పరవశ

 


మహానదులనూ లోయలనూ
మత్తుగా నిదరోతున్న అరణ్యాల హొయలునూ
సరోవరాలనూ సంధ్యలనూ
చప్పుడు చెయ్యని సౌందర్యప్రవాహాలనూ
చకచకా పిక్సెల్స్‌లో కుదుర్చుకునే నీ కళ్ళలో
ఒంగి వెదుక్కుంటూ ఉంటాను
మనవైన క్షణాలకు నువ్వద్దే అందాల రహస్యాల కోసం.
 
వలుపుగాలులు వీయగానే చిగుర్లేసే జీవితం నుండి
ఒక్క రేకు తుంచితే వేయి స్టేటస్ అప్డేట్‌లు.
ఏంటి స్పెషల్ అని అడిగేవాళ్ళకు ఏం చూపెట్టను?
అలవాటైన స్పర్శలోని సౌఖ్యం లాంటి నిన్ను
ఎవరికీ ఏమీ కానివై రాలిపడే క్షణాలను
హృదయంలోకి ఒంపి పారిపోయే నిన్ను..
 
నా ఉదయపు హడావుడిని నింపాదిగా లాలించే నీ గొంతునీ
నీ ఒక్కో సంబరానికీ ఒక్కో తునకై రోజంతా వెలిగే నా పేరునీ
మాటలు నేర్చిన చూపై, బుగ్గలు కందే ముద్దై
ఆదమరపు క్షణాల్లో కౌగిట్లో ఇరుక్కునే నీ ప్రేమని,  
కాఫీ మగ్గుల పైని బద్ధకపు మరకై
మాసిన గడ్డమై ఇంట నీదైన వాసనై
క్షణక్షణం గుచ్చే ఉనికిని,      
ఏ టైంలైన్‌లో దాచుకుంటూ పోను?
 
సాలెగూడంటే భయం కాదు కానీ
సెర్చ్ ఇంజన్స్‌కి దొరకని ప్రేమంటే మోజు.
ఎన్ని మెమరీ కార్డ్‌లు ముడేస్తే ఒక్క మనసు-
అంతా నీదే పిల్లా అని నువ్వంటుంటే
నా బ్రతుకంతా చిందే సందడి మీద మోజు.

ఆనవాలు

 ప్రేమసందేశాన్ని దాచి

సముద్రంలోకి విసిరిన గాజుసీసా
మళ్ళీ విసిరినవాడి పాదాలకే తగిలినట్టు
వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఊరెళితే,
లోపల చిత్రమైన కుదుపు

ఉంగరం చూపెట్టి జ్ఞాపకాలను మేల్కొల్పిన ప్రేయసిలా
అనాది నేస్తం లాంటి ఆకాశం
చందమామను వొంపి
ఈ పిట్టగోడల మధ్య పుట్టిన
ఎలప్రాయపు పాటల్ని గుర్తుచేస్తోంది.

కొబ్బరి ఈనెల మధ్య కదలే నీడల్లాంటి పురాస్మృతుల్లా
ఈ ఇల్లు, ఈ వాసనలు, నా బాల్యం, ఇంకా, యవ్వనం.

మాటుమణిగిన రేయిలో మునకలేస్తోంది జాబిలి.

మునిచీకటి వేళల్లో రహస్యంగా మెరిసి
నడిరేయి సౌందర్యానుభవాన్ని మాటిచ్చిన నక్షత్రమేదో
అదను చూసి తలుపు తెరిచినట్టు -పైనంతా
వెలుతురు పొట్లాలు చిట్లి చెల్లాచెదురైన కాంతి
దిగంతాల్లో నుండి జలజలా రాలుతోన్న స్వర్ణధూళి

“తూ సఫర్ మేరా..తూ హీ హై మేరీ మంజిల్”
హృదయాన్ని పాటగా పెదాల దాకా లాగి
ప్రాణం పెనుగులాడుతోంటే జీరగా కునికే ఆ గొంతు-
గాలి అలల్లో తేలి కాంక్షాతప్త హృదయాన్ని
కారుణ్యపుచందనప్పూతలా ఊర్కోబెడుతోంది.

రజనీడోలలో నిశ్చింతానుభవమై ఊగుతోన్న కాలం
కలతో పాటుగా మెల్లిగా కరుగుతోంది.

మేల్కొన్న రెప్పల నంటి – ప్రత్యూషహేమరాశి
గుండెల మీద, అయాచితంగా రాలిపడ్డ
పసుపుపూల సౌందర్యరాశి.

అమృతానుభవానికి ఆనవాళ్ళను వెదుక్కుంటూ
ఈ ఉదయం.

*

సిరివెన్నెల చిందాడిన తావుల్లోకి...

with Public
మా చైనా కాలేజీలో ప్రతి ఆదివారం పరీక్షలుండేవి. కాలేజి ఇందిరా గాంధి స్టేడియం పక్క బిల్డింగ్లో ఉండేది. ఆదివారమొచ్చిందంటే అక్కడి కోలాహలాన్ని పట్టలేం. దానికి గుర్తుగా మా పరీక్ష సాగినంతసేపూ కిటికీల్లో నుండి పెద్ద పెట్టున పాటలు వినపడుతూనే ఉండేవి. ఆ పాటల్లో ఇంకా పెద్ద పరీక్షలుండేవి.
నీ కన్నుల్లో కలని అడుగు అతడు ఎవరనీ?
ఎవడ్రా వాడసలూ! దేవుడా, మా పై పగబట్టావా! మా ముందున్న శతకోటి ప్రశ్నలు చాలవన్నట్టు ఇది కూడానా అని తలలు బాదుకోని ఆదివారాల్లేవు ఆ ఏడాదంతా! ఇట్లా మా నిదురించు యవ్వనానికి మేలుకొలుపై ఒకడొచ్చాడని వింటే ఇంట్లో బాజాబజంత్రీలేగా!
*
గాలిలోనా మాటిమాటికీ వేలితో నీ పేరు రాయడం
రాతిరంతా చందమామతో లేనిపోని ఊసులాడటం
ఏమయిందో ఏమిటో...నాకేమయిందో ఏమిటో...
మాటలు వెదుక్కుంటోన్న ఎలప్రాయాన్ని సుతిమెత్తగా హత్తుకున్న పాట అతనిది. అన్ని వైపులా మధువనం..పూలు పూయదా అనుక్షణం అంటూ తేనెలూరే గొంతుతో ఓ లాలి పాట ఈ జీవితాన్ని తాకిన క్షణం ఇప్పటికీ భద్రంగానే ఉంది.
ప్రేమించే ఎదల్లో ఏముందో పదాల్లో ఎలా పెట్టడం అని ఎక్కడో అన్నారు కానీ, ప్రేమకున్న ఎన్నో ఛాయలను ఎన్నో రీతుల్లో తన పాటల్లో అవలీలగా పట్టుకోగలిగాడనిపిస్తుంది. గాలికి గంధం పూయడమే పూలకు తెలిసిన ప్రేమకథ అన్న రహస్యం అర్థమైనవాడికి, ప్రేమ గురించి రాయడమేమంత కష్టం!
ప్రేమని, ప్రేమలోని ఉత్సాహాన్ని బిగ్గరగా సంబరంగా ఉత్సవంగా చెప్పుకోవడానికి ఒక మోమాటమక్కర్లేని మార్గంగా చూస్తానతని పాటని. "గుండెలో గుట్టుగా ఉండనంటోన్న వేడుక- అంతటా నవ్వులే పలకరిస్తోన్న పండుగ" - మైకం కాదిదీ నిన్నటి లోకం కాదిదీ అని అరిచి చెప్పడంలో ఎంత సంతోషం!
ఊహలన్నీ ఊసులేవో మోసుకొస్తుంటే ఊరు పూలరధమల్లే మారి ఎదురుచూస్తోంటే - ఏం చేస్తాం? మైమరపు క్షణాలన్నిటినీ పాటలుగా మార్చుకుని చూసుకోవడమొక సరదా అయిపోయింది.
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పానో ఏమనుకున్నానో... ప్రేమ తాలూకు అయోమయాలు, ఇంత క్లాసిక్‌గా ఒక లయకి ఒదుగుతాయంటే, ఏమో, ఇది ముందు లేనిదే నేనైతే నమ్మలేను .
ఆకాశమే హద్దు పావురాయి పాపాయికి... అని అల్లప్పుడెప్పుడో ప్రేమపావురాల్ని మేఘాల్లో పరువులెత్తించిన ఆ కలానికి, ప్రేమ రేపొద్దు మాపొద్దు ఈ పొద్దునాపొద్దు అనే కంగారప్పిల్లని తెలుసు. ఆగిపోనీకు వేగాన్ని, ఏది ఏమైనా కానీ అనే ప్రేమ పంతాన్ని పట్టుకున్న నిత్య యవ్వనానికి - నమో నమః!
వేటూరి గురించి రాస్తూ ఆ నాటుకొట్టుళ్ళు మా వల్ల అయ్యే పనులు కావని తప్పించుకున్నార్లే కానీ, సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగ అన్న ఈయనేం తక్కువా!

కృష్ణవంశీ సిగ్నేచర్ పాటల రహస్యం పట్టుకుని పొత్తిళ్ళలో పసిపాపల్లే పాతికేళ్ళ మగ ఈడు/వెక్కెక్కి ఏం కావాలందో అడుగు అమ్మడూ... అని రాసిందెవరో మరి!
కళ్ళతో ఒళ్ళంతా నమిలీ చూపు ఎర్రబారిందే నెమలీ.. అంటూ చిన్నారి అందాల సందోహాన్ని అల్లరి పట్టించడం నేర్పించిదెవరూ?
నా కళ్ళతోటి నీ అందం, నువ్వే చూడు ఒకసారీ అని కవ్వించినప్పుడూ,
నిద్ర రాని చూపు తపనే నిలవనీదే ఈడునీ అని వాపోయినప్పుడూ,
తెల్లారిపోని రేయిలా నన్నల్లుకుంటే నీవిలా/సందేహమేదీ లేదుగా సంతోషమంతా నాదిగా అని తీర్మానించుకున్నప్పుడూ - ఏం ప్రేమ నిజంగా అని అబ్బురపడటమే నావంతు.
నేను అనీ లేను అనీ చెబితే ఏం చేస్తావూ? నమ్మననీ నవ్వుకునీ చాల్లే పొమ్మంటావూ - ఒకే ఒక మాట అంటూ గుండెను చీల్చి చూపిన మాటలు. తన వాడి గుండెపై తల ఆన్చితే తన పేరే వినపడుతుందని నమ్మబలికిన పాట.
`ఏమైపోతాం అనుకున్నామా...జత పరుగుల్లో ఏం జరిగినా...`

ఎవరికి పట్టింది? నిండా ప్రేమలో మునిగాక. నాతో నువ్వే ఉంటే లోకంతో పనిలేదు అన్న రికామీ పాటలోని వివశత్వం ఎప్పుడూ నన్ను గెలుస్తూనే ఉంటుంది.
నన్నే మల్లె తీగలా నువ్ అల్లుకుంటే...నిలువెత్తు ప్రాణం నిలవదటే!
అల్లెయ్ అల్లెయ్.. పుప్పొడి తునకా గాలై అల్లెయ్... అంటే ప్రాణం గింగిరాలు తిరుగుతున్నట్టే ఉంటుంది.
My heart is beating.. అదోలా.. .పాటను ఆఫీసు ఐ.డి కి పంపి, ఇది పాడటానికైనా నా బతుక్కి అర్జంటుగా ప్రేమ కావాలి అన్న ఫ్రెండ్ గుర్తొస్తున్నాడు. ప్రేమ అట్లా చెప్పి రాదులే, పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా - అని తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపోదువ్ గాని అని చెప్పి నవ్విన గుర్తు 🙂
ఏవేవో పాటలు కళ్ళముందుకొస్తున్నాయ్. తుళ్ళిపడ్డ యవ్వనం తూలిపడకుండా ఆసరాగా నిలబడ్డ పాటలు. ఆటోల్లోనూ, పెద్ద పెద్ద కోలాహలపు గుంపుల్లోనూ, కాలేజీ మిత్రుల మధ్యలోనూ నాతో నేనూ వినీ వినీ అరిగిపోయిన పాటలు. వెదుక్కుని విన్న పాటలు. నా ఊరి దారుల్నీ, కాలేజీ బస్సుల్నీ, చేయి విడవని స్నేహాల్నీ, చూపు కలపని ప్రేమల్నీ మళ్ళీ గుర్తు చేస్తున్నాయ్ ఈ పాటలు. తేనెవు నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా..వెన్నెల నువ్వో వెండిమంటవో తాకే తెలుసుకోనా- స్పీకర్‌లు అదిరిపడే పాటలకు చిందులేసిన పాదాలు మళ్ళీ కళ్ళ ముందు ఆడుతున్నాయ్.
కలలు కనే కన్నె కళ్ళ లోతుల్లో చిందాడిన సిరివెన్నెలగానే నా వరకూ అతని ఉనికి. ఆ లోతుల్లో నుండి అతన్నింకో లోకానికి తీసుకెళ్ళగలిగే శక్తి - ఉందా?

గాలిపల్లకిలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె/ గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె...

రాసిచ్చిన ప్రతి పాటకూ తన హృదయమే తల్లి అంటూ ఆర్తిగా అప్పగింతలు చెప్పుకున్న కవీ- నువ్వుంటావ్! 

