" తెరతీయగరాదా" - కథా విశ్లేషణ - Thanks to Kathajagat :)

Updated :
వంద కథల్లో ఏ కథను ఎంచుకోవాలో అని చాలా బెంగ పడ్డాను మొదట. చివరికి వరుసలో అమ్మ ఇంటి పేరు కనపడగానే ఆగిపోయి కథా అంతా చదివాను. నా ఆలోచనలన్నీ  వరుస క్రమం లో పెడితే, ఇదిగో...ఇలా ముస్తాబయ్యింది.
దీనికి కథా జగత్ విశ్లేషణా  పోటీల్లో రెండవ బహుమతి రావడం ఒక బోనస్ లా ఉంది. దానికి వాళ్ళు నగదు బహుమతి కూడా ప్రకటించడం తో ఆశ్చర్యం రెండితలైంది.Details here -
http://turupumukka.blogspot.com/2010/07/blog-post_28.html
Many thanks to the organizers for giving me a reason to celebrate today! :)
-------------------------------------------------------------------------------------------------------------------------
గుండె తలుపు తట్టిన తలపులన్నీ మైమరపించే కథలు కాలేవు. మంచి కథలో మంచి భాష ఉండాలి.భావోద్వేగం పండాలి.అంతర్లీనంగా మనసును స్పందింపజేసే కథాంశం , చివరి వరకూ చదివించగలిగిన పట్టూ ఉండాలి.మనకి తెలీకుండానే కథలో ఇమిడిపోయేటంత అద్భుతంగా రచన సాగాలి.ఈ లక్షణాలతో, దాదాపు నలభై ఏళ్ళ క్రితం రాయబడ్డ ఒక కథకు విశ్లేషణే నా ఈ రచన.

కొన్ని కథలు సమకాలీన సమస్యలను అతి గొప్పగా చిత్రిస్తాయి. చదివిన రోజున, 'ఆహా..' అనిపించినా , రెండో సారి చదివేటప్పటికే చప్పబడిపోతాయి. మరికొన్ని కథలుంటాయి. అవి ఎల్ల వేళలా ఆలోచనలను రేకెత్తిస్తూనే ఉంటాయి.ఎందుకంటే, అవి మనలో నుండి పుట్టినవి. మనిషిని మనిషిగా చిత్రించేవి. అద్దంలా మారి అక్కడ మనని మనకే చూపిస్తాయవి. మహామహుల ఆలోచనల ఆల్చిప్పల్లో పడి, ఆణిముత్యాలల్లే మారి బయటకు వస్తాయి. కోడూరి శ్రీ రామమూర్తి గారి "తెరతీయగరాదా.." నాకలాంటి ఆణిముత్యమంటి కథలానే తోచింది.

వారి రచన ఒక ప్రవాహంలా సాగుతుంటే, ఆ ఒరవడిలో పడి కొట్టుకుపోవడంలో ఎంత సంతోషం..! పాత్రల తాలూకు ఉద్వేగపు కెరటాలు ఉవ్వెత్తున ఎగసి మానస తీరాలను తాకుతున్నప్పుడు చెమ్మగిల్లిన కన్నులతో ఆఖరి వాక్యాన్ని ముగించి నిట్టూర్చడంలోనూ ఎంతటి పారవశ్యం..!

స్థూలంగా చెప్పాలంటే, ఇది నాలుగు మనసుల కథ. రచయిత ప్రతి పాత్రలోనూ  పరకాయ ప్రవేశం చేసి, వాళ్ళ మనసులోని భావాలని అక్షరాలుగా మార్చి కథ రాసారేమో అన్నంత సహజంగా సాగుతుందీ రచన. బహుశా ఆ శైలే ఈ కథకి నిజమయిన బలమేమో..

ప్రాణమిత్రుడు శేఖర్ ప్రేమ కోసం జీవితాన్ని నాశనం చేసుకున్నాడని బెంగపడి, అతని ఆ స్థితికి కారణమైన అమ్మాయిని నిలదీయాలని ఆరాటపడే రామనాథ్,పైకి మొండిగా, తల బిరుసు గల అమ్మాయిగా కనిపించినా, తన మనసులో ఏముందో ఎవ్వరికీ తెలియబరచక, తెలియబరచలేక,ఆఖరి వరకూ మనం అర్థం చేసుకోలేని ఆవేదనతో తల్లడిల్లిపోయిన ఇందిర,1970 కాలంలో అప్పుడప్పుడే తొలగిపోతున్న జమీందార్ భోగాలను, వారి సహజ లక్షణాలను, ఆలోచనా విధానాలను జ్ఞప్తికి తెచ్చే శ్రీనివాసుగారి పాత్ర ఈ కథకు మూల స్థంబాల్లాంటివి.

కథ విషయానికి వస్తే, ఇందిర పాత్ర మన మనసుల్ని కుదిపేస్తుంది. రామనాథ్ పాత్ర ద్వారా మనం ఉహించుకున్న ఇందిర, కథ ముగిసే వేళకి, ఆయనకి రాసిన ఉత్తరంతో ఆవిష్కృతమయిన అంతరగంతో కొత్తగా కనపడి, ఆలోచనలను మెలి తిప్పుతుంది.

ఆ కాలం జమీందార్లకు స్వతహాగా ఉండే కళాపోషణను, వారి సాహిత్యాభిలాషను శ్రీనివాసరావుగారి పాత్ర ద్వారా కథలో స్పష్టపరచిన తీరు అమోఘం.ముఖ్యంగా త్యాగరాజ  కీర్తనలను ప్రస్తావిస్తూ .."'ఖగరాజు నీయానతి విని వేగ చనలేదో - గగనంబు కిలకూ బహుదూరం బనినాడో -' అన్న పాదాన్ని ఉదహరించడం, దానికొక వినూత్నమైన విశ్లేషణను జోడించడం ఎందరో  సంగీత ప్రియులకు ఆనందాన్ని పంచడంలో అబ్బురమేముంది..? రచయితలోని కవి హృదయానికి ఇదొక మచ్చు తునక మాత్రమే సుమా..!

