"Wakes On the Horizon" - శ్రీనౌడూరిమూర్తి అనువాద కవిత్వం

నేను ఇన్ఫో్‌సిస్‌లో పని చేస్తున్న రోజుల్లో, వృత్తిరీత్యా వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉండటంతో సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిన కొందరితో, తరచుగా వారి వారి భాషలకు చెందిన ప్రాచీన, సమకాలీన కవిత్వాల గురించి మాట్లాడేదాన్ని. హిందీ, మళయాళం, కన్నడ, తమిళ భాషలకు చెందిన వాళ్ళతో వీలు చిక్కినప్పుడల్లా సాహిత్యచర్చలు సాగేవి. అలా మాటల్లో నాకూ కొంత కవిత్వం రాయడం పట్ల ఆసక్తి ఉందనీ, రాసేందుకు, విరివిగా చదివేందుకు ప్రయత్నిస్తుంటాననీ చెప్పినప్పుడు, మన భాషలోని కొన్ని మంచి కవితలను వాళ్ళకు వినిపించమని కోరేవారు. ‘వస్తువు ఏమిటి’, ‘వర్ణనలు ఏ రకంగా సాగాయి’, ‘ప్రేరణ ఏమై ఉంటుంది?’ అన్న ప్రశ్నలతో మొదలైన మా సంభాషణ, నేను కవిత మొత్తాన్నీ పూర్వాపరాలతో సహా వివరించడంతో ముగిసిపోయేది. అది వ్యక్తిగతంగా నాకెంతో ఉత్సాహాన్నీ, ఆసక్తినీ కలిగించే చర్చ అనడంలో నాకే సందేహమూ లేదు కానీ, చెప్పడం పూర్తయ్యాక ఉత్తమ కవిత్వం సాహితీ ప్రియుల్లో సహజంగా కలిగించే సున్నితమైన సంవేదన, సంతృప్తీ నా శ్రోతల్లో, స్నేహితుల్లో కనపడకపోవడం మాత్రం నన్ను ఆలోచనల్లోకి నెట్టేది. దరిమిలా, ఒకానొక ప్రశ్నోత్తర సభలో జావెద్ అక్తర్ అనువాదం చెయ్యడమంటే, పరిమళద్రవ్యాన్ని ఒక సీసా నుండి మరొక సీసాకి బదిలీ చెయ్యడం లాంటిదని అనడం గుర్తొచ్చేది.
జావెద్ మాటలకేమో గానీ, కవితల గురించి నేను మాట్లాడినప్పుడు, నా మిత్రుల్లో నేనూహించిన స్పందన రాకపోవడానికి, ప్రథానంగా కొన్ని కారణాలు కనపడతాయి. మన కవిత్వంలో, ప్రత్యేకించి సమకాలీన కవిత్వంలో, కథన రీతులు తక్కువ. మనం ఎక్కువ శాతం ఒక అనుభవాన్ని కవిత్వంలా మార్చడమే చూస్తున్నాం. లేదా ఒక సమస్యను బలమైన ప్రతీకలతో పది మంది ముందూ నిలిపే ప్రయత్నాలు చూస్తున్నాం (అంటే కవిత్వాన్ని మించి, ఒక సమస్యనో దాని పరిష్కారాన్నో ప్రజలకు బలంగానూ, సులభంగానూ చేరవేయడానికి కవిత్వాన్ని మాధ్యమంగా వాడుకుంటున్నాం, కాబట్టి, ఇక్కడ కేంద్రీకరణ వీటి మీదే ఉంటే అవకాశాలు ఎక్కువ). అలాగే, మన వర్ణనల్లో కొత్త చూపు కంటే కొత్త మాటకు ప్రాథాన్యత ఎక్కువ. కాబట్టి, కవిత్వాన్ని కవిత్వంలా కాకుండా, మామూలు పదాల్లో విప్పి చెప్పినప్పుడు, అందులో మనకు ఆసక్తినీ, ఆశ్చర్యాన్నీ కలిగించే ప్రాథమిక లక్షణాన్ని కోల్పోతున్నాం, రసజ్ఞతను మేల్కొల్పలేకపోతున్నాం. వీటన్నింటితో పాటు, అనువాదకురాలిగా నా ప్రతిభ, పాఠశాల పరీక్షల నెపం మీద నేను పొందిన ఆంగ్ల పరిజ్ఞానం మీదే అధిక శాతం ఆధారపడి ఉండటం కూడా ఒక ముఖ్యమైన కారణం. నేను నేర్చుకున్న ఇంగ్లీషు చదువు, నా నిత్యావసరాలకు సరిపోతుంది; ఉద్యోగరీత్యా చూసినా, సంభాషణాసందర్భాలన్నీ ముందుగానే తెలుస్తాయి కనుక, ప్రపంచం నలుమూలల్లోని మనుషులతోనూ ఏ ఇబ్బందీ లేకుండా మాట్లాడేందుకూ సరిపోతుంది; చర్చల ఉద్దేశ్యం, పరిమితి, పరిథి అన్నీ రెండు వైపుల వారికీ అవగాహన ఉన్న కొన్ని సాంకేతికసమస్యలతోనే ముడిపడి ఉంటాయి కనుక, భాషకు సంబంధించిన ఏ ఇబ్బందీ ఎదురవ్వదు. కానీ, సాహిత్యపరంగా చూస్తే నా ఆంగ్లజ్ఞానం పరిమితమైనది. కవిత్వాన్ని అనువాదం చేసేందుకు మాటలకు అర్థాలు మాత్రమే తెలిస్తే చాలని నేను అనుకోను. ప్రథానంగా పదాల మీద, ఆ పదాలు వెలువరించే శబ్ద సౌందర్యం మీద నడిచే ఈ కథన రహిత కవిత్వాన్ని అనువాదం చెయ్యడానికి, మాటల అల్లికలో పొందికనూ, పొదుపునూ పాటిస్తూనే, చమత్కారాన్ని, కవిత్వాన్ని భద్రంగా మోస్తూ, మూలంలోని సంగీతం బట్వాడా అయ్యేలా చేసేందుకు, సాహిత్యపరంగా ఆ భాష తీరుతెన్నుల పట్ల అవగాహన కలిగిన అనువాదకులు కావాలి.
ఆ రోజుల్లోనే, అంతర్జాల పత్రికల్లో ప్రచురింపబడిన ఒకానొక తెలుగు కవితకు, శ్రీనౌడూరి మూర్తి గారు చేసిన ఆంగ్లఅనువాదం మిత్రులకు చూపించడమూ, చదివిన వెంటనే నా మళయాళం మిత్రులు కొందరు ఆ కవిత మాధవి కుట్టీ (కమలాదాస్)కవిత్వాన్ని గుర్తు చేస్తోందని అనడమూ జరిగాయి. అప్పటికి ఆ పేరైనా విని ఉండని నా ఆశ్చర్యాన్ని గమనించి, వాళ్ళు మాధవికుట్టీ కవితలనే కాక, అద్భుతమైన మళయాళం కవితలెన్నింటికో ఆంగ్ల అనువాదాలను క్రమం తప్పకుండా పొందుపరుస్తోన్న మరొక సైట్ లింక్ కూడా నాకు అందజేశారు. ఆ అనువాదాల ద్వారా నేను తెలుసుకున్న ఆమె స్త్రీవాదం, సాంప్రదాయానికి ఎదురీదగల ఆమె శక్తీ, ఆ ప్రాంతపు సాంప్రదాయాలు, ఈ కాలపు మళయాళం పిల్లలు ఇంత హేలగా అద్భుతమైన కవిత్వాన్ని రాయడమూ – అన్నీ, వింతగానూ కొత్తగానూ తోచేవి. నచ్చేవి. ఒక భాషలోని సాహిత్యమంతా అంత అలవోకగా నాదాకా చేరినందుకు సంభ్రమంగా కూడా ఉండేది. అనువాదం దానికదే ఒక కళ అన్న స్పృహ నాలో మొదలైందప్పుడే. ఒక భాషను కొత్త జ్ఞానరాశులతో సుసంపన్నం చేయడానికి, అనువాదకులు కవులతో సరిసమానమైన(ఒక్కోసారి ఎక్కువగా కూడా) శ్రమను, వేదనను, మథనాన్ని అనుభవిస్తూనే రచన వెలువరిస్తారు అన్న ఎరుక కలిగి, వారి పట్ల గౌరవమూ రెట్టింపైంది. మూర్తి గారి “అనువాదలహరి” బ్లాగు ప్రతి రోజూ చదవడం అలవాటుగా మారడమూ అప్పటి సంగతే. ఈ బ్లాగులో, గత కొన్నేళ్ళుగా మన తెలుగు భాషకు చెందిన కవితలెన్నింటినో ఆంగ్లంలోకి అనువాదం చేసి, ఇప్పుడు వాటిలో నుండి ఎంపిక చేసిన కవితలతో, మూర్తి గారు Wakes On The Horizon అన్న సంకలనం ప్రచురించడమే, ఆ అనుభవాలను గుర్తు చేసుకుంటూ, ఈ పుస్తకం మీద నా ఆలోచనలను ఇలా ఈ వ్యాస రూపంలో పంచుకునేందుకు అవకాశమిచ్చింది.
“ఇదుగో, సాయంత్రం చేసి వచ్చింది వాన
పెంకి పిల్లడికి అల్లరి వెధవ తోడయినట్లు,
గాలిని వెంటబెట్టుకుని మరీ.
చీకటి నీరుగారిపోయి చేతులకి చెమ్మగా తగులుతోంది.
కిటికీ “Fadeout” లోంచి చూస్తుంటే, గోదావరి
కాన్వాసుమీద ఒలికిపోయిన జేగురు రంగులా ఉంది.
కాళ్ళమీద ఏదో ప్రాకుతున్న స్పర్శలా,
వంతెన మీద నుండి గూడ్సు రైలు పోతోంది.
నెయ్యివేస్తే భగ్గుమన్న నిప్పులా- తెరచాపలు ఎగురుతున్నాయి.
లంకలనుండి ఇసుక ఒడ్డుకు తెస్తున్న పడవలు,
మరుగుతున్న ఉక్కుమీది తెట్టులా, ఒడ్డుకుచేరుకుంటున్నాయి.”
ఇది మూర్తి గారి తొలి కవితా సంపుటి, సౌభాగ్య గారితో కలిసి 99 లోనే వినూత్నంగా ప్రచురించిన “నువ్వూ -నేనూ, గానమూ-గళమూ” లోనిది. దాదాపు 43 ఆంగ్ల కవితలతో, “Incidental Muses ” అన్న కవితా సంపుటినీ మూర్తి గారు ప్రచురించారు. 2006 మొదలుకుని, ఈనాటి దాకా, ఒక వైపు దేశదేశాల కవితలను తెలుగులోకి అనువాదం చేస్తూనే, మరో వంక మన తెలుగు కవితలను ఆంగ్లంలోకి కూడా అందుబాటులోకి తెస్తూ వచ్చారు.
ఇవన్నీ చెప్పడమెందుకంటే, ఈ అనువాదకులు స్వయంగా కవి. విస్తృతంగా చదివిన పాఠకులు. ఏ పదం పరసువేది మాదిరి వచనాన్ని కవిత్వంలా మార్చి వెలుగులీనేలా చెయ్యగలదో తెలిసిన వ్యక్తి. ఏ కవిత సామాన్యమైన ప్రతీకలతో, ముతక వాసన కొడుతోందో అనాయాసంగా పసిగట్టగల మనిషి. ఈ సునిశితమైన గమనింపులతో పాటు, వారికి స్వతఃసిద్ధంగా ఉన్న కథనశక్తీ, కవితాత్మకత, అనువాదాలు చెయ్యడంలో సహజదక్షతగా పరిణమించాయని నా అనుకోలు. బహుశా ఈ కారణానికే ఈ సంకలనంలో ఎంచుకున్న కవితల్లో విస్తృతమైన వైవిధ్యం కనపడుతుంది. సామాన్యంగా, కవితా సంకలనాలకు ఉండేట్టు, ఈ సంకలనానికి ప్రత్యేకమైన లక్ష్యమంటూ ఏమీ లేదు. సామాజిక సమస్యలనో, ఉద్యమాలనో, లేదా ప్రత్యేకించి ఒక వస్తువనో – ఏ విధమైన పరిమితులనూ ఇది విధించుకోలేదు. మంచి కవిత్వమవ్వడమొక్కటే ఇక్కడ ఎంపికకు ప్రామాణికంగా తీసుకోబడింది. అలా ఒకటీ, రెండూ కావు, 89 విభిన్నమైన గళాల నుండి వెలువడ్డ 199 కవితా స్వరాలను ఒక్కచోట కూర్చి పరిచయం చేసిన పుస్తకమిది. ఇందులో తెలుగులో ప్రస్తుతం విరివిగా రాస్తోన్న కవులున్నారు. ఈ పుస్తకంలో ప్రచురింపబడ్డదొక్కటే కవితగా రాసిన వారూ ఉన్నారు. ఆయా కవుల నేపథ్యాలు వేరు, వారి వయసులు వేరు, కవితా వస్తువుల పట్లా, కవిత్వం పట్లా వాళ్ళ వైఖరులు వేరు, కనుకే శైలిపరమైన మార్పులు కూడా మనకు ఈ అనువాదాల్లో తెలుస్తూ ఉంటాయి. సామాజిక మధ్యమాలూ , పత్రికల్లో ప్రచురణలూ, ప్రచారాలూ ఇప్పటి స్థాయిలో లేనందువల్ల కవులుగా రావలసినంత పేరు రాని ముందు తరం కవులూ కొందరున్నారు. ఈ పుస్తకంలో వదిలిన జాడల ననుసరించి, ఆ కవుల ప్రస్థానాన్ని గమనించేందుకు ఆఖరు పేజీల్లో అవకాశమిచ్చారు మూర్తిగారు.
మనం ఎందరెందరివో అనువాదాలు చదువుతూ ఉంటాం. కానీ, ఆలోచించి చూడండి, కవిత ఎప్పుడూ మూలకవి పేరు మీదుగానే గుర్తుంచుకోబడుతుంది. (చలం గీతాంజలి లాంటి అరుదైన మినహాయింపులను పక్కన పెడితే). మనం ఏ భాషలో చదివినా, ఫ్రాస్ట్ కవితలనే అంటాం, కీట్స్ కవితలంటాం, రిల్కే కవితలంటాం, సుబ్రహ్మణ భారతి కవితలంటాం, వాల్మీకి రామాయణమంటాం ..ఇలా, మూలం వ్రాసిన కవి ముద్ర అంత తేలిగ్గా చెరపగలిగినది కాదు. ఇది అనువాదకులు ఎదుర్కొనే మొదటి సవాలు. ఇది గాక, రెండు భాషలు క్షుణ్ణంగా తెలిసి, పదాలనూ, అవి వాచ్యంగానో సూచ్యంగానో చెప్పే వివరాలనూ, అన్నింటికీ మించి కవి అంతరంగాన్నీ పట్టుకుంటూ, మూలంలోని వేగాన్నీ, లయనూ జారనీయకుండా కవితను పూర్తి చేసి మెప్పించడం రెండవ సవాలు. బహుళ ప్రాచుర్యం పొందిన కవితలను, అదే స్థాయిలో, అనువదించబడ్డ భాషలోని పాఠకులకు చేరవేయలేకపోవడం, కవిత్వంలోని మార్మికత వల్ల సైద్ధాంతికంగా కవితను అర్థం చేసుకోవడంలో పొరబాటు పడి మరొకలా అనువదించడమూ, తదితర చిన్నాచితకా సమస్యలూ మామూలే.