(My Sirivennela love songs playlist :
https://www.youtube.com/playlist?list=PL1FnHf9geiHO8xoLDS3K1aHuSG-bI4H9t)

అఫ్సర్ కవిత్వంలో అమూర్తభావనలు

 ఈ సాయంత్రానికి

ఈ చలీ ఈ వానా కలగలిసి
ముంచుకొస్తున్న చీకటిలోకి
కాస్త నిబ్బరంగా నడిచివెళ్ళడానికి
ఏదో ఒక సాకు వెదుక్కుందాం
ప్రస్తుతానికి దాని పేరు కవిత్వం అనుకుందాం


అంటాడు అఫ్సర్. నిజమే, చాలా మందికి ముసిరే చీకట్లలోకి నిబ్బరంగా నడిపించే తోడు కవిత్వం. మన లోపలి ధైర్యాన్ని తోడు పిలుచుకోవడానికి ఒక సాకు కవిత్వం. ఈ లోలోపలి భావనలను పిలిచే ఒడుపు తెలిసిన అరుదైన కవిగా అఫ్సర్ కనపడతాడు.


అఫ్సర్ పేరు వినగానే చాలా మందికి అస్తిత్వవాద కవిత్వం గుర్తొస్తుంది. తొలినాళ్ళ కవిత్వంలోని రాజకీయ భావాలు, ధిక్కార స్వరమూ గుర్తొస్తాయి. నాకు వీటిని దాటుకుని "ఇంటివైపు" మళ్ళిన కవిత్వంలోని సుతిమెత్తని కొత్త గొంతే స్పురణకొస్తుంది. అది అన్ని అస్తిత్వాలనుండీ విడివడి, అంతర్యానం చేసిన మనిషి గొంతు. నువ్వూ-నేనూ అంటూ మాట్లాడిన ఒక మిత్రుడి గొంతు. మామూలు చూపుకీ, మాటవరసకు సాగే సంభాషణకీ లొంగని అమూర్తభావాలను వాటి అతి నిర్మలమైన రూపంతో అక్షరాల్లోకి ఒంపిన కవి గొంతు. ఈ గొంతులో ఈ ధోరణితో అఫ్సర్ ఎన్నో కవితలు రాసిఉండకపోవచ్చు. కానీ, కవిగా అఫ్సర్‌లోని ఈ పార్శ్వం ఆకట్టుకున్నట్టు, మరే ఇతర పార్శ్వమూ నన్ను ఆకట్టుకోలేదు. పోలికలూ ప్రతీకల జోలికి పోకుండా, పదాలు బరువు చూసి వాడుతున్నాడా అనిపించేంత తేలిగ్గా రాసుకుపోయిన ఆ కవిత్వం లోతు తెలిసిన కొద్దీ నన్ను ఆశ్చర్యపరుస్తూనే వచ్చింది. "చెప్పకూడదు;చూపించాలి" అనే నినాదం కవిత్వాన్ని అసాధారణ స్థాయిలో ప్రభావితం చేసిన సాహిత్య వాతావరణాల్లో, ఏ ప్రతీకల సాయమూ లేకుండా మాట్లాడినప్పుడు, అది కవిత్వంగా గుర్తింపబడకపోయే ప్రమాదమూ ఎక్కువే. ఆ ప్రమాదానికి వెరవకుండా చేసిన ప్రయత్నం సహజంగానే నన్నాకర్షించింది. పొడిపొడి మాటలతోనే మానసికావస్థలను కళ్ళకు కట్టడం, ఆ సాదా పదాలకొక కవిత్వ పరిమళమద్దడం గొప్ప నేర్పుగా నన్ను తాకింది.  


అమూర్తమైనవి, అవ్యక్తమైనవి, కళ్ళకు కనపడనివీ అమూర్తభావనలుగా చెప్పబడతాయి. కళ్ళతో కొలవలేని అందం; అరిచి చూపించలేని నొప్పి; స్పర్శతో నిమిత్తం లేని దగ్గరితనం లేదా దూరం;  మొదలైనవన్నీ ఇవే కోవలోకి వస్తాయి. ఇలా ఇంద్రియాలకు ప్రత్యక్షంగా అనుభవంలోకి రానివాటిని కవిత్వంలోకి తీసుకురావడం తేలికైన పని కాదు. ఎంత దిగులో చెప్పాలంటే ఎవరి దిగులు లోతునైనా కొలవగలిగి ఉండాలి. కన్నీటి చుక్క ఎవరికెంత బరువో ఊహించగలిగి ఉండాలి. ఇక్కడికిదే కవి సున్నితత్వానికి పరీక్ష అనుకుంటే, ఏ మూర్తమైన ప్రతీకల ఆసరా తీసుకోకుండా, ఈ అమూర్త భావనలను అమూర్త భావనతోటే నడిపించాలనుకున్నప్పుడు సమస్య మరింత జటిలమవుతుంది. తేడా ఏమిటో తేలిగ్గా అర్థమయ్యేందుకు వాల్మీకి రామాయణం నుండి, సుందరకాండలో హనుమ సీతను తొలిసారి చూసిన సందర్భాన్ని గమనించవచ్చు. ఇది భద్రిరాజు కృష్ణమూర్తిగారు మూర్తామూర్తభావనలను వివరించేందుకు తన వ్యాసంలో ఎంచుకున్న ఉదాహరణే.
అప్పుడు సీత మలినవస్త్రాలతో ఉంది, దుఃఖంతో ఉంది, రాక్షసస్త్రీల మధ్య చిక్కుబడి నిట్టూర్పులు విడుస్తూ ఉంది. ఆమెను పద్మాలు లేని సరస్సులా ఉంది అనో, శుక్లపక్షపు నెలవంకలా ఉందనో అన్నప్పుడు, మనకు చప్పున పోలిక అందుతుంది. ఆమె కళావిహీనంగా ఉందనీ, కృశించిపోయి ఉందనీ అర్థమవుతుంది. ఇరవైకి పైగా పోలికలతో సాగిన ఆ వర్ణనలలో, సీత గుర్తు రాని జ్ఞాపకంలా, సడలిన నమ్మకంలా, అభ్యాసలోపంవల్ల శిధిలమవుతున్న చదువులా ఉందని అమూర్త ప్రతీకల సాయంతో కూడా వర్ణిస్తాడు వాల్మీకి. ఈ పోలికలు ముందువాటంత వేగంగా అందవు. ముందువాటంత స్పష్టమైన చిత్రాన్ని పాఠకుడి మనోఫలకం మీద ముద్రించవు.


అమూర్తకవిత్వాన్ని రెండు రకాలుగా చూడవచ్చు. ఒకటి, కవిత ఏం చెబుతున్నదో ఏం ప్రతిపాదించదలచిందో స్పష్టంగా చూపెట్టకుండా యథేచ్ఛగా నడిచే కవిత్వం. ఈ తరహా కవిత్వంలో పాఠకుడు శ్రమపడ్డా కవిని చేరగలడని చెప్పలేం, నిర్ధారించలేం. అలా కాకుండా, ఒక అమూర్తభావనను ఆధారంగా చేసుకుని, దాని తాలూకు ఆవరణను సృష్టించే లక్ష్యంతో సాగే కవితలు రెండో రకం. కవిత శక్తివంతమైతే ఆ ఆవరణ పాఠకుడిని తనలోకి లాక్కుంటుంది. ఆ మానసిక ఉద్వేగం తాలూకు బలమేదో పాఠకుడికీ అనుభవంలోకి వస్తుంది. ఇందులో అర్థం కానితనమేదీ ఉండదు కానీ, అర్థమవ్వడం ఈ కవిత్వానికి ముఖ్యం కాదు, కవి గొంతులోని తీవ్రతా, సున్నితత్వం పాఠకుడికి ఎంత బలమైన అనుభవంగా మారుతున్నాయన్నది ముఖ్యం. అదీ కవికి సవాలు. అఫ్సర్ కవిత్వంలో అర్థం కానితనమేదీ ఉండదు కనుక, ఇక్కడ చర్చించబోయే కవితలన్నీ రెండవరకానికే చెందినవని అనుకుంటాను. ఈ కవితలు బిగ్గరగా ఏమీ చెప్పవు, చూపెట్టవు. చేసేదల్లా ఒకానొక మానసిక ఆవరణలోకి పాఠకుడిని తీసుకుపోవడం, నిద్రాణమైన మానసికావస్థను మేల్కొల్పడం. 


నాస్టాల్జియా, విరహం, అకారణమనిపించే దిగులు లాంటి భావాలన్నీ లోపల ఎంత స్పష్టంగా సుడులు తిరిగినా వాటి మొదలూతుదీ తెలీవు కనుక వరుసలోకి లాక్కొచ్చి కాగితం మీద పెట్టడం కష్టం. ఒక్కోసారి కొలనులోకి విసిరేముందు రాయిని చూసినట్టు, ఈ భావనలకు ఒక ట్రిగ్గర్ పాయింట్‌లా ఒక సంఘటన కనపడుతూ ఉండచ్చు, కానీ దాని ప్రభావం అలలు అలలుగా తిరుగుతున్నప్పుడు ఆ వైశాల్యాన్నంతా పట్టుకోవడం కష్టం.
 
అఫ్సర్ కవిత రాసే పద్ధతిలో, ప్రత్యేకించి ఇట్లాంటి కవితలు రాసే పద్ధతిని గమనించినప్పుడు, ఆసక్తికరమైన పంథా కనపడుతుంది. ఈ ట్రిగర్ పాయింట్ అని దేన్నైతే అంటున్నామో, అది కవితకు శీర్షిక చేస్తాడు.(ఉదా: స్నేహితుడి దిగులు) ఈ మొదలూతుదీ పట్టుకోలేమనిపించే చెదురు మదురు ఊహలకు ఏకధాటిగా రాసే పద్ధతి ఎలాగూ నప్పదు కనుక, ఒకే కవితను ఖండికలుగా చేస్తాడు. 1. 2. 3. అంటూ ఆ ఖండికలకు అంకెలు వేస్తాడు. కవితను ఇట్లా విడగొట్టే పద్ధతి, అఫ్సర్‌కు ఉపయోగపడినట్టు చాలా తక్కువ మందికి, తక్కువ సందర్భాల్లో ఉపయోగపడుతుంది. ఈ అంకెలు వేయడం, ఖండికలుగా విడగొట్టడం, ఏదో ధ్యాసలో కొట్టుకుపోయే ఆలోచనలు మనసుల్లో ఎలా గంతులు వేస్తాయో, ఆ దాటు ని చూపించడానికి, పాఠకుడిని కూడా ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు అలాగే అకస్మాత్తుగా లేపి తీసుకుపోవడానికి సాయపడతాయి. కొన్ని సార్లు ఈ భాగాలు ఒక దానికొకటి కొనసాగింపుగానూ కొన్ని సందర్భాల్లో ఒకదానినొకటి పెనవేసుకున్నట్టుగానూ ఉంటాయి. ఒకే రంగు పరిచే తీరును బట్టి ఒకసారి పల్చనై, మరొకసారి గాఢమై పూర్తిగా వేరే రంగులలోకి మారిపోయినట్టు, ఒక్కోసారి గుర్తుపట్టలేనంత దూరంలో, ఈ ఆలోచనలు ఎడంగా నిలబడి కనిపిస్తాయి. మనుషులు ఉండుండీ ఏదో ధ్యాసలో మునిగిపోయి కాసేపటికి అసలు విషయమేమిటో పూర్తిగా మర్చిపోయి వేరే జ్ఞాపకంలోకి, వేరే సందర్భంలోకి మేల్కొన్నట్టనమాట. ఒక అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ సౌందర్యం అదేమి చెబుతుందన్న దాని కన్నా, ఎలా చెప్పినదన్న దాని మీదే ఆధారపడ్డట్టు, అఫ్సర్ కవిత్వంలో ఈ అమూర్తభావనల మీదుగా నడిచిన కవిత్వ సౌందర్యమంతా, ఆ చెదురుమదురు ఆలోచనలను పరిచిన తీరులోనూ, ఆ ఊహల మధ్య దూరమూ, దగ్గరితనంలోనూ, ఆ కలివిడితనం పాఠకులలో రేకెత్తించే స్పృహలోనూ ఉంది. 


స్నేహితుడి దిగులు అన్న కవిత పైన చెప్పిన పద్ధతికి చక్కటి ఉదాహరణ. ఇందులోని ప్రతి ఖండికా ఒకే సంఘటన తాలూకు రకరకాల స్థితులను పట్టిస్తుంది. "నీ నడకలోని ఉద్వేగాన్ని కొలిచేదేదీ నా దగ్గర ఉంటుందని తెలియక" అంటాడు మొదటి ఖండికలో. 


