అమృతసంతానం - గోపీనాథ మహాంతి

బెజవాడ బెంజ్‌సర్కిల్ దగ్గర్లో, రోడ్డు మీదకే ఉండే అపార్ట్మెంట్‌లో, ఒక చిన్న ఫ్లాట్ మాది. వెనుక వైపు ఖాళీగా ఉండే ఐ.టి.ఐ కాలేజీ గ్రౌండులో పద్ధతి లేకుండా అల్లుకుపోయే పిచ్చి చెట్లూ, దూరంగా కనపడే గుణదల కొండా, ఆ కొండ మీద మిణుకుమిణుకుమనే దీపమూ, పాలిటెక్నిక్ కాలేజీ గుబురు చెట్ల మీంచీ సూర్యుడూ చంద్రుడూ ఆకాశం పైకి ఎగబాకుతూ వచ్చే దృశ్యమూ - ఇదే నేను చూసిన ప్రపంచమూ, ప్రకృతీ. ఊరెళుతూ వెళుతూ పక్కవాళ్ళకి తాళాలిచ్చి నీళ్ళు పోయించుకు కాపాడుకునే తులసీ, గులాబీ మొక్కలు తప్ప, ఆ ఎర్రటి కుండీల్లోని నాలుగు గుప్పిళ్ళ మట్టి తప్ప, బంకమన్నును బిగించిన అదృష్టరేఖలేవీ నా అరచేతుల్లో లేవు. అట్లాంటి ఈ ఖాళీ చేతుల్లోకి, పుష్యమాసపు చివరి దినాల ఎండని మోసుకొంటూ, అమృతసంతానం వరప్రసాదంలా వచ్చి పడింది. విచ్చుకున్న అడవి పూల మత్తుగాలిని మోసుకొచ్చింది. అడవి దేశపు వాసనలు చుట్టూ గుమ్మరించింది. గుమ్మటాల్లాంటి కొండల మధ్యలో నిలబెట్టి, 'ఎదటి కొండల మీద ఎండ కెరటాల్లా..' తేలిపోవడం చూపెట్టింది. కోఁదు గుడియాలను ఒరుసుకుంటూ పరుగెట్టే కొండవాగు పక్కన కూర్చుండబెట్టి పిల్లంగోళ్ళు వినిపించింది. చెవుల్లో డుంగుడుంగా గుబగుబలాడించింది. మామిడి టెంకల గుజ్జు గుటక దాటించింది. ఇప్పసారా జోపింది. ' షాఠీ ' లా తోక విసిరింది. 'ఆకుపచ్చ తుప్పల మధ్య ఎగసిన ఎర్రపువ్వు లాంటి గాయం ' లా - అమృతసంతానం కొంత బాధనూ మిగిల్చింది. అనుమతి అడక్కుండా యథేచ్ఛగా నా ఊహాప్రపంచాన్ని పునర్నిర్మించుకుంటూ పోయింది. 
*

