కొత్తనేలపాట

తలుపు తియ్యగానే ఎదురొచ్చే ఆ రెండు తెల్ల ముఖాలూ
కొత్తగా కొని, వాళ్ళు ముంజేతికి కట్టేసుకున్న బుల్లి కుక్కపిల్లా.
అదే సైడ్‌వాక్, అవే ముఖాలు,
అక్కర్లేని అక్కరకురాని నవ్వులు
అలవాటైన ప్రశ్నలకి
అనాలోచితంగా ఇచ్చే జవాబులు.
ఏ దిక్కుకి చూసినా
మూసుకుపోయి వెక్కిరించే తలుపులు.
ఆగి నిలబడి చూసినా
నాది కాదనే అనిపించే లోకం.
దిగులు బుడగకు బయటే స్థిరపడి
అనుభవానికి రాని సౌందర్యం.
ఘడియ ఘడియకీ పక్షిరెక్కలతో
సముద్రాలు దాటి వెళ్ళే మనసు.
ఆకులు కదలని చెట్ల నడుమ
నా అడుగు తడబడి తూలినప్పుడు
ఆ తెల్లటి ముఖాలలో ఆందోళనల నీడలు-
“ఆర్ యూ ఓకే? డూ యూ నీడ్ సమ్ హెల్ప్?”
నాది కాని దేశం
నాది కాని భాష
గొంతు క్రింద కోపం
గొంతులో అడ్డుగా దుఃఖం
పట్టి ఆపిన బెల్ట్ లాక్కొని
నామీదకెగిరిన కుక్కపిల్లది
ప్రేమా? కోపమా?
పెద్దపెద్ద అరుపులతో
ఇంట్లోకొచ్చి పడ్డ నాది
బాధా? భయమా?
బైట నుండి వినిపిస్తున్న
క్షమాపణలూ పరామర్శల భాష
పరాయిదేనా? నిజంగా?
మూసుకున్న తలుపులపై ఆనుకున్న నాకు
అక్కసు అభద్రత అర్థమవుతున్నాయిప్పుడే,
ఆర్తీ అక్కర కూడా.
“అయామ్ ఓకే, అయామ్ ఓకే.”
వలసగీతం వల్లించే గుండె
వాళ్ళకు జవాబయితే ఇచ్చింది కాని
తలుపులు తెరుచుకోవాలంటే ఇక
తలపులెన్ని సుడులు తిరగాలో.

*తొలి ప్రచురణ : ఈమాట, జులై-2018 సంచిక

కొన్ని ఆశలూ, కొన్ని అభిప్రాయాలూ


http://www.andhrajyothy.com/artical?SID=610054

*23/7 ఆంధ్రజ్యోతిలో

శతవసంత లక్ష్మి

చెప్పగలిగే నేర్పు అనుభవించిన మనకు లేకపోవడమే తప్ప, మనలో చాలా మందికి "బంగారు మురుగు" బామ్మ లాంటి బామ్మ/అమ్మమ్మ ప్రేమ అనుభవమే అని నా నమ్మకం. నాకు ఊహ తెలిసే నాటికే మా అమ్మమ్మకు డెబ్బై ఏళ్ళు దగ్గరపడ్డాయి. విజయవాడలో ఇద్దరు కూతుళ్ళున్నా సరే, నా ఒక్కగానొక్క మేనమామను విడిచి రావడానికి ఒప్పుకునేదే కాదు. బతిమాలీ బామాలీ ఏ వేసవి సెలవులకో ఇంటికి తీసుకొస్తే, వచ్చిన రోజు నుండే ఏదో పని నెత్తిమీదకు వేసుకునేది. రోటి పచ్చళ్ళో, దేవుడి దగ్గర వెండి పూలు తోమడమో, అమ్మ చీరలన్నీ చేతులతో ఒత్తివొత్తి శుభ్రంగా మడతలు పెట్టడమో, నాకు తలంతా నూనె పట్టించి ఓపిగ్గా దువ్వి జడలెయ్యడమో..ఏదో ఒకటి చేస్తూనే ఉండేది. పరీక్షలొస్తున్నాయంటే చాలు - పొద్దున లేచి చదువుతాంలే అమ్మమ్మా అన్నామా, లేచి తీరాల్సిందే. గంట కొట్టినట్టే లేపేది. లేచేదాకా రెణ్ణిముషాల కొకసారి గుర్తు చేస్తూనే ఉండేది. ఆవిడ గొడవకి అమ్మ లేచొచ్చి తిడుతుందన్న భయానికి నసుగుతూనే లేచి కూర్చునేవాళ్ళం. స్నానం చేసుకుని పూజ చేసుకుని చదువుకోమనేది. "స్పర్ధయే వర్ధతే విద్యా" అని మా క్లాసులో మా కన్నా బాగా చదివేవాళ్ళ పేర్లు వద్దన్నా గుర్తు చేస్తూ ఉండేది. మేం విసుగుమొహాలు పెట్టి, పుస్తకాల్లో తలలు దూర్చి కూర్చునేవాళ్ళం. పరీక్షలప్పుడు భయమేసి కాలుగాలిన పిల్లుల్లా తిరుగుతుంటే, "ముందు చదువుకు ఏడవరాదూ" అని మొహంవాచేట్టు తిట్టి ఆంజనేయ మంత్రం చెప్పేది. ఏదైనా వస్తువు పోతే మా అమ్మమ్మ ఎట్లాయీనా సాధించి తీరుతుందని మా కజిన్స్లో ఒక బలమైన నమ్మకం. ఆ వెదుకులాటకు వెయ్యి దండాలు. ఆవిడ వెటకారం అర్థమవ్వడానికే చాలాసేపు పట్టేది. నన్నూ, నా ఆటలనూ, నా స్నేహితులనూ వెయ్యి కళ్ళతో కనిపెట్టి, మా అమ్మ బడి నుండి రావడంతోటే నేరాలు చెప్పేది. అప్పుడు కోపంగా ఉండేది. ఇప్పుడు అర్థమవుతోంది. ఆవిడ పట్టుదలా, క్రమశిక్షణా, శుభ్రతా, ఓపికా, దేన్నైనా తేలిగ్గా తీసుకునే స్వభావం, కష్టపడే తత్వం, తృప్తీ, క్షమా - మాలో ఎవ్వరికీ ఆ స్థాయిలో పట్టుబడలేదనిపిస్తుంది.  