ఆధునిక భావాలున్న మనిషిని కనుక ఇందిర శ్రీనివాసరావు గారి దగ్గర కొరడా దెబ్బలు తినడం వంటి వాక్యాలను సహించలేకపోయిన మాట వాస్తవం. సమస్యలను ఎదుర్కొనగలిగిన సమర్ధత లేని వ్యక్తులు, తమలోని బలహీనతలను జయించే ప్రయత్నం చేయక, అనుసరణీయం కాని ఒక మార్గాన్ని ఎంచుకుని తప్పించుకోవాలనుకోవడం ఎంత వరకు సబబు అన్న సందేహం, నన్ను ఆఖర్లో కాస్త కలవర పెట్టింది.ఆమె చదువుకున్న అమ్మాయి కనుక, శిధిలమయిపోతున్న గోడలను దాటి బయటకు వచ్చి కుటుంబాన్ని తీర్చిదిద్దుకోగల సమర్ధతను ఆ పాత్ర నుండి ఆశించినా, ఎదురు తిరగక అణిగి ఉండటాన్ని అంగీకరించలేకపోయినా, నా ఈ ఆలోచనలనన్నింటినీ సమాధాన పరచగల రసవత్తరమయిన కథనమేదో నా నోరు నొక్కేసింది. నిజానికి రెండోసారి చదివినప్పుడు, ఇందిర పాత్రలోని ఆ నిస్సహాయతా, నిజాయితీలే కథకి అందమేమో అనిపించిన విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నాను.

"మత్సరమే కాదు మనిషి గుండెల్లో గూడుకట్టుకున్న తెరలు మరెన్నో ఉన్నాయి. మనిషి ఆ తెరని తీయనూ లేడు. వాటి సంగతి మరచి ప్రశాంతంగా వుండనూ లేడు " అన్న నిష్టుర సత్యాన్ని నిండైన కథగా మలచి, "..ధర్మాది మోక్షముల పారద్రోలుచున్న నాలోని మత్సరమను తెరతీయగరాదా..." అన్న త్యాగరాజ కీర్తనను ఆధారంగా చేసుకుని శీర్షికను ఎంచుకోవడం , దాని ప్రస్తావనతోనే కథను ముగించడం సముచితం.

ప్రతి కథకీ ముగింపే కీలకమైనదన్న విషయం మనందరికీ తెలిసిందే.ఆఖరికి మంచి గెలిస్తే మంచి కథనేస్తాం చప్పున. అదే చెడు గెలిస్తే, నమ్మలేనిదేదో జరిగినందుకు నిర్లిప్తంగా పుస్తకాన్ని మూసేస్తాం. ఆంగ్లంలో ఒక చక్కటి వాక్యం ఉంటుంది.." Man will believe only what he wants to believe.." అని. అది అక్షర సత్యం.అయితే, కథల్లో, ఇలా మంచీ చెడూ అని నిర్ణయించ వీలు కాకుండా ముగిసేవి కొన్ని ఉంటాయి. మరపు రాని కథల్లో వాటికంటూ ఒక చోటు వెదుక్కునే ముందు, పాఠకుల మస్తిష్కాల్లో తిష్ఠ వేసుకుంటాయి.

"తెరతీయగరాదా.." ఈ మూడో కోవకే చెందుతుందో లేదో తెలియాలంటే,ఇందిర జీవితాన్ని చదివి ఆమె నిర్ణయం తప్పో-ఒప్పో నిర్దారించాలంటే, కథాజగత్ లోకి అడుగిడి ఈ కింద ఇవ్వబడిన 1969 నాటి అరుదైన కథను చదవడమొక్కటే మార్గం.
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/teratiyaga-rada---koduri-శ్రీరామమూర్తి

ఏకాంతమో...ఒంటరితనమో..


వంద మంది నడుమ ఉన్నా  
ఒంటరితనమేదో బాధిస్తుంది
ఏకాంతాన్ని వెదుక్కుంటూ వెళ్తున్నా
అస్పష్టమైన ఊహేదో వెన్నాడుతుంది.

నేను తప్ప లోకమంతా విశ్రమిస్తుంది
సెలయేరు తన గలగలలాపి నిద్రపోతుంది
ఆకుల్లో ఇందాకటి అలజడి కనపడదు
ఈ గాలిలో పగలున్న వేడి జాడ తోచదు

శరన్మేఘం తన నలుపు చీరను
ఆకాశం మీద ఆరేసుకుంటుంది
వెన్నెల వలువల్లో తాను వెలిగిపోతూ
నల్లబడ్డ నన్ను చూసి నవ్వుకుంటుంది

నిశీధి నిశ్శబ్దంగా నా ముందే కరిగిపోతుంది
నక్షత్రాలింకో లోకానికి వెళ్ళిపోతున్నాయి
లోలోని సంఘర్షణకు సాక్షిగా . . . . .
అక్షరాలిక్కడిలా పరుగులిడుతున్నాయి.                                                                                  
                                                                                                                        
                    

"నిను వినా.."

                                  
ఎవ్వరూ లేని సాగర తీరంలో పరుచుకున్న వెన్నెల్లాగా 
ఏకాంతంలో నీ జ్ఞాపకాలు చుట్టుముడతాయి..
వర్తమానం ఒంటరిదై ముడుచుకుంటుంటే.
ఆలోచనలు పసిపిల్లలల్లే బాల్యంలోకి పరుగులెడతాయి..
పందిరి పై దాకా పాకిన సన్నజాజి తీగల్లాగే..
నా జీవితంలోని ప్రతి ఘడియా నీ ప్రేమతో ముడిపడి ఉంది
కాలం కౌగిట్లో కరిగిన ఒక్కొక్క క్షణం ..అమ్మా!! .
నీ అనురాగ ధారలలోనే తడిసి ముద్దయిపోయింది..!

ఆటల్లో పడి సమయం తెలీకుండా నేనాడి   అలసిపోతుంటే
వందల సార్లు నువ్వు విసుగు లేకుండా నన్ను పిలుస్తుంటే..
అయిష్టంగానే ఇంటికొస్తాను, నీరసంతో నీ ఒడిలో సోలిపోతాను
నువ్వు లేపి ముద్దలు పెట్టే దాకా, మూతి తుడిచి మళ్లీ నిద్ర పుచ్చే దాకా!

అనుకోకుండా ఏ అర్ధ రాత్రో  చదవాలని నేను లేచి కూర్చుంటే
అలసటతో  గాఢనిద్రలోకి జారుకున్న నీకెలా మెలకువొస్తుందో
అంత మగతలోనూ నన్నుత్సాహ పరిచేందుకు ఓపికెలా వస్తుందో
ఆనాడిచ్చిన తేనీటి వెచ్చదనం ఈనాటికీ హృదయాన్ని తాకుతోందిదిగో..

 క్షేమానికై  ఆరాటపడడాన్ని ఆంక్షల చట్రంలో బంధించే యత్నమని భ్రమించి
రెక్కలొచ్చాయన్న ధైర్యంతో రివ్వున ఎగిరిపోవాలని ప్రయత్నించిన ప్రతిసారి
నన్ను వెనక్కి లాగి పొదివి పట్టుకున్నది నీకున్న ప్రేమే తప్ప పంతం కాదని
ఇన్నేళ్ళ తర్వాత అర్థమయ్యాక నా అమాయకత్వానికి నాకే నవ్వొస్తుందెందుకో!

