Showing posts with label * కవులూ - కవిత్వాలూ. Show all posts
Showing posts with label * కవులూ - కవిత్వాలూ. Show all posts

చిన్న చిన్న సంగతులు - శ్రీనివాస్ గౌడ్

 "ఎంత సమ్మోహనంగా

అన్నావు ఆ మాట
...
మాట అంటున్నప్పుడు
నీ మొకం చూడాలని
మహ కోరికగా ఉండింది
ఇష్టం తొణికిసలాడే
ఆ కళ్ళవెన్నెల్లో తడవాలని
ప్రాణం కొట్టుకలాడింది"
కొన్ని కవితలు ఒక్క పదంతోనే పాఠకులను లోబరుచుకుంటాయి. ఇలాంటి కొన్ని కవితలు మాత్రం అవి అల్లుకునే తీరుతో పాఠకులను ఒక నూత్న ఆవరణలోనికి తీసుకునిపోతాయి. "కాంక్షాజలం" జల్లుజల్లుగా కురిసినట్టుగా ఉన్న ఈ కవిత, శ్రీనివాస్ గౌడ్ గారి చిన్న చిన్న సంగతులు కవితా సంపుటిలోనిది.
ఇంతకీ, ఆమె ఏమంది?
అది చెప్పడు కవి. అదే కాదు, ఇదొక ఫోన్ సంభాషణ నేపథ్యంలోని కవిత అని కూడా చెప్పడు. ఆమె ప్రియమైన మాటేదో ఇష్టాన్నంతా మూటగట్టి చెప్పింది. బహుశా అది ఎదురూగ్గా చెప్పేందుకు ధైర్యం చాలని మాట. లేదూ చెప్పబోయినా సిగ్గులు పరిచే మాట. అదేమైనా కానీ, ఈ కవిత పూర్తి పాఠం చదివితే ఆమె సొలపు చూపులేవో కళ్ళకు కడతాయి. హృదయంగమమైన మాట ఎన్నిసార్లు విన్నా తమితీరదనుకునే ఆతని ఆకాంక్షా అర్థమవుతుంది. నిజానికామె అన్న ఆ మాటేమిటో పాఠకులకు తెలియనివ్వకపోవడంలోనే అవధుల్లేని అందముంది. ఊహాసీమల హద్దులు చెరిపే రాసిక్యత ఉంది. అదే ఉదాహృతమైన ఈ కవితకు ప్రాణంగా నిలబడగల లక్షణమైంది.
*
"అడివంచున విశ్రాంతిగా పడుకుని ఉండే సాధు నిశ్శబ్దాన్ని" కవిత్వంలోకి తీసుకురాగల కవులు అరుదు. ఆ నిశ్శబ్ద సౌందర్య రహస్యాన్ని కొంత కొంతగా చాలా కవితల్లో చొప్పించారు శ్రీనివాస్. నూరు కవితలున్న ఈ సంపుటిని చదువుతున్నంతసేపూ ఒక స్పష్టాస్పష్ట భావమేదో నా లోపల సుళ్ళు తిరుగుతూనే ఉంది. చివరి కవితల్లో ఒక చోట,
A human made out of
Thousands of humanbeings అన్న మాటలు చదివాక, ఆ భావానికో రూపం దొరికింది. Ubuntu. ఇది, I am because we are అని గుర్తుంచుకోమనే ఒక ఆఫ్రికన్ నినాదం, ఆదర్శం, సందేశం. ఆ తత్వం అర్థమైన మనిషి, పోటీ తత్వాన్ని ఆవలికి నెట్టి, సాటి మనిషికొక ఆసరా అవుతాడు. తోటి మనిషి నుండి ఏ రకమైన ఆపదని ఊహించుకోనక్కర్లేని భరోసాతో వాళ్ళ విజయాలకు పొంగిపోతాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళలో ఏ ఒక్కరు దుఃఖితులై ఉన్నా, తాను సంతోషంగా మనలేనన్న ఎఱుకతో ఉంటాడు. ఒడ్డున నిలబడి రాయి విసిరినప్పుడు కొలనంతా అలలు పరుచుకుంటున్నట్టు, మన ప్రతి పనీ ఎవరినో ఎక్కడో తాకనుందన్న స్పృహ నరాల్లో నిండుకున్న మనిషి ప్రవర్తించే తీరు ఊహించలేనిదేం కాదు కదా! అది ఒక సామూహిక సంస్కారమైనప్పుడు, శ్రీనివాస్ రాసినట్టు, మనిషిగా నేనూ కొన్ని వేల మంది మిశ్రమం అన్న స్పృహ కలుగుతుంది. జీవితం పట్ల కృతజ్ఞత మొదలవుతుంది. చేసే పనులు ఏవైనా వాటి తక్షణ ఫలితాల మీద వ్యామోహం వదిలిపోతుంది. తడి విత్తనం పాతేసి వెళ్ళిపోవాలనీ, ఆకుల నీడలో ఎవరు విశ్రమించనున్నారో అనవసరమనీ చదివినప్పుడు- పేరుదేముంది కానీ - ఈ కవి తత్వం ఇలాంటిదేనని బోధపడుతుంది. ఒక పదంలోనో పాదంలోనో కాదు, ఒక స్ఫూర్తిగా పుస్తకమంతా ఆవరించుకున్న భావమిది. మనుషుల్ని, ప్రకృతిని చూసిన పద్ధతిలోనూ, తలుచుకున్న పద్ధతిలోనూ, ఎందరో కవులని ఇష్టంగా acknowledge చేసిన పద్ధతిలోను ప్రేమ, గ్రాటిట్యూడ్‌లతో పాటుగా, మనిషంటే ఎందరెదరి ప్రభావాలనో ప్రోది చేసుకుని తనదైన వ్యక్తిత్వంతో పునరుజ్జీవమవడమేనన్న స్పృహ బలంగా కనపడటం వల్లేనేమో బహుశా, ఈ సంపుటి చదువుతుంటే నాకు UbunTu గుర్తొచ్చింది.
**
శ్రీనివాస్ గారూ, మిమ్మల్ని తల్చుకుంటే మీ కన్నా ముందు మీ కవిత్వం గుర్తు రావాలని ఆశపడ్డారు. నాకేమో "కవిత్వం రాయడం తేలిక కాదు, సరదా కాదు", అంటూ
"రాసిందాకా తుఫాను హోరులో వణుకుతున్న ఇసుక గూడు" లా ఉండే ఒక రూపం గుర్తొస్తుంది. అది మీరా, మీ కవిత్వమా!

నల్లమబ్బుపిల్ల - మల్లిక పులగుర్తి

 మల్లిక నా చిట్టి స్నేహితురాలు. నల్ల మబ్బు పిల్ల అని ఒక పుస్తకాన్ని ప్రచురించి, నాకు పంపే ఏర్పాటు చేసింది. బుక్ ఫెస్టివల్‌లో ఆ కాపీ అందుకుని, ఈ రోజే జరిగిన ఆ పుస్తకపు ఆవిష్కరణలో పాల్గొనాలనుకున్నాను కానీ అక్కడే సాయంత్రమైపోయింది. ఫోన్‌లో చార్జింగ్ లేదు. నెట్‌వర్క్ అంతంత మాత్రం. చిన్న పుస్తకం కనుక ఇప్పుడే చదవడం పూర్తి చేశాను.