"ఎక్కడెలా గాయపడ్డావో
నిన్ను నొప్పించి అయినా అడగాలనుకుంటాను
తాకి చూడటానికి ఆ దిగులుకొక
శరీరం ఉంటే బాగుండనీ అనుకుంటాను
నువ్వు ఏ ఏ పదాల్లో దీన్ని గురించి చెప్పుకుంటూ వెళ్తావా అని
ఎదురుచూస్తూ ఉంటాను


నీ కళ్ళల్లో
నీ కదలికల్లో
నీ పెదవివిరుపుల్లో
యీ గాయం ఎలా తెరుచుకుని
తన కథ చెప్పుకుంటుందా అని చూస్తూ ఉంటాను"


నొప్పించి అయినా అడగాలనుకునే తాపత్రయం, అతని కదలికలతో కారణాన్ని అందుకోవాలనే ఆత్రం, ఆ స్నేహితుడు మాటలతో ఏదో చెప్పడం, ఉండలేక వెళ్ళిపోవడం,  అటుపైన ఆ దిగులును మోసుకుంటూ కవి ఒక్కడూ తెల్లవారుఝాములో "యే దిగులునీ యే గాయాన్నీ నేనెప్పటికీ యేమీ చెయ్యలేనని" అర్థం చేసుకోవడం - ఇలా దశలుదశలుగా సాగిన కవిత. పైన చెప్పినట్టు, ఒకే ఉద్వేగం రంగులు మార్చుకుంటూ ఒక కొత్త మెలకువగా ఉదయించిన కవిత. 


పికాసో అంటాడు - కళను అర్థం చేసుకోవాలని అందరూ అనుకుంటారు; పక్షి పాటను అర్థం చేసుకోవాలనుకోరేం? రాత్రినీ, పూలనీ, మన చుట్టూ ఉన్న అన్నిటినీ అర్థం చేసుకోకుండానే ప్రేమిస్తాం కానీ, కళను మాత్రం అర్థం చేసుకోవాలనుకుంటాం, ఎందుకూ?  - అని. నిజమే, కళలు పాఠాలు కావు, చెప్పింది అర్థం చేసుకుని ఒకే రీతిన ఒక్కటే సమాధానమన్నట్టు మరెవరికో అప్పజెప్పాల్సిన అవసరమూ లేదు. ఒక అనుభవంగా అది మనను ఎంత బలంగా, లోతుగా తాకగలుగుతోందన్నదే ప్రశ్న. ఒక లాండ్స్కేప్ చూస్తే వెంటనే అర్థమైనట్టు, ఒక నైరూప్యచిత్రం అర్థం కాదు. మొదటి దానిలో మనం చిత్రంలో పొందుపరిచిన వివరాల ద్వారా తాకిన సౌందర్యాన్ని అనుభవంగా మార్చుకునే ప్రయత్నం చేస్తే, నైరూప్య చిత్రం మొదటే ఒక అనుభూతిగా తాకుతుంది. ఇది ఏం చెప్తోంది? అన్న ప్రశ్న కళను అర్థం చేసుకోవడానికి పనికొస్తుందని కొందరంటారు కానీ, అది అవరోధంగానే ముందుకొస్తుంది. కనీసం అది మొట్టమొదటి ప్రశ్న అయితే కాకూడదని అనుకుంటాను. కవి అంటున్నాడు : నిర్వచనాలు కష్టం, కష్టపెట్టి ప్రతి క్షణాన్నీ విడమరచి చెప్పలేను/విడమర్చి చెప్పిన క్షణాన/అది ఒడ్డు మీద ఆత్మాహుతి చేసుకునే చేపపిల్ల.
 
అందుకే, "దగ్గరా దూరం" కవితలో, వొంటరిగా ఉన్నప్పుడు వొంటరి పక్షిని అసలే చూడలేను అంటాడు.
 
ఆ ఒంటరి పక్షి అన్న మాట చదువుతుండగానే పాఠకుడి కళ్ళముందుకో చిత్రం వస్తుంది. పక్షి ఎక్కడైనా ఉండచ్చు, కానీ అది ఒంటరి పక్షి అనగానే దరిదాపుల్లో మరే ఇతర పక్షీ కనపడనంత మేర అన్నీ చెరుపుకోవడం అసంకల్పితంగా జరిగిపోతుంది. ఆ ఖాళీతనం మనలో కలిగించే సంవేదన- ఈ వాక్యం రహస్యంగా మన మీద పని చేసే తీరు. మామూలుగా ఉన్న మనమే ఈ ఖాళీతనపు స్పృహను మోసే ప్రయత్నం చేస్తుంటే, ముందే ఒంటరి అయిన కవి నేను ఒంటరి పక్షిని చూడనే లేను అనడమెందుకో మెల్లగా అనుభవమవుతుంది. సమధర్మమున్న రెంటిని కలపడంలో వచ్చిన బలమిది. కవిత మననొక కొత్త మానసిక ఆవరణలోకి తీసుకుపోవడం అంటే ఇదే. చదవడానికి బహుతేలిక వాక్యమే కానీ, వాక్యం ముగుస్తూండగానే కళ్ళ ముందుకొచ్చే ఏదో ఏకాకి పక్షి, ఒంటరితనం తాలూకు భయానకమైన నొప్పిని నోటకరుచుకుని కనిపిస్తుంది. "ఇదంతా ఇంకేమీ కాదు/నువ్వు దేనికీ అలవాటు పడలేదని ఇంకోసారి తెలుస్తుంది" అని కూడా అంటాడు వెంటనే. నిరాశకూ, భంగపాటుకూ, ఎదురుచూపుకూ, ఏకాకితనానికీ ఎలా అలవాటుపడాలి? ఎదురుపడ్డ ప్రతిదానిలోనూ మనలోపలి ఒంటరితనాన్ని గుచ్చి చూపే శక్తి కనపడుతోంటే, అలవాటుపడటం అయ్యే పనేనా? "అలా అని పెద్ద బాధా లేదూ.." అనుకున్నట్టే, "ఇదంతా ఇంకేమీ కాదు/కాస్త అలవాటుపడాలి, అంతే!" అనుకోవాలి. అంతే. అప్పుడు ఆ నిర్లిప్తత ఒప్పుకోలుగా మారి అడుగు ముందుకు పడేట్లు చేస్తుంది. 
 
దూరంగా ఉన్నప్పుడే/ నా వొంటిని నేనే తాకి తాకి / కొలుస్తూ ఉంటాను, నీ జ్వరాన్ని-  అని ముగిస్తాడీ కవితను. కవిత మొత్తంలో ఈ నువ్వు ప్రస్తావన ఎక్కడా లేదు. ఉన్నదంతా నా ఒంటరితనమే. కానీ చివరిలో తెలుస్తున్నదేమిటి? ఇది తాను ఒక్కడై ఉండటంవల్ల కలిగిన ఒంటరితనం మాత్రమే కాదు. తనవాళ్ళెవరో జ్వరగ్రస్తులై ఉంటే, ఆ నుదుటిని స్వయంగా తాకలేని బెంగ కలిగించే ఉక్కిరిబిక్కిరితనం. ఆ ఇద్దరి మధ్యా దూరం పెంచిన దిగులు. తన వొంటిని తానే తాకి తాకి చూసుకుటూ అవతలి మనిషి జ్వరాన్ని కొలవాలనుకునే ప్రేమ. ఒంటరి పక్షి ఎవరో ఎందుకంత ఇబ్బంది పెడుతోందో ఇప్పుడు కదా అర్థమవుతోంది. కాబట్టి ప్రశ్నల నుండి, అంచనాల నుండి విడివడి కవితతో ప్రయాణం చేయగల హృదయం ఉంటే అప్పుడు ఆ కవిత స్పృశించే ఉద్వేగాలు, కదిల్చే అవస్థలు, జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా పాఠకుడిని కమ్ముకుంటాయి. మన లోపలి మనతో సంభాషణలా సాగే కవితలివన్నీ. ప్రయత్నపూర్వకంగా కాకుండా స్వాభావికంగా, ఆకస్మికంగా చెప్పుకుపోతున్నట్టు ఉండే ఈ కొన్ని కవితల్లోనూ, కవిగా నన్ను విస్మయపరచగల అఫ్సర్ కనపడ్డాడు. "ఇదంతా ఏమీ కాదు, కాస్త అలవాటుపడాలి, అంతే" అని పై కవితలో చూపెట్టిన తాత్వికత ఒక ఎత్తైతే, "కాస్త అలా లోపలికి వెళ్ళొద్దామా?" కవిత దాని తారాస్థాయి.


అతని ఉత్తరం రాలేదు
ఆమె చిరునవ్వు చూడలేదు
వాడి ఏడుపు వినలేదు
యివాళ ఒక్క వానచుక్కయినా రాలలేదు
-పోనీ యెవరూ వొక అసహనపు చూపు రాల్చలేదు
 
కనీసం ఒక్క అసహనపు చూపైనా దక్కి ఉంటే, ఆలోచన కాసేపు దాని చుట్టూ తిరిగేది. అయిష్టమైనదైనా నొప్పెట్టేదైనా సరే, తన ఉనికిని గుర్తించేవారికోసం, తనకే గుర్తుచేసేవారికోసం ఆ పూట అతని వెంపర్లాట. లోకంతో సంధి తెగిన ఏకాకితనాన్ని కవి ఇక్కడ సూచిస్తున్నాడు. మనం ఎవ్వరి దగ్గరికీ, ఎవ్వరూ మన దగ్గరికి రాని, రాలేని స్థితి. వానచుక్క కూడా రాలలేదు అనడంలో, ఇలాంటి ఒక పొడిబారిన, ఆశావిహీనమైన స్థబ్ధ వాతావరణపు స్పృహ మెదులుతోంది.
 
ఇట్లా మొదలైన కవిత "ఆరుబయలు నువ్వు దాచేసిన ప్రతిబింబం" అనడం దాకా సాగింది. నాలుగు పాదాల కవితలో కవి సాగించుకున్న అంతర్యానం, సాధించుకున్న స్థితి ఇక్కడ గమనించాల్సినవి.  


ఆరుబయలు నువ్వు దాచేసిన ప్రతిబింబమంటే ఏమిటి? "విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం, నిజాంతర్గతం.." అంటారు ఆదిశంకరాచార్యులు దక్షిణామూర్తి స్త్రోత్రంలో. ఎవరు అంతర్ముఖులై లోతుల్లోకి ప్రయాణం చేసి ఆత్మసాక్షాత్కారర జ్ఞానం పొందుతారో, వాళ్ళకి ప్రపంచం అద్దంలోని ప్రతిబింబంలా కనిపిస్తుంది. కొండ అద్దమందు చిన్నదై ఉన్నట్లు, ఇంత సువ్యాప్తంగా కనపడుతున్నదీ అల్పమైపోతుంది. అంటే, దీనంతటికీ అతీతమైన, వీటికన్నా ఉన్నతమైన, స్థితికి చేరుకున్నట్లు. కవి చేరినది ఇట్లాంటి స్థితినే. మరొక విధంగా చూస్తే, ఎప్పుడు మనం ఒక మౌన స్థితిని (ఈ క్షణపు నిశ్శబ్దానికి ఏదో ఒక రంగు), చుట్టూ ఉన్న ప్రకృతితో మమేకమవగల్గిన ధ్యాన స్థితిని ( నా కంటి రెప్పపై/నీరెండ తునక రెక్క విప్పిన చప్పుడు) పొందుతామో, అప్పుడు బయట ఉన్నదానికీ, లోపల ఉన్న "నేను"కీ అభేదం. అప్పుడు నీలో ఉన్నదే బయటా ఉంటుంది. కాబట్టి బయటదేదైనా నీ ప్రతిబింబమే అవుతుంది. కవి ఇంకో మంచి మాటన్నాడు - "నువ్వు దాచేసిన" అని. కాబట్టి వెదికి చూస్తే కానీ తిరిగి కనపడదది.
 
ఎదురుచూపులతోనూ, ఏదీ లేదన్న వెదుకులాటతోనూ, ఒంటరి క్షణాల పట్ల నిరాసక్తతోనూ మొదలైన ఈ కవిత, ఎవరూ రాని ఏమీ జరగని వెలితి క్షణాలను ఒప్పుకుని, ఆ క్షణాలకు రంగులద్దుకోవడం ద్వారా , ఆ క్షణంతో మమేకమవ్వడం ద్వారా ఆ క్షణంలోకి మేల్కోవడం ద్వారా ఒక ధ్యాన స్థిని చేరుకుని, సమస్త విశ్వాన్ని తన ప్రతిబింబంగా చూసుకోవడంతో ముగుస్తుంది.  సుప్రసిద్ధ సూఫీ కవి రూమీ అన్న“Do not feel lonely, the entire universe is inside you. Stop acting so small. You are the universe in ecstatic motion." మాటలను గుర్తు చేసే కవిత ఇది. సూఫీయిజం లోతులు పట్టుకోవడానికి అఫ్సర్ చేసిన కృషిని తల్చుకోవడం ఇక్కడ అసందర్భం కాదు.  
 
ఈ కవితలో నన్ను ఇబ్బంది పెట్టిందల్లా నస్రత్ పాట ప్రస్తావన. కొన్ని గొంతులు మనలోపలి లోకాలను కదిలిస్తాయి, కొత్త అనుభూతులేవో సాక్షాత్కారమయ్యేలా చేస్తాయి, నిజమే. కానీ, ముందు పాదంలో, "కొన్ని క్షణాలు ఇలాగే ఉండనీ, ఎవరూ రాని, ఎవరికీ ఎవరూ ఏమీ కాని క్షణాలు" అని చెప్పాక ఈ పాదాలు రావడమూ, తన లోపలి, తన చుట్టూరా ఉన్న నిశ్శబ్దాన్ని వినేంత సున్నితత్వంలోకి మేల్కొనే ప్రయాణంలో " నస్రత్ పాడుతూనే ఉన్నాడు" అనడమూ సముచితంగా కనపడవు.
  