పోయిన నెలలో అమ్మమ్మ వందవ పుట్టినరోజు పిల్లలూ, మనవలూ, మునిమనవలూ అందరూ కలిసి పండుగలా చేశారు.  వెళ్ళలేకపోయిన ఇద్దరు మనవలలో నేనొకదాన్ని. రెండవవాడు, నా మేనమామ ఒక్కగానొక్క కొడుకు మనోహర్. ఇద్దరం అమెరికాలోనే ఉన్నాం. ఆ వారం రోజులూ, అటుపైన, ఎవరి ఊళ్ళకి, ఎవరి దేశాలకి వాళ్ళు వెళ్ళే దాకా, పూటకో ఫొటో, ఓ వీడియో పెట్టి ప్రాణాలు తోడేశారు మా వాళ్ళంతా. కానీ మొన్న నా పిన్ని కొడుకు సందీప్ -' అమ్మమ్మ నువ్వు రాసిన కవిత చూడు ఎట్లా చదువుకుంటోందో రోజూ' అని మా "సీతామహాలక్ష్మి మనవలు" గ్రూప్‌లోఓ వీడియో పంపినప్పుడు మాత్రం, మాటమాటా కూడబలుక్కుంటూ, పవిటతో కళ్ళొద్దుకుంటూ మెల్లిగా చదువుకుంటున్న అమ్మమ్మను చూడగానే నా సంతోషమూ దిగులూ కూడా రెట్టింపైపోయాయి.
అమ్మమ్మ గురించి నేనేదైనా రాసి తీరాల్సిందే అన్నప్పుడు, నా వల్ల కానేకాదని తప్పుకున్నాను. పోరు పడలేక ఒప్పుకున్నాక కూడా, నాలుగుమాటలు రాయగానే అమ్మమ్మ కళ్ళముందుకొచ్చి భారంగా అనిపించేది. ఎక్కడ మొదలెట్టాలో, ఎక్కడ ఆపాలో ఏమీ అర్థం కాలేదు. ఇంత దగ్గరి అనుబంధాల గురించి వ్రాయడం చాలా కష్టమైన పని, నాకైతే చేతకాని పని- కానీ అమ్మ ప్రేమకి తలొగ్గి వ్రాయక తప్పలేదు. 



శతవసంత లక్ష్మి
==============


వేయి పున్నముల వెన్నెల తటాలున కురిసినట్టూ,
చంద్రహారపు పుత్తడి మెరుపేదో తళుక్కున మెరిసినట్టూ,

అమ్మమ్మ జ్ఞాపకం!

నున్నగా, నూనె రాసి శ్రద్ధగా దువ్వుకున్న
పండిన తలపై నుండి,జీవితంలోని
నలుపు తెలుపు రంగులన్నింటినీ
చదివీ చూసీ విడదీస్తున్నట్టుండే
అమ్మమ్మ పాపిట, 
బిగించి కట్టిన ముడీ 

ముక్కోటి అనుభవాలను 
దిక్కుకొక్కటిగా చల్లినట్టుండే
ఆ తెల్లరాళ్ళ చెవి దిద్దులు, 
వాటి బరువుకు సాగీ సాగీ వేలాడే 
ఆ చెవి తమ్మెలు

వేసవి సెలవుల్లో మావయ్య ఇంటికెళ్ళినప్పుడు
ఆరేడేళ్ళ నా పసితనం మంకుగా ఏడుస్తున్నప్పుడు
పైవరసల్లోని స్టీలు డబ్బాల్లోంచీ మిఠాయి తెచ్చి
వీధరుగు మీద కూర్చోబెట్టి తినిపించిన సనసన్నటి చేతులు,
ముడతలు పడ్డ ఆ వేళ్ళూ,  

పదిహేనుమంది మనవల్లో, 
ఎవరెప్పుడు దగ్గరకెళ్ళి ముద్దాడినా, 
నాలుగు పేర్లు దాటాక గానీ అసలు పేరు చెప్పనివ్వని ప్రేమ,
నుదిటి మడతల్లో నలిగి కనపడే జ్ఞాపకశక్తీ,

అమ్మమ్మంటే, పుట్టగానే అమ్మ నా గుప్పెట్లో పెట్టిన పగడపు ఉంగరం! 
పసితనపు చేసంచీ అరల్లో భద్రంగా దాచిపెట్టుకున్న తీపి తాయిలం!   

