పిన్ని

"మేనమామల ముద్దు మేలైన ముద్దు.." అని లోకంలో ఓ మాటుంది కానీ, నన్నడిగితే పిన్ని ముద్దును మించిన ముద్దు ఈ లోకంలోనే లేదు. కావాలంటే మా అక్క పిల్లలను సాక్ష్యానికి పిలుస్తా. :)

పిన్ని రోల్ పలకడానికీ, వినడానికీ, చూడటానికీ చాలా తేలిగ్గా కనపడుతుంది కానీ, నిజానికి కాదు. అసలు అన్నాళ్ళూ చిన్నవాళ్ళుగా కొద్దో గొప్పో మనకంటూ ఉన్న పేరుని ఎత్తుకుపోవడానికి ఒకరొస్తారా, (నాకైతే ఒకేసారి ఇద్దరు.) కళ్ళ ముందే జరిపోతున్న అన్యాయానికి నోరెత్తడానికి ఉండదు. ఉన్నట్టుండి ఇంట్లో పార్టీలు, ప్రయారిటీలు మారిపోతుంటాయ్. చెప్పకేం, "నేనో అరగంట పడుకుంటానే...వీళ్ళు లేస్తే నన్ను లేపవా" అని నిద్దరోతున్న నెలల పిల్లల పక్కన మనని కాపలాగా పడేసి అక్క వెళ్ళిపోతుందా, "నిదురలో పాపాయి బోసినవ్వు" చూసినప్పుడో, "ఊయలలూగి నిదురించే శిశువు పెదవిపైని పాలతడి"ని చూసినప్పుడో, ప్రేమలో పడకుండా ఎలా ఉంటాం? 

Thankless job అండీ ఇది. దాదాపు అమ్మమ్మల పక్కన తలెత్తుకు నిలబడాల్సిన రోల్. అక్కల దాష్టీకం వల్లే దక్కాల్సినంత పేరు దక్కలేదనిపిస్తుంది. కనపడ్డానికి బుడతల్లా అంతే ఉంటారు కానీ వాళ్ళ గుండెల్లో చోటు సంపాదించడానికి ఎన్ని అవమానాలు పడ్డామో ఎవరు పట్టించుకున్నారు?

మా అక్కకి కొన్ని పిచ్చి లెక్కలుండేవి. పిల్లలకి స్నానాలు చేయిస్తేనూ, అన్నాలు పెడితేనూ, కథలు చెప్పి నిద్రపుచ్చితేనూ, సుసు లాంటి పనులకి నవ్వు మొహంతో వెంట వెళితేనూ బాండింగ్ బాగుంటుందని దాని అనుకోలు. 'పాతిక రూపాయల్లో ఇంతకు మించిన మహత్తరమైన దారుంది తెలుసా?" అంటే దానికి కోపం వచ్చేది.

ఓసారెప్పుడో పాపం ఎప్పుడూ ఇద్దరి పనితో సతమతమైపోతూ కనపడుతోందని, "ఈ పూట స్నానాలు నే చేయిస్తాలేవే" అని అభయహస్తం చూపించాను. ఎవరికి ఏ సబ్బో ఏ టబ్బో ఏ టవలో చూపించి మాయమైపోయింది. పది నిముషాల తరువాత ఇల్లంతా అతలాకుతలమైపోతోంది. చేసిన పాపం తెలియని అమాయకపు ముద్దాయిలా గది మధ్యలో మోకాళ్ళ మీదకు జరుపుకున్న చుడీ పాంటుతో, ముఖమంతా నీళ్ళతో నిలబడి ఉన్నాన్నేను. బట్టల్లేకుండా పిల్లలిద్దరూ అరుపులు. పరుగుపరుగున వచ్చింది మా అక్క.

"ఏం చేశావ్?"

"వాళ్ళనడగవే?"

"పసివాళ్ళు వాళ్ళేం చెప్పగలరు?" 

"అమ్మా, పిన్ని హర్ష టవల్ నాకిచ్చింది, సబ్బు వద్దంటున్నా నాకు పూసేసింది. గదిలో ఎ.సి ఆపు చలి అంటే వినట్లేదమ్మా" టపాటపా నేరాలు చెప్పేశారు.

అదప్పటికే ఫేన్‌లూ యె.సి లూ ఆపేసుకుంటోంది. 

"అంత ఇర్రెస్పాన్సిబిల్‌గా ఎలా ఉంటావే? పిల్లలకు చలేస్తుందని తెలీదూ?"

"రిమోట్ కోసం వెదుకుతున్నా.."

"షటప్"

**
ఒకరోజు ఎనిమిదింటివేళ ఎవరో మెడికల్ రిపోర్ట్స్ చూడమని తెచ్చారు. పిల్లలని నిద్రపుచ్చడానికి వెళ్ళిన అక్కని బయటికి పిలిచి, నేను చూసుకుంటాలే పిల్లలని, నువ్వెళ్ళుపో అన్నాను.

ఆ మాట వింటూనే వంటంతా అయిపోయినా వంటింట్లోకి చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయింది అమ్మ. కొంచం అనుమానం వచ్చింది నాకు. నాన్నగారి వైపు చూస్తే, సరిగానే ఉన్న న్యూస్‌పేపర్లు బొత్తంలా బయటకు లాగి నీట్‌గా వరుసలో పెట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరినీ మార్చిమార్చి చూశాను.

" ఒకటికి రెండు కథలైనా చెప్పు. బావ వచ్చేసరికి పిల్లలు పడుకోవాలి. తెలిసిందా?" హుకుం జారీ చేసి డాక్టర్ గారు వెళ్ళిపోయారు.

నాలోని రైటర్ సగర్వంగా పాక్కుంటూ పాక్కుంటూ వాళ్ళ దుప్పట్లోకి దూరింది. 

"చెప్పండి, ఏ కథ కావాలి మీకు?" 

ఇద్దరూ సంబంధం లేకుండా ఎవరికి నచ్చిన పదాలు వాళ్ళు కీ-వర్డ్స్ లా విసిరేస్తున్నారు. ఆ కాంబినేషన్ అందుకోవడం నా లాంటి బచ్చా రైటర్ తరం కాదు. 