ఇక్షుక్షీరగుడాదీనం మాధుర్యస్యాన్తరం మహత్ 
తధాపి న తధాఖ్యాతుం సరస్వత్యాపి శక్యతే  
 
పాలు, చెఱకురసం, బెల్లం అన్నీ మధురంగానే ఉన్నా, వాటిలోని మాధుర్యాలు వేరు వేరు. ఆ తేడా ఏమిటో సాక్షాత్తూ సరస్వతైనా చెప్పలేదంటాడు దండి. 
అఫ్సర్ ముస్లిం అస్తిత్వ వేదనలను కవిత్వం చేశాడు. సామాజిక సందర్భాలను తన పుస్తకాల్లో పాదాలుగా నడిపించాడు. తనకిష్టమైన గొంతులనూ, కవులనూ, కళాకారులనూ అక్షరాలలోకి వొంపుకుని దాచుకున్నాడు. ఇంత విస్తృతమైన వస్తు పరిధితో సాగిన అఫ్సర్ నలభయ్యేళ్ళ సాహిత్య ప్రస్థానంలో నుండి, వాటన్నింటినీ కాదని లెక్కకు ఎన్నో లేని ఈ తరహా కవిత్వంవైపే  మనసు మొగ్గడం నన్ను కూడా ఆలోచనలో పడేసింది. `కవిత్వం ఎదుట నా భాష` అన్న కవిత చదివాక నాకొక సమాధానం దొరికినట్టైంది. అందులో, తన భాష `ఎంతకీ పాలు అందని శిశువు ఆక్రోశమై వినపడుతుంద'ని అంటాడు. అదీ మాట. "శిశువు ఆక్రోశం"; పాలు అందని శిశువు ఆక్రోశం. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు కాండిన్స్కీ కళను ఒక ఇన్నర్ నెసెసిటీ అని చెప్పుకుంటాడు. ఆ పదబంధం చిత్రకళను వ్యక్తీకరించే దారిలో ఒక ఉద్యమస్పూర్తిని నింపిందని అంటారు. తన పుస్తకం "The spiritual in art"లో అతనంటాడు : కళాకారుడికి రూపం మీద మాస్టరీ కాదు, తాను చెప్పదల్చుకున్నదేదో దానికి తగ్గట్టుగా రూపాన్ని దిద్దుకోవడమే ముఖ్యం అని.
 
కవిత్వంలో తన భాష ఎంతకీ పాలు అందని శిశువు ఆక్రోశం లాంటిది అని అఫ్సర్ అన్నప్పుడు, అది అట్లాంటి తప్పనిసరి అవసరమని అర్థమవుతుంది. అందులో, అలా తప్ప ఇంకెలానూ చెప్పలేని అసహాయత, అవసరం వినపడతాయి. దానిని వివరించలేడు, నొక్కిపెట్టి తగ్గుస్వరంలోనో, రాద్ధాంతంగానో చెప్పలేడు. అది ఇంకా లౌక్యం నేర్చుకుని పసితనపు ఉద్వేగమేదో. దానిని ఎవరు అలక్ష్యం చెయ్యగలరు? ఇలాంటి ఉద్వేగం, అదనపు మాటలందించే ఏ భాషా ఇంకా నేర్చుకోని పసితనం, ఈ వ్యాసంలో చర్చించిన అమూర్తభావాలకు సంబంధించిన కవితల్లో స్ఫుటంగా కనపడతాయి. అందుకే ఆ కవితలు అలా ప్రత్యేకంగా నిలబడతాయి.  శైశవ ఆక్రోశం విని ఎవ్వరూ ఊరడించకుండా తప్పించుకుపోలేనట్లే, ఈ కవితల దగ్గర ఆగకుండా ఈ సంపుటినీ పూర్తి చెయ్యలేరు. 


వీటిలో కనపడే ఈ ధోరణే, మొత్తం కవిత్వం గురించి మాట్లాడాల్సి వచ్చేసరికి, బలహీనతగా కూడా తోస్తుంది. పక్కవాద్యాల హోరుతో పాటలు వినడం అలవాటైన గొంతుకి, ఒక లేత గొంతేదో లయలో పాడుకుపోతుంటే వినడానికి సమయం పడుతుంది. కానీ, అందులో సౌందర్యం అర్థమైన కొద్దీ, వెనుకటి దారిలోకి వెళ్ళడం అసాధ్యమైపోతుంది. అఫ్సర్ కవిత్వంలో సరళతతో నిండిన పైతరహా కవిత్వం ఎంత గట్టిగా పట్టుకుంటుందంటే, అటుపైన ఏ కవితలో ఆర్భాటం చూసినా అది అబద్ధమనే అనిపిస్తుంది. ఒక్క పదం బరువుగా కనపడినా దాని లోతుతో నిమిత్తం లేకుండా, సారళ్యపు సున్నితత్వాన్ని వదులుకున్న వాక్యమై మొరటుగా వాడిగా పాఠకులను తాకుతుంది. వాడాలా వద్దా అన్న పెనుగులాట బహుశా కవికీ ఉంది.
 
అవతల నువ్వు చాలా మర్యాదగా,
ఎంతో గౌరవప్రదమైన పదాల మధ్య
ఒక్కో వాక్యమూ కొలుస్తున్నావ్, తెలుస్తూనే ఉంది!
..
 నా పసిభాష ఉద్వేగమై ప్రవహిస్తే
యీ ఒక్కసారికీ మన్నించు.
 
యింకా నాకు రానే రాని
ఈ లోకపు భాష నేర్చుకోవాలి నేను.
 
కాని, నా బాధల్లా వొక్కటే:
ఆ తరువాతి తయారీ భాషలో నువ్వు వినిపిస్తావా?
 
పోనీ,
నాకు నేను వినిపిస్తానా?
 
తయారీ భాషలో కవి వినపడడనే నేనంటాను. అఫ్సర్ అయినా కాదనగలడని అనుకోను.
 




https://archive.org/details/TheSpiritualInArtByWassilyKandinsky 


https://eemaata.com/em/issues/201109/1814.html/6

నెమలీక

 "అరుణాం కరుణాం తరంగితాక్షీం.."