సాహిత్యం లోకవృత్తాన్ని ప్రతిబింబించాలి అనే మాట, విమర్శకుల దగ్గర వినపడుతూంటుంది. ఆ మాట, ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో, రచయితలు, పాఠకుల అవసరాలను బట్టి రూపు మార్చుకోవడం రివాజయ్యాక, లోకం కాస్తా సమకాలీన సమాజమయ్యింది. దరిమిలా, మన రచనలు, వాటిలో మనం చూస్తున్న మనుషులు, వాతావరణమూ ఇవన్నీ ఇప్పటికే మనకు చిరపరిచితాలైన వాతావరణాన్ని పాత్రలను అంటిపెట్టుకుని మసలడమూ మొదలైంది. ఎప్పుడైతే ఇవి అందరికీ తెలిసిన పాత్రలే అన్న భావన స్థిరపడిపోయిందో, ఆ పాత్రలను బలమైన నేపథ్యంతోనూ, తమదైన ఒక గొంతుకతోనూ, ప్రభావంతోనూ కథలోకి నడిపించుకు రావలసిన అవసరమూ తగ్గిపోయింది. ఎక్కువ మంది రచయితలకు, ఈ పాత్రల ద్వారా చెప్పించాల్సిన కథే ముఖ్యమైపోయింది, పాత్రల కథ - వాటి ప్రాముఖ్యత వెనక్కి నెట్టబడ్డాయి. "కథలో పాత్రలు" కాకుండా, "పాత్రల ద్వారా కథ" చెప్పడమన్న పద్ధతి ఊపందుకున్నాక, రచనను నాయికా నాయికల చుట్టూ తిప్పుకురావడమూ, వాటికి ఉదాత్తతను, వీరత్వాన్నీ ఆపాదించి ఒక మెట్టెక్కించి నిలబెట్టడమూ, ఒక సరళరేఖలో వారి జీవిత గమ్యాన్ని నిర్దేశించుకుంటూ పోయి, మైలు రాళ్ళను ముందే నిలబెట్టుకుని చుక్కలను కలుపుకుపోవడమూ కూడా తప్పనిసరైపోయింది. కాబట్టే,  ఇప్పుడు మనం చదువుతున్న చాలా కథల్లో వర్ణనలంటే సందర్భ వివరణలే తప్ప ఆయా లోకపు వర్ణనలూ, మనుష్యుల వర్ణనలూ, విశేషాలూ కావు. ప్రత్యేకించి నవలలను పాపులర్ రచనలుగా ఇంటింటికీ చేర్చాక, సామాన్య పాఠకులకు కూడా అర్థమయ్యేలా చెయ్యాల్సిన అవసరానికి లోబడి, తెలుగు నవలలలో ఒక తరం రచయితలు, తమదైన పద్ధతినీ, శైలినీ నవలా రచనలో ప్రతిక్షేపించుకుంటూ పోయాక, అమృతసంతానం లాంటి ఒక నవల చదివినప్పుడు, మనం పాఠకులుగా ఎలాంటి కల్పనా చాతుర్యానికీ, రచనా ప్రపంచానికీ, ఊహాశక్తికీ దూరమయ్యామో తెలుస్తుంది. 

అందుకే అమృతసంతానంలో పాత్రల చిత్రీకరణను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రచయిత అవసరానికి మెరిసి వెళ్ళిపోయే పాత్రలు కావవి. చదువుతూండగానే మన కళ్ళకు కట్టే పాత్రలు. 

ఇందులో ఉన్న ఎన్నో పాత్రల్లో బెజుణిదీ ఒక పాత్ర. సర్వస్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న ఈ పాత్ర, కథలో ఎలా ప్రవేశపెట్టబడిందో చూడండి : ఎన్ని వివరాలతో - వ్యక్తిగతంగానూ, కోఁదు జాతిలోనూ, - ఈ పాత్ర ఉనికిని, ఆనుపానులను సవివరంగా రచయిత చెక్కుకుపోయిన తీరును చూడండి. ఈ స్ఫుటమైన వర్ణనలే, ఆ లోకానికి మనం బొత్తిగా అపరిచితులమన్న లోలోపలి సంశయాన్ని, బెరుకును మెలమెల్లగా కరిగించుకుంటూ పోతాయి.

బెజుణి ఇల్లు వచ్చింది. ఊరి చివర ఒంటరి కొంప. చుట్టూ కిత్తలితుప్పల పెండె. లోపల గడ్డీగాదా అడివి. దాని మధ్య ఒక పాడుపంచ. అందులోనే ముసిలి బెజుణి కాపురం. ఎవ్వరూ లేరామెకి. కోఁదు సమాజంలో ఒక విశిష్ట స్థానముంది బెజుణికి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవత పూనుతుందామెకి. ఏ దేవతని పిలిస్తే ఆ దేవత ఆవేశిస్తుంది. ఆమె గొడ్రాలు. చచ్చినవాళ్ళకి బతికినవాళ్ళకి మధ్య ఒక నిచ్చెన లాంటిదామె.