నేనే పంచతంత్రం కథలందుకున్నా. నేను మొదటిలైన్ చెప్పేసరికే వాళ్ళు గోలగోలగా కథంతా చెప్పేస్తున్నారు.  ఇలా కాదని భాగవతం కథలందుకున్నా.  అక్కడా అదే తంతు. గజేంద్రుడుని ఎలిఫెంట్ కింగ్ అనీ, క్రోకోడైల్ క్రూయల్ అనీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీషు పదాలతో ఈ కథా ఆ కథా ఒక్కటేనా అనే అనుమానం వచ్చేలా చెప్పేశారు.   

రాజుల కథలు, సిండ్రిల్లా కథలు..ఊహూ.. ఐదేళ్ళకి వాళ్ళకిన్ని కథలు అసలు ఏ టెంప్లెట్ లో చెప్పుకుపోతోందో నాకర్థం కాలేదు. అయినా వెనుదిరిగి చూడటం నా చరిత్రలోనే లేదు. 

పేర్లు మార్చేసి, కొద్దిగా-అతికొద్దిగా కారక్టెర్లు మార్చి, ఓ కొత్త కథ చెప్పడం మొదలెట్టా. కాసేపు బానే విన్నారు. బెసికినప్పుడల్లా గాల్లోంచి ఓ కొత్త పాత్రని కథలో కలిపేస్తున్నా. గాడిలో పడ్డట్టే ఉన్నారనుకునేంతలో, తలుపు భళ్ళున తెరుచుకుంది. 

తలుపుకడ్డంగా అక్క. ఇద్దరూ దుప్పట్లనెగరేసి నన్ను తొక్కుకుంటూ దాని దగ్గరకుపోయారు.

"అమ్మా, పిన్ని అన్ని పిచ్చి కథలే చెబుతోంది. ఒక్కటి కూడా కొత్త కథ చెప్పలేదు.." ఇద్దరు కుంకలూ నా మీద నేరాలచిట్టా విప్పారు.

"ఏం కథ చెప్పావే? ఒక్కపూట పిల్లలని పడుకోబెట్టలేకపోయావా, వేస్ట్‌ఫెలో"

"అది మొన్న నాన్న చెప్పిన కథమ్మా.."

పడుకోబెట్టబోయిందల్లా చిటుక్కున నా వైపు తిరిగింది.

బావా ఈ కథే చెప్పాడా? ఎలా ? హౌ?!

"అక్కా..నేన్ చెప్పింది.."

"ఏం సినిమా!!" గుడ్లురిమి చూసింది.

"జగదేకవీరుడు-అతిలోక.." - పూర్తవుతుండగానే గదిలో నుండి బయటకు గెంటింది.

తల కింద చేతులు పెట్టుకుని పక్క గదిలో హాయిగా పడుకుని ఉన్నారు అమ్మా నాన్నగారూ.

***

కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందిలే కానీ, ఒకటా రెండా ఎన్నని చెప్పుకుంటాం! అసలు రహస్యమేంటంటే..
పదేళ్ళ అవిరామ శ్రమ తరువాత నాకూ ఈ బంగారు పంట చేతికొచ్చింది. :) నా పిల్లాణ్ణి ఒక్క మాటా అనకుండా ఆడించడం, వాడి అల్లరిని, వాడి స్నేహితులతో సహా నిలబడి కాచుకోవడం, 'అమ్మకు చెప్పకుండా కొనుక్కు రా పిన్నీ' అని చెవిలో మంతనాలాడటం, "పిన్ని నేను నాలుగున్నరకల్లా వస్తాను, నాకు కట్లెట్ చెయ్" అని హర్షా గాడు ఆర్డరేసి పోవడాలూ -  రెండింటి నుండీ నిద్రమానుకుని, వాళ్ళొచ్చేసరికి వేడివేడిగా వండి ప్లేట్‌లో ఇచ్చి..'బాగుందారా, గాడిదా?'  అని పక్కన కూర్చుని ఎంత అడిగినా 'ఊ' ఐనా కొట్టకుండా పెదాలు కదుపుతూ తింటూ పోతారే - అయినా మొట్టబుద్ధి కాని ప్రేమ లోకంలో పిన్నిది ఒక్కటే. :)

పిన్ని ప్రేమ అడిగితే వచ్చేది కాదు. చేయగాచేయగా వచ్చేది. :)) మంచిపిన్నులందరికీ వందనాలు. మనం లేకపోతే అక్కలేమైపోదురో!!
x

ప్రయాణానికి ముందూ వెనుక..