శారద నవరాత్రులు మొదలుకాగానే దహరాకాశంలో ల.లి.త అన్న మంత్రాక్షరాలు నక్షత్రాల్లా మెరుస్తూ కనపడతాయి. తక్కిన లోకమంతా తానంతట తానే పక్కకు తప్పుకున్నాక, శరన్మేఘాల తేలికదనమేదో మనసును ఆవరించుకుని చిత్రమైన హాయిదనంలోకి మేల్కొల్పుతుంది.
వేళ మించకుండా ఉదయాస్తమయాల్లో "శ్రీమాతా శ్రీమహారాజ్ఞి.." అంటూ కుంకుమార్చనలు చేస్తోంటే, సింహాసనేశ్వరి అయిన ఆయమ్మ చామంతిపూల పొత్తిళ్ళలో నుండి చల్లగా నవ్వుతూ దీవిస్తునట్టే ఉంటుంది. అగరు ధూపాలు, ఆవునేతి దీపాలతో, రవ్వంత పచ్చకప్పురపు చిలకరించిన నైవేద్యాల సమర్పింపులతో, ఇల్లిల్లూ దేవాలయాలయ్యే వాతావరణమిది.
మనసుకు నచ్చే మనుష్యులు ఇంటికి వస్తే "మీ రాకతో ఇంటికి పండుగ కళ వచ్చింది" అంటాం. కట్టిన బట్ట కళ్ళకింపుగా కనపడితే "పండుగొచ్చినట్టే ఉంది నిన్నిలా చూస్తోంటే" అని ముద్దుచేస్తాం. ఆదరంగా వడ్డించి, ఆనక తాంబూలమిచ్చే ఆత్మీయ ఆతిధ్యం దొరికిందా.."పండుగ జరుపుకున్నట్టుంది" అని మురుస్తూ చెప్పుకుంటాం. నచ్చింది చేస్తూ, నింపాదిగా గడిపే వీలు దొరికితే, "పండగ చేస్కుంటున్నా" అనడం నిన్నామొన్నల్లో మొదలైన రివాజులా అనిపించే పరమ పాత సంగతి.
ఈ ఏడంటే ఇలా ఒంటెద్దు రామలింగడి పండుగ కానీ, గోదారి జిల్లాల ఇంటికి కోడలిగా వెళ్ళాక పండుగంటే ఎంత కోలాహలమనీ!! నా నిన్నామొన్నల్ని తీరిక క్షణాల మధ్య కూర్చుని తిప్పుకుంటుంటే, నెమలీకల్లా ఎన్నెన్ని జ్ఞాపకాలు!
చీమలు దూరని చిట్టడివి లాగా, కాలుష్యం దూరని పల్లెటూరు మా అత్తగారిది. ఇంటికి పక్కగా గచ్చు చేయించిన విశాలమైన ఖాళీ స్థలం. పండుగకి రెండు రోజుల ముందే రావాలని ప్రేమగా హుకుం జారీ చేస్తే, అనిల్ నేనూ రెక్కలు కట్టుకు బెంగళూరు నుండి బయలుదేరిపోయేవాళ్ళం. అక్కడక్కడే ఉండే అన్నదమ్ముల పిల్లలందరూ ఒకరి రాకను మరొకరు ఖాయం చేసుకుని వెనుకేవెనుకే వాలిపోయేవాళ్ళు. పండగలొస్తున్నాయంటే పది మందీ కూడతారని తెలిసిన వంటవాళ్ళు తమ పనినీ రొక్కాన్నీ ముందే ఖాయం చేసి పెట్టుకునేవారు. పేరుకి బేరమే కానీ బీరకాయపీచు బంధుత్వమేదో ఉండే ఉంటుంది. అవసరం ఇద్దరిదీ కనుక అభిమానం దానంతటదే నిలబడేది.
ఆ వంటావిడ కూడా మాతోపాటే దిగేవారు. బ్రహ్మాండమైన ఫిల్టర్ కాఫీ అందరికీ అందించేసి, ఇహ ఇంటి పక్క ఖాళీ స్థలంలో పొయ్యిలు ఏర్పాటు చేసి పిండివంటల ఏర్పాట్లు మొదలెట్టేవారు. పక్కింటి పిన్నిగారినీ, వెనుకింటి వదినగారినీ వంట త్వరగా ముగించుకుని రమ్మని కేకేసి పిలిచేవారు. కలిపికుట్టినట్టుండే ఆ ఇళ్ళల్లోని ఆడవాళ్ళందరూ అడిగిన వేళకి తప్పకుండా వచ్చేవారు. ఇక ఎవరికేమి ఇష్టమో ఇష్టంగా తలుచుకుంటూ, ఎవరికేమి పడవో జాగ్రత్తగా గుర్తు చేసుకుంటూ వంటలు మొదలెట్టేవారు. కొబ్బరిబూరెలకు దగ్గెవరికొస్తుందో, నువ్వులు పడితే తిననిదెవరో; పాలకోవాలో యాలకులపొడి వేయాలో వద్దో, లడ్డూలో పచ్చకర్పూరం పడాలో అక్కర్లేదో; కారప్పూసలో వామెంతో, చెక్కల్లో వెన్నపూసెంతో వైనవైనాలుగా చెప్పుకుంటూ పనిచేసేవారు. కజ్జికాయాలూ, అరిసెలూ అవుతూండగానే పళ్ళేల్లో మాదాకా వచ్చేసేవి. తెల్లవారుతూండగా మొదలైన పని చీకట్లు ముసురుకుంటున్నా పూర్తయ్యేది కాదు. మిగిలితే పిల్లలు ఊళ్ళు తీసుకుపోతారు, ఇంకో వాయ కలపండంటూ నులకమంచం మీద ఒత్తిగిల్లి పడుకుని కొలతలు సరిచూసే బామ్మగారు మరికాస్త బలవంతపెట్టేవారు వాళ్ళని.
"భుజాలు గుంజేస్తున్నాయబ్బా" అనుకుంటూ ఆ రాత్రికి వంట లఘువుగా కానిచ్చి నిద్దర్లు పోయేవారు ఆ ఆడవాళ్ళంతా. మేమింకా అంత పెద్దవంటలు చేసేదాకా పోలేదు కనుక అక్కడికి ప్రవేశం లేనట్టే.
నవరాత్రులు మొదలయ్యేవి. పొద్దున్నే తలస్నానాలూ, మడులూ, ఓ పక్క టిఫిన్లు, మరోవంక నైవేద్యాలు, పెద్దవాళ్ళ పారాయణాలు, ఏదో కనపడలేదనో, మరొకటేదో కావాలనో చిన్నాపెద్దా అరుపులూ; వెదుకులాటలూ;
చిన్నపనులకు పెద్దవాళ్ళమయ్యీ, పెద్దపనులకు చిన్నవాళ్ళమయ్యీ, ఏ పనీ లేకుండా తీరిగ్గా తిరిగే గుంపులో నేనూ ఒకదాన్ని. తడిజుట్టులు ఆరీఆరకుండా విసిగిస్తోంటే, పిడపలు చుట్టుకుని గడపలను పట్టి వేలాడుతూ తోడికోడళ్ళతోనూ వదినా మరదళ్ళతోనూ ముచ్చట్లు పెట్టుకునేదాన్ని. ముందరి వరండాలో తుడిచిన అరిటాకుల కట్ట ముందుంచుకుని, ఫలహారాల కోసం చిన్నచిన్న భాగాలుగా చాకుతో చీరుతూ ఎవరోఒకరు కనపడేవారు. వాటిని తీసుకెళ్ళి వంటింట్లో అప్పజెపితే, ఆ లేతాకు రంగు ముదురురంగులోకి మారేలా పొగలు కక్కే ఇడ్లీలు వడ్డించి, వాటి మీద నేతి గిన్నె వంచి, ఆదవరుగా ఏం కావాలంటే అది చూపించేవారు. ఈలోపు అమ్మవారికి నివేదన పూర్తయితే ఆ ప్రసాదమూ దోసిట్లో పడేది.
పదిరోజులూ అమ్మవారికి నైవేద్యాలు ముందే అనుకున్నట్టే, మధ్యాహ్నపు వంటకి ఏ కూరలో కూడా ఆలోచించుకు సిద్ధంగా ఉండేవారు. పంచరత్నాల్లాంటి కందబచ్చలీ, పనసపొట్టు, ఆవపెట్టిన అరటి కూరలూ, గుత్తి వంకాయా ఇంతమందికీ చేసేందుకు కావలసినవన్నీ ఊరూవాడా ఏకం చేసైనా సాధించుకొచ్చేవారు. అప్పటికే ఆవకాయను పాతావకాయగా నిర్ధారించి పక్కకు తోసేసి, దోసావకాయ సిద్ధం చేసేవారు. రోటిపచ్చళ్ళతో పాటు, ఈ పదిరోజుల కోసమని ముందుగానే పట్టించిన పొడులూ, అల్లం గోంగూరా టొమాటో పచ్చళ్ళూ, జాడీల్లో ఊరిస్తూ కనపడేవి. ముక్కల పులుసులూ, మజ్జిగ పులుసులూ, నేతిపోపులతో కమ్మగా వండిన బీరా, సొరా కూరలు - దేనితో ఏది వండాలో, ఏ కూరకు ఏ పచ్చడి తోడో, పప్పు, పులుసు, భక్ష్యమూ లేహ్యమూ ఏది దేనితో కలిసి విస్తట్లో పడాలో నిర్ణయించే బాధ్యత ఒకరికి అప్పగించేస్తారు. వాళ్ళ మాటను మీరే వీల్లేనేలేదు.
భుక్తాయాసంతో నడుం వాల్చాలనుకునే బద్ధకస్తుల్ని తట్టితట్టి లేపి పేకాటలోనో, అంత్యాక్షరిలోనో కూలేయడానికి నాలాంటివాళ్ళు ఉండనేఉంటారు. చిన్నవాళ్ళైతే మా గుంపులోనూ, పెద్దవాళ్ళైతే అత్తగారి గుంపులోనూ కలిపి చేతులు దులుపుకోవడమే. రెండు గంటలు రెండు క్షణాల్లా గడిచిపోయాయని చెప్పడానికి ఓ పదిహేనేళ్ళ పిల్ల వస్తుంది - " మీకు టీ కావాలా? కాఫీనా?" అని చిలకలా అందరినీ ఒకే ప్రశ్న వేసి లెక్కపెట్టుకుంటూ. మేము గెలిచిన టీం, ఓడిన టీం అని లెక్కలేసేవేళకి, ఎవరడిగింది వాళ్ళకి అప్పజెబుతూ మళ్ళీ ఆ వన్నెలవిసెనకర్ర రానే వచ్చేది. స్టీల్ కేన్లలో నుండి ముందువారం వండిన బూందీలు, లడ్డూలు, కారప్పూస , చెక్కలు, పేపర్ ప్లేట్లలో "పారేస్తే ఊర్కునేది లేదు సుమా!" అనే హెచ్చరికతో ఒకరందిస్తూ కూర్చునేవారు. ఆవిడ మాటను రెండో చెవితో వదిలేసి, వేడిగా ఏ బజ్జీలో వేయక ఇవేమిటే? అని విసుక్కునే మనిషి ఎవరో ఉండే తీరతాడు. "మిరపకాయ్ సగానికి చీల్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర కూరి, పైన పల్చగా నిమ్మరసం చిలకరించి ఇవ్వాలి, ఏం..? వాము దట్టించాలండోయ్.." ఒకదానివెనుక ఒకటి కోరికలన్నీ చదువుకుంటూపోతారు వాళ్ళు. పెరటిదొడ్డివైపు "చుయ్..చుయ్.." అంటూ పొయ్యి నవ్వుతూనే ఉంటుంది.
కప్పులు, పేపర్ ప్లేట్లూ ఏరుకుని, దుప్పట్లు మార్చీ, ఇల్లొకసారి తడిగుడ్డ పెట్టి, ఆడవాళ్ళంతా చేరి సహస్రనామాలు పారాయణ చేసేలోపు ఏడూ ఏడున్నర అయిపోతుంది. పసిపిల్లల అమ్మలు కంగారుకంగారుగా తిరిగేస్తుంటారు. వాళ్ళను పట్టిలాగి పెద్దవాళ్ళు "చద్దన్నం పెట్టేవు చంటోడికి, కాస్త ఆగు, అన్నం వార్చేయగానే పెట్టేద్దువు..ఇంకెంత ఐదు నిమిషాలు.." అంటూ సుద్దులు చెప్పేస్తారు. "నువ్వేమైనా నోట్లో వేసుకున్నావా? వేలాడిపోతున్నావేమట్లా?" అని ఆరా తీయగానే చివ్వున కళ్ళల్లో నీళ్ళు. ఈ నాలుగురోజులూ దాటి సొంతగూడు చేరితే బండిచక్రాల్లా తనూ తనవాడూ కలిసి పరుగుతీయడమే తప్ప ఇలా ఆగి తమని చూసి అడిగేవారెవ్వరూ ఉండరని గుర్తొస్తే సన్నటినొప్పి. ఇల్లంటే గబుక్కున పెరిగే బెంగ.
భోజనాల వేళ మించిపోతూంటుంది. "ఎవ్వరూ తినమంటే వండిందంతా ఏం చెయ్యాల్రా?" అరుపులు చెవిన పడుతున్నా అందరూ తప్పించుకు తిరుగుతారు. చెవి మెలేసి మరీ లాక్కొచ్చే మేనత్తలెవరో నడుం బిగించుకుంటారు. గోంగూర వాయ కలిపి ఉల్లిపాయ ముక్కలతో నంజుకు తినమంటారు. కందిపొడిలో ఆవకాయ నూనె వేసుకు తింటే ఉంటుంది నా రాజా!! అని లొట్టలేస్తారు. మాగాయ చిన్నజాడీలోకి తీసి, ఫ్రిడ్జ్ నుండి తొరక తెచ్చి ఎదురూగ్గా పెడతారు. పప్పు పులుసు గుమ్మడి వడియాలు, మిరియాల అప్పడాలు ముందుకు తోసి, ఎంత కావాలంటే అంతే తినండి, బలవంతమేం లేదు అని ఉదారంగా పలికి పక్కకెళ్ళిపోతారు. బొజ్జలోని బజ్జీలను పక్కకు సర్దుకుని కుంభాలు కుంభాలు కానిచ్చేస్తాం.
శుద్ధి చేశాక, వరండాలో ఆ మూల నుండి ఈ మూల దాకా పక్క దుప్పట్లు. సోఫా కుషన్లూ, దిళ్ళూ, మడతలేసిన దుప్పట్లూ అన్నీ తలల కిందకి సర్దుకుంటాయ్. ఎప్పుడూ నవ్వురాని పిచ్చి సంగతులకు కూడా ఆరాత్రి వికటాట్టహాసమే చెయ్యాలనిపిస్తుంది. ఎవరైనా కసిరితే ఇంకా నవ్వొస్తుంది. అత్తగారి దగ్గర కోడలి వినయాన్నీ, కోడలి మీద అత్త ప్రేమనీ మిగతావాళ్ళు వేళాకోళం చేసి నాటకమంటుంటే, ఒక్కటిచ్చి వాళ్ళతో తగువుపడాలనుంటుంది. నాకిక్కడ అస్సలు తోచట్లేదు..అని వేషాలేసిన పిల్ల కుంకల్ని లాకెళ్ళి, ఐదు కిలోల బెండకాయలు తడి లేకుండా తుడవమన్నారనీ; అంతెంత్తునున్న కరివేపాకు చెట్టంతా దూసి రెబ్బలు వొలిచి కడిగి ఆరబెట్టమన్నారనీ; జీడిపప్పు బద్దలు చీల్చి చిన్నచిన్న పలుకులుగా చేసి డబ్బాల్లో సర్దమన్నారనీ; వీధి గుమ్మంలో వేసిన అంతపెద్ద ముగ్గు నిండా దోమలు తిరిగే వేళ కూర్చుని రంగులద్దమన్నారనీ; వందాకులున్న అరిటాకుల కట్టంతా శుభ్రంగా తుడిచి ఆరబెట్టమన్నారనీ; దెబ్బకు అందరూ నోరెత్తకుండా పనిలో పడ్డారనీ చెప్పుకు చెప్పుకు పుక్కిలింతలుగా నవ్వుకునేవాళ్ళం;
శ్వాస తీసుకున్నంత మామూలుగా రోజులు సాగిపోతాయ్. పెరిగిన కిలోల లెక్క ఎందుకడుగుతారూ? వంటమనుషులు, ఆవిడ తనకు సాయంగా తెచ్చుకున్న మనుషులూ వంటింట్లో ఉన్నా, అక్క కొడుకుకి నేతి పెసరట్లు ఇష్టమని ఒకరూ, మేనల్లుడికి పెసరపచ్చడితో చేసే అట్టు ఇష్టమని ఒకరూ, చేమగడ్డలు వేయిస్తే మా కోడలు ఇష్టంగా తింటుందని ఒకరూ, మావయ్యగారికి పెరుగులో మీగడ సయించదు, మజ్జిగ చేసేస్తాను అంటూ ఒకరు - ఆ వంటిల్లు పట్టుకుని వేలాడుతూనే ఉండటం చూసి నాకెట్లా అనిపించిందో అడగండి. ఆడీ ఆడీ అరుపులతో అరిగిపోయిన గొంతుల గురించి వాకబు చెయ్యండి. దబాయించి లాక్కున్న పేకాట డబ్బులన్నీ వడ్డీలు కలిపి పిల్లల జేబుల్లో దోపేసిన ప్రేమల గురించి చెప్పమని అడగండి. సమవయస్కులందరూ దీపాలార్పేశాక చెప్పుకున్న రహస్యాల గురించి అడగండి. నాలుగు రోజులు వంట తప్పించుకున్న ఆనందంలో నిశ్చింతగా నిద్రపోయిన ఆడవాళ్ళ గురించి అడగండి. వాళ్ళ చీరల రంగులనూ, ఆ రంగుల్లో మెరుపులనూ అక్షరాల్లో చూపించమని అడగండి.
పండగ అయిన మర్నాటి గురించి మాత్రం నాకు గుర్తు చేయకండి. అందరినీ విడిచి, ఇల్లు చేరాకా, ఖాళీ గోడల ఆహ్వానం ఎలా ఉంటుందో, ఆ దుమ్ములూ దులుపుకోవడాలూ ..ఉఫ్ఫ్ఫ్!!!

 


ఆరేసిన పచ్చ చీర
నువ్వు రాసిన ఉల్లి పొర ఉత్తరం
నీలం రంగు పమిట నాది
ఆకాశం వైపుకి ఎగురుతూ ఉంటే
పట్టుకో పట్టుకో అని…

పాలపర్తి ఇంద్రాణి అన్న పేరు వినగానే తను రాసిన ఇలాంటి హాయిపదాల అందమైన కవిత్వం గుర్తొస్తుంది. ఇదే రచయిత్రి బరువైన వస్తువుతో, జీవితాన్ని దాని అత్యంత సహజమైన రూపంతో, కోపాలు, మోసాలు, బాధలు, పాతబడని చిన్ని చిన్ని సంతోషాలు విప్పుతూ రాసిన పుస్తకం, ఱ. పుస్తకానికి ఈ పేరే ఎందుకూ అంటే, ముందుగా వేరే ఏ అక్షరానికీ లేని బండి దీనికుందన్నది ఆమె సమాధానం.

చనిపోయిన మనిషిని పడుకోబెట్టినట్టు అనిపిస్తుంది.
పాపాయి ఉయ్యాలలాగా అనిపిస్తుంది.
తన తమ్ముడు ‘ర’ కు ఉన్న వాడుక, మన్నన నాకు లేవే అని బాధపడుతున్న పెద్దన్నలా అనిపిస్తుంది ‘ఱ’

నిడివిపరంగా చూస్తే నవలిక అని చెప్పదగ్గ ఱ పుస్తకానికి ఆధారమైన వస్తువు చావు. తండ్రి మరణం జీవితంలో కదిలించిన వేదన నేపథ్యంలో నడుస్తూ ఉండగా రచయిత హైదరాబాద్‌లోని స్మశానంలోకి వెళ్ళడం, అక్కడ ఎదురుగా కనపడే సంఘటనలు ట్రిగర్ చేసినట్టు ఏవో గతస్మృతుల్లోకి జారుకోవడం, తిరిగి కథ వర్తమానానికి రావడం–స్థూలంగా ఈ పుస్తక శిల్పం. అధ్యాయాల్లా సాగే ప్రతీ జ్ఞాపకానికీ ముందు ట్రాన్స్‌లోకి నడిపిస్తున్నట్టుగా సాగే కవిత; అధ్యాయానికి ముగింపులా ఒక చావు. మధ్యలో ఎన్నో ఛాయలతో కదలాడే జీవన శకలాలు. ఈ అనుభవాల్లో కూడా అత్యంత ఆత్మీయమైనవి, తన బ్రతుకుతో సమాంతరంగా వెంటబడి వస్తున్నట్టుగా ఉన్నవీ కొన్నయితే కొన్ని మాత్రం కేవలం అప్పుడే, ఆ క్షణంలోనే అన్నాళ్ళూ మరుగున ఉండీ ఉండీ అకస్మాత్తుగా పైకి లేచినట్లు కనపడేవి. మనిషి తన జీవితాన్ని ఎంత గమ్మత్తుగా మెదడు పొరల్లో దాచుకుంటాడో చూపెడుతుందీ పుస్తకం.