నా జీవితం పూరించలేని సమస్యలా మారి
ప్రతీ ఉదయం భయంతో మొదలైనప్పుడు
వరుస ఓటములతో  ప్రపంచం మసకబారి
ఒంటరితనంతో  దహించుకుపోతునప్పుడు...

ముడుచుకున్న పెదవుల మీద నవ్వులు పూయించిందీ
నా ఉహల చిత్రాన్ని మళ్లీ ఆశల వర్ణాలతో నింపింది నువ్వే!
అపజయాలను దాటుకుని గెలవగల సత్తా ఉందని  నమ్మిందీ
నేను విజేతలా అందరి ముందు వస్తానని విశ్వసించింది నువ్వే !

ఉద్యోగమంటూ  ఒంటరిగా ఊళ్లు వెళ్లేందుకు సిద్ధపడినప్పుడు
వెన్ను తడుతూ నువ్వు వీడ్కోలు చెప్పడానికి వచ్చినప్పుడు
నీ చెంపలను ముద్దాడిన నా పెదవుల నంటిన ఉప్పదనం ......
నీ కన్నీళ్లను దాచిందేమో   కాని  గుండెల్లోని ప్రేమను కాదు !!

నీ అంత ప్రేమను జీవితాంతం పంచే మనిషి కోసం
రేయింబవళ్ళు పరితపించి నాకో సరిజోడు వెదికినా 
నీకు మాత్రం తెలీదా అమ్మా....
నిన్ను మించగల్గిన వాళ్ళు సృష్టిలో ఇంకెవ్వరూ లేరని...ఉండరని....!

*****************         **************************          ****************
published in Koumudi: http://koumudi.net/Monthly/2010/july/index.html       

నిశ్శబ్దపు నిశీధిలోకి...

.
సంగీతంలా లయబద్దం గా సాగిపోయే నదీ ప్రవాహం..ఉండుండి నెమ్మదిగా, కవ్విస్తునట్టుగా..ఏదో రహస్యం చెప్పాలనట్టుగా  గుస గుసగా  నా పాదాల దాకా వచ్చి, మువ్వల పట్టీలను మాత్రమే  ముద్దాడి  పారిపోయే తుంటరి నీళ్ళు.కాలం గుప్పిట్లో నుండి జర్రున జారి గతంలోకి చేరిపోయే క్షణాలల్లె , నా చేతిలోకి చేరాక ఉండలేనంటూ తిరిగి తీరం లోని అనంత రేణువుల్లోకి కలిసిపోతోంది, అప్పటి దాకా సూరీడి  సాక్షిగా మిలా మిలా మెరిసిన ఇసుకంతా..!    


రేయికి రారాజులా చంద్రుడు ఆకాశంలోకి అడుగు పెట్టే వేళయింది. చెలికాడి రాక గురించి వెన్నెలమ్మ తెచ్చిన  వర్తమానం అందగానే, అప్పటిదాకా ఏ అంతఃపురాల్లోనో తమ అందాలకు మెరుగులు దిద్దుకుంటున్న చుక్కలన్నీ, ఒక్కసారిగా వినీలాకశపు వీధుల్లోకి చమక్కుమనే రాజసం ఉట్టిపడుతుండగా , ఠీవిగా అడుగు పెట్టాయి.


మసక వెన్నెల్లో ఇసుక తిన్నెలు అమర్చుకుంటున్న అందాలను, నదినీ నన్నూ ఆవహిస్తున్న చిక్కటి నల్లటి నలుపును  చూస్తుంటే, అప్పటి దాకా నన్ను నిలువరించిన స్తబ్దతను విదుల్చుకోవాలనిపించింది .రాతిరిలో ఏం మాయ ఉందో ఎన్నో ఏళ్ళ నుండీ ప్రయత్నిస్తున్నా , ఈ క్షణానికీ నేను కనిపెట్టలేకపోయాను.


ప్రపంచాన్ని రంగుల్లో ముంచెత్తే పగటి కంటే, అన్నీ రంగులని చెరిపేసి లోకాన్ని ఒక్కటి చేసే నిశీధి నలుపులోనే , నేనర్థం చేసుకోలేని రహస్యమేదో ఉంది.శతకోటి వర్ణాల నొక్క చోట కలిపి ఆ విశ్వేశ్వరుడు చిత్రించిన అత్యద్భుత కళా ఖండంలో అదృశ్యంగా కదలాడుతూ నన్ను అల్లరి పెట్టే అందమేదో ఉంది.  వర్ణాలన్నీ విడిచి చీకటి చీర కట్టుకున్నప్పుడు, మౌన ముద్రలోకి జారిన స్త్రీ లా ప్రకృతి మారినప్పుడు, అచ్చెరువొందించే  ఆ సౌందర్యం ముందు మోకరిల్లి, మౌనంగా ఆ దృశ్యాన్ని కను రెప్పల వెనుక చిత్రించుకోవడం  మినహా ఇంకేం చెయ్యగలను నేను!


" ఆకాశ మా వొరస
ఆవులించిన రేయి
మిసమిసలతో ఏటి
పసలతో ననుసుట్టి
ఈ రేయి నన్నొల్ల నేరవా రాజ
                  యెన్నెలల సొగసంత ఏటి పాలేనటర ..."

అంటూ విరహంతో, విషాదంతో, "కలవరపు నా బతుకు కలత నిదురయ్యింది  "  అని ఎంకి లా బాధ పడే క్షణాలని కాదు రాత్రి నాకిచ్చేది!
రాత్రి, నన్ను నాకు గుర్తు చేస్తుంది. పని ఒత్తిడిలో, పందేలు పడి తీస్తున్న పరుగుల్లో, ఒక రోజంతా ఎలా గడిచిందో కళ్ళ ముందుకు తెస్తుంది.  శక్తికి  మించి పోరాడి ఓడిపోయినప్పుడు నాకు తోడుగా నిద్రా దేవిని పంపించి ఓదారుస్తుంది. ముసుగులను పక్కన పెట్టి, నేను నేను గా మారేందుకు, నిజాయితీగా నిశ్చింతగా నిద్ర పోయి, రేపటిని మరో సారి కొత్త ఆశలతో స్వాగతించేందుకు సంధిగా మారుతుంది.న న్ను నేను మర్చిపోయేందుకు, నేనేంటో నాకు జ్ఞప్తికి తెచ్చేందుకు, నేను సాధించాల్సిన లక్ష్యాలను వెన్నాడే  కలలుగా మార్చేందుకు, కలలను నిజం చేసుకునేందుకు ఒక నిశ్శబ్దాన్ని సృష్టించేందుకు  రాతిరిని మించిన సాయమేముంది ?.