ఒక్క దొండపాదుతో ఏ తుఫాను గాలికీ తొణక్కుండా
ఇల్లు నడిపిన నిండుకుండ అనేవారొకరూ,
లోచూపుతో ఇందరిందరిని కనిపెట్టుకుని
దప్పి తీర్చి సేదతీర్చిన చల్లని సెల అనేదొకరూ,
వెళ్ళిపోతున్నాం -అనగానే గబాల్న కదిలి కావలించుకుని 
కన్నీరైపోయ్యే గోదారి అనేది ఇంకొకరు.
ఒక్కొక్కరికీ ఒక్కోలా, 
అద్దంలా. ఆకాశంలా.
అందరి మనసులూ తడయ్యేలా, తేటపడేలా,
అమ్మలా, అమ్మమ్మలా, సీతమ్మలా.. 

వెనక్కి తిరిగి చూస్తే వేయి పున్నములు.
వేలెండంత కూడా లేని మేం చేసిన
వేలవేల తప్పులు. 
పశ్చాత్తాపాలూ, ప్రాయశ్చిత్తాలూ, 
ఇప్పుడు ఆగి నిలబడితే కొన్ని కన్నీళ్ళు.

మెత్తటి చీరల్లో ముడుచుకు పడుకుని
మావయ్య ఇంట్లో మా కోసం ఆశగా చూస్తున్నట్టూ..
ఫోనుల్లో మా మాట వినగానే,
ఓసారి వచ్చి కనపడవే అంటున్నట్టూ..
నే చెప్పిన మంత్రం చదూకుంటున్నావా? అని 
అలాగే వంగి ఆరా తీస్తున్నట్టూ..
"ఆయీ ఆయీ ఆపదలు కాయీ" అని
లాలి పాడి నిద్రపుచ్చుతున్నట్టూ
వేపచెట్టు క్రింద కథలు చెబుతున్నట్టూ
వెలక్కాయ పచ్చడితో ముద్దలు పెడుతున్నట్టూ
నిన్ను తీసుకెళ్తా రావె అమ్మమ్మా అంటే
'ఓ...యబ్బో' అంటూ వెక్కిరిస్తున్నట్టూ.. 

అమ్మమ్మ అనుకుంటే చాలు, 
వేయి అనుభవాలిలా పూరేకుల్లా నా చుట్టూ ఎగిరి
నన్నొక సీతాకోకను చేసి ఆడిస్తాయి.
అమ్మమ్మంటే,
నా ప్రతిభయాన్నీ దాటించిన తిరుగులేని రామమంత్రం,
వేయి చేతులతో నన్ను కాచుకుని 
బ్రతుకంతా వెంట నడిచే తొలిప్రేమప్రపంచం.

<3 div="" nbsp="">

ఆకుపచ్చద్వీపం

నీ పేరు పక్క వెలిగే ఆకుపచ్చ దీపాన్ని చూస్తే
వేయి పావురాలు టపటపా రెక్కలు విదుల్చుకుంటూ
ఆకాశంలోకి ఎగిరినట్టుంటుంది.
అడవిదారిలో నడుస్తోంటే జలపాతపు హోరేదో చెవుల్లో పడి
ఒళ్ళంతా పులకలు రేగినట్టుంటుంది.
తెల్లకాగితాలన్నీ రంగుపతంగులుగా మారి తలపై తిరుగుతుంటే
అక్షరాల దారాలు వాటిని నీ వైపు మళ్ళిస్తున్నట్టుంటుంది.
సూర్యుడూ చంద్రుడూ మనలాగే కాలాలు సర్దుకుని,
పక్కపక్కన చేరి మనని గమనిస్తునట్టు ఉంటుంది.

ఏడేడు ముఖాలతో నాకు నువ్వూ నీకు నేనూ
ఎదురవడమనే పరీక్ష వస్తుంది కానీ,
నీ జాలి మొహం వెనుక నున్న కవ్వింపూ
నా నవ్వు మొకం వెనుక ఉన్న వెక్కిరింపూ
ఏ క్షణానికా క్షణం గ్రహింపులోకి వస్తూనే ఉంటుంది.
ఎన్నెన్ని ముసుగులేసినా దాయని ప్రేమ ఒకటి
మన మన కిటికీల్లో నుండి దూదిపింజెలా ఎగిరి
దిక్కులన్నీ తాకుతూనే ఉంటుంది.

చుక్కలుగా విరిగిపడే మౌనాన్నీ,
బేక్‌స్పేస్ చెప్పని కథలనీ,
ఈ దూరాలు నేర్పిన కొత్త లిపిని
కూడబలుక్కుని చదువుతూనే ఉంటాం.
భూమికి చెరోపక్కగా కూర్చుని,
వేళ్ళ చివరి విద్యుచ్చక్తి నరాల్లోకి పాకించే ప్రాణశక్తిని
రెప్పల కంటించుకున్న కలలన్నీ పండి రాలిపడేదాకా
అందుకుంటూనే ఉంటాం.

అలాగే అక్కడే కూర్చుంటాం మనం
దగ్గరితనమంతా
మూడే రంగులతో కొలుచుకుంటూ
బెత్తెడంత కిటికీలో మనసంతా పరుచుకుంటూ
నిమిషాలో గంటలో, గారాలో గొడవలో,
మనదైన ద్వీపంలో చిక్కుపడ్డాక,
ఇద్దరి గుప్పెళ్ళూ విప్పుకుని
ఒకే రహస్యానికి ఇరుకొసలమవుతాం.