మల్లిక ఏదైనా పోస్ట్ చేసినప్పుడు, చాలా మంది, నువ్వు మా పసితనాన్ని గుర్తు చేస్తున్నావ్ అనో, చిన్నప్పుడు నేనూ అచ్చం నీలాగే ఉండేదాన్ని అనో రాస్తారు. అలా అని మల్లిక పసి వయసు నాటి ముచ్చట్లేం రాయదు. పసిపిల్ల లానూ రాయదు. కానీ ఆ కామెంట్ ఎందుకు ఆమెకు అన్ని సార్లు చేరుతుందా అని ఆలోచిస్తే, చప్పున తట్టేదొకటి. ఆమె అక్షరాల్లో తొణికిసలాడే అమాయకత్వం. అమాయకమైన నమ్మకం. మనుషుల పట్ల, పిట్టల పట్ల, పూవుల పట్ల, ఉదయం పట్ల ప్రేమ. ఆ మనుషులనీ, ఈ పిట్టలనీ పూవులని దగ్గరగా గమనిస్తూ ఆ గమనింపులోని ఆనందాలను అందరూ అలాంటి మనసుతోనే చూస్తారని - ఇక్కడ ఈ మాధ్యమంలో పంచుకునే గుణం. వయసు మీదపడే కొద్దీ పడికట్టు పదంలానూ ముతక పదంలానూ తోచే "మంచితనం" అన్న మాటని ఆమె ఇంకా దాని నిజమైన అర్థంలోనే వాడుతూ ఉండటం.
"పట్టకపోయినా పర్వాలేదు, ఎన్నిసార్లైనా మంచితనం తాళం చెవితోనే తాళం తీస్తా" అనే ఈ అమ్మాయి నాకైతే గుండెలో గుబులు పుట్టిస్తుంది. వేరే తాళం చెవి ప్రయత్నించమని నేనూ అనను. కానీ, అది నీ ఇల్లు కాదని పక్కకు వెళ్ళిపోమనైనా చెప్తాను.
అందరూ ఎలా మల్లికలో తమని చూసుకుంటారో నాకూ తెలీదు. కానీ తన పాటలు, రంగులు, బొమ్మల ప్రపంచంలో అపారమైన జీవితేచ్ఛ కనపడుతుంది నాకు. "అందరిదీ ఒకే ప్రయాణం, మనలోని ఒకప్పటి వెర్రి హుషారును వెదుక్కుంటూ" అంటుంది. ఆ హుషారు ఎలా వస్తుందో, ఎలాంటి పనుల్లో దొరుకుతుందో తనకు తెల్సు కనుకే ఇన్ని వ్యాపకాలు. ఆ ప్రపంచంలో తన వేళ్ళను ఇంకా ఇంకా సుస్థిరం చేసుకునే తన ప్రయత్నమే బహుశా అందరూ ఆమె లోకంలోకి కుతూహలంగా తొంగి చూసేలా చేస్తుందేమో.
హైకూ, కవిత్వంలో అత్యంత కష్టమైన ప్రక్రియ. నల్ల మబ్బు పిల్ల, మల్లిక హైకూ ప్రయత్నంలో, ఆ దిశగా వేసిన తొలి అడుగు. ఆమెకు ఒక క్షణంలో లీనమవగల శక్తి ఉంది. అది అక్షరాల్లోకి అంతే బలంగా మున్ముందు తప్పకుండా తర్జమా అవుతుందన్న నమ్మకం నాకుంది.
మల్లికా...మొదటి పుస్తకానికి మనసారా అభినందనలు! నీ రంగురంగుల ప్రయాణాన్ని నేను ఇక నుండి ఇంకా శ్రద్ధగా చూస్తుంటాను.

నేనెప్పుడు పుట్టాను? - తగుళ్ళ గోపాల్

 మొన్నెప్పుడో అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, పుస్తకాలు సర్దుతోంటే పాలపిట్ట పాత సంచిక కనపడింది. తగుళ్ళ గోపాల్ పేరుండేసరికి చేత్తో పుస్తకంతో కూర్చుండిపోయాను. చదవగానే కళ్ళల్లో ఊరిన చెమ్మ, ఈ కవితను గుర్తుండిపోయేలా చేసింది. ఇంత చిన్న కవితలో ఎంత జీవితం పరిచాడో గమనింపులోకి వస్తే ఆశ్చర్యంగా అనిపించింది. జాషువా అన్నట్టు, "దాటిపోయిన యుగముల నాటి చరిత మరల పుట్టించగల సమర్థుడు" కవియే కదా అనీ అనిపించింది. ఈ కవితలోని బలం, బహుశా ఆ కాలాలను దాటి వచ్చిన నిబ్బరంలో నుండి, ఈ కాలానికి జీవితం మెరుగైన తృప్తిలో నుండి మాట్లాడడంలో ఉండి ఉండవచ్చు. పుట్టినరోజులు అందరికీ నమోదయ్యే ఉంటాయి కానీ, నిజంగా పుట్టిన క్షణాలు అనుభవంలోకి వచ్చే వాళ్ళు అరుదు. వాళ్ళు అదృష్టవంతులు. గోపాల్ ఇక్కడ కూడా ఒక అడుగు ముందే ఉన్నాడు - అతడు తన గురువు మాట ప్రమాణమనుకునే శిష్యుడు! ఆయన మాట ఇచ్చిన ఊతంతో చెప్తున్నాడు "అక్షరాన్ని ఆవు దూడలా నా వాకిట్లో కట్టేసుకున్నప్పుడు" నిజంగా పుట్టానని. వాకిట్లో కట్టేసుకునే మరే ఇతర పెంపుడు జంతువో ఎందుకు కాదు? ఎందుకంటే, అతను ఆహ్లాదం కోసం మాత్రమే మచ్చిక చేసుకోలేదు. ఆడుకుని ఆ అచ్చుల్ని వదిలేయలేదు. వాటితో తన ఆకళ్ళు తీర్చుకున్నాడు. "జ్ఞానలక్ష్మీ జాగ్రత్పరిణామమిమ్ము దయతో" అని వేడుకుంటాడు కవి కాళహస్తీశ్వర శతకంలో. అట్లాంటి సంపద ఏదో తన సొత్తు చేసుకున్నాడు.

*
ఇంతకూ నేనెప్పుడు పుట్టాను?
---------------------------------------------
పుట్టినరోజు పండుగని
నాపేరుతో రాసిన కేకు ముందు
వొక క్యాండిల్ దీపంగ నిలబెట్టిండ్రు
వొద్దందునా?
పిల్లలప్రేమను చిన్నతనం చేసినట్లైతది
ఇష్టంలేదందునా?
టీచర్ల మనసు నత్తగుల్లలాగ ముడ్చుకుంటది
అయినా
ఎవరురాసి పెట్టిండ్రు మాకు బర్త్ డేలు?
నాయిననడిగితే
పట్వారిమనువడు పుట్టినప్పుడంటాడు
అమ్మనడిగితే
పొద్దంతా నాట్లేయబోయి
పుట్టెడునొప్పులతో కన్నానంటది
స్కైలాబ్ పడ్డప్పుడో,చెరువుకట్ట వేసినపుడో
గుడి కట్టినపుడో,గుడిలోలింగం మాయమైనపుడో
ఇవే గదా మా అన్నలకు
చరిత్ర రాసిపెట్టిన పుట్టినరోజులు
తాతమూత్తాతలైతే
ఎప్పుడు పుట్టిండ్రో
ఎప్పుడు పెద్దల్ల కలిసిండో
ఏ తాటాకును అడిగినా చెప్పదు.
నాయిన,పెదనాయినలు మాత్రం
మాచేత ఫోటోల కింద
మరణం తేది రాయించుకొని పోయిండ్రు
కేకు కట్ చేయబోతుంటే
గడ్డికోస్తూ వేలు తెగిన రోజు గుర్తొచ్చి
వెనకకు మళ్ళి నిలబడ్డాను
లోపల కన్నీటికాలువలు పారుతుంటే.
నీళ్ళునీళ్ళు అయిన అన్నాన్ని
కండ్లుమూసుకొని తిని కన్నీళ్ళు తాగినరోజులు
తింటున్న సల్లబువ్వలో ఈగబడితే
చేతితో తీసేసి తిని కంకర్రాళ్ళు మోసిన రోజులు
వొట్టికారం మధ్యలో నూనెచుక్క కలుపుకోని
ఆకలిపద్యం పూర్తిచేసిన రోజులు
ఈ పుట్టినరోజు వేడుక వెనుక
చిమచిమ మండే ఎన్ని గాయపుగుర్తులో.
ఇంతకూ నేనెప్పుడు పుట్టాను?
రిజిస్టర్ లో పేరెక్కించిన
మా పెద్దబడి పరమేశ్వర్ సార్ ని అడిగిన
అక్షరాన్ని ఆవుదూడలాగ
వాకిట్లో కట్టేసుకున్నప్పుడు
నేను నిజంగా పుట్టానట.

అఫ్సర్ కవిత్వంలో అమూర్త భావనలు

 అఫ్సర్ సాహితీ అవలోకనంలో వక్తగా పాల్గొనమని తెలుగు భాష, సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ "సేవ" సభ్యులు పోయిన వారం నన్ను ఆహ్వానించారు.

