో తళతళె దీపించు వేళ ముత్తెపు గుత్తులు నీవే, వర్ణాలన్నీ దోచిన అర్ణవమా, రతనాకరమా...నీ అసమాన సౌందర్యాన్ని వర్ణించదలచిన ప్రతీ ప్రయత్నంలోనూ నిర్దాక్షిణ్యంగా నను ఓడిస్తావెందుకు ?

కాంచీపుర క్షేత్ర వైభవం


చిన్నప్పుడు "కంచి" అని ఎవరైనా అనగానే, "కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు.." అంటూ బిగించిన పిడికిలి నుదుటి మీద పెట్టుకుని, కళ్ళు మూసినట్టు నటిస్తూ "సోది" చెప్పడానికి సిద్ధపడేవాళ్ళం. పాతికేళ్ళ క్రితం మా అక్క, అమ్మ చీర చుట్టుకుని, కొప్పు పెట్టుకుని, ఈ "పసి"డి పలుకులను బడిలో అప్పజెప్పి ఓ బహుమతిని నెగ్గించుకున్నప్పుడు తీసుకున్న ఫొటో, ఈ రోజుకీ తన బాల్యపు స్మృతుల్లో భద్రంగా నిలిచే అనుభవమే. కాలి మీద బల్లి పడిందని చెంగు చెంగున ఎగిరి గందరగోళం సృష్టిస్తున్న చిన్న పిల్లలను నిలువరించి, కాసిన్ని పసుపు నీళ్ళు తలపై జల్లి, కంచి వెళ్ళొచిన వారెవరింటికైనా పంపి, తాకి రమ్మనడం తెలుసు. తాకితే ఏమవుతుందో తెలీదు. శ్రీకాళహస్తిలో ఉండే నా ఆత్మీయ మిత్రులొకరి ఇంటికి వెళ్ళి వచ్చేస్తునప్పుడు, నెమలిపింఛం రంగు పట్టుచీర వాళ్ళమ్మగారు ఆప్యాయంగా కానుకిచ్చి, "ఇదుగో బంగారు తల్లీ, కంచి నుండి ప్రత్యేకంగా తెప్పించిన చీర! కామాక్షి అనుగ్రహంతో త్వరగా పెళ్ళి కుదిరి, ఆ కంచిలోనే పెళ్ళి పట్టుచీర తీసుకునేందుకు తప్పకుండా రావాలి సుమా" అంటూ ఆశీర్వదించి పంపిస్తే, ఆ కలనేత చీర సొబగులన్నీ అబ్బురపడుతూ తడిమి చూసుకున్న మధుర జ్ఞాపకమొకటి రెప్పల వెనుక ఇంకా రెపరెపలాడుతూనే ఉంది.

ఇలా అడపాదడపా వినడమే తప్ప, ప్రయాణానికి పూర్వం కంచి గురించి నాది నిజంగా మిడిమిడిజ్ఞానమే! కాంచీ క్షేత్ర వైభవం ఏ కాస్తా తెలుసుకోకుండానే అక్కడికి వెళ్ళినా, ఆ "కంజ దళాయతాక్షి కామాక్షి -కమలా మనోహరి త్రిపుర సుందరి" దర్శనం అయిపోయాక మాత్రం తెలివొచ్చినట్లైంది. తెల్లవారు ఝామున అభిషేకానికి వెళ్ళామేమో, ధారలుగా పడుతూన్న పసుపు నీళ్ళు అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేస్తుంటే, రెప్ప వాల్చకుండా చూస్తున్న అందరికీ అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. అటుపైన తెరల చాటున క్షణాల్లో చేసిన అలంకారం, మమ్మల్ని ముగ్ధులను చేసి, మనసులో ఇతఃపూర్వం ఉన్న ఆలోచనలన్నీ నిర్ద్వంద్వంగా చెరిపి వేసింది. "చంచలాత్ముడేను యేమి పూర్వ - సంచితముల సలిపితినో.. కంచి కామాక్షి నేను నిన్నుపొడగాంచితిని.." అంటూ మనసులో కీర్తించుకోవడమే కర్తవ్యమైన దివ్య క్షణాలవి.

శృంగేరీ..సౌందర్యలహరీ!


చూసే కనుదోయి అభిప్రాయాల అల్పత్వం దగ్గరే ఆగిపోకుండా, మనసును తాకి పరవశింప జేసే సౌందర్యాన్ని అణువణువునా నింపుకున్న ప్రదేశాలు అదృష్టవశాత్తూ మన దేశంలో ఇంకా చాలానే మిగిలి ఉన్నాయి. వెర్రి పోకడల నవనాగరికత నీడలు పడని, కాలుష్యమింకా తెరలను పరువని నిష్కల్మష పుణ్యస్థలమైన శృంగేరి శారదా పీఠం తప్పకుండా అదే కోవకు చెందుతుంది.

