కడుపు నిండిన మధ్యాహ్నమొకటి..

ఆఫీసులో pantry వైపుకు వెళితే, అక్కడ కొంచం పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు housekeeping staff ఎప్పుడూ ఏవో పనులు చేసుకుంటూ కనపడుతూనే ఉంటారు. తెలుగువాళ్ళు మొహాలను చూసే ఒకరినొకరు గుర్తుపడతారనుకుంటాను. ఒకావిడ నన్నెప్పుడూ టైం ఎంతయింది మేడం ..అని పలకరిస్తూ ఉంటుంది. భోజనం చేశారా, టైం ఎంత - ఈ రెండే ఆవిడ ప్రశ్నలు. చక్కగా స్టెప్స్ వేసి కట్టుకునే సిల్కు చీరలతో, ముడితో, పెద్ద బొట్టుతో..బాగుంటుంది.
ఈ రోజు లంచ్ టైంలో ఇక వెళ్దాం అనుకుంటూండగా పది నిముషాల్లో జాయిన్ అవ్వాలి అంటూ meeting invite ఒకటి వచ్చింది. కాదనలేనిది, ముందువెనుకలకు జరపలేనిది. తప్పదురా దేవుడా అనుకుంటూ, అప్పుడే ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతూ pantry వైపుకి వెళ్ళిపోయాను. ఆవిడ ఉన్నారు, ఎప్పటిలాగే, నవ్వు మొహంతో. పక్కకు ఒద్దికగా జరిగి నిలబడి, కొట్టొచ్చినట్టు కనపడే ఆకుపచ్చ నాప్‌కిన్‌తో కాఫీ మగ్స్ తుడుస్తూ. నేను మాట్లాడాల్సిన నాలుగు ముక్కలూ మాట్లాడి, - ఇక మీటింగ్ ఉందనీ, మళ్ళీ ఎప్పుడైతే అప్పుడు లంచ్ కి బయటకి వచ్చినప్పుడు ఫోన్ చేస్తాననీ చెప్పి - పెట్టేశాను. హడావుడిగా అక్కడున్న బిస్కట్స్ తీసుకుని, వాటర్‌బాటిల్ నింపుకుని వెనక్కి రాబోతుంటే, వెనుక నుండి "ప్చ్.." అంటూ ఏదో వినపడీ వినపడని శబ్దం. చప్పున వెనక్కి తిరిగి చూశాను - ఆవిడ చేసే పని ఆపి నన్నే చూస్తోంది. "సారీ, టైమే కదా..ఒకటవుతోంది.." నా నోటిలో మాటింకా పూర్తవనే లేదు.."ఇంకో రెండు బిస్కట్లు తీసుకు పో మేడం.." అందామె అలాగే చూస్తూ, కొంచం భయం అంటిన కళ్ళతో..

తొట్ట తొలి హీరో!

JustBake మా ఇంటి దగ్గర్లో..నాలుగు అడుగుల దూరంలో ఉంటుంది. కొన్నాళ్ళ క్రిందట, అక్కడ ఒక కేక్ తీసుకోవడానికి వెళ్ళాను. అనిల్ కోసం.
ఆగస్టు పదిహేనున కూడా అపార్ట్మెంట్‌లలో కేకులు చిన్నపిల్లల కోసం కట్ చేయించడం తెలుసు నాకు. బహుశా అందుకేమో, చాలా రద్దీగా ఉంది. ఆర్డర్లు తీసుకుంటూ కౌంటర్‌లో వాళ్ళు కూడా హడావుడిగా ఉన్నారు.
నా పక్కనే పొట్టి నిక్కరొకటి వేసుకుని, మెడ పైకి కత్తిరించిన జుట్టుతో ఉన్న ఒకమ్మాయి, వంగి వంగి అద్దాల పైకి ముక్కు పెట్టి అన్ని కేకులూ చూసుకుంటోంది.
"ఇదెంత?" ప్రతి దాన్నీ చూపించి అడుగుతోంది.
KG అయితే?
1/2 KG చాలు?
నాకు కేండిల్స్ అక్కర్లేదు.
ఆ అమ్మాయి ప్రశ్నలు తెగట్లేదు.
కౌంటర్ లో అబ్బాయి విసుగు లేకుండా సమాధానాలిస్తున్నాడు.
మొత్తానికి ఆ నాజూకు చూపుడువేలు ఒకదాని మీద స్థిరపడింది. అరకేజీ చాలని చెప్పింది.
15 వ తారీఖు రాత్రికి వచ్చి తీసుకుంటాననీ, వచ్చేటప్పటికి ఏడవుతుందనీ - షాప్ మూసెయ్యద్దనీ చెప్తోంది.
నేను తల తిప్పి నేరుగా ఆమెను చూడకుండానే వింటున్నాను అన్నీ.
కౌంటర్ లో అబ్బాయి నా వైపు చూశాడు.
అదే కేక్ నాకూ, అరకేజీనే కావాలనీ, నేను అదే టైంకీ వస్తాననీ చెప్పాను. అన్నీ రాసుకున్నాడు.
"ఏం రాయాలి?" అడిగాడా అబ్బాయి.
నేను చెప్పాను.
ఆ అమ్మాయి వైపు చూశాను.
"To the best Dad in the world"
గర్వంగా చెప్పింది.
is it your husband's birthday? నా వైపు తిరిగింది.
చక్రాల్లాంటి కళ్ళు. పల్చని చెంపలు.
తలూపాను.
సర్ప్రైజ్ పార్టీ?
కాదని చెప్పాను. పెళ్ళైన మొదటి ఏడు ఉంటుందేమో కానీ, ఆ తరువాత ఇదొక అలవాటైన వ్యవహారమే. అటుపైన ఇచ్చేదేమన్నా ఉంటే అది కాస్త ఆశ్చర్యమేమో కానీ..కేక్ - కాదు. తెలిసిన వాళ్ళు ముగ్గురో నలుగురో రాకపోరు. వాళ్ళ కోసం ఇది...
షాపంతా ఆ మూల నుండి ఈ మూలకు నడిచి చూసింది.. జేబుల్లో చేతులు పెట్టుకుని, నా దగ్గర ఆగి చెప్పింది..
తను వేసిన పెయింటింగ్ అమ్మితే వచ్చిన 650/- రూపాయలతో కేక్ కొంటున్నాననీ....వాళ్ళ నాన్నకు తన బొమ్మ అమ్మకానికి పెట్టినట్టు కూడా తెలియదని, మురుస్తూ మురుస్తూ, ముద్దొచ్చే అతిశయంతో, ఆ వయసు పిల్లలకి ఇంకాస్త అందానిచ్చే అతిశయంతో, చెప్పుకుపోయింది... అది తానిచ్చే మొట్టమొదటి సర్ప్రైజ్ పార్టీ అని..
ఎదురుగా ఉన్న అన్ని అద్దాల్లోనూ, నా మొహం నాకే సరిగ్గా కనపడటం లేదు.
అక్కడ పని అయిపోయాక, పాల పేకట్లు తీసుకుని ఇంటికి వచ్చేశాను. నాన్నగారు కులాసాగా కూర్చుని Sudoku ఆడుకుంటున్నారు.
వెళ్ళి పక్కన కూర్చున్నాను. ఆగి ఆలోచిస్తుంటే, సరిచెయ్యబోయాను.
చగ్గా వెనక్కి లాక్కుని దాచుకున్నారు...
**
పాలు గిన్నెలో పోసి కాచుకుంటున్నాను.
"ఏమంటుందదీ...?" కర్టెన్ వెనుక నుండీ అమ్మను అడుగుతున్న గొంతు..
"నాకేం తెలుసు, ఇప్పుడేగా అదసలు ఇంటికి చేరిందీ..?"
**
జరిగి ఆరు నెలలు కావస్తోంది..ఆ మెరుపుకళ్ళ పాపాయి ఆ దారి వెంట నడిచినప్పుడల్లా గుర్తొస్తూనే ఉంటుంది. వెళ్ళే ముందు, "మళ్ళీ కలుద్దాం" అని మాటవరసకైనా చెప్పుకోలేదే..ఆ పిల్ల నా వెంటెందుకు పడుతుందో...నాకసలు అర్థమే కాదు.
*

ఏడు పుస్తకాల అట్టలు - నచ్చని ఆట- నాలుగు మాటలు

ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో నచ్చిన ఏడు పుస్తకాల అట్టలు పోస్ట్ చేయడమనే ఆట నడుస్తోంది. అక్కడా కాస్త కలుపుగోలుగా తిరిగే చదువరులకు ఆ ఆటా, వివరం తెలిసే ఉంటాయి కానీ, కొరుకుడుపడని ఆ ఆట గురించి నా నాలుగు మాటలూ..
*

అసలు పుస్తకాలకి ఒక్క లోపలి అక్షరాల వల్లేనా అంత అందమూ, ఆకర్షణా, ఆదరణానూ? పోనీ, అట్ట మీద బొమ్మల వల్లా?
మనకిష్టమైన రచయిత మనకళ్ళ ముందే కొత్త పుస్తకాలు ప్రచురిస్తున్నా, అవే మునుపటి పుస్తకాల కన్నా అన్ని రకాలుగానూ ఉత్తమమైనవని మనకి తెలుస్తూనే ఉన్నా, ఆ పాత పుస్తకాల అట్టలనే మళ్ళీ మళ్ళీ అతికించుకుంటూ, అట్టలేసుకుంటూ ఎందుకు భద్రంగా కాపాడుకుంటాం? జీవనశకలమొకటి ఆ రంగుమార్చుకున్న కాగితాల మధ్యన చిక్కుబడిపోయి ఉందనీ, అది భద్రమైనన్నాళ్ళూ, మన పసితనమో, యవ్వనమో, మనమో, మన ప్రియమైనవాళ్ళో భద్రమనీ, లోలోపల మనకొక నమ్మకం. ఏవీ అర్థమవ్వని పుస్తకాలుంటాయి, అయినా అవి మన పుస్తకాల అరల్లో కళ్ళకెదురుగా కనపడడం మానవు. అవి అర్థమవ్వడం కాదు మనకు ముఖ్యం, అవి మనవిగా ఉండటం. మనని జీవితకాలమంతా అంటిపెట్టుకునే ఉండటం. ఒకే పుస్తకం పది ప్రచురణలకు నోచుకుంటుంది. బ్రతికున్న రచయితలైతే తప్పులొప్పుకుని దిద్దుకుని మరీ ప్రచురిస్తారు. మనకి సంబంధం ఉండదు. మనదైన ఒకనాటి పుస్తకమే ముద్దు మనకి. ఆ పుస్తకాన్ని అందుకున్న మరి కొన్ని చేతులో లేదా కోరి ఇచ్చిన మరో రెండు చేతులో ఆ పుస్తకం చుట్టూ గాల్లో గీసిన రేఖల్లా, అదృశ్యంగా ఉంటూ మనకొక్కరికే కనబడుతూంటాయ్. ఆ పుస్తకంలో దాచుకు చదువుకున్న ఉత్తరాలో, జ్ఞాపకాలో, అక్కడే ఎండిపోయిన కొన్ని కన్నీటి చారికలో.. కాగితాలను ముట్టుకుంది మొదలూ మూసే వరకూ ప్రాణం తెచ్చుకుని మళ్ళీ మన చుట్టూ గిరికీలు కొట్టి పోతాయి.
"ఇందులో అమ్మాయి అచ్చం నీలానే ఉంటుంది తెల్సా.." అని కవ్వించి మనకి పుస్తకాల నిచ్చిన నేస్తాల వల్ల కదా అవి ప్రియం? "ఇదేమి జీవితం?" అని నివ్వెరపోయేలా చేసిన మనుషుల అనుభవాల వల్లా అది ప్రియమే. "ఇట్లాంటివన్నీ తట్టుకునీ లేచిన జనులున్నారా లోకంలో?" అని ఊపిరి తీసుకునే ధైర్యాన్నిచ్చినందుకూ అవి ప్రియాతి ప్రియం. నమ్మలేనంత దగ్గరగా, మనల్ని పోలిన మనుషులని కాల్పనిక జగత్తులో బొమ్మ గీసి చూపించినందుకూ, చెప్పలేనంత ప్రేమని, అకారణంగా గుమ్మరించిపోయిన ఆ మంత్రనగరిలోని మనుష్యులను మనం కోరినప్పుడల్లా కళ్ళ ముందు నిలబెట్టినందుకూ ప్రియం. నిదురలో కలవరించి మగతలోనే మర్చిపోయిన పదాలను, పగటి పద్యాలుగా మరెవరో మార్చి పాడి వినిపించినందుకు గుండెలకు హత్తుకుంటాం.
రెండు టీ చుక్కల మధ్యా, పిల్లవాడి చొక్కా గుండీల మధ్యా, మనవి కాక వెళ్ళిపోయిన రెండు బస్సుల మధ్యా, మొత్తం మనదే అయిన రైలుబండి చక్రాల మధ్యా, మనం వెదుక్కు సాధించుకునే విరామక్షణాల మధ్యా, చుక్కల మధ్యా, వెలుగూ చీకట్ల మధ్యా, మూసుకున్న దారుల మధ్యా, తెరవలేని తలుపుల మధ్యా, - తాకితే చాలు,మన ఒళ్ళో రెక్కలు విదుల్చుకు వాలే అచ్చులూ, హల్లులూ..పుస్తకాలూ..ఎవరికెందుకు ప్రియమో తెలుసుకోవాలని ఎవరికుండదు? అక్షరాలే కొలమానమైతే ఏ పుస్తకమైనా ఎవ్వరికైనా ఒకేలా చేరుతుంది, కానీ మనం తక్కెట్లో ఒక జీవితాన్నీ, ఒక మనసునీ, ఒక పుస్తకాన్ని ముడి వేసి కదా పెడుతున్నాం. ఏ జీవితాన్ని అడ్డం పెట్టి చూస్తామో, ఏ మనసును వెనకేసుకొస్తూ చూస్తామో..అవీ, తూకానికి నిలబడేది.ఆ చేరికలో ఎవరు పొందినదేమిటో తరచి చూసుకు పంచుకోవద్దంటే, - ఇంకెక్కడి సంబరం?

సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ

ప్రస్తుతం విమర్శ అన్న పదాన్ని మనం criticism– ఒక సృజనను విశ్లేషించి మంచిచెడ్డలు ఎంచడం– అన్న అర్థంలో వాడుతున్నాం. ఇది పాశ్చాత్య ప్రభావం వల్ల ఆంగ్లేయుల పాలన తరువాత మనం కొత్తగా అలవాటు చేసుకున్నది. అంతకు ముందు మనం విమర్శ అన్న పదాన్ని ఈ అర్థంలో వాడలేదు. పూర్వకవులు ఒక రచనను సవిస్తరంగా పరిశీలించి, వివరించి చెప్తూ వ్యాఖ్య అని రాసేవారు. (ఉదా: మల్లినాథసూరి వ్యాఖ్యలు) ఇప్పుడు మనకున్న ఈ critical evaluation అన్న విమర్శ పద్ధతి మనకు మొదటినుంచీ అలవాటైన పద్ధతి కాదు.
ప్రస్తుతం తెలుగు సాహిత్యరంగంలో విమర్శ కనిపించటం లేదు అని తరచూ వినపడుతున్న మాటకు కారణాలు ఆలోచిస్తే– తమ విద్వత్ప్రతిభలపై విశ్వాసం హద్దులు దాటి వున్న రచయితలు పొగడ్తలు మినహా మరేమీ తీసుకోలేకపోవడం మొదలుకుని, సాహిత్యేతరకారణాలు, స్పర్థలు, విభేదాల వల్ల కావ్యవిమర్శను కవివిమర్శగా దూషణలతో అలంకరించి, తమ అభిప్రాయాలను సాహిత్యసత్యాలుగా ప్రకటించి విమర్శ అన్న పదానికి చెడ్డపేరు తెచ్చిన విశ్లేషకులు, వ్యాఖ్యాతల వరకూ- ఎన్నో కనపడతాయి.
కారణాలేమైనా, విమర్శ అన్న పదానికి తప్పులెన్నడం అన్న అర్థం ఇటీవలి కాలంలో స్థిరపడిపోయింది కానీ నిజానికి విమర్శ అన్నది సునిశితమైన పరిశీలన. సంయమనంతో, నిరాపేక్షగా విమర్శ చేయడం విమర్శకునికి ఎంత ముఖ్యమో, దానిని అంతే నిరాపేక్షగా తన సృజనకు దక్కిన అభినందనగా స్వీకరించవలసిన బాధ్యత సృజనకారునిది కూడా. ఈ రకమైన సుహృద్భావ వాతావరణం ఏర్పడాలి అంటే ముందు మనకంటూ విమర్శాపద్ధతులు ఏర్పరచుకోవాలి. ఏది మంచి విమర్శ, ఏది కాదు అని నిర్ణయించే ముందు, విమర్శ అంటే ఏమిటో నిర్వచించి వివరించగలగాలి. ఆ ప్రతిపాదనలు తప్పు అని ఇంకొకరు నిరూపించవచ్చు. ఒకవేళ అదే జరిగితే, ఏది తప్పు ఏది ఒప్పు అని చర్చించడం ద్వారానైనా విమర్శాపద్ధతికి ఒక చక్కటి ఉదాహరణగా నిలబడే అవకాశమూ ఉంది. ఇదే ప్రధాన ఉద్దేశ్యంగా, ఈ వ్యాసం ద్వారా నా దృష్టిలో విమర్శ అంటే ఏమిటి, అది ఎలా ఉండాలి అన్నది కొన్ని ఉదాహరణలతో వివరించి, ప్రస్తుత విమర్శ పరిస్థితి, అది మెరుగుపడే మార్గాలను స్పష్టపరిచే ప్రయత్నం చేస్తాను.

విమర్శ అంటే ఏమిటి?

విమర్శ అంటే ఒక సృజన యొక్క విశ్లేషణాత్మక పరిశీలన అని నిర్వచించుకుందాం. సృజన అంటే ఏమిటి? తన అనుభూతులకు, అనుభవాలకు, ఆలోచనలకు, ఒక కళాకారుడు ఇచ్చే రూపం సృజన. ఇది శిల్పం, వర్ణ చిత్రం, సంగీతం, సాహిత్యం ఇలా ఎన్నో లలిత కళారూపాల్లో ప్రకటితమవుతుంది. సాహిత్యవిమర్శ గురించి చర్చిస్తున్నాము కనుక, ఇప్పుడు మనముందున్న మొదటి ప్రశ్న: సాహిత్యాన్ని ఎలా పరిశీలించాలి? ఎలా అర్థం చేసుకోవాలి?
ఏ రచనకైనా ఒక పరిధి, సందర్భం ఉంటాయి. ఏ సాహిత్యవిమర్శ అయినా తాను విమర్శిస్తున్న రచన యొక్క పరిధి, సందర్భాలను దాటి ఆ రచనను తప్పుగానో ఒప్పుగానో నిర్ణయించకూడదు. ఒక్కొక్కసారి పరిధి సందర్భం ఒకటే కావడం కద్దు. ఐతే, ఈ పరిధి, సందర్భం ఏమిటి?
ప్రతి రచనా తనకంటూ ఒక లోకాన్ని సృష్టించుకుంటుంది. మన భౌతిక ప్రపంచం కొన్ని నియమాలు, ధర్మాల మీద ఆధారపడి ఉన్నట్టే ఒక రచనాలోకం కూడా కొన్ని ధర్మాలు, నియమాల ఆధారంగా నిర్మించబడి వుంటుంది. అవి మన ప్రపంచపు ధర్మాలే కావాలని కూడా నియమమేమీలేదు. రచనాలోకపు నియమాలు అభూత కల్పనలూ కావచ్చును. ఐతే ఒకసారి నిర్మించబడ్డాక ఈ భౌతిక ప్రపంచంలానే ఆ రచనాలోకం కూడానూ ఆ నియమాలననురించి ఒక తర్కబద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఇది ఆ రచన పరిధి. ఒక రచన, ఇలా తన రచనాలోకపు ధర్మాలకు కట్టుబడి వున్నదా లేదా అని చూడడం ఒక రచనను ఆ రచన పరిధిలో పరిశీలించడం అవుతుంది. ఉదాహరణకి, సైన్స్‌ ఫిక్షన్‌ రచనలో టైమ్‌ ట్రావెల్‌ ఒక అంగీకరింపబడిన సత్యం. అలాంటి రచనను టైమ్‌‌ ట్రావెల్‌ అనేది లేదు అది కేవలం కల్పన అనే ప్రాతిపదికన పరిశీలించబోవడం, ఆ రచనను దాని పరిధి దాటి పరిశీలించడం అవుతుంది. హాస్యం ప్రధానోద్దేశమైన రచనలో సామాజిక సందేశం వెతకడం ఇలాంటిదే. ఎంచుకున్న ఆవరణం, శైలి, శిల్పం తదితర సాహిత్య పరికరాలన్నీ కూడానూ ఒక రచన తన పరిధిలో ఎంత సహజంగా పటిష్టంగా ఇమిడిందో లేదా ఇమడలేదో చూపిస్తాయి.
కళాసృజన ఏకాంతంలో సాగే స్వార్థపూరిత ప్రక్రియే అయినప్పటికీ దాని అంతిమ లక్ష్యం ఇతరులతో పంచుకోబడటం. ప్రతి రచన, రచయిత అంతర్‌ప్రపంచంతోనో బాహ్యప్రపంచంతోనో ముడిపడి ఉంటుంది. ఏదో ఒక స్థాయిలో ఆ రచనాలోకం, పాఠకలోకంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ సంబంధాన్నే సందర్భం అని పిలుస్తున్నాను. అంటే ఒక రచన తను ఉన్న సమాజంతో ఏ రకమైన సంబంధాన్ని కలిగివుంది లేదా ఆ సమాజంలో ఏ విధమైన పాత్ర పోషిస్తున్నది? అప్పటికి ఉన్న సాహిత్యంలోనూ, సమాజంలోనూ ఏ రకంగా అంతర్భాగం అవుతున్నది? అని పరిశీలించడం ఆ రచన సందర్భాన్ని అంచనా వేయడం అవుతుంది. ఉదాహరణకి సూరన కళాపూర్ణోదయం యొక్క ప్రశస్తి, అందులోని వర్ణనలకే పరిమితం కాదనీ, మన దేశంలో ఆ కాలానికి వాడుకలో లేని ఆధునిక నవలా సాహిత్య లక్షణాలన్నీ అందులో ఉన్నాయనీ, ఆ రకంగా ఆ కావ్యం సాహిత్య చరిత్రనే కాదు, సాహిత్యం ఆధారంగా మన దేశచరిత్రనే పునఃపరిశీలించడానికి ఆస్కారం ఇచ్చిందనీ చెప్పడం– ఆ రచన సామాజిక, సాహిత్య చరిత్రలో ఎక్కడ ఒదుగుతోందో వెల్చేరు నారాయణరావుగారు[1] విశ్లేషించి, వివరించి చూపించడం వల్లే సాధ్యపడింది. రచనా సందర్భమన్నది విమర్శలో ఇందుకే ఒక ముఖ్యభాగం.
రచయిత కర్తవ్యం తన రచనాలోకాన్ని వీలైనంత పకడ్బందీగా సృష్టించటం. విమర్శ పని ఆ ప్రపంచాన్ని, దాని నిర్మాణ కౌశలాన్ని ఆ రచన పరిధీ సందర్భాలను విశ్లేషించి, ఆ రచనను పాఠకుడు మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి తోడ్పడడం.
కథ, కవిత, గేయం, పద్యం– అన్నీ సాహిత్య ప్రక్రియలే అయినా, ప్రస్తుత వ్యాసాన్ని, స్వభావసిద్ధంగా సాంద్రతరమైన కవిత్వం గురించి ప్రధానంగా చర్చిస్తూ కొనసాగిస్తాను.

విమర్శ ఎందుకు కావాలి?