అటు నుండి ఇటైనా, ఇటునుండి అటైనా, ప్రయాణమంటే మనసెప్పుడూ ఒక ద్వైదీభావంతో ఊగిసలాడుతూనే ఉంటుంది. వెళ్తున్న ప్రాంతం పట్ల, అక్కడి మనుష్యుల పట్ల లేదా అక్కడి విశేషాల పట్ల ఎంత మోజుతో సంబరపడిపోతున్నా, అక్కడి అవసరాలకు తగ్గట్టు పెట్టెలు సర్దుకోవడం పట్ల అంతే విసుగుతోనూ, విరక్తితోనూ ఓ పిసరు బద్ధకంతోనూ వెనక్కు గుంజుతూ ఉంటుంది. పిల్లలు పుట్టాక, ప్రయాణాలకి అర్థమే మారిపోయింది. 'చలో ఓ నాలుగు రోజులు కిచెన్ బంద్" అనుకోవడానికి లేకుండా, పిల్లాడక్కడ తినడానికి ఏమైనా ఉంటాయో లేదో అనుకుంటూ, ప్రయాణానికి నాలుగు రోజుల ముందు నుండే ఓ పెట్టె తెరిచి పడేసి, అందులో గుర్తొచ్చినవి గుర్తొచ్చినట్టు పడెయ్యడం రివాజైపోయింది. ఆరేడు గంటల లోపు ప్రయాణాలకీ కారులోనే తిరగడం వీలనుకుంటున్నాం కనుక, పిల్లాడి మెత్తటి దుప్పట్లు, బుజ్జి దిండ్లు, వాడు ఇంట్లో తినే చిరుతిళ్ళు నాలుగు రోజుల ముందు నుండీ మళ్ళీ వండుకోవడాలూ, బిస్కట్లూ, పళ్ళూ, నీళ్ళూ, బుజ్జి ఎలక్ట్రిక్ కుకరూ - పెసరపప్పూ, బియ్యం, నెయ్యి; అమ్మో పిల్లలతో ప్రయాణం అనుకుంటూ ఒకటికి ఒకటికి బట్టల జతలు కలుపుకుంటూ పోతే చివరికి బండెడు బట్టలవుతున్నాయి. ఏది చూసినా చంటివాడికి అవసరమైతేనో అనిపిస్తుంది. వాడి దుప్పటి వాసన దొరక్క, వాడు నిద్దరొచ్చాక మంకుపడితేనో అని జాలి కమ్ముకుంటుంది. నిదురలో కదిలి వాడికిష్టమైన బొమ్మ కోసం తడుముకుని బావురుమంటేనో అన్న భయమొకటి, వాడికిష్టమైన నాలుగు బొమ్మలనీ ప్రయాణానికి లేవగొట్టేలా చేస్తుంది.  'కారేగా, మన కారేగా..' అన్న మంత్రం ఉండనే ఉంది. పెట్టెలు మోసేందుకు అనిల్ ముందుకొచ్చి " ఎక్కడికెళ్తున్నాం మనం, ఈ సామానేంటి, ఏం పెట్టావ్, ఇంత బరువేంటసలు?" అని నొసలు చిట్లిస్తే భుజాలు రుద్ది ముందుకు తోసెయ్యడమే!

వెళ్ళేప్పుడు ఒక తంతైతే వచ్చేప్పుడు ఇంకో బెంగ. మన ఇంటికో, అత్తారింటికో, స్నేహితుల దగ్గరికో, ఇష్టమైన ప్రాంతాలన్నీ చూసొచ్చాకో, పెట్టెలు విప్పుతుంటేనే మనసంతా దిగులు దిగులుగా అయిపోతుంది. బట్టలని కమ్ముకుని ఉండే అక్కడి సబ్బుల వాసనలు, అమ్మ ఇచ్చిన పొడులూ పచ్చళ్ళ వాసనలూ, పిల్లలకి, మనవలకి నాన్నలూ, మావగార్లూ ప్రత్యేకంగా చేయించి కట్టించిన మిఠాయిలూ, తినుబండారాలూ, తీపి వాసనల్లో కూడా చిరు చేదు కమ్ముకుంటూ ఇక్కడి బుడుగూ బుడుగూ బతుకుల్లోని వెలితినంతా చూపెడతాయి. వాళ్ళు కనుకొచ్చిన ఎల్.ఐ.సి పేపర్లూ, లోన్ స్టేట్మెంట్లూ - 'మెయిల్‌లో ఉన్నాయండీ' అన్నా వినకుండా పాత పద్ధతిలోనే వాళ్ళు చేసే బండెడు పనంతా, మన కోసం. మనకిదే వీలని నమ్మే వాళ్ళ ప్రేమకి సాక్ష్యం. ఎట్లా పారెయ్యబుద్ధవుతుంది, ఆ కాగితాలని? చేతులు రావు, సమయం రావాలి.

ప్లాస్టిక్ కవర్లలో ఆఖరి రోజు కుక్కిన విడిచిన బట్టలన్నీ తీసి వాషింగ్ మెషీన్‌లో వేస్తుంటే, అక్కడి వాసనలన్నీ వదిలించుకుంటున్నట్టే ఉంటుంది. ఇంటిలో మాసిపోయిన దుప్పట్లూ, కర్ట్నెలూ, డోర్‌మేట్లూ, వేటికవి వేరు చేసి ఆపకుండా వాషింగ్ మెషీన్ లోడ్ వేస్తున్నప్పుడూ, తీస్తున్నప్పుడూ మళ్ళీ ఈ ఇంటిలో జీవితానికి మనని మనం సిద్ధం చేసుకుంటునట్టే ఉంటుంది. ఆగకుండా సాగే ఆ రొదలోనే కలిసిన వాళ్ళూ, కలవాలనుకుని కలవని వాళ్ళూ, వాళ్ళ మాటలూ, నవ్వులూ తెరల్లా చెవుల్లో వినపడిపోతుంటాయి.

వంటింటి అరల్లో పాత కాగితాలు తీసే పనిలో పడాలి, జిడ్డుపడ్డ పోపులపెట్టెను సింక్‌లో వేస్తుంటే ఆవాలు జారిపడి కాలి కింద ఎంత అడ్డొచ్చాయో. కానీ ఆవాలు పనికడ్డం అనుకుంటామా? ఫ్రిడ్జ్ వెళ్ళే ముందు ఖాళీ చేసేశామనుకున్నా ఏ పెరుగు గిన్నో, చింతపండు గుజ్జో మిగిలే తీరుతుంది. ఎండిన కారెట్లూ, ఎండి రాలిపడ్డ కరివేపాకు రేకులూ, కాగితాల్లో చుట్టి మర్చిపోయిన పుదీనా, కొత్తిమీరా కలిసిపోయి ఘాటైన వాసనొస్తూ, ఫ్రిడ్జ్. తడి బట్టా, పొడి బట్టా రెండు చేతుల్లోనూ ఉంచుకుని, తెల్లగా అన్ని అరలూ మెరిపించుకుని కొత్త సామాన్లన్నీ ఒక్కొక్కటిగా చేరుస్తుంటేనే హాలిడే అయిపోయిన భారమంతా మీద పడుతున్నట్టుంటుంది.