అఫ్సర్ సాహిత్యంలోని విభిన్న రచనల గురించి, ప్రత్యేకతల గురించీ నాలుగు రోజుల పాటు సాగిన సభలలో, నాకు కేటాయించిన రచన - "ఇంటి వైపు". ఈ ఇంటి వైపు కవిత్వానికి ముందు, అఫ్సర్ రక్తస్పర్శ, ఇవాళ, వలస, ఊరి చివర అనే మరో నాలుగు కవితా సంపుటులు కూడా ప్రచురించారు. తొలినాళ్ళలోనే, అఫ్సర్ అస్తిత్వవాద కవిగానూ, స్పష్టమైన రాజకీయ దృక్కోణం కలిగిన కవిగానూ కూడా గుర్తించబడటం నాకు తెలుసు. అఫ్సర్ గురించి ఈ రోజు కూడా ఎవరైనా మాట్లాడేటప్పుడు, ఈ కోణాల నుండే ఎక్కువగా పరిశీలించబడటం కూడా నేను గమనిస్తాను. అఫ్సర్ కూడా ఒక రెండేళ్ళ క్రితమే తన ఐదు కవిత్వ సంపుటులను కలిపి బృహత్ సంకలనంగా తెస్తూ, దాని ముందుమాటలో, "కవిత్వాన్ని కేవలం హృదయానికి, ఉద్వేగాలకు సంబంధించిన వ్యాపారం తానెప్పటికీ చూడలేనని చెప్పారు. అయితే, సంఖ్యాపరంగా బహుశా చాలా తక్కువగానే ఉన్నా, అఫ్సర్ పూర్తి వైయక్తిక ఆవరణలో నుండీ చెప్పిన కవితలు కొన్ని, వాటిలోని లోతు వల్ల, వాటిలోని తీవ్రత వల్ల, వాటిలోని సరళత వల్ల నన్ను గొప్పగా ఆకట్టుకున్నాయి. కాబట్టి, ఆ రోజు నేను నా ప్రసంగంలో అఫ్సర్ కవిత్వంలోని ఈ కోణాన్ని గురించి, నావైన కొన్ని గమనింపులు పంచుకున్నాను.
*
ఇంటివైపు నిస్సందేహంగా తన కవిత్వంలో అఫ్సర్ తనకు తానుగా వెతికి పట్టుకున్న కొత్త గొంతుక. స్థూలంగా వస్తుపరంగా చూసినప్పుడు, వలస, ఇంటివైపు ఒకే లాంటివి. దూరాలకు సంబంధించి, అస్తిత్వానికి సంబంధించి, అవే ప్రశ్నలు, అవే వేదనలు, అవే అసహాయతలు. కానీ, వలసలో ఆ అసహాయతలో నుండి పుట్టే కోపమూ, అసమానతల సమాజం పట్ల అసహనమూ, వేదనా కనపడతాయి. సమాజాన్ని ఎంత ధాటీగా ప్రశ్నించాలో, కొలుచుకుని మాట్లాడినట్టు ఉంటాయి అందులో పదాలు. కానీ ఇంటివైపుకి వచ్చేసరికి, వ్యక్తీకరణలో, ఒప్పుకోలులో - సమాజాన్ని ఒక వైపు నుండీ చూడటం దగ్గర నుండి - సమాజంలో తానూ ఒకడినే - అని తెలుసుకునేంత దాకా సాగిన ప్రయాణం ఉంది.
"మిగిలిన అన్ని ప్రయాణాలూ లోకం కోసం
యీ ఒక ప్రయాణమే నాదీ నా లోపలికీ అనిపిస్తుంది"
అని ఇంటి వైపు టైటిల్ కవితలో అంటాడు అఫ్సర్. అది అర్థం చేసుకుంటే, మనకి ఇందులో ఒక కొత్త అఫ్సర్ దొరుకుతాడు. అతడు అస్తిత్వాల నుండి విడివడి అంతర్యానం చేసిన మనిషి. నువ్వూ నేనూ అంటూ మాట్లాడిన మిత్రుడు. అందుకని ఈ పుస్తకం ఒక ఆంతరంగిక సంభాషణ. లోపలి ఆరాటాలను, దిగుళ్ళను, ప్రశ్నలను ఒంచి రాసుకున్న ఆత్మీయలేఖా పరంపర.
**
అఫ్సర్ ఏ కవిత్వ సంపుటిని ముట్టుకున్నా, ఇంకా చదవకుండానే గమనింపులోకి వచ్చేది ఆ పాదాల నిడివి. అందులోని క్లుప్తత. అఫ్సర్ కవిత్వపు బలమూ, ప్రత్యేకతా దాదాపుగా చిన్న చిన్న పాదాల విరుపుల్లోనే ఉంటుంది. తిలక్, అజంతా, బైరాగి ..ఇలా వచన కవిత్వంలో అద్భుతాలు చేసినవాళ్ళంతా నమ్ముకున్న ఆ సుదీర్ఘమైన పాదాల పట్ల, సమాసాల పట్ల అఫ్సర్‌కి మోహం ఉన్నట్టు తోచదు.( ఆ ఉన్న కొన్ని దీర్ఘ కవితల మీదా మరో ప్రత్యేకమైన చర్చ జరిగింది) శ్రీశ్రీ తనను ప్రభావితం చేసిన కవుల్లో ఒకరని ఒక పుస్తకానికి ముందుమాటలో రాస్తారు కానీ, శ్రీశ్రీ కవిత్వం కూడా ఒక అవిచ్ఛిన్నమైన ధారగానే ఉంటుంది. అఫ్సర్ కవిత్వంలో మాత్రం ఒక తుంపు ఉంటుంది. ఉదాహరణకి, తిలక్ ఒక పాట గురించి రాయాలంటే,
"పరువానికి వస్తున్న నా వయసులో చటుక్కున పరిమళపు తూఫానులని రేపి, మహారణ్యాల సౌందర్యాన్ని చూపి, సముద్ర కెరటాల జలంతో మధ్యగా మౌనంగా ఉన్న ద్వీపాల్ని ఊపి, ప్రపంచం యొక్క అవధులను దూరంగా చాచి నన్ను దిగంతాలకు విసిరేసే వేళ..." అని రాసుకుంటాడు. ఆ ఆవేశంలోకి, ఉద్ధృతిలోకి ఎంత వడిగా తీసుకుపోవాలో తెలిసినట్టు, ఈ అసమాపక క్రియలను ఒక దాని మీద ఒకటి వేసి అవి చదవించడంతోనే పాఠకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తాడు.
నాస్టాల్జియా చుట్టుముడితే ఎవరైనా అలాగే అవుతారేమో. పాత పాటలు వింటుంటే, ఉన్నట్టుండి ఇప్పటి ఈ క్షణంలో నుండి తప్పిపోయి, ఎప్పుడో ఏ నిర్జన వీధుల్లోనో, ఇంట్లో రాత్రి వేళల రేడియోలోనో, ఎవరో బాగా ఇష్టమైన వాళ్ళతోనో, హేమంతపు ఉదయాల చలిలోనో ఆ పాటను తొలిసారి విన్న సందర్భంలోకి వెళ్ళిపోతాం. ఆ పాట విన్నప్పటి ఋతువు, అప్పడు చుట్టూ ఉన్న పరిమళాలతో సహా మళ్ళీ మన అనుభవంలోకి వచ్చేలా కొన్ని పాటలలా మనుషుల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఒక ముకేశ్ పాటనో రఫీ పాటనో సైగల్ పాటనో వింటూ గదిలో ఏకాంతంగా ఆ దిగులు వలయాల్లో కొట్టుకుపోయేవాళ్ళూ ఎంతమందో ఉంటారు. బహుశా మీలోనూ ఉండే ఉంటారు.
"కిటికీ తెరల కుచ్చుల్ని పట్టుకుని
జీరాడుతుంది
దిగులుగా నీ పాట" అని తన తొలినాళ్ళ "ఇవాళ"లోనే ఎంతో క్లుప్తతతో భారమైన భావాన్ని అక్షరాల్లోకి ఎక్కించాడు అఫ్సర్.
ఇంటి వైపులో కూడా ఇప్పుడు నేను చెప్పిన భావాలన్నీ ఒదిగి వచ్చేలా, చిత్ర పాట గురించి రాస్తూ,
"యెలా తుడిచేస్తావో దాటిన కాలాల్ని
నన్ను ఎటూ కదలనివ్వని గాయాల్ని..." అంటాడు.
"నువ్వొచ్చి వెళ్ళు
ఒక్కటై ఒక్క పూవై, నేను
ఈ సాయంత్రాన్ని దాటేసేలా.."
అని సుధా రఘునాథన్ గాత్రాన్నీ తల్చుకుంటాడు. ఇలా, ఈ చిన్న పదాలతో, కవితలో ఒక మూడ్ ని స్థిరపరిచే పద్ధతి, నాకెప్పుడూ ఆశ్చర్యంగానే ఉంటుంది.
*
శైలి విషయానికి వస్తే, అఫ్సర్, ఇప్పుడు మనం చర్చించుకుంటున్న ఈ మానసిక అవస్తలకు సంబంధించిన కవితల్లో, అంటే అమూర్తభావనల చుట్టూ నడిచే కవిత్వంలో చాలా సరళమైన పదాలనే ఎంచుకున్నాడు. పోలికల చుట్టూ తిరిగే కవిత్వ ప్రపంచంలో, అతడు సాదా పదాలను నమ్ముకున్నవాడిగా కనపడతాడు. చెప్పకూడదు, చూపించాలి అనేది ఒక కవిత్వ నినాదం. సుందరకాండలో హనుమ సీతమ్మవారిని చూసిన సందర్భంలో మహర్షి ఇరవైకి పైగా పోలికలతో వర్ణిస్తారు సీతమ్మని.
శుక్లపక్షపు మొదటిరోజు నెలవంకలా, పద్మాలు లేని కొలనులా, వేటకుక్కలు ముట్టడించిన లేడిలా...
గుర్తు రాని జ్ఞాపకంలా
నశించిన వివేకంలా
సడలిన నమ్మకంలా
కలతబారిన వివేకంలా
అభూతమైన అపవాదుతో దెబ్బతిన్న కీర్తిలా
అభ్యాసలోపం వల్ల శిధిలమవుతున్న చదువులా
ఇలా ఇన్నేసి పోలికలతో పాఠకుడి మనసులో సీత స్థితి ముద్రించుకుపోయేలా రాస్తారు మహర్షి. మూర్త, అమూర్త ప్రతీకల ద్వారా కవిత్వంలోకి సౌందర్యాన్ని, బలాన్ని ఒంపడం అనాదిగా వస్తున్న పద్ధతి.