"ప్రపంచంతా నిద్రలోకి జారుకున్న రాత్రుల్లో, తన గమ్యాలను చేరుకునేందుకు విశ్రమించక పోరాడే వాడే విజేత అవుతాడు"  అని చిన్నప్పుడు చాలా చోట్ల చదువుకునే దాన్ని . ఎందుకో ఆ వాక్యం నన్ను విపరీతం గా ఆకర్షించేది. ఎంతలా అంటే , ప్రతి రోజూ గడియారం పది  చూపించగానే తరువాతి రోజు బ్రహ్మాండం బద్దలైపోతుందన్నా  పట్టించుకోకుండా పడుకునే నేను, ఆ వాక్యం చదివిన రోజు మాత్రం నిద్రని పది నిమిషాలు వాయిదా వేసుకుని , బాధగా పడుకునే దాన్ని. కొన్ని రోజులు విజేత అవ్వాలంటే రాత్రే మెలకువగా  ఉండాలనుకుని, "ప్రిపరేషన్"లో భాగం గా పగలంతా బలవంతంగా పడుకుని, మళ్ళీ రాత్రికి కూడా నిద్రని ఆపుకోలేక యధావిధిగా పడుకుని అమ్మ దగ్గర అనేకానేక  తిట్లు తిన్న రోజులు కూడా ఉన్నాయనుకోండి...అది వేరే విషయం.. :)


ఏది ఏమైనా నిశీధి - నిశ్శబ్దం నా స్వప్న లోకాలకు సందిగ్ధపు తెరలను తొలగిస్తూ దారి చూపిస్తూనే ఉంటాయి.ఏడు గుర్రాల రధమెక్కి వచ్చి నా ఏకాంతానికి   ఎవరైనా భంగం కలిగించినా , నా కల చెదిరిపోయినా.. ఒక రాత్రి కరిగిపోయినా...మరో రాత్రి కోసం సాగే నిరీక్షణలోనే  నా జీవితం గడిచిపోతోంది..
కృష్ణశాస్త్రి  గారన్నట్లు ,


మింట నెచటనో  మెరయు చుక్కల
కంట చూచితి కాంక్ష లూరగ
కాంక్ష లూరిన కొలది చుక్కలె 
కాంచి బ్రదుకే గడపితిన్...


"I am like the road in the night listening to the footfalls of it's memories in silence.." - Tagore

ఇంకా తెలవారదేమి....

'ప్రతి రోజూ మా ఉదయం పేపర్ చదవడం తోనే మొదలవుతుంది' అని గర్వం గా చెప్పుకునే వాళ్ళు ఈ దేశంలో లక్షల మంది ఉంటారు. అదే నిజమైతే..వాళ్ళ ఉదయం ఎలా మొదలవుతోంది ?

ఏనాడూ కలిసి లేని మనం , మళ్లీ మళ్లీ విడిపోవాలని ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటుంటే, ఆ వైకుంఠ పాణి ఆడలేని అమాయక ప్రాణాలు ఎలా వైకుంఠానికి పోతున్నాయో బొమ్మలలో చూడడంతోనా?
నిజాలు జనాలను చేరకుండా ఆపేందుకు ఒకరిని మించి ఒకరు ఎలా పోటీలు పడుతున్నారో చూసి నవ్వుకోవడంతోనా?
మంచిని మరిచిన కొందరు మానవ మృగాలు ఆటవిక యుగపు దాఖలాలు మన చుట్టూరా ఇంకా మిగిలే ఉన్నాయని సాక్ష్యం ఇస్తుంటే , అరాచకాన్ని ఖండించలేని పిరికితనంతో వార్తలను చదివి బాధ్యత తీరిపోయింది అనిపించుకోవడంతోనా?
పదేళ్ళ పసి పిల్లాడు అప్పుడప్పుడూ అమ్మా నాన్నలిచ్చే రూపాయి రూపాయి కూడబెట్టుకుని , బళ్ళో వరద బాధితులకి విరాళాలు అడగగానే , ఆ డబ్బంతా ఆనందంగా అప్పజెపితే, అలాంటి డబ్బులను కూడా నిస్సిగ్గుగా సొంత ఖాతాలోకి చేర్చుకున్న మహా మహుల చరిత్రలు చదవడంతోనా?

ఈ దేశం అవినీతికి చిరునామా అని అడగకపోయినా అందరికీ పేరు పేరునా చెప్పి, అన్యాయం వేళ్ళూనుకు పోయిన ఈ సమాజాన్ని ఎన్ని తరాలు మారినా మార్చలేమని మనని మనం ఎమార్చుకోవడం తప్ప ఎప్పుడైనా ఏమైనా చెయ్యాలని ప్రయత్నించామా?

మన ఇంటి ముందు మాన్ హోల్ లో పసి మొగ్గ పడిపోతే, రేపొద్దున వార్తల్లో ఏం రాస్తాడో అని ఎదురు చూస్తాం. ఇండియన్ క్రికెట్ టీం వైఫల్యానికి అర్ధ రాత్రి పార్టీలే కారణమని టీవీ లు అరగంట హోరెత్తిస్తే, తెల్లవారగానే ముందు ఈ విషయం మొత్తం చదవాలని నిర్ణయించుకుని పడుకుంటాం.

ప్రతి చోటా , ప్రతి పనికీ లంచాలు ఇవ్వందే పని జరగడం లేదని వాపోతాం. ఇంకో పది మందికి చెబుతాం. ఎప్పుడైనా ఎవరో ఒక నిజాయితీ కలిగిన రిపోర్టర్ వీళ్ళందరి మీదా ఏమైనా రాసినప్పుడు, నిబద్దత కలిగిన పోలీసులు వెను వెంటనే తగిన చర్యలు తీసుకున్నప్పుడు, మనం చెయ్యలేని పని వేరెవరో చేసినందుకు చప్పట్లు కొడతాం. సంబరాలు చేసుకుంటాం.

ఇక ఇంతేనా? మన జీవితం ఎన్నాళ్ళయినా ఇంతేనా? రావణుడిని చంపడానికి రాముడి రాక కై ఎదురు చూసాం. నరకాసురుడిని అంతమొందించేందుకు మరో అవతారం కావలన్నాం. బ్రిటిష్ వాళ్ళ ఉక్కు పాదం కింద నలిగిపోతూ మహాత్ముడెవడో వస్తాడని నిరీక్షించాం .
ఇక చాలు. మహాత్ముడు తన సైన్యం తో మనకి స్వాతంత్ర్యం సాధించి పెడితే, అది మనకి మరో అస్త్రం ప్రసాదించింది.