ప్రతి భాషలోనూ ఆ భాషకు మాత్రమే సొంతమైన విరుపులు, పిలుపులూ కొన్ని ఉంటాయి. అవి ఆ ప్రాంతీయుల మాటల్లో, ఆ ప్రాంతీయ భాషలో, యాసలో వెలిగినట్టు, అనువాదంలో మెరవవు. ఉదాహరణకి ఈ పుస్తకంలో పొందుపరచిన ఒకానొక నందకిశోర్ కవితకి మూలం చూడండి.
“ఇగ ముసుర్లు పడ్తుంటె సూడాలె…
నీ యవ్వ!
నిలుసున్న పండుకున్న
ఉరుస్తుంటే తడుసుడేనాయె”.
దానికి మూర్తి గారి అనువాదం ఇదీ:
“One should only witness skies emptying!
Tut!
No matter whether you stand or sleep,
You cannot avoid getting wet.”
అచ్చమైన తెలగాణా మాండలీకంలో రాయబడ్డ ఈ కవిత అనువాదంలో, భావం చేరుతోంది కానీ, కవి గొంతులోని విసురు, కేవలం ఆ ధ్వని ద్వారా మాత్రమే సాధించగల ఉద్వేగం, మాయమైపోతోంది. ఇదే యాసతో అనువాదంలో ఉన్న ఇబ్బంది. అలాగే, కొన్ని జాతీయాలను మనం అనువాదం చేసినా మూలంలో ఉన్న సొంపు అనువాదంలో కనపడదు. అనువాదంలో ఆ జాతీయాల తాలూకు క్లుప్తతను సాధించడం దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు. ఏ పదం వాడినా కొన్ని సార్లు మూలంలో కొట్టొచ్చినట్టు కనపడే సౌందర్యం అనువాదంలో అంది రాదు. ఒక పదానికి నాలుగు పదాలు వాడాల్సి రావడమూ తప్పకపోవచ్చు కొన్నిసార్లు, అలా, భావం కోసం లయను త్యాగం చెయ్యడం సైతం తప్పనిసరి కావచ్చు. ఇవన్నీ సర్వసాధారణమైన సమస్యలు, ఈ పుస్తకంలో కూడా ఉన్న సమస్యలు. ఈ కారణాలకు సంబంధించిన విమర్శలను ఏ అనువాద పుస్తకమూ బహుశా దాటలేకపోవచ్చు. తమ కవితలను తామే అనువాదం చేసుకున్న బెంగాలీ కవులైన జీబనానంద దాస్ (బనలతాసేన్ కవిత), టాగోర్ (గీతాంజలి, ద గార్డెనెర్) కూడా ఈ విమర్శలకు అతీతులు కారు. ఈ పరిమితుల పట్ల సమగ్రావగాహన ఉన్నది కనుకే, టాగోర్ లాంటి కవి, The Gardener అన్న తన అనువాద కవిత్వ సంపుటికి రాసుకున్న ముందు మాటలో, ఆ అనువాదాలు అన్ని చోట్లా మూలానికి యథాతథానువాదాలు కావనీ, కొన్ని చోట్ల సంక్షిప్తపరచాననీ, కొన్ని సార్లు సవివరంగా రాసాననీ ఒప్పుకుంటారు. ఇది అనివార్యమైన పరిస్థితి.
వీటన్నింటినీ సాధ్యమైనంతగా దాటుకుంటూ వచ్చిన ఈ “Wakes on the Horizon” పుస్తకంలో నేను పైన చెప్పినట్టు, ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేని ఆదూరి సత్యవతీదేవి వారి వంటి కవితలు ఉన్నాయి.చాలా కవితల్లో గురితప్పని బాణాల్లా వాక్యాల్లో వచ్చి కుదురుకున్న పదాలు అనువాదకులు మూలకవిత్వంతో మమేకమైన తీరుకి నిరూపణగా నిలుస్తాయి. ముఖ్యంగా, “Your Chariot (Viswanatha Satyanarayana; page:15)”, “One Midnight at SanFrancisco (Afsar; page-15)”, “The Liberated Lymph (Manasa Chamarti, page:252) ” వంటి కవితలని గమనించినప్పుడు, శిల్పాన్ని అన్ని కవితల్లోనూ మూలానికి నిబద్ధంగా ఉండేలా మలచడమూ తెలుస్తుంది.
ఎలనాగ గారు “పొరుగు వెన్నెల” పేరుతో మన దేశంలోని వివిధ రాష్ట్రాల కవిత్వాలను తెలుగులోకి అనువాదం చేశారు. ముకుంద రామారావు గారు దేశదేశాల కవిత్వాన్నీ మనముందుంచారు. ‘పొరుగు నుండి తెలుగులోకి’ అంటూ ఒక ఉదాత్తమైన లక్ష్యంతో ఎమెస్కో వారు వాడ్రేవు చినవీరభదుడితో మత్సువో బషో హైకూలను అనువాదం చేయించి మన దోసిట పెట్టారు. ఇవన్నీ ఏ రకమైన సాహిత్య ప్రయోజనాలతో మన ముందుకొచ్చాయో, ఈ Wakes on the Horizon అదే సదుద్దేశ్యంతో మన ముందుకొచ్చింది. మన జాతీయాలు, సామెతలు, విరుపులు,పిలుపులు, బాంధవ్యాలు, వ్యవస్థా వ్యాకరణమూ – ఇవన్నీ కవిత్వంలో ఒదిగే చిత్రమైన తీరుని, మన పొరుగు వారికీ, మన స్నేహితులకీ, ప్రపంచవ్యాప్తంగా తెలుగు కవిత్వం మీద ఆసక్తి ఉన్న మన సాహితీ మిత్రులందరికీ, “మా గొంతు ఇదీ” అని చెప్పుకు చూపించుకునేందుకు అవకాశమిచ్చిన పుస్తకమిది. నానాటికీ కుంచించుకుపోతున్న ప్రపంచపటం మీద, ఈ తూరుపు వాకిట చేతులెత్తి ఎత్తుకు చూపించి మరీ, ఇతర భాషలతో స్నేహపూరితమైన స్పర్ధకీ, చర్చకీ సిద్ధమని చాటేందుకు తావిచ్చిన పుస్తకం. ఇతర భాషలను చదవడానికి మనకుండే కారణాలూ, ఇతరులు మన భాషను గుర్తించి చదివి చర్చించాలనుకోవడానికి మనకున్న కారణాలూ – ఎన్ని రకాలుగా భిన్నమో, ఎన్ని ఆసక్తికరమైన కారణాలకు భిన్నమో మనం పునరాలోచించుకునేలా చేసిన ఈ పుస్తకం, సాహిత్య అనువాదాల అవసరం గురించీ, వాటి అధ్యయనం గురించి, ఆ దిశగా మనకున్న అవకాశాల గురించీ ఎన్నో ప్రశ్నలను మన ముందుంచుతుంది.