ఆధునిక కాలంలో, ఈ పోలికల మీద విమర్శలు లేవా అంటే ఉన్నాయి, నామిని విమర్శలు అని నిన్నే ఒక స్నేహితురాలు నాతో చెప్పిన మాట.. రావిశాస్త్రి రచనల్లో ఏ పాత్రా దానిలా ప్రవర్తించదు అని. అంటే, ఆ గుడిసెలో కిరసనాయిలు దీపం - ఆరు పరీక్షలూ ఫెయిల్ అయిన పదో తరగతి పిల్లాడిలా బిక్కు బిక్కుమంటూ ఉంది- ఇలా.
ఆ మాటలని అలా ఉంచితే, ఉపమ లేకుండా కవిత్వం చెబితే అది ఉత్త వచనమేగా! అని అనిపించే ప్రమాదమూ ఉంది. కానీ, ప్రమాదాలకు ఎదురు వెళ్ళడం మంచి కవుల లక్షణాల్లో ఒకటి, అఫ్సర్ ఎప్పుడూ మాటను సూటిగా, సరళంగా ఉంచే ప్రయత్నమే చేశాడు. మరి బలం ఎక్కడ నుండి వస్తుందీ అంటే, అది కవి అనుభవంలో నుండీ రావాలి. రెండు, కవి గొంతుకలోని నిజాయితీ నుండి రావాలి. ఇవి రెండూ కలిసి అక్షరమై వెలువడినప్పుడు, ఆ కవిత రాణించకుండా ఉండదు.
అప్పుడు పాఠకుడి దృష్టి అది అబ్స్ట్రాక్ట్ ఇమేజరీతో ఉందా, కాంక్రీట్ ఇమేజరీ తో ఉందా, సాదా పదాలుగా ఉందా, సంక్లిష్టంగా ఉందా అనే దాని మీదకి పోదు. కాండిన్స్కీ అనే ఆర్టిస్ట్, పేరు వినే ఉంటారు, ఆయన, " స్పిరిచువల్ ఇన్ ఆర్ట్" అనే తన పుస్తకంలో కళను ఒక ఇన్నర్ నెసెసిటీగా చెప్పుకుంటాడు. రిల్కే కూడా ఆ యువకవికి ఉత్తరాలు రాస్తూ, "నువ్వు రాయకుండా కూడా ఉండగలిగితే, రాయకుండానే ఉండు" అని సలహా ఇస్తాడు. ఎప్పుడైతే రాత ఇలా మన లోపల నిర్భధించుకోలేని ఉద్వేగంతో కాగితం మీదకి వస్తుందో, అప్పుడు రూపం మీద మాస్టరీ అయినా, శైలి మీద మాస్టరీ అయినా కవికి క్షణాల మీద పట్టుబడతాయి. అఫ్సర్ కూడా "కవిత్వం ఎదుట నా భాష" అన్న కవితలో "ఎంతకీ పాలు అందని శిశువు ఆక్రోశమై వినపడుతుంది నా బాష" అని రాస్తాడు. శిశువు ఆక్రోశం ఎవరికి అర్థం కాదు! అందులో మనం చూసేదల్లా ఒక్క ఉద్వేగం. అంతే.
"
నా పసి భాష ఒక ఉద్వేగమై ప్రవహిస్తే
ఈ ఒక్కసారికీ మన్నించు
ఇంకా నాకు రానే రాని
ఈ లోకపు భాష నేర్చుకోవాలి నేను
కానీ నా బాధల్లా ఒక్కటే.
ఆ తరువాతి తయారీ భాషలో నువ్వు వినిపిస్తావా?
పోనీ నాకు నేను వినిపిస్తానా?"
తయారీ భాషలో ఏ కవీ ఎవ్వరికీ వినపడతాడని నేనైతే అనుకోను. కవికి ఈ సంగతి తెలుసు.
**
అఫ్సర్ కవిత్వంలో నాకు బాగా నచ్చే మరొక విషయం - ఈ కవితల్లో, చాలా విస్తృతంగా అఫ్సర్ వాడిన టెక్నిక్ . నాస్టాల్జియా విరహం దిగులు ఈ భావాలు లోపల ఎంత స్పష్టంగా, బలంగా సుళ్ళు తిరిగినా, వాటిని పేపర్ మీద పెట్టడం కష్టం. వాటికి స్పష్టంగా మొదలూ తుదీ అంటూ ఉండవు, ట్రిగ్గర్ లా ఒక మాటో, పాటో, ఒక సంఘటనో కనపడుతున్నా, అది కలుగజేసిన అలజడి తాలూకు వైశాల్యం పట్టుకోవడం అసాధ్యం.
అఫ్సర్ చాలా చిత్రంగా ఈ ఫీట్ సాధిస్తారు. ఇట్లాంటి కవితలను దాదాపుగా అన్నింటినీ ఖండికలుగా రాస్తారు. వాటిలోని స్టాంజాలకు నంబర్లు వేస్తారు. ఈ ట్రిగ్గర్ పాయింట్ - అని దేన్నైతే అంటున్నామో- ఆ మాటో పాటో ఇంకేదైనానో - దానిని కవితకి టైటిల్ చేస్తాడు. కవితను ఇలా నంబర్లతో ముక్కలు చెయ్యడం వల్ల, మన మనసులో ఉండే దాటు ఏదైతే ఉందో, అది పాఠకుడికీ తెలుస్తుంది. పాఠకుడు ఒక లీప్ తీసుకోవాలక్కడ. అంటే, కవి కేవలం ఒక ఆవరణ సృష్టిస్తున్నాడు. అక్కడీకి పాఠకుడిని పిలుస్తున్నాడు, ఒక ఆధారాన్ని ఇచ్చి. అటు గానీ వెళ్ళగలిగామా, అది ఒక ఇంటిమేట్ ట్రిప్. ఎన్నో సంగతులు, ఎన్నో రహస్యాలు, ఎన్నో దిగుళ్ళు..కవిత పూర్తైనా హుక్‌లా వెంట పడి వచ్చే ఒక అనిర్వచనీయమైన భావం.
పాఠకులకు సరే, కవిత్వాన్ని రాసే మనిషిగా కూడా, ఈ టెక్నిక్ మీద నాకు చాలా మోజు. సినిమాల్లో స్క్రీన్‌ప్లే రాసినట్టు, కథల్లో స్టార్ గుర్తు పెట్టి సన్నివేశాలను మార్చినట్టు, కవిత్వంలో కథలను చొప్పించాడు అఫ్సర్. తన తరం వాళ్ళనైనా, తన తరువాతి తరం వాళ్ళనైనా, కొత్త ప్రయోగాలు చేస్తూ, కవిత్వ రచనకు సంబంధించి ఒక కొత్త ఉత్సాహానివ్వడం కన్నా, కవులు కోరుకునేది మరొకటి ఉంటుందనుకోను. తెలీకుండానే ఇన్‌ఫ్లూయెన్స్ చేసే కవి అఫ్సర్ అని మిత్రులు కొంతమంది అనడమూ వింటాను నేను. అలాగే కవితలకు శీర్షికలు పెట్టడం లో కూడా, అఫ్సర్ ది ఒక మిడాస్ టచ్. "నిన్ను దాచిన సాయంకాలపు ఎండ" , "తెంపుకొచ్చిన నీలిమలు కొన్ని", "పగటికి రాత్రి రాసుకున్న లేఖలు కొన్ని" , "ఇది ఆట సమయం", "రెండేసి పూలు చందమామా", "పద్యం వెలిగిన రాత్రి" "వాన చుక్క ధ్యానం" - వీటిలో ప్రతి ఒక్కటీ ఎంత కవితాత్మకం! వీటిని టైటిల్స్‌గా ఇచ్చి కవిత రాయమంటే, అదాటున నాలుగు లైన్లైనా రాయించేసేంత అందమైన పేర్లు.
**
ఇంటివైపు కవిత్వంలోని వస్తువు గురించి ఎంత చెప్పినా తరగదు. కానీ రెండే రెండు కవితలు చెప్పి ముగిస్తాను. అఫ్సర్ ఈ పుస్తకాన్ని సూఫీ కవుల మీద విస్తారంగా కృషి చేసిన తరువాత రాశాడు.
ఇందులో ఫనా అన్న కవిత - ఈ పుస్తకానికి ప్రాణం లాంటిది.
"ఎన్ని దూరాలు కలిపితే
ఒక అస్థిర బైరాగునవుతానో
ఎన్ని తీరాలు గాయాలై సలిపితే
ఒక నిర్లక్ష్య సూఫీనవుతానో!
ఇదీ ఒక ఆటే కదా నీ చుట్టూ
నేను బొంగరమై తిరగడానికి"
ఎన్నో తలుపులు కొట్టుకుంటూ, తెరుచుకుంటూ, మూసుకుంటూ ఎంతో జీవితం సాగిపోయాక కానీ, ఇదీ కాదు, ఇదీ కాదు, ఇదీ కాదు అని కొట్టేసుకుంటూ ముందుకు వెళ్ళే ఆట అలవడ్డాక కానీ, బైరాగి తత్వం వంటబట్టడు. అన్ని తీరాల్లో అన్ని గాయాలూ ఓర్చుకున్నాకే సూఫీ ఎదురుపడతాడు. చివరికి ఇదంతా ఆటే అని తెలిసినప్పుడు, విషాదం కొంత కొంతగా పక్కకు తప్పుకుంటుంది. మనిషిలో ఒక ఒప్పుకోలు మొదలవుతుంది.
"కాస్త లోపలికి వెళదామా" కవితలో,
"ఆరుబయలు నువ్వు దాచేసిన ప్రతిబింబం" అంటాడు. "విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం..." అన్న దక్షిణామూర్తి స్తోత్రం నుండీ, "ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఇన్‌సైడ్ యూ.." అన్న రూమి దాకా, మాటల మూలాలకు వెళితే దొరికేదొక్కటే.
అందుకే ఇంటివైపు కవిత్వం అఫ్సర్ మిగతా కవిత్వం కన్నా చాలా ప్రత్యేకం. ఇక్కడ ఇల్లు ఒక ప్రతీక. నీ లోపలి నీదైన గూడు కి. దానిలోకి నువ్వు తొంగి చూడాల్సిన అవసరాన్ని గుర్తు చెయ్యడమే ఈ కవిత్వం చేసే పని. ఆ బాల్య కాలాల్లోకి,ఆ రేగుపళ్ళ వాసనల్లోకి...తీసుకెళ్ళడమే ఈ కవిత్వం చేసిన పని.
*
"నువొచ్చి వెళ్ళు
ఒక్క పూవై
ఈ సాయంత్రాన్ని దాటేసేందుకు" అని సుధ పాటను గురించి ఈ కవి రాసినట్టే, ఈ ఇంటివైపు కవిత్వాన్ని, ఆ సాయంకాలం అఫ్సర్ అక్షర సాహచర్యంలో గడిపేందుకు తోడు తెచ్చుకున్నాను.
*