రాముడి కోసం, కృష్ణుడి కోసం ఈ సారి ఎన్ని యుగాలు ఆగాలో మనకీ తెలీదు.ఒక వేళ మనం అంతా ఓపిగ్గా ఆగినా, సాక్షాత్తూ ఏడు కొండల మీదే మోసాల ముసుగు కప్పిన ఘనుల మీద అలిగి ఇటు వైపు చూడబోనని స్వామి వారు ఈ పాటికే శ్రీదేవి కి మాటిచ్చి ఉండరూ ? పోనీ , మహా లక్ష్మి దయ కలిగినదై ఒక్కసారి వాళ్ళని కరుణించండని నచ్చజెప్పి పంపిందే అనుకుందాం, ...'నకిలీల' హవా నడుస్తున్న భూలోకం లో, తనని నమ్మరన్న సంశయంతో భగవంతుడు మధ్యలోనే వెను దిరిగి వెళ్ళిపోతేనో.. ?

కనుక ఈ లోపు మనమే యుద్ధం ప్రారంభిద్దాం. కనపడ్డ ప్రతి అవినీతి పరుని మీద మన అస్త్రాలని ప్రయోగిద్దాం.అన్యాయం జరిగిందని చదివి వదిలెయ్యకుండా, దాని చరిత్ర తెలుసుకుందాం. ౧౦ రూపాయల స్టంప్ ఖర్చుతో, సంబంధిత వివరాలను ఇంటికి తెప్పించుకుని పోరాటం సాగిద్దాం. పెద్ద పెద్ద విషయాల్లో తల దూర్చడం ఇష్టం లేదనుకుటే, మీ కోసమే వాడుకోండి. గ్యాస్ కనక్షన్స్ అనుకున్నట్టు  రాకపోయినా, పాస్పోర్ట్ పనులకు, విద్యుత్ శాఖని నిలదీయుటకు ...ఇలా ప్రతి ప్రభుత్వ శాఖని ప్రశ్నించే అధికారం పొందండి.ఇది మన హక్కు..!!
ఇంతకీ దాని పేరేమిటో చెప్పలేదు కదూ..  "సమాచార హక్కు చట్టం".
మనకి దీనిని మించిన బలం లేదు .తలదన్నే ఆయుధం మరొకటి లేదు.  ప్రతి పనికీ, ప్రతి కష్టానికి ఇది ఒక ఉపాయం చెప్తుంది, మనం కలలు కనే భారతాన్ని కళ్ళ ముందుకు తెస్తుంది.

ఇప్పటి దాకా ఏమేం సాధించామో ( ఒక చిన్న గ్రూప్ ద్వారా) తెలుసుకోవాలంటే, "లోక్ సత్తా సంజీవని" ని అడగండి.
http://www.loksattasanjeevani.blogspot.com/
ఇవి కేవలం సంకల్ప బలమే తప్ప మంది బలం లేని ఒక చిన్న గ్రూప్. కేవలం ఎలక్షన్స్ ముందు మనని ఊదర గొట్టి పారిపోయే రాజకీయ పార్టీల్లా  కాక, ఒక లక్ష్యం తో ముందుకి వెళ్తున్న వారికి, ఒక్కసారి అభినందనలు తెలియజేద్దాం. కుదిరితే మన వంతు సాయం చేద్దాం.

అబ్బే, లేదండి ..మాది ఆమ్యామ్యా బండి, "ఇవ్వడం- తీసుకోవడం" మా ఆచారం ..ఆ గుంత లో నుండి బయటకు రాలేం అంటారా....ఎప్పుడు  తెల్లారుతుందా..ఈ రోజు ఏ వార్తని ఖండిద్దామా...ఎవరిని నిందించి పక్కకి తప్పుకున్దామా ,అని ఆలోచిస్తూ..ఆనందంగా ఈ  జన్మ కిలా కానీయండి.. :)

- మానస చామర్తి

ప్రతి పేరుకీ వెనుక...

...ప్రయోగాలకి జడవని ఒక జంట ఉంటుంది.

అలాగే ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ విపరీతంగా అలవాటైన శబ్దం/మాట ఒకటి ఉంటుందట. నూటికి తొంభై కేసుల్లో , అది వాళ్ళ సొంత పేరే అయి ఉంటుందిట.ఈ మధ్యనే ఎక్కడో చదివాను. ( సాక్ష్యాలు చూపించబడవు ).

అయినా సాక్ష్యాలు గట్రా దాకా ఎందుకు , ఇది మనలో చాలా మందికి అనుదినం అనుభవంలోకి వచ్చేదే కదా..! బాగా రద్దీగా ఉండే ఒక బజారుకి మన వాళ్ళతోటి వెళ్లి, ఏవేవో కొనే హడావుడి లో తప్పిపోయాం అనుకోండి. అమ్మో..అక్కో..గట్టిగా ఒకసారి మన పేరు పిలవగానే అంత హడావుడిలోనూ అది మనకి ఖచ్చితంగా వినిపిస్తుంది.

నిశ్శబ్దం గా ఉన్న క్లాసు రూం లో, ఆఖరు బెంచీలో కూర్చుని పక్క వాళ్లతో చాలా సీరియస్ గా చుక్కలాట ఆడుతున్నప్పుడు , ప్రపంచంలో జరిగేవన్నీ పై వాడికి ప్రతి క్షణం తెలిసిపోయినట్టే ...మనకీ మన పేరు ఎక్కడ ఎవరు తలుచుకున్నా వినపడి, వాళ్ళు దూరంగా మొదటి  బెంచీలో ఉంటే ఎగిరి దూకైనా సరే సమాధానం చెప్పెయ్యాలన్న ఆసక్తి కలుగుతుంది.ఆ తరువాత మన ఆవేశం చూసి టీచర్ పేరు పెట్టి పిలుస్తూ "గెట్ అవుట్" అని అరిచినప్పుడు వేరే అనుభూతి కలుగుతున్దనుకోండి...అది ఇప్పటికి నేను వివరించలేను .

