నిశ్శబ్దపు నిశీధిలోకి...

.
సంగీతంలా లయబద్దం గా సాగిపోయే నదీ ప్రవాహం..ఉండుండి నెమ్మదిగా, కవ్విస్తునట్టుగా..ఏదో రహస్యం చెప్పాలనట్టుగా  గుస గుసగా  నా పాదాల దాకా వచ్చి, మువ్వల పట్టీలను మాత్రమే  ముద్దాడి  పారిపోయే తుంటరి నీళ్ళు.కాలం గుప్పిట్లో నుండి జర్రున జారి గతంలోకి చేరిపోయే క్షణాలల్లె , నా చేతిలోకి చేరాక ఉండలేనంటూ తిరిగి తీరం లోని అనంత రేణువుల్లోకి కలిసిపోతోంది, అప్పటి దాకా సూరీడి  సాక్షిగా మిలా మిలా మెరిసిన ఇసుకంతా..!    


రేయికి రారాజులా చంద్రుడు ఆకాశంలోకి అడుగు పెట్టే వేళయింది. చెలికాడి రాక గురించి వెన్నెలమ్మ తెచ్చిన  వర్తమానం అందగానే, అప్పటిదాకా ఏ అంతఃపురాల్లోనో తమ అందాలకు మెరుగులు దిద్దుకుంటున్న చుక్కలన్నీ, ఒక్కసారిగా వినీలాకశపు వీధుల్లోకి చమక్కుమనే రాజసం ఉట్టిపడుతుండగా , ఠీవిగా అడుగు పెట్టాయి.


మసక వెన్నెల్లో ఇసుక తిన్నెలు అమర్చుకుంటున్న అందాలను, నదినీ నన్నూ ఆవహిస్తున్న చిక్కటి నల్లటి నలుపును  చూస్తుంటే, అప్పటి దాకా నన్ను నిలువరించిన స్తబ్దతను విదుల్చుకోవాలనిపించింది .రాతిరిలో ఏం మాయ ఉందో ఎన్నో ఏళ్ళ నుండీ ప్రయత్నిస్తున్నా , ఈ క్షణానికీ నేను కనిపెట్టలేకపోయాను.


ప్రపంచాన్ని రంగుల్లో ముంచెత్తే పగటి కంటే, అన్నీ రంగులని చెరిపేసి లోకాన్ని ఒక్కటి చేసే నిశీధి నలుపులోనే , నేనర్థం చేసుకోలేని రహస్యమేదో ఉంది.శతకోటి వర్ణాల నొక్క చోట కలిపి ఆ విశ్వేశ్వరుడు చిత్రించిన అత్యద్భుత కళా ఖండంలో అదృశ్యంగా కదలాడుతూ నన్ను అల్లరి పెట్టే అందమేదో ఉంది.  వర్ణాలన్నీ విడిచి చీకటి చీర కట్టుకున్నప్పుడు, మౌన ముద్రలోకి జారిన స్త్రీ లా ప్రకృతి మారినప్పుడు, అచ్చెరువొందించే  ఆ సౌందర్యం ముందు మోకరిల్లి, మౌనంగా ఆ దృశ్యాన్ని కను రెప్పల వెనుక చిత్రించుకోవడం  మినహా ఇంకేం చెయ్యగలను నేను!


" ఆకాశ మా వొరస
ఆవులించిన రేయి
మిసమిసలతో ఏటి
పసలతో ననుసుట్టి
ఈ రేయి నన్నొల్ల నేరవా రాజ
                  యెన్నెలల సొగసంత ఏటి పాలేనటర ..."