వచ్చిన రోజు అన్నమ్మొకటీ వండుకుని, అమ్మ ఇచ్చిన పొడులూ, పచ్చళ్ళూ, దారిలో వస్తూ తెచ్చుకున్న పెరుగు కప్పుతో భోజనమయిందనిపించే రోజులు పోయాయ్. వాటితో పాటే పాలూ, కూరలూ, పళ్ళూ కూడా బుట్టలతో దిగి రావాల్సిందే. ప్రయాణమంతా వెర్రి ఆటలాడి ఏమీ తినకుండా తప్పించుకుపోయాడనీ, బుగ్గలు ఈసరికే లోపలికి పోయాయని నాలోని అమ్మ లెక్కలు కడుతూనే ఉంటుంది. వేణ్ణీళ్ళ స్నానాలూ నిద్రలూ కన్నా, పిల్లాడు రెండు పెరుగన్నం ముద్దలైనా తిని నిద్దరోతే బాగుండు అని ఆశగా పనిలో పడటమే జీవితానికి పెద్ద మార్పు. ఏ ఊరుపోనీ, ఎవ్వరింటికైనా వెళ్ళనీ, తిరిగొచ్చి, నాలుగు చెంబుల నీళ్ళు గుమ్మరించుకుని, మడతలు విప్పి హాయి వాసనల దుప్పటినలా పరుపు మీద పరిచి, మన బాత్‌రూం, మన బెడ్‌రూంలో ఉన్న సుఖమింకెక్కడా ఉండదని చెప్పుకోవడానికీ, ఒప్పుకోవడానికీ ఓ తోడుండటమే బతుకుని ఆని ఉన్న అదృష్టం.

ఏవేవో ఆలోచనలతో, మనసులోనూ, చేతుల్లోనూ ఇంతింత బరువుతో తాళాలు తీస్తామా? కాళ్ళు కడిగేలోపే ఇక్కడి స్నేహితులొచ్చి కూడి నాలుగు రకాల వంటలు హాట్‌పేక్‌లలో సర్ది ఇచ్చి 'హాయిగా తిని అలసట తీరేలా నిద్రపొండి, రేపటి నుండి బోలెడు కబుర్లు చెప్పాలి" అని ధనాధన్ తలుపులేసి వెళ్ళిపోతే గాడిలో పడక ఏమవుతాం? అటు నుండి ఇటు ప్రయాణమైనా, ఇటు నుండి అటు ప్రయాణమైనా ప్రయాణాలూ, పెట్టెలే బరువు తప్ప, జీవితం ఎక్కడైనా తేలిగ్గానే ఉంది.

(జీవితాన్ని వెలిగించే నేస్తాలకు, కవితకు, ప్రేమతో..)


అప్పుడూ ఇప్పుడూ

వేదాద్రి కృష్ణా జిల్లాలోని లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం. అనిల్ వాళ్ళ తాతగారి తాతగారికి పుట్టిన పిల్లలు పుట్టినట్టే పోతోంటే, ఎవరో చెప్పగా విని, ఈ క్షేత్రానికి వచ్చి మొక్కుకుంటే, అప్పుడొక్క పిల్లవాడు బతికి బయటపడ్డాడట. అప్పటినుండీ ఇంటిల్లిపాదికీ ఏటా ఇక్కడకు రావడం అలవాటట. ఏ బస్సూ రావడానికి వీల్లేని ఆ కాలాల్లో, వీళ్ళ తాతముత్తాతలు పొయ్యిలతో సహా అన్నీ అక్కడే ఏర్పాటు చేసుకుని, ఇంటి నుండీ తెచ్చుకున్న పప్పుప్పులతో, నలభయ్యేసి రోజులు అక్కడే దీక్షగా ఉండిపోయేవారట.

అనిల్‌కీ నాకూ శ్రావణమాసంలో పెళ్ళైంది. మొదటి ఏడు నోములు పట్టే వీలుంటే మానకూడదని, మాకిచ్చిన మూడు వారాల సెలవుల్లో రెండు వారాలు ఆ నోమూ ఈ నోమూ పట్టించి, శ్రావణ పట్టీ చేతిలో పెట్టి, శ్రావణ శుక్రవారాలు కానిచ్చేశారు. మూడో వారం కాస్త ఊపిరాడే వేళకి, వేదాద్రి వెళ్ళి రమ్మన్నారు. ఇద్దరం బయలుదేరాం. 

అనిల్ అప్పటికొక ఆరు నెలల ముందు నుండే తెలుసు నాకు. హైదరాబాదులో ఆఫీసు పక్కనే స్నేహితులతో తనూ, కూకట్‌పల్లి్‌లో సింగిల్ బి.హెచ్.కె లో, ఒంటరిగా నేనూ ఉండేవాళ్ళం. సాయంకాలాలు గచ్చిబౌలి దాకా వచ్చి తను బైక్ మీద ఇంటికి తీసుకువస్తే, టీ తాగి స్వాగత్‌లోనో చిల్లీస్‌లోనో కూర్చుని, పదకండింటికి వాళ్ళిక బయలుదేరమంటే కదిలేవాళ్ళం. పేపర్ నాప్కిన్స్ నిండా పేర్లూ, తారీఖులూ, అరచేతుల నిండా కలిసిన వేళ్ళ కనపడని గురుతులూ..

ఆ హైదరాబాదు రద్దీ రోడ్లూ, హడావుడీ, అన్నీ చీకట్లోకి జారి, తను నా ఇంటి ముందు మళ్ళీ దించేసరికి మమ్మల్ని చూడటానికి కొబ్బరాకుల వెనుక చందమామొక్కడూ కాచుక్కూర్చునేవాడు.  నేను పైకి వెళ్ళి బాల్కనీలోకి పరుగెడితే, మెయిన్ రోడ్ మీద స్లో అయిన తన బండీ, సొట్ట పడ్డ బుగ్గల్తో సన్నని నవ్వూ వీధి దీపపు పసుపు వెలుతుర్లో అంత దూరాన్నీ కోసుకుంటూ నాకు కనపడేవి. కొన్ని సార్లు మరీ ఆలస్యమైతే కావాలనే బండి ఎక్కడో ఆపేసి నడుచుకుంటూ ఇంటికొచ్చేవాళ్ళం. అలా మెట్ల మీద కూర్చుని, నిద్ర కమ్ముకునే వేళకి కదిలి, మళ్ళీ బాల్కనీలో నేను నిలబడితే ఫోన్‌లో ఒకరినొకరు చూసుకుంటూ మెల్లిగా చెప్పుకోవాల్సినవి చెప్పుకుని..