అబద్ధం

కొండ కొప్పున తురిమిన
నెలవంకల మాలలా
ఘాట్ రోడ్
కాసేపు నలుపు, కాసేపు వెలుగు.

ముక్కలుగా మారి
చప్పుడు లేకుండా లోయ చీకట్లలో పడేముందు
హరివిల్లుగా వెలిగే రంగులు కాసేపు

ముప్ఫైఆరు మలుపులు తిరిగాక
మైదానాన్ని నిస్సిగ్గుగా కావలించుకు
పడుకున్న వెన్నెట్లో, రెండు చేతుల్తో…

                                                                     దొరకడు… నమ్ము

పట్టుకోవాలని తపించి
తపించి ఘడియలుగా దహించుకుపోయిన
రాత్రిని లాలించి
తప్పించి

సూరీడు నేలను ముద్దాడకుండా ఆపాలని
పైన్ చెట్ల నీడలు వెర్రెత్తినట్టు ఊగే
తోటల్లో చేరి, చీకట్లో, రెండు దీపాల్తో…

                                                                   ఒకవేళ దొరికినా…

నడిచి నడిచి ఏ వైపు నుండో
కమ్ముకున్న పొగ మంచులో నుండి
తేటగా ఎవరో కనపడీ
సంపెగ రెక్కలు మూతబడీ

కారు అద్దాలు కిందకి
అంతలోనే రయ్యిమని పైకీ
ఆ వంక ఆకాశం
నేలను కలిసేందుకు కిందకు వంగినట్టే వంగి…

                                                                     అబద్ధం

గత జన్మ కథేమిటో
చెప్పేందుకేమీ గుర్తు లేదు కాని,
ఇప్పుడు వైపర్ ఊగిసలాట పూర్తయ్యేలోపే
ముగిసిపోయిన కథ గురించి బాధేమీ లేదు కాని,

నా వేలి అంచుల్లో నిలిచి,
చూపు కొసలను తడిపి
పూల తీగల ఊపిరి తగిలేలా తల్లకిందులుగా ఊగించి,
వంచించి

లోయలోకి జారిపడ్డ చినుకుని పట్టలేక
ప్రాణమెందుకలా చితికిపోయిందో
ఒలికిపడ్డ నాలుగు చుక్కల యూకలిప్టస్ వాసన
ఊపిరి మడతల్లో నలిగి నలిగి ఎందుకు మరలిపోనంటోందో

ఎండిపోయిన జలపాతపు గుర్తుల్ని
ఎన్నేళ్ళైనా మోసుకు తిరిగే కొండల్ని
ఈ వైపు నుండి చూసినప్పుడల్లా
ఈ గుండె కదిలి కొట్టుకున్నప్పుడల్లా…

                                నేను ముందే చెప్పాను.


**తొలి ప్రచురణ, ఈమాట, జులై-2017 సంచికలో

మనోరంజని

"నీలో నా పాట కదలి.." - అని వింటానా?
చులాగ్గా మీటరు తిప్పుకుంటూపోతున్న చూపుడువేలు,
ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది.
బుల్లిపిట్ట ఒకటి తటాలున తీగ మీద వాలి,
కాసేపు తీగతోపాటే అటూఇటూ ఊగి
నిశ్చలంగా కూర్చునట్టు,
బుజ్జిపెట్టె మీదకు అమాంతం వాలి
గరగరమంటూ వినపడ్డ నీ గొంతుతో పాటే నేనూ
కుదురుకుని చెవులప్పజెప్పేస్తాను.
గంధర్వులు కొలువున్న గాత్రం
నిషిద్ధాలెరుగని గాలిలా
గదులన్నీ కలియతిరుగుతుంది.
స్వరాలైనా తెలియని ప్రాణం
శ్రుతి చేసిన వీణలా
ఆ గొంతుకు జతకలిసి పాడుతుంది.
"ఖుల్ జా సిం సిం " అంటే
కథలో గుహ తలుపులు తెరుచుకున్నట్టు
నీ గొంతు వింటే,
నా బాల్యాన్నీ, నా జ్ఞాపకాలనీ,
భద్రంగా దాచుకున్న మనసు తలుపులు
ఠపీమని తెరుచుకుంటూనే ఉంటాయి.
నేనూ ఒక కవినైతే,
"నువ్వు లేవు , నీ పాట ఉంది*" అనేదాన్ని.
"కిటికీతెరల కుచ్చుల్ని
పట్టుకు జీరాడుతుంది దిగులుగా నీ పాట**"
అని రాసుకునేదాన్ని.
అవసరార్థం కొట్టేసిన పూలచెట్టు, నీ పాట వింటునప్పుడు
మళ్ళీ గుత్తులుగుత్తులుగా పూయడాన్ని వర్ణించేదాన్ని
నడుం మీద ఓ చేయి, తల వెనుకగా ఓ చేయి పెట్టుకుని
నీ జోరు పందేనికి నే తందనాలడినపుడు
మైత్రీపరిమళాలు నా చుట్టూ పరుగులెత్తడాన్ని
గేయాలుగా రాసి దాచుకునేదాన్ని
ఋతువులు మారితే అల్లాడిపోయే జీవితానికి
పూటపూటా రంగులద్దడానికి
వసంతాన్ని స్వరపేటికలో కట్టేసుకుని
నా వాకిట్లో కోయిలలా నిలబడ్డ నీ గురించి
కవినైతే ఏం చెప్పేదాన్నో గానీ, ఇప్పటికిలా
గాలిలో గింగిరాలుగా తిరుగుతున్న నీ పాటలను
పదే పదే పాడుకుంటూ ఉండిపోవడంలోనే తృప్తి.
 -----------------------------------------------------------------
(*) తిలక్ కవిత
(**) అఫ్సర్ "సైగల్ పాట" కవిత 

దక్షిణం వైపు ఇల్లు

రెండవ ఝాము రాత్రి
సన్నగా కురుస్తూ వాన.

వీధి దీపపు పసుపు కాంతి
పాకీ పాకీ ఆ వాకిలి దాకా వస్తుంది
సీతాకోక రెక్కల గేటు క్రింద
ఆకులు వలయాల్లో తిరుగుతాయి.
చందమామనెవరో చూరుకి వేలాడదీసినట్టు
వరండాలో ఊగుతూ లాంతరు
గోడ మీద ధ్యానముద్రలో బుద్ధుడు;
లక్ష్మణ రేఖలాంటి తారురోడ్డుకవతలి ఇంట్లోకి
గాజుపెంకులు గుచ్చిన గోడకవతలి వైపుకి
ఈ రెండో అంతస్తులో నుండి చూసినప్పుడల్లా
గుచ్చుకునేదొక్కటే..

నిండా విరిసిన
            ఓ పూల చెట్టు!
 
               *
కాసేపు విసురుగా కాసేపు జాలిగా
అలకలో ఉన్న ప్రేయసి మాటల్లా
వర్షపు చినుకులు.
రయ్యిమని గాలిని కోసుకుపోతూ
వాహనాలు మిగిల్చిన నిశ్శబ్దం.
పియానో మెట్ల మీద నుండి,
కొక్కేనికి పట్టుకు చిరిగిన
పరదా సందుల్లోంచీ
సీతాకోకరెక్కల మీదుగా తప్పించుకుని
పైపైకి పాకుతూ వస్తుందో రాగం.

కనపడని వేళ్ళ క్రింద పడి
మనసు నలిగిపోతుంది.

*
కోరుకున్న పూల మత్తే
ఊపిరంతా చేరి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది
రెక్కలు విప్పుకున్న సీతాకోకలన్నీ
కనురెప్పల మీదమీదకి సవారీకొస్తాయి
నీలంగా మారుతోన్న చందమామను
కళ్ళార్పకుండా చూస్తాడు బుద్ధుడు
నా అరచేతుల్నిండా గాజుపెంకులు...

విలవిల్లాడుతూ లేస్తాను కానీ..

చుక్కలుచుక్కలుగా కారే రక్తం
ఎంత ఒత్తినా ఆగదు.
మరకలంటని పూలచెట్టుని
మళ్ళీ చూసేందుకు మొహం చెల్లదు.

వాన నిలిచిపోయినట్టేనా?


*
*తొలిప్రచురణ : 01-0-2017 ఆంధ్రజ్యోతి వివిధలో.

