నాకు యశోద అంటే అసూయ!!

నాకు యశోద అంటే భలే అసూయ! ఆవిడేదో భువనైకమోహనుడిని ఎత్తుకు మోసిందనీ, ఒళ్ళో వేసుకు ఆడించిందనీ కాదు. పైకి చెప్తే మరో పది మంది చూపు పడుతుందని ఆగడమే కానీ, ఏ తల్లికి తన బిడ్డ అందగాడు కాకుండా పోతాడు? ఆ యశోద కొడుకు కమలదళాక్షుడైతే, మన పిల్లల కళ్ళు పెరటి చెట్టు బాదం కాయలు. కన్నయ్య నెన్నుదిటిపై తుమ్మెద రెక్కల్లా వాలే బిరుసైన ఉంగరాలు చూసుకుని ఆయమ్మకు అతిశయమేమో గానీ, తిరుపతికి వెళ్ళొచ్చిన మన చంటోడి బోడిగుండైనా మనకు గుమ్మడిపండే కదా! ఇక అల్లరంటారా.. ఎవరి పిల్లలెంత తుంటరులో బయటవారికి తెలీదు. కన్నయ్య నోట్లో యశోదకు మాత్రమే కనపడ్డ కృష్ణమాయలా, పిల్లల అల్లరి అమ్మల పెదవి దాటని రహస్యం. చూసినవాళ్ళు మాయలో మర్చిపోతారు, చూడనివాళ్ళు నమ్మమంటారు.

ఇంకెందుకూ అసూయ అనేగా మీ సందేహం? అక్కడికే వస్తున్నా.

అమ్మనయ్యాకే శ్రీకృష్ణకర్ణామృతం నా చెవిన పడటం కాకతాళీయమని అనుకోబుద్ధి కాదు. ఆ యశోద తన ముద్దుల పట్టికి పొట్ట పట్టినన్ని పాలు పట్టనే పడుతుందా..ఐనా ఆ అల్లరి కన్నయ్య ఆడుతూ పాడుతూ ఏ గొల్లభామ దరికో చేరి, ఆ ఇంటి వెన్న గిన్నెలు కూడా ఖాళీ చేసేస్తాడుట. ఏ అత్తాకోడళ్ళ మధ్యో చిచ్చు పెట్టి పెరుగు కుండలు గుటుక్కుమనిపించి చల్లగా జారుకుంటాట్ట. పగలూ రాత్రీ భేదం లేకుండా, అమ్మ ఒడి చేరి కూర్చుని, పాలగిన్నె తీసుకురమ్మని మారాం చేస్తాట్ట! ఇప్పుడా పాలగిన్నె లేదురా అంటే, ఎప్పుడొస్తుందో చెప్పమని ఎదురు ప్రశ్నలు వేసి విసిగించేస్తాట్ట. రాత్రికి పాలు వస్తాయి లెమ్మని బుజ్జగించబోయిన యశోద ముందు, తన రెండు కళ్ళూ మూసుకుని, "చీకటైపోయిందిగా, ఇక పాలు తెమ్మ'నేటంత మొండి తండ్రి కృష్ణుడు. అడిగి మరీ బొజ్జ నింపుకునే పిల్లలుంటే, అలక నటించైనా మళ్ళీ మళ్ళీ ఆకలంటూ నోరు తెరుస్తుంటే, అమ్మలకు ఎంత హాయి!

నా బుజ్జాయి గులాబీ పిడికిళ్ళింకా విడువకుండా గాల్లోకి పిడిగుద్దులు విసురుతూ, గంట గంటకీ కేర్ర్ర్..మన్న ఏడుపుతో బొజ్జ నింపుకున్నన్నాళ్ళూ నాకూ బానే ఉంది. జాషువా అన్నట్లు, "బొటవ్రేల ముల్లోకముల జూచి లోలోన ఆనందపడు నోరు లేని యోగి" వాడప్పుడు. కన్రెప్ప వాలిందో లేదో కూడా చూసుకునే తీరిక లేక, ఓపిక మిగలక, వాడే ప్రపంచంగా మసలిన నెలలన్నీ దాటుకుని, అన్నప్రాశన చేయించాక మొదలైంది, యశోద మీద నా అసూయకు మూలమైన అసలు కథ.