షాపింగ్‌లూ, పెళ్ళి కార్డ్‌లూ, ఎన్ని పనులున్నా తిరిగిందంతా హైదరాబాదే కనుక, కొత్తేం అనిపించేది కాదు. కానీ, వేదాద్రి నేను ఎప్పుడూ చూడని ఊరు. గుడిని ఆనుకుని పారే కృష్ణానది ఓ వైపు, ఉగ్రనారసింహుడు కొలువైన కొండ ఇంకోవైపు. కొండెక్కుతుంటే వందల వందల కోతులు నా మీదకే దూకుతున్నట్టుంటే, భుజాలు నొక్కి పట్టుకుని మెట్టుమెట్టుకీ వెనక్కు గుంజినట్టే తన వెనుక నడిచిపోయానప్పుడు. నదిలో దిగితే ఒడ్డునే వేలవేల చేపలు పాదాల మీద గంతులేస్తుంటే, వేళ్ళలో వేళ్ళు బిగించి పట్టు తప్పకుండా జాగ్రత్తపడ్డాను. ఆ చేపలూ, అల్లరీ - శృంగేరికి పోటీగా ఉండే దృశ్యమది. కాళ్ళు తడుపుకుంటూ ఆడినంత సేపు ఆడి, సాయంకాలం దర్శనమయ్యాకా, 'నది దాటదామా?' అన్నాడు. 

పడవ వచ్చింది. నది మీద నారింజ వెలుగులు పడుతున్నాయప్పటికే. నది మీది గాలి చల్లగా తాకుతోంది. తీరానికావల గుబురు చెట్ల మధ్య నుండీ వెనక్కు ఏదో దారి ఉంది. మమ్మల్ని దింపి మళ్ళీ ఎప్పుడు రావాలో అడిగి, పడవవాడు పరుగుల మీద ఆ దారిలోకి నడిచి మాయమైపోయాడు. ఇసుకలో కూర్చున్నాం ఇద్దరం. చిన్న చిన్న అలల్లా నీరు వచ్చి చాచిన పాదాలను తాకుతూ పోతోంది. అప్పుడొకటీ అప్పుడొకటిగా గుడి గంటల శబ్దం. గుంపుగా కొండంచును పట్టి జారే కోతుల కిచకిచలు కొన్నిసార్లు. అంతే. మనుషుల పొడ లేదు. పారిపోతునట్టే క్షణాల్లో మాయమయ్యేవి ఆకాశంలో పక్షులు. నే పాడుకున్న ఇష్టమైన రాగమొక్కటే ఇప్పటికీ నా చెవుల్లో, జ్ఞాపకాల్లో...ఏం మాట్లాడుకున్నామో గుర్తు లేదు కానీ, మొహమాటంగా వెనక్కి పోదామా అని అడగలేక పడవ దగ్గరే నిలబడ్డ మనిషి రూపు గుర్తుందింకా. జీబుగా కమ్ముకుపోతోన్న చీకట్లను చూసి కదిలాం. ఇంకో వైపు కూడా వెళ్ళచ్చనీ, ఇంకా బాగుంటుందనీ, ఈ వేళప్పుడు ప్రమాదం కనుక డబ్బులిప్పిస్తే రేపు తీసుకెళ్తాననీ హుషారుహుషారుగా అతనంటుంటే మొహమొహాలు చూసుకుని నవ్వుకోవడం కూడా గుర్తుంది. అలా అలా హాయిగా ఊగుతూ ఒడ్డుకు చేర్చింది పడవ. దిగి మెట్ల మీద నిలబడి చూస్తే, కృష్ణ మీద మెరుస్తూ తేలుతూ ఊగుతూ నక్షత్రాలు. అన్ని దిక్కుల నుండి అంతకంతకూ పెరుగుతూ కీచురాళ్ళ రొదలు. 

*

ఇన్నాళ్ళకు, నా ప్రహ్లాదుడిని తీసుకుని వెళ్ళడం కుదిరింది. ఊరికి మంచి రోడ్డు వచ్చింది, కార్లూ బస్సులూ గుడి ముందు దాకా వెళ్తున్నాయి. ఏ వేళన ఎవ్వరు వెళ్ళినా ఆశ్రయమిచ్చేందుకు, వండి వడ్డించేందుకు ఇప్పుడొక మంచి బ్రాహ్మణ సత్రమూ ఉంది. అదే నది, అదే గాలి, అదే కొండ, ఆవలి తీరాన అవే చెట్లు, మేం బిగించి పట్టిన ఇసుక. అవే కోతులు, కిచకిచలు, అల్లర్లూ, గుడిగంటల చప్పుళ్ళూ.

నా పక్కన నా వాడు. ఒళ్ళో నా పిల్లాడు. ఆ దేవుడికి మొక్కకుండా ఎలా ఉంటాన్నేను?

