ద్వాసుపర్ణా: అనువాద కవిత్వం

వేలూరి వేంకటేశ్వర రావు, వెనిగళ్ళ బాలకృష్ణ రావు కలిసి, సుప్రసిద్ధ ఒరియా కవి సౌభాగ్య కుమార మిశ్ర కవిత్వం నుండి ఎంపిక చేసిన కవితలతో వెలువరించిన అవ్యయ గురించి, లోగడ మనం మాట్లాడుకున్నాం. సౌభాగ్య కవిత్వంలో కనపడే వేగం గురించి, ప్రతీకల విషయంలో అతని కచ్చితత్వం, సూక్ష్మదృష్టి గురించి, అతని కవిత్వం కలిగించే ప్రాంతీయ స్పృహ గురించి అప్పుడు కొంత చర్చించుకున్నాం. ఇప్పుడు, సౌభాగ్య కుమార మిశ్రకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు (1986) తెచ్చిపెట్టిన ద్వాసుపర్ణా అనువాదం, మళ్ళీ ఈ ఇద్దరి శ్రమ ఫలితంగానే, యాభైరెండు కవితలతో నిండుగా మనముందుకొచ్చింది.
‘కాదేదీ కవిత కనర్హం’ అన్న శ్రీశ్రీ మాటలు తెలుగు కవిత్వానికి ఎంత చేటు చేశాయో మనమంతా గమనిస్తూనే ఉన్నాం. ఆ ఒక్క మాటనే తక్క, సరిగ్గా తరువాతి వాక్యంలోనే అతను కావాలన్న శిల్పం గురించి కాని, వస్తువు గురించి కాని, వాడే ప్రతీకలకూ వస్తువులకూ ఉన్న సంబంధం గురించి కాని, కవిత ఆసాంతం నిలబడాల్సిన ధోరణి గురించి కానీ పట్టింపుతో ఉన్న కవుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. వీటిని నిబంధనలుగా భావించి అతిక్రమించాలి అనుకునేవారే తప్ప, మంచి కవిత్వ లక్షణాలుగా గుర్తించి గౌరవించాలనుకునే వాళ్ళు కనపడటం లేదు. రోజువారీ వార్తలను కవిత్వానికి వస్తువులుగా వాడుకుంటూ, అక్కడ కనపడే అల్లర్లలో నలిగిపోయిన నినాదాలన్నీ సాపు చేసుకుని ముద్రించుకోవడమే మన ప్రస్తుత కవిత్వోద్యమాల్లో మొదటి అడుగవుతోంది.
ఇట్లాంటి వాతావరణంలోకి, కొత్త కాగితాల తాజా వాసనను మోసుకొచ్చిన అనువాద కవిత్వం ద్వాసుపర్ణా. కవి బలం వార్తలు కాక, ఊహాశక్తీ, కల్పనా చాతుర్యం అయితే, అతని కవిత్వానికి ఎలాంటి ఆకర్షణ ఉంటుందో చూపిన పుస్తకమిది. సౌభాగ్య సామాజిక అంశాల మీద, సమస్యల మీద తక్కువగానే రాసిన మాట నిజం. ఆ రాసిన కొన్నింటిలోనూ, ఈ వస్తువు మీద రాయడాన్ని ఒక రివాజులా మార్చుకోవాలనుకోని అతని దృక్పథం స్పష్టమవుతూనే ఉంటుంది. సమస్యలను ఎత్తి చూపే క్రమంలో, తనలోని కవిని అతడెక్కడా చిన్నబుచ్చుకోలేదు. నిజానికి, అతను ఇంటి రాజకీయాల మీద రాసినా, ఇరాన్ మీద రాసినా, అతని చూపు పారిందల్లా మనిషి హృదయ వైశాల్యం మీదనే. ఆ గుణమే అతని కవిత్వాన్ని నమ్మదగినదిగా చేసింది. కవిగా అతని వృత్తం పరిమితమైన కొద్దీ, కవిత్వం మరింతగా సాంద్రతరమవుతూ వచ్చింది. అది నాకు నచ్చింది. అవ్యయ చదివినప్పుడు, అందులోని కవితలు మూడు సంపుటుల నుండి ఎంచి ప్రచురించినవి కనుక, సౌభాగ్య అనుభూతివాద కవిగా కనపడుతోన్నా ఆ మాటను స్థిరపరచలేనని చెప్పాను. అయితే, ద్వాసుపర్ణా చదివాక, అప్పటి నా నమ్మకం బలపడింది.