*

ముక్కాలి పీటలు రెండు - ఒకటి వాళ్ళు కూర్చోవడానికీ, రెండవది వాళ్ళ కాలిమడమల క్రిందకీ - అటూ ఇటూ సర్దుకుని, ఎత్తు సరిచూసుకుని కూర్చుని, "ఇలా తేమ్మా పిల్లాణ్ణి" అంటూ, మా అమ్మో, అత్తగారో నా వైపు చేతులు చాచేవారు. చాచిన కాళ్ళ మీద జాగ్రత్తగా బుజ్జాయిని బోర్లా పడుకోబెట్టుకుని - మాడు చల్లబడేట్టు నూనె పెట్టి, ఒళ్ళంతా మర్దించి,  గట్టి పట్టుతో నలుగు పెట్టి, చెంబుల కొద్దీ వేణ్ణీళ్ళు పోస్తే మత్తుగా నిద్దరోతునట్టే పోయించుకునేవాడు. వాళ్ళలా రక్ష పెట్టి బుజ్జాయిని నా చేతికివ్వగానే  మెతమెత్తటి తువాల్లో బొమ్మను చుట్టినట్టు చుట్టేసి, బొజ్జను వాసన చూడటానికి వంగి, ఆగలేక ముద్దులాడి, మంచం మీద బజ్జోపెట్టి లేలేత రంగుల బట్టలు వాడి కళ్ళ ముందు ఊపేదాన్ని.  గాల్లోకి చేతులు, కాళ్ళూ విసురుతూ, నే చెప్పే కబుర్లన్నీ ఉక్కూ ఉంగా లతో వింటూ బట్టలేయించుకునేవాడు. ఆ తంతు కాస్తా ముగిసేవేళకి, "స్నానానికి అలసిపోతారు పిల్లలు, ఓ ముద్ద అన్నం పెట్టి పడుకోబెట్టేయ్రాదా" అని వెనుక నుండి ఎవరో ఒకరు అననే అనేవారు. నేనెక్కడ మర్చిపోతానో నని "అన్నప్రాశన చేశాక రోజూ ఇంత ముద్దైనా పెట్టాలమ్మా" అని చివర కలిపేవారు.

వాడి అన్నమంటే మన అన్నంలో ఓ ముద్ద తీసి పెట్టడమా మర్చిపోవడానికి, అదొక పెద్ద ప్రహసనం. కందిపప్పూ, పెసరపప్పూ దోరగా వేయించి, బియ్యంతో పాటు సన్నగా మిక్సీ పట్టి, ఒకటికి మూడో నాలుగో నీళ్ళు పోసి ఉడికించి, చారెడు నెయ్యీ, చిటికెడు ఉప్పూ కలిపి, మన అన్నంతో పాటు ఉడికించిన బంగాళదుంపో, కేరట్ ముక్కో లేదూ చిట్టి చిలకడ దుంపో మెదిపి, జారుగా ఉండాలనివాళ్ళ కోసం ప్రత్యేకంగా కాచిన చారు ఓ చెంచాడు జోడించి, ఆ నేతి పోపు ఘుమాయింపులు తగిలిన గిన్నెను మహానైవేద్యమంత భక్తిగా పట్టుకు వాడి దగ్గరకు వెళితే...ఏం చేసేవాడు!!