ఒకటో తారీఖు రాగానే..డబ్బుల లెక్కలు కట్టుకుంటున్న అమ్మ-నానగారు.." మానస ఈ నెల అస్సలు చదువు వెలగబెట్టలేదు కాబట్టి ఎప్పుడూ ఇచ్చే వందలో యాభై తీసేసి మిగిలింది ఇద్దాం" అనుకుంటున్నారనుకోండి..పక్క గదిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏకాగ్రతతో చదువుకుంటున్న నాకు ఎలా వినపడేదో ఏమో వినపడిపోయేది.మరు క్షణం లో నేను ఆదరా బాదరాగా వంటింట్లోకి వెళ్లి, యాలకులూ అవీ వేసి బ్రహ్మాండమైన టీ పెట్టి , చదువుకుంటున్న పుస్తకాన్ని బోర్లించి , దాని మీద ఈ కప్పులు పెట్టుకుని వాళ్ళ ముందుకు వెళ్లి నిల్చునేదాన్ని.
                          టీ కాఫీ లంటే సాక్షాత్తూ ఆ సాగర మధనం లో ఉద్భవించిన అమృతానికి మోడరన్ రూపాలని మనసా వాచా కర్మణా నమ్మే మా నాన్నగారు, ఆ కప్ అందుకోగానే అన్ని మర్చిపోయి అమ్మ వైపు తిరిగి.." అయినా చదువెందుకు చట్టుబండలవనూ, పిల్లల దగ్గరా మన పొదుపు....పసి దానికి వందేమిటి వెయ్యిచ్చినా తప్పులేదు...' అంటూ నా వాటా నాకిచ్చేసే వారు . ఆ వంద నాకిచ్చినందుకు నెలంతా నేనెలా ఉండాలో, ఏమేం చదవాలో ఆశువుగా చెప్పేసి ..అలాగే ఉండకపోతే వీల్లేదంటూ అమ్మ బలవంతంగా వేయించుకునే ఒట్లను తప్పించుకోవడానికి నేను కిక్కురు మనకుండా అక్కడి నుండి జారుకునేదాన్ని .

ప్రాణానికి ప్రాణం గా ప్రేమించుకునే ఇద్దరు సాయం కాలం సాగర తీరానికి వెళితే, తడి ఆరని ఇసుక తిన్నెల మీద కాలి వేళ్ళతో ఇద్దరి పేర్లూ కలిపి రాసుకోవడమే వాళ్ళు చేసే మొట్ట మొదటి పని. పరుగెత్తుకొచ్చే ప్రతి అల్లరి అలా, అక్షరాలతో అలా ఒకటైన జంటని ఎక్కడ వేరు పరుస్తుందో అని, అర చేతులు అడ్డు పెట్టుకుని ఆపుతూ, "రాళ్ళలో..ఇసుకల్లో రాసాను ఇద్దరి పేర్లు .." అని పాడుకోవడం ఎంత మధురమైన అనుభూతి!

ఒక ఈడు వాళ్ళంతా గుంపుగా చేరి "దాగుడు మూతా..' అని అరుస్తూ ఆడుకుంటుంటే, మన పేరెక్కడ చెప్పేస్తారో అని భయ పడడాలూ, దాక్కోవడాలు ఎంత అల్లరి జ్ఞాపకాలో కదా...!  బడిలో జరిగే పోటీల్లో విజేతల పేర్లు ప్రకటించేప్పుడు, 'మొదటి బహుమతి గెలుపొందిన విద్యార్ధి ...' అని టీచర్ సస్పెన్స్ కోసం క్షణం  ఆగినట్టే ఆగి , మనకే వినపడేలా కొట్టుకుంటున్న గుండె లయలను రెట్టింపు చేస్తూ , రెండో క్షణం లో మైక్ లో మన  పేరే పిలిస్తే ,ఒక విధమైన ఉద్విగ్నతతో..అంతు తెలియని ఆనందం తో తూనీగలా స్టేజి మీదకి పరుగెత్తి వెళ్లి హోరెత్తించే చప్పట్ల మధ్య ప్రైజ్ తీసుకోవడం ఎంత గమ్మతైన గర్వానిచ్చే అనుభవం!

ఇలా చెప్పుకుంటూ పోతే...పేరు పేరుకో మరపురాని జ్ఞాపకం. ప్రతి పేరుకీ గుర్తొచ్చే ఒక  అందమయిన అనుభవం.

ఇంత గొప్పదైన పేరుని, మనిషి జీవితం లో అతి ముఖ్యమైనా పాత్ర పోషించే ఈ పేరుని చాలా మంది తల్లి దండ్రులు చిన్నచూపు చూడడం నాకు బోలెడంత బాధని కలుగజేస్తుంది. అలాంటి వాళ్ళందరినీ ఖండించడానికే నేను ఈ టపా రాయడం మొదలు పెట్టానసలు . పిల్లలు పెద్దయ్యాక ఏమంటారో అన్న కనీస భయం లేకుండా వాళ్లకి తోచిన పేర్లన్నీ పెట్టడం , ల్యాబ్ లో ప్రయోగాలు చేసినట్టు చెయ్యడం ఏమన్నా బాగుందా?

నాకు తెలిసిన శిష్ రాధిక అనే ప్రేమ జంట పెద్దలకి అంగీకారం కాకపోయినా పెళ్లి చేసుకుని, ఈ మధ్య వాళ్లకి పుట్టిన పాపకి "ఆరా" అనే పేరు పెట్టుకున్నారంటే నమ్ముతారా ? నాలో సగం, తనలో సగం కలిపితే "ఆరా" అని సగర్వం గా చెప్పుకు తిరుగుతుంటే ఆ గోల భరించలేక, ఒకసారి ఒళ్ళు మండి 'అర అర కలిపితే ఒకటి అవుతుంది రాధి..పేరేమైనా మార్చగలవేమో ప్రయత్నించరాదూ ' అని చెప్పి చూసాను. అక్షింతలు మనకి కొత్తవి కావు కదా !

ఇలాగే ఇంకో కధ. ఈ సారి నా మనసుకు కొంచం దగ్గరైన క(వ్య) ధ.