కవిత్వం స్వభావసిద్ధంగా కొంత క్లిష్టంగా ఉంటుంది. మామూలు భాష వేరు, కవిత్వ భాష వేరు. కవిత్వ వ్యాకరణమూ వేరు. కనుక, కవిత్వం పాఠకుడి నుండి మరింత ప్రయత్నాన్ని కోరుతుంది. మనకు ఎప్పటికప్పుడు కవిత్వంలో కొత్త ఉద్యమాలు కనపడుతూ ఉంటాయి. సామాజిక, రాజకీయ ధోరణులు ఆయా కాలాల కవిత్వాలను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా భావానికి సంబంధించో, అభివ్యక్తి మార్గానికి సంబంధించో, అనివార్యమైన మార్పులు పుట్టుకొస్తాయి. కవి ఏ ప్రభావంతో వ్రాసినా, సృజన సంపూర్ణత్వాన్ని పొందేది పాఠకుణ్ణి చేరిన తర్వాతే. పాఠకుడికి అదెలా చేరిందన్న దాని మీదే రచన విలువ నిర్ణయింపబడుతుంది.
రచయిత స్వరం సూటిగా లేని సందర్భాల్లో, ఆ రచన మనం నమ్మే భావజాలాన్నెక్కడో సమర్థిస్తోందన్న ఊహతో పఠనం కొనసాగిస్తాం. కొత్త మార్పులను అవగాహన చేసుకోకుండా, మనం మునుపు చదివిన ధోరణిలోనే చదువుకుపోతుంటాం. అంటే, రచన పరిధిని మనం మన పరిమితుల మేరకు కుదిస్తున్నాం. దానికి లేని లక్షణాలేవో ఆపాదించే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా చేసే ప్రక్రియలో, మనం కొన్నిసార్లు రచన విలువను పెంచుతూండవచ్చు, కొన్నిసార్లు తగ్గించనూ వచ్చు. అంటే రచనలో లేనిది మనం చూసుకుంటున్నాం, ఉన్నదని ఊహించుకుంటున్నాం. సాహిత్యం యొక్క లక్షణం సువ్యాప్తమవడం కనుక, పాఠకులను ఈ ఊహల్లో నుండి మెలకువలోకి తోసేందుకు విమర్శ కావాలి. రచన ఉద్దేశ్యాన్ని విప్పి చెప్పడం రచయిత బాధ్యత కాదు కాబట్టి, ఈ నూతన అభివ్యక్తి మార్గాల ఒరవడిలో పాఠకులు కొట్టుకుపోతున్నప్పుడు, వీరిద్దరి మధ్యా ఒక వారధిని నిర్మించే పనికి పూనుకునేవారు విమర్శకులు. వీళ్లు, ఒకేసారి పాఠక హృదయాన్ని, కవి హృదయాన్ని తమలో నింపుకుని, ఈ ఇద్దరి మధ్యా బంధాన్ని బలీయం చేస్తారు. ఇజాలకు ఆవల నిలబడి, కవిత్వాన్ని శాస్త్రీయంగానూ సహృదయతతోనూ పరిశీలించి, దానిని పాఠకులకు తేలిగ్గా చేరవేసే ప్రయత్నం చేస్తారు. కవిత్వమే లేని ప్రేలాపనల్ని సాహిత్యంలో కలవకుండా అడ్డుకుంటారు.
ఒక సంపుటిలోని కవితలను పేరు పేరునా పేర్కొంటూ, వాటిలోని పంక్తులనే వచనంగా తిప్పి రాయడం, కేవలం ఆ మాటల గురించే మాట్లాడటం పరిచయమే అవుతుంది తప్ప విమర్శ కాదు. ఏ విధమైన వ్యాఖ్యానము, సమర్థన లేకుండా ఒక కవిత్వ సంపుటి తమకు నచ్చిందనో, నచ్చలేదనో చెప్పడం వ్యక్తిగత అభిప్రాయమే అవుతుంది తప్ప, విమర్శ కాదు. ఇలాంటి వ్రాతల వల్ల పాఠకులకుగానీ కవులకుగానీ సాహిత్యానికిగానీ ఏ విధమైన లాభమూ ఉండదు. విమర్శ అన్నది కవిత్వధోరణి పట్ల జరగాలి. ఆ కవిత్వం విడుదలైన స్థలకాలాలతో సహా, ఆ కవిత్వం మొత్తం సాహిత్యంలో ఎక్కడ నిలబడి ఉన్నదో, ఆ ధోరణితో మనకున్న ప్రాచీన, సమకాలీన కవిత్వం ఎటువంటిదో, వాటన్నింటి మధ్యా ఈ కవిత్వం ఎలా, ఎందుకు భిన్నమైనదో గుణదోషాలతో సహా నిష్పక్షపాతంగా చర్చించేందుకూ, కవిత్వ ఉద్దేశ్యం సామాజికమో, రాజకీయమో, వ్యక్తిగతమో, మానసికోల్లాసమో గమనించి, ఒక కళారూపంగా దాని ప్రత్యేకత ఏమిటో విడమరచి చెప్పేందుకూ విమర్శ కావాలి.
కవిత్వంలో కొన్నిసార్లు కొట్టొచ్చినట్టుగా కనపడే శబ్ద సౌందర్యము, లయ, భావుకత వంటివి పాఠకులను తేలిగ్గా, ఊపిరి తీసుకున్నంత సహజంగా, తమ తమ లోకాల్లోకి లాక్కొనిపోతాయి. ఇందుకు భిన్నంగా, కొన్ని రచనారీతులను మనం ఆస్వాదించడానికి, అభినందించడానికి, కొంత పరిశ్రమ అవసరం. ఉదాహరణకి మనమొక గంట శబ్దం విన్నామనుకుందాం, వినగానే గంట శబ్దమని గుర్తుపట్టగల జ్ఞానం మనలో చాలామందికి ఉండవచ్చు. ఆ గంట వీధిలో వెళుతోన్న బండిదా, గుడి గంటా, బడి గంటా, అని గుర్తు పట్టగల వివేచన మాత్రం అన్ని వయసులవారికీ వర్గాలవారికీ ఉండకపోవచ్చు. ఇది వయసును బట్టీ అనుభవాన్ని బట్టీ కలిగే మెలకువ. ఆలయంలో గంట ఓ సత్సంప్రదాయానికి చెందినదనీ, అక్కడ సభక్తితో మెలగాలనీ; ఆంబులెన్స్‌ ఒక ఆందోళనాపూరిత వాతావరణ స్పృహ కలిగిస్తుందనీ, ఈ వివేచనే మనకు చెబుతుంది. ఇతరత్రా సంగీత పరికరాలేవో కాకుండా, ఇక్కడ ప్రత్యేకించి గంటనే ఎందుకు వాడుతున్నారన్నది, ఇదే దారిలో ఎదురయ్యే మరుసటి ప్రశ్న. (ఇది నేను ముందు ప్రస్తావించిన నిర్మాణ కౌశలంలో భాగం.) అప్పుడప్పుడే శబ్దాలనూ వస్తువులనూ గుర్తుపడుతున్న పసివాడికి ఇవన్నీ తెలుస్తాయని అనుకోలేం. ఆ అనుభవమున్న పెద్దలెవరో సందర్భానుసారం ఇవన్నీ విడమరచి చెప్పాలి. నేర్పించాలి. అప్పుడే ఆ ఉద్వేగాలన్నీ సరిగ్గా పరిచయం చేసినవారమవుతాం. వాళ్లలోని సున్నితత్వాన్ని మేల్కొల్పినవారమవుతాం. జాగ్రత్తగా గమనిస్తే, విమర్శకుల పని ఒక స్థాయిలో దీనినే పోలి ఉంటుంది. అందుకే, విస్తృతంగా చదివే విమర్శకులకి సహజంగానే కొన్ని సౌలభ్యాలుంటాయి. వారి పదసంపద బాగుంటుంది. ఏ సందర్భంలో ఏ పదం ఏ అర్థాన్నిస్తుందన్న వివేకం సామాన్య పాఠకులని మించి ఉంటుంది. కనుక కొత్త రచనను చదివినప్పుడు, దాని ప్రత్యేకతను తేలిగ్గా గుర్తుపడతారు. తమ విమర్శ ద్వారా సమకాలీన సాహిత్యంలో ఆ రచన ఎలా రాణిస్తుందో, ఎందుకు రాణిస్తుందో సూటిగా, స్పష్టంగా చెప్పగల్గుతారు. సాహిత్యం యొక్క ఆకాంక్ష మన లోపలి లోకమొకటి విశాలం కావడం, ఆత్మవికాసం, జీవితం పట్ల మనకి మెరుగైన అవగాహన కల్పించడం, మరింత సమర్థవంతంగా జీవితాన్ని అభినందించే మార్గాన్ని చూపడం అనుకుంటే, విమర్శకులు తమ విమర్శ ద్వారా మన ఎదుటనున్న సాహిత్యం దానికెలా దోహదం చేస్తుందో చెబుతారు.