గిన్నె చూస్తూనే పెదాలను చిత్రంగా బిగించేసేవాడు. అదెంత చిత్రమంటే గింజుకోవడానికీ, ఏడవటానికి తెరుకునే నోరు, పొరపాటునైనా, ఒక్క రవ్వనైనా నాల్క మీద పడనిచ్చేది కాదు. ఊరూ పేరూ తెలియని వాళ్ళ కథలన్నీ ఇంట్లో ఎడాపెడా వినపడ్డ రోజులవి. ఫలానా వాళ్ళ పిల్లాడు కూడా ముద్ద మింగేవాడు కాదుటమ్మా, అరికాళ్ళ మీద చిటికె వేస్తే నోరు తెరుస్తారుట! అని చెబితే, మానవప్రయత్నంగా, కిమ్మనకుండా అమలు చేసేదాన్ని. ఇంకా చంటివాడేగా, కాళ్ళ మీద పడుకోబెట్టుకుని స్పూన్‌తో పెట్టమంటే దానికీ ఊఁ కొట్టాను. స్పూన్ కళ్ళ ముందుకు రాగానే దొర్లి కింద పడిపోయేవాడు, లేదా కాళ్ళ మీదే బోర్లా పడి బావురుమనేవాడు. పాపం, నా అక్క పిల్లలు - చాక్లెట్లో ఐస్క్రీములో కొనిపెడతానని ఎర వేస్తే, వాటి మీద ఆశలేకపోయినా పిన్ని మీద జాలితో, పక్కనే కూర్చుని చప్పట్లు కొడుతూ పిల్లాణ్ణి తినమని ఉత్సాహపెట్టే ప్రయత్నాలేవో చేసేవాళ్ళు. నవ్వులైతే దోసిళ్ళల్లో పట్టనన్ని వచ్చాయి కానీ, అన్నానికి మాత్రం ...ఊహూ!! పియానోల మీద పిల్లల సంగీతాలయ్యాయి. వాళ్ళ వచ్చీ రాని చిందులయ్యాయి. ఫలితం నాస్తి. "చికుచికురైలు వస్తోంది అంటే మన రాకి కొడుకు ఇట్టే నోరు తెరిచేవాడమ్మా "- అన్నారు మా అత్తగారొకసారి. ఆశగా చూశానావిణ్ణి. "నీ తోడికోడలు ముప్పూటలా ఆ వెధవ పాట నా చేతే పాడించింది - ఏడాది పాటు! ఉపాయం చెప్పాను - ఆనక నీ ఇష్టం" - మొహమాటం లేకుండా చెప్పేశారావిడ. ఆ పాట ఆవిడనెంత క్షోభ పెట్టిందో కళ్ళారా చూసి ఉన్నాను కనుక, జాలిపడి వేరే ఉపాయాల వేటలో పడ్డాను.

ఎన్ని శబ్దాలు చేయనీయండీ, ఎన్ని మాటలు చెప్పనీయండీ.. గిన్నె చూస్తే మొదలయ్యే మా వాడి రాగం మాత్రం నేనాపలేనిదైపోయింది. ఒకానొక మధ్యాహ్నం అలవాటుగా సాగుతోన్న వేషాలన్నీ విఫలమయ్యాకా,  "ఏడుకొండల వాడా, వెంకట రమణా ..! ఏమిటయ్యా నాకీ శిక్ష!" అని వాపోతోంటే, "తెరిచాడేవ్!" అరిచింది మా అమ్మ.

లేవబోయినదాన్నల్లా చటుక్కున చతికిలపడ్డాను. పరీక్షిస్తున్నట్టు మళ్ళీ అవే పదాలు ఒత్తి ఒత్తి పలికాను. బోసిగా నవ్వాడు. ఎర్రెర్రని చిగుర్లను తాకుతూ పల్చని నాలుక మీదకు జారింది ముద్ద. రెట్టించిన సంబరంతో గోవింద నామాలు చెప్పుకుపోయాను. గిన్నె ఖాళీ చేశాకా గుర్తొచ్చింది, కడుపుతో ఉన్నప్పుడు సాయంకాలాల్లో బాల్కనీలో కూర్చుని వుంటే, ఎదురుగా ఉన్న కళ్యాణ వేంకటేశ్వర స్వామి గుడిలో నుండీ గోవింద నామాలు, విష్ణు సహస్ర నామమూ వినపడుతూ ఉండేవి. పొట్ట మీద చేతులేసుకుని అంటూ, వింటూ అలాగే కునుకు తీసిన రోజులు కోకొల్లలు. బాలసారె నాడు బంగారు ఉంగరంతో బియ్యంలో రాసిన పేరా ప్రహ్లాదుడిది. పానీయంబులు తాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలానిద్రాదులన్ సేయుచున్.. సతతం శ్రీహరి నామ స్మరణలో మునిగి తేలిన పిల్లవాడి పేరు పెట్టాక తప్పేదేముంది!

రహస్యం తెలిసింది కదా! ఇక అది మొదలూ, ఏది వాడి గొంతు దిగాలన్నా, ముందు కాసిన్ని వేడి నీళ్ళో, టీ చుక్కలో నా గొంతులోనూ పోసుకుని, వాణ్ణందుకునేదాన్ని.