బెజుణి అంటే జనానికి నచ్చేది కాదు. అందవికారంగా ఉండేదామె. ఆమె గోళ్ళు డేగగోళ్ళలా వంకరగా ఉండేవి. నోట్లో రెండే రెండు పళ్ళున్నాయి. రెండూ పొగచూరిన పసుపురంగుతో ఉండేవి. కళ్ళు రెండూ పొగచూరినట్టుండేవి. ఒంటి మీద చర్మం వేలాడుతూ ఉండేది. అందరూ ఆమెను చూసి భయపడేవాళ్ళు. ఎముకలు అవుపిస్తూన్న గుండె మీద రకరకాల గాజుపూసల పేర్లూ, గుత్తుగుత్తులు తావేజులూ, వేళ్ళముక్కలూ వేలాడుతూ ఉండేవి. అసాధ్యమైంది సాధించే దామె. అగ్గిలో నడిచేది. ముళ్ళ మీద కూచునేది. దేవతల వాహనం ఆమె: బెజుణి.

రెండవది, ఈ వర్ణనల్లోని పచ్చిదనం : అది రోమాలు నిక్కబొడుకునేలా చేస్తుంది. నిటారుగా కూర్చోబెట్టి పుస్తకం చదివిస్తుంది. మొదటి పేజీల్లోనే మనకెదురయే పియు, నెలలు నిండాక అడవిలో ఒంటరిగా ఆమె పడ్డ క్షోభ, రచయిత మాటల్లోనే..ఇలా -

"తుఫానులాగ తెరలుతెరలుగా వస్తున్నాయి నొప్పులు. ఒంటి మీద కెరటాలు విరిచిపోయేవి. పుయు అరిచేది. ఏడ్చేది. లోకం మరచిపోయేది, బైట ఎండ ఉజ్జ్వలంగా ఉంది. ప్రకృతి విచ్చలవిడిగా ఉంది. అన్నీ మరచిపోయింది పుయు. ఒంట్లో ఏదో భయంకరమైన విప్లవం రేగుతున్నట్టుంది. ఏదో తెంపుకున్నట్టుంది. లాక్కుంటున్నట్టంది. పీక్కునట్లు పెనుగులాడుతున్నట్లు ఉంది. అంతా రణ చీకటి. దుఃఖం. మద్దిచెట్టు రెండు చేతులతోనూ బిగించి పట్టుకునేది పియు. చెట్టు బెరడు పళ్ళతో కరచిపట్టేది. అమ్మవారు పూనట్టు వొంటికి ఎక్కడలేని సత్తువా వచ్చేది. నులుచుకునేది. 

ఎంతసేపలా గడచిందో తెలీదామెకి. హఠాత్తుగా తుఫాను  ఆగిపోయినట్టు అనిపించింది. కళ్ళ ముందు చీకటి తొలగిపోయింది. దిమ్మెత్తిపోయిన చెవులకి ఏదో కొత్తజంతువు అరచినట్టు వినిపించింది. ఆమె వినడం కోసమే ఎవరో గూబలు పగిలిపోయినట్టు అరుస్తున్నారు. పుయు నివ్వెరపోయి చూసింది. ఎర్రటి చిన్నమనిషి కిందపడి అరుస్తున్నాడు.పుయు తెలువుకుంది. చేరడేసి కళ్ళు చేసుకు చూసిందామె. ఆఁ? ఇది తన బిడ్డా? ఇదేనా ఇంతకాలమూ తన దేహంలో దాగుడుమూతలాడుతూ ఉంది? ...

బలం లేని చేతులతో ఒక దారైన రాతిముక్క తీసిందామె. దాంతో కొడుకు బొడ్డు కోసింది."