కాలసర్పం కొరికీ కొరికీ కొరికీ
మనం పట్టుకున్న ఒంటిఓటితీగను తెంపేస్తోన్నా

పావురాలన్నీ ఏ శూన్యంలోకో ఎగిరిపోతూ పోతూ
బూడిదరంగును ఇద్దరి ముఖాలకీ పులిమేస్తోన్నా

తల తెగినా నాట్యమాపని జానపదకథలో పాత్రల్లాగా
తత్తరపాటుతో కాసేపక్కడే తచ్చాడి లేస్తాం,

మనసుకి మీట నొక్కుకోవడం చేత కాని మనం -
ముసుగులు సరిచూసుకోకుండానే.
రంగస్థలం వైపు.

**తొలి ప్రచురణ, ఆంధ్రజ్యోతి వివిధలో (17-06-2018)..

http://www.andhrajyothy.com/artical?SID=594122
(My sincere thanks to my colleague and good friend Vamsi S, who motivated me to write this poem - Thanks buddy! This one is for you!)

పంతం

రోజురోజూ నేనేం లెక్కపెట్టుకోను
మారే ఋతువుల నసలు పట్టించుకోను
ఉన్నదొక్కటే దేహం
మనసుకొక్కటే పంతం
పరిచయమూ నీవల్ల ప్రియమూ అయిన నిశ్శబ్దాన్ని
పట్టుకోకూడదని తెలుసు కానీ
జారిపోనీయలేను
ఈ చలికాలపు పొద్దును.
నిన్ను.

*తొలి ప్రచురణ : ఈమాట, మే -2018 సంచికలో.

అమృతసంతానం - గోపీనాథ మహాంతి

బెజవాడ బెంజ్‌సర్కిల్ దగ్గర్లో, రోడ్డు మీదకే ఉండే అపార్ట్మెంట్‌లో, ఒక చిన్న ఫ్లాట్ మాది. వెనుక వైపు ఖాళీగా ఉండే ఐ.టి.ఐ కాలేజీ గ్రౌండులో పద్ధతి లేకుండా అల్లుకుపోయే పిచ్చి చెట్లూ, దూరంగా కనపడే గుణదల కొండా, ఆ కొండ మీద మిణుకుమిణుకుమనే దీపమూ, పాలిటెక్నిక్ కాలేజీ గుబురు చెట్ల మీంచీ సూర్యుడూ చంద్రుడూ ఆకాశం పైకి ఎగబాకుతూ వచ్చే దృశ్యమూ - ఇదే నేను చూసిన ప్రపంచమూ, ప్రకృతీ. ఊరెళుతూ వెళుతూ పక్కవాళ్ళకి తాళాలిచ్చి నీళ్ళు పోయించుకు కాపాడుకునే తులసీ, గులాబీ మొక్కలు తప్ప, ఆ ఎర్రటి కుండీల్లోని నాలుగు గుప్పిళ్ళ మట్టి తప్ప, బంకమన్నును బిగించిన అదృష్టరేఖలేవీ నా అరచేతుల్లో లేవు. అట్లాంటి ఈ ఖాళీ చేతుల్లోకి, పుష్యమాసపు చివరి దినాల ఎండని మోసుకొంటూ, అమృతసంతానం వరప్రసాదంలా వచ్చి పడింది. విచ్చుకున్న అడవి పూల మత్తుగాలిని మోసుకొచ్చింది. అడవి దేశపు వాసనలు చుట్టూ గుమ్మరించింది. గుమ్మటాల్లాంటి కొండల మధ్యలో నిలబెట్టి, 'ఎదటి కొండల మీద ఎండ కెరటాల్లా..' తేలిపోవడం చూపెట్టింది. కోఁదు గుడియాలను ఒరుసుకుంటూ పరుగెట్టే కొండవాగు పక్కన కూర్చుండబెట్టి పిల్లంగోళ్ళు వినిపించింది. చెవుల్లో డుంగుడుంగా గుబగుబలాడించింది. మామిడి టెంకల గుజ్జు గుటక దాటించింది. ఇప్పసారా జోపింది. ' షాఠీ ' లా తోక విసిరింది. 'ఆకుపచ్చ తుప్పల మధ్య ఎగసిన ఎర్రపువ్వు లాంటి గాయం ' లా - అమృతసంతానం కొంత బాధనూ మిగిల్చింది. అనుమతి అడక్కుండా యథేచ్ఛగా నా ఊహాప్రపంచాన్ని పునర్నిర్మించుకుంటూ పోయింది. 
*