*

"నిమగ్న" - మైథిలి అబ్బరాజు

కవులనూ రచయితలనూ మనసు గుర్తుపెట్టుకునే తీరు చాలా చిత్రంగా ఉంటుంది. మననీ వాళ్ళనీ కలిపి బంధించే లతల మొదళ్ళు చాలా సార్లు మనమసలు గమనించుకోము కూడా. మీరు చెప్పండి, మీకిష్టమైన రచయితలను మీరెలా గుర్తుచేసుకుంటారో? నాకైతే, చూరు నుండి వేలాడే వానబొట్లు చూసినప్పుడల్లా ఇస్మాయిల్ గుర్తొస్తారు. పల్లెటూర్లో బస్సు దిగగానే కనపడే సోడాబండిని చూస్తే, శ్రీరమణ గుర్తొస్తారు. ఇసుక తిన్నెలు, ఒడ్డున ఉన్న పడవలు చూస్తే టాగోర్ చప్పున స్ఫురణకొస్తారు. ఆకుపచ్చ రిబ్బన్లు కట్టుకుని ఆకతాయిగా బడి బయట తిరిగే ఆడపిల్లలను చూస్తానా, చలం జ్ఞాపకం మెరుపులా మదిలో మెదులుతుంది; ఆ వరుసలోనే, పూరేకుల మీద వాలే సీతాకోకచిలుకలను చూసినప్పుడు, మైథిలిగారి రచనలు...   
*
సారస్వతవ్యాసాలూ, నోట్స్ కలిపి 230 పేజీల సంకలనంగా మైథిలి అబ్బరాజు గారి "నిమగ్న" ప్రచురింపబడి రెండేళ్ళు కావస్తోంది.  సౌందర్యమూ, సున్నితత్వమూ - ఈ రెండూ మైథిలిగారి రచనలను ఇట్టే పట్టిస్తాయి, సునాయసంగా ఆ రచనల్లోకి మనని తీసుకునిపోతాయి. ఆ పదాల్లోని మృదుత్వమూ, ఆ భావాల్లోని నైర్మల్యమూ ఇట్టే కట్టిపడేస్తాయి కూడా. కానీ, ఆ సౌందర్యస్పృహ అలవాటయ్యాక మెల్లిగా అర్థమవుతూ వచ్చేది మాత్రం సునిశితమైన గమనింపులూ, అవి చెప్పేందుకు ఎంచుకున్న విధానమూ. లెక్కకు బహుతక్కువగా ఉన్న వ్యక్తిగత అనుభవాలను పక్కన పెడితే, వాసికెక్కిన ఎందరో కవుల, రచయితల రచనల గురించి విపులమైన, విలువైన వ్యాసాలు, ఈ పుస్తకంలో ఉన్నాయి. అయితే వీటిలో ఏ ఒక్కటీ, ఆయా రచనల మంచి చెడ్డలను విడగొట్టి వివరించి చర్చించిన విమర్శలు కావు. నచ్చినవన్నీ ఏకరువు పెడుతూ వ్రాసిన సమీక్షా వ్యాసాలూ కావు. ఆయా పుస్తకాలను తానెలా సమీపించారో, ఎలా ఏ కారణాలకు దగ్గరయ్యారో ఎన్నదగిన కారణాలేవో మాత్రం ఆసక్తికరంగా చెబుతూనే వచ్చారు.  నిజానికి, ఇందులో ఉన్నవెక్కువ భాగం సుప్రసిద్ధ రచనలే కనుకా, విమర్శా ధోరణిలో ఆయా రచయితలు/రచనల గురించిన వ్యాసాలు వెలువడి ఉన్నాయి గనుకా, వారి గురించైనా, వారి రచనల గురించైనా ఇప్పుడు కొత్తగా కొత్త పాఠకులకు చెప్పేందుకు మైథిలి ఎంచుకున్న పద్ధతే బాగుంటుందని నాకనిపించింది. 


ఈ పుస్తకంలో వినపడే గొంతు స్థిరమైనది, అంతకు మించి స్థిమితమైనది. పగలు చదివిన పుస్తకాల గురించి రాత్రి నిద్రమానుకుని వ్రాసిన ఆలోచనలు కావీ వ్యాసాలు. ఇందులో ప్రస్తావించబడ్డ రచనల్లో చాలా మటుకు రచయిత ఎన్నోసార్లు చదివినవి, మరికొన్ని చిననాటి నుండి పరిణత క్రమాన్ని పరిశీలించుకుంటూ పునశ్చరణ చేసుకున్నవి. అంటే, వీటి వెనుక రమారమీ ముప్పై నలభయ్యేళ్ళ సాహిత్యానుభవం ఉంది, పునఃపునః పఠనాల ద్వారా రచనలను స్వంతం చేసుకున్న అధికారంతో, కొత్త లోచూపుతో మరో తరానికి ఆ రచనను పరిచయం చెయ్యగల ప్రజ్ఞా ఉంది. ఆ  ప్రజ్ఞా, సుదీర్ఘ సాహిత్యప్రయాణానుభవమూ ఆమె పదాల్లో తొణికిసలాడుతూనే ఉంటాయి. ప్రధానంగా శాంతరసంలో స్థిరపడ్డ ఆలోచనలు, ప్రతిపాదనలు, గంభీరమైనవి, ఒక్కోచోట చర్చకు తావిచ్చేవీ. ఆ స్వరఛాయల నుండి బయటపడి మరొకలా ఆలోచించడానికి మనకు కొంత వ్యవథి పడుతుంది. అది ఇబ్బంది కాదు, పాఠకులుగా మనకు మనం సాధించుకోవాల్సిన మెలకువ.


ఈ పుస్తకంలో ప్రస్తావించబడిన రచనలన్నీ, 90' ల తరువాతి పిల్లలకు బహుశా పూర్తిగా కొత్తవి, అడుగూ చూపూ కూడా వెనక్కి మళ్ళించుకుని చూడవలసినవీ, చదువవలసినవీ. సాహిత్య విలువలపరంగా ప్రాసంగికత చెడని రచనలే ఎంచుకోబడటం నేను ఈ పుస్తకంలో గమనించిన ముఖ్యమైన విషయం. సాహిత్యపఠనంలో మనిషిమనిషికీ భిన్నమైన వైఖరులుంటాయి. సాహిత్యం వెలుగును చూపేదై ఉండాలనీ, చీకట్లోకి నెట్టేది కారాదనీ అనుకున్నవారిగా, మైథిలి గారి రచనలు ఏ పక్షానికి చెందుతాయో తేలిగ్గానే ఊహించగలం. కరుణ ఉన్న రచనలున్నాయి గానీ, జీవితపు చీకటి కోణాలపై పట్టుపట్టి వెలుగు ప్రసరింపజేసిన రచనలేవీ ఈ పుస్తకంలో నాకు తారసపడలేదు. కనుక, తేలిక మాటల్లో చెప్పాలంటే, హృదయాహ్లాదకరమైన రచనలు, మాటలు మాత్రమే మనమిందులో ఆశించగలం. ఈ స్పష్టత పాఠకులకు ఒక వెసులుబాటు. ఇచ్ఛాపురపు జగన్నాథరావు కథలు, బాలాంత్రపు రజనీకాంతారావు గేయాలు, ఆచంట 'నా స్మృతిపథం' వంటి వారి రచనల్లోని నాజూకుదనాన్ని, ఆయారచయితల సౌందర్యాన్వేషణని స్పష్టంగా చూపెట్టడం ఎంతగానో ఆకట్టుకుంది. వీలు కుదిరినచోటా, అవసరమైన చోటా, ఆ కాలపు పోకడల మీదుగా సాగిన వ్యాఖ్యానం అదనపు సొబగు.