రోజుకు రెండు రకాల పళ్ళు కదా పిల్లల లెక్క. అరటిపండు చక్కా గుజ్జు తీసి ఓ రోజు, యాపిల్ మెత్తమెత్తగా కోరి ఓ రోజు, గింజలు తీసేసిన కమలా తొనలు వెనక్కు విరిచి ముత్యాలు వాడి పగడాల పెదాలకంటిస్తూ ఓ రోజు, బొప్పాయి గుజ్జు తీసి మరో రోజు- ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏ లింగాష్టకమో అందుకుంటే పనైపోయేది. కాకపోతే మనకు శివాష్టకం లేకనా!

బాదం, జీడిపప్పు, ఖర్జూరాలు, పిస్తా, కిస్మిస్ కాస్త పాలల్లో నానబెట్టి మెత్తగా మిక్సీ చేసి స్మూతీలా ఇచ్చేటప్పుడు, ఏ అన్నమయ్య కీర్తనైనా అక్కరకొచ్చేది. వారాలను బట్టి వీలుగా ఉంటుందని, లెక్కగా ఉంటుందని, హనుమాన్ చాలీసా ఓ రోజు, లక్ష్మీ అష్టోత్తరాలొకరోజు, ఆఖరకు ఆదిత్య హృదయం కూడా దగ్గరుంచుకుని, వీడి ఖాతాలోనే చదువుకునేదాన్ని.

ఇడ్లీ దోశలకూ, చపాతీల్లాంటి వాటికీ, నామరామాయణం, మధురాష్టకం సరిపోయేవి.

పాలకు మామూలుగా ఏ జంట వాయిద్యమూ అక్కర్లేదు కానీ, ప్రయాణాల్లో అవసరమనిపించినప్పుడు "రారా చిన్నన్నా.." అనో, "ఇట్టి ముద్దులాడేబాలుడేడవాడే !" అనో మొదలెడితే అయ్యేలోపు చేమపూవు కడియాల చేతులు ముడుచుకుని పెదాల మీద పాల చారికలతోనే నిద్రలోకి జారుకునేవాడు.

ముద్ద నోట్లో పెట్టాకా మాటమాటకూ తడుముకోవడం ఏం బాగుంటుంది! అందుకే అన్నానికి మాత్రం సహస్రనామాలే దిక్కు.

ఏడాది కాలం లోయలోకి జారిన నెమలీకలా తేలిగ్గా కరిగిపోయాక, పద్ధతి మార్చి కథల్లోకి వచ్చిపడ్డాం. చంకనేసుకుని చందమామను చూపిస్తూ గోరుముద్దలు పెట్టేప్పుడల్లా అనిపిస్తుంది- అమ్మకు అక్కరకొచ్చేవాడు పిల్లాడికి మామ కాక మరేమవుతాడని! దారిన పోయే మనుష్యులు, రోడ్డు పక్కన చెట్లకి కట్టిన చీర ఉయ్యాలల్లో ఊగే పిల్లలు, దుమ్ములో దర్జాగా పడుకునే వీధి కుక్కలు, వచ్చీపోయే ఆటోలు, బస్సులు, కార్లు, పక్కింటికి వచ్చి వెళ్ళిపోయిన చుట్టాలు - కావేవీ పిల్లల అన్నాల కథల కనర్హం!

రాసుకోరు కానీ, అమ్మలందరూ రచయితలే. ఎవ్వరూ గమనించి భుజం తట్టరు కానీ, చెప్పిన కథ చెప్పకుండా పిల్లలకు తాము నమ్మిన మంచీ మర్యాదలేవో మప్పుతూనే ఉంటారమ్మలు. పిల్లల పొట్ట నింపాలన్నా, వాళ్ళు కంటి నిండా నిద్రపోవాలన్నా, గొంతు పోయేలా ముచ్చట్లు చెప్పకుండా ఎలా! పుస్తకాలు కొనే చదువుతారో, విని వంటబట్టించుకున్న కథలే చెబుతారో, ఆశువుగా సృష్టించి మెప్పిస్తారో, ఏదైతేనేం- వ్రతమేదైనా ఫలం దక్కించుకునే తీరుతారు అమ్మలు! వాళ్ళ సంకల్పాలు గట్టివి.