మా అక్కకి కవల పిల్లలు. ఆడపిల్లలా..మగ పిల్లలా అని అడిగితే నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి :).
పిల్లలు పుట్టాక, హాస్పిటల్ నుండి డిస్ఛార్జ్ అయ్యి ఇంటికి వచేస్తుంటే, దారిలో నేను తన చెయ్యి పట్టుకుని  ఆత్రం గా 'అయ్యో అక్కా!! మనం ఒక విషయం పూర్తిగా మర్చిపోయాం " అని ఖంగారు గా చెప్పాను.
అసలే కవల పిల్లలు పుట్టగానే ఉండే బోలెడన్ని టెస్టుల్లో ఏదైనా మర్చిపోతున్నామేమో అని చాలా టెన్షన్స్ లో ఉన్న అక్క, ఇంకా ఖంగారు పడిపోతూ.."ఎక్కడ, ఎప్పుడు, ఆసుపత్రిలోనా ? ' అని అడిగింది.
"అది కాదక్కా..! మనం పిల్లలకి అసలు పేర్లయితే నీకు పెళ్ళైనప్పటి నుండి ఆలోచిస్తూనే ఉన్నాంలే కాని, ముద్దు పేర్లు వెదకి ఉంచుకోవడం మర్చిపోయాం, రేపటి నుండి ఏమని పిలుస్తాం ? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పిచ్చి పిచ్చి పేర్లతో పిలిస్తే, ఎంతైనా బాగోదు కదా ! "....చాలా బెంగపడుతూ చెప్పాను నేను.
"ఓస్ ఇదా..నువ్వేం ఖంగారు పడకు. నేనూ బావా కలిసి వాళ్లకి ముద్దు పేర్లు కూడా ఆల్రెడీ సిద్ధం చేసేసాం" అండి గర్వంగా నవ్వుతూ .
"హమ్మయ్య! చాలా మంచి పని చేసావు , నాకసలే పిచ్చి పిచ్చి ముద్దు పేర్లంటే మహా చిరాకు. నువ్వు - బావ సెలెక్ట్ చేసారు కాబట్టి ఖచితంగా బానే ఉండి ఉంటాయి. ఇంతకీ ఏం పేర్లు.." ఇహ ఆగలేనట్టు అడిగాను.
"పప్పీ అండ్ బుడ్డి " అక్క మొహం మీద మళ్లీ అదే గర్వం తో కూడిన నవ్వు.
బాగా హుషారుగా ఊదుకుంటున్న బూర నా మొహం మీదే 'ట్టాప్ప్" మని పేలినంత నొప్పి కలిగింది నా మనసుకి.
"ఈ పప్పీ ఏంటి చంటి కుక్క పిల్లకి పెట్టినట్టు..ఈ బుడ్డి ఏంటి.. బడ్డి కొట్లో సోడా బుడ్డి అన్నట్టు...ప్లీజ్ అక్కా !...వీళ్ళకి ఊహ వచ్చాక ఈ పేర్లా మాకు పెట్టేది అని నిన్ను అనరాని మాటలు అంటారు.నీకింత కన్నా మంచి పేర్లు తోచకపోతే , అమ్మ మనని పిలిచినట్టు అసలు పేర్లతోనే పిలిచెయ్, అంతే కాని ..మరీ ఇలా..."
"షటప్! నువ్వు ఎవరి పేర్ల గురించి ఇలా కుక్క పిల్ల - సబ్బు బిళ్ళ అంటున్నావో తెలుస్తోందా..! " నేను పూర్తి చెయ్యక ముందే గయ్యిమంది అక్క.
నేనేమైనా వేంకటేశ్వర స్వామి నామాలని తప్పుగా ఉచ్చరించి పాపం మూటగట్టేసుకుంటున్నానా అని నిజంగానే ఖంగారు పడిపోయాను.
"ఈ పేర్లతోనే వాళ్ళని పొట్టలో పడ్డప్పటి నుండీ పిలుస్తున్నాం, ఏ రోజూ ఎదురు తిరిగి ఒక్క మాట కూడా అనలేదు, తెల్సా.." - మళ్లీ గయ్యి గయ్యి..అక్కే..!
"అంటే అక్కా..! దేవుడు పిల్లలకి మాటలు ఇవ్వడానికి కొంచం టైం తీసుకుంటాడు కదా పాపం.."
"మాటలు ఇవ్వలేదు. నాలుగు కాళ్ళు..నాలుగు చేతులు ఇచ్చాడు,నచ్చకపోతే తన్ని చెప్పడానికి . అవన్నీ ఆనందంగా ఆమోదించిన పేర్లు ఇవి. ఇక నువ్వు దయ చేయవచ్చు ." అని దయ లేకుండా నన్ను నానా మాటలూ అని నా మనసును తీవ్రం గా గాయపరిచింది.
తీవ్రమైనా గాయం కాబట్టి నాలుగు  నెలలైనా అది మానలేదు.ప్రతి రోజూ నేను దగ్గరికి వెళ్ళగానే.."పప్పీ! పిన్ని వచ్చింది రామ్మా..బుడ్డీ ఎక్కడున్నావ్  ఇలా రామ్మా.." అని పిలుస్తుంటే విని భరించలేక , ఒక రోజు నేను అమ్మ దగ్గర కూర్చుని, వాళ్ళ ముద్దు పేర్ల గురించి నా మనసులో ఉన్న బాధనంతా వెళ్ళగక్కాను.

ఎప్పటి నుండో మనసులో ఉన్న బాధని పంచుకునేందుకు ఒక తోడు దొరికితే కలిగే ఆనందంతో..అమ్మ ఒక్క ఉదుటున లేచి కూర్చుని.."నీకూ అలాగే అనిపిస్తోందీ..?! చూసావా...ఆ మొద్దుకి చెపితే మన మాట తీసిపారేసింది. ఏమోలే ఎంతైనా నేను పాత కాలం దాన్ని కదా నేను కాదూ-కూడదని బెట్టు చేస్తే ఏం బాగుంటుందని , వీళ్ళు పొట్టలో పడ్డప్పటి నుండీ ఆలోచించి రెడీ చేసి పెట్టుకున్న ముద్దు పేర్లు ఇహ నా మనసులోనే దాచేసుకున్నాను " అంది కొంచం బాధగా.

నా హృదయం ద్రవించిపోయింది. ఒక్క క్షణం అమ్మమ్మ ప్రేమంటే ఏమిటో పూర్తిగా అర్థమైపోయినట్టు అనిపించింది.
"పోనీలేమ్మా దీని గురించి నువ్వింతలా బాధ పడాలా ! నీ మనసులో ఉన్న పేర్లేమిటో చెప్పు ..అక్కకి చెబ్దాం. ఏదో ఒక రోజు బింకానికి పోయినా..రెండో రోజు నుండి మనం ఎలా పిలిస్తే అలాగే తనూ పిలుస్తుందిలే..." అని ధైర్యం చెప్పాను, "పప్పీ-బుడ్డి" కన్నా ప్రపంచం లోని అన్ని పేర్లు బానే ఉంటాయి అనే గుడ్డి ఆశావాదంతో.
"అంతేనంటావా..ఏమిటో నువ్వు చెప్తుంటే నాక్కూడా మళ్లీ ఏదో ధైర్యం వస్తోందేవ్..ఆ కుక్క పిల్ల పేరుతో చంటి దాన్ని పిలవాలంటే నాకు నోరే రావడం లేదంటే నమ్ము.అయినా అనుకోవాలే గాని బంగారం లాంటి పేర్లు ఎన్ని లేవనీ..." అమ్మ ఎక్కడికెక్కడికో వెళ్లిపోతుంటే బలవంతంగా ఆపి .."అబ్బ..పేర్లేమిటో చెప్పమ్మా ముందు..!" అని గుర్తు చేసాను.
"ఆ..అదే అదే..అక్కడికే వస్తున్నా.అమ్మయికేమో చిట్టాయి..అబ్బాయికేమో బుజ్జాయి..ఖాయం చేసేద్దాం..ఏమంటావ్! అయినా ఇందులో అనేందుకేముందనీ నా మొహం. నిక్షేపంగా ఉన్నాయి. వింటుంటే తెలీడం లేదూ.." అమ్మ చిరునవ్వుల మధ్య చిద్విలాసం గా చెప్పింది.
నాకు "పెనం మీద నుండి పొయ్యిలో పడడం..", "ముందు నుయ్యి వెనుక గొయ్యి.." "దొందూ దొందే..." లాంటి సామెతలెన్నో అంతరంగం లో సుళ్ళు తిరిగాయి. కాగితమూ కలమూ తెచ్చుకుని అవన్నీ లైనుగా రాసుకోవడం తప్ప వేరేమీ చెయ్యలేని అశక్తురాలిని కాబట్టి మౌనం గా ఆ సన్నివేశం నుండి నిష్క్రమించాను.
                                                                  ***********

సావిరహే ...