ఇది తండ్రి పోయిన దుఃఖంలో రాసినదే కానీ అంతా తండ్రి గురించే రాసినది కూడా కాదు. చావు మాత్రమే నిజంగా సాగిన ఎందరెందరి కథలో ఈ పుస్తకంలో ఉన్న మాట నిజమే అయినా ఈ పుస్తకం చూపించింది ఆ మరణం తాలూకు నీలినీడలను మాత్రమే కాదు. మరణం అనే ఊహ తాలూకు బరువు కూడా చాలామందికి మోయలేనిదే కనుక ఎన్నో చావులను కుప్పగా ఒకే చోట చూపెట్టినట్టుండే ఈ పుస్తకం కొందరు పాఠకులను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రమాదం ఉంది. అలాగే, చెప్పదలచిన మాటల్లో ఏ డొంకతిరుగుడూ లేకుండా సూటిగా చెప్పడం వల్ల చావు ఊహల నుండి దూరం పరుగెత్తించే భయమో వెరపో కూడా కొందరు పాఠకులకు అనుభవంలోకి రావచ్చు. కాలక్షేపానికి ఎప్పుడంటే అప్పుడు కూర్చుని చదువుకోగల పుస్తకాల్లా కాకుండా ఈ పుస్తకం పాఠకుడి నుండి ఒక ప్రత్యేకమైన మానసిక స్థితిని కోరుతుందనడం కూడా అతిశయోక్తి కాదేమో.

అయితే, విచలితం చేసే ఇన్ని అనుభవాల పరంపర విప్పుతూ కూడా, పుస్తకం మూసే వేళకి పాఠకులకు కేవలం దిగులునూ లేదా వైరాగ్య భావనలనూ మాత్రమే మిగల్చకుండా, కొంత బలాన్ని, ధైర్యాన్ని, ఒక విజయం తాలుకు ప్రయాణాన్ని కూడా గుర్తుగా మిగల్చడం ఆశ్చర్యం కలిగించే విషయం.

పదాలు అటూ ఇటూ పరుగులు తీస్తాయి
అర్థాలు ఎటెటో దిక్కులు చూస్తాయి
ఆలోచనలు ముందుకీ వెనక్కి ఊగిసలాడతాయి
చివరికి, శూన్యంలోంచి పువ్వులు రాలతాయి

ఇది తన అమాయకపుకళ్ళతో చుట్టూ జరిగే జీవితాన్ని సునిశితంగా గమనించిన పిల్ల కథ. ఆ అమ్మాయి ఎక్కడా ఎవ్వరినీ నిలదీసినట్టు కనపడకపోవచ్చు; ఎదురుతిరిగి ఎవ్వరితోనూ పోట్లాడినట్టూ కనపడకపోవచ్చు. కానీ తన ఎరుకలో ఒక మనిషిని మరో మనిషి గాయపరిచిన ప్రతిసారీ అది తిరస్కారంగా పుస్తకంలో కనపడుతూనే ఉంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనన్నట్టు ప్రవర్తించే పెద్దవాళ్ళను ఆమె ఛీత్కరించుకున్న తీరు అప్రయత్నంగానే కొందరు పాఠకులను భుజాలు తడుముకునేలా చేస్తుంది. తండ్రి డైరీలో పుటలను తిప్పుకుంటూ బంధాలెంత సంక్లిష్టమైనవో చూపెడుతుందీమె.

ఇక్కడ నలిగిపోయిన నవ్వు మొహానికి తగిలించుకోవాలి. కన్నీళ్ళని కోటుజేబుల్లో మడిచేయాలి. ఏడుపుని అల్మరాలో దాచేయాలి. భయాలను భుజాన వేసుకుని మోయాలి. ఎవరికోసమో నచ్చని రంగులు మెత్తుకోవాలి. ఎవరినో మెప్పించడానికి నటనల నగలను గొంతున వేసుకోవాలి. చిన్ని దీపం వెలిగించుకొని, చిన్ని లోకాన్ని ఏర్పరుచుకుని హాయిగా మురిసిపోవడానికి లేదు. ఎవడొచ్చి ఆ దీపాన్ని ఊదేస్తాడో అని, ఆ చిన్ని లోకాన్ని చిందరవందర చేస్తాడో అని అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి

తాము బాధపడ్డాం కనుక అవకాశమొస్తే మరొకరిని బాధించడం సహజంగా తీసుకుంటారు కొందరు. లేదా ఒక హక్కుగా దాన్ని లాక్కుంటారు; మరికొందరు ఆ బాధలో ఆ కన్నీళ్ళతో తమను తాము శుద్ధి చేసుకుని అట్లాంటి వేదన వేరొకరిని తాకకుండా చూడాలని తపిస్తారు.

ఈ కథలో నాన్న రెండోకోవకి చెందిన హీరో! తనను నమ్మని తండ్రి పెంపకంలో పెరిగి, తనను నెట్టి బ్రతికాలనుకునే తమ్ముళ్ళ స్వభావానికి తట్టుకు నిలబడి, చిన్న ఉద్యోగపు కష్టాలను, అవి మోసుకొచ్చే చేదుతో సహా అనుభవించి కూడా ఆ తండ్రి తన పిల్లలను గెలిపించిన పద్ధతి, ఆ పిల్లల ప్రేమను గెలుచుకున్న పద్ధతి, అది చెప్పేందుకు రచయిత ఎంచుకున్న సందర్భాలు, శైలి ఈ చిన్న పుస్తకాన్ని నిస్సందేహంగా ఒక మంచి రచనగా నిలబెడతాయి. అమ్మా నాన్నా పక్కనుండనిదే ఎక్కడికీ వెళ్ళలేనివాడుగా, ఏ పనీ చేసుకోలేనివాడిగా వయసుకు తగినంతగా బుద్ధి ఎదగని పిల్లాడిగా పెరిగిన సునీల్, తండ్రి ఆసరాతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ గవర్నమెంటు ఉద్యోగాన్ని సాధించడం కన్నా గొప్ప విజయమేముంటుంది? అదిగో, ప్రేమనలా మందులా పూటపూటా ఇచ్చి, పిల్లాణ్ణి బ్రతికించుకున్న తండ్రి కథ కనుక ఈ పుస్తకం ప్రత్యేకం.

ఒక వయసు దాటినవాళ్ళకు, ఈ పుస్తకం హెచ్చరికలా పనిచేస్తుంది. పెద్దవాళ్ళు చుట్టూ ఉన్న పెద్దవాళ్ళనే గమనించుకుంటారు. వాళ్ళ ఆమోదం కోసమే పాకులాడతారు. కానీ ఆడుతూపాడుతూ వాళ్ళ అల్లర్లలో వాళ్ళున్నట్టు కనపడే పిల్లల్లో ఎవరో ఒక్కరు తమ ప్రవర్తనను గమనిస్తున్నారన్న స్పృహ మొదలైతే ఎలా ప్రవర్తిస్తారు? అనే కుతూహలపు ఆలోచనను రేకెత్తిస్తుంది. తండ్రులుగా, తాతలుగా, అమ్మలుగా అక్కలుగా, తమ్ముళ్ళుగా మనం మాట్లాడే నిర్దయాపూరితమైన మాటలూ చేష్టలూ వాటితో నేరుగా సంబంధం లేని మరోతరం పిల్లలను కూడా ప్రభావితం చేస్తాయని గమనించుకుంటున్నామా? బయట ఎట్లాగూ తప్పని పోటీని మన ఇంటి నాలుగు గోడల మధ్యకూ రాకుండా ఆపుతున్నామా? ప్రేమిస్తున్నామా మన పిల్లల్ని? వాళ్ళతో ఏమైనా ఆడుతున్నామా, నడుస్తున్నామా ఆరుబయట వాళ్ళతో? వండి పెడుతున్నామా, కొసరి కొసరి ఆ చిన్న నోళ్ళలో పెద్ద చేతులతో పెడుతున్నామా?

సంప్రదాయం ఉంటే రేపెవరో వెళ్ళిపోయిన ప్రాణానికి పిండం పెడతారు. ఫొటో ముందు పువ్వులు పెట్టి అగరుబత్తులు వెలిగిస్తారు. కానీ ప్రేమతో కృతజ్ఞతతో ఆ చేతులు నమస్కరించాలంటే వెనుక ఎన్ని జ్ఞాపకాలుండాలి! దుఃఖంతో మలిగిపోతూ, మిగిల్చి వెళ్ళిన గుర్తులకు సాగిలపడుతూ తల్చుకోవాలంటే ఎట్లాంటి మనిషిగా జీవించాలి!

ఱ నిరంకుశంగా చెప్తుంది, చావు నిజం. చావు ఎంత నిజమో బ్రతుకూ అంతే నిజమని. హృదయం పొంగిన క్షణాలకూ, పగిలిన క్షణాలకూ లెక్కలు తప్పకుండా ఉంటాయని. దేని లెక్క దానిదేనని.

రచయిత: పాలపర్తి ఇంద్రాణి
ప్రచురణ: జె.వి పబ్లికేషన్స్
ధర: రూ.100/-
ప్రతులకు: జె.వి పబ్లికేషన్స్ మరియు అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు.

ఆజన్మం

 


తెలుగులో బహుశా మునుపెన్నడూ లేనంతగా ఆత్మకథారచనలు వెలువడుతున్న కాలమిది. రచనలు యథేచ్ఛగా ఏ కత్తెర్లూ లేకుండా ప్రచురించుకోగలిగిన సోషల్ మీడియా వెసులుబాటు ఒకటి, ఎవ్వరూ సాహిత్యంగానో, జీవితంగానో గుర్తించి అభినందించని తమ జీవితాలను, తమకు మాత్రమే తెలిసిన జీవితాలను ఇప్పటికైనా సాహిత్యం పేరిట రికార్డ్ చెయ్యాలన్న అస్తిత్వ స్పృహ ఒకటి, ‘నా’ అన్నది ఒక అనివార్యమైన నిజం అన్న ఎరుక ఒకటి, చాలా మంది రచయితలను ఈ రకమైన రచనల వైపు మళ్ళిస్తోంది. ఉద్దేశ్యాలు ఎంత ఉదాత్తమైనవైనా, రచన అనగానే మెదిలే ఒకానొక ఫ్రేమ్‌వర్క్‌ని ఈ సొంతకథలు రాసే కుతూహలమున్న చాలామంది రచయితలు దాటలేకపోతున్నారు. సంఘటనలకు సాధ్యమైనంత డ్రామాని అద్దకపోతే రచన కాలేకపోతుందనే భయాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. ఇవి గాక, వచనాన్ని నిర్వీర్యం చేసే స్వోత్కర్ష పరనిందల మోత ఎలాగూ తప్పదు. వీటన్నింటిని పక్కకు నెడుతూ, ఆజన్మంలో రాజిరెడ్డి వినిపించిన గొంతులోని విలక్షణత ఇదే పద్ధతిలో రచనలు చేస్తున్న సమకాలీనుల్లో కనపడదు. ఈ విలక్షణతకు మూలాలు పుస్తకపు ముందుమాటలో దొరుకుతాయి.

నిజానికి పుస్తకం పేరే ఆత్మకథాత్మక వచనం. రాజిరెడ్డికి సాహిత్యం పట్ల చాలా అభిప్రాయాలున్నాయి. సందేహాలూ ఉన్నాయి. అందుకే ముందుమాటలో అంత వివరంగా చెప్తాడు ఫిక్షన్-నాన్ ఫిక్షన్‌ల పట్ల తన ఆలోచనల ధోరణిని. కథలుగా అనుకున్నవి ఫిక్షన్‌గానూ అలా అనుకోనివి నాన్ ఫిక్షన్‌గానూ రాశానంటాడు. ఏ ఒక్క వాక్యం కలిపినా, ఏ వాక్యానికి ఏ కొద్దిపాటి రంగు అద్దినా నాన్ ఫిక్షన్ అది కాకుండాపోయే ప్రమాదం ఉందని అంటూనే తనదైన రంగు ఏ కొంచెమూ అద్దకుండా ఎవరైనా ఏ విషయమైనా ఎలా చెప్పగలరు? అది వార్తాపత్రికలోని వార్త అయినా, అనీ ప్రశ్నించుకుంటాడు. ఇది రాజిరెడ్డిపై అతని పాత్రికేయవృత్తి ప్రభావం కాదు. అది అతని సహజాతమైన తత్వమీమాంస. అందుకే, ఫిక్షన్ అబద్ధం; కానీ చెప్పాక నిజం అయిపోతుంది. కానీ నాన్ ఫిక్షన్ నిజం; చెప్పాక అది అబద్ధం (ఫిక్షన్) అయిపోతుంది అని అంటాడతను. Fact exists in many forms but fiction exists in one అన్న వెల్చేరు నారాయణరావు మాటలు గుర్తుకొస్తాయి.