సాహిత్యం లోకవృత్తాన్ని ప్రతిబింబించాలి అనే మాట, విమర్శకుల దగ్గర వినపడుతూంటుంది. ఆ మాట, ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో, రచయితలు, పాఠకుల అవసరాలను బట్టి రూపు మార్చుకోవడం రివాజయ్యాక, లోకం కాస్తా సమకాలీన సమాజమయ్యింది. దరిమిలా, మన రచనలు, వాటిలో మనం చూస్తున్న మనుషులు, వాతావరణమూ ఇవన్నీ ఇప్పటికే మనకు చిరపరిచితాలైన వాతావరణాన్ని పాత్రలను అంటిపెట్టుకుని మసలడమూ మొదలైంది. ఎప్పుడైతే ఇవి అందరికీ తెలిసిన పాత్రలే అన్న భావన స్థిరపడిపోయిందో, ఆ పాత్రలను బలమైన నేపథ్యంతోనూ, తమదైన ఒక గొంతుకతోనూ, ప్రభావంతోనూ కథలోకి నడిపించుకు రావలసిన అవసరమూ తగ్గిపోయింది. ఎక్కువ మంది రచయితలకు, ఈ పాత్రల ద్వారా చెప్పించాల్సిన కథే ముఖ్యమైపోయింది, పాత్రల కథ - వాటి ప్రాముఖ్యత వెనక్కి నెట్టబడ్డాయి. "కథలో పాత్రలు" కాకుండా, "పాత్రల ద్వారా కథ" చెప్పడమన్న పద్ధతి ఊపందుకున్నాక, రచనను నాయికా నాయికల చుట్టూ తిప్పుకురావడమూ, వాటికి ఉదాత్తతను, వీరత్వాన్నీ ఆపాదించి ఒక మెట్టెక్కించి నిలబెట్టడమూ, ఒక సరళరేఖలో వారి జీవిత గమ్యాన్ని నిర్దేశించుకుంటూ పోయి, మైలు రాళ్ళను ముందే నిలబెట్టుకుని చుక్కలను కలుపుకుపోవడమూ కూడా తప్పనిసరైపోయింది. కాబట్టే,  ఇప్పుడు మనం చదువుతున్న చాలా కథల్లో వర్ణనలంటే సందర్భ వివరణలే తప్ప ఆయా లోకపు వర్ణనలూ, మనుష్యుల వర్ణనలూ, విశేషాలూ కావు. ప్రత్యేకించి నవలలను పాపులర్ రచనలుగా ఇంటింటికీ చేర్చాక, సామాన్య పాఠకులకు కూడా అర్థమయ్యేలా చెయ్యాల్సిన అవసరానికి లోబడి, తెలుగు నవలలలో ఒక తరం రచయితలు, తమదైన పద్ధతినీ, శైలినీ నవలా రచనలో ప్రతిక్షేపించుకుంటూ పోయాక, అమృతసంతానం లాంటి ఒక నవల చదివినప్పుడు, మనం పాఠకులుగా ఎలాంటి కల్పనా చాతుర్యానికీ, రచనా ప్రపంచానికీ, ఊహాశక్తికీ దూరమయ్యామో తెలుస్తుంది. 

అందుకే అమృతసంతానంలో పాత్రల చిత్రీకరణను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రచయిత అవసరానికి మెరిసి వెళ్ళిపోయే పాత్రలు కావవి. చదువుతూండగానే మన కళ్ళకు కట్టే పాత్రలు. 

ఇందులో ఉన్న ఎన్నో పాత్రల్లో బెజుణిదీ ఒక పాత్ర. సర్వస్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న ఈ పాత్ర, కథలో ఎలా ప్రవేశపెట్టబడిందో చూడండి : ఎన్ని వివరాలతో - వ్యక్తిగతంగానూ, కోఁదు జాతిలోనూ, - ఈ పాత్ర ఉనికిని, ఆనుపానులను సవివరంగా రచయిత చెక్కుకుపోయిన తీరును చూడండి. ఈ స్ఫుటమైన వర్ణనలే, ఆ లోకానికి మనం బొత్తిగా అపరిచితులమన్న లోలోపలి సంశయాన్ని, బెరుకును మెలమెల్లగా కరిగించుకుంటూ పోతాయి.

బెజుణి ఇల్లు వచ్చింది. ఊరి చివర ఒంటరి కొంప. చుట్టూ కిత్తలితుప్పల పెండె. లోపల గడ్డీగాదా అడివి. దాని మధ్య ఒక పాడుపంచ. అందులోనే ముసిలి బెజుణి కాపురం. ఎవ్వరూ లేరామెకి. కోఁదు సమాజంలో ఒక విశిష్ట స్థానముంది బెజుణికి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవత పూనుతుందామెకి. ఏ దేవతని పిలిస్తే ఆ దేవత ఆవేశిస్తుంది. ఆమె గొడ్రాలు. చచ్చినవాళ్ళకి బతికినవాళ్ళకి మధ్య ఒక నిచ్చెన లాంటిదామె.

బెజుణి అంటే జనానికి నచ్చేది కాదు. అందవికారంగా ఉండేదామె. ఆమె గోళ్ళు డేగగోళ్ళలా వంకరగా ఉండేవి. నోట్లో రెండే రెండు పళ్ళున్నాయి. రెండూ పొగచూరిన పసుపురంగుతో ఉండేవి. కళ్ళు రెండూ పొగచూరినట్టుండేవి. ఒంటి మీద చర్మం వేలాడుతూ ఉండేది. అందరూ ఆమెను చూసి భయపడేవాళ్ళు. ఎముకలు అవుపిస్తూన్న గుండె మీద రకరకాల గాజుపూసల పేర్లూ, గుత్తుగుత్తులు తావేజులూ, వేళ్ళముక్కలూ వేలాడుతూ ఉండేవి. అసాధ్యమైంది సాధించే దామె. అగ్గిలో నడిచేది. ముళ్ళ మీద కూచునేది. దేవతల వాహనం ఆమె: బెజుణి.

రెండవది, ఈ వర్ణనల్లోని పచ్చిదనం : అది రోమాలు నిక్కబొడుకునేలా చేస్తుంది. నిటారుగా కూర్చోబెట్టి పుస్తకం చదివిస్తుంది. మొదటి పేజీల్లోనే మనకెదురయే పియు, నెలలు నిండాక అడవిలో ఒంటరిగా ఆమె పడ్డ క్షోభ, రచయిత మాటల్లోనే..ఇలా -

"తుఫానులాగ తెరలుతెరలుగా వస్తున్నాయి నొప్పులు. ఒంటి మీద కెరటాలు విరిచిపోయేవి. పుయు అరిచేది. ఏడ్చేది. లోకం మరచిపోయేది, బైట ఎండ ఉజ్జ్వలంగా ఉంది. ప్రకృతి విచ్చలవిడిగా ఉంది. అన్నీ మరచిపోయింది పుయు. ఒంట్లో ఏదో భయంకరమైన విప్లవం రేగుతున్నట్టుంది. ఏదో తెంపుకున్నట్టుంది. లాక్కుంటున్నట్టంది. పీక్కునట్లు పెనుగులాడుతున్నట్లు ఉంది. అంతా రణ చీకటి. దుఃఖం. మద్దిచెట్టు రెండు చేతులతోనూ బిగించి పట్టుకునేది పియు. చెట్టు బెరడు పళ్ళతో కరచిపట్టేది. అమ్మవారు పూనట్టు వొంటికి ఎక్కడలేని సత్తువా వచ్చేది. నులుచుకునేది. 