అసలు దేన్నయినా అతను కవిత్వంగా మలుచుకునే తీరు, చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది. ఉదాహరణకు ఈ క్రింది కవితను చూడండి:
ఇచ్చి పుచ్చుకునే భాగోతం
ఎంతో విస్తృతమైనది
ఏం పోయిందో, ఏమొచ్చిందో, ఏదీ గుర్తుండదు
నేను లెక్కబెట్టినప్పుడు పన్నెండు
మరొకడు లెక్కపెట్టినప్పుడు పదమూడు.
మనం దాగుడుమూతలాడటం మరచిపోయి
వంతెన మీద కూర్చుని కబుర్లాడుకుంటున్నప్పుడు
ఆ పోయిన ఒకటీ కాస్త పరిహాసంగా
సగం పండి, సగమై తిరిగి వస్తుంది 
(ఇచ్చిపుచ్చుకోవటం, పు: 49)
ఏదైనా వస్తువు చేతులు మారినప్పుడు, తీసుకున్నవాడి దృష్టిలోనూ, ఇచ్చిన వాడి దృష్టిలోనూ దాని విలువకూ తేడా ఉంటుంది. ఆ భేదాన్ని పూరించుకోవడానికి స్నేహం ఒక దారి. అరమరికలు లేని స్నేహం. దాపరికాలు లేని స్నేహం. అప్పుడూ వాళ్ళు కోల్పోయేది కొంత ఉండవచ్చు గాక. కానీ పొందిన ‘ఫలం’ మరింత పరిపూర్ణమైనది. మరింతగా పక్వమైనది. ఇది తెలియనివాడికి వెలితి మాత్రమే మదిలో నిలిచిపోతుంది. అతనికి ఏం వచ్చిందో తెలియనట్లే ఏం పోయిందో కూడా తెలియదు.
ఈ కవితలో స్నేహం గురించి కాని, మానవ సంబంధాల్లోని బలిమి, లేముల గురించి కాని, కవి బిగ్గరగా ఏమీ చెప్పడు. కానీ లోగొంతుకలో విన్న రహస్యాలే కదా మధురంగా తోచేవి.
ఈ నవ్యతనే చూపెట్టే మరో ఉదాహరణ: పెద్ద పెద్ద షాపింగ్‌మాల్‌ల ముందు, కూడళ్ళ దగ్గర, కరపత్రాలలో తమ వినతిని ముద్రించుకుని చదవమని వెంబడించేవాళ్ళను చూస్తూంటాం. మాటలు రాక, మాట్లాడలేక, మూగగా మన సాయం కోరుతూ నిలబడే వాళ్ళ ముఖాలు, వాళ్ళ వేదన, చాలాసార్లు మన గమనింపులోకి రావు. కొందరంటుంటారు, ‘అప్పటిదాకా కులాసాగా తోటివాళ్ళతో కూర్చుని కబుర్లు చెబుతూ, మమ్మల్ని చూడగానే మూగ నటన మొదలెట్టడం కళ్ళారా చూశాం’ అని. పక్క పక్క నిముషాల్లో వాళ్ళు పట్టుబడ్డట్టే, చాలామంది కవులూ అబద్ధపు జాలిని, కపట ప్రేమనీ కవిత్వం చేస్తూ, చేయలేకా, పట్టుబడిపోతుంటారు. సౌభాగ్య ఏం రాశాడో చూడండి:
ఏమిటి? భాష ఏమైనా చెయ్యగలదని
నువ్వు కచ్చితంగా నిశ్చయించుకున్నావా
మౌనంగా ఉండటంలో మెలకువలు నేర్చుకున్నాం
పాము చస్తుంది, కర్ర విరగదు.
నువ్వు మణికట్టు విరగ్గొట్టుకున్నావు;
మరొకడు ఇల్లు వరదలో కొట్టుకుపోనిచ్చాడు.
నీ కాగితమ్ముక్క జాగ్రత్తగా పదిలపరుచుకో