సోదాహరణంగా కవిత్వ విమర్శ

“మాటలన్నీ అయిపోయాక, కలిసి నిద్రలేవడం గురించే చివరగా ఇంకోసారి చెప్పుకుంటాం. మన దేహాల్ని మనమే దూరంగా చూస్తూ మేల్కొనే కల వచ్చిన విషయం మాత్రం దాచేస్తాం. అదే కలలో ఒక ఆకుపచ్చ దుప్పటి మట్టి వేర్లతో మనమీద పరచుకోవడం చూసి ఇష్టంగా నవ్వుకుంటాం. పచ్చికపై రాలే పూల శబ్దాల కింద ఆదమరచి నిద్రపోతాం. ఇక అప్పుడు మనం కలిసే ఉంటాం.” (కవి: బండ్లమూడి స్వాతికుమారి, సంపుటి: ఆవిరి, పు: 63.)
ఇప్పుడు ఎవరైనా- ఆ రచన ఆసాంతమూ చదవనివాళ్లు, ఈ మట్టివేర్లతో ఓ ఆకుపచ్చ దుప్పటి మీద కప్పుకోవడమన్న భావన ఆహ్లాదంగా ఉందనీ, ఇది సౌందర్యమనీ అనుకోవడం కద్దు. సమర్థులైన విమర్శకులు ఇలాంటి వ్యాఖ్యానాన్ని అందించడంతోనో, లేదా దీన్ని ఖండించడంతోనో ఆగిపోరు. ఇక్కడ కవి ఒక సమాధిస్థితిని చెబుతున్నారనీ, తన ప్రియుడు/ ప్రియురాలితో కలిసి మరణించి, తమ శవాలను చూస్తూ తాము కలిసి లేవడం గురించి మాట్లాడుతున్నారనీ, వాళ్ల శవాలు భూస్థాపితం అయ్యాకా, తిరిగి అక్కడ మొలిచే గడ్డి గురించీ, అక్కడి పూలచెట్టు మీద నుండి రాలిపడ్డ పువ్వుల గురించీ మాట్లాడుతున్నారనీ తెలియజేస్తారు. ఇది ప్రాథమికమైన విశ్లేషణ. అంటే, మొదటి చూపులో మనకు ఆహ్లాదంగా కనపడ్డ కల, కలిసి నిదురలేవడం, మట్టివేర్లతో పరచుకున్న ఆకుపచ్చ దుప్పటి, స్వేచ్ఛగా రాలే పూలు– వీటన్నింటినీ అపారమైన దుఃఖాన్ని ప్రకటించడానికే కవి వాడారని మనకు తెలిసిపోయింది. అంటే, కొన్ని పదాలను, వాటి సాధారణ అర్థాలతోనే వాడుతూ కూడా, వాటి కలయిక ద్వారా, అవి సాధారణంగా అందించే ఉద్వేగాలకు పూర్తిగా భిన్నమైన అనుభూతిని కలిగించే ప్రయత్నం చేసింది కవయిత్రి. ఇది, ఇందులో మొదటగా తోచే ప్రత్యేకత.
ఇలా అత్యంత సుకుమారమైన పదాలతోనే అత్యంత వేదనాభరిత కవిత్వం రాసిన కవులు, మన ఆధునిక తెలుగు సాహిత్యంలోనూ ఉన్నారు. కృష్ణశాస్త్రి[2] మనకు చప్పున గుర్తొచ్చే పేరు. అయితే, ఈ కవితలో కనపడుతున్నది విషాదమూ, దిగులూ కూడా! ఈ రెండూ భిన్నమైనవి. దిగులే తొట్టతొలి మాటగా కవిత్వం రాసిన రేవతీదేవి[3], శివలెంక రాజేశ్వరీదేవి[4] మొదలైనవారి కవిత్వం వాళ్ల వాళ్ల ఒంటరితనాలతో ముడిపడి, లోకంలో మరెవ్వరూ అక్కర్లేదన్న నిరాశను ఒకరి గొంతులోనూ, అందరూ హృదయం ఒంపి మాట్లాడితే బాగుండన్న ఆశను మరొకరి గొంతులోనూ వినిపించింది. కానీ, పైన ఉదహరించిన కవిత్వంలోని దిగులు వీటికి భిన్నమైనది. ఇక్కడ, కవి గొంతులో ధ్వని ఆశ. నిరూపణమవుతున్నది మాత్రం నిరాశ. ఇది ఒంటరితనంతో, ప్రేమరాహిత్యంతో నిలువునా కుంగిపోయిన మనసు కథ. ఈ మనసు కోరుకుంటున్నది విముక్తి, శాశ్వతమైన విశ్రాంతి. ఈ విముక్తిలోనే శాంతి దొరుకుతుందని కవి భావన కనుక, అక్కడ ధ్వని ఆశగా మనకు వినపడుతోంది. నిజానికి, ధ్వనిపరంగా ప్రతీ కవిత మనకు ఎంతో కొంత చెబుతుంది.
కొన్ని కవితలు, కేవలం శబ్దచాతుర్యంతోనే మనను కొత్త ఆవరణలోకి తీసుకుపోతాయి. నన్నయ్య నలదమయంతుల దీర్ఘ విరహాన్ని చెప్పిన ‘సలిపిరి దీర్ఘవాసర నిశల్‌ విలసన్నవ నందనంబులన్‌'[5] మొదలుకుని, తిలక్‌ ‘జలజల మని కురిసింది వాన’, పోతనామాత్యుల ‘లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలం బయ్యె…’ వరకూ, శబ్ద ప్రధానమైన కవితలకు మనకెన్నో ఉదాహరణలున్నాయి. వీటిలోని కవితా సౌందర్యమంతా ఈ కవితలు నిర్మింపబడ్డ పదాలు అందించే సంవేదనాత్మక ధ్వనులూ, అవి వ్యక్తం చేసే రూపాల్లోనే ఉందని చెప్పవచ్చు. ఆధునిక కవుల్లో కొందరు, కవిత్వంలో నాదాన్ని, అంత్యప్రాసలనూ కూడా కాదని, కవిత నైరూప్యంగానే ఉండాలనీ, దాని సౌందర్యమంతా అది అందించే భావంతోనే తెలియాలనీ పట్టుబట్టారు. అంటే, అక్కడ భావానికే పెద్దపీట. ఇప్పుడీ నేపథ్యంలో మనం చర్చిస్తున్న కవితను చూస్తే, ఇది ఏ కోవకు చెందిందో స్పష్టంగా చెప్పడం అంత తేలిక కాదు. వాక్యం వెనుక వాక్యం హాయిగా ముగిసే తీరు, సౌమ్యమైన పదాల పోహణింపు ఇది ఒక సౌందర్యాత్మకమైన కవితేనన్న భావన కలిగించినా, కవి పాఠకుడికి చెప్పాలనుకున్న భావం ఆ వాతావరణానికి పూర్తిగా ఆవలి దిక్కున ఉండి, ఒక చేదు అనుభూతినీ బాధనూ మిగుల్చుతోంది. ఇలా ఒకేసారి రెండు భిన్నమైన అనుభవాలను కలిగించడం ద్వారా, ఈ కవిత పాఠకుడిని మలి పఠనాలకు ప్రేరేపిస్తోంది. ఇది, ఈ కవితలోని మరో ప్రత్యేకత.
భావపరంగా, మనకు కొన్ని ఉర్దూ కవితలతో సామ్యం కనపడుతుంది. బాధ ఉంటుందని తెలిసీ కోరుకోవడం, విడిపోవడానికే అయినా కలుసుకోవడం- ఈ విరహం, ఈ ఎదురుచూపు మనకు కొన్ని ఉర్దూ గీతాల్లో కనపడుతుంది.
“एक उम्र से हूँ लज़्ज़त-ए-गिरिया से भी महरूम
ऐ राहत-ए-जाँ मुझ को रुलाने के लिए आ”
విరహవేదన అనుభవించి కూడా చాలా కాలమయింది /ప్రియా, మళ్లీ నన్ను ఏడిపించడానికే ఐనా, రా!— అన్న అహ్మద్‌ ఫరాజ్‌ గజల్‌ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
“My grave will be in a place where every spring the northern winds will shower blossoms.”
వసంత ఋతువుల్లో ఉత్తరగాలులు జల్లే పూవులన్నీ రాలే చోట, నా సమాధి ఉంటుంది[8] అన్న ఉమర్‌ ఖయ్యాం మాటలు అప్రయత్నంగా గుర్తురావడంలో కూడా ఆశ్చర్యమేమీ లేదు. ఇవి ఈ కవిత మనకు పరిచయం చేస్తోన్న కొత్త ప్రపంచం తాలూకు కిటికీలు. (page IX, Introduction; The Nectar of Grace, Omar khayyam’s life and works, by Swami Govinda Tirtha)
అలాగే, ఈ ఆవిరి సంపుటిలో ‘అనుకోకుండా’ సింహభాగం. ఇదే శీర్షిక కింద దాదాపు తొమ్మిది భాగాలు ప్రచురించారు కవి. అంటే, ఈ తొమ్మిదిటినీ కలిపే అంతస్సూత్రమేదో ఉందని అర్థం. ఆ అంతస్సూత్రపు లక్షణాలు మనం పైన చెప్పుకున్న ఒంటరితనం, ప్రేమరాహిత్యం లేదా వైఫల్యం, వేదన, నిరాశ ఇత్యాదులు. ‘అనుకోకుండా’కూ, మిగిలిన వాటికీ శిల్పపరంగా పరిణతి కనపడుతుంది. రచన బట్టి, శిల్పం దానంతటదే రూపుమార్చుకోవడం ఇక్కడ కనపడుతుంది. అత్యంత వైయక్తికమైన కవిత్వం కనుక, అసంబద్ధత అక్కడక్కడా ఇబ్బంది పెడుతుంది. ఒకే శీర్షికలో సాగుతున్నప్పుడు, ఇవి భాగాలుగా ఊహిస్తూ చదువుతున్నప్పుడు, స్వరం మారినప్పుడల్లా ఆ ఇబ్బంది పాఠకులకు తెలుస్తూనే ఉంటుంది. ఉదాహరణకు, ఇవి ఎక్కువ భాగం స్వగతంగానూ, లేదంటే, కేవలం ఆ పాత్ర మాట్లాడదలచిన మరొక్కరితోనూ ముడిపడి ఉన్న సంభాషణలు. ఐతే, జాగ్రత్తగా గమనించినప్పుడు, అక్కడక్కడా మనకో మూడో పాత్ర కూడా కనపడుతుంది. కొన్నిసార్లు ఒకే భాగం రెండు విభాగాలుగా కూడా సాగి, ఒక భాగంలో సంభాషణ, రెండవ భాగంలో స్వగతం కనపడుతుంది. అయితే, మొదటి సంభాషణలో ఉన్న పాత్ర, రెండవ భాగంలో కవి స్వగతంలో ఉద్దేశిస్తున్న పాత్ర ఒకటి కాదు. దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలేవీ వదల్లేదు కనుక, రెండు భాగాల మధ్యా ప్రయాణం అంత సాఫీగా జరగక పాఠకుడికి అసహనాన్ని కలిగిస్తుంది. అలాగే, ప్రతీకలు తేలిగ్గా అందక ఇబ్బంది పెడతాయి. ఉదాహరణకి, ‘మునిగిపోయిన గులక రాయొకటి ఈదుకుంటూ ఒడ్డు చేరినప్పుడు ఉలికిపడకుండా, ఎవరూ చూడకుండా దాన్ని నీ చేతిలో పెట్టి దోసిలి మూసిన గుర్తు. ఇది తీసుకు వెళ్లిపొమ్మని చెయ్యి వదిలినప్పుడు, పదే పదే అదేపనిగా వేళ్లని ముద్దాడాలని గుర్తుకు రాకపోవడమూ గుర్తే.’ అన్న వాక్యంలో మునిగిపోయిన గులకరాయి దేనికి ప్రతీకగా వాడారో తెలుసుకునే అవకాశమేదీ కవితలో కనపడదు. ఈ అస్పష్టతే ఈ కవిత్వాన్ని అందరికీ చేరువ కాకుండా అడ్డుకుంది.
ఇలా, పైన ప్రస్తావించిన వివరాల బట్టి మనకు పొరలుపొరలుగా ఈ కవిత ప్రత్యేకతలు, ఈ కవితతో మిగతా కవిత్వానికి ఉన్న సారూప్యాలు, భేదాలు తెలుస్తున్నాయి. కొంత వివరణ ద్వారా, ఈ కవితను ముందుకన్నా ఎక్కువగా అభినందించగల్గుతున్నాం. విమర్శకులు వదిలిన కొన్ని ఆధారాల ద్వారా, మిగతా భాషల కవిత్వాన్నీ వెదికి చదివే ప్రయత్నం చేస్తున్నాం. ఆ కొత్త కవిత్వం తెరిచిన కిటికీలతో మనం మరో కొత్త ప్రపంచాన్ని చూడటానికి ఉద్యుక్తులమవుతున్నాం. కొత్త రచయితల గురించి కొత్త విశేషాలు తెలుసుకుంటున్నాం. క్లుప్తంగా చెప్పాలంటే, ఈ కవిత్వం పట్లా ఈ తరహా సాహిత్యం పట్లా కవుల పట్లా మనకున్న అవగాహనను పెంచే ప్రయత్నం చేస్తోందీ విమర్శ. ఆవేశంలోనో, అనాలోచితంగానో కవి చేసిన తప్పులను ప్రస్తావించడం ద్వారా, కవి తన మలి రచనల్లో మరింత జాగ్రత్తపడేలానూ చేస్తోంది. తద్వారా, భాష మరింత మెరుగైన సాహిత్యసృజనతో అలరారేందుకు కూడా పరోక్షంగా తోడ్పడుతోంది.
విమర్శ అంటే వీలైనంత వివరంగా రచనను చర్చించడం అనుకున్నాం. రచన అద్దాల మండపం మధ్యలో ఉందని భావించి, వీలైనన్ని ప్రత్యేకమైన కోణాల్లో దర్శింపజేసి, ఆ రచన ప్రత్యేకతనూ పూర్ణత్వాన్నీ స్పష్టంగా చూపించడం విమర్శకుల ధర్మం. అయితే, ఈ క్రమంలో లేని అర్థాలను ప్రతిపాదించడం విమర్శ లక్షణం కాబోదు. రచన ఉద్దేశించని అర్థాలను చూపించడం విమర్శ పని కాదు. విడిగా కొన్ని భాగాలు మనకు కొత్త అర్థాలను ప్రతిపాదించినట్టు అనిపించినా, ఒక రచనగా అది ఏమి చెబుతోందన్నదే విమర్శకుల ఆసక్తి కావాలి. అలా వివరించే క్రమంలో, విమర్శకులు తమ అభిప్రాయం జనబాహుళ్యంలో అప్పటికే ప్రచారంలో ఉన్న అభిప్రాయానికి భిన్నమైనదైనా సరే, ప్రతిపాదించడానికి కూడా వెనుకాడకూడదు. యెఱిగించరే పతికి యీ సుద్దులెల్లాను[11] అన్న అన్నమయ్య కృతికి ప్రతిపాదించబడిన విమర్శ ఇందుకు శ్రేష్టమైన ఉదాహరణ. కనుక ఎన్ని కోణాలున్నాయో అన్నీ చెప్పడం, లేని ఉద్దేశ్యాలేవీ రచనకు ఆపాదించకపోవడం, రెండూ విమర్శకుల కర్తవ్యాలే. ఇవి ఒకదానికొకటి భిన్నంగా కనిపించినా, నిజానికి ఈ వాక్యం సృజనను సృజన పరిధి, సందర్భాలననుసరించే చూడాలన్న మన మొదటి మాటలకు పొడిగింపు.