అవ్యయ – సౌభాగ్య కుమార మిశ్ర

మనకు మన దేశంలోని ఇతర రాష్ట్రాల కవుల కన్నా, ఇతర దేశాల్లో ఉన్న కవులే మెరుగ్గా తెలుసేమోనని చాలా సార్లు అనిపిస్తుంది. ఎక్కడో ఒక ఠాగూర్‌నీ సుబ్రహ్మణ్యభారతినీ కమలాదాస్ (మాధవి కుట్టి) లాంటి వారిని మినహాయిస్తే, ఇతర రాష్ట్రాల కవుల గురించి, వారి కవిత్వాన్ని గురించి, మనం విన్నదీ అక్కున చేర్చుకున్నదీ తక్కువ. మరీ ముఖ్యంగా, సమకాలీన కవిత్వానికి సంబంధించి, వైరముత్తు (A Drop in search of the Ocean, ఆంగ్లానువాదం: బాలన్ మీనన్), గుల్జార్ (Selected Poems, Neglected Poems, ఆంగ్లానువాదం: పవన్ కె. వర్మ), జావేద్ అఖ్తర్(In Other Words, ఆంగ్లానువాదం: అలీ హుసేన్) మొదలైనవారి కవిత్వాలు జనాల్లోకి వచ్చాయన్న మాటే కాని, అక్కడ కవిత్వాన్ని మించి లేదా కవిత్వంతో పాటుగా సినిమా మంత్రం పనిచేసిందనడం అతిశయోక్తి కాదు.
మంచి కవిత్వమంటే మనకు బాగా తెలిసిన ప్రపంచాన్నే కొత్తగా చూపించడమో, లేదా అసలెన్నడూ చూడని లోకానికి తలుపు తీయడమో చెయ్యాలని నేననుకుంటాను. ఇతర దేశాల కవులనూ వాళ్ళ కవిత్వాలనూ చదువుతున్నప్పుడు మనం చాలా సందర్భాల్లో మనకు తెలియని లోకాన్నే చూస్తాం. వాళ్ళ సిద్ధాంతాలు వేరు. సంస్కృతీసంప్రదాయాలు వేరు. ఆ లోకపు తత్వాలూ భావాలూ, వాళ్ళ ఋతువులూ రంగులూ, సమస్యలూ స్పందనలూ అన్నీ మన కవితాప్రకటనకు ఎంతోకొంత భిన్నంగానే ఉంటాయి. అదే మన దేశంలోని ఇతర భాషలను తీసుకుంటే, మన మధ్య ఇన్ని భేదాలు కనపడవు. కొసలను పట్టుకు చూస్తే దూరం తెలీదని కాదు కాని, స్థూలంగా ఆచారవ్యవహారాలు వేరైనా మనందరినీ కలిపే సూత్రమేదో ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలో, మనని ఆనుకుని ఉన్న రాష్ట్రపు కవిత్వాన్ని చదవబోవడమంటే, మన లోకాన్ని కొత్తగా కవి కళ్ళతో చూడటమే అవుతుంది. ఈ కుతూహలమే, ప్రముఖ ఒరియా కవి, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారగ్రహీత, ఆత్మనేపది(1965), మధ్యపదలోపి(1971), నఈపహారా(1973), అన్యతార, మణికర్ణిక మొదలైన కవితా సంపుటులెన్నింటినో వెలువరించిన సౌభాగ్య కుమార మిశ్ర కవితల నుండి 60 కవితలను ఎంపిక చేసుకుని వేలూరి వేంకటేశ్వర రావు, వెనిగళ్ళ బాలకృష్ణ రావులు అనువదించి (అనుసృజించి) ప్రచురించిన కవితల సంపుటి అవ్యయను చదివేందుకు నా తొట్టతొలి కారణం.
ఆ ఆసక్తికి, సౌభాగ్య కవిత్వంలో పాఠకులను గట్టిగా పట్టుకునే లక్షణాలు కొన్ని జత కలిశాయి. కుమార మిశ్ర కవితలు చదవడమంటే ఎక్కడో ఒకచోట నింపాదిగా కూర్చుని ఆలోచనలో పడటం కాదు. బొమ్మ వెనుక బొమ్మ, బొమ్మ వెనుక బొమ్మ, రెప్పపాటులో దృశ్యం మారిపోతూ ముగింపు దాకా శరవేగంతో సాగుతుంది కవిత నడక. కొట్టొచ్చినట్టు కనపడే ఈ వేగం, కవితలని త్వరత్వరగా చదవమని తొందర పెట్టినట్టుగా ఉంటుంది. ఓ కొత్త దారిలో ఎవరో చేయి పట్టుకు బరబర తీసుకుపోతుంటే, దృశ్యం మనఃఫలకంలో ముద్రించుకునే వ్యవధి కూడా లేక ముందుకు వెళ్ళిపోయినట్టే వాక్యం వెనుక వాక్యం చదువుకుంటూ కవిత పూర్తి చేసేస్తాము. గమ్యం చేరాక వచ్చిన దారిని మననం చేసుకున్నట్టు, కవిత చదవడం పూర్తయ్యి అనుభవం మనదయ్యాక, ప్రతి మాటనీ మళ్ళీ తరచి చూసేలా చేస్తుంది ఈ కవిత్వం. ఉదాహరణకి, ల్యాండ్‌స్కేప్ (పు: 121) కవిత చూడండి.
రెండో ఝాము ఎండ నదిమీద ఆవిరి, దూరపు కొండల్లో నిప్పు
నక్కల బొరియల మూతుల్లో గుప్పెడుగుప్పెడు రాళ్ళ ముక్కలు.
అక్కడ పల్లెలో కాబోలు రాతిరి నిశ్శబ్దం. ఒక్క చిన్నపిట్ట,
క్రొత్త గుడిసె కప్పు మీద పాకిన బీరతీగె
సగం తెరిచిన తలుపు ఇంటిలో రోలు రోకలి చప్పుడు
బార్లగా తెరిచిపడి ఉంది ఆలోచనలు లేని పిల్లమనసు,
గుమ్మడి పూలలో అటూఇటూ తిరుగుతూ సీతాకోకచిలుక
దారి ప్రక్కన క్రింద ఎండిపడి ఉంది బురదజీవితం
రెండవ ఝాము స్తబ్ధత. మేఘాలు లేని పసుపు రంగు ఆకాశం
ఇక్కడ నా చుట్టూ నది వణుకుతూ పోసిన ఇసుకగుట్టలు
అలసిన దేహం…
కవిత పూర్తిగా చదివితే, మొత్తం మూడు పాదాల్లో రెండవ ఝాము ఎండ నుండి రాతిరికీ, మళ్ళీ పగటి ఎండకీ కవి సునాయాసంగా చేసిన ప్రయాణం కనపడుతుంది. గమనించండి.
ఆ తరువాత చెప్పుకోవలసింది, సౌభాగ్య వాడిన ప్రతీకల గురించి. సౌభాగ్య కవిత్వం నేల విడిచి సాము చెయ్యదు. అతనిదంతా ఈ లోకపు కవిత్వం. అతను చూపించినదంతా ఇక్కడి సగటు మనిషి జీవితం. ప్రత్యేకించి, ప్రాంతీయతను పదిలపరుచుకున్న కవిత్వమితనిది. ఇతని ఊహలు, కవిత్వము కూడా ఒరియా వాతావరణాన్ని దాటి వెళ్ళవు. అందుకే, కల్పనలో చాతుర్యమే తప్ప అసంబద్ధత కాని, ఊహకు అందకపోవడమన్న ప్రశ్న గాని సాధారణంగా తలెత్తవు. అవి భారతీయ ఇతిహాసాల్లో నుండి, పురాణాల్లో నుండి వాడిన ప్రతీకలు కావచ్చు, పదే పదే ఉదహరించిన కాఠజోడి లాంటి నదుల ప్రస్తావన కావచ్చు, ‘గొడుగు పాతి కథ వినే మంగలి’ కావచ్చు, ‘అమ్మమ్మ కలలు’ కావచ్చు, సరివి తోటలో, కృష్ణచూడా పువ్వులో కావచ్చు. ఏం వాడినా కవి ఉద్దేశ్యం స్పష్టం. ఏవో పక్షులనో ఎక్కడివో వాగులనో ఏదో ఒక నది ఒడ్డునో వర్ణించడం అతని లక్ష్యం కాదు. పాఠకులు వాళ్ళకు పరిచయమైన వ్యక్తులను, వస్తువులను, ప్రదేశాలను ఇతని కవిత్వంలోకి చొప్పించి చూసుకోవడం కూడా కవికి ఇష్టం లేదు. అతను విస్పష్టంగా ఒరియా వాతావరణాన్నే చూపించదలచాడు. పదే పదే కొన్ని ప్రదేశాలను ప్రతీకలుగా వాడటం ద్వారా, వాటిని విన్నప్పుడు ప్రతిసారీ అదే విధమైన స్పందన పాఠకుల్లోనూ కలిగేలా ముద్ర వేయగలిగాడు. అలా చెయ్యడం ద్వారా వాటికొక అస్తిత్వాన్నీ ఏర్పరచాడు. ఉదాహరణకి, కృష్ణచూడా (పు:53) కవిత చూడండి.