వేదనామయ జగత్తులో ప్రార్థన - వాడ్రేవు చినవీరభద్రుడి "కోకిల ప్రవేశించిన కాలం"

ఫాల్గుణ మాసం నడుస్తోంది. ఉదయపు గాలుల్లో చలిపొడ పూర్తిగా తప్పుకుని, వేడి తెలుస్తోంది. మార్నింగ్ స్కూళ్ళూ, పరీక్షల కోసం ముందే వచ్చేసే స్కూల్ బస్సులూ, ఆఫీసుల కోసం ఏడింటికల్లా అపార్ట్‌మెంట్‌ల నుండి చీమలబారుల్లా బయటకొచ్చేస్తున్న కార్లూ, రయ్యిరయ్యిన దూసుకుపోయే డెలివరీ అబ్బాయిల బళ్ళూ, అన్నీ కలిసి నగర జీవితపు రద్దీనంతా ఉదయాల్లోకి ఒంపుతున్నాయి. అట్లాంటి ఒక హడావుడి ఘడియలోనే నా బాల్కనీలోని తీవెలకు గుత్తులు గుత్తులుగా పూవులు పూయడాన్ని గమనించాను. ఆ పూవుల పక్కన సర్దుకు కూర్చుని, ఇనాళ్ళూ కనపడని ఓ బుజ్జి పిట్ట. ఆగీ ఆగీ తాకుతోన్న దాని తీయని పిలుపు.
ఆ ఒక్క కూజితంతో కోకిల/ నా నగర జీవితాన్నంతా ఒక మూలకు తుడిచేసింది
అన్న వాడ్రేవు చినవీరభద్రుడి కవితాపాదాల్లోని బలం అనుభవంలోకి వచ్చిన క్షణాలవి. కాసేపు బయట హారన్ల రొద నుండి తప్పించుకుని, నా క్షణాలను ఆ కోకిల కూత చుట్టూ, విప్పారబోతున్న పూలరెక్కల చుట్టూ తిప్పుకున్నాను. అక్కడ నిలబడ్డ ఆ కాసేపట్లోనే "కోకిల ప్రవేశించిన కాలం" కవితా సంపుటిలోని పంక్తులు ఒకటొకటిగా జ్ఞాపకమొస్తూంటే అనిపించింది, కవిత్వం చేసే మంచిపని, జీవితంలోని కొన్ని అపురూపమైన క్షణాలను గుర్తుపట్టగల సున్నితత్వాన్ని పాఠకుడిలో మేల్కొల్పడమని. దైనందిన జీవితాన్నంతా పక్కకు తుడిచి, కాసేపొక రసజగత్తులో తిప్పి తీసుకురాగలగడమని.
మనం నగరాల్లో జీవిస్తున్నాం కానీ,
ఎవరి పల్లెల్ని వాళ్ళు తడుముకుంటూనే ఉన్నాం
కిక్కిరిసి జీవించవలసి వస్తున్నందుకు
ఖేదించడం లేదన్నట్టు నటిస్తూనే
ఆ బాల్యకాల వైశాల్యాల్నే
పునః పునః స్మరిస్తున్నాం
అన్న చినవీరభద్రుడి చురుకైన గమనింపుని, "కోకిల ప్రవేశించిన కాలం" సంపుటిలో చదివినప్పుడు, ఒక్క కోకిలను అడ్డం పెట్టుకుని, ఈ కవి నగర జీవితాన్ని పక్కకు నెట్టుకోవడం గమనించినప్పుడు, నాకు అర్థమైనదిదే. మనం పాతబడిన కవి సమయాలనుకునేవి- అది కోయిలైనా, పూవులైనా- నిజానికి ఎన్నటికీ పాతబడవు. ఎందుకంటే, వాటికి మనలోని బాల్యకాల స్మృతులను సజీవంగా ఉంచడమెలాగో తెలుసు. మనలోని ఆశని, మనలోని వసంతాన్ని.
*
కోకిలకూ వసంతానికీ, వసంతానికీ కవిత్వానికీ ఏదో అవినాభావ సంబంధముంది.
పువ్వెడు వసంతం కోసం కవిత రాసిన శేషేంద్ర, "వసంత ఋతువు వచ్చిందో లేదో ఆ కోకిల కంఠం ఎలా పేలిపోతోందో చూడు.." అంటారు. తొలిపొద్దు తెమ్మెర త్రోవలో పయనమై పరువెత్తు కోయిల గొంతున చిక్కిన వసంతగీతిని కృష్ణశాస్త్రీ గానం చేశారు.
“పూలపూజలు సల్పిన మోహనుడు వసంతుడాతని రాక నీవింత చాటనేల..” అంటూ ఆ బుల్లిపిట్టను నిగ్గదీసిన రాయప్రోలు, దానిని కన్నె పూబోండ్లకు రాయబారాలు గావించే దూతగా భావన చేస్తారు. కోకిల మీద అపురూపమైన పద్యాలెన్నింటినో రాసిన ఈ 'కోకిలస్వామి' కవిగారి ఇంటి ముందు గున్నమామిడి చెట్టు ఉండేదిట. లలితానామ పారాయణం చేసి వరండాలో కూర్చోగానే కొమ్మ మీద కోకిల కుహూకుహూరావాలు చేసి రచనకు ప్రేరేపించేదట. అందుకే, "మామిడికొమ్మ మీద కల మంత్ర పరాయణుడైన కోకిల స్వామికి మొక్కి" ఈ అభినవ స్వరకల్పనకు ఉద్యమించితిన్...అని రాసుకున్నారాయన. ఆ కోకిల వాల్మీకి అనుకోవడంలోనూ దోషం లేదన్నది వేరే సంగతి.
కానీ, భద్రుడి కోకిల మాత్రం వీళ్ళందరి ఊహల కన్నా భిన్నమైనది. ఎందుకంటే, భద్రుడి కోకిల మాత్రమే, వసంత కాలపు వైభోగంతో పాటు, ఆ సౌందర్యానికి ఆగి నిలబడి కైమోడ్చలేని నగర జీవితపు ఇబ్బందిని కూడా పసిగట్టింది. అందుకే అది తన గానంతో ఈ మనిషిని ఒక్క చరుపు చరిచి ఇంకో దిక్కుకి తిప్పే ప్రయత్నం చేసింది.
వసంతకాలసాయంకాలం
నగరం తన పనిలో తానున్నది,
60 లక్షల మంది మనుషులకు
అరవై లక్షల వ్యాపకాలు
సంధ్యాకాంతి బంగారం కురుస్తున్నా
సేకరించుకునే తీరిక లేదెవ్వరికీ
రావి చెట్లు మరకతాలు చిమ్ముతోన్నా
ఏరుకునే వ్యవధి లేదెవరికీ
అదిగో, అట్లాంటి కాలాల్లోనే ఈ వసంతసూచక కోకిలకంఠం వినవచ్చిందని రాస్తారు. ఆ కంఠం ఒక సూచన. తీరిక లేని వ్యాపకాల్లో తలమునకలుగా ఉన్న నగరజీవికి, జీవన మాధుర్యం వైపు తల తిప్పి చూడమనే హెచ్చరిక. బహుశా అందుకు, ఈ కోకిల పిలుపు అడవులకో పల్లెలకో మాత్రమే సొంతమైంది కాదని చెప్పినందుకు, అందరి కంటే ఎక్కువగా ఈ కోకిల కావలసినది, ఈ కోకిల కంఠాన్ని సొంతం చేసుకోవలసింది నగర జీవేనని గుర్తుపట్టినందుకు, ఈ నగర జీవితపు ఏకాకితనాన్ని ముక్కలు చెయ్యగలిగిన శక్తి కోకిల కూజితానికి ఉందని గుర్తు చేసినందుకు, భద్రుడి కోయిల ప్రత్యేకము, అపురూపమూ కూడా. అందుకే ఆ కవిత్వం,