ఎంతసేపలా గడచిందో తెలీదామెకి. హఠాత్తుగా తుఫాను  ఆగిపోయినట్టు అనిపించింది. కళ్ళ ముందు చీకటి తొలగిపోయింది. దిమ్మెత్తిపోయిన చెవులకి ఏదో కొత్తజంతువు అరచినట్టు వినిపించింది. ఆమె వినడం కోసమే ఎవరో గూబలు పగిలిపోయినట్టు అరుస్తున్నారు. పుయు నివ్వెరపోయి చూసింది. ఎర్రటి చిన్నమనిషి కిందపడి అరుస్తున్నాడు.పుయు తెలువుకుంది. చేరడేసి కళ్ళు చేసుకు చూసిందామె. ఆఁ? ఇది తన బిడ్డా? ఇదేనా ఇంతకాలమూ తన దేహంలో దాగుడుమూతలాడుతూ ఉంది? ...

బలం లేని చేతులతో ఒక దారైన రాతిముక్క తీసిందామె. దాంతో కొడుకు బొడ్డు కోసింది."

చివ్వుమని లోపల నొప్పి లేచే వర్ణన - "అమృతసంతానం" నేలను పడే వేళ. అమృతసంతానం చదవగానే గుర్తింపుకొచ్చేది, అందులోని భాష అనీ, కవిత్వమనీ, ఈ పుస్తకం ఇప్పటికే చదివిన మిత్రులు కొందరు నాతో చెప్పినప్పుడు, నేనా కవిత్వం దగ్గరే ఆగిపోతాననుకున్నాను. "పుష్య మాసపు చివరి దినాల ఎండ" నన్ను పట్టి నిలబెట్టడమూ అబద్దం కాదు. అయితే, నన్నాపినవి, నవలలో ఒక గొప్ప వచనం చదివిన తృప్తీ, సంతోషమే తప్ప కవిత్వం కళ్ళకు అడ్డుపడటం కాదు. అది ఈ రచన విలువను పెంచేదే తప్ప, పాఠకులను పక్కదారి పట్టించేది కాదు. ఈ మాటలు రాస్తూ రాస్తూ నేను ఇది పురిపండా వారు చేసిన అనువాదమనీ మరొక్కసారి నాకు నేనే గుర్తు చేసుకుంటున్నాను. ఇట్లాంటి అనువాదం అరుదే కాదు, అసంభవం కూడా. ఇంత తేనెలొలికే తెలుగూ, తూచి వేసినట్లే పడ్డ మాటలూ, వాక్య నిర్మాణమూ, ఈ పుస్తకాన్ని భారతీయ సాహిత్యంలోనే పైవరుసలో కూర్చుండబెడతాయి.

ఒక సవిస్తారమైన ప్రపంచం! వలయాలు వలయాలుగా - లౌకికంగా మనమనుభవించినట్లే - శకలాలుగా, ఇక్కడా - మరొకచోట కూడా, కనపడని ముడులతో, ఇప్పటికింకా ముడిపడని మనుష్యుల మధ్య, పోగులుపోగులుగా అల్లుకుపోయే సాంసారిక బంధాలను సవిస్తరంగా చూపెట్టడానికి నవలకున్న పరిధే సరైనది. 

అమృత సంతానం ఒక నాయకి కథ కాదు. ఒక జాతి కథ. ఒరిస్సా కొండ ప్రాంతాల్లో జీవించే కోఁదుల బ్రతుకు కథ. అక్కడి సంస్కృతిని పరిచయం చేసిన కథ. అందుకే, ఒక 'సావొతా' సరబులా, ఒక 'డివరీ'లా, ఒక 'బిజుణి' లా, పియు లా, లెంజులా, పియోటి లా, హకీరాలా, ఈ కథలో కొండలూ, వాగులూ, డప్పులూ కూడా మనకు స్పష్టంగా పరిచయమవుతాయి. ఆ దారులు అస్పష్ట రేఖలు కావు. ఎక్కడ అడుగు తీసి అడుగేయాలో విస్పష్టంగా చూపెట్టిన కథనమిది. 

అయితే, ఇది  విశ్వసనీయత కోసమో, పఠనీయత కోసమో మాత్రమే చెప్పుకోవలసిన వివరం కాదు. ఒక సర్వస్వతంత్ర ప్రపంచాన్ని పాఠకుడి చేతుల్లో పెట్టేప్పుడు, సమర్థుడూ, సహృదయుడూ అయిన రచయిత పడే కష్టమిదంతా. మరోలా చెప్పాలంటే, ఒక మంచి రచయితకు, మంచి పాఠకుడి మీద ఉండే అవ్యాజమైన ప్రేమ మాత్రమే ఇలాంటి రచనలా బయటకు రాగలదు. 