ప్రస్తుత తెలుగు సాహిత్య విమర్శ స్థితి, మెరుగుపరిచే మార్గాలు

ఇప్పుడు మనకున్న విమర్శ, సాహిత్యాన్ని బట్టి కాక వ్యక్తుల బట్టి ఉండటం విచారకరం. ఒక్కో కవిత్వానికి ఒక్కో ముద్ర వేసి, ఆ ఇజాన్ని భుజాల మీద వేసుకు మోసేవారే ఈ కవిత్వాన్నీ మోయడం, లేదంటే కాదనుకోవడం ఇప్పుడు కనపడుతున్న ప్రమాదకర ధోరణులు. సామాజిక సమస్యల మీద చూపు సారించని సంపుటులను స్వాప్నిక జగత్తుల్లో కవి చేసిన ఆషామాషీ విహారంగా భావించి చిన్నచూపు చూడటమూ; ప్రతీ సమస్యకూ ప్రశ్నగానో, పరిష్కరణగానో, లేదా బాధగానో కవిత్వాన్నే చూపించడమూ రెండూ ప్రబల ధోరణులై, విమర్శకులను కూడా ఏదో ఒక వైపు వచ్చి నిలబడాల్సిందిగా శాసించడం; విమర్శకులూ ఆ తరహాగానే చీలిపోవడం ప్రస్పుటంగా కనపడుతోంది. మనం కవిత్వాన్ని కాక, కవులను చూడటం మొదలెట్టినప్పుడే, కవిత్వంలోని అందాన్ని కాక, అది వినబరిచే ఉద్యమం వైపు మొగ్గు చూపినప్పుడే, విమర్శ పేలవమైపోతుంది. కవిత్వం ఏమైనా చెప్పనివ్వండి, ఏ భావజాలాన్నైనా మోయనివ్వండి, ముందది కవిత్వం అయి తీరాలన్న నిరంకుశ ప్రతిపాదనే మన విమర్శకులు చెయ్యవలసినది. విమర్శకు బదులుగా, అభిప్రాయాలు, సమీక్షలు అన్న పదాలు వాడటం, వాటినే విమర్శగా చలామణీ చేయటం, పత్రికల్లో వీటన్నింటికీ చోటివ్వడంవల్ల, గుణదోషాల చర్చ అన్నది మటుమాయమైపోయింది. అభిప్రాయాలు, సమీక్షలు కేవలం కవిత్వంలోని గొప్పదనాన్నే కీర్తించడం పనిగా పెట్టుకోవడం వల్లనూ, వ్యక్తులతోనో, సమష్టి శక్తులతోనో శతృత్వమెందుకన్న నేటి సమీక్షకుల అతి మంచితనమూ లేదా జాగ్రత్త వల్లనూ, ‘తప్పు లెన్నువాడు తన తప్పులెరుగడు’ అన్న పాఠకుల ఎదురుదాడుల వల్లనూ, ఎక్కడైనా ఏదైనా యథేచ్ఛగా ప్రచురించగల్గిన నేటి ప్రచురణాపద్ధతుల వల్లనూ, ప్రశ్నించి, మాటమాటకూ రచయితను జవాబుదారీ చేసి, నిజాలు, నిరూపణలు లేకుండా ఆరోపణ చెయ్యనివ్వని సమర్థవంతమైన ఎడిటర్లు అటు ప్రింట్‌ మాధ్యమంలోకానీ ఇటు వెబ్‌ పత్రికల్లోకానీ లేకపోవడంవల్లనూ, విమర్శ నానాటికీ నాసిరకంగా తయారవుతోందన్నది కాదనలేని సత్యం. అభిప్రాయాలను వెలువరించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ అన్ని వేళలా ఉంటుందన్న నెపంతో, విపరీత వ్యాఖ్యానం చేయడమెన్నటికీ సద్విమర్శ కాబోదు.
విమర్శ ‘సీరియస్‌ సాహిత్యం’గా పరిగణింపబడాల్సిన అవసరం ఎంతో ఉన్న ఈ కాలంలో, దానిని సగటు పాఠకుడు చదవలేని, చదవాలనుకోని శీర్షికగా గుర్తిస్తున్నారు కొందరు సంపాదకులు. స్వాతి, నవ్య, ఆంధ్రజ్యోతి, ప్రభ– ఇలా తెలుగు పత్రికలు వేటిలోనూ సాహిత్యవిమర్శకు అరపేజీ చోటు కూడా లేదు. దినపత్రికల్లో సాహిత్య పుటల్లో అప్పుడప్పుడూ విమర్శ కనపడినా, ఆ విమర్శకు ప్రతి విమర్శ జరగే వీలున్న సందర్భాల్లోనూ, సమర్థత కలిగిన విమర్శకులు కూడా, ఉత్తరప్రత్యుత్తర వ్యవహారాలకి జడిసి, సామాజిక మాధ్యమాల్లో స్పందన తెలియజేసి ఊరుకుంటున్నారు. పత్రికా ముఖంగా విమర్శను ఖండించడమన్నది చాలా అరుదుగా కనపడుతోంది. ప్రింట్‌ పత్రికలు సైతం, నిర్ణీత వ్యవధిలో మరుసటి సంచిక ప్రచురించాలి గనుక, ముందే ఎంపిక చేసుకున్న రచనలతో పత్రిక విడుదల చేసేస్తున్నారు. వీలువెంబడి పత్రిక ప్రతి విమర్శ ప్రచురించేసరికి, జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. కేటాయించేందుకు తగిన స్థలము, సమయము, లేదా సాంకేతిక వనరుల లేకపోవడాన్ని ఆయా సందర్భాల్లో కారణాలుగా వింటున్నాం. నిడివితో నిమిత్తం లేకుండా, రచయితలకు వ్యాస విస్తరణలో స్వేచ్ఛనిచ్చే పాలపిట్ట వంటి పూర్తి స్థాయి సాహిత్యపత్రికలను ఆర్థిక వనరులు సరిపోక నెలకూ, రెణ్ణెల్లకూ, కుదరనప్పుడు మూడు నెలలకూ పత్రిక ప్రచురిస్తున్నారు. ఇలాంటి పత్రికల ద్వారా సాహిత్యానికి దగ్గరవుదామనుకున్న వాళ్లు, వీటి ప్రచురణలోని నిబద్ధతను ప్రశ్నిస్తూ, చందాలను నిలిపి వేస్తున్నారు. దీనివల్ల పరిస్థితి మరింత విషమిస్తోందే తప్ప మెరుగవ్వడం లేదు. ఇలా, మనకున్న అతి కొద్ది సాహిత్య పత్రికలు కూడా వనరుల లోపం వల్ల మూతబడిపోతున్నాయి. సాహిత్యాన్నే బతికించుకోలేని సమాజం, విమర్శ వైపుకి చూపు సారించలేదు.
అరచేతిలో ఇమిడే ప్రపంచాన్ని అ ఆ ఇ ఈ లు నేర్చిన వారెవ్వరూ వదలాలనుకోని ఈ అంతర్జాలపు రోజుల్లో, మనకు మిగిలున్నది, ఆశ కలిగించగలిగినదీ, ఆశ నిలపగలిగేదీ వెబ్‌ పత్రికలే. సాంకేతిక సహకారం, నిర్వహణావ్యయం హామీగా దొరికితే, ఇవి అందరికీ అన్నివేళలా అందుబాటులో ఉంటాయి. మనకు కావలసినదల్లా నిబద్ధత కలిగిన రచయితలు, రచయితలను స్వలాభం కోసం ఏమార్చని ఎడిటర్లూ. విమర్శ ఎక్కడ దూషణగా మారుతోందో, అక్కడ దాని ప్రచురణ నిల్చిపోవాలి. వేన్నోళ్ల పొగిడినా, వేలెత్తి చూపినా, విమర్శ సాధికారంగా అందుకు తగ్గ కారణాలను ప్రకటించి, వివరించి నిరూపించాలని నియమం పెడితే విమర్శకు విలువ పెరుగుతుంది. విమర్శ, విమర్శకుని అసందర్భ పరిజ్ఞాన ప్రదర్శనకుగాక రచన ప్రత్యేకతను వివరించడమే లక్ష్యంగా సాగాలి. ఏ ప్రత్యేకత, ప్రయోగాత్మకత లేని రచనలు కూడా కొన్నిసార్లు బహుళ ప్రాచుర్యాన్ని పొందడం చూస్తూనే ఉంటాం, ఆయా విజయాలకు కారణాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించకుండా, పాఠకుల విజ్ఞతను ప్రశ్నిస్తూ, పాఠక హృదయాలను గేలిచెయ్యడమూ, రచయిత అసమర్థతను అవహేళన చేయడమూ మాత్రమే ప్రధానోద్దేశ్యంగా విమర్శ సాగకూడదు. విమర్శకు శాస్త్రీయత, సహృదయత ప్రమాణంగా ఉండేలా చూడాలి. సంయమనం కోల్పోయిన విమర్శలను సంపాదకులు గుర్తించి తిరస్కరించాలి. అలాగే, విమర్శ కరినంగా ఉన్న ప్రతిసారీ, వ్యక్తిగత దాడులకు పాల్బడే ఆయా రచయితలనుగానీ, వారి అభిమానులనుగానీ, వారికి మద్దతుగా నిలిచే మరే ఇతర సమూహాలనైనా సరే, నిర్ద్వంద్వంగా చర్చకు ఆవల నిలబెట్టే హక్కును పత్రికలు నిలుపుకోవాలి.
చర్చకూ ప్రశ్నించడానికీ వాదోపవాదాలకూ అవసరమైన వేదికనూ సమయాన్నీ అందరికీ ఇస్తూనే, పరిధి దాటిన వ్యాఖ్యలను నిలిపివేసే బాధ్యతను వారే తీసుకోవాలి. ఇలా చెయ్యడం ద్వారా, సాహిత్య చర్చలు వీధి చివరి కుళాయి వాదనలు కాదనీ, వాటిని బాధ్యతగా, జాగ్రత్తగా నడపాల్సిన అవసరం ఉందనీ తేల్చిచెప్పినవారమవుతాం; ఇక్కడ ఎవ్వరి గౌరవానికీ ఏ రకమైన హానీ ఉండదన్న హామీని కల్గించినవాళ్లమవుతాం. మాట్లాడటం హక్కే కాదు, బాధ్యత కూడా అనుకున్నప్పుడు, మంచి చర్చ జరుగుతుంది. మంచి చర్చల నుండే మంచి విమర్శా పుడుతుంది. విమర్శకు ప్రతివిమర్శ జరిగినప్పుడు, దానికి సాధ్యమైనంతవరకూ అదే పత్రికలో, లేదా అదే చర్చావేదికలో స్థానం కల్గించడం మంచిది. పాఠకులకు భిన్న స్వరాలను నిష్పక్షపాతంగా వినిపించేందుకు, తాము ఏ వైపుకూ మొగ్గకుండా నిలబడతామన్న నైతిక ప్రమాణానికి పత్రికలు అన్ని వేళలా లోబడి ఉండాలి. అధికారం చేతుల్లో ఉన్నవాళ్లు, తమవాళ్లకో, తమ భావజాలానికో వత్తాసు పలుకుతున్నారని, కొందరికి సభల్లోనూ పత్రికల్లోనూ పెద్దపీట వేసి, వాటిపై రానున్న విమర్శకు ఆయాచోట్ల స్థానాన్నీ సమయాన్నీ మిగల్చకపోవడం, సాహిత్యం పట్ల చేస్తున్న నేరమేనని విజ్ఞులైన పాఠకులు తెలుసుకుని ఆ రాజకీయాలను దూరం పెట్టాలి.
సాహిత్యం ఏ వాతావరణంలోనైనా, ఎవ్వరి చేతుల్లోనైనా ప్రాణం పోసుకోగలదు. దానికా అవకాశం ఉంది. కానీ, ఉత్తమసాహిత్యమేదో గుర్తించడం, దానినే ప్రోత్సహించడం కళను నిలబెట్టే దారులు. ఆ పని చెయ్యగలిగింది, విమర్శ ఒక్కటే. దాని నడక ఎటు మళ్లుతోందో వేయికళ్లదో గమనించాల్సిన బాధ్యత సాహిత్యంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ముడిపడ్డ ప్రతి ఒక్కరిదీ.
వ్యాసరచనకు సహకరించిన పుస్తకాలు, ఇతర వివరాలు:
  1. Pingali Surana, Translated by Velcheru Narayana Rao and David Shulman, The Sound of the Kiss, or the Story That Must Never Be Told, Columbia University Press, 2002, Introduction.
  2. కృష్ణశాస్త్రి సాహిత్యము, కృష్ణపక్షము, విశాలంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, డిసెంబరు, 2008.
  3. రేవతీదేవి, శిలాలోలిత, ప్రియబాంధవి ప్రచురణలు, 1981.
  4. శివలెంక రాజేశ్వరీదేవి, సత్యం వద్దు, స్వప్నమే కావాలి, ప్రేమలేఖ ప్రచురణలు, 2016.
  5. నన్నయ్య, కవిత్రయ విరచిత శ్రీమదాంధ్రమహాభారతము, అరణ్య పర్వము, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి ప్రచురణ, 2008, పు: 176.
  6. దేవరకొండ బాలగంగాధర తిలక్‌, అమృతం కురిసిన రాత్రి, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 1968, పు: 9.
  7. బమ్మెర పోతన, భాగవతవము, ఎనిమిదవ స్కంధము, గజేంద్రమోక్షము- పు:176, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి ప్రచురణ, 2010.
  8. అహ్మద్‌ ఫరాజ్‌ గజల్‌ : రంజిష్‌ హీ సహీ.
  9. Swami Govinda Thirtha, “Nectar Of Grace Omar Khayyam’s Life And Works”, Government Central Press, Hyd, 1941, Introduction- LIV, LV.
  10. స్వాతికుమారి బండ్లమూడి, ఆవిరి, జె.వి. పబ్లికేషన్స్‌, 2015, పు: 57.
  11. God on the Hill: Temple Poems from Tirupati, Annamayya (Author), Velcheru Narayana Rao (Translator), David Shulman (Translator), ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌, 2005, SCP 419, 12:63.
 