చివ్వుమని లోపల నొప్పి లేచే వర్ణన - "అమృతసంతానం" నేలను పడే వేళ. అమృతసంతానం చదవగానే గుర్తింపుకొచ్చేది, అందులోని భాష అనీ, కవిత్వమనీ, ఈ పుస్తకం ఇప్పటికే చదివిన మిత్రులు కొందరు నాతో చెప్పినప్పుడు, నేనా కవిత్వం దగ్గరే ఆగిపోతాననుకున్నాను. "పుష్య మాసపు చివరి దినాల ఎండ" నన్ను పట్టి నిలబెట్టడమూ అబద్దం కాదు. అయితే, నన్నాపినవి, నవలలో ఒక గొప్ప వచనం చదివిన తృప్తీ, సంతోషమే తప్ప కవిత్వం కళ్ళకు అడ్డుపడటం కాదు. అది ఈ రచన విలువను పెంచేదే తప్ప, పాఠకులను పక్కదారి పట్టించేది కాదు. ఈ మాటలు రాస్తూ రాస్తూ నేను ఇది పురిపండా వారు చేసిన అనువాదమనీ మరొక్కసారి నాకు నేనే గుర్తు చేసుకుంటున్నాను. ఇట్లాంటి అనువాదం అరుదే కాదు, అసంభవం కూడా. ఇంత తేనెలొలికే తెలుగూ, తూచి వేసినట్లే పడ్డ మాటలూ, వాక్య నిర్మాణమూ, ఈ పుస్తకాన్ని భారతీయ సాహిత్యంలోనే పైవరుసలో కూర్చుండబెడతాయి.

ఒక సవిస్తారమైన ప్రపంచం! వలయాలు వలయాలుగా - లౌకికంగా మనమనుభవించినట్లే - శకలాలుగా, ఇక్కడా - మరొకచోట కూడా, కనపడని ముడులతో, ఇప్పటికింకా ముడిపడని మనుష్యుల మధ్య, పోగులుపోగులుగా అల్లుకుపోయే సాంసారిక బంధాలను సవిస్తరంగా చూపెట్టడానికి నవలకున్న పరిధే సరైనది. 

అమృత సంతానం ఒక నాయకి కథ కాదు. ఒక జాతి కథ. ఒరిస్సా కొండ ప్రాంతాల్లో జీవించే కోఁదుల బ్రతుకు కథ. అక్కడి సంస్కృతిని పరిచయం చేసిన కథ. అందుకే, ఒక 'సావొతా' సరబులా, ఒక 'డివరీ'లా, ఒక 'బిజుణి' లా, పియు లా, లెంజులా, పియోటి లా, హకీరాలా, ఈ కథలో కొండలూ, వాగులూ, డప్పులూ కూడా మనకు స్పష్టంగా పరిచయమవుతాయి. ఆ దారులు అస్పష్ట రేఖలు కావు. ఎక్కడ అడుగు తీసి అడుగేయాలో విస్పష్టంగా చూపెట్టిన కథనమిది. 

అయితే, ఇది  విశ్వసనీయత కోసమో, పఠనీయత కోసమో మాత్రమే చెప్పుకోవలసిన వివరం కాదు. ఒక సర్వస్వతంత్ర ప్రపంచాన్ని పాఠకుడి చేతుల్లో పెట్టేప్పుడు, సమర్థుడూ, సహృదయుడూ అయిన రచయిత పడే కష్టమిదంతా. మరోలా చెప్పాలంటే, ఒక మంచి రచయితకు, మంచి పాఠకుడి మీద ఉండే అవ్యాజమైన ప్రేమ మాత్రమే ఇలాంటి రచనలా బయటకు రాగలదు. 

ఒక కథగా చెప్పాలంటే, అమృతసంతానం చిన్నదే. కానీ పరికించి చూసినవాళ్ళకి, జీవితమంత పెద్దది. బహుముఖీయమైనది. తప్పొప్పులకు అతీతంగా, జీవితం ఎలా సాగగలదో, అదే చూపిస్తుందీ పుస్తకం. కొండల మీద పారాడి పారిపోయే వెలుగు నీడల్లాగే, జీవితమూ ఎప్పుడూ ఒక రంగు పులుముకుని కూర్చునేది కాదని చెప్తుంది. కోఁదు జీవన నేపథ్యంలో ఈ కథను చెప్పడం, ఎత్తైన కొండల మీదా, ఆ లోయల్లోనూ అప్పుడప్పుడే నాగరికత పొటమరిస్తోన్న వాతావరణాన్ని చూపించడం, ఈ కథను మరింత ప్రత్యేకం చేశాయి. ప్రత్యేకించి ప్రకృతి వర్ణనల్లోని కవితాత్మకత, వాటిలోని నవ్యత (ఈనాటికీ..), ఆ వర్ణనల లోతూ, విస్తృతీ, ఈ పుస్తక పఠనానుభవాన్ని తనివి తీరని అనుభవంగా మిగులుస్తాయి. మానవ సంబంధాలు ఎన్ని ముళ్ళు పడి ఉన్నాయో, అన్ని ముళ్ళనూ విప్పే ప్రయత్నం, కాదంటే కనీసం తాకే ప్రయత్నం చేసి వదిలింది. ప్రత్యేకించి శారీరక సంబంధాల విషయంలో మనిషికి స్వాభావికమైన ఆశనూ, ఆకలినీ అంతే గాఢంగా, పదునైన పదాల్లో చూపెట్టింది. 