ఇల్లంతా పీకి పందిరేసినా తిప్పుకు సర్దుకుంటాను కానీ, అన్నం వద్దని తల తిప్పుకుంటే భరించలేను అనే నాలాంటి అమ్మలను మీరూ చూసే ఉంటారు. పిల్లలు చేసే అల్లరినీ, వాళ్ళు తినే ముద్దలనీ అమ్మ రెప్పల మాటున దాగిన తరాజు అహరహం గమనించుకుంటూనే ఉంటుంది కాబోలు. పసివెన్ను నిమిరితే మెల్లగా తన్నుకొచ్చే త్రేన్పుకే అమ్మకు సగం ఆకలి తీరుతుందని ఎవరైనా తీర్పునిచ్చారేమో, మెల్లిగా ఆరా తీయాలి. వాళ్ళ వెనుక తిరిగీతిరిగీ హరించుకుపోయిన ఓపికకు చెల్లుబాటయేందుకు, మిగిలిన సగం ఆకలీ తీరేందుకు, గుండిగలైనా సరిపోకపోవడం తరువాతి మాట.

అయినా ఈ కంఠశోషేం అక్కర్లేకుండా, కన్నయ్యలా తానే తల్లి మీదమీదకొచ్చి గిన్నెలు చూపించమని అడిగేవాడూ, ఊరిలో ఇల్లిల్లూ తిరిగి మాయ చేసో మంత్రం వేసో కడుపు నింపుకునేవాడూ కొడుకుగా పుట్టినందుకు, యశోదంటే నాలాంటి మామూలు అమ్మలకు అసూయ ఉండటం చిత్రమా!


(ఇది ఎప్పుడో మా రేఖ కు బాకీ పడ్డ రాత! వాళ్లబ్బాయి ముచ్చట్లు వినీ నేనూ రాయబోయి ఆపేసిన మా ఇంటి కథ. తొలి ప్రచురణ, మామ్స్‌ప్రెస్సో, తెలుగు ఎడిషన్‌లో.) 

10 comments:

  1. కళ్ల ముందు బుజ్జి ప్రహ్లాదుణ్ణి చంకనేసుకొని సంబరంగా తిరుగుతూ అలసిపోతూ ముచ్చటపడుతూ మా మానస కనిపిస్తోంది, Thank you so much so much for this beautiful note ra. "చంకనేసుకుని చందమామను చూపిస్తూ గోరుముద్దలు పెట్టేప్పుడల్లా అనిపిస్తుంది- అమ్మకు అక్కరకొచ్చేవాడు పిల్లాడికి మామ కాక మరేమవుతాడని..!" ప్రపంచాన్ని కాగితం మీదికి తెచ్చేస్తార్రా!

    ReplyDelete
    Replies
    1. ఈ రాతకి మీరేం చెప్పినా, నేను చెప్పాల్సింది మాత్రం "నీవు నేర్పిన విద్యయే.."అనే.. :)
      <3

      Delete
  2. Meeru rasindi chaduvuthunte naa iddaru pillalatho unna memories gurthuku vachayi..pillalatho ilanti anubhavalu chala mandi ammalaki untayi..kani mee antha andanga aksharalalo dachipettadam matram andariki radu..nakayithe asale radu..anduke mee meeda naku asooyaga undi����

    ReplyDelete
    Replies
    1. So sweet of you, thank you for a lovely response! <3

      Delete
  3. బాగుంది.
    మీ జవాబు చివర్లో ఆ <3 కు ఏదైనా ప్రాముఖ్యత ఉందా మానస గారూ?🤔

    ReplyDelete
    Replies
    1. :)) ఏదో కొంత ఉందనే అనుకుంటున్నా అండీ..:))))

      less than 3 అంటే heart symbol :)

      Delete
    2. హేవిటో, ఈ తరం ‌‌‌వారు ‌‌‌వాడే చిహ్నాలు 🙁.

      Delete
  4. చాలా బాగా రాసారండి ..

    >>రాసుకోరు కానీ, అమ్మలందరూ రచయితలే.
    చప్పట్లు చప్పట్లు 👏👏

    సహస్ర నామాలు , గోవింద నామాలు 🙏🙏


    @కృష్ణుడి కథ .. సూర్య చంద్రులు నేత్రాలుగా ఉన్న వాడు కళ్ళు మూసుకుంటే చీకటే మరి :)

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....