అంటూ విరహంతో, విషాదంతో, "కలవరపు నా బతుకు కలత నిదురయ్యింది  "  అని ఎంకి లా బాధ పడే క్షణాలని కాదు రాత్రి నాకిచ్చేది!
రాత్రి, నన్ను నాకు గుర్తు చేస్తుంది. పని ఒత్తిడిలో, పందేలు పడి తీస్తున్న పరుగుల్లో, ఒక రోజంతా ఎలా గడిచిందో కళ్ళ ముందుకు తెస్తుంది.  శక్తికి  మించి పోరాడి ఓడిపోయినప్పుడు నాకు తోడుగా నిద్రా దేవిని పంపించి ఓదారుస్తుంది. ముసుగులను పక్కన పెట్టి, నేను నేను గా మారేందుకు, నిజాయితీగా నిశ్చింతగా నిద్ర పోయి, రేపటిని మరో సారి కొత్త ఆశలతో స్వాగతించేందుకు సంధిగా మారుతుంది.న న్ను నేను మర్చిపోయేందుకు, నేనేంటో నాకు జ్ఞప్తికి తెచ్చేందుకు, నేను సాధించాల్సిన లక్ష్యాలను వెన్నాడే  కలలుగా మార్చేందుకు, కలలను నిజం చేసుకునేందుకు ఒక నిశ్శబ్దాన్ని సృష్టించేందుకు  రాతిరిని మించిన సాయమేముంది ?.


"ప్రపంచంతా నిద్రలోకి జారుకున్న రాత్రుల్లో, తన గమ్యాలను చేరుకునేందుకు విశ్రమించక పోరాడే వాడే విజేత అవుతాడు"  అని చిన్నప్పుడు చాలా చోట్ల చదువుకునే దాన్ని . ఎందుకో ఆ వాక్యం నన్ను విపరీతం గా ఆకర్షించేది. ఎంతలా అంటే , ప్రతి రోజూ గడియారం పది  చూపించగానే తరువాతి రోజు బ్రహ్మాండం బద్దలైపోతుందన్నా  పట్టించుకోకుండా పడుకునే నేను, ఆ వాక్యం చదివిన రోజు మాత్రం నిద్రని పది నిమిషాలు వాయిదా వేసుకుని , బాధగా పడుకునే దాన్ని. కొన్ని రోజులు విజేత అవ్వాలంటే రాత్రే మెలకువగా  ఉండాలనుకుని, "ప్రిపరేషన్"లో భాగం గా పగలంతా బలవంతంగా పడుకుని, మళ్ళీ రాత్రికి కూడా నిద్రని ఆపుకోలేక యధావిధిగా పడుకుని అమ్మ దగ్గర అనేకానేక  తిట్లు తిన్న రోజులు కూడా ఉన్నాయనుకోండి...అది వేరే విషయం.. :)


ఏది ఏమైనా నిశీధి - నిశ్శబ్దం నా స్వప్న లోకాలకు సందిగ్ధపు తెరలను తొలగిస్తూ దారి చూపిస్తూనే ఉంటాయి.ఏడు గుర్రాల రధమెక్కి వచ్చి నా ఏకాంతానికి   ఎవరైనా భంగం కలిగించినా , నా కల చెదిరిపోయినా.. ఒక రాత్రి కరిగిపోయినా...మరో రాత్రి కోసం సాగే నిరీక్షణలోనే  నా జీవితం గడిచిపోతోంది..
కృష్ణశాస్త్రి  గారన్నట్లు ,


మింట నెచటనో  మెరయు చుక్కల
కంట చూచితి కాంక్ష లూరగ
కాంక్ష లూరిన కొలది చుక్కలె 
కాంచి బ్రదుకే గడపితిన్...


"I am like the road in the night listening to the footfalls of it's memories in silence.." - Tagore

ఇంకా తెలవారదేమి....

'ప్రతి రోజూ మా ఉదయం పేపర్ చదవడం తోనే మొదలవుతుంది' అని గర్వం గా చెప్పుకునే వాళ్ళు ఈ దేశంలో లక్షల మంది ఉంటారు. అదే నిజమైతే..వాళ్ళ ఉదయం ఎలా మొదలవుతోంది ?