*తొలి ప్రచురణ : డెట్రాయిట్ సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటిలో

కిటికి లోపల వెన్నెల

రోజూ తినే వేళకే భోజనానికి పిలుస్తూంటే, చిత్రహార్ రోజుల్లో మాత్రం, అక్కా-నేనూ ఇంకో అరగంట గడిస్తే బాగుండని తప్పించుకు తిరిగేవాళ్ళం. అప్పుడైతే, ఆ పాటలు చూస్తూ భోంచెయ్యచ్చని. అలాంటి చిత్రహార్ రోజుల్లోనే, ఓసారి చూశానతన్ని. ఓ అమ్మాయిని ఏదో వేడుకలో చూస్తూ, ఆమె తప్పిపోతే వెదుక్కుంటూ మథనపడిపోతూండగా చూశాను. అమ్మాయేమో సన్నజాజి మొగ్గ. తెల్లటి గాగ్రాలో అతన్ని తప్పించుకుంటూనో తెరచాటుగా చూస్తోనో, కలవరపడిపోతూంటుంది. రెండు చేతుల గాజుల మధ్యగా అతన్నే చూస్తూ దారి మరచి నిలబడిపోవడం, అతడక్కడి స్థంభాన్ని ఎక్కి కొట్టి వెనక్కు మళ్ళడం, తేనెలొలికిన ఆ గాత్రం... - "ఉరికే కసి వయసుకు శాంతం..శాంతం"..- చెవుల్లో ఎవరెన్ని సార్లు చెప్పినా వినపడని వయసు!
ఎన్నడూ లేనిది ఆ రాత్రి అక్క నాతో సఖ్యంగా మాట్లాడింది.
"ఆ అబ్బాయి పేరు అరవిందస్వామి" దుప్పటి ముఖం దాకా కప్పుకుని గుసగుసగా చెప్పింది.
నేను ఆ చీకట్లోనే కళ్ళు పెద్దవి చేసి చూశాను.
కథ చెప్పడం మొదలెట్టింది. బురఖా రేవు దగ్గర ఎగరడం, సైరాభాను మొహం మీదకి లాక్కోవడం, అది గాలికి మళ్ళీ ఎగరడం, మళ్ళీ లాక్కోవడం...వాళ్ళ నాన్న ముందే అతడా అమ్మాయి చేయి పట్టుకోవడం, మణికట్టు దగ్గర గాటు పెట్టడం..
"పడుకోలేదా? ఏంటా గుసగుసలు?" బిట్ పేపర్లు దిద్దుకుని పురికొసతో కట్ట కట్టుకుంటోన్న అమ్మ అనుమానమొచ్చి అడిగింది. మేమిద్దరం కిక్కురుమనలేదు. కిటికీలు గాలికి కొట్టుకోకుండా కొక్కేలు బిగించి వెళ్ళిపోయింది.
ఆ రాత్రి గది నిండా వెన్నెలే!
**
మర్నాడు సమయం చూసి అడిగాను అమ్మని , అక్క సినిమాకు తీసుకెళుతుందీ, డబ్బులివ్వమని. నమ్మలేదసలు. మా చరిత్ర అలాంటిది. అమ్మను నమ్మించడానికి అక్క రాత్రి నాకు కథ చెప్పిందనీ, అది పోయిన వారం వాళ్ళ స్నేహితులతో చూసిన సినిమా ఇదేననీ చెప్పక తప్పలేదు.
చూసేసిన సినిమా మళ్ళీ ఎందుకు చూస్తుందది, ఏం వద్దు - అమ్మ నిర్ణయించేసింది .
"నాకోసం వస్తానంది" బింకంగా చెప్పాను.
ఇంతకీ కథేవిట్టా? రోట్లో పచ్చడికి సిద్ధం చేసుకుంటూ అడిగింది.
"బ్రామ్మలమ్మాయిటమ్మా, బొంబాయిలో పనిచేసే ముస్లిం అబ్బాయితో పారిపోతుందిట...పెళ్ళి కూడా చేసుకుంటారట..అప్పుడేమో..."
మొహం చిట్లించి మా మాటలన్నీ వింటోన్న అమ్మమ్మ, పక్క నుండీ రోట్లో మరో పది పచ్చిమిరపకాయలు పడెయ్యటమూ, మా అక్క పరుగెత్తుకొచ్చి పక్క గదిలోకి బరబరా లాకెళ్ళి నన్ను వంగోబెట్టి పిడిగుద్దులు గుద్దడమూ ఒకేసారి జరిగాయ్.
"బ్రాహ్మలమ్మాయని చెప్పానా నీకు!!!" రాక్షసిలా చూస్తూ అడిగింది.
నాలుక్కర్చుకుని మొహం తుడుచుకున్నాను.
***
అట్లాంటి బ్రహ్మ రాక్షసి, అడక్కుండానే బుజ్జి బుజ్జి బహుమతులిస్తూ మంచిదానిలా నటించిందోసారి.
"ఈసారి ఏం చేయాలి?"
"ఏం అక్కర్లేదు. ఊరెళుతున్నా...కాకినాడ కాలేజ్‌లో చేరడానికి.." నవ్వింది.
"నిజమా?" నా మొహం విప్పారిపోయింది.
రేపటి నుండి ఈ గది నాది, మొత్తం మంచమంతా నాది. ఆ plank, table, అన్నీ నాకే!!
పెట్టెల నిండా సామానుతో పాటే బెంగనీ కూరుకుంటూ అదీ, చిన్న చిన్న గాజు హార్లిక్స్ సీసాల్లో దానికి పొడులూ, పచ్చళ్ళూ, నెయ్యీ, కవర్లలో గవ్వలూ, కారప్పూసా, చెక్కలూ, ఇంకా,
ఎలా కూర్చినా ఇమడనంత ప్రేమనీ, సర్దిపెడుతో అమ్మ, జాయినింగ్ ఫార్మాలిటీస్ కోసం తెచ్చిన డబ్బులు లెక్కలు చూసుకుంటూ నానగారు, ఆ బుజ్జి సామ్రాజ్యానికి మర్నాటి నుండీ
పోటీ లేని పెత్తందారునవుతానన్న సంబరంలో నేను..
ఎప్పుడు తెల్లారిందో తెలీదు.
కానీ, వెలుతురు పరుచుకున్న కొద్దీ, ఖాళీ అయిన ఆ గది పుట్టించిన దిగులు, అద్దం ముందు, అమ్మ ముందు, ఎక్కడా ఎవరూ ఎదురుపడక లోపలి నుండీ తన్నుకొచ్చిన దుఃఖం, అమ్మని కావలించుకుని ఏం చెప్పాలో తెలీక వెర్రి మొఖంతో వెక్కిళ్ళు పెట్టి ఊరుకుండిపోయిన జ్ఞాపకం...
**
నీతో పంచుకోని ఏ సంబరానికీ అర్థం లేదని అర్థమై ఎన్నేళ్ళు గడచిపోయాయో కానీ...ఆ మాట నీకు చెప్పడానికి మాత్రం ఏ ఏటికాయేడు ఈ తారీఖొక వంక..!

Wish you a very very happy birthday, akkaa..!   😍
😍


కుందాపన – రవి వీరెల్లి




సతాతీహైఁ గుర్బత్‌ మే యాద్‌-ఎ-వతన్ జబ్
గలే మిల్‌కే రోతాహూఁ హర్ అజనబీ సే!
ప్రవాసంలో నా దేశపు జ్ఞాపకం బాధించినప్పుడల్లా/ ప్రతీ అపరిచితునీ కౌగిలించుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంటాను– రానా సాహ్రీ ఘజల్ లోని ఈ షేర్ గురించి మిత్రులు మాధవ్ గారి మాటల్లో వింటూండగానే, కుందాపన మనసులో మెదిలింది.