ఉన్నట్టుండి నువ్వీ రోజు నా పక్కన లేవన్న నిజం గుర్తొస్తుంది. చేస్తున్న పని ఇహ ముందుకు కదలలేనంటూ మొరాయిస్తుంది. ప్రతి సాయంత్రం వదిలి వెళ్ళే సూరీడు ...తెల్లారగానే తన ఒంటిపై వెలుతురు మెరుపులు అతికించేందుకు వచ్చేస్తాడని ఆశపడే సంద్రంలా, రోజూ లాగే నీ కోసం వేచి చూసే హృదయం, ఇంకో రోజు నీ తలపులతోనే సరిపెట్టుకోవాలని అర్థమయ్యీ అవ్వగానే , మబ్బు పట్టిన ఆకాశంలా దిగాలు పడిపోతుంది.జీవితాన్నిమధురానుభూతుల దొంతరలా మార్చిన అందమైన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటి లాగే నా ఊహల అంబరం పైన ఎవ్వరూ చెరపలేని హరివిల్లులా అమరి కూర్చుంటాయి.

గుర్తుందా నీకు ?

వాకిట్లో పరుపల్లే పరుచుకున్న వెన్నెల్లో నీ ఒళ్ళో పడుకుని తలారబెట్టుకుంటూ చుక్కలు పెట్టిన ముగ్గుల్ని చూసుకుంటూ నేను..నా కళ్ళల్లో మెరిసే నక్షత్రాలని దర్శించుకుంటూ నీవు..మాటలు 'మాకిక్కడ చోటు దొరకడం లేదం' టూ అలిగి వెళ్ళిపోతుంటే..నిశ్శబ్దంగా నవ్వుకుని మన హృదయాలను ఊసులాడుకోనిచ్చిన రాత్రి గుర్తుందా నీకు ?నీ సాంగత్యంలో క్షణాల్లా గడిచిన ఆ శరద్రాత్రులని తల్చుకుని కదూ...కాలాన్ని నేనింత చిన్న చూపు చూసింది?ఇప్పుడు చూడు..నువ్వు పక్కన లేవన్న ధైర్యంతో, నిముషాల విల్లులను ఎక్కు పెట్టి, వాటిని జయించలేని అశక్తతతో నేను వాలిపోతుంటే..ఓడిపోతుంటే..పగలబడి నవ్వుతోంది పగబట్టిన కాలం.

కార్తీక మాసంలో...
కోనేటి మెట్ల దగ్గర కూర్చుని త్యాగరాజకీర్తన పాడుతూ..నీ అల్లరిచూపుల్లో చిక్కుకుపోయిన అలజడిలో..పదాలు తడబడుతున్న ఖంగారుని చూసి ఆపలేనంతగా నువ్వు నవ్వినప్పుడు...కోనేట్లోకి కోటి చందమామలెలా వచ్చాయని ఆకాశం ఆశ్చర్యపోయి ఉండదూ..?

 నువ్వొచ్చాక పున్నమినీ, వెన్నెలనీ ఆరాధించడం మానేసానని గుర్తొచ్చి కాబోలు ...వెండి మంట లాంటి వెన్నెలని ఒంటరిగా ఉన్న నా చుట్టూ ప్రసరింపజేసి..తన ప్రతాపమంతా ప్రదర్శించాలని తొందరపడుతున్నాడా చందమామ.అతనికేం తెలుసు.. రెప్పలు మూసుకున్న మరు క్షణం మగతలా కమ్ముకునే నీ ఆలోచనలను చేధించ రానివనీ .. కన్నులు తెరిచిన తొలి నిముషంలోనే నీ తలపుల వెల్లువలో తిరిగి తలమునకలవుతాననీ...మీటర్లలో మనుషులు కొలుచుకునే ఈ దూరం మనని వేరు చెయ్యలేక ఓడిపోతుందనీ .. అతనికెప్పుడూ ఒంటరిగా దొరకననీ..!

అయినా అమావాస్య వస్తే అదృశ్యమయిపోవడమే తప్ప అనుక్షణం నీలా హృదయాకాశంలో వలపుల వెన్నెలలు కురిపించగలిగిన నేర్పు అతగాడికేదీ ?

"ముందు తెలిసెనా ప్రభూ.." అని పాడుకునే అవకాశం ఇవ్వవు అని ఎలాగో తెలుసు....అయినా తరగని తపన . అకస్మాత్తుగా నువ్వొస్తావేమో అని....అనంతంగా సాగుతున్నట్టు తోస్తున్న ఈ క్షణాన్ని సంహరించేందుకు ఒక్క చిరునవ్వు వరమిచ్చేందుకు ఎదురవుతావేమోనని ఏదో ఆశ. ఎదను కోసేస్తున్న ఎడబాటును భరించలేక ..ఎడమైపోయినా ఎదురుగానే ఉన్నట్టు అనిపిస్తుంటే యదార్ధమేదో తేల్చుకోలేక....ఏకాంతపు వనానికి వెళ్లి విశ్రాంతి తీసుకుందామనుకుంటే... ముప్పిరిగొనే తేనెటీగలల్లే..అవిగో మళ్లీ....అక్కడా నీ జ్ఞాపకాలే..!!

ఎర్రబడ్డ ఈ కళ్ళ కింద నలుపు చారలు దిద్దుతున్న కాటుక సరిదిద్ది ..తడారని రెప్పల మీద ఒక వెచ్చని గుర్తేదో వేసేందుకు నువ్వొస్తావని నిరీక్షిస్తున్న నన్ను నిరాశ పరచవు కదూ..!స్వాతి వాన కోసం ఎదురు చూసే ముత్యపు చిప్పనై నీ కోసం పరితపిస్తూన్న నన్ను చేరుకునేందుకు మెరుపులు దాచుకున్న మేఘమాలలో తేలి తక్షణమే వచ్చేస్తావు కదూ.. ?!

                                                                            ప్రేమతో,
                                                                            నీ..

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...