ఏనాడూ కలిసి లేని మనం , మళ్లీ మళ్లీ విడిపోవాలని ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటుంటే, ఆ వైకుంఠ పాణి ఆడలేని అమాయక ప్రాణాలు ఎలా వైకుంఠానికి పోతున్నాయో బొమ్మలలో చూడడంతోనా?
నిజాలు జనాలను చేరకుండా ఆపేందుకు ఒకరిని మించి ఒకరు ఎలా పోటీలు పడుతున్నారో చూసి నవ్వుకోవడంతోనా?
మంచిని మరిచిన కొందరు మానవ మృగాలు ఆటవిక యుగపు దాఖలాలు మన చుట్టూరా ఇంకా మిగిలే ఉన్నాయని సాక్ష్యం ఇస్తుంటే , అరాచకాన్ని ఖండించలేని పిరికితనంతో వార్తలను చదివి బాధ్యత తీరిపోయింది అనిపించుకోవడంతోనా?
పదేళ్ళ పసి పిల్లాడు అప్పుడప్పుడూ అమ్మా నాన్నలిచ్చే రూపాయి రూపాయి కూడబెట్టుకుని , బళ్ళో వరద బాధితులకి విరాళాలు అడగగానే , ఆ డబ్బంతా ఆనందంగా అప్పజెపితే, అలాంటి డబ్బులను కూడా నిస్సిగ్గుగా సొంత ఖాతాలోకి చేర్చుకున్న మహా మహుల చరిత్రలు చదవడంతోనా?

ఈ దేశం అవినీతికి చిరునామా అని అడగకపోయినా అందరికీ పేరు పేరునా చెప్పి, అన్యాయం వేళ్ళూనుకు పోయిన ఈ సమాజాన్ని ఎన్ని తరాలు మారినా మార్చలేమని మనని మనం ఎమార్చుకోవడం తప్ప ఎప్పుడైనా ఏమైనా చెయ్యాలని ప్రయత్నించామా?

మన ఇంటి ముందు మాన్ హోల్ లో పసి మొగ్గ పడిపోతే, రేపొద్దున వార్తల్లో ఏం రాస్తాడో అని ఎదురు చూస్తాం. ఇండియన్ క్రికెట్ టీం వైఫల్యానికి అర్ధ రాత్రి పార్టీలే కారణమని టీవీ లు అరగంట హోరెత్తిస్తే, తెల్లవారగానే ముందు ఈ విషయం మొత్తం చదవాలని నిర్ణయించుకుని పడుకుంటాం.

ప్రతి చోటా , ప్రతి పనికీ లంచాలు ఇవ్వందే పని జరగడం లేదని వాపోతాం. ఇంకో పది మందికి చెబుతాం. ఎప్పుడైనా ఎవరో ఒక నిజాయితీ కలిగిన రిపోర్టర్ వీళ్ళందరి మీదా ఏమైనా రాసినప్పుడు, నిబద్దత కలిగిన పోలీసులు వెను వెంటనే తగిన చర్యలు తీసుకున్నప్పుడు, మనం చెయ్యలేని పని వేరెవరో చేసినందుకు చప్పట్లు కొడతాం. సంబరాలు చేసుకుంటాం.

ఇక ఇంతేనా? మన జీవితం ఎన్నాళ్ళయినా ఇంతేనా? రావణుడిని చంపడానికి రాముడి రాక కై ఎదురు చూసాం. నరకాసురుడిని అంతమొందించేందుకు మరో అవతారం కావలన్నాం. బ్రిటిష్ వాళ్ళ ఉక్కు పాదం కింద నలిగిపోతూ మహాత్ముడెవడో వస్తాడని నిరీక్షించాం .
ఇక చాలు. మహాత్ముడు తన సైన్యం తో మనకి స్వాతంత్ర్యం సాధించి పెడితే, అది మనకి మరో అస్త్రం ప్రసాదించింది.