కుందాపన (2017)
వాకిలి ప్రచురణలు, రూ. 100/-
కవిత్వం కొందరికి అస్థిరపరచే ప్రశ్నల పుట్ట, మరికొందరికి అది స్థిమితపరచే సమాధానం. ఇంకొందరికి, ప్రశ్నల పరంపర ప్రతి రాత్రీ మీదకొచ్చి పరీక్ష పెడుతోంటే, ఏ జవాబూ ఎదురుపడని వేళ తానే అడ్డంగా నిలబడి కాచుకునే కవచం. ‘నేనెందుకు కవిత్వం వ్రాస్తున్నాను?’ అనేది కవికి చాలా సంక్లిష్టమైన ప్రశ్న; తనకు తానే చెప్పుకునేందుకైనా, తన దారిలోకి ఎదురొస్తున్న వారికి చెప్పేందుకైనా. కవులందరికీ ఈ ప్రశ్నకు జవాబివ్వవలసిన (ఇచ్చుకోవలసిన) బాధ్యత, అవసరం ఉన్నాయని నేననను గాని, కొందరి కవిత్వం ఎవ్వరూ అడగకుండానే ఈ ప్రశ్నకు జవాబు చెబుతుంది. ఆ దృష్టితో చూస్తే, రవి వీరెల్లి కవిత్వసంపుటి కుందాపన తన లక్షణమేమిటో, లక్ష్యమేమిటో, ప్రతి కవితలోనూ విప్పి చెబుతూనే వచ్చింది.
ముందుమాటలో కవి బాహాటంగా తన ఊరి తాలూకు జ్ఞాపకాలే తనని ఈ కవిత్వపు త్రోవలో అడుగులేయించాయని చెప్పుకుంటాడు: ‘కవిత్వానికీ ఊరికీ ఏదో లంకె ఉంటుంది. బొడ్డు తాడు తెంపాక కూడా పిల్లాణ్ణీ అమ్మనీ కలిపి ఉంచే అదృశ్య దారంలాగా, ఊరు వదిలాక కూడా ఇంకా ఊరుతో తెగని అదృశ్య బంధం నీడలా నన్ను వెంటాడుతూనే ఉంది. ఊరు మీదున్న మమకారంతోనో, జ్ఞాపకాల్ని మోయలేకనో, ఆలోచనలని బంధించలేకనో – కారణం ఏదైనా కవిత్వం తొవ్వ నడవాలనిపించింది.’
అయితే, ఇక్కడ జ్ఞాపకాలంటే మన చిన్నప్పటి ఫొటోలు మళ్ళీ మళ్ళీ చూసుకుని మురుసుకోవడమో, చిననాటి స్నేహితుడు అకస్మాత్తుగా కనపడి అలనాటి ఊసులేవో గుర్తు చేస్తుంటే ఆ రోజుల్లోకి మళ్ళిపోవడమో కాదు. వర్తమానంలో ఎదురొస్తున్న అనుభవాలను బట్టి, గతమంతా జ్ఞాపకంలా ఓ లిప్తకాలం మాత్రమే మెరిసి వెళ్ళిపోవడమూ కాదు. అంటే, ఇది ఒక క్షణికమైన లేదా తాత్కాలికమైన ఉద్వేగం కాదు. మనలో నిద్రాణ స్థితిలో ఉంటూ, వర్తమాన ప్రపంచంలో జరిగే ఏ సంఘటనకో మీట నొక్కినట్టు ఎగసిపడి వాటి ఉనికిని చాటుకునే జ్ఞాపకాల సంగతిది.
జ్ఞాపకాలతో ముడిపడ్డ రవి కవిత్వంలో కనపడే అనుభూతి ఆహ్లాదకరమైనదో, తలచిన కారణానికే మనని సంతోషం లోనికి నెట్టేదో కాదు. నివురుగప్పిన నిప్పులా లోపల్లోపల నిత్యం జ్వలించే అనుభూతిని అక్షరబద్ధం చేసే ప్రయత్నం ఇది.
‘త్వద్వియోగేన మే రామ త్యక్తవ్యమిహ జీవితమ్’ అని కోరికోరి తన వెంటనడచి వచ్చిన సీత కనపడని సందర్భంలో, రాముడు, జనశూన్యమైన అరణ్యములో ప్రవేశించిన పిమ్మట ఆ దుఃఖమంతా శరీరములో శాంతించినది. కాని ఇప్పుడు సీతావియోగము కలుగుటచే ఆ దుఃఖమంతా మరల కట్టెలు వేయుటచే వెంటనే అగ్ని ప్రజ్వలించినట్లు, మరలా విజృంభించినది అని లక్ష్మణుడితో చెప్పుకు వాపోతాడు. ఒక వియోగం మరొక వియోగ భారాన్ని ఎగదోసి, ఒక దుఃఖాగ్ని జ్వాల మరొక దుఃఖాగ్ని జ్వాలను అంటిస్తూ పోయిన వైనమది (శ్రీమద్రామాయణము, అరణ్యకాండము, అథ త్రిషష్టితమః సర్గః).
కానీ, కుందాపన కవితల్లో కవి దుఃఖం ఒక సంఘటనకు లేదా ప్రదేశానికి పరిమితమైనదని చెప్పడం కష్టం. ఇతనిదొక నిరంతర పరిశ్రమ – ఇతనికి గతంతో సంధి కుదరాలి.
దిగులు పువ్వు అన్న కవిత చూడండి.
సుదీర్ఘమైన చర్చ
ఓ కొలిక్కి వచ్చేలోపే ముగిసినట్టు
చీకటి వెలుగుల్ని ఒడుకుతున్న కాలం చేతుల్లో
రంగు మారిన దారం
కలనేత వస్త్రంలా, అతడి జీవితం లేదా మనఃస్థితి పగటికీ రాత్రికీ మధ్య రంగులు మార్చుకోవడాన్ని గురించి చెబుతున్నాడు కవి. అది ఒక పద్ధతైన అల్లిక. చీకటి పడే వేళకి శోకపు ఛాయని చూపించే పొందికుంది అందులో. మరి ఈ సుదీర్ఘ చర్చ ఏమిటి? ఎవరితో?
పైన అన్నట్టు, కవికి గతంతో సంధి కుదరాలి. రాత్రిగా మారాక తనను దిగులై వెంబడించవద్దని పగటిని వేడుకుంటున్నాడు. కవి పదాల ఎంపిక కూడా స్పష్టమైనది. అందుకే, ‘గతాన్ని వెలిగించి గట్టిగా పీల్చాను’ అనడం ద్వారా, దిగులు పడడమనేది తనకొక వ్యసన ప్రవృత్తిగా మారిందని చెబుతున్నాడు. ఆ దుఃఖం వదిలించుకునే అవకాశం ఉండి ఉండవచ్చు గాక- దానినితడు వాడుకోలేడు. ప్రతిగా అతడేమి మూల్యం చెల్లించాల్సొస్తుందో కూడా తెలుసు. దిగులు పువ్వు అంత తేలిగ్గా రాలిపడేది కాదు అని అన్నదందుకే.
రాత్రిళ్ళు ఎదురుపడగానే కవి తనను తానే ఇలా లోకువ చేసుకోవడం, ఈ ఒక్క కవితలోనే ఎదురొచ్చిన గమనింపు కాదు. ఈ కవిత చూడండి. ఈ కవిత్వంలో కవి మాట్లాడుతోన్న గతం, అతను వదుల్చుకోలేకపోతున్న, మోయలేకపోతున్న బరువు. దిగులు. అందుకే అతడు రాత్రులకు లోకువ.
నడిరాత్రి నడుం మీద
సమయాన్ని చేది పోస్తూ
అరతెరిచిన కళ్ళతో
ఒక్కొక్క జ్ఞాపకం పూసని
మునివేళ్ళతో మీటుతూ

పొగమంచుని మోస్తూ
పొడిచే పొద్దు కోసం
ఎదురుచూసే వెదురుపొదలా
ఇలా…
నా రాత్రులు నావి
నీ పగళ్ళు నీవి.

రెండు ముక్కలైన
రోజును
అతికిస్తే బావుణ్ణు!
ఇలా జ్ఞాపకాలను పూసలుగా మునివేళ్ళతో తిప్పుకుపోవడం, ఉదయం కోసం చేస్తున్న తపస్సంటున్నాడు కవి. ‘నా రాత్రుళ్ళు నావి, నీ పగళ్ళు నీవి’ అనడంలోనే, సజావుగా సాగిపోయే పగలు, రాత్రిలోకి మళ్ళుతూనే రూపు మార్చుకుంటోందన్న అర్థం వచ్చి చేరింది. పగలూ రాత్రీ తానే రెండు విభిన్న వ్యక్తులుగా చీలిపోవడమూ తెలిసింది. ఇప్పుడిక ఆఖరు వాక్యంలో ఆశపడ్డట్టు – రెండు ముక్కలైన రోజును ఎవరైనా అతికించడం ఎందుకూ? ఆ రాత్రిళ్ళ ఒంటరితనం నుండి అతడిని కాపాడి, పగలూ రాత్రీ ఒకే ఒరవడిలో – ఒకే దుఃఖంలో లేదా ఒకే సంతోషంలో- సాగేందుకు ఆసరా ఇచ్చేందుకు. ఆ విముక్తి కోసమే జ్ఞాపకాల మణిపూసలతో అతను తపస్సు చేస్తున్నది. నిజానికి, ఆఖరు పాదంలో ‘ఎవ్వరైనా’ అని ధ్వనింపచేస్తూ, మళ్ళీ ఈ రోజుని తన హస్తగతం చేసుకోవడంలో తాను నిస్సహాయుణ్ణని చెప్పకనే చెబుతున్నాడు. పైన ప్రస్తావించిన కవితలోని దిగులు పడడమనే వ్యసనప్రవృత్తినీ గుర్తు చేస్తున్నాడు.
దృష్టి, ధ్వని, స్పర్శ, రుచి కూడా మన జ్ఞాపకాలను తవ్వి తోడి కలవరపెట్టగలవు. దూరదర్శన్ సిగ్నేచర్ ట్యూన్ వింటే కొందరికి కుటుంబమంతా కలిసి భోజనం చేసిన సమయాలు గుర్తుకు రావచ్చు. షాపింగ్‌మాల్‌లో ఆదమరుపుగా తిరుగుతున్నప్పుడు అదాటుగా సోకిన అత్తరు వాసన, ఎడమైన ఎవరి సాన్నిహిత్యాన్నో దగ్గరికి తేవచ్చు. ఏళ్ళ తరువాత తింటున్న పనసపొట్టు కూర, ఒకప్పుడు కొసరి ముద్దలు తినిపించిన మేనత్త ప్రేమని, ఇప్పుడు ఎవరూ లేని ఆ ఇంటినీ కళ్ళ ముందుకు తేవచ్చు. ఒక్కోసారి ఆ జ్ఞాపకాలతో ముడిపడ్డ మనుషులు, వాతావరణం ఇవన్నీ మసకమసకగానే ఉన్నా, అనుభవమొక్కటీ విస్పష్టంగా ఉండి మనని కాసేపు అలౌకిక భావనలోకి నెట్టడమూ జరుగుతూంటుంది. అస్పష్టంగా అమ్మ రూపం అన్న టాగోర్ కవిత, ఇందుకు ఒక మంచి ఉదాహరణ.
ఈ కవితలో టాగోర్ తన తల్లి రూపేమిటో గుర్తు రాదు కాని, మిట్టమధ్యాహ్నపు వేళ ఆటబొమ్మల మీదుగా వినపడ్డ శబ్దమేదో ఊయల పట్టి ఊపుతూ తన తల్లి ఆలపించిన రాగాన్ని గుర్తు చేస్తుందని; ఆమె గుర్తు రాదు కాని, శరత్కాలపు ఉదయాలలో పారిజాతాల మీదుగా వీచిన గాలులకు ఆలయ ప్రాంగణంలోని ప్రాభాతసేవా పరిమళం తల్లి పరిమళమై తనను ఆవరిస్తుందని; ఆమె గుర్తు రాదు కాని, పడక గది కిటికీలో నుండి నీలాకాశం వైపు చూపు సారించినప్పుడు తన మోము మీద నిలిచిన తల్లి చూపులోని శాంతస్థిమితమేదో ఆ ఆకాశమంతా పరుచుకున్నట్టు అనిపిస్తుందనీ అంటాడు.
పై ఉదాహరణల్లోని నిర్దిష్టమైన, నిశ్చితమైన వివరాలను పక్కన పెడితే, ఈరకమైన నాస్టాల్జియా ఒక విశ్వవ్యాప్తమైన అనుభవం, దాదాపు గొప్ప కవులందరూ కవిత్వంగా మార్చుకున్న వస్తువు. కుందాపన లోని కవితల్లోనూ ఈ నాస్టాల్జియానే కనిపిస్తుంది.
అయితే, ఈ కుందాపన సంపుటిలోని కవిత్వాన్ని ఇటువంటి ఇతర కవిత్వాల నుండి ఎడంగా నిలబెట్టినవి, రెండు ప్రధానమైన అంశాలు.
ఒకటి, ఈ కవిత్వంలో గతాన్ని ప్రాతిపదికగా చూపించి, అదే గొప్పదనీ దాన్ని కోల్పోయాననీ అనడం గాని, వర్తమానం పట్ల వెగటు, ఈ కాలపు పోకడల పట్ల చిన్నచూపు, నిస్పృహ గానీ కనపడవు. అలాగే, ఉద్వేగాలపరంగా చూసినప్పుడు, ఇది సమూహాలకు వర్తించే కవిత్వం కూడా కాదు. ఇది ఊరి మీద బెంగతో రాసిన కవిత్వమే కావచ్చు కాక, కానీ ఆ ఊరి రావిచెట్టు చప్టా గురించో, అక్కడి కోవెల, మట్టి రోడ్ల గురించో, అక్కడి జ్ఞాపకాల గురించో వర్ణించి వదిలేసి, అవి దొరకని వెలితిలోంచి వెళ్ళగక్కిన కవిత్వం కాదు. ఈ రాత్రీ-దిగులూ కవికి మాత్రమే పరిమితమైన వ్యక్తిగత ఆవరణలో గిరికీలు కొట్టడమే మనకు ఆసాంతమూ కనపడుతుంది. అందుకే ఈ వేదనలోకి మరెవ్వరూ లాగబడలేదు. మరెవ్వరికో నిరూపింపబడానికి రాసింది కాదు కనుక, ఒక ఏకాంతంలో ప్రతిధ్వనిస్తోన్న ఈ గొంతుకలో ఆత్మీయంగా తోచే పిలుపు వినపడుతుంది. అది కవినీ పాఠకులనీ అనాయాసంగా దగ్గరకు చేరుస్తుంది.
రెండవది, ఈ కవిత్వంలోని మెలకువ. అంటే, ప్రపంచంతోనో, ఒంటరితనంతోనో కుదుర్చుకున్న రాజీ.
మన గతం ఎలాంటిది కానివ్వండి–అది అయస్కాంతంలా లాగేదో, బలంగా విసిరి ఒక మూలకు ఈడ్చి కొట్టేదో– మన సమస్య దానితో రాజీ కుదుర్చుకోవడమొక్కటే కాదు. వర్తమానానికి తప్పనిసరిగా లోబడి ఉండటంలో కూడా ఉంది. వృత్తి వ్యాపకాల నిర్బంధంలో సహోద్యోగులు, సన్నిహితులు, సహచరులు, అపరిచితులు–ఎవరైనా సరే వాళ్ళతో కలిసిపోవడం; ఈ క్షణంలో, వర్తమానప్రపంచంలో తప్పనిసరిగా బతకాల్సి రావడం మనలో చాలా మందికుండే సమస్య. అలాంటి వాళ్ళ కవిత్వంలో, సమూహాలలో వారి ఒంటరితనం గురించి, వారి ఇబ్బందిపడే నైజం గురించి, ‘ఇప్పటి’ రోజుల్తో మనకుండే నిరంతర వైరి గురించి, చాలానే ప్రస్తావనలు కనిపిస్తాయి. కానీ, గతాన్ని, విడువలేని తన వ్యసనంగా చూస్తూ, పగలు తనకు బానే జరిగిపోతోందన్న ఒప్పుకోలు, పగలు ఇలాగే జరిగితీరాలన్న అనుకోలు, కవిత్వంలో అరుదనే చెప్పాలి. ఏది ఎక్కువగా చెప్పబడుతుందో దాని మీదకే చూపు వెళ్ళడం సహజం కనుక, కుందాపనలోని కవిత్వాన్ని ‘ఇంటి బెంగ’కు చెందిన కవిత్వంగా మాత్రమే చూడడం తప్పని నా నిశ్చితాభిప్రాయం.
ఈ కవిత్వంలో మనం చూడాల్సినది, ఈ కాలపు మనిషిని. తన లోపలి సంచలనాలతో సంబంధమే లేకుండా, కర్తవ్యాలన్నీ యథావిధిగా నిర్వర్తించుకుపోతూ, ఏకాంతంలో ‘నిద్రకు వెలియై తానొక్కడుయై’ వేదన పడే ఈ కాలపు మనిషి అవస్థని. బెంగటిల్లేందుకు కూడా వేచి చూడగల అతడి స్థితప్రజ్ఞతని. వేదన ఎప్పుడూ ఒంటరిగా ఉన్నప్పుడే విశ్వరూపం చూపిస్తుందన్న అనాది వాక్యానికి, రోజునూ-తననూ రెండు ముక్కలుగా విడగొట్టుకుని, లోకపు చీకటికి తన లోపలి శూన్యంతో పోలికపెట్టి మన ముందు నిలబెట్టింది ఈ కవిత్వం. Solitary అన్న కవిత చదివితే, ఏకాకితనానికీ-సమూహంలోకీ, అవసరానికి తగ్గట్టు రూపు మార్చుకునే ఒదుగు మరింత స్పష్టమవుతుంది.
అటూ ఇటూ
ఎంతసేపు తచ్చాడగలను?!
కాసేపట్లో వెయ్యిగా విడిపోతా.
చివరికి చినుకులన్నీటినీ చేరదీసుకుని
పెద్ద సమూహమై దండెత్తుతా.
యుద్ధం వెలిసాక
ఏ ఏట్లోనో మళ్ళీ ఏకాకై పారుతా.
సింహభాగం కవితలు ఈ ఏకాకితనానికీ పూర్తిగా వ్యక్తిగతమైన అనుభూతులకూ చెందినవే అయినా, ఆ ధోరణి నుండి కాస్త బయటకు వచ్చి రాసిన కవితలు, రాసిలో తక్కువైనా, ఆకర్షిస్తాయి. వీలైనన్ని చిన్న చిన్న, తేలికైన పదాలతో ఒక్కో ఊహా ఒక్కో అనుభూతిగా మారిన ఈ సంపుటిలో ఇతర కోవలకు చెందిన కవితలూ ఉన్నాయి. కప్పతల్లి అలాంటి ఒక భిన్నమైన కవిత.
పొద్దుగాలనంగా ఊరేగింపుకెళ్ళిన
కప్పతల్లి
పొద్దుగూకినా ఇల్లు చేరకపాయె.
ఈ కవిత ఎంత సరళంగా కనిపిస్తుందో అంత బలమైనది, విలువైనది కూడా. కరువు ప్రాంతాల వాతావరణాన్ని అలతి పదాల్లో పొందుపరచడం ఒక ఎత్తు. వానలు పడని వేళల్లో, వానలు పడాలని రోటికి కప్పను గట్టి ఊరేగించే ఒక ప్రాంతపు సంప్రదాయాన్ని, ఈ కవి అనాయాసంగా కవిత్వం చేయడం ఇంకో ఎత్తు. మూడంటే మూడే వాక్యాల్లో ప్రజల సంప్రదాయాలనీ, ఆశల్నీ, నిరాశలనీ పకడ్బందీగా పట్టి కూర్చోబెడతాడు కవి.
కవి వాడే ఉపమానాల్లోని సౌందర్యమెలా ఉంటుందో చిన్నోడి అమ్మ కవిత కరతలామలకం చేస్తుంది. పిల్లవాడొచ్చే స్కూల్‌ బస్ గురించి:

పసుపు పచ్చని సీతాకోక చిలుక
పంచప్రాణాలని మోసుకొచ్చే వేళయింది
 అనడమూ,
తల్లి వాడి స్కూల్‌ బేగ్ అందుకోవడాన్ని
ఊరేగిస్తున్న దేవుని పల్లకి
భక్తుల భుజాలు మారినంత పవిత్రంగా
పుస్తకాల సంచి భుజాలు మారుతుందప్పుడు
 అనడమూ,
చెవులు పట్టి సున్నితంగా కుందేళ్ళను తెచ్చినట్టు
అరుగు మీద విప్పిన బూట్లను ఇంట్లోకి తెస్తాడు
 అనడమూ,
ఆ అనడంలోని సున్నితత్వమూ ఈ కవితని మళ్ళీ మళ్ళీ చదివించి గుర్తుండిపోయేలా చేస్తాయి. అయితే, ఈ కవితలో విశేషం ఇదొక్కటే కాదు. ఈ కవితా శీర్షిక చిన్నోడి అమ్మ. అంటే, ఇది ఒక తల్లి హృదయాన్ని ఆవిష్కరించడానికి వ్రాయబడ్డ కవిత. కానీ, తల్లి తాను స్వయంగా రాసినది కాదు. అలా అని, ఎదురుగా ఉన్న బిడ్డ రాసినదీ కాదు. సర్వసాక్షిలా ఒకరు చూసి రాస్తున్నారు కానీ అది ఒక పూట జరిగి ఆగిపోయే(యిన) కథ కూడా కాదు. నిజానికి ఈ కవిత, ‘స్కూల్ బస్సు కోసం రోజూ ఇంటి ముందు కూర్చుని ఎదురుచూసే చిన్నోడి అమ్మకు’ నాన్న రాసి ఇచ్చిన బహుమతి. మళ్ళీ మళ్ళీ చదివించే కవిత అని నేను అన్నప్పుడు, నిజానికి రెండోసారి నుండి మనకీ కవితలో కనపడేది అమ్మ కాదు. చిన్నోడి నాన్న. ఆ తల్లీకొడుకులను వేయికళ్ళతో గమనించుకుని పొంగిపోతోన్న పురుష హృదయమే, అతని చూపుల్లోని లాలిత్యమే, అతని భావాల్లోని సౌకుమార్యమే (పుస్తకాల సంచీని గుదిబండ అనక, భుజాల మీద వాతలు తేల్చేదైనా దేవుని పల్లకీ అనడానికి ఎంత సంస్కారం కావాలి!) ఈ కవిత ఔన్నత్యాన్ని పదిమెట్లు పైకెక్కించిందని అంటాను. తన కొడుకు అల్లర్లను, వాడి అచ్చటాముచ్చటల్లో తల్లిగా మారిన తన ప్రేయసి పొందుతున్న తన్మయత్వాన్ని, మౌనంగా అబ్బురంగా గమనించుకుంటున్న అతడి మనసు పరిచిన ఈ కవిత, నిశ్చయంగా అపురూపమే.
ఏ కవికైనా ఒకే వస్తువు మీద ఒకటికి మించి కవితలు రాయడం కత్తి మీద సాము లాంటిది. ప్రతిసారీ విభిన్నంగా వ్రాయడం, అలా రాస్తూనే తాను చెప్పదలచిన విషయానికి నిబద్ధులై ఉండటం కష్టసాధ్యమైన పని. అందువల్ల ఈ సంపుటిలోని కవితలు చదువుతున్నప్పుడు పునరుక్తి దోషం పాఠకుల మనసులో మెదలడంలో ఆశ్చర్యం లేదు. ప్రత్యేకించి దూప సంపుటిని కూడా చదివిన వారికి, ఈ కవితల్లోని వాతావరణము, ప్రతీకలు చిరపరిచితంగాను, పునరావృతమవుతున్నట్టుగానూ అనిపించడం సహజం. ‘నువ్వు రాయకుండా కూడా ఉండగలిగితే, రాయకుండా ఉండటమే మేలు’ అని కాపుస్‌కి సలహా ఇస్తాడు రిల్క తన ఉత్తరాలలో మొదటిదానిలో. బహుశా, ఇవి కవి రాసుకోకుండా ఉండలేని కవితలయుండాలి.

నేనంటే నేనే కాదు

ప్రతీపదం ఎక్కడో విన్నట్టే ఉంటుంది
ప్రతీ ముఖమూ చిరపరిచిత కథను మోస్తూ
కళ్ళ ముందే నడుస్తూ ఉంటుంది. 
ఏం చెయ్యాలో ముందే నిర్ణయించుకున్నట్టు,
భుజాలు తిప్పుకుని
ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయాక,
గది లోపలి గది లోపలి గదిలో
కళ్ళు పొడుచుకుని వెదుక్కుంటాను
తప్పిపోయిన ఏ మనిషి కోసమో
తెల్లవార్లూ కలల దారుల్లో కలియదిరుగుతాను
చీకటి గడప దాటడానికి,
కలలు చిట్లే వేకువలోకి లేవడానికి
ఎన్నాళ్ళైనా భయపడుతూనే ఉంటాను
నది నిరంతరం ముద్దాడినా లొంగిపోని చేపపిల్లలా
ఆలోచన స్వాధీనంలోకి రాక వేధిస్తున్నా
మెదడులో మోసుకు తిరుగుతూనే ఉంటాను.
ఆశ పుట్టిన రాత్రుల్లో, ఆశ చావని రాత్రుల్లో,
ముడుచుకుపోతున్న వేళ్ళన్నింటినీ పైకెత్తి
ఊహల్లోని బొమ్మలను విస్తరించి చుసుకుంటాను
పెదాల మధ్య నలిగి నెత్తురోడే పదాలని
అరచేతుల్లోకి తీసుకుని ప్రాణం పోసి చుసుకుంటాను
వెలుగు నన్ను తాకినప్పుడల్లా ఓడిపోతున్నానని
రాత్రి వెనుక రాత్రి జారినప్పుడల్లా
నా పాదాల ముందు గడియపడ్డ తలుపులు
కొత్తగా పుట్టుకొస్తున్నాయనీ
గమనించుకుంటూనే ఉంటాను.
ఒకరెళ్ళినా, మరొకరు వచ్చి చేరినా
ఏ ఇబ్బంది లేని ప్రాణమని అనుకుంటాను కానీ,
నా అరచేతుల్లో ఓ ప్రపంచముందనీ
నా వేలి చివరల్తో నా లోకాన్ని
శాసించగలననీ అనుకుంటాను గానీ,
నేనొక ఒంటరి ద్వీపాన్నేనని
నా లోపలి సముద్రం తీరం దొరక్క
విరుచుకుపడినప్పుడు గానీ తెలీలేదు.
వేళకాని వేళ, బహుశా అకారణంగానే కావచ్చు,
ఆకాశం నాలుగు మేఘపు తునకలుగా విరిగి
నను ముంచెత్తేదాకా తెలీలేదు.
నిజం నగ్నమై నా ముందుకొచ్చి
నిలువరించేదాకా, నన్ను నిలదీసేదాకా
నాలోపలి నిజమేమిటో నాకూ తెలీదు.
ఇప్పుడు,
చుట్టూ కదులుతున్న నీటి ముఖం మీద,
రెప్పలు విప్పుతోన్న నా బొమ్మను
ఈ వేళలో ఇంత నింపాదిగా గీస్తున్నదెవరు?
నేనైతే కాదు.
నిశ్చయంగా చెబుతున్నాను.
నేనంటే నేనే కాదు.


రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...