"లోకమొక కోకిల కోసం ఎంత ఎదురు చూసిందో
కోకిల కూడా లోకం కోసమంతగానూ ఆరాటపడింది" అని నమ్మించగలిగింది. కోకిలలానే, "నువ్వు పాడవలసిన పాట నువ్వే పాడాల"ని ఉత్సాహపరిచింది.
*
"కోకిల ప్రవేశించిన కాలం" కవిత్వాన్ని చేతుల్లోకి తీసుకోగానే, క్షణాల మీద పాఠకుడిని పట్టి నిలబెట్టేది ఆ పదాల్లోని సారళ్యం. ఒక్కో పాదం చదువుతుంటే కళ్ళ ముందు పరుచుకునే నిస్తుల భావసౌందర్యం ముగ్ధుల్ని చేస్తూంటుంది. నిరాడంబరత్వం, సూటిదనం కలగలిసిన ఆ పదచిత్రాలు రేకెత్తించే స్ఫురణలు అలౌకికమైన ఆనందాన్ని హృదయంలోకి ఒంపుతాయి.
ఉదాహరణకు, కోకిల కూజితం గురించే చూడండి, కవి ఎన్ని రకాలుగా చెప్తాడో,
"అది నేను దాటి వచ్చిన ఏ అడవుల్లోంచో
దూసుకొచ్చిన శరంలాగా నన్ను గుచ్చుకుంటున్నది
నా చిన్ననాటి స్నేహితుడెవ్వడో మా ఊరి నుంచి
బిగ్గరగా పిలుస్తున్నట్టు నన్ను కుదిపేస్తున్నది."
వేదనామయ జగత్తులో ప్రార్థనలాగా/వినిపిస్తున్నది దాని పలుకు - అని కవి రాశాడంటే, అది ఎట్లాంటి శాంతినీ, ఓదార్పునీ, బలాన్ని ఇస్తుందో ఊహించగలం కదా.
"ఇంటి ముందు ఆటోలో అతిథి వచ్చిన చప్పుడైనట్టు/
నిద్రాలోకపు కొసన ఎవరి సెల్‌ఫోన్‌లోనో
లతా మంగేస్కర్ రింగ్‌టోన్‌గా వినవస్తున్నట్టుందా పిలుపు"
కోకిల ఇట్లా వదులుకోలేని బంధమై ప్రతి వసంతంలోనూ చుట్టుముట్టింది ఈ కవినేనేమో! ఆ ప్రేమా, ఆ ప్రేమలోని బలమైన ఆకర్షణా, పాఠకుడినీ ఏదో ఒక చోట తాకకుండా పోవు. తెలవారుతూండగానే పలకరించే పక్షి కూతలని తలుచుకుంటూ కవి "ఎక్కడో ఓ పక్షి కిలకిలతో ఆకాశం తలుపు తెరుస్తుంది" అంటారు కొండ మీద అతిథి సంపుటిలో. పక్షుల కిలకిలలతోనే ఈ లోకంలో వెలుగులు నిండుతున్నాయనడం అపురూపమైన మాట. ఈ వాక్యాన్ని గురించి, ఇందులోని సౌందర్యాన్ని గురించి ఆలోచించిన కొద్దీ రసజ్ఞ పాఠకులకు కొత్త అర్థాలు స్ఫురిస్తూనే ఉంటాయి.
ఎక్కడి నుండి వస్తుందో కోకిల
సరసులాంటి నీ తెల్లవారుఝాములో
అల్లరిపిల్లవాడిలా ఒక జ్ఞాపకం విసుర్తుంది
ఇక వలయాలు వలయాలుగా మనసు చిట్లిపోతుంది
ఈ కవి మనసు ఇక్కడితో తృప్తి చెందలేదు. దీని తరువాత వచ్చిన నీటి రంగుల చిత్రం సంపుటిలో రాస్తారిలా :
ఆఫీసులో పని మధ్య, చుట్టూ కాగితాలు, ఎదట
పార్కులో ఒకటే మారాం చేస్తున్న కోకిల
--
చిన్నపిల్లలా కోకిల నా చుట్టూ గీపెడుతూ
పిలవగానే పరుగెత్తుకు రమ్మంటున్నది, చిన్నప్పుడు
ఏ పిల్లవాడూ ఆటల కోసం నన్నిట్లా పిలవలేదు, నవ
యవ్వనవేళ ఏ యువతీ నన్నిట్లా అల్లరి పెట్టలేదు
ఎట్లాంటి ఊహ! కోయిలను బాల్యకాల స్నేహితుడిగా, యవ్వనకాలాల్లో కవ్వించే యువతిగా భావన చేయడమా! అలా రాయడానికి కోయిలను కేవలం ఒక కవితా వస్తువుగా చూడగల మనసు సరిపోతుందా! తరిగిపోయిన కాలాల స్మృతిగీతాన్ని ప్రతి వసంతంలోనూ పునః పునః గానం చేసే కోకిలను తన నుండి వేరు చేసుకుని చూడలేని హృదయమైతేనే తప్ప ఇట్లాంటి కవిత్వాన్ని రాయలేదు. రాయలేదు.
*
కోకిలను నెపంగా ముందుంచుకుని, జీవన సౌందర్యాన్నంతా పరచిన ఆ కవితలను పక్కన పెడితే, ఈ పుస్తకంలో మననం చేసుకోదగిన కవితలు ఇంకా ఎన్నో ఉన్నాయి.
తీపిపూల గాలి, పూర్తిగా పూసిన పూవు లాంటి పొద్దుటి ఎండ కుమ్మరించిన పసుపు రంగు, కానుగ చివుళ్ళ నిగనిగలతో శోభిల్లే నగర వైభవం, పండుటాకుల వేప కొమ్మల మధ్య ధూపం వేసినట్టున్న తొలి వెన్నెల, వేకువ చంద్రుడి పచ్చకర్పూర లోకం... ఇలా కవిత కవితలోనూ రసం చిప్పలజేస్తున్నట్టున్న పదబంధాలను ఎవరికి వారే చదువుకోవాలి. ఆ పదాల్లోని నిర్మలత్వంలో తెప్పరిల్లి లేవాలి. దైనందిన జీవితపు హడావుడిలో నుండి, అందులో నుండి ఆవహించే అలసట నుండి, నిరాసక్తత నుండీ కొన్ని క్షణాల పాటైనా మనిషిని పక్కకు నెట్టగల శక్తి ప్రకృతికి తప్పకుండా ఉంటుంది. కానీ కవి అన్నట్టు,
ఒక కోకిల లోకం కోసం గొంతు సవరించాలంటే/ లోకం కూడా కోకిల కోసం చెవులు రిక్కించాలి
అన్న మాటను జ్ఞాపకముంచుకోవాలి. కాళిదాసూ చెప్పాడు, రత్నం నన్నెవరు ధరిస్తారని అన్వేషించదు, ధరించదలచినవారే రత్నం కోసం అన్వేషిస్తారని. కాబట్టి వెదుక్కోవాలి ఆ పిలుపుల కోసం. ఆ పిలుపులు వినపడే త్రోవలు పరిచిన ఇట్లాంటి పుస్తకాల కోసం. చెవులు రిక్కించాలి. ఎవరికి వారే. ఎందుకంటే, మొదలవుతోందిప్పుడే, కోకిల ప్రవేశించే కాలం.
No photo description available.
All reactions:
Somasekhararao Markonda, Padmaja Suraparaju and 161 others

