జాషువా కవిత్వం - పిరదౌసి

కళ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటుంది. అది దాని జీవలక్షణం. సాహిత్యం దానికి మినహాయింపు కాదు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కథన కవిత్వ రీతులు పుట్టుకొస్తున్నాయి. నూతన అభివ్యక్తి మార్గాల కోసం అన్వేషణలు కొనసాగుతున్నాయి. కవితా వస్తువులు మారుతున్నాయి, నేపథ్యాలూ కొత్తగా కనపడుతున్నాయి. కవిత్వ లక్షణాల గురించీ, లక్ష్యాల గురించీ విభిన్న వాదనలు వినపడటమూ, సామాజిక ఆర్థిక రాజకీయ అవసరాలు ఏ కాలానికాకాలం కవిత్వాన్నీ ప్రభావితం చేయడమూ పాఠకలోకం గమనిస్తూనే ఉంది. ఇన్ని వైవిధ్యాలున్న వాతావరణంలో, ఎవరైనా ఒక కోవకు చెందిన కవిత్వాన్ని లేదా ఒకరి కవిత్వాన్ని మాత్రమే గొప్పది అనడం సాహసమనిపిస్తుంది. ఆ రకమైన అభిప్రాయం తాత్కాలికమనీ తోస్తుంది. సృజన గొప్పతనాన్ని నిర్ణయించగలిగేది కేవలం కాలం మాత్రమే. జాషువా ఖండకావ్యం పిరదౌసి, కాలం ధాటికి తట్టుకుని నిలబడ్డ అలాంటి అసాధారణమైన కవిత్వం. సరళమైన అభివ్యక్తితో గాఢమైన మానసిక దశలను చిత్రించిన తీరుకి, ఊహలకందని ఉద్వేగాలకి అక్షరరూపమిచ్చి అనుభవైకవేద్యం చేసిన సమర్థతకీ, ఇప్పుడే కాదు, ఏ కాలానికైనా ఈ కావ్యం సజీవంగా సాహిత్య లోకంలో నిలబడగలదు.
పిరదౌసి పర్షియనులు ఎంతగానో అభిమానించే 10వ శతాబ్దపు ఒక గొప్ప కవి. అతని షాహ్‌నామా సామానీ, గజనీ రాజుల కాలంలో రాయబడిన ఇరాన్ దేశపు చారిత్రిక ఐతిహాసం. అరవై వేల పద్యాలతో, ప్రపంచం లోనే అతి పొడుగైన ఇతిహాసంగా పేరెన్నిక గన్న గ్రంథం. అప్పటి కవిపండితులు ఎందరి లాగానో పిరదౌసి జీవితాన్ని గుఱించి కూడా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వ్యత్యాసాలు ఎన్నున్నా స్థూలంగా కథ మాత్రం ఒక్కటే. ఇదీ ఆ పిరదౌసి కథ:

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....