వాక్యం పట్ల, వచనం పట్ల, సాహిత్యపు లక్షణం పట్ల ఇంత ఆలోచన, ఇంత విచక్షణ ఉన్నవాడు కాబట్టే నాస్టాల్జియాల వరదలో కొట్టుకుపోవాల్సిన ఈ సొంతకథనాలని, మెలకువ అన్న పట్టుగొమ్మతో కాపాడుకున్నాడు రాజిరెడ్డి. సాహిత్యంలో సాధారణంగా ఇమడవనిపించే క్షణాలను తన చిత్రమైన చూపుతో ఒడుపుగా వచనంలోకి లాక్కొచ్చుకున్నాడు. ఏ డ్రామా కోసం ప్రాకులాడుతూ సజీవ క్షణాలను సాహిత్యకారులు తరచుగా నిర్లక్ష్యం చేస్తారో, ఆ క్షణాల సౌకుమార్యాన్ని, ఆ అనుభూతుల తాలూకు సౌందర్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. గెలిచాడు కూడా. ఇది ఆత్మకథ కాదు. అందువల్ల కొన్ని సంఘటనలను విస్మరించడం లేదు; మరికొన్ని సంఘటనలను పెంచిచూపడమూ లేదు. ఇవి రచయిత జీవితకథలు కావు. జీవితాన్ని నిరాపేక్షతో రచయిత గమనించి నమోదు చేస్తున్న చెల్లాచెదురు సంఘటనలు ఇవి. ఈ కథనాలు అతనివి. కాని ఈ కథనాలు కేవలం అతని గురించి కావు. ఒక గోళంలో ఉంటూనే ఆ గోళం వెలుపలగా నిలబడి దాన్ని గమనించడం అందరికీ చప్పున పట్టుబడే విద్య కాదు.

ఇలాగే ఓ మనిషి గురించి ఆలోచనలో పడ్డ రాజిరెడ్డి అంటాడు, కొన్ని విషయాలు మూడో మనిషి ద్వారా తెలుసుకోవాలనుకునేవి కావని.

రోజూ కామన్ ఏరియాల్లో ఎదురుపడటం మినహా చెప్పుకునేందుకు మరే ఇతర జ్ఞాపకమూ లేకుండా తెగిపోవాల్సిన ఎన్నెన్నో పరిచయాలు మనిషి మనసులో నిజంగా ఏ ముద్రా వెయ్యవా? చూపుల పరిచయమే కావచ్చు, మనసు చొరవగా అవతలి మనిషికి సంబంధించిన మరే సమాచారమూ కోరుకోదా? ఒక మనిషి జీవితంలో స్పష్టంగా వస్తూన్న మార్పు, అది ఆ మనిషిలో తెస్తోన్న మెరుపు అర్థమవుతూ ఉన్నాక, అది కనపడనట్టు, పట్టనట్టు ఉండటమెలాగ?

ఆమె జీవితపు సరంభంలో మిళితం కాగలిగే ఒక చిన్న ఉనికి, ఈ భూమి మీది సకల జీవులతో పంచుకోగలిగే ఒక ఏకత – ఇదీ తనకు కావలసినది. సాటి మనిషి పట్ల, తన గమనింపులోకి వస్తూన్న ప్రపంచం పట్ల, ఈ నిజాయితీతో కూడిన కుతూహలం, మనిషికి స్వభావసిద్ధమనిపించే ప్రేమ -ఇతని కథల్లో (లేదూ, కథనాలలో) స్పష్టమైన రూపు తీసుకుని అందరూ దగ్గర చేసుకునేలా చేస్తాయి.

మానవసహజమైన ఉద్వేగాలు, వాంఛలు వాటి అకల్మష రూపంలో అక్షరాల్లోకి రావడమే రాజిరెడ్డి రచనల్లోని సౌందర్య రహస్యం.

నునుపైన వీపులో, ఆరోగ్యంగా కనపడే జడో, ఊపిరితిత్తులను తాకేలా లాగిన దమ్మో, లోకం దృష్టిలో బలహీనతలుగా గుర్తించబడే ఎన్నో ఊహలను, అలవాట్లను, అనుభవాలను నిస్సంకోచంగా చెప్పుకుంటాడు రాజిరెడ్డి. అయితే, వీటిలో వేటికీ ‘ఎవ్వరినీ సాకుగా చూపెట్టను’ అనగల ధైర్యము, జవాబుదారీతనము రాజిరెడ్డిని జడ్జ్ చెయ్యనీయకపోగా, రచయితకూ పాఠకుడికీ మధ్య ఉండే అరమరికలను, దూరాన్ని మెల్లిగా చెరుపుకుంటూ పోతాయి. రచయిత-రచన-పాఠకుడు అన్న వృత్తాన్ని నిస్సంకోచంగా, నింపాదిగా సాగే ఈ స్వరమే అనాయాసంగా పూర్తిచేస్తుంది.

రాజిరెడ్డి చెప్పేవాటిలో చాలా మటుకు సబ్బునురగలాంటి తేలికపాటి సంగతులే. హేలగా గాలిబుడగలను చిట్లించినంత సరదాగా రాసుకొస్తాడు వాటి గురించి. ఆ సంఘటనలు అతి సామ్యానమైనవి, ఏ ప్రత్యేకతా లేనివి, అసలు చెప్పేందుకేమీ లేనివే కూడా కావచ్చు కాక. అతని మాటలనే అరువు తెచ్చుకుంటే ‘ఉత్తి శూన్యమే’. కానీ, శూన్యంలో ఏదీ లేదని ఎలా అనగలం?!

రాజిరెడ్డి చూపు ఎంత ప్రత్యేకమైనదో అంత చురుకైనది. ఎంత సాధారణమైనదో అంత సూటైనది. ప్రత్యేకంగా నిలబెట్టాలని ఎదుటి దానిలో లేని లక్షణమేదీ దానికి ఆపాదించడు. అందరిలా చెప్పినట్టవుతుందని తనది కాని అనుభవాన్ని, అబద్ధంగా మార్చి చెప్పాలనుకోడు. అందుకే, ఆజన్మం చదువుతున్నప్పుడు ‘అందరూ ఇలాగే ఆలోచిస్తారా?’ అనే ఆశ్చర్యం కొన్నిసార్లు, ‘ఇలా అసలెవ్వరైనా చేస్తారా?’ అనే విస్మయం కొన్నిసార్లు మార్చి మార్చి అనుభవంలోకి వస్తూంటుంది పాఠకులకి. జీవితం ఏ లెక్కలకీ, కొలతలకీ అందేది కాదని పదే పదే గుర్తు చేసే ఈ అనూహ్యత ఆజన్మానికి అసలైన ఆకర్షణ.

పుస్తకం: ఆజన్మం
రచన: పూడూరి రాజిరెడ్డి.
ప్రచురణ: కృష్ణకాంత్ ప్రచురణలు, తెనాలి. 2021. ఫోన్: 97055 53567.
వెల: రూ. 280/-
దొరికేచోటు: అనల్ప బుక్ కంపెనీ (ఫోన్: 7093800303); అమెజాన్.ఇన్; నవోదయ బుక్ హౌస్ (ఫోన్: 91-9000413413, 040-24652387); కినిగె.

ఆహ్లాదజనని

 ఆరేళ్ళ క్రితం ఇదే రోజు మధ్యాహ్నం ..కేర్ర్ మంటూ తన్నుకొచ్చాడు ఈ లోకంలోకి..నా లోకంలోకి. ప్రహ్లాద్ అన్న పేరు పెట్టినందుకేనేమో..పోయినేడు పెద్ద ప్రమాదంలో నుండి ఆ నారసింహుడే చేతులతో ఎత్తి పట్టుకున్నట్టు ఏ గట్టి దెబ్బా తగలకుండా పూవులా లేచి నన్ను కరుచుకున్నాడు. ప్రాణం గిలగిల కొట్టుకుని కుదుటపడ్డ చేదుక్షణాలవి. మన అమ్మలూ నాన్నలూ ఈ వయసులో మనని ఎలా పెంచారో అనుకున్నప్పుడు ఏమీ గుర్తు రాదు. ఆలోచిస్తే మాత్రం ఇప్పుడు మనసంతా కృతజ్ఞత తప్ప వేరే భావం రాదు నాకు. 

నా చంటిగుడ్డు అల్లర్ల గురించీ, వాడు సాధించుకొచ్చిన చిట్టీపొట్టీ విజయాల గురించీ, వాడు నేర్చిన కొత్త మాటలో, కొత్త వేషాలో నా మాటల్లో దొర్లినప్పుడల్లా, "అదీ అమ్మంటే. అదీ అమ్మంటే" అంటూ విస్మయంగా అనేవారు మిత్రులొకరు. మా అన్నయ్య కూడా ఇంతేనట, నాకు ఏడాదిన్నర వయసున్నప్పుడు నన్నొక్క ఐదు నిమిషాలు విడిచి బాత్‌రూంకి కూడా వెళ్ళలేకపోయేదట...అని వాళ్ళ అమ్మ కబుర్లలో తమకు గుర్తే లేని బాల్యాన్ని పునశ్చరణ చేసుకునేవారతను.

ప్రహ్లాద్ గురించి ఏం చెప్పినా నా గొంతులో దాగని సంబరాన్ని గుర్తు పడుతూ, అతనే అన్నారొకసారి "ఆహ్లాదజననీ" అని.  ఆ మాటలా మనసులో ముద్రించుకుపోయింది. అటుపైన ఆ పిలుపే అలవాటుగానూ మారింది.

ఈ  కవిత ఎప్పుడో రాసినా, ఈ వారమే సహరిలో ప్రచురింపబడటం,  నా చేత ఈ నాలుగు మాటలూ రాయించేందుకే కాబోలు. ఈ జీవితానికి దక్కిన అతి పెద్ద కాన్క కు..ప్రేమతో...అమ్మ.. 💓


ఆహ్లాదజనని  

ఇన్ని వ్యాకులతల మధ్య
ఒక్క మెచ్చుకోలు చూపై, వాడు
నా బ్రతుకు పుస్తకానికి చివురు రంగులద్దుతాడు.  

ఇన్ని వేసటల ఘడియలను
ఒక్క ముద్దు మందై తడిమి
మళ్ళీ నా రేపటికి కొత్త ఊపిర్లూదుతాడు.

పశ్చాత్తాపాలై కాల్చే పట్టరానికోపాలకు
నిద్రపోయే ముందు కావలింతల కారుణ్యమై
విముక్తగీతాలు ఆలపిస్తాడు.  

విచ్చుకత్తుల్లాంటి విషపుటాలోచనల్నుండి
అమ్మా..! అన్న పిలుపై లాగి
ఆనందోద్విగ్న పతాకలా ఎగరవేస్తాడు.

ఎన్ని ముద్దులు పెట్టినా తీరని ముచ్చటేదో,
మాటల్లో వాడికి చెప్పమంటుంది -

కన్నందుకు కాదురా, నువ్వు
నోరారా అన్నందుకే నేను అమ్మనయ్యానని.
నన్నానుకున్న నిశ్చింతానుభవమై నిద్రించావ్ కనుకే
విచ్చుకునే నీ కలలపూలతోటకు రెప్పవేయని మాలినయ్యానని.  

నేను వదిలేసుకున్న మనుషులు, వద్దనుకున్న పనులు,
మిగుల్చుకోలేని సమయాల కన్నా,  నా చిట్టికన్నా
ఊడిన నీ పంటి సందుల్లో నుండి,
కేరింత నవ్వుల్లో తుళ్ళే తుంపర చూడట్టాన్నే  
నేనెక్కువ ప్రేమిస్తానని.
నిత్యతృప్తలా నిలబడటానికి
నీ ఉనికొక్కటే నాకు సరిపోతుందని.

ఇన్ని వ్యాకులతల మధ్య
ఒక్క మెచ్చుకోలు చూపై, వాడు
నా బ్రతుకు పుస్తకానికి చివురు రంగులద్దుతాడు.  

ఇన్ని వేసటల ఘడియలను
ఒక్క ముద్దు మందై తడిమి
మళ్ళీ నా రేపటికి కొత్త ఊపిర్లూదుతాడు.

పశ్చాత్తాపాలై కాల్చే పట్టరానికోపాలకు
నిద్రపోయే ముందు కావలింతల కారుణ్యమై
విముక్తగీతాలు ఆలపిస్తాడు.  

విచ్చుకత్తుల్లాంటి విషపుటాలోచనల్నుండి
అమ్మా..! అన్న పిలుపై లాగి
ఆనందోద్విగ్న పతాకలా ఎగరవేస్తాడు.

ఎన్ని ముద్దులు పెట్టినా తీరని ముచ్చటేదో,
మాటల్లో వాడికి చెప్పమంటుంది -

కన్నందుకు కాదురా, నువ్వు
నోరారా అన్నందుకే నేను అమ్మనయ్యానని.
నన్నానుకున్న నిశ్చింతానుభవమై నిద్రించావ్ కనుకే
విచ్చుకునే నీ కలలపూలతోటకు రెప్పవేయని మాలినయ్యానని.  