ఒక కథగా చెప్పాలంటే, అమృతసంతానం చిన్నదే. కానీ పరికించి చూసినవాళ్ళకి, జీవితమంత పెద్దది. బహుముఖీయమైనది. తప్పొప్పులకు అతీతంగా, జీవితం ఎలా సాగగలదో, అదే చూపిస్తుందీ పుస్తకం. కొండల మీద పారాడి పారిపోయే వెలుగు నీడల్లాగే, జీవితమూ ఎప్పుడూ ఒక రంగు పులుముకుని కూర్చునేది కాదని చెప్తుంది. కోఁదు జీవన నేపథ్యంలో ఈ కథను చెప్పడం, ఎత్తైన కొండల మీదా, ఆ లోయల్లోనూ అప్పుడప్పుడే నాగరికత పొటమరిస్తోన్న వాతావరణాన్ని చూపించడం, ఈ కథను మరింత ప్రత్యేకం చేశాయి. ప్రత్యేకించి ప్రకృతి వర్ణనల్లోని కవితాత్మకత, వాటిలోని నవ్యత (ఈనాటికీ..), ఆ వర్ణనల లోతూ, విస్తృతీ, ఈ పుస్తక పఠనానుభవాన్ని తనివి తీరని అనుభవంగా మిగులుస్తాయి. మానవ సంబంధాలు ఎన్ని ముళ్ళు పడి ఉన్నాయో, అన్ని ముళ్ళనూ విప్పే ప్రయత్నం, కాదంటే కనీసం తాకే ప్రయత్నం చేసి వదిలింది. ప్రత్యేకించి శారీరక సంబంధాల విషయంలో మనిషికి స్వాభావికమైన ఆశనూ, ఆకలినీ అంతే గాఢంగా, పదునైన పదాల్లో చూపెట్టింది. 

"వెర్రెత్తిస్తోంది పియొటి. అభాసంతోనూ, ఇంగితంతోనూ దివుడు సావొఁతా గుండె మీద సమ్మెటపడేది. ఆమె ఒళ్ళు కొంచం ఒంపు చేసేది, దివుడు మొహం మీద వేడిగాడ్పు కొట్టి, మొహం ఆర్చుకుపోయేది. ఆమె రవంత పక్కకి జరిగేది. ఇరవై మూళ్ళ దూరాన ఉండికూడా కోణం లెక్కప్రకారం అతడిమెడ అంతే జరిగేది"

ఇదీ అతని లెక్క! ఇట్లాంటి మాటల గారడీతో మన మెడలనూ వంచి చదివించే నేర్పుతో, లెక్కతప్పని నిపుణతతో, ఇంత పకడ్బందీగానే ఏ సన్నివేశాన్నైనా రాసుకుపోయాడు. 

అది ఫారెస్టాఫీసర్ల దాష్టీకం కావచ్చు, లెంజుకోఁదు నిస్సహాయత కావచ్చు, మన్యం జ్వరాల గురించి కావచ్చు, లొడబిడలాడుతూ ఆ శుభ్రస్వచ్ఛ లోకంలోకి చొచ్చుకొచ్చిన షావుకార్ల గురించి కావచ్చు- ఒక కథైనా, నవలైనా చదివేప్పుడు మనం ఎట్లాంటి నిజాయితీని ఆశిస్తామో, అదంతా ఈ రచనలో దొరుకుతుంది. ప్రత్యేకించి ఆ కొండజాతి వాళ్ళు తమ అమాయకత్వం వల్లా, అసహాయత వల్లా, అన్ని రకాలుగానూ దోపిడీకి గురవడాన్ని గురించి చదివినప్పుడు, మనకు నమ్మకంగా తెలుస్తుంది, ఇలాంటి ఒక  రచన చెయ్యడానికి నైపుణ్యమొక్కటే కాదు, గుండెలో ఆర్ద్రత కూడా ఉండాలి. కళ్ళలోనూ కలంలోనూ కొంత కన్నీరుండాలి. పోతే, ఇన్ని పాత్రల గురించీ, ఇంత చెప్పీ, రచయిత ఎక్కడా ఏ పాత్ర తరఫునా వకాల్తా పుచ్చుకోవడం కనపడదు. ఎంచి ఒకరికి అండగా నిలబడి ముందుకు నెట్టడమూ ఉండదు. రచయిత నిలబెట్టుకున్న ఈ ఎడం, మనలని వాళ్ళకి దగ్గర చేస్తుంది. మనకి మనంగా వాళ్ళని హత్తుకునేట్లు చేస్తుంది. పుయునే గమనించండి. 

ఎంత సంఘర్షణనో అనుభవించిన మనసు పుయుది. ఆమె తన స్వహస్తాలతో బొడ్డు కోసిన అమృతసంతానం ఊసుతో కథ మొదలవుతుంది. అది మొదలు. మనస్సులో అగ్గి మండుతోన్నా, ఒళ్ళో పిల్లాణ్ణి చూసుకుంటే కళ్ళు ధారలు కట్టే వేదనలోకి వెళ్తుంది, ఆఖరు పేజీల వద్దకొచ్చే సరికి. "ఎవళ్ళు వాణ్ణి నా అని ఆదుకుని పైటకొంగు కప్పుతారు?" అనుకుంటే దేవుడు గుర్తొస్తాడామెకి. మన గుండె చెరువైపోతుంది. వెక్కి వెక్కి ఏడుస్తూ ఆకాశం వైపుకి మొహమెత్తుకుంటుంది. 