జాతి వైరాన్ని మరచి ఒక పాము కప్పకు తన పడగ చాటున నీడనిచ్చిన మహత్తరమైన ప్రదేశంలో ఒక్కసారైనా కాలు మోపాలన్న ఆశా, అద్వైతాన్ని నలుదిశలా ప్రచారం చేసి, సనాతన భారతీయ ధర్మోద్ధరణ గావించిన శ్రీ శంకర భగవత్పాదులు ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించిన శారదా పీఠాన్ని దర్శించుకుని ఒక రెండు రోజులు హడావుడి లోకానికి దూరంగా, ప్రశాంతంగా గడపాలన్న కోరిక - తొలుత ఈ రెండే మా అకస్మాత్తు ప్రయాణానికి ప్రేరణలు. అయితే, అనుకోని వరాల్లా, అక్కడ ఉన్న రెండు రోజుల్లోనే ముందు వినని, చదువని (చదివినా ఇంత మనోహరంగా ఉంటాయని ఊహించని) మరికొన్ని ప్రదేశాలు కూడా చూడగలిగాము. అదృష్టమేనేమో కానీ, బెంగళూరు దాటి సగం దూరం ప్రయాణం చేసినప్పటి నుండీ వాన పడే ముందు ఉండే అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం, శృంగగిరి పీఠం ఇంకా చేరకుండానే మనఃస్థితి మొత్తాన్నీ మార్చేసింది. మలుపుల మయమైన ఘాట్ రోడ్ మీద కిటికి పక్కన కూర్చుని చేసిన ప్రయాణం, ఎంత వెనక్కు తోసినా మొహమంతా పరుచుకునే జుత్తు, చెవుల్లోకి సన్నని హోరుతో దూసుకెళ్ళే గాలి, కళ్ళకు హాయి గొలిపే చిక్కటి పచ్చదనం ప్రయాణంలో తొలి ఘడియల అనుభవాలు.

శృంగగిరి అడవి మధ్యలో ఉన్నట్టుంటుంది. నాకు సహజంగానే అడవి ప్రాంతాల పట్ల మక్కువ ఎక్కువ. అందునా పచ్చందనాల కౌగిళ్ళల్లో ఒదిగి హొయలొలికించే చిగురాకులలోనూ, చిరుజల్లుల తాకిడికి తడిసి తల విదుల్చుకునే లేలేత కుసుమాల కదలికల్లోనూ మానవ మేధస్సుకు అంతు పట్టని మార్మిక సౌందర్యమేదో మనసులకు ఎర వేసి లాగేస్తుంది. కాలాలను కట్టి పడేసి, బాహ్య స్మృతి విముక్తులను చేయగల అదృశ్య శక్తేదో ఆ అడవి తల్లి ఒడిలో మాత్రమే భద్రంగా ఉంది.

అహోబిలం-యాత్రా విశేషాలు

"కలడంబోధి కలండు గాలి గలడాకాశంబునన్ గుంభినిన్
గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
గలడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటన్
గలడీశుండు గలండు తండ్రి! వెదుకంగా నేల యీ యా యెడన్? "

అంటూ "ఎందెందు వెదకి చూసిన అందందె కలడు విష్ణువ"ని అచంచల విశ్వాసంతో పలికిన అచ్యుతపద శరణాగతుడైన ప్రహ్లాదుని వాక్కును సత్యం చేసేందుకు స్థంభం నుండి సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే నరహరిగా ఉద్భవించిన మహోత్కృష్ట ప్రదేశం "అహోబిలం".

విచ్చుకున్న తామరలతో శోభిల్లే కొలనులు, సూరీడు తొంగి చూసేందుకు కాస్తంతైనా అనుమతివ్వని అమలిన అడవి అందాలు, నున్నటి గులకరాళ్ళ మీద జారిపోయే అడుగులతో ప్రయాణాలు, దారంతా వినిపించే జలపాతాల గుసగుసలు, భవనాశిని జల్లుల్లో చలిగిలిగింతలు, మరెక్కడా కనపడని కొన్ని వింత పూవులు, లతలు, దూరంగా ఎక్కడి నుండో వినిపించే హరి నామ స్మరణలు, ఎటుపక్కకు చూసినా కనువిందు చేసే లేత ఆకుపచ్చ రంగులు, వాటి చుట్టూరా రెక్కలు విదుల్చుకుంటూ తిరిగే రంగురంగుల సీతాకోకచిలుకలు, శ్రావణ భాద్రపదాల్లో విరివిగా కురిసిన వర్షాలకు పూచిన కొండమల్లెలు పంచే పరిమళాలు, ఎత్తైన పర్వత శిఖర అంచుల మీద, కలవరపెట్టేంత లోతైన లోయను కళ్ళు విప్పార్చుకుంటూ చూస్తుంటే సొంతమయ్యే అనుభవాలు, అడుగులో అడుగు వేసుకుంటూ, అడుగు జారితే స్వర్గమే నన్న అపరిచితుల మాటలకు అప్రయత్నంగానే నవ్వులతో బదులిస్తూ సాగే నడకలు, అన్నింటి కంటే ముఖ్యంగా, మనస్సు అనుక్షణం ఆశపడే అద్భుతమైన మౌన ప్రపంచం.........- - స్వర్గలోకాల దారులను వర్ణిస్తున్నా అనుకుంటున్నారా...ఊహూ..అహోబిలం ప్రకృతి సౌందర్యాన్ని నా కళ్ళతో మీకూ చూపిస్తున్నానంతే!


రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...