నేను వదిలేసుకున్న మనుషులు, వద్దనుకున్న పనులు,
మిగుల్చుకోలేని సమయాల కన్నా,  నా చిట్టికన్నా
ఊడిన నీ పంటి సందుల్లో నుండి,
కేరింత నవ్వుల్లో తుళ్ళే తుంపర చూడట్టాన్నే  
నేనెక్కువ ప్రేమిస్తానని.
నిత్యతృప్తలా నిలబడటానికి
నీ ఉనికొక్కటే నాకు సరిపోతుందని.

ప్లవ

ప్రేమించు మిత్రమా!

ప్రేమించు రేపటి నీ రోజుని. నీ ఉగాదిని.
నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు
నీ కలలనూ కోర్కెలనూ ప్రేమించుకున్నట్టు
ఇష్టంగా బలంగా నమ్మకంగా ప్రేమించు;
ఆహ్వానించు.

నమ్ము మిత్రమా!
నమ్ము రేపటి నీ రోజుని, నీదైన ఈ ఉగాదిని.
నీ వాకిలిని అయాచితంగా పూదోటగా మార్చే
పసుపుపూల చెట్టుని దిగాలు క్షణాల్లో నమ్మినట్టు
మునిచీకట్లలో కనపడని వెన్నెలదీపాన్ని నమ్మినట్టు
కోప్పడిన అమ్మ లాంటి కాలం, దైవం లాంటి కాలం
మళ్ళీ తానే దగ్గరకు లాక్కుంటుందనీ,
అన్నీ తానై నిన్ను లాలిస్తుందనీ, నమ్ము.

అన్నీ అక్కర్లేదు మిత్రమా, నీకైనా, నాకైనా
ఇరుక వంతెన మీద నడక లాంటిదీ జీవితం,
బరువులు మోసుకునే నడకలో మిగిలేదల్లా- అలసట.
సౌందర్యాన్ని వెదుక్కునే తీరిక లేని వేసట.  

సూర్యచంద్రులొస్తూ వస్తూ ఆకాశంలోని రంగులన్నీ చెరిపేసినట్టు  
సముద్రం ఎప్పటికప్పుడు తీరాన్ని తుడిచేసినట్టు
కలలో హత్తుకున్న అనుభవాన్ని మెలకువలో మర్చిపోయినట్టు
గాయపడ్డ క్షణాలని, దూరమైన బంధాలని
పూర్తి కాని ఆశలని, పూరించుకోలేని దూరాలని
గుండెల్లోని గుబులంత బరువుని
లోయలోకి ఈకని వదిలినట్టు వదిలి

కులాసాగా దాటుదామీ శార్వరీ వంతెన-
అదిగో ప్లవ - చేయందిస్తోంది.

రసానందం

 నా చిట్టి ప్రహ్లాదుడికి ఏడాదీ రెండేళ్ళ వయసున్నప్పుడు..మెత్తగా గుజ్జుగా నోట్లో పెడితే కరిగిపోయేట్టున్నవే తినేవాడు - ఆ ఈడు పిల్లలందరిలాగే.

మధ్యాహ్నం ఓ కునుకు తీసి హాయిగా రెండక్షరాల మాటలేవో వాడిలో వాడే చెప్పుకుంటూ ఉన్నప్పుడు, ఆ కబుర్లలో జత కలిపి ఎత్తుకు బాల్కనీలోకి తెచ్చుకునేదాన్ని. నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని, గిన్నెలోకి తీసుకున్న అరటిపండు గుజ్జునో, పాలసపోటా తొనలనో, మామిడి రసాన్నో, చల్లటి బంగినపల్లి ముక్కలనో ఇంతింతగా నోట్లో పెడుతుంటే, ఇష్టంగా తినేవాడు. మామిడిపండు కంటపడ్డప్పుడల్లా, దానిని తానే స్వయంగా చేతుల్లోకి తీసుకు తినాలన్నది వాడి ఆశగా నాకర్థమవుతూ ఉండేది. ఆ చిట్టి చేతుల్లో పట్టదనీ, ఇల్లూ ఒళ్ళూ ఆగమాగం చేస్తాడనీ తినేత్తక్కువా పూసుకునేదెక్కువా అవుతుందని, ఇచ్చేదాన్ని కాదు. వాడికింకాస్త ఊహ తెలిసి, ఇవ్వకపోతే ఊరుకోనని హఠం చేయడం వచ్చేశాకా, ఓ వేసవి మధ్యాహ్నం చొక్కా విప్పేసి, చేతుల నిండా పట్టేట్టున్న నూజివీడు మామిడి రసం వాడికందించాను. మహదానందంగా అందుకున్నాడు. 

సగం తిన్నాకా ఆయసపడుతూ 

"ఊఁ..ఊఁ..బాందీ అమ్మా.." అని నా మీదకు ఎగబాకిన సంబరపు పసి ముఖం ఇంకా నా కళ్ళ ముందే ఆడుతోంది.

"తియ్యగా ఉందా నాన్నా?" తీపివాసనలు లోపలికంటా పీలుస్తూ అడిగాను

రెండు చేతులూ బార్లా చాచాడు. "చాలా" అన్నట్టు.

"ఏదీ చూడనీ?" మామిడి వాసనల మృదువైన దేహాన్ని హత్తుకుని వాడి బుగ్గల మీదకు వంగాను. 

నాకు నా పిల్లాడే తియ్యగా అనిపించాడంటే ఇంట్లో అందరూ నవ్వేవారు. కళ్ళంతా విప్పార్చుకుని నా మాటలు వినే  తీయతేనియమామిడిపండుగాడు  కూడా.

***

జిహ్వకో రుచి అంటారు కానీ, అమ్మనయ్యాక నా జిహ్వకు రెండు రుచులు. ఏం వండుతోన్నా మనసులో ఇది పిల్లాడి నాల్క మీద ఏం నాట్యాలు చేస్తుందోనన్న ఆలోచన పోదు. ఏ మామిడికాయ పప్పో వండుతున్న రోజు, పప్పు మెదుపుతుంటేనే వాడి లొట్టలు నా ఊహల నిండా తిరుగుతుతాయి. ఆ పులుపుకి వంకర్లు పోయే వాడి ముఖం చూడటానికే కొన్ని ప్రత్యేకం ఏరిఏరి కొనుక్కొస్తాను. అనిల్ వాళ్ళ బావగారు మొన్నొకసారి వారి స్నేహితులు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారని, చూపించడానికి మమ్మల్నందరినీ తీసుకెళ్ళారు. అక్కడి పొలం గట్లన రాలిపడ్డ చిట్టి ఉసిరికాయలను పిల్లలు సంబరంగా ఏరుకున్నారు. పక్కనే పారుతున్న కాలవలో కడిగి నోట్లో వేసుకుంటుంటే, దగ్గరపడ్డ వాడి కనుబొమలూ, మూతపడే కళ్ళూ, ఠ్ఠ్ఛా అన్న చప్పుడుతో నాలుకను అంగిలికి ఆనించి వాడు చేసే శబ్దమూ గమనిస్తూంటేనే పెదాల మీదకో సన్ననినవ్వు పాకేది. మామిడిరసాలు తెస్తే దాని పులుపునీ తీపినీ బేరీజు వేసుకుంటూ ఆ పసిముఖం పడే కష్టాలు చూడటం నాకు మాచెడ్డ సరదా! నిమ్మళపు మధ్యాహ్నాల్లో ఎండల్లోకి పరుగులు తీయకుండా, చల్లటి షరబత్ గ్లాసు ఇస్తే, దానిని అరచేతుల మధ్య బంధించుకుని కుదురుగా చుక్కచుక్కా జుర్రుకునే వాడి తీరికదనం నాలో చిత్రమైన శాంతిని నింపుతుంది. పెసరకట్టు రాత్రుల్లో ఆఖరు ముద్దకు వాడు నా చేయి లాక్కుని వేళ్ళు చప్పరిస్తుంటే, మనసు నిండిపోవడమేమిటో అనుభవమవుతుంది. వాక్కాయ ముక్కలో, మెంతికాయ తుడిచిన ముక్కలో వాడు అదాటున అందుకుని నోటపెట్టుకుంటే రసాలూరే వాడి ఎర్రెర్ర పెదవులు పిండి ముద్దాడడం - అమ్మనయినందుకు మాత్రమే దక్కిన భోగం కనుక ఈ జీవితానికి మోకరిల్లాలనిపిస్తుంది.

***

"ఇంక చాలమ్మా..."

"ఈ ఒక్క ముద్దే కన్నా..."

"ఊహూఁ.."

"ఆఖరు ముద్దలో అమృతం ఉంటుందని చెప్పానా లేదా...తిప్పకలా మెడా..."

"కాం పెడుతోందీ..."

"ప్చ్..ఏయ్..? ఒక్క ముద్దే నాన్నా.."

"నిజమమ్మా..హా హా...మంటా.."

"ఒరే పెరుగన్నంరా ఇదీ.."

"అందుకే కాం..నాకిదొద్దసలు.."

"వేషాలమారి!! పెరుగన్నం కారంగా ఉంటుందా ఎక్కడైనా?"

"నువ్వు చేస్తే ఉందిగా"

"ఓహో..సరే, కాస్త తేనే, పంచదారా కలిపితే తియ్యనవుతుందా, తెచ్చేదా అయ్యగారికి?"

"అవి కాదు.."

"మరి?"

".."

"చెప్పూ..."

"..ఆవకాయ పెచ్చు తేమ్మా"

"!!!!"

"ప్లీజ్ మా...నువ్వు లే ముందు..తేమ్మా..తేమ్మా వెళ్ళీ..."


***


* తొలిప్రచురణ మామ్స్‌ప్రెస్సో తెలుగు ఎడిషన్‌లో.. 

 


నీ పలకరింపుతో మేల్కొన్న రోజు

 "బుల్లి లాంతర్.." పాటనో

మురాకామి మాటల మూటనో

ఇంకో కాలం నుండి ఇదే రోజుని

గూగుల్ ఫొటోస్ గుర్తుచేసిన జ్ఞాపకంగానో

ఉదయపు పలకరింపుకి వంకగా చూపించి

దూరాలకో తీపిగాటు పెడతావు.  


ఊబిలాంటి నా దైనందిన జీవితం

నీకు ఆత్మీయకరచాలనం చేసేలోపే

ఈడ్చుకుపోతుంది


వక్తాశ్రోతా నువ్వూనేనూ

ద్వంద్వాలను ద్వేషించే మనసు

నువు పంపిన సందేశాల మీదుగా

నిను దగ్గరకు లాక్కుంటుంది.

రోజంతా యథేచ్ఛగా మాట్లాడుకుంటుంది.  

పాటా మాటా జ్ఞాపకం -  

నెపమై మనని కలిపినదేదైనా

ఇద్దరి మధ్యా నలిగీనలిగీ

తనదైన ఉనికిని వదిలేసుకుంటుంది.  


దీపాలార్పి పడకింటిలోకి నడుస్తూ

చిరుకాంతి కోసం ఫోన్ తడుముకుంటున్నప్పుడు

నా స్పందన కోసం నువ్వక్కడే

ఓ ప్రశ్నార్థకమై ఎదురుచూస్తూ కనపడతావు

నా చీకటి క్షణాల్లోకి మళ్ళీ

బుల్లిలాంతరు వెలుగు తోసుకొస్తుంది.

మూతలు పడుతున్న రెప్పల వెనుక, నీతో

మరో సుదీర్ఘ సంభాషణ మొదలవుతుంది.  

                                                                                                        * తొలిప్రచురణ : ఆంధ్రజ్యోతి వివిధలో..


ఈ పెంజీకటి కావల..

 జగమొండి ఏడాది 2020. పంతం పట్టి, అందరినీ ఏవో తలుపుల వెనక్కు నెట్టిగానీ శాంతించని రాకాసి. మానవాళి ఇన్నేళ్ళుగా సామూహికంగా పోగేసిన పాపరాశి కూడా. ప్రాయశ్చిత్తాలకు, ప్రార్థనకు, బాధ్యతాయుతప్రవర్తనకీ, నియమబద్ధజీవితానికి చలించి కరుణించిన దయావారాశి కూడా ఇదే. ఊరికే పడి ఉండే టెర్రాస్‌లను తోటలుగా, వెన్నెలరాత్రుల విడిదిగా, ఇంటిల్లిపాదీ కలిసి కూర్చునే విహారస్థలిగా మార్చిందీ ఇదే కదా! ఉద్యోగంలో చేరినప్పటినుండీ తీర్చుకోలేకపోయిన ఎన్నో చిట్టిపొట్టి కోర్కెలను వర్క్-ఫ్రం-హోం పేరిట తీర్చిందీ ఈ ఏడే కదా! బార్బిక్యూల్లో ఉత్తపుణ్యానికి తగలేసే డబ్బులిప్పుడు అవసరాల్లోని మనుషులకు ఉపయోగపడుతుంటే ఎంత తృప్తి. ఇష్టమైన మనుషులతోనూ, ఇష్టమైన వ్యాపకాలతోనూ అక్కర్లేని రొదలకు ఆవలగా గడుపుతుంటే ఎంత శాంతి. నేర్చుకున్న పాఠాలు దీపాలై దారిచూపిస్తే 2021 వెలుగే నింపుతుంది. కాలం భగవద్స్వరూపం. లోకానికి తల్లీతండ్రీ అయిన శ్రీహరి బిడ్డల మీద కోపంతో ఎన్నాళ్ళుంటాడు? పెంజీకటి తావుల కావలి వెలుగై 2021ఐ అతనే తిరిగి మనని దగ్గరకు తీసుకుని ఊరడిస్తాడు  

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....