అండగా ఉండే వాళ్ళు లేరని కాదు. అయినా, పుయు బుదరింపు మాటలన్నీ అంత దుఃఖంలోనూ పసిగడుతూనే వొచ్చింది. దేబిరింపుతనం తన ఛాయలకు రాకుండా జాగ్రత్తపడుతూనే వచ్చింది.  ఆమె మనసులోకి ఇంకిందల్లా 'డిసారి' మాటే.

"మూణ్ణాళ్ళ ముచ్చట మనిషి జన్మ. తరవాత మార్పు రానే వస్తుంది. ఈ రెన్నాళ్ళూ గడుపుకోడం సాధ్యం కాదా?"

ఆకాశం వైపు చూసింది కానీ, ఆశ వదులుకోలేదు పుయు. తనదైన బంధాన్ని, తనదే అయిన జీవితాన్ని, ఎవ్వరికీ అయాచితంగా ధారపొయ్యలేదు. ధీరనాయిక పుయు! ఎగసిన ఆత్మగౌరవ పతాక! సీతనీ, ఒకానొక కోణంలో శకుంతలనీ కూడా గుర్తుకుతెస్తుంది. 

ముందుకు నడిచింది. కథనూ నడిపించింది. 

చావు లేని కథ, జీవనంలో ఉన్న రుచి తెలిపిన కథ. "అమృత సంతానం"

*
ఆశా? ఆకలా? ఆక్రమణా? జాలీ, మోసం, కల్లోలమా? అసహాయతా? నిబ్బరమా? యుద్ధ స్థైర్యమా? మీరు చెప్పండి! ఒక గొప్ప నవలలో మీరేం ఆశిస్తారో, ఏం ఊహిస్తారో! అవన్నీ అంతకు పదింతలుగా దొరికే పుస్తకమిదేనేమో చదివి సరిచూసుకోండి. జటాజూటంలో ఉన్నంతసేపూ విశ్వరూపం చూపని గంగలా, భగీరథ ప్రయత్నం లేనిదే ఎవరికీ అందుబాటులోకి రాని గంగలా, ఈ ఆరువందల పేజీల పుస్తకం రెండు అట్టల మధ్యా చిక్కుబడి ఉన్నంతకాలమూ మనకిది అర్థం కాదు. భగీరథప్రయత్నం ఎవరికివారే చేసుకోవాలి. తరాలు, మారే కాలాలు, వాటి క్రీనీడలూ, మానవ సంబంధాలూ, మహోద్వేగాలూ..రచనా విశ్వరూపాన్ని చూడటానికి సంసిద్ధులై ఈ పుస్తకాన్ని అందుకోండి.

*
"అమృతసంతానం"
ఒడియా మూలం : గోపీనాథ మహాంతీ
తెలుగు : పురిపండా అప్పలస్వామి.

కడుపు నిండిన మధ్యాహ్నమొకటి..

ఆఫీసులో pantry వైపుకు వెళితే, అక్కడ కొంచం పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు housekeeping staff ఎప్పుడూ ఏవో పనులు చేసుకుంటూ కనపడుతూనే ఉంటారు. తెలుగువాళ్ళు మొహాలను చూసే ఒకరినొకరు గుర్తుపడతారనుకుంటాను. ఒకావిడ నన్నెప్పుడూ టైం ఎంతయింది మేడం ..అని పలకరిస్తూ ఉంటుంది. భోజనం చేశారా, టైం ఎంత - ఈ రెండే ఆవిడ ప్రశ్నలు. చక్కగా స్టెప్స్ వేసి కట్టుకునే సిల్కు చీరలతో, ముడితో, పెద్ద బొట్టుతో..బాగుంటుంది.
ఈ రోజు లంచ్ టైంలో ఇక వెళ్దాం అనుకుంటూండగా పది నిముషాల్లో జాయిన్ అవ్వాలి అంటూ meeting invite ఒకటి వచ్చింది. కాదనలేనిది, ముందువెనుకలకు జరపలేనిది. తప్పదురా దేవుడా అనుకుంటూ, అప్పుడే ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతూ pantry వైపుకి వెళ్ళిపోయాను. ఆవిడ ఉన్నారు, ఎప్పటిలాగే, నవ్వు మొహంతో. పక్కకు ఒద్దికగా జరిగి నిలబడి, కొట్టొచ్చినట్టు కనపడే ఆకుపచ్చ నాప్‌కిన్‌తో కాఫీ మగ్స్ తుడుస్తూ. నేను మాట్లాడాల్సిన నాలుగు ముక్కలూ మాట్లాడి, - ఇక మీటింగ్ ఉందనీ, మళ్ళీ ఎప్పుడైతే అప్పుడు లంచ్ కి బయటకి వచ్చినప్పుడు ఫోన్ చేస్తాననీ చెప్పి - పెట్టేశాను. హడావుడిగా అక్కడున్న బిస్కట్స్ తీసుకుని, వాటర్‌బాటిల్ నింపుకుని వెనక్కి రాబోతుంటే, వెనుక నుండి "ప్చ్.." అంటూ ఏదో వినపడీ వినపడని శబ్దం. చప్పున వెనక్కి తిరిగి చూశాను - ఆవిడ చేసే పని ఆపి నన్నే చూస్తోంది. "సారీ, టైమే కదా..ఒకటవుతోంది.." నా నోటిలో మాటింకా పూర్తవనే లేదు.."ఇంకో రెండు బిస్కట్లు తీసుకు పో మేడం.." అందామె అలాగే చూస్తూ, కొంచం భయం అంటిన కళ్ళతో..

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...