శివతాండవ సహాయవల్లి- పరిమి శ్రీరామనాథ్

 గొప్ప కవిత్వం అని దేన్నైనా పిలవడానికి నా దగ్గర ఉన్న ఒకే ఒక్క తూనికరాయి లోలో ఎగసే స్పందన. మంచి కవిత్వం చదువుతుండగానే నాకు అనుభవమవుతుంది, నాలో కంపన కలిగిస్తుంది. హృదయంలో నిర్లక్ష్యం చేయ వీల్లేని మోతాదులో ఉత్సాహం తుళ్ళిపడుతుంది. ఒక కొత్త మనిషితో ఇష్టంగా ఏర్పడ్డ పరిచయంలోని ఆహ్లాదమో, ఒక కొత్త పాఠం స్వయంగా నేర్చుకుని అర్థం చేసుకున్న సత్యం లోపల రేకెత్తించే ఉద్వేగమో, నరాల్లో పొంగులా ఉరకలెత్తే అకారణ సంతోషమో- మంచి కవిత్వాన్ని చదువుతున్నప్పుడు అనాయాసంగా అనుభవంలోకి వస్తుంది. తరచి, వివేచించి, తర్కంతో మేధతో ప్రతిపదార్థ తాత్పర్యాలను ఇంకించుకుంటూ విశ్లేషించుకునేలోపే, గొప్ప కవిత్వం నిశ్శబ్దంగా లోలోపల స్థానం స్థిరపరచుకుంటుంది. అయితే, ఒక బలమైన విమర్శ ఆ కవిత్వానికి దొరకడమంటే, క్షణికోద్రేకంలా ఎగసిన ఆ ఆవేశాలకు ఒక ఆమోదముద్ర దొరకడం లాంటిది. అట్లాంటి విమర్శ, పాఠకుడు పొందిన అపురూపమైన అనుభవానికి ఇంకాస్త బలాన్ని, జీవాన్ని, పొడిగింపునీ ఇస్తుంది.

సరస్వతీపుత్ర శ్రీనారాయణాచార్యుల వారి శివతాండవం అట్లాంటి మహాకావ్యమైతే, ఆ కవిత్వ బలిమిని వేయందాల ప్రకటించిన వ్యాఖ్య - మిత్రులు శ్రీ పరిమి శ్రీరామనాథ్ గారి శివతాండవ సహాయవల్లి.

వర్షాకాలంలో ఎత్తైన కొండల మీద నుండి ఉధృతమైన వేగంతో కిందకి దూకే జలపాతాలను మీరు చూసే ఉంటారు. కొండ రాళ్ళ మీద నుండి దూకుతూ మధ్యమధ్యన ఎగసిపడుతూ, ఆ ప్రవాహమలా అలా క్రిందకు మళ్ళిపోతుంది. ఈ వ్యాఖ్య చదవడానికి ముందు పుట్టపర్తి వారి స్వరంలో శివతాండవం విన్నాను. ఏమానందము భూమీ తలమున... అన్న మొదటి వాక్యం అచ్చు ఆ జలపాతపు మొదలే! ఆపైన ఆ పదప్రవాహాన్ని అచ్చెరువున గమనించడమే మిగిలింది. క్షణక్షణానికి కొత్తగా కనపడుతూ (క్షణేక్షణే యన్నవతాముపైతి తదేవరూపం రమణీయతాయాః ) ఈ శివతాండవమొక సౌందర్యస్వరూపమై ఆ కాసేపూ నా కళ్ళముందు కదిలింది.
అలలై బంగరు/కలలై, పగడపుఁ/బులుఁగుల వలెమ/బ్బులు విరిసినయవి/శివతాండవమట!/శివలాస్యంబట!
స్థూలంగా చెప్పాలంటే, భూమీతలమున ఒకానొక శుభదినాన సంధ్యాసమయాన జరిగిన శివతాండవ వర్ణనే ఈ కావ్యం. శివతాండవానికి ముందు ప్రకృతి సన్నద్ధమవడం, శివుడి వర్ణన, శివుడి నాట్యలీలా విశేషం, " విశ్వమంతా విభుని ప్రాణమందిరమైన.." అన్నట్టు, ఆ తాండవానికి ప్రకృతి ప్రతిస్పందనలూ, ఇక మునులూ, దేవతలూ, దిక్పాలకులూ ఆ శివ తాండవాన్ని చూసి రంజిల్లిన మనసుతో మహదానందంతో తూగిపోవడం, అటుపైన హరిహరాభేదదర్శనం దాకా ఒక ఎత్తు. అటుపైన శివాలాస్యం.
ఇక ఈ వ్యాఖ్య, మొదటే చెప్పినట్టు, ఈ కావ్యం చదువుతూండగా మనలో విరిసిన రసానందాన్ని పదిలపరుచుకునేందుకు, తేనెవాకలా సాగిన ఈ కావ్య మాధుర్య రహస్యాన్ని తనివారగ్రోలుటకు అయాచితంగా దక్కిన ఒక ఉపకరణం.
వృత్త నృత్త నృత్య నాట్యాల దగ్గర మొదలుకుని, కావ్య ఔచిత్య శిల్పాన్ని విప్పి చెప్పడం దాకా, పడ్డ ప్రతి పదపు అర్థం చెప్పడం మొదలు ప్రత్యేకించి ఆ పదమే వాడడంలోని విశేషాన్ని విపులీకరించడం దాకా, ఛందస్సుని చర్చలోకి తీసుకురావడం మొదలు, అనుమానమున్న చోట గురువు లఘువుల లెక్క సరి చూడడం దాకా, తెలిసిన పదాలను మననం చేయించడం నుండి, స్మృతిపథం నుండి దొర్లిపోయిన పదాలని కళ్ళ ముందు తెచ్చి, మరిచిపోయిన తెలుగు సౌందర్యాన్ని, తెలుగు పద్యపు సొగసుని, గాంభీర్యాన్ని, తెలుగు కవుల శక్తిని పుటల నిండా పరవడం దాకా, ఈ వ్యాఖ్య ఎన్ని బాధ్యతలు నెరవేర్చిందో లెక్కతేల్చలేం.
తలపైని జదలేటి యలలు దాండవమాడ
నలలత్రోపుడుల గ్రొన్నెల పూవు గదలాడ
మొనసి ఫాలముపైన ముంగురులు చెఱలాడఁ
కనుబొమ్మలో మధుర గమనములు నడయాడఁ
కనుపాపలో గౌరి కసినవ్వు బింబింప..
నిజానికి ఈ కావ్యంలోని ఏ పద్యం తీసుకున్నా కవి ఊహాచతుర్యానికి కైమోడ్చాల్సిందే. పై పాదాలు తాండవమూర్తి వర్ణనలోకి తీసుకెళ్ళే పంక్తులు. ఒక్కో పదంలో ఎనలేని అందం! చదలేరు అంటే ఆకాశగంగ. క్రొన్నెలపూవు బాలచంద్రుని పేరు.
శిరసుపైన గంగాదేవి అలలు తాండవిస్తుంటే, ఆ అలల తోపుడుకి అక్కడే శిరసుపైన ఉన్న బాలచంద్రుడు కదిలిపోవడమ్మనది ఎంత రమ్యమైన ఊహ!
కనుపాపలో గౌరి కసినవ్వు బింబింప - అన్న చోట మీకు కసినవ్వు పసి నవ్వుగా వినిపించకపోతే, చదువుతూండగానే మీకా అర్థం స్ఫురించకపోతే, మీరీ పుస్తకం కొని చదవాల్సిందే. భాషాపరంగా మనకి కొంత అన్ లర్నింగ్ కావాలని ఆ పాదాన్ని రెండోసారి చదువుతూ మరీ మరీ అనుకున్నాను.
ముడుచుకున్న తామరపువ్వు ఒక్కో రేకునీ విప్పి ఆ సౌందర్యాన్ని మన చేత పెట్టడం, ఈ వ్యాఖ్యానం. కేవలం కావ్యపు రేకురేకునీ వ్యాఖ్యానించడానికే పరిమితం కాలేదీ వ్యాఖ్యాత. మధ్య మధ్యలో సందర్భోచితంగా ఉదహరించిన పాదాలూ (ఉదాహరణకు ఆనందకుమారస్వామి పంక్తులు) పాఠకులకు ఎన్నో విశేషాలు చెబుతాయి, తాత్విక చింతనలో మునిగేలా చేస్తాయి. అలా చూసినప్పుడు, ఈ పుస్తకం ఒక పూటలో పూర్తి చేయగలిగేది కాదు.
కానీ, ఈ పుస్తకం అనూహ్యంగా నన్నలరించింది మాత్రం, ఈ శివతాండవం ముగిసే ఘట్టంలో. హరిహరాభేదం చూపిన ఘట్టంలో. అద్వైత భావాన్ని ముమ్మారు పలికి పాఠకుల్లో ప్రతిధ్వనింపజేసిన ఘట్టంలో.
పోతన హరిహరాభేదాన్ని ఊహిస్తూ భాగవతంలో "తనవున నంటిన ధరణీ పరాగంబు పూసిన నెఱి భూతి పూతగాగ/ ముందట వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడికాని తునుక గాగ" అని అంటే, ఈ కవి ఏకంగా నలుపు కుత్తుక వాణ్ణి నీల మోహనుణ్ణి గావించి, అక్కడితో ఆగక, హరియె హరుడై, లచ్చి అగజాతై సరికి సరి తాండవములాడారన్నాడు. అప్పుడేమైంది! భేదభావాలన్నీ ప్రిదిలిపోయిన స్థితి సాకారమైంది. సమస్త భూమండలంలో అద్వైతమే ప్రతిధ్వనులీనింది.
"శోకమ్ము సంతోషమేకమ్ము, నరకంబు నాకంబు నేక, మ్మనంత ఆకాశమ్ము" - 'శోకమూ సంతోషమూ వేర్వేరు కావు. ఏకమే. నరకమూ నాకమూ వేరు కావు. ఏకమే. అనంతమైన ఆకాశం, ఈ పరిగతమైన భూమీ, నవనిథులూ, నీటిగుంటలూ, చెట్లూ విత్తనాలూ, కొత్తపూవులూ, పచ్చిమొగ్గలూ, గాఢాంధకారాలూ, విస్తృతకౌముదులూ; పరమ ఋషులూ, బ్రహ్మజ్ఞానం లేనివాళ్ళూ - ఇలా అందరికీ నేడున్నది ఒకటే. అదే అద్వైతము! అద్వైతము! అద్వైతము!'
మహనీయ వ్యక్తులు ప్రత్యేకంగా ఏ మాటా పాఠంగా చెప్పకపోయినా వారి జీవితమే ఒక ఉపదేశమైనట్టు, ఈ కావ్యం కూడా ఇక్కడ ఒక రహస్య సందేశాన్ని అందుకోగల పాఠకుల కోసం దాచి ఉంచింది. నేను వ్యాఖ్యాత మాటలని యథాతథంగా రాస్తాను.
"ఈ కావ్యాన్ని శివతాండవంపై కవి చేసిన స్తుతి అనుకుంటే, ఆ స్తోత్రానికి ఫలమిది. ఈ ఫలశ్రుతి ఏ పాపాలనో ఊరకనే తగలబెట్టేది కాదు. నవనిధులనూ, లౌకికభోగాలనూ అప్పనంగా కట్టబెట్టేది కాదు. కార్యసాధన కోసం చేయాల్సిన మానవప్రయత్నాన్ని మాయం చేయాలని చూడదు.
మానవుల మెదళ్ళలోని కుత్సిత భావాలను పగలదీసి, సంకుచితతత్వాలను భగ్నం చేసి, విశ్వవ్యాప్తమైన ఏకత్వదృక్కులను నేలమీదకు దింపాలన్నది ఈ కవికున్న కోరిక. "
ఎంత ఉదాత్తమైన కోరిక!
కావ్యప్రకాశ వ్యాఖ్యకు ముందుమాట రాస్తూ పుల్లెల వారు కావ్యానికి ఆనందం కలిగించడం ప్రధానమైనా అదొక్కటే ప్రయోజనం కాదనీ సన్మార్గోపదేశం కూడా కావ్యప్రయోజనం కావాలన్నది భారతీయ ఆలంకారికుల అభిప్రాయమనీ అంటారు. మనమున్న కాలానికి "ఉపదేశం" ఒక కాని మాట. ఆదర్శం అంటే అందుకోలేనిదేదో. అద్వైత భావాన్ని కళ ద్వారా లిప్తకాలానికైనా అనుభవంలోకి తెచ్చి హృదయక్షాళనకు ఉపకరించడం కన్నా ప్రయోజనమింకేముంటుంది. ఈ భావాన్నిలా ఎత్తి చూపించిన శ్రద్ధకు ఈ సహాయవల్లి శతవిధాల అపురూపం.
మనలో చాలామందికి తెలుగు భాష ఇష్టం. కవిత్వం ఇష్టం. రమ్యమైన పదాలూ, భావాలూ, కూర్పులూ ఇష్టం. కానీ ఒక్క బరువైన పదం కనపడ్డా దాని సౌందర్యాన్ని వెదికి సాధించుకోలేక వదిలేసుకుంటాం . పూర్తిగా అర్థం కాని ఊహ, ఎన్ని సంభ్రమరాసులను దోసిట పెట్టగలదో ఊహకందుతోన్నా అక్కున చేర్చుకోలేక పారేసుకుంటాం. ఆ శ్రమ, సమయం వెచ్చించాలనే కోరిక కొందరికుండదు. కోరిక ఉన్నా వెసులుబాటు ఉండదు కొందరికి. ఈ రెండూ ఉన్నా మార్గం తెలీక, ఉన్నతమైనదని ఎంత విస్పష్టంగా అర్థమవుతోన్నా గొప్ప సాహిత్యాన్ని అటకెక్కించేసే వారు ఇంకొందరు. అందుకే, మనికిప్పుడు మంచి కవిత్వంతో పాటు మంచి వ్యాఖ్యానాలు కావాలి. ఆ కవిత్వపు లోతులు, సౌందర్యాలు, అర్థాలు, సందర్భాలు చెప్పే విమర్శకులు కావాలి. అభిరుచిని, పరిధిని పెంచుకోవడానికి, సాహిత్య లోకపు రహస్య ద్వారాల తాళాలు చేజిక్కించుకోవడానికి, పొరబాటున నేర్చుకున్న అనవసరపు పాఠాలు కొన్ని మరిచిపోవడానికి ఇది ఒక అవసరం. తెలుగు భాష ఉనికిని కోల్పోతుందని ఉద్యమాలు చెయ్యక్కర్లేదు, తళుకులీనే తెలుగు భాషా సౌందర్యం ఎవ్వరి కంటా ఎందుకు పడట్లేదని విచారించక్కర్లేదు. ఇట్లాంటి కావ్యాలు, ఇలాంటి వ్యాఖ్యలు కొందరికి అందుబాటులో ఉంచగలిగితే చాలు. అది చేసే మేలు ఊహాతీతమనడానికి, ఈ పుస్తకం సాక్షిగా నేనెంతమాత్రమూ వెనుకాడను.
*
ప్రతులకు, మిత్రులు పరిమి శ్రీరామనాథ్(Parimi Sreeramanath) గారికి మెసేజ్ చేయగలరు లేదా.
నవోదయ బుక్స్‌లో ఈ లింక్ ఉపయోగించి ఆర్డర్ చేయగలరు.
May be an image of text that says "శివతాండవ శివతాండవసహాయవల్లి అనేక భాషలు జీర్జించుకొన్నవాడు అనేక సాహిత్యములు ఆకళించుకొన్నవాడు భారతదేశమంతయు తిరిగినవాడు సన్మానములందినవాడు సంగీత సాహిత్యములలో దిట్ట అతులిత శేముషీ విభావితుడైన వక్త సాహితీ మహామేరుపు నూటికి పైగా గ్రంథములు వ్ాసినవాడు వ్ాసిన పంక్షి అంతయును వెలగలవాడు సాహిత్యములో అన్ని పోకడలు పోయినవాడు గతమును మరువనివాడు భావి నాహ్వానించినవాడు భావుక చక్రవర్తి బహుభాషలకాదాన ప్రదానము లొసగినవాడు శివానంద సరస్వతితో "సరస్వతీపుత్ర" బిరుదునందినవాడు "మహాకవి" అని జనులచే గౌరవింపబడినవాడు "పద్మశ్రీ" పుట్టపర్తి నారాయణాచార్యులవారు. సరస్పత పుత్ర పుట్టపర్తి ప్రణీత శివతాండవ కావ్యవ్యాఖ్యు వ్యాఖ్యాత పరిమి శ్రీరామనాథ్"

Like
Comment
Share

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...