రాముడి కోసం, కృష్ణుడి కోసం ఈ సారి ఎన్ని యుగాలు ఆగాలో మనకీ తెలీదు.ఒక వేళ మనం అంతా ఓపిగ్గా ఆగినా, సాక్షాత్తూ ఏడు కొండల మీదే మోసాల ముసుగు కప్పిన ఘనుల మీద అలిగి ఇటు వైపు చూడబోనని స్వామి వారు ఈ పాటికే శ్రీదేవి కి మాటిచ్చి ఉండరూ ? పోనీ , మహా లక్ష్మి దయ కలిగినదై ఒక్కసారి వాళ్ళని కరుణించండని నచ్చజెప్పి పంపిందే అనుకుందాం, ...'నకిలీల' హవా నడుస్తున్న భూలోకం లో, తనని నమ్మరన్న సంశయంతో భగవంతుడు మధ్యలోనే వెను దిరిగి వెళ్ళిపోతేనో.. ?

కనుక ఈ లోపు మనమే యుద్ధం ప్రారంభిద్దాం. కనపడ్డ ప్రతి అవినీతి పరుని మీద మన అస్త్రాలని ప్రయోగిద్దాం.అన్యాయం జరిగిందని చదివి వదిలెయ్యకుండా, దాని చరిత్ర తెలుసుకుందాం. ౧౦ రూపాయల స్టంప్ ఖర్చుతో, సంబంధిత వివరాలను ఇంటికి తెప్పించుకుని పోరాటం సాగిద్దాం. పెద్ద పెద్ద విషయాల్లో తల దూర్చడం ఇష్టం లేదనుకుటే, మీ కోసమే వాడుకోండి. గ్యాస్ కనక్షన్స్ అనుకున్నట్టు  రాకపోయినా, పాస్పోర్ట్ పనులకు, విద్యుత్ శాఖని నిలదీయుటకు ...ఇలా ప్రతి ప్రభుత్వ శాఖని ప్రశ్నించే అధికారం పొందండి.ఇది మన హక్కు..!!
ఇంతకీ దాని పేరేమిటో చెప్పలేదు కదూ..  "సమాచార హక్కు చట్టం".
మనకి దీనిని మించిన బలం లేదు .తలదన్నే ఆయుధం మరొకటి లేదు.  ప్రతి పనికీ, ప్రతి కష్టానికి ఇది ఒక ఉపాయం చెప్తుంది, మనం కలలు కనే భారతాన్ని కళ్ళ ముందుకు తెస్తుంది.

ఇప్పటి దాకా ఏమేం సాధించామో ( ఒక చిన్న గ్రూప్ ద్వారా) తెలుసుకోవాలంటే, "లోక్ సత్తా సంజీవని" ని అడగండి.
http://www.loksattasanjeevani.blogspot.com/
ఇవి కేవలం సంకల్ప బలమే తప్ప మంది బలం లేని ఒక చిన్న గ్రూప్. కేవలం ఎలక్షన్స్ ముందు మనని ఊదర గొట్టి పారిపోయే రాజకీయ పార్టీల్లా  కాక, ఒక లక్ష్యం తో ముందుకి వెళ్తున్న వారికి, ఒక్కసారి అభినందనలు తెలియజేద్దాం. కుదిరితే మన వంతు సాయం చేద్దాం.

అబ్బే, లేదండి ..మాది ఆమ్యామ్యా బండి, "ఇవ్వడం- తీసుకోవడం" మా ఆచారం ..ఆ గుంత లో నుండి బయటకు రాలేం అంటారా....ఎప్పుడు  తెల్లారుతుందా..ఈ రోజు ఏ వార్తని ఖండిద్దామా...ఎవరిని నిందించి పక్కకి తప్పుకున్దామా ,అని ఆలోచిస్తూ..ఆనందంగా ఈ  జన్మ కిలా కానీయండి.. :)

- మానస చామర్తి

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....