చాలా చెట్లు విరిగిపడవలసి ఉంది,
చాలా హృదయాలూనూ,
చాలా మంది కవులు పుట్టవలసి ఉంది,
నువ్వు మా దగ్గర నుండి తిరిగి వెళ్ళిపోయాక.
 (నువ్వు చెప్తున్నావు, పు: 19)
నిడివి పరంగా చూస్తే, సౌభాగ్యకూ క్లుప్తతకూ చుక్కెదురనే చెప్పాలి. అతనికి పదాల లెక్క లేదు, అనుభవం నిండుగా అక్షరబద్ధం కావడమే అతని లక్ష్యం. కానీ, ఈ కవితలో మాదిరి (కవుల మీది వ్యంగ్యం, ఆ మూగవాని పట్ల అప్రయత్నంగా కలిగే సానుభూతి) భిన్న రసోద్వేగాలను ఒకేసారి స్ఫురింపజేయడంలో అతను చూపే నేర్పు నేర్చుకోదగ్గది. కవుల ప్రస్తావన ఇదే ధోరణిలో మరో రెండు కవితల్లో కనపడటం వల్ల, సౌభాగ్యకు కవులూ మనుషులేనన్న ఎరుకతో పాటు వాళ్ళ బలహీనతల పట్లా, పరిమితుల పట్లా స్పష్టమైన అభిప్రాయాలూ ఉన్నాయనుకోవాల్సి వస్తుంది.
నువ్వు పూలకు వాడిపోకండనీ, ఉత్తరానికి దారి తప్పవద్దనీ
చెప్పటం చాలాసార్లు విన్నాను
తేలిక శబ్దాలు వేలాడుతూండటానికి
ఒక్క ముహూర్త కాలాన్ని తీగలాగా సాగదీయడం చాలాసార్లు చూశాను
 (ఏడు కవితలు, పు: 219)
సౌభాగ్య ఎత్తుగడలలో కనపడే సొగసిది. ఎవరామె? పూలను వాడిపోవద్దనే భావుకురాలు, సున్నిత మనస్కురాలు? ఉత్తరాలకు దారి తప్పవద్దని చెప్పే ప్రేమికురాలు? ఒక్క ముహూర్త కాలాన్నలా తీగలా సాగదీస్తోందే, ఆమె కోరుకున్న తేలిక శబ్దాలు ఎలాంటివై ఉంటాయి? గాలి వీచే శబ్దమా? గాలికి ఆకులు రాలే శబ్దమా? పక్షి కూతలా? ఊఁ, ఉహూఁ లాంటి పొడి అక్షరాలా? కవిత నడిచే కొద్దీ, సహజంగా తలెత్తే ఈ ప్రశ్నలతో పాటుగా, ఆ భావనల తోడుగా మన మనసుల్లో మెల్లిగా పరుచుకునే నాజూకు సౌందర్యమంతా, కవి చేసే మాయాజాలం. అదే ఈ కవితలోని సౌందర్యం.
దాదాపు ఇలాంటి పరిచయంతోనే మొదలయ్యే మరో కవిత, సీతకోకచిలుక ప్రతి. నువ్వు పూవుల మధ్య పూవువి, తారల మధ్య తారవి అని సీతాకోకను కీర్తించడం సరే, అది మన ఊహకందుతుంది. కాని,
ఎప్పుడు చూసినా అతి వేగంగా
పొద నుండి పొదకూ, గోడపై నుండి పెంకు మీదకీ
వరండా నుండి గూటి అంచుకూ ఎగరడం, నరనరానికీ
అసహజమైన బరువుతో భుజం నెప్పెట్టి,
దించుకోవడానికి చోటు కోసం చూస్తున్నావు
అన్నిచోట్లా ఎవరో చెప్తున్నారు ఇక్కడ కాదు, ఇక్కడ కాదని
 (పు: 193)
అనడం మాత్రం నిస్సందేహంగా గొప్ప కవి ముద్ర. ప్రతి చోటా ఎవరో అడ్డు నిలబడి నెడుతుండబట్టి కానీ సీతాకోకచిలుకకు భుజం నొప్పి లేకనా అలా లోకమంతా ఎగరడం అనడంలోనే కవి సున్నితత్వం, ఊహాశక్తి రెక్కలు విప్పుకు కనపడుతున్నాయి. ఇదే కాదు, నది, వసంతం, చలిగాలి, చీకటి ఇలాంటి ఎన్నో మామూలు భావనలను, అసాధారణమైన చూపుతో గొప్ప కవిత్వంగా మార్చాడీ కవి. అనువాదకుల ఉత్తమ పదసంపద వల్ల, సరైన పదాన్ని వాడగల ప్రజ్ఞ, జాగ్రత్త వల్ల, అద్భుతంగా పండిన భావాల నుండి కొన్ని ఉదాహరణలు:
– జ్ఞాతుల చేతిలో పరాజయపు అనుభవంలా వేధిస్తున్నది చల్లటి గాలి
– కిన్నెర స్త్రీ ముఖంలాంటి ముఖమొకటి చీకటిలో చివాలున మంటలా ఎగసి…
– వేపపూల వాసన నన్ను తరుముతోంది, పాములా.
– చీకటి ఆకాశం పైనుండి వేలాడుతోంది.
– ఒకప్పటి నీ అవయవాల వేదన, ఆకాశంలో మెరుస్తూంటుంది, ఓర్పుగా
సాహిత్య వాతావరణంలో స్తబ్ధత అన్న పదానికి అర్థం, కొత్త రచనలు రావడం లేదని మాత్రమే కాదు, వచ్చిన రచనల్లో కొత్తదనం లేదని కూడా. దానిని చెదరగొట్టడానికి మనకున్న వాతావరణమే మారాలి. అది అంత తేలిగ్గా జరిగేపని కాదు. అయితే, వచ్చే ప్రతీ రచన ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మరో సృజనకు ప్రేరణనిస్తుంది. అందుకే, సాహిత్య వాతావరణాల్లోని స్తబ్ధతను చెదరగొట్టేందుకు అనువాదాలు కావాలి. ఆ పని ద్వాసుపర్ణా తలకెత్తుకుంది.
అయితే, ఈ అనువాదం ఎవరి కోసం చేశారు, ఎందుకోసం చేశారు అన్నవి రెండు మౌలికమైన ప్రశ్నలు. రచన అంటే, అందులోనూ కవిత్వమంటే, ఆలోచనల పొందిక, పదాల అమరిక. సాహిత్యాన్ని ఒక భాష నుండి మరొక భాషలోకి తీసుకురావడమంటే, ఆ ఆలోచనలను, పదాలను కూడా తిరిగి మన భాషకు, మన వాక్య నిర్మాణ పద్ధతులకు, వ్యాకరణ సూత్రాలకు అనుగుణంగా పొందిగ్గా అమర్చుకోవడం. పుస్తకంలో ఈ పొందికతో ఉన్న కవితలు ఎంత ఆకట్టుకుంటాయో, ఆ పొందిక లేక అటూ ఇటూ అయిన కవితలన్నీ అంతే ఇబ్బంది పెడతాయి. మూలంలోని పదాలకు కట్టుబడిపోయి తెలుగులో ఆ భావం సహజంగా ఎలా పలుకుతుందో గమనించని సందర్భాలలో, కొన్నిసార్లు ఒకే కవితలో చక్కటి తెలుగు చరణాలతో పాటు అసహజమైన తెలుగు వాక్యమూ కనిపించి, ఆ కవితలను ఆస్వాదించడంలో కొంత ఆటంకం కలిగిస్తాయి. కొన్ని కవితల్లో పదాలు, వాక్యాలు ఇబ్బంది పెట్టినా కొద్దిపాటి ప్రయత్నంతోనే భావం అందుతుంది. కొన్నింటికి ఆ వెసులుబాటూ లేదు. ఇది అనుసృజన అని అన్నారు కనుక, ఈ కవితలను తెలుగులో మెరుగుపరచి ఉండుంటే పాఠకులకు మరికొంత సులువయ్యేది, కవిత్వం ఎక్కువమందికి చేరడానికి వీలయ్యేది. ఒరియా, తెలుగూ రెండూ భారతీయ భాషలవడం, ఇది పక్క రాష్ట్రపు కవిత్వమవడం, సంస్కృత సాహిత్యం ఆ రాష్ట్రపు, ఆ కాలపు కవుల మీద చూపిన ప్రభావం తెలియడం, మొదలైన ఎన్నో అంశాలు ఈ కవిత్వాన్ని ఓ వంక దగ్గర చేస్తోన్నా, ఇది కేవలం అర్థానువాదమేనన్న స్పృహ పాఠకులను అంటిపెట్టుకునే ఉంటుంది. ఉదాహరణకు, ఈ పాదాలు చూడండి:
గాయత్రీ జపం చేసేవేళ
నేను తూలిపడ్డాను బ్రహ్మ ముహూర్తంలో;
ఇవాళ ఉదయమే తాళలేని వేడికి
కరిగి ప్రవహించి పోతున్నది ఆకాశం,
కలం ఒకటి విరిచేశా
నేను అభిమానంతో దుఃఖంగా.
గురి చేశాను పసుప్పచ్చని గుర్రానికి,
నా రక్తం నుంచి, ఆ దుఃఖం నుంచి వేరయింది,
ఆధారం లేని ఆ పశువు
ఒక వైపు కొట్టుకుపోతోంది,
మరొకవైపు తెలిసీ తెలియని నా భవిష్యత్తులాగా
ఒకే సమయంలో కోమలంగా, కఠోరంగా.
 (ఉత్తరం, పు: 111)
ఈ అనువాదం వల్ల మూలంలో ఉన్న భావం తెలుగులో పాఠకుడికి అందదు. అందువల్ల, ఈ అనువాదాలు తెలుగు పాఠకుల కోసం, ప్రత్యేకించి కవిత్వాన్ని చదివే పాఠకుల కోసం చేశారనుకుంటే, ఈ పుస్తకం ప్రధాన లక్ష్యం సౌభాగ్య కవిత్వాన్ని తెలుగులోకి తీసుకురావడం కాకుండా, అతని కవిత్వాన్ని తెలుగులో, కవిత్వంగా అందజేయడం అయి ఉండాల్సింది.
అనువాదాల గురించే మాట్లాడుతూ, వెల్చేరు నారాయణరావు ఒక వ్యాసంలో ఇలా అంటారు: ‘ఒక విలుకాడు తన ఇష్టం వచ్చిన చోట బాణం వేయడం గొప్ప కాదు. అతను బాణం వేసిన చోట సూటిగా తగిలేట్టు మరో విలుకాడు బాణం వేయడం–అదీ గొప్ప సంగతి’. సూక్ష్మమైన దృష్టి లేకపోతే, అన్నిసార్లూ బాణం వేసిన చోటే సూటిగా తగిలేలా వెయ్యడం కాని పని. అయితే ప్రయత్నం ఏ దిశగా కొనసాగాలో, ద్వాసుపర్ణా తెలియజెప్తుంది.
తొలి ప్రచురణ : ఈమాట, నవంబరు-2019 సంచికలో..

6 comments:

  1. వ్యాసం బాగుంది. రచయితగా కంటే విమర్శకురాలిగా రాణించగలవమ్మా నీవు.

    ReplyDelete
  2. Thanks for the feedback, I appreciate it!

    ReplyDelete
  3. చాలా మంచి విశ్లేషణ... ఏమైపోయారు? ఇక ఇక్కడే చదవాలన్నమాట మిమ్మల్ని. 

    ReplyDelete
    Replies
    1. Woohoo! Bhavani gaaroo, so happy to see your mail in mailbox! I am just taking a small break from FB - ante andi. will be back - not sure when. :)

      Thanks for the nice words about this essay. but you tell me, where do I read your latest works?

      Delete
  4. ఇక్కడేమంత మహా కావ్యాల్లెండి :) అయినా, మీరడిగారని బ్లాగ్ అప్డేట్ చేసాను. https://konnirasinakshanalu.blogspot.com/  
    తొందరగా వచ్చేయండి ఎఫ్బీకి. వెయిటింగ్ మరి!

    ReplyDelete
    Replies
    1. Thanks twice :)))
      కొన్ని రాసిన క్షణాలు! - మో మీ! :D

      Delete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....