నిజంగా ఎంత గర్వం? కృష్ణచూడాకి, అమ్మో! ఎంత ఉబ్బిపోతున్నదో!–ఇదీ కవిత ఎత్తుగడ. మొదటి వాక్యంలోనే సమాధానం లేని ప్రశ్న, ఆశ్చర్యార్థకం. ఇవి, మన ఊహలను తుదికంటా పొడిగిస్తాయి. అంటే, ఎంత గర్వం సాధ్యమని మనమనుకుంటామో, అంత గర్వమూ దానికి ఆపాదిస్తున్నాం. ఇప్పుడు, కవిత ముగింపు చూడండి.
స్త్రీ సమగ్ర అస్తిత్వాన్ని మరిచి నెరజాణడిలా ఇవాళ
ఎందుకు పదే పదే నిన్ను, నీ యవ్వనాన్నీ కోరుకుంటాను,
నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నువ్వూ ఒకేఒక కృష్ణచూడా లాంటి స్త్రీ అవు,
నీ చేతిలో అమ్ముడుపోతాను, ఇదే దేహం, ఇదే మనస్సు, ఇదే ప్రాణం!
ఎత్తుగడ, ముగింపుల్లో ఉన్న వైరుధ్యం చూస్తే ఈ కవితలో ప్రాణం ఎక్కడుందో తెలుస్తుంది. పైన చెప్పినట్టు, ‘ఏదో ఒక’ అనడం లేదిక్కడ కవి, ‘ఒకేఒక’ అంటున్నాడు. అదే ఈ కవితకు ఆయువుపట్టు. ఆ పూవు అతిశయాన్ని అసంబద్ధంగా కనపడే తన కోరికకు ముడిపెట్టి, మనఃప్రాణదేహాలను అమ్మకానికి పెట్టేందుకు సిద్ధపడ్డ అతని వ్యక్తిత్వాన్ని సమర్ధించుకోవడానికి వాడుకున్న పదమిది. సౌభాగ్య కుమార మిశ్ర ప్రతీకలకు ఒక అస్తిత్వాన్ని కల్పిస్తాడు అనడంలో నా ఉద్దేశ్యమిదే.
సౌభాగ్య కుమార మిశ్ర కవిత్వంలో నిరాశ ఉంది, కానీ అది క్షణక్షణం గతంలోకి తొంగిచూసుకుంటూ, గతంలోనే బ్రతకాలని వగచే బుద్ధి వల్ల వచ్చింది కాదు. ఆశ కూడా ఉంది, అదీ భవిష్యత్తుని సమూలంగా మార్చితే(నే) బ్రతుకు బాగుపడుతుందన్న ఆలోచనలో పుట్టింది కాదు. ఇతనిదంతా, ‘వర్తమానం’లో చలించిన కవిత్వం. అతనెంత సాంప్రదాయకమైన ప్రతీకలు తీసుకున్నా, చర్వితచర్వణంలా అనాదిగా కవితావస్తువులైన వాటినే మళ్ళీ గుప్పిట పట్టినా (సంధ్యాసమయం, అపరాహ్ణం, రాత్రులు, నదులు…), వాటిని పూర్వపు ఆలోచనలకు భిన్నంగా వాడటం ద్వారా, కొత్త అనుభూతిని సమర్థవంతంగా సృష్టించగలిగాడు (పూవును సహజంగా సున్నితత్వానికీ మెతక స్వభావానికీ ప్రతీకగా చూపెడతారు, కానీ, పై కవితలో దానిని అతిశయంతో నిండినదిగానూ తిరస్కరించే శక్తిని నిలుపుకున్నదానిగానూ చూపించాడు కవి); అలాగే, చెప్పిన పద్ధతేదైనా, అతను చూపించింది మాత్రం సమకాలీన ప్రపంచాన్ని. తనను తాను అధికుడిగా భావిస్తూ ఎత్తుల్లో నిలబడి, ప్రపంచాన్నీ ప్రజలనూ దూరం నుండి గమనిస్తూ రాసిన కవిత్వం కాదిది; తానూ అక్కడే, నట్టనడుమన నిలబడి తన అనుభవాన్నే కవిత్వంగా మార్చి రాసినది. అందుకే ఆ కవిత్వానికి సహజత్వం, తేలిగ్గా పాఠకులకు చేరడం లాంటి గుణాలు వచ్చాయి. మచ్చుకు బాలి జాత్ర (పు:97) కవిత చూడండి. బాలి జాత్ర కార్తీక పూర్ణిమతో మొదలై ఏడురోజులపాటు కటక్‌లో జరిగే సంత. ‘బెలూన్ పగిలినట్టు నవ్వినవ్వి దొర్లిపడ్డాం’, ‘పల్లీల తొక్కలు పారేసినట్టు మాటవెంటమాట విసిరిపారేశాము’-ఇలా, నేపథ్యానికి తగ్గట్టు మనని ఆ వాతావరణంలోకి తీసుకునిపోయి, ‘ఇంతకీ హోటల్ గదికి ఎంత బాకీ పడ్డాం?’ అని ఒక్కసారిగా అక్కడి నుండి బయటకు లాగుతాడు. ‘ఒకటో తారీఖు ఇంకెంత దూరం?’ అని ప్రశ్నించి, సంబరమంతా ముగిశాక మళ్ళీ ఎప్పటి దినచర్యలోకి రాక తప్పని అసహాయతనూ దిగులునూ చూపెట్టి, పాఠకులను అక్కడ వదిలేస్తాడు.
సౌభాగ్య కవితల్లో తెచ్చిపెట్టుకున్న సామాజికవాదం కనపడదు. (కనీసం ఈ సంపుటికి సంబంధించినంతవరకూ.) అతను చూపించగలిగిందే మాటల్లో పెట్టాడు. చలమో అచలమో, ప్రాణం ఉన్న ప్రపంచాన్నే మనకీ చూపెట్టాడు. అలాగే, పాశ్చాత్య కవితా విప్లవాలు భారతీయ కవిత్వాన్ని శాసిస్తున్న రోజుల్లో (తొలి సంపుటి ఆత్మనేపది 1965లో ప్రచురితం.) కవిత్వం రాసినా, సౌభాగ్య కవిత్వం ఆ ప్రభావానికి లోనై భాషను శ్రద్ధగా చెక్కి నగిషీలు పెట్టుకున్నట్టు కనపడదు. క్లుప్తత కోసం అనవసర ప్రయాస ఎక్కడా కనపడదు. వస్తువును బట్టి, పాదాల సంఖ్యతో నిమిత్తం లేకుండా కవితను యథేచ్ఛగా పొడిగించుకుని, కవిత అందజేయాల్సిన అనుభూతి మీదే దృష్టినుంచినట్టు, స్పష్టంగానే తెలుస్తుంది. ఉదాహరణకు, ఈ కవిత చూడండి. అపరాహ్ణము (పు: 27) అన్న పదం వినగానే తట్టే సోమరితనం, సేదతీరాలనిపించే గుణం, అన్నింటికీ మించి ఆ నింపాదితనం-వీటిని కవిత్వంగా మలచడం ఊహించినంత సులువైతే కాదు. సౌభాగ్య కవిత్వం ఆ కష్టం కనపడనీయదు.