"వెర్రెత్తిస్తోంది పియొటి. అభాసంతోనూ, ఇంగితంతోనూ దివుడు సావొఁతా గుండె మీద సమ్మెటపడేది. ఆమె ఒళ్ళు కొంచం ఒంపు చేసేది, దివుడు మొహం మీద వేడిగాడ్పు కొట్టి, మొహం ఆర్చుకుపోయేది. ఆమె రవంత పక్కకి జరిగేది. ఇరవై మూళ్ళ దూరాన ఉండికూడా కోణం లెక్కప్రకారం అతడిమెడ అంతే జరిగేది"

ఇదీ అతని లెక్క! ఇట్లాంటి మాటల గారడీతో మన మెడలనూ వంచి చదివించే నేర్పుతో, లెక్కతప్పని నిపుణతతో, ఇంత పకడ్బందీగానే ఏ సన్నివేశాన్నైనా రాసుకుపోయాడు. 

అది ఫారెస్టాఫీసర్ల దాష్టీకం కావచ్చు, లెంజుకోఁదు నిస్సహాయత కావచ్చు, మన్యం జ్వరాల గురించి కావచ్చు, లొడబిడలాడుతూ ఆ శుభ్రస్వచ్ఛ లోకంలోకి చొచ్చుకొచ్చిన షావుకార్ల గురించి కావచ్చు- ఒక కథైనా, నవలైనా చదివేప్పుడు మనం ఎట్లాంటి నిజాయితీని ఆశిస్తామో, అదంతా ఈ రచనలో దొరుకుతుంది. ప్రత్యేకించి ఆ కొండజాతి వాళ్ళు తమ అమాయకత్వం వల్లా, అసహాయత వల్లా, అన్ని రకాలుగానూ దోపిడీకి గురవడాన్ని గురించి చదివినప్పుడు, మనకు నమ్మకంగా తెలుస్తుంది, ఇలాంటి ఒక  రచన చెయ్యడానికి నైపుణ్యమొక్కటే కాదు, గుండెలో ఆర్ద్రత కూడా ఉండాలి. కళ్ళలోనూ కలంలోనూ కొంత కన్నీరుండాలి. పోతే, ఇన్ని పాత్రల గురించీ, ఇంత చెప్పీ, రచయిత ఎక్కడా ఏ పాత్ర తరఫునా వకాల్తా పుచ్చుకోవడం కనపడదు. ఎంచి ఒకరికి అండగా నిలబడి ముందుకు నెట్టడమూ ఉండదు. రచయిత నిలబెట్టుకున్న ఈ ఎడం, మనలని వాళ్ళకి దగ్గర చేస్తుంది. మనకి మనంగా వాళ్ళని హత్తుకునేట్లు చేస్తుంది. పుయునే గమనించండి. 

ఎంత సంఘర్షణనో అనుభవించిన మనసు పుయుది. ఆమె తన స్వహస్తాలతో బొడ్డు కోసిన అమృతసంతానం ఊసుతో కథ మొదలవుతుంది. అది మొదలు. మనస్సులో అగ్గి మండుతోన్నా, ఒళ్ళో పిల్లాణ్ణి చూసుకుంటే కళ్ళు ధారలు కట్టే వేదనలోకి వెళ్తుంది, ఆఖరు పేజీల వద్దకొచ్చే సరికి. "ఎవళ్ళు వాణ్ణి నా అని ఆదుకుని పైటకొంగు కప్పుతారు?" అనుకుంటే దేవుడు గుర్తొస్తాడామెకి. మన గుండె చెరువైపోతుంది. వెక్కి వెక్కి ఏడుస్తూ ఆకాశం వైపుకి మొహమెత్తుకుంటుంది. 