నేను ప్రధానంగా కవిత్వాన్ని ప్రేమించే మనిషిని కనుక, కృష్ణశాస్త్రి, రజనీకాంతారావు, మరికొన్ని ఆంగ్లకవితల వ్యాఖ్యానం ఇష్టంగా చదువుకున్నాను. "నవ్వు చూడు తుమ్మెదకి, పువ్వు పువ్వు కోసమయి, ఆ ధూర్తపు కదలిక అంత ఝుమ్మంటూ ఉందెందుకు?" అంటూ మోహలాలసని ఒలికించిన ఆరాధనా గీతాలను కూడా తరచితరచి ఈ కవయిత్రి మాటల్లో చూసుకున్నాను, భద్రపరుచుకున్నాను.  పత్రికల్లో కవితల సంపుటి మీద వ్యాసం వచ్చిందంటే, అన్నింటి గురించీ మాట్లాడాలన్న తాపత్రయంతో, మోయలేని బరువుతో, కవితలోని అందమంతా తాము ఆస్వాదించలేకా, ఒకవేళ ఆస్వాదించినా తిరిగి ఆ మేరకు పాఠకులకు అందివ్వలేకా సతమతమవుతున్నారనిపిస్తుంది మనకాలపు సమీక్షకులు, విమర్శకులు. ఒక కవిత మనని నిజంగా తాకినప్పుడు, దానిలోని అక్షరమక్షరం గురించి తాదాత్మ్యతతో చెప్పుకోనిది, అదేమి స్పందన?  ఫేస్‌బుక్‌లో  ఈ మధ్య మిత్రులు కొందరు నచ్చిన కవితల గురించి తమ తలపోతల నుండి ఎన్నో విషయాలతో పెనవేసి కవితనూ, అది తమను కుదిపిన అనుభూతిని, తద్వారా ఆ కవితల్లోని ప్రత్యేకతలనీ ఎంతో గొప్పగా చెబుతున్నారనిపిస్తుంది. అది, ఆ కవిత గుర్తుండిపోయేలా చేసే పద్ధతి.
*

'నా విశ్వనాథ' అంటూ విమర్శలతో సహా ఆయన్ని స్వంతం చేసుకుని, ఆ మాటను బహిరంగంగానే ప్రకటించారామె.  అయితే విశ్వనాథవారిని ఇంతింత అన్న కొలతలతో బంధించడానికో లేదా అట్లా ఉన్న కొలతల నుండి విముక్తుణ్ణి చెయ్యడానికో కాక, కొన్ని మెరుపుల్లాంటి పద్యాలు వివరించి వదిలేశారీ రచయిత. ఏమిటీ పద్యాల ప్రత్యేకత? ఇవి పదహారణాల తెలుగు పద్యాలు. తెలుగు నుడికారాన్ని పాదాల్లో కుదుర్చుకున్న పద్యాలు. భయమో భక్తో ఆయన రాసినదేమిటో మనసులోకి పూర్తిగా ఎక్కించుకోకుండానే 'ఏదేదో రాసేరులెమ్మని' దూరం పెట్టేసే పాఠకులకి - ఇలాంటివి చదివినప్పుడు కొత్తగా ఆశ్చర్యమూ, కుతూహలమూ కలిపి మొదలవుతాయి. ఆ సాహిత్యం పట్ల ఆసక్తి కలిగేలా చేస్తాయి. నిజానికి ఏ సాహిత్య వ్యాసమైనా చెయ్యాల్సిన మొదటి పని సాహిత్యాన్ని పాఠకలోకానికి దగ్గర చెయ్యడమే కదా! గుణదోషచర్చలూ, విమర్శలూ అవన్నీ అటుపైని మాటలే. ఒక ఇజాన్ని నెత్తిన పెట్టుకోవడమో లేక ఖండించడమో మాత్రమే పనిగా పెట్టుకునే సమకాలీన సాహిత్య వ్యాసాలు ఏం చెయ్యలేకపోతున్నాయో, ఈ వ్యాసాలు నా మీద నెరిపిన ప్రభావం ద్వారా తెలుసుకున్నట్టైంది. Robert Frost గురించి వ్రాసిన సుదీర్ఘమైన వ్యాఖ్యలోనూ ఇట్లా కవినీ పాఠకులనీ ఒక చోట కూర్చి 'చదివిచూడండ'ని చెప్పే ప్రోద్బలమే కనపడింది నాకు. నిజానికి ఈ ఎడమే, ఈ సౌలభ్యమే నాకు గొప్ప తెరిపినిచ్చింది. 

"మజ్జారే! చక్కిలిగిలి బుజ్జాయికి
బొజ్జ మీద ముద్దిడుకొన్నన్
బొజ్జ గలవేమో బుజ్జికి
ముజ్జగముల కిలకిలారు ముద్దుల నవ్వుల్" ,
"పక్క అంతయు జిమ్మితి పద్మనాభ!
అన్న చూడుము, పుస్తకమ్మట్లు పండుకొనును,
నీవేమో పక్కంత కుమ్మి కుమ్మి
పక్క యటులుండ నీవిట్లు పండుకొందు!"

శ్రమపడకుండానే అర్థమయ్యే ఇట్లాంటి పద్యాలూ, వాటికి మైథిలి గారి వ్యాఖ్యానమూ చూశాకే నేనూ కల్పవృక్షం పద్యాలు చదువగలనన్న నమ్మకం కుదిరింది. అన్నీ అర్థమయిపోతాయని కాదు- అర్థం చేసుకోవడానికి ఒక మొదలూ, వెదికేందుకొకింత బలమూ, నాకు "నిమగ్న"లో దొరికాయి.  అలాగే, హృదయాహ్లాదిని కుందమాల, తప్పనిసరిగా చదువవలసిన మరొక వ్యాసం. రాముడి వ్యక్తిత్వాన్ని, సీత పట్ల అతని అనురక్తినీ ఎంత గొప్పగా ఈ వ్యాసంలో పొందుపరిచారో చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. వివాదాల అయోధ్యా రాముడి ప్రస్తావన ఇప్పుడిక్కడ అప్రస్తుతమే కానీ, నేను అంటున్నదల్లా ఒక పాత్రగా రాముడిని ఎట్లాంటి ప్రేమికుడిగా చిత్రించారో గమనించమనే.  
"సుఖము నందు దుఃఖమునందు సువ్యక్తమై చెప్పనక్కరలేనిదై(ఆమె) ఆత్మయందున్నది. దోషమునకుగాని, గుణమునకుగాని సంబంధములేని కారణరహితమైన యొక భావబంధము నాకామె యందున్నది."  - అన్న మాటలు ఏ ప్రయత్నమూ అక్కరలేకుండానే నా మనసులో ముద్రించుకుపోయాయి. 
*
"ఏమీ లేని గగనం లో హరివిల్లొకటి విరిసే వేళ , ఆ క్షణమే నా కల - వేకువకి మేల్కొంటుంది.
వాగు మీంచి వీచే తెమ్మెర - ఆనందాలన్నీ పేనిన వేణుగానమయి నిమిరి వెళుతుంది
వసంతానికి జ్ఞాపకాలూ తియ్య తియ్యగా చివురులు పెడతాయి. నా సుఖ స్వప్నాల కి సూర్యకాంతిలా నువ్వు వెలిగిపోతుంటావు
పురివిప్పిన నెమలికాటు కి రాత్రంతా వలపు అలజడి - కాని, సొగసా - నీ ఆకృతి ఒకటే ఆకర్షణ కవతలి హద్దు"
అన్న మలరే పాట అనువాదం చదివింది మొదలూ,  మైథిలిగారి పేజ్‌ని బుక్‌మార్క్ చేసుకున్నాను. ఫేస్‌బుక్ విధిగా మన స్నేహాలను గుర్తుంచుకుని మనకూ గుర్తుచేసి సంబరాలు చేస్తుంది కానీ, ఇక్కడి పరిచయాలు ఆసక్తులుగానూ, ఆకర్షణలు ఆత్మీయంగానూ మారే ఉద్విగ్నక్షణాలేవో దానికి తెలీవు. అవిట్లా మనకు మనంగా చెప్పుకుంటేనే తప్ప బయటపడని రహస్యాలు.

#mythilipoetry పేరిట గత కొద్ది నెలలుగా ఆంగ్ల కవితలకి అనువాదాలు చేస్తున్నారీ రచయిత, వాటిలో కొన్నైనా ఈ పుస్తకంలో ఉంటాయని ఆశించానేమో, చిన్న ఆశాభంగం! అవన్నీ త్వరలోనే ఒక ప్రత్యేక సంచికగా రావాలి.  నవల, నాటకం, గేయం, కథ, కవిత - ఇలా సాహిత్యరూపాలెన్నింటినో స్పృశిస్తూ లోతైన ఆలోచనలతో ప్రతిపాదనలతో వివరణలతో ప్రవాహసదృశ్యమైన రచనావేగాన్ని చూపెడుతూ సాగిన ఈ పుస్తకంలోని కాగితాలు నా కళ్ళ ముందు రెపరెపలాడినప్పుడల్లా, " కుడిఎడమలే కానరాని  తుదిమొదళ్ళే తోచబోని  స్వప్నమధువుల జడుల లోపల  స్వాంతమున జ్ఞాపకపు పొరలు, పొరల లోపల తెరలు తెరలుగ.." అన్న రజని గీతం అప్రయత్నంగా నా పెదాలనల్లుకుంటోంది.

ఇసుక

"ఇది నాదేనని గుర్తుంచుకుని భద్రంగా నీ దగ్గరుంచుకో..." అంటూ hourglass నా చేతుల్లో పెట్టాడొక మిత్రుడు. ఇంటిలో కనపడే మూలలో, ఇష్టంగా అమర్చుకున్న ఈ అరచేయంత బొమ్మని, ఈ పదేళ్ళల్లోనూ కొన్ని వేల సార్లు దాటుకెళ్తూ తాకి చూసుకునుంటాను. సోమరి మధ్యాహ్నాల్లో సోఫాలో గడ్డం మీద పడుకుని దాన్నే పరీక్షగా గంటల తరబడి గమనించుకుని ఉంటాను. ఇసుక జారిపోవడం ఎప్పుడూ ఆటలానే అనిపిస్తుంది తప్ప కాలపు రహస్యమేదీ గరుగ్గా గుండెని తాకినట్టు ఉండదు.
కళ్ళూ వేళ్ళూ మనసూ ఎలా తిప్పితే అలా తిరిగే, మన చేతుల్లోని ఆటబొమ్మలానే అనిపిస్తుంది జీవితమెప్పుడూ. గిరుక్కున వెనక్కి తిప్పి బోర్లా పడేస్తే, నిండుగా మళ్ళీ కళ్ళ ముందు నిలబడినట్టే ఉంటుంది కాలం, జారిపోయిన రేణువుల మీదకి చూపు మళ్ళదు.
గుంజుకుపోయేందుకు ఎవరైనా రానీ, ఎన్ని ప్రయత్నాలైనా చెయ్యనీ, ' ఈ జీవితం మొదట నాది' అన్న స్పృహలోనే అంతులేని తృప్తి తొణికిసలాడుతుంది. అలా అనుకోవడానికి కొందరికి ఊహ తెలిసే వయసొస్తే చాలు, కొందరికి జీవితకాలమూ సరిపోదు.
కొత్త సంవత్సరమంటే మనం అరచేతులు రుద్దుకుని అన్నిటికీ సిద్ధంగా ఉండి తిప్పుకున్న sand clock లా - నిండుగా మన దోసిట్లో వాలిన కాలంలా ఉంటుంది. చేజారుతున్నదంతా రేపటికొక జ్ఞాపకమని గుర్తుంచుకుని, జీవితమెంత నిండైన అనుభవాలతో బరువెక్కుతోందో కొల్చుకు చూసుకోవడానికి - I wish you all a VERY HAPPY new year!! 

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....