అపరాహ్ణంలో నిజంగా అనిపిస్తుంది, అంతా ఏదో ఖాళీ ఖాళీ అని,
చెట్ల మీద ఎలాంటి పక్షులూ లేవు, బజారులో కొనటం అమ్మకంలాంటి బేరాల్లేవు
ప్రియురాలి నుంచి ఫిర్యాదులూ లేవు, నేను ఎవరితో గడపాలి
ఈ తీయనివేళ?…
కవితల ఎంపికలో అనువాదకుల అభిరుచి సుస్పష్టంగా కనపడింది. సౌభాగ్య విస్తృతంగా వ్రాయడం, అనువాదకులు ఏ ఒక్క సంపుటినో అనువదించాలనుకోకుండా – ఆత్మనేపది, మధ్యపదలోపి, నఈపహారా సంపుటుల నుండి(వరుసగా ముప్పైఏడు, పంతొమ్మిది, నాలుగు) కవితలు తీసుకోవడం, పాఠకులుగా మనకు లాభించిన విషయం. అపురూపమైన ప్రతీకలకు అంతే అందమైన తెలుగు పదాలను వాడడం ద్వారా మూలంలోని సౌందర్యాన్ని వీలైనంతగా తెలుగులోనూ ప్రతిఫలింపజేశారు. ఐతే, ముందుమాటలో అనువాదకులు ‘ఇవి అనువాదాలు కాదు’ అని చెప్పినా, ఇవి అనువాదాలేనన్న స్పృహ పాఠకులను చాలా చోట్ల విడిచిపెట్టలేదు. ఎలానూ అనుసృజన అన్నారు కాబట్టి కొన్ని కవితల్లో వాక్యాన్ని మరికాస్త మార్చి రాసే స్వాతంత్య్రం తీసుకుని ఉంటే, కవితలు మరింత రాణించేవని అనిపించింది. ఇలా అనడానికి రెండు కారణాలు: ఒకటి, కవిత్వాన్ని పక్కన పెట్టినా పాఠకుడు వాక్యాన్ని కేవలం వాక్యంగా చదివేందుకు శ్రమపడకూడదు. రెండు, అవకాశం, అవసరం ఉన్న సందర్భాల్లో కవిత్వం నేరుగా, స్పష్టంగా పాఠకులకు చేరాలి. ఉదాహరణలిస్తాను.
ఎండ అంతా చక్కబెడుతుంది దుకాణదారుడి దురవస్థ/ నిర్దయ ఆకాశం ఆశాభంగం./ నీలిరుమాలు మీద ఒక కణం కాటుక మరక/ మబ్బు, వాన, చిక్కటి కాన (రోడ్డు, పు:119)
వసంత దుర్ఘటన తరువాత,/ ఇక్కడ అవమానం, అక్కడ అస్వస్థత-హంసభాషలో/ నేను విన్నాను నేనెరిగిన భూమి కంఠధ్వని (మూడు నెలల తరువాత, పు:107)
ఇవాళ గనుక నగరంలో టెలిగ్రాఫ్ తీగలన్నీ తెగిపోతే,/ ప్రియురాలి ముఖం నీరసంగా కనపడుతుంది, మాటలు అన్నీ/ గాలిలో ఎగిరిపోవు, అయితే ఇది ఏ విధమైన దుఃఖానికీ/ గురుతు కాదని నేను అంటాను (ఇవాళ గనుక, పు:35)
స్పష్టంగా, ఇవన్నీ పాఠకులకు త్వరగా చేరేవి కావు. అలా చేరకపోవడం కవితల్లోని లోతు వల్ల అని కూడా నేను భావించడం లేదు. వసంత దుర్ఘటన ఏ ప్రకృతి వైపరీత్యమో అయి ఉండాలి. బహుశా భూకంపం. అలాగే, మూడవ ఉదాహరణలో, మూలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, మాటలన్నీ గాలిలో ఎగిరిపోతాయి అని ఉండాలి. కవిత్వ వ్యాకరణం వేరని ఒప్పుకుంటూనే, వాక్యాల్లో ‘ఇది అనువాద’మని పట్టిచ్చే ఛాయలేమీ లేకపోతే మరింత బాగుండేదని చెప్పక తప్పదు. అంటే, అనుసృజన లోని వాక్యం తెలుగు నుడికారానికి మరికొంత దగ్గరగా ఉండి, భాష ఆసాంతమూ ఒకే ఒరవడిలో సాగి ఉంటే, పాఠకులకు ఆ ఇబ్బంది తెలిసేది కాదేమో. (ఉదా: నీ ఖాళీ ఇల్లు కవిత మొదటి పాదాలకు, చివరి పాదాలకూ భాషలో, కవి గొంతులో వచ్చిన తేడా పరిశీలించండి.)
సౌభాగ్య కుమార మిశ్ర కవితల్లో సింహభాగం అందరూ పొదువుకోగలిగిన సరళతతోనే ఉన్నా ఆ కవిత్వంలో మార్మికత లేకపోలేదు. ఆ లక్షణం తొంగి చూసినప్పుడల్లా అనువాదంలో స్పష్టత లోపించింది. అప్పటిదాకా సరళంగా, హాయిగా, అనిపించిన కవిత్వం, సంక్లిష్టంగా తోచింది. ఉదాహరణకి, నీ ఖాళీ ఇల్లు కవితనే మళ్ళీ చూడండి. మూలంలోని భావాన్ని పట్టుకోవడానికి అవసరమైన అతిముఖ్యమైన లంకె ఏదో తెగిపోయిందనే తోస్తుంది. అన్వయానికీ ఇందులో కవితాత్మకత ఏమై ఉంటుందన్న ఊహకూ తేలిగ్గా లొంగని కవితల్లో ఇది ఒకటి. ఆ అస్పష్టతను పక్కకు నెట్టగలిగే శక్తినిచ్చింది మాత్రం, అద్భుతమైన భావాలే!
కాఠ్‌జోడి నది ఒడ్డున కూచొని ఊహించుకుంటాను, నీ
కంఠస్వరం ఎగురుతూ వస్తుందని; దాని దారంతో గుచ్చబడి తారలన్నీ
అన్నది మనకందిన అనువాదం. ఇక్కడ దాని దారంతో అంటే, కంఠస్వరాన్ని దారంగా చెబుతున్నాడనే అనుకోవాలి. దీనిని బట్టి, మూలాన్ని ఊహించే ప్రయత్నం చేస్తే నాకు తోచిన భావం ఇది: కవి కాఠ్‌జోడి నది ఒడ్డున కూర్చుని ఎవరిదో గొంతు ఊహించుకుంటున్నాడు. తారలు పొదిగిన దారంలా, ఆ గొంతు గాలిలో ఎగురుతూ వస్తున్నట్టుగా ఊహించుకుంటున్నాడు. దూరం నుండి మన కోసం ఎవరైనా గొంతు విప్పి పిలిచారనుకుంటే, మనమధ్యనున్న దూరానికీ, గాలిరొదకీ, ఆ మాటలన్నీ మనకు స్పష్టంగా వినపడవు. అక్కడొక మాటా, ఇక్కడొక మాట ముక్కలు ముక్కలుగా వినపడుతుంది. వినపడ్డ ముక్కలను తారలతో పోలుస్తున్నాడు. అలా తారల్లా తళుక్కుమన్న మాటలని మోసుకొస్తున్న దారంగా, ఆమె గొంతును ఊహిస్తున్నాడు. కవి భావం స్పష్టంగా ఇదేనా కాదా? మనకు తెలియదు. గమనిస్తే, మార్మికవాదం ప్రకటితమైన కవితలే ఈ పుస్తకంలో పాఠకులను ఇబ్బంది పెడతాయి. (అదేసమయంలో, ఈ ప్రశ్న పక్కనపెట్టి ఇలాంటివి చూసినప్పుడే నమ్మకంగా అనిపిస్తుంది అనువాదం అంటూ ఏమీ ఉండదు, ఉండేదంతా అనుసృజనే అని.)
ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులను పక్కనబెడితే, అవ్యయ పొరుగువారి కవిత్వం పట్ల మనకున్న దాహాన్ని చాలావరకూ శాంతింపజేసిన నీటికుండ. దీనికి ముఖ్యమైన కారణం, అనువాదకులు జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న కవితలేనని నా అభిప్రాయం. మిశ్ర ఫలానా కోవకు, ఫలానా వాదానికి చెందిన కవి అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు కానీ (నిజానికి ఈ కవితలు మూడు కవితా సంపుటాల నుండి ఎంపిక చేసుకోబడ్డ 60 కవితలు మాత్రమే కనుక, మనమా మాట అనలేం కూడా!) ఈ పుస్తకంలోని కవితలన్నీ అనుభూతి ప్రధానమైనవి. సౌభాగ్య ఏ అనుభూతినీ మామూలు మాటలతో పాఠకులకు చేరవేయాలనుకోడు. ఎన్ని ప్రతీకలు వాడైనా సరే, తన అనుభూతిలోని గాఢతని పాఠకులకు చేరవేసే తీరుతాడు. విరహం (పు:137) కవిత చూడండి. ఆ విరహాన్ని చెప్పడానికి ఎన్ని ప్రతీకలు వాడాడో చూడండి: కంటిమబ్బు కింద వణుకుతూ శ్రావణమాసపు పిలుపు, నిద్రను దొంగిలించిన చందమామ, నీ ప్రేమలా ఆరిపోయిన నా కళ్ళ వెలుగు, మూసుకున్న కళ్ళలో చిరుచేపలా నీ జ్ఞాపకం,… ఒక్కో ప్రతీక మనను కవి అనుభూతికి ఒక్కో అడుగు దగ్గరగా తీసుకు పోతుంది. ‘ఇవాళ నువు ఎంత దూరం?’ అన్న ప్రశ్నతో, కవితో పాఠకుడు మమేకం కాగలిగిన వలయం పూర్తవుతుంది. ఈ ప్రతీకలే సౌభాగ్య కవిత్వానికి అసలైన బలం. ఒక సంఘటనో, అనుభవమో ఇలా ప్రతీకలతో వర్ణించినప్పుడు, అది పాఠకులకు అర్థం కాకపోయే అవకాశాలు తక్కువ. కాబట్టి, ఈ పుస్తకంలో ఎక్కువ భాగం ఇవే ఉన్నాయంటే, ఇది కవితల ఎంపికలో అనువాదకుల శ్రద్ధను, అనువాదంలో ఉండే పరిమితుల పట్ల వాళ్ళకున్న అవగాహననూ చూపెడుతోంది.