అండగా ఉండే వాళ్ళు లేరని కాదు. అయినా, పుయు బుదరింపు మాటలన్నీ అంత దుఃఖంలోనూ పసిగడుతూనే వొచ్చింది. దేబిరింపుతనం తన ఛాయలకు రాకుండా జాగ్రత్తపడుతూనే వచ్చింది.  ఆమె మనసులోకి ఇంకిందల్లా 'డిసారి' మాటే.

"మూణ్ణాళ్ళ ముచ్చట మనిషి జన్మ. తరవాత మార్పు రానే వస్తుంది. ఈ రెన్నాళ్ళూ గడుపుకోడం సాధ్యం కాదా?"

ఆకాశం వైపు చూసింది కానీ, ఆశ వదులుకోలేదు పుయు. తనదైన బంధాన్ని, తనదే అయిన జీవితాన్ని, ఎవ్వరికీ అయాచితంగా ధారపొయ్యలేదు. ధీరనాయిక పుయు! ఎగసిన ఆత్మగౌరవ పతాక! సీతనీ, ఒకానొక కోణంలో శకుంతలనీ కూడా గుర్తుకుతెస్తుంది. 

ముందుకు నడిచింది. కథనూ నడిపించింది. 

చావు లేని కథ, జీవనంలో ఉన్న రుచి తెలిపిన కథ. "అమృత సంతానం"

*
ఆశా? ఆకలా? ఆక్రమణా? జాలీ, మోసం, కల్లోలమా? అసహాయతా? నిబ్బరమా? యుద్ధ స్థైర్యమా? మీరు చెప్పండి! ఒక గొప్ప నవలలో మీరేం ఆశిస్తారో, ఏం ఊహిస్తారో! అవన్నీ అంతకు పదింతలుగా దొరికే పుస్తకమిదేనేమో చదివి సరిచూసుకోండి. జటాజూటంలో ఉన్నంతసేపూ విశ్వరూపం చూపని గంగలా, భగీరథ ప్రయత్నం లేనిదే ఎవరికీ అందుబాటులోకి రాని గంగలా, ఈ ఆరువందల పేజీల పుస్తకం రెండు అట్టల మధ్యా చిక్కుబడి ఉన్నంతకాలమూ మనకిది అర్థం కాదు. భగీరథప్రయత్నం ఎవరికివారే చేసుకోవాలి. తరాలు, మారే కాలాలు, వాటి క్రీనీడలూ, మానవ సంబంధాలూ, మహోద్వేగాలూ..రచనా విశ్వరూపాన్ని చూడటానికి సంసిద్ధులై ఈ పుస్తకాన్ని అందుకోండి.

*
"అమృతసంతానం"
ఒడియా మూలం : గోపీనాథ మహాంతీ
తెలుగు : పురిపండా అప్పలస్వామి.

3 comments:

  1. పుస్తక సమీక్ష చదివి ఇప్పటి దాకా నేనే పుస్తకం చదవలేదనే అనుకుంటాను. ఇప్పుడు ఈ పుస్తకం చదువుతాను. ఇప్పటిదాకా నేను చదివిన సమీక్షల్లో ఇది మొదటి వరసలో ఉంటుంది. అభినందనలు. ...... దహా

    ReplyDelete
  2. మీ సమీక్షే అమృతంలా మానస-మధురంలా వుంది. మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు. థాంక్స్ మానసా!

    ReplyDelete
  3. Thank you so much, Bulusu Garu, Lalitha Garu.
    Here is the e-link

    https://drive.google.com/file/d/0B3dreJny4z-0ZUN1OFNldkJoUGM/view

    Let me know your reading experiences. :-)

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....