ఒకే భాషకు చెందిన కవిత్వాన్ని మనం చదువుతున్నప్పుడు, వ్యక్తీకరణలో తేడాలు మినహాయిస్తే, కొంతకాలానికి మనకు ఆ కవితావస్తువులు, వాతావరణం, కవిత సాగే తీరు అన్నీ అలవాటైపోతాయి. పోనుపోనూ కవిత్వం చదువుతున్నప్పుడు అప్పటికప్పుడు బాగుందని అనుకోవచ్చు గానీ, నిజంగా మనని బలంగా తాకి, వెన్నాడే కవితలు వేళ్ళ మీద లెక్కపెట్టేటన్ని మాత్రమే ఉంటాయి. అలాంటప్పుడే ఒక కొత్త పూవు, ఒక కొత్త ఊరు, ఒక నది ఒడ్డు-మునుపెన్నడూ మనం విననివీ, చూడనివీ-గొప్ప ఉపశాంతినిస్తాయి. స్తబ్ధమైన వాతావరణాన్ని చెదరగొడతాయి. అవ్యయ ఆ పని చేసింది.

గులకరాళ్ళు

చెరువులోని చేపలన్నీ పట్టి
ఆకాశం వైపుకు వల విసిరినట్టు
పక్షుల గుంపులు.
నా గుండె ఎక్కడ చిక్కుకుందో-
వెనక్కిలాగే లోపే వల పైపైకిపోయింది
*
ఒకే చెట్టుకు పూసిన పూలు
ఒకదానికి తెలీకుండా ఒకటి
ఒంగి ఒంగి కొలనులోకి చూసుకుంటున్నాయి
రాకుమారుడెటు నుండి వస్తాడో
రహస్యం చెప్పడం కోసం
నీళ్ళన్నీ ఒడ్డును వెదుక్కుంటూ వచ్చాయి
*
నల్లటి బాతులు రెండు,
నా కళ్ళను తోడు పిలుచుకుని
జంటగా ఈదుకుంటూ పోతున్నాయి
నీడ ఒక్కటే, నీటి మీద వదిలిన
దారి ఒక్కటే.
ఒక్కటే ఎందుకు మునిగిందో మరి,
కాసేపు ఊపిరాడలేదు
*
పక్షులు రొదపెడుతున్నాయి
పేరు తెలియని పూల పరిమళం
గుబురు చెట్ల వెనుక నుండి మత్తుగా పాకుతోంది
నిద్రకు ముందు నగలన్నీ తీసేసిన యువతిలా
సాయంకాలపు తళుకులు తుడుచుకున్న కొలను
నల్లగా మెరుస్తోంది
చందమామ తోసుకుంటూ ఎందుకొస్తాడో
లోకం ఒక ముద్దు కూడా దొంగిలించకుండానే
చీకటి కౌగిట్లో!
*తొలిప్రచురణ - ఈమాట ఫిబ్రవరి,2017 సంచికలో

ఈ క్షణం..

దారి తప్పాను
ఈ అడవి మధ్యన
సెలయేటి ఒడ్డున
వెదురు ఇల్లు నాకోసం
దాచి ఉంచారెవరో!
ఖాళీ కుర్చీలు, ఖాళీ అయిన పాత్రలు
కొన్ని ధూళికణాలతో గోడ మీది బొమ్మలు
ఏనాడో మరచిన ప్రియగీతిని వినిపిస్తూ
వాకిట్లో ఊగే గాలిగంటలు, వాటితో పాటే,
దడి దగ్గరే దోగాడుతూ
ఎవరూ కోయని పూవులు
సెలయేటి గాలులు, అవి తాకినపుడల్లా
రాతిరి చలిమంటలో నుండి
ఇంకా చల్లారక రేగుతోన్న నిప్పురవ్వలు
అడవిలో ఏ వైపునో నక్కి, ఆగీ ఆగీ
ఆత్రంగా పిలుస్తోన్న అడవి పక్షులు
సమయమెంతైందో తెలీదు.
 సర్రున పరదా లాగినట్టు,
లోకమంతా స్వర్ణకాంతులు
నిన్న ఇక్కడెవరున్నారో,
రేపింకెవరు రానున్నారో,
ష్ష్...
ఏమీ చెప్పద్దు
ఈ స్వర్గం
ఈ క